బీసీసీఐ అంటే.. బీజేపీ కంట్రోల్డ్ క్రికెట్ ఇన్ ఇండియా అనాలా?
posted on Oct 9, 2025 1:24PM

బీసీసీఐ అంటే మామూలుగా బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. కానీ ఇప్పుడు బీసీసీఐని బీజేపీ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా అని పిలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రాల క్రికెట్ సంఘాలన్నీ బీజేపీ అగ్రనేతలు, కీలక నేతల పుత్రరత్నాల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఒక సారి ఆ వివరాలేంటని పరిశీలిస్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుత్రరత్నం జై షా ఐసీసీ చైర్మన్ గా ఉన్నారు? ఇక డిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ. అంతే కాదు.. మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే ఆయన కూడా బీజేపీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కుమారరత్నం మహార్యమాన్ సింధియా.
ఈ జాబితా ఇక్కడితో ఆగలేదు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే.. బీజేపీ నాయకుడు రాకేష్ తివారీ కుమారుడు హర్షవర్ధన్ తివారీ. ఈయన అతి పిన్న వయస్సులోనే..అంటే 24 ఏళ్లకే బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. ఇది బీసీఏ చరిత్రలోనే ఓ రికార్డ్. అలాగే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనంజయ్ సింగ్ రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన గజేంద్ర సింగ్ తనయుడు. రాజవంశీయుడు. ఈయన కూడా బీజేపీ లీడరే.
గత మూడు పర్యాయాలుగా బీజేపీ కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో.. క్రికెట్ లోనూ వంశపారంపర్య ఆధిపత్యం అమలవుతూ వస్తోంది. అందుకే బీసీసీఐని బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అని అనడం కన్నా బీజేపీ కంట్రోల్డ్ క్రికెట్ అసోసియేషన్ గానే పరిగణించాల్సి ఉంటుంది. అంతగా బీసీసీఐని బీజేపీ నేతలు, వారి కుమారులు ఆక్రమించేశారంటున్నారు పరిశీలకులు