అధికారులకు అదిరిపోతోంది

రాజావారు ఆదేశిస్తారు.. అధికారులు అమలు చేస్తారు. సాధారణంగా ఎక్కడైనా జరిగే పద్ధతి ఇదే. దేశాన్నో, రాష్ట్రాన్నో పరిపాలించేవారు తమకు తోచిన హామీలను ప్రజలకు ఇస్తూ వుంటారు. వాటిని అమలు చేసే బాధ్యతను మాత్రం అధికారుల నెత్తిన పెడతారు. ఏలినవారు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, దానికి అవసరమైన డబ్బు తీసుకురావడానికి అధికారులు తంటాలు పడుతూ వుంటారు. సర్కారు వారి హామీలను అధికారులు అమల్లోకి తేలేకపోతే ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, ప్రజా ప్రతినిధో సదరు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నలుగురిలో పట్టుకుని దులిపేస్తారు. వార్నింగులూ, సస్పెన్షన్లూ, ట్రాన్స్‌ఫర్లూ మామూలే. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక వివిధ శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షాత్తూ సీఎం పంపిన ఫైళ్ళను కూడా పెండింగ్‌లో పెట్టేశారు. చివరికి సీఎం చేత చీవాట్లు తింటున్నారు.   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దాన కర్ణుడు. హామీలు ఇవ్వడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర ఏళ్ళలో వందలకొద్దీ వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు కూడా అలా ఇలా వుండవు... వినేవాళ్ళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా వుంటాయి. అయితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఎన్ని అమలయ్యాయనేది మాత్రం అడక్కండి. కేసీఆర్ సారు రీసెంట్‌గా గిరిజనుల కోసం ధారాళంగా వాగ్దానాలు చేసేశారు. గిరిజనుల కరెంటు బకాయిల మాఫీ, విద్యుత్ కేసులు రద్దు, 125 రూపాయలకే ఇంటింటికీ విద్యుత్ కనెక్షన్, 60 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీ మినహాయింపు.... ఇలా గిరిజనుల కోసం వరాలు ప్రకటించారు. ఇలాగే వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా వరాలు ఇచ్చేశారు. ఇంకా ఇలాంటి బోలెడన్ని వరాలు కేసీఆర్ ప్రకటించేసి వాటి అమలు బాధ్యతను మాత్రం అధికారుల భుజాల మీద పెట్టారు.   ఇప్పటికే ఏలినవారి వరాలను ఎలా నెరవేర్చాలా అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతున్న అధికారులు ఎప్పటికప్పుడు తమీద వచ్చి పడుతున్న వరాల భారాన్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంచేత సీఎం ఇచ్చిన అనేక వరాలు అమల్లోకి రాలేదు. సదరు వరాల ఫైళ్ళు పెండింగ్‌లో పడిపోయాయి. దాంతో సీఎం గారికి కోపం వచ్చేసింది. దేవుడు వరమిచ్చినా పూజారి పడనివ్వలేదన్నట్టుగా తాను వరాలు ఇచ్చినా అధికారులు వాటిని అమల్లోకి తేవడం లేదని ఫైరైపోయారు. చీఫ్ సెక్రటరీని పిలిచి క్లాస్ ఇచ్చారు. దాంతో బుర్ర వేడెక్కిపోయిన చీఫ్ సెక్రటరీ తన ఆగ్రహాన్ని వివిధ శాఖల సెక్రటరీల మీద వ్యక్తం చేశారు. సీఎం గారు ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చకపోతే ఎలాగంటూ వివిధ శాఖల సెక్రటరీలకు లేఖలు రాశారు. అర్జెంటుగా సదరు ఫైళ్ళని క్లియర్ చేసేయాలని హెచ్చరించేశారు. దాంతో సీఎం గారి హామీలను అమలు చేయడం ఎలారా భగవంతుడా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అయ్యో లాలూ.. నీకే ఎందుకిలా..?

  భారతదేశంలో న్యాయం.. డబ్బు, పరపతి ఉన్న వాడికి ఒకలా.. పేదవాడికి ఒకలా దొరుకుతాయని తరతరాలుగా వస్తోన్న నానుడి. దీనికి నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఉదాహరణలు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ సొంతడబ్బులా దేశం దాటించిన బడాబాబులపై కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు.. ఎన్నో వాదనలు. కానీ వాటిలో ఏ ఒక్క దానిలోనూ నిందితులకు శిక్ష పడిన దాఖలాలు చాలా తక్కువ.. అప్పటికే సంవత్సరాల తరబడి వాయిదాలు, కౌంటర్లు, రీకౌంటర్లతో పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. మరోవైపు అయా కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ధనవంతులో..సెలబ్రెటీలో.. రాజకీయ వ్యవస్థ అండదండలో ఉన్నవారైతే సులభంగా కేసుల నుంచి గట్టెక్కెస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ టైంలో వన్యప్రాణులను వేటాడటం, తప్పతాగి రోడ్డు మీద నిద్రిస్తున్న వారి ప్రాణాలు తీసిన కేసులో నిందితుడిగా ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎంత హాయిగా సినిమాలు తీసుకుంటూ.. కోట్లు సంపాదిస్తున్నాడో తెలిసిందే..   అంతెందుకు దేశంలో ప్రకంపనలు సష్టించి.. నాటి యూపీఏ ప్రభుత్వం పతనానికి నాంది పలికిన సంఘటనగా చెప్పుకునే 2జీ స్పెక్టం కుంభకోణంపై.. రెండు రోజుల క్రితం వచ్చిన తీర్పు పై సమాధానం తెలిసినా సవాలక్ష ప్రశ్నలు సంధిస్తోంది దేశం. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో రూ.1.76 లక్షల కోట్ల విలువైన అవకతవకలు జరిగాయంటూ సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీల దర్యాప్తులోనూ ఎన్నో అక్రమాలు బయటకు వచ్చాయి. కేసు ఇంత బలంగా ఉన్నప్పటికీ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కోన్న 17 మంది నిర్దోషులుగా బయటకు వచ్చారు. దీనిని దేశం ఇంకా మరచిపోకముందే ఇవాళ మరో కీలక తీర్పు వెలువడనుందని మీడియాలో హడావిడి కనిపించింది.   1990-97 మధ్యకాలంలో బీహర్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. దాణా కోనుగోళ్లలో 900 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 25 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరిస్తున్నట్లు ప్రకటించింది. ఇది చూసిన దేశప్రజలు.. హా.. ఏముంది లాలూ కూడా అందరిలాగే బయటపడతారులే అన్నట్లు తమ పనుల్లో తాము మునిగిపోయారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా లాలూతో పాటు మరో 15 మందిని దోషులుగా ప్రకటిస్తూ రాంచీలోని  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అయితే తనకంటే పెద్ద పెద్ద స్కాములు చేసిన వారు నిర్దోషులుగా బయట తిరుగుతుంటే.. తనకు మాత్రమే ఇలా ఎందుకు జరిగిందోనని లాలూ తలపట్టుకున్నాడట. అయితే అసలు నిజం ఏంటో లాలూ అంతరాత్మకు.. భారతీయులందరికీ తెలుసంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జగన్‌కి పండగే పండగ

  ఇంత గొప్ప రాజకీయ వ్యవస్థ వున్న దేశంలో పుట్టినందుకు మనం ఎగిరి గంతేయాలి. మనల్ని మనం అభినందించుకుంటూ ఇతర దేశాలని ఎటకారంగా చూడాలి. మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే ఈ పుణ్యభూమిలోనే పుట్టాలని కోరుకోవాలి. నీకు మరో జన్మ లేదు... హ్యాపీగా స్వర్గంలోనే ఎంజాయ్ చేయ్ అని దేవుడు చెప్పినా, ఆయన్ని ఎదిరించి మరీ మళ్ళీ ఈ దేశంలోనే పుట్టాలి. 2 జీ స్కామ్‌లో లక్షల కోట్లు మింగినవాళ్ళందరూ నిర్దోషులు అని తీర్పు వచ్చేసింది. న్యాయం, ధర్మం ఇలా ఎనిమిది కాళ్ళమీద అష్టావక్రంగా నడుస్తున్న ఈ దేశంలో మళ్ళీ మళ్ళీ పుట్టాలని, చస్తూ బతికి, చచ్చాక మళ్ళీ పుట్టాలని కోరుకోవడం సగటు భారతీయులుగా మన కర్తవ్యం. 2 జీ స్కామ్‌ని ఇంత విజయవంతంగా క్లోజ్ చేసిన మోదీ సర్కారుకి జేజేలు పలకడం మనందరి కనీస బాధ్యత. నిన్న మొన్నటి వరకూ 2జీ స్కామ్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అతి పెద్ద ఘోరం, నేరం అని మొత్తుకుని ఓట్లు సంపాదించిన బీజేపీ అండ్ మోదీ ఇప్పుడు సదరు స్కామ్ నిందితులందర్నీ సగౌరవంగా బయటకి పంపించడం ఎంతో అభినందించాల్సిన విషయం. అదేంటి... 2జీ స్కామ్‌ దోషులని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు కదా.. మధ్యలో బీజేపీకి, మోదీకి ఏంటీ సంబంధం అనుకుంటున్నారా? మీరు నిజంగా అలా అనుకుంటూ వుంటే ఈ వీడియో ఇక్కడే క్లోజ్ చేసేయండి. ఏ గాసిప్స్ వీడియోలో చూసుకుంటూ సగటు భారతీయుడిలా ఎంజాయ్ చేయండి. మీ రాజకీయ పరిజ్ఞానానికో నమస్కారం.   మళ్ళీ పాయింట్లోకి వెళ్దాం. తమిళనాడులో శశికళని జైల్లో వేయించిన మోదీ అన్నాడీఎంకేని దువ్వే ప్రయత్నం చేశాడు. వాళ్ళు తమ బుట్టలో పడకపోయేసరికి డీఎంకే మీద కన్నేశాడు. వందేళ్ళకు అటూ ఇటుగా వుండి... వయసు మీదపడటం వల్ల సహజంగా వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి మీద మోదీ సాబ్‌కి కరుణ పొంగుకొచ్చింది. చెన్నై వెళ్ళి మరీ ఆయన్ని పరామర్శించేశారు. అప్పుడే 2జీ స్కామ్ విషయంలో ఏదో జరగబోతోందని రాజకీయ పరిశీకులందరికీ డౌటొచ్చేసింది. ఇప్పుడాడౌటు కర్టక్టేనని క్లారిటీ వచ్చింది. 2జీ స్కామ్ అటక ఎక్కిన దరిమిలా ఒక హిందుత్వ పార్టీ, హిందుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ మధ్య స్నేహం భవిష్యత్తులో ఏరకంగా వుంటుందో మనం చూసి తరించే అవకాశం వుంది.   ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనేది నెగటివ్ సామెత... 2జీ స్కామ్‌ వచ్చిన తీర్పు చూసి జగన్ పండగ చేసుకుంటున్నాడనేది లేటెస్ట్ పొలిటికల్ సామెత. నిన్నటి వరకూ తన అవినీతి, అక్రమాల కేసుల పుణ్యమా అని ఎప్పుడు జైల్లో పడాల్సి వస్తుందా అని బిక్కుబిక్కుమంటూ వున్న జగన్‌కి 2జీ స్కామ్ తీర్పు నెత్తిన పాలు పోసింది. మోదీ వున్నాడు నువ్వేం భయపడకోయ్ జగన్ అని ధైర్యం చెప్పింది. అందుకే అలా తీర్పు వచ్చిందో లేదో ఇలా జగన్ ముఖం వెలిగిపోవడం ప్రారంభమైంది. మనిషి ముఖంలో అంతకు ముందు లేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మాటల్లో దూకుడుతనం పెరిగింది. తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి కుర్చీ వాస్తవరూపం దాల్చబోతోందన్న నమ్మకం కనిపించింది. 2జీ స్కామ్ దోషులు కావచ్చు... జగన్ లాంటి ఆర్థిక నేరగాళ్ళు కావచ్చు... ఇలాంటి వాళ్ళు తమ మీద వున్న కేసుల్లోంచి బయటపడితే గతంలో అయితే మనం బాగా ఆశ్చర్యపోయేవాళ్ళం. భవిష్యత్తులో అలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మనది భారతదేశం కదా!

రేపు జగన్‌కి ఇలాగే జరుగుతుందా..?

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో.. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. పాటియాలలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ తీర్పుతో దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపై మళ్లీ సరికొత్త వాదనలు తెరమీదకు వచ్చాయి. 2010లో అప్పటి కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా డీఎంకే నేత ఎ.రాజా వ్యవహరించారు. ఆ సమయంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆరోపించింది. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.   కాగ్ ఆరోపణలతో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాజాని పదవి నుంచి తప్పించింది. సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగి.. రాజా, కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పోరేట్ సంస్థల అధికారులపై ఛార్జ్‌షీట్ నమోదు చేశాయి. రాజాను అరెస్ట్ చేసినప్పటికీ.. ఏడాది తర్వాత బెయిల్‌ తెచ్చుకుని విడుదలయ్యారు. కానీ ఇన్ని రోజుల తర్వాత తుదితీర్పు వెలువడుతున్నట్లు మీడియాలో రావడంతో.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.. ఎందుకంటే వీరందరిని నేరం చేసినట్లుగా కాకుండా.. దేశ సంపదను దోచుకున్న వారిగానే జనం చూశారు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి.. కోర్టు కూడా కఠిన శిక్షలను ఖరారు చేస్తుందని అంతా అనుకున్నారు..   కానీ అనూహ్యంగా.. ఆశ్యర్యకరంగా.. మొత్తం 17 మంది నిర్దోషులే అని ప్రకటించడంతో దేశం ముక్కున వేలేసుకుంది. ఈ నాటకీయ పరిణామాలు భారత న్యాయవ్యవస్థకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నాయి. డబ్బు, పరపతి ఉన్నవారికి ఈ దేశంలో చట్టం తలవంచాల్సిందేనా.. వీరు చట్టాలకు అతీతులా అంటూ.. మేధావి వర్గంతో పాటు సోషల్ మీడియాలో యువత కూడా ఈ తీర్పుపై స్పందిస్తోంది. మరోవైపు ఈ తీర్పు వెనుక చాలా రాజకీయ కోణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. తమిళనాట పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో చూస్తోంది. కానీ అన్నాడీఎంకే, డీఎంకేల ప్రాంతీయ బలం ముందు కమలం ఆటలు సాగలేదు. కానీ జయ మరణంతో ఏఐఏడీఎంకే బలహీనం అయిపోయింది.. ఇక డీఎంకే ఒక్కటే. దానిని మేనేజ్ చేయలగలిగితే తమిళనాడులో లాంఛనంగా అడుగుపెట్టవచ్చని బీజేపీ పెద్దలు వ్యూహం రచించారు.   దీనిలో భాగంగానే అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని పరామర్శించారు ప్రధాని నరేంద్రమోడీ. ఆ తర్వాత కొద్దిరోజులకే 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో డీఎంకే నేతలు నిర్దోషులుగా విడుదలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకరితో ఒకరికి ఉన్న రాజకీయ అవసరాలు చట్టానికి అతీతమైనవా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలుస్తుంది అనుకుంటే జగన్‌ను చేరదీసి.. అవినీతి కేసుల నుంచి ఆయన్ను కూడా ఇలాగే బయట పడేస్తారా..? అంటున్నారు నిపుణులు. ఏమో రాజకీయం ఏమైనా చేయించగలదు. ఇలా జరిగితే చట్టం ముందు అందరు సమానులే అన్న మాటకు.. విలువే లేకుండా పోతుంది అని ప్రజాస్వామ్య వాదుల ప్రశ్న.

అక్కడ కూడా పాలిటిక్సేనా?

  పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి అర్జెంటుగా పాలిటిక్స్‌లో ఎక్కడికో వెళ్ళిపోవాలనే కోరిక బాగా ఎక్కువైపోయినట్టుంది. ఆర్నెల్లకోసారి జనంలోకి వచ్చి పొలిటికల్ స్పీచ్‌ ఇచ్చి వెళ్ళిపోయే ఆయన మొన్నీమధ్య వైజాగ్‌లో మరోసారి బయటకి వచ్చి పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ విన్నాక పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఏమాత్రం నెగ్గుకు రాగలడనే విషయం మీద చాలామందికి క్లారిటీ వచ్చింది. గతంలో ఎప్పుడూ రానంతగా విమర్శలు సదరు స్పీచ్ మీద వచ్చాయి. ఎంతమాత్రం ప్లానింగ్ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ ప్రసంగం వుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ ప్రసంగం పొలిటికల్ లీడర్లా కాకుండా సగటు సినిమా హీరో మాట్లాడినట్టుగా వుందని విమర్శలూ వచ్చాయి. పొలిటికల్ మీటింగ్‌లో పరిణతి చెందిన రాజకీయ నాయకుడి తరహాలో మాట్లాడడం ఆయనకి ఇప్పుడప్పుడే ఒంటపట్టే అవకాశం కనిపించడం లేదన్న అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వినిపించాయి. పొలిటికల్ మీటింగ్‌లో సినిమా హీరోలాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ సినిమా మీటింగ్‌లో మాత్రం పొలిటికల్ లీడర్లా మాట్లాడ్డం లేటెస్ట్ వెరైటీ.   పవన్ కళ్యాణ్ నటించిన ’అజ్ఞాతవాసి’ సినిమా ఆడియో ఫంక్షన్లో నేచురల్‌గా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాలి? ఆ సినిమా హీరోగా సదరు సినిమాలో విశేషాలు చెప్పాలి. సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల టాలెంట్ గురించి చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా గురించి తక్కువ చెప్పి, రాజకీయాల గురించి ఎక్కువ చెప్పారు. తన పార్టీ ఎన్నికల బరిలోకి దిగితే చాలా అవసరం కాబట్టి ఫ్యాన్స్‌కి తన హృదయంలో ఎంత గొప్ప స్థానం వుందో నాలుగైదుసార్లు చెప్పారు. తనకు, త్రివిక్రమ్‌కి వున్న అనుబంధం గురించి, డిప్రెషన్లో వున్న తనను త్రివిక్రమ్ ఎలా బయటపడేసిందీ సుదీర్ఘంగా చెప్పారు. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ తాను వ్యక్తిగతంగా ఎంత మంచోడో, సమాజం కోసం తాను ఎంతగా ఆలోచిస్తూ వుంటాడో చెప్పుకున్నారు.  దీన్నే బేలన్స్ లేకపోవడం అని పరిశీలకులు అంటున్నారు. సినిమా ఫంక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడ్డం, రాజకీయ సభలో సగటు సినిమా హీరోలా మాట్లాడ్డం పవన్ కళ్యాణ్‌కే చెల్లిందని అంటున్నారు.

ఈ 16 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే..?

  ప్రధాని నరేంద్రమోడీ పనితీరుకు.. రాబోయే ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో.. అందరూ ఊహించిన ఫలితమే వచ్చింది. 1995 నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ గెలుస్తూ వచ్చిన కమలనాథులే ఈ సారీ కూడా సౌరాష్ట్రలో జెండా ఎగరవేశారు. కానీ గెలుపొందిన ఆనందం ఏ కాషాయ పార్టీ కార్యకర్తలోనూ లేదు.. సాంకేతికంగా గెలిచాం తప్ప.. మానసికంగా గెలవలేదని వారు అంటున్నారు.. నిజం చెప్పాలంటే చివరిదాకా పోరాడి ఓడిన కాంగ్రెస్ పార్టీదే అసలు గెలుపని కొందరి భావన.   అసలు గుజరాత్‌లో బీజేపీ టార్గెట్ 150 సీట్లు.. ఆ టార్గెట్ను రీచ్ కావడం సంగతి పక్కనబెడితే.. కనీసం వంద సీట్ల మార్కును చేరడానికి భారతీయ జనతా పార్టీ అపసోపాలు పడింది. 99 స్థానాలతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా.. ఘనవిజయం కాకుండా సాధారణ గెలుపుతో సరిపెట్టుకుంది. 2002లో 127, 2007లో 117, 2012లో 116 సీట్లు కైవసం చేసుకుని తన జైత్రయాత్రను కొనసాగించిన కమలం.. నేడు అదే ప్రాంతంలో మూడంకెల సీట్లు గెలవడానికి ముక్కీ మూలిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రెండు దశాబ్ధాల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పుంజుకుని 77 స్థానాలను గెలిచి మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చింది. ఊహించని ఈ ఫలితంతో గెలవకపోయినా.. గెలిచినంతగా సంబరాలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.   రాహుల్ గాంధీ ప్రచారం, మూడు సామాజిక వర్గాల నుంచి ముగ్గురు నేతలు హస్తంతో జతకట్టడం వల్లే.. బీజేపీకి ఓట్ల శాతం తగ్గిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం, జీఎస్‌టీ, పటేల్ రిజర్వేషన్లు సహా వివిధ అంశాలు అధికార పక్షాన్ని దెబ్బతీశాయి అంటున్నారు నిపుణులు. అయితే ఒక 16 స్థానాల్లో కాంగ్రెస్ చాలా తక్కువ మెజారిటీతో సీట్లను కోల్పోయింది. వాటిల్లో ఏ 10 స్థానాల్లో రిజల్ట్ కాస్త అటూ ఇటుగా అయినా... ఇప్పుడు వేరే విషయాలు చర్చించుకోవాల్సి వచ్చేదని.. ఏదో గుడ్డిలో మెల్లగా బీజేపీ గుజరాత్‌లో పరువు కాపాడుకుందని విశ్లేషకులు అంటున్నారు. అన్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వస్థలమైన వాద్‌నగర్ ఉన్న "ఉంఝా" నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం చర్చనీయాంశమైంది.   ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన నారాయణ్ భాయ్ పటేల్ లల్లుదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ఆశా పటేల్ చేతిలో 19,529 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాహుల్ .. తన నవసర్జన్ యాత్రలో భాగంగా ఉంఝాలో పర్యటించి.. వాద్‌నగర్ సమీపంలోని ఉమియా మాత ఆలయాన్ని సందర్శించారు. బొటాబొటి మెజారిటీ వచ్చిందని బాధపడుతున్న వేళ.. ప్రధాని సొంత ఊళ్లో పార్టీ ఓడిపోవడంతో బీజేపీ తలపట్టుకుంది. సో.. గుజరాత్ ఫలితాలు మోడీకి డెంజర్ బెల్స్ మోగించాయని చెప్పక తప్పదు.

బీజేపీ గెలిచింది.. కానీ...

  గుజరాత్‌లో గతంలో సాధించిన స్థానాలకంటే పన్నెండు స్థానాలు తక్కువ పొందింది. గతంలో 60 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 70 సీట్లను దాటింది. గుజరాత్ నుంచి వచ్చి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశ ప్రధాని స్థాయిలో కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రి తానే అన్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ పనితీరుకు, ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు ఈ ఎన్నికలు రెఫరెండంగా అందరూ భావించారు. ఈ ఎన్నికలలో అటూ ఇటూ అయితే కేంద్రంలో బీజేపీ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి గుజరాత్ ఎన్నికల మీదే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. మరోపక్క హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగినప్పటికీ  అందరికీ ఎక్కువ ఆసక్తి గుజరాత్ మీదే నిలిచింది. ఎట్టకేలకు గుజరాత్ ఫలితం బీజేపీకి అనుకూలంగానే వచ్చింది. ఫలితం అయితే అనుకూలంగా వచ్చిందిగానీ, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, మోదీకి ఒక హెచ్చరికగానే భావించాల్సి వుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ అనుకూల పవనాలు వున్నాయి. నోట్ల రద్దు తర్వాత ఆయన మీద చాలామందిలో వ్యతిరేకత వున్నప్పటికీ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీకి అనుకూల ఫలితాలే ఇప్పటి వరకూ వచ్చాయి. గతంలో జరిగిన పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో నోట్ల రద్దు ప్రభావం కనిపించలేదు. జనం బీజేపీకే పట్టం కట్టారు. అయితే గుజరాత్ పరిస్థితి మాత్రం వేరు. తమ రాష్ట్రం నుంచి వెళ్ళి ప్రధాని అయిన మోదీ అంటే ఆ రాష్ట్రంలో అభిమానం ఎక్కువగానే వుంటుంది. బీజేపీ, రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం బీజేపీకి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాల్సి వుంది. అయితే అందుకు భిన్నంగా గతంలో కంటే సీట్లు బాగా తగ్గిపోయాయి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అయిన 92 స్థానాలను దాటింది. కౌంటింగ్ ప్రారంభమైన మొదట్లో అయితే బీజేపీ కంటే కాంగ్రెస్ ఆధిక్యంలో వుండటం బీజేపీ వర్గాలను షాక్‌కి గురి చేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత వెలువడిన సర్వే ఫలితాలు భారతీయ జనతాపార్టీని ఆకాశంలో నిలబెట్టాయి. ప్రతి సర్వే బీజేపీకి మెజారిటీ భారీగా పెరిగిపోతుందని, కాంగ్రెస్ పార్టీకి గతంలో వున్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పింది. అయితే ఫలితాలు మాత్రం సర్వేలతో సరిపోలని విధంగా వచ్చాయి.   రెండు రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే వారి మనసుల్లో మాత్రం ప్రజల నుంచి పరోక్షంగా అందిన హెచ్చరిక మెదులుతూనే వుంటుంది. విజయం సాధించినప్పటికీ గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఒక గుణపాఠంగానే భావించాల్సి వుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏడాదిన్నరలో రాబోతున్న జనరల్ ఎలక్షన్లలో బీజేపీ విజయం నల్లేరు మీద నడక కాబోదనే విషయాన్ని గుజరాత్ ఫలితాలు స్పష్టంగా చెప్పాయని చెబుతున్నారు.

సోనియా జీవితాన్ని మలుపు తిప్పిన క్షణాలు..

  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీయాశీలక రాజకీయాల నుంచి తాను ఇక సెలవు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా సోనియా అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే సోనియా అనేంతగా ఎదిగిపోయారు సోనియా. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో.. కొత్త రక్తాన్ని ఎక్కించడంలోనూ ఆమె కృషి చేశారు. సోనియా హయాంలోనే పార్టీ అధికారాన్ని అనుభవించింది.. అధ: పాతాళానికి దిగజారింది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని అత్యధిక కాలం పాలించిన అధినేత్రిగా రికార్డుల్లోకి ఎక్కి.. నెహ్రూ కుటుంబం తప్ప కాంగ్రెస్‌కి మరో దిక్కులేదనే విశ్లేషకుల మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. ఆమె జీవితం ఎన్నో వింతలు, విషాదాల సమాహారం అవేంటో ఒకసారి పరిశీలిస్తే..   * సోనియా గాంధీ అసలు పేరు అడ్విగే ఆంటోనియా మాయినో.. * ఇటలీలోని లూసియానా దగ్గరలోని కంట్రడా మెయిని గ్రామంలో స్టిఫెనో, పోలా మైనో దంపతులకు 9 డిసెంబర్ 1946న జన్మించారు. * సోనియా తండ్రి ఒర్బస్సానో అనే పట్టణంలో వ్యాపారం నిర్వహించడంతో ఆమె బాల్యం అక్కడే గడిచింది. * 1965లో కేంబ్రిడ్జ్ నగరంలో ఆమె తొలిసారి రాజీవ్ గాంధీని కలిశారు. * వీరిద్దరి పరిచయం, ప్రేమగా మారి.. 1968లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట వివాహం చేసుకున్నారు. * 1984లో అమేధి నియోజకవర్గంలో రాజీవ్ తన మరదలు మేనకా గాంధీకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు.. సోనియా తొలిసారిగా రాజకీయ రంగంలోకి దిగి తన భర్త కోసం ప్రచారం చేశారు. * 1997లో కలకత్తా ప్లీనరీ సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సోనియా.. కేవలం 62 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. * 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసి ఏకకాలంలో గెలిచారు. అయితే బళ్లారికి రాజీనామా చేసి.. అమేథీ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను ఓడించారు. అదే సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. * 2004లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే ఒక విదేశీయురాలు ప్రధాని కావడానికి వీలు లేదంటూ బీజేపీ నిరసన చేపట్టడంతో.. ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ను ప్రతిపాదించారు. ఆమె మాత్రం 2004 నుంచి 2014 వరకు యూపీఏ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. * 2014లో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించడంలో    సోనియా క్రీయాశీలక పాత్ర పోషించారు. * 2011లో అమెరికాలో శస్త్రచికిత్సను చేయించుకుని.. తిరిగి ఇండియాకు తిరిగి వచ్చిన సోనియా గురించి పలు పుకార్లు వ్యాపించాయి. ఆమెకు క్యాన్సర్ సోకిందని.. న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. * 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న సోనియా అస్వస్థతకు గురికావడంతో మధ్యలోనే తిరిగి వచ్చేశారు. సుమారు నెలకు పైగా ఆస్పత్రిలోనే గడిపారు. * రాహుల్ గాంధీ ఇకపై కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తారని శ్రేణులకు తెలియజేశారు.

జీవితంలో తొలిసారి మాటపడ్డ రాజమౌళి..!!

  తన మానాన తాను ఏడాదికో.. రెండేళ్లకో సినిమాలు తీసుకుంటూ కాలం వెల్లదీస్తూ.. దక్షిణ భారతదేశంలో స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు. ఎవరితో విభేదాలు లేకుండా.. అందరితో కలివిడిగా ఉంటూ.. చిన్న సినిమా.. పెద్ద సినిమా అన్న తేడా లేకుండా సినిమా బాగుంటే బాగుందని.. లేదంటే లేదని చెబుతారు జక్కన్న. ఇన్నేళ్ల కెరీర్‌లో ప్రత్యక్షంగా గాని.. పరోక్షంగా గానీ ఒక్క మాట పడి వుండడు. అలాంటి వ్యక్తిపై తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి.. అది కూడా ఆయన ఫీల్డ్‌కి ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ రంగం నుంచి. కాళ్లు బొబ్బలెక్కినా.. నడుముకి బెల్ట్ వచ్చినా మడమ తిప్పక తన పాదయాత్రను జోరుగా సాగిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. తన యాత్రకు వచ్చే వారి బుగ్గ నిమురుతూ.. నుదిటిపై ముద్దు పెడుతూ.. మధ్య మధ్యలో అధికార పక్షం అవినీతిపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రతిపక్షనేత.   తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేశారు జగన్. సీఎం గారు రాష్ట్రానికి చేసిందేమి లేదని.. ఆయన ప్రజలను చాలా మోసం చేశారని చెబుతూ.. తన మాటలను జనాలు నమ్మరేమోనని సినీ దర్శకులను, హీరోలను పక్కనబెట్టుకొని తిరుగుతున్నారని కామెంట్స్ చేస్తూ సీన్‌లోకి రాజమౌళిని కూడా లాగారు. ఒకాయన బాహుబలి సినిమాను తీశారు.. మీరందరూ కూడా చూసే ఉంటారు. నేను కూడా పేపర్లో చదివాను.. ఆయనను ముఖ్యమంత్రిగారు పిలిపించుకొని అమరావతి మీద సినిమా తీయండి అని అడిగారట..   ఒక్క ఇటుక కూడా పడని అమరావతిలో సినిమా ఏంటా అని నేను ఆశ్చర్యపోయా.. ఇక రేపు పొద్దున్న ఆయన సెట్లు వేసేస్తాడు.. ఆ సెట్లలో చంద్రబాబు గారి ఎంట్రీ.. ఆయన మంత్రి నారాయణ మరో పాత్ర.. ఇదిగో అమరావతి.. అదిగో వచ్చేసింది అని బిల్డప్ ఇస్తారు. మోసానికైనా హద్దు పొద్దు ఉండాలి అంటూ.. జగన్ వేసిన సెటైర్లు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ముఖ్యమంత్రి ...ఇందుకు రాజమౌళి సలహాలు కోరారు. సీఎం అంతటి వ్యక్తి అడిగే సరికి జక్కన్న కూడా కాదనలేకపోయారు. భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా కొన్ని సూచనలు చేసి.. ఆ డిజైన్లకు చంద్రబాబు చేత ఓకే అనిపించారు. ఇంత చేసినా తన సాయం రామసేతు నిర్మాణంలో ఉడత సాయం లాంటిదని చెప్పాడు. అలాంటి రాజమౌళిపై జగన్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమరావతికి సంబంధించి తన పాత్ర ఎంత పరిమితమో చెప్పాక కూడా.. వైసీపీ అధినేత ఇలా అనడంపై రాజమౌళి ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతోందట.

విజయ్‌ ఆవేదనని మిస్టరీగా మిగులుస్తారా..?

  కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. బిజీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న విజయ్ బలవన్మరణం వెనుక కారణమేంటీ..? ఆర్థిక ఇబ్బందులా.. కుటుంబ కలహాలా..? మరేదైనా చెప్పుకోలేని బాధా..? అవకాశాలు రాకపోవడం అనే అంశం చుట్టూ ఇలాంటి సందర్భాల్లో చర్చ జరుగుతుంది.. కానీ అది ఓ కారణమే తప్ప.. అదే అసలు కారణం కాదన్నది మెజార్టీ సినీ ప్రముఖుల వాదన. కుటుంబ సమస్యలు, ఇతరత్రా కారణాలూ సినీ నటుల ఆత్మహత్యలకు కారణమని ఎన్నో సార్లు రుజువైంది. అందుకు తగినట్లుగానే చనిపోవాలని నిర్ణయించుకున్నాకా విజయ్ సెల్పీ వీడియో తీసుకుని.. భార్య కారణంగా అనుభవించిన మానసిక క్షోభను బయటపెట్టాడు.   వనితతోపాటు ఆమె తల్లి వ్యభిచారం చేస్తున్నారని.. తన కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. తాను చనిపోయాక, తన భార్యపైనా ఆమెతోపాటు తనను వేధించిన శశిధర్, లాయర్ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఎవర్నీ వదిలిపెట్టకూడదని తండ్రికి చెబుతూ వీడియో ముగించాడట. అయితే ఈ వ్యాఖ్యలను వనితారెడ్డి ఖండిస్తూ.. విజయ్‌సాయి క్యారెక్టర్‌పై ఆరోపణలు చేసింది. విజయ్‌కి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని.. పద్ధతి మార్చుకోమని చెప్పినందుకు ఎన్నో సార్లు తనను కొట్టాడని ఆరోపించింది. ఈ సంగతి పక్కనబెడితే విజయ్ ఆరోపించిన ముగ్గురు వ్యక్తుల్లో ప్రముఖమైన పేరు శశిధర్.. ఎవరన్న దానిపై కూపీ లాగగా..   అతను నవయుగ కనస్ట్రక్షన్స్ అధినేత విశ్వేశ్వరరావు కుమారుడిగా తేలింది. కంపెనీ వ్యవహారాలన్నీ ఇతడే చూస్తుంటాడట.. లాబీయింగ్‌లు, పైరవీలు నడపడంలోనూ దిట్టగా చెబుతున్నారు పారిశ్రామిక వర్గాలు. సెల్ఫీ వీడియోలో తన భార్యతో శశిధర్‌కి గల సంబంధంపై విజయ్ వివరంగా చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. ఇతని పేరు సెల్ఫీ వీడియోలో ఉండటంతో నవయుగ రంగంలోకి దిగిందట. ఉదయం ఘటన జరిగితే ఆ రోజు సాయంత్రం వరకు ఈ విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి వచ్చిందట. కానీ, మీడియా సమావేశంలో డీసీసీ, శశిధర్ పేరును బయటకు వెల్లడించారు. అయితే అతను నవయుగ ఛైర్మన్ కుమారుడు కాదని.. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అని చెప్పారు. ఏడాదికి 20 వేల కోట్ల టర్నోవర్ కలిగి.. అంతర్జాతీయ స్థాయి కాంట్రాక్టులతో.. దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నవయుగను నడుపుతున్న వ్యక్తికి.. సాదా సీదా సినీ నటితో అవసరం ఏంటి అనే సందేహం మీకు రావొచ్చు. దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. శశిధర్ సహజంగానే విలాస పురుషుడు.. తన మిత్రులతో కలిసి అప్పుడప్పుడూ కృష్ణపట్నం పోర్ట్‌కు వెళ్లేవాడని.. ఆ సమయంలో తనకు నచ్చిన మందు, మగువలతో పోర్ట్‌లో ఉన్న ఒక దీవిలో జల్సా చేస్తాడని పారిశ్రామిక వర్గాల్లో టాక్ ఉంది. అలాగే పారిశ్రామిక వ్యవహారాలు చక్కబెట్టడం అంత సులువు కాదు. సామ, ధాన, బేధ దండోపాయాలను ఉపయోగిస్తే కానీ పనులు జరగవు. అలాంటి వాటిల్లో అమ్మాయిలు కూడా ఒక భాగం.   తన వ్యాపార అవసరాల కోసం శశిధర్ తదితరులు వనితను ఉపయోగించుకున్నారని విజయ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. మరోవైపు చట్టం ధనవంతులకి చుట్టం అన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది. డబ్బున్నవాళ్లు దేని నుంచైనా బయటపడగలరు.. ఈ దేశంలో పేదలకు న్యాయం లభించటం చాలా కష్టం.. పరపతి ఉన్నవాళ్లను శిక్షించటం కూడా చాలా కష్టమనే భావన ఉంది. బాలకృష్ణ కాల్పుల వ్యవహారం, సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్, కృష్ణ జింకల వేట కేసులతో పాటు.. ఎందరో బడా బాబులు, ఎన్నో కేసుల నుంచి తప్పించుకున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ పరిణామాలు ఘనత వహించిన న్యాయ వ్యవస్థ ముందు లక్షలకొద్ది ప్రశ్నలుంచాయి. తాజాగా కమెడియన్ విజయసాయి ఆత్మహత్యలోనూ డబ్బు, పరపతి కీలకపాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. అతని మరణం మిస్టరీగా మారిపోతుందా..? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. మరి విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాల్సిందే.

హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే..

  ఇండియాలో ఉన్నవి రెండే మతాలు.. ఒకటి క్రికెట్ రెండు సినిమా.. జనాభాను బట్టి చూస్తే అతిపెద్ద మతం క్రికెట్టే.. ఆ తర్వాతి స్థానం.. సినిమాది. క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు భక్తిప్రపత్తులతో టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్‌లు చూస్తూ తరిస్తారు క్రికెట్ భక్తులు.. ఇక అభిమాన హీరో సినిమా విడుదలయ్యిందంటే చాలు కటౌట్లకు, బ్యానర్లకు అభిషేకాలు, పూజలు, పునస్కారాలు అబ్బో అభిమానులకు పెద్ద పండగే. అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే.. అంటే ఇష్టమైన క్రికెటర్, ఫేవరేట్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. అభిమానులకి వచ్చిన ఈ ఆలోచనని నిజం చేసేందుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో హీరోయిన్లు, క్రికెటర్లు తెగ కష్టపడుతున్నారు. అవును క్రికెటర్లకు హీరోయిన్లకు ఉన్న బంధం ఈ నాటిది కాదు.. చరిత్రను పరిశీలిస్తే.. బోలెడన్ని ప్రేమాయణాలు.. ఎఫైర్లు.. కొన్ని పెళ్లిళ్లు ఎన్నో ఎన్నెన్నో. తాజాగా విరాట్-అనుష్క పెళ్లితో బాలీవుడ్ తారలతో క్రికెటర్ల ప్రేమాయణాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ఎవరో ఒకసారి చూస్తే. భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. నటి షర్మిల ఠాగోర్‌ల వివాహం 1969లో జరిగింది. ఈ దంపతుల కుమారుడే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్. అలనాటి బాలీవుడ్ నటి నీనాగుప్తా.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మధ్య రిలేషన్ షిప్ గురించి అప్పట్లో మీడియా కోడై కూసింది. వారి బంధానికి గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది.. కానీ వారు పెళ్లి చేసుకోలేదు. నాగిన్ సినిమాతో దేశాన్ని ఒక ఊపు ఊపిన రీనా రాయ్ పాకిస్థానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్‌ను 1983లో పెళ్లాడింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకుంది. హైదరబాదీ.. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ప్రేమకు ముగింపు పలుకుతూ.. చక్‌దే ఇండియాలో నటించిన సాగరికా ఘట్కేను.. భారత మాజీ బౌలర్ జహీర్‌ఖాన్ పెళ్లాడాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్ సింగ్ నటి హజెల్ కీచ్‌ను గతేడాది వివాహం చేసుకున్నాడు.. ఈమె సల్మాన్‌ఖాన్ నటించిన బాడీగార్డ్ మూవీలో కీలక పాత్ర పోషించింది.  

రాష్ట్ర పరువును పొగొడుతున్న ఆంధ్రా అమ్మాయిలు..!!

ఉద్యోగాలు, వ్యాపారాలతో సహా అన్ని రంగాల్లోనూ మగాళ్లను పక్కకునెట్టి వాళ్ల కంటే దేనిలో తీసిపోమని మగువలు నిరూపిస్తున్నారు. అభివృద్ధిలో పురుషులకు ఏ మాత్రం తీసిపోమని చాటుతున్న మహిళలు అలవాట్లలోనూ ఓ అడుగు ముందుకేస్తున్నారు. ఆడవాళ్లు వంటగది నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుంచి స్వేచ్ఛగా నడుచుకోగలుగుతున్నారు. అదే క్రమంలో.. అభిరుచుల విషయంలోనూ.. అనుకున్నది చేయడంలోనూ ఏమాత్రం సిగ్గు పడటం లేదు. అది తప్పా.. ఒప్పా అన్న సంగతి పక్కనబెడితే.. మంచితో పాటే అన్ని దురలవాట్లకు చేరువవుతూ మగాళ్ల కంటే వేగంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.   మద్యపానం, ధూమపానం, విచ్చల విడిగా శృంగారం, జూదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. గతంలో ఎన్నో కట్టుబాట్లు ఆడవారిని ఇలాంటి వాటికి దూరంగా వుంచేవి. అయితే మారుతున్న కాలంతో పాటే ఈ కట్టుబాట్లు సడలుతున్నాయి. చదువు, ఉద్యోగాల పేరిట తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో.. చెడు స్నేహాలకు అలవాటుపడి ఇరుగుపొరుగు చూస్తారన్న భయం లేకుండా మద్యాన్ని రుచి చూస్తున్నారు. ఒకటి, రెండు సార్లకు అనుకొని క్రమేపీ వాటికి బానిసలవుతున్నారు ఆడపడుచులు. తాజాగా జరిగిన జాతీయ కుటుంబ సర్వేలో మనదేశంలో మద్యం తాగే మహిళల శాతం పెరిగినట్లు తేలింది. ఈ జాబితాలో దేశంలోని 9 రాష్ట్రాలు అగ్రస్థానం కోసం కొట్టుకుంటున్నాయి. దురదృష్టవశాత్తూ ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉండటం.. రాష్ట్రానికి తలవంపులు తీసుకొస్తుంది.   2005-06వ సంవత్సరం నాటికి మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉండగా.. 2015-16 నాటికి ఇది 0.7 శాతానికి పెరిగింది. అదే సమయంలో 2005-06లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతం.. 2015-16 నాటికి 24.7 శాతానికి తగ్గడం విశేషం. కానీ అమ్మాయిలు మాత్రం చుక్క వేయకుండా ఉండలేకపోతున్నారట. మరోవైపు మద్యం అమ్మకాలు పెరగడం వెనుక రాష్ట్రప్రభుత్వాల ఏర్పాట్లు ఉన్నాయట. కొన్ని చోట్ల ప్రభుత్వాలే తాగండి.. తాగి ఊగండి అనేంతగా ప్రొత్సహిస్తున్నాయి. ఉదాహరణకు ఏపీని తీసుకుంటే.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక కష్టాల గురించి ఆ పరమాత్ముడికే ఎరుక. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పాతపేరుతో కొత్త రాష్ట్రంగా ప్రస్థానాన్ని సాగించింది ఏపీ. కల్పతరువు లాంటి హైదరాబాద్‌ను కోల్పోవడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.   దానిలో మొట్టమొదటిది మద్యం అమ్మకాలు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత మంది తప్పు అన్నా.. దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలకు మద్యమే ప్రథమ ఆదాయ వనరు. అందుకు ఆంధ్రా కూడా మినహాయింపు కాదు. లిక్కర్ సేల్స్‌ను ప్రొత్సహించి ఆదాయాన్ని పెంచుకోవాలని భావించిన ఏపీ సర్కార్, బీరు-బారు పాలసీని ప్రవేశపెట్టింది. దానికి తోడు బీరు హెల్త్ డ్రింక్ అని స్వయంగా మంత్రివర్యులే సెలవివ్వడంతో యువత ఇక ఆగుతుందా..? తెగ తాగేసి రాష్ట్ర ఖజానా పెంచేసింది. తాజా సర్వే ప్రకారం వారిలో ఇప్పుడు అమ్మాయిలే పెద్దసంఖ్యలో ఉండటం సమాజాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఏది ఏమైనా ప్రతిభకు.. అందానికి.. తెలివితేటలకు.. పరాక్రమానికి ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు ప్రతీతి.. ఇలా వారు విచ్చలవిడిగా దురలవాట్లకు బానిసై తల్లిదండ్రులతో పాటు రాష్ట్రం పేరును చెడగొట్టొద్దని మనవి.

బన్నీని బద్నాం చేశారు... ఫ్యాన్స్ కు పవన్ వార్నింగ్..

