పెళ్లి వేడుకలోనూ పార్టీ రంగు పట్ల నిబద్ధత చూపించిన మంత్రి నిమ్మల
posted on Sep 24, 2025 8:01PM

మాములుగా పెళ్లిళ్లలో వధూవరుల బంధువులు, అతిథులు పట్టువస్త్రాలు, ఖరీదైన దుస్తులతో మెరిసిపోతారు. కానీ ఆ రీతిని మించి ప్రత్యేకత చూపించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. తన కుమార్తె వివాహ వేడుకలోనూ ఆయన తన ట్రేడ్మార్క్ పసుపు రంగు చొక్కాతోనే హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీపై తనకున్న అచంచల విశ్వాసం, విధేయతను మరోసారి చాటుకున్న ఆయన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం మంత్రి రామానాయుడు కుమార్తె శ్రీజ పెళ్లి సాయి పవన్ కుమార్తో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందరూ పట్టువస్త్రాల్లో మెరిసిపోతుండగా, రామానాయుడు మాత్రం పసుపు చొక్కాతోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రభుత్వ కార్యక్రమమా, కుటుంబ వేడుకనా అన్న తేడా లేకుండా ఆయన ఎప్పుడూ పసుపు చొక్కానే ధరిస్తారని అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జరిగిన నిశ్చితార్థ వేడుకలోనూ ఇలాగే కనిపించడంతో నారా లోకేశ్ సరదాగా "పెళ్లికొడుకులా తయారవుతారని అనుకుంటే, మళ్లీ పసుపు చొక్కాతోనే వచ్చేశావేంటి" అని ఆటపట్టించగా, "పసుపు శుభసూచకం సార్" అని ఆయన ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.
పాలకొల్లు నుంచి వరుసగా మూడుసార్లు శాసన సభ్యుడుగా గెలిచి, 2019 వైసీపీ జోరు మధ్యలోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన రామానాయుడు, పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన విశ్వసనీయతను గుర్తించిన చంద్రబాబు, ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. ఇక ఇప్పుడు కుమార్తె పెళ్లిలో కూడా పార్టీ రంగును వీడకపోవడం, ఆయన విధేయతకు నిదర్శనంగా తెలుగు తమ్ముళ్లను ఆకట్టుకుంటోంది.