అదరగొట్టిన సెహ్వాగ్, పుజారా దూకుడు
posted on Nov 15, 2012 5:22PM
అహ్మదాబాద్లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 323 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా, ఓపెనర్లు సెహ్వాగ్, గౌతంగంభీర్ శుభారంభం చేశారు. మొదటి వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గంభీర్ 45 పరుగులు సాధించగా, సెహ్వాగ్ దూకుడుగా ఆడి ఒక సిక్స్, 15 ఫోర్లతో 90 బంతుల్లో సెంచరీ చేశాడు. 117 పరుగుల వద్ద స్వాన్ బౌలింగ్ లో సెహ్వాగ్ అవుటైయ్యాడు.
రంజీ మ్యాచ్ లో సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన సచిన్ ఇంగ్లాండ్ పై నిరాశపరిచాడు. 18 బంతులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 13 పరుగులకే అవుటయ్యాడు. పూజారా మాత్రం తన సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 181 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ దిశగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం పూజారా (98) యువరాజ్ సింగ్ (24) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రేమ్ స్వాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.