అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు.. ఎందుకంటే?
posted on Nov 21, 2025 11:36AM

నగరంలోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలైన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ ఈ శుక్రవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపుతూ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో , అలాగే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కు చెందిన రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుల్లో ఈ రెండు స్టూడియోలూ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ తక్కువగా చెల్లిస్తున్నట్లే పేర్కొంది. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు.. తమ వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ.. భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.
అన్నపూర్ణ స్టూడియో 1,92,000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తోందనీ, దీని ప్రకారం రూ.11, 52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, 8,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లుగా చూపించి కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రామానాయుడు స్టూడియో 68 వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ, కేవలం 19 వందల చదరపు అడుగుల విస్తీర్ణం అని మాత్రమే చూపుతూ. రూ.7,600 మాత్రమే టాక్స్ చెల్లిస్తోందని పేర్కొన్న అధికారులు ఆ మేరకు బకాయిపడ్డ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ రెండు స్టూడియోలనూ నోటీసులు జారీ చేశారు.