  అభిమానం ఉండాలి.. కానీ అది పక్కన వాళ్లని ఇబ్బంది పెట్టేదిగా మాత్రం ఉండకూడదు. సాధారణంగా హీరో, హీరోయిన్స్ కు అభిమానులుండటం సహజం. హీరోయిన్స్ తో పోల్చుకుంటే... హీరోలకి లక్షల్లో అభిమానులుంటారు. కేవలం అభిమానించడమే కాదు...ఆరాధిస్తారు, పూజిస్తారు కూడా. తమ ఫేవరేట్ హీరో పేరున సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇది అందరూ సంతోషించాల్సిన విషయం. కానీ ఈ అభిమానం శృతి మించి రాగాన పడితేనే అసలు సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకుంటారా..? పవన్ ప్యాన్స్ గురించి చెప్పాలంటే ఆ మాత్రం ఉండాలి కదా.   నిజానికి అందరి ఫ్యాన్స్ సంగతేమో కానీ.. పవన్ ప్యాన్స్ మాత్రం పవన్ ను దేవుడిగా పూజిస్తారు. ఒకప్పుడు పవన్ ప్యాన్స్ గురించి గర్వంగా చెప్పుకునేవారు. కానీ రాను రాను ఏమైందో తెలియదు కానీ.. వారి ప్రవర్తనతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పవన్ అభిమానుల ప్రవర్తనలతో చాలామంది సినీ సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారన్న మాట వాస్తవమే. ఇప్పుడు వారి ప్రవర్తన వల్ల పవన్ కే చిరాకు వేసినట్టుంది. అందుకే కాస్త సీరియస్ అయ్యాడు. ఏపీ టూర్ లో ఉన్న పవన్ పలు సభల్లో పాల్గొంటున్నాడు కదా. ఇక అక్కడికి ఆయన అభిమానులు కూడా వస్తున్నారు. ఇంకేముంది.. ఆయన నోటి నుండి ఏమాట వచ్చినా.. అరుపులు, ఒకటే కేకలు. చూసే వారికి కూడా చిరాకు తెప్పించేలా చేశారు. దీంతో “అభిమానం ఉండాలి గానీ, అది ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు” అంటూ తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.  “ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది… బాబులకు బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేస్తారు, ఇవన్నీ తనకు నచ్చావు…” అంటూ చెప్పుకొచ్చారు. “మీ అభిమానం ప్రజలకు ఇరిటేట్ చేసేలా ఉండకూడదు, ఆనందింపచేసేలా ఉండాలి, మీరు పుట్టిన ఈ గడ్డ మీద గౌరవం ఉంటే, నాపై, జనసేన పార్టీపై కాకుండా, భారత్ మాతాకి జై అని చెప్పండి, మీరు ప్రతిసారి సిఎం సిఎం అంటే నేను ముఖ్యమంత్రిని అయిపోతానా? అరుపులు, కేకలతో మార్పులు రావు, ఆలోచనలతో కూడిన సంస్కరణల వలనే మార్పులు వస్తాయంటూ” పవన్  హిత బోధ చేశాడు.   మరి పవన్ చెప్పిన ఈ మాటలే కదా అల్లు అర్జున్ కూడా గతంలో చెప్పింది. ఏ హీరో ఫంక్షన్స్ కి వెళ్లినా అక్కడ పవన్ అభిమానులు హంగామా చేయడం.. వారి గోలకు హీరోలు ఇరిటేట్ అవ్వడం. ఇవన్నీ చూసి ఇది బయటకు చెప్పింది మాత్రం ఒక్క అల్లు అర్జునే. ఏది ఏమైనా కానీయ్ అనుకుని, పవన్ ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యాడు. ఇక బన్నీ చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్ ఏ రీతిలో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత బన్నీ వ్యాఖ్యలకు మరికొందరు కూడా సమర్ధించినా పవన్ కళ్యాణ్ అభిమానుల తీరులో మాత్రం పెద్దగా మార్పు లేకపోదు సరికదా.. బన్నీని ఏడాదిపాటు బద్నాం చేసేశారు. ఇప్పుడు ఏకంగా పవన్ కే చిరాకు తెప్పించి... క్లాస్ పీకించుకున్నారు. అప్పుడు బన్నీ మాట వినలేదు.. ఇప్పుడు తాము పూజించే పవనే చెప్పిన తరువాత.. మారతారో..? లేదో చూద్దాం. ఏది ఏమైనా ఈ విషయాన్ని అందరికంటే ముందు బన్నీ ధైర్యంగా చెప్పడం ఎంతైనా గ్రేటే...

పాపం పవన్.. బుక్కయ్యాడా..!

  జనసేన అధినేత పవన కళ్యాణ్ ఏపీ టూర్ లో చాలా పవర్ ఫుల్ స్పీచ్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. గత మూడు రోజులుగా కార్యకర్తలతో, ఇతర సమావేశాల్లో పాల్గొంటున్న పవన్ పలు అంశాలపై స్పందిస్తూ... కౌంటర్ల మీద కౌంటర్లు విసిరారు. తన మీద విమర్శలు గుప్పించిన వాళ్ల మీద... కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రతిపక్ష నేత జగన్ మీద అయితే కాస్త ఎక్కువగానే సెటైర్లు విసిరారు. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా చిరంజీవి గురించి, చిరంజీవి మంచితనం గురించి.. చిరంజీవిని మోసం చేశారని.. ఇంకా ప్రజారాజ్యం గురించి చాలా మాట్లాడాడు. ఇంకా వారసత్వ రాజకీయాలు గురించి.. పాదయాత్రల గురించి, కులాల గురించి, రిజర్వోషన్ల గురించి, పోలవరం గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశాడు.   అయితే ఇక్కడి వరకూ  బాగానే ఉంది. పవన్ తన మనసులో బాధను ఒక్కసారిగా బయటపెట్టాడు..అయితే దీనివల్ల పవన్ తన సెల్ఫ్ గోల్ తానే చేసుకున్నాడు అంటున్నారు. ఎందుకంటే.. పవన్ పాదయాత్ర గురించి మాట్లాడాడు. దీంతో...  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను కలవడానికి అనేక మార్గాలను ఎంచుకుంటారు..అటువంటి వాటిలో 'పాదయాత్ర' ఒక మార్గం..దీనిలో తప్పుపట్టడానికేముంది అంటున్నారు. అంతేకాదు అదే విధంగా ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని ఆశ పడడం తప్పుని సెలవిచారు...మరి సినీనటుల కుమారులు, తమ్ముళ్లు సినిమా నటులు కావచ్చా...? వారసత్వం ఉండకూడదని చెప్పిన 'పవన్‌' మరి సినీ వారసత్వం ఉండాలని భావిస్తున్నారా..? ఒకే ఇంటిలో డజన్‌కు పైగా హీరోలను పెట్టుకుని వారసత్వం గురించి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నమ్ముతారా..? అని అంటున్నారు.   ఇంకా కులం గురించి కూడా పవన్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు. తనకు ఒక కులం ఆపాదించవద్దని, తాను ఏ కులానికి చెందిన వాడిని కాదని, ఇంకోసారి తనను ఒక కులానికి చెందినట్టు కథనాలు రాస్తే ఊరుకోనని గట్టిగానే చెప్పాడు. దీనికిగాను...నిన్నటి దాకా తనకు కులం లేదని డప్పుకొంటుకున్న 'పవన్‌' ఈ రోజు 'కాపు'లకు ఐదు శాతం రిజర్వేషన్లు చాలవని, వారికి 15శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసి తనకు ఉన్న కులతత్వాన్ని బహిరంగంగా చాటుకున్నాడని అంటున్నారు. సామాజికవర్గం విషయంలో స్పందించిన తీరుతో అవన్నీ నోటిమాటలేనని అంటున్నారు. అదే విధంగా 'పోలవరం' ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని నిరూపించాలంటే..అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలట. దీనిలో ఏమైనా హేతు బద్దత ఉందా..? అవినీతి జరిగితే..ఎక్కడ జరిగిందో తేల్చి చెప్పి..అది నిరూపించాలి..కానీ..ఢిల్లీకి తీసుకెళ్లు..అంటూ పనికి మాలిన సలహాలు ఇవ్వడం ఎందుకు.. అన్నిటి కంటే విచిత్రమైన డిమాండ్‌ కేంద్ర రక్షణ మంత్రి 'నిర్మలాసీతారామన్‌', ఆమె భర్త ప్రభుత్వ సలహాదారు 'పరకాల ప్రభాకర్‌'లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయినందున రాజీనామా చేయాలట...? సరే...వారు విఫలమయ్యారు..అనుకుందాం..మరి..'పవన్‌' అన్న..కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కదా..కాంగ్రెస్‌ అడ్డంగా ఆంధ్రాను చీల్చింది..మరి...అప్పుడు ఎందుకు 'చిరంజీవి' రాజీనామా చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆవేశంగా మాట్లాడిన పవన్.. తన సెల్ఫె గోల్ తానే చేసుకున్నాడు అంటున్నారు.

ఎంత తిరిగినా ఉపయోగం లేదు.. జగన్‌కు పీకే షాక్..!!

  అధికారమే లక్ష్యంగా.. జీవితంలో ఎప్పుడు కష్టపడని జగన్ 3వేల కిలోమీటర్లు నడుస్తున్నాడు. నీరసంగా ఉన్నా..  ఆరోగ్యం బాగోలేకున్నా.. ప్రతి శుక్రవారం కోర్టు పిలుస్తున్నా అన్ని తట్టుకుంటూ మడమ తిప్పడం లేదు ప్రతిపక్షనేత. దారి పొడుగునా.. ఆడా, మగ, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా తల నిమురుతూ, ముద్దులు పెడుతూ యాత్ర సాగిస్తూ వస్తున్న జగన్మోహన్‌రెడ్డికి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఓ న్యూస్ చెప్పాడు. అది విన్న జగన్‌కి ఒకేసారి సంతోషం.. దు:ఖం పొంగుకొచ్చాయట. అంతగా ప్రశాంత్ ఏం చెప్పాడా అని ఆరా తీశారట కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వ్యూహాకర్తగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి జగన్‌ను సీఎం చేసేందుకు పీకే టీమ్ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తోంది. అలాగే కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపైనా సర్వేలు చేసి జగన్‌కు నివేదిక అందజేస్తోంది పీకే టీం.   ఇక అందలాన్ని అందుకోవడం కోసం చివరి ప్రయత్నంగా పాదయాత్రను భుజానికెత్తుకున్నారు జగన్. గత నెల 6వ తేదీన కడపజిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించారు ప్రతిపక్షనేత. కడప, కర్నూలు జిల్లాల్లో యాత్రను ముగించి రెండు రోజుల క్రితం ఆయన అనంతపురం జిల్లాలో ప్రవేశించారు. జగన్ నడిచిన నియోజకవర్గాల్లో నెల రోజులకి ముందు.. నెల రోజుల తర్వాత ఆయా ప్రాంతాల ప్రజలు ఏమనుకుంటున్నారు..? వైసీపీకి ఆదరణ పెరిగిందా తగ్గిందా..? అక్కడ ఇంకా సరిదిద్దుకోవాల్సిన లోపాలెంటీ..? అన్న దానిపై ప్రశాంత్ కిశోర్ సర్వే చేశారు. ఈ సర్వే నివేదిక చూసిన జగన్‌ షాక్ అయ్యాడని లోటస్ పాండ్ టాక్. ఆయా నియోజకవర్గాల్లో ఏ నలుగురు మాటల్లోనూ అసలు పాదయాత్ర ప్రస్తావన లేదట. పాతాళంలో పడిపోయిన వైసీపీ అధినేత ఇమేజ్ అక్కడే ఉంది తప్ప అంగుళం కూడా పైకి రాలేదట. ఇక జగన్‌ని చూసేందుకు జనం అంతగా ఆసక్తి చూపడం లేదట. నిజానికి అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఉండాల్సిన ఆయన సొంత జిల్లా కడపలో ఆదరణ అంతంత మాత్రమేనట. అన్న వస్తున్నారని వైసీపీ శ్రేణులు చేసిన హంగామా తప్పితే.. ప్రజల్లో ఆయన పాదయాత్రకు ఎలాంటి సానుకూల వాతావరణం లేదని పీకే నివేదిక బట్టబయలు చేసిందట.   అంటే మీరు ఎంత తిరిగినా లాభం లేదని పీకే ఇన్‌డైరెక్ట్‌గా జగన్‌కి చెప్పాడా అని వైసీపీ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. తమ అధినేత అంతగా కష్టపడుతుంటే పాదయాత్రకు ఇలాంటి రిజల్ట్ రావడం ఏంటని వైసీపీ శ్రేణులు కాస్త నిరాశకు లోనవుతున్నాయట. అయితే కేవలం రెండు జిల్లాల సర్వే ఫలితాలను బట్టి ఒక నిర్ణయానికి రాలేమని.. ఇంకా పది జిల్లాల్లో జగన్ పాదయాత్ర చేయాల్సి ఉన్నందున ఆ తరువాత రిజల్ట్ మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అందం చూసి రారు బాబు.. ఏం మాట్లాడుతున్నావ్..!

ఎంత చేసినా కుక్క తోక వంకరే అన్న సామెత గుర్తుంది కదా. ఇప్పుడు ఈ సామెత ఓ నాయకుడికి బాగా సూట్ అవుతుంది. అది ఎవరో కాదు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి. ఎన్నిసార్లు తెలిసొచ్చినా ఆ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోడు. నంద్యాల ఉపఎన్నికల్లో చంద్రబాబును కాల్చిపారేయాలని.. చంద్రబాబును నడిరోడ్డుమీద ఉరితీయాలి.. అబ్బో ఇలా ఒకటా రెండా నోటికొచ్చి మాట్లాడి దాని ఫలితాన్ని చూశాడు. అలాంటప్పుడు ఇప్పుడైనా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. అలాంటిది ఏం లేదు. మళ్లీ అదే తంతు. ప్రజాసంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఈ పాదయాత్రలో కూడా జగన్ చంద్రబాబుపై ఎప్పటిలాగే నోరు పారేసుకున్నాడు.   ప్రస్తుతం చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నసంగతి తెలిసిందే కదా. ఇక ఈ పర్యటనలో చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు. అంతేకాదు.. పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఆవిషయాన్ని ప్రకటించాయి కూడా. మరి ఈ విషయాలు ఏం తెలియని జగన్ మాత్రం...చంద్రబాబు మొహం చూసి ఎవడు పెట్టుబడులు పెడతాడని ప్రశ్నించాడు. అంతే ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. జగన్ తెలిసి మాట్లాడుతాడో.. తెలియక మాట్లాడుతాడో కూడా అర్దం కావట్లేదని అనుకుంటున్నారు. అలా అందం చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తే... అందరూ బ్యూటీ క్వీన్ లను విదేశీ మీటింగ్ లకి పంపేవారు. పెట్టుబడులు కోరే చోట మౌలిక సదుపాయాలు, అక్కడ నాయకుల సమర్ధత ఆధారంగా పెట్టుబడులు వస్తాయి. అంతేకాని అందం చూసి పెట్టుబడులు రావన్న సంగతి జగన్ కు తెలియకపోవడం మన ఖర్మ. ఇదేమీ పట్టించుకోకుండా చంద్రబాబు అందం గురించి మాట్లాడితే జగన్ కి ఒరిగేది ఏమీ ఉండదు. నష్టం తప్ప. నాయకుడుగా ఆయనకు సంస్కారం ఉన్నా, లేకున్నా వాటిని విని తీర్పు ఇచ్చే ప్రజలు సంస్కారవంతులు. ఓ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను జగన్ ఎండగట్టాలి అనుకోవడంలో తప్పులేదు. నిజానికి ఆ బాధ్యