యువతకు త్వరలో 9 లక్షల ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు

 

దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా సామాజిక పింఛన్ల అందిస్తున్నాదని సీఎం చంద్రబాబు అన్నారు.  విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదికలో గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో కేవలం రూ.500 మాత్రమే పింఛను ఇస్తున్నారని, కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం నాలుగు వేలు పింఛన్ల  అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 13 మందికి పింఛను అందుతోందని, అందులో 59 శాతం మహిళలేనని వివరించారు.

కూటమి ప్రభుత్వం ప్రకటించిన "సూపర్ సిక్స్" పథకాలను సూపర్ హిట్ చేశామని, అన్ని హామీలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళల కష్టాలు తీర్చేందుకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. "స్త్రీ శక్తి" పథకం కింద ఆగస్టు 15న ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కేవలం 45 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చిందే టీడీపీ ప్రభుత్వమని సీఎం గుర్తుచేశారు.

అన్నదాత ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.6,000 జమ చేశామని, త్వరలోనే మరో రూ.14,000 అందిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని చెబుతూ, ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించామన్నారు. 

ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.  ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. ఆహారపు అలవాటలు మారాలని సీఎం తెలిపారు. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. తగినంత సాగునీరు లేదు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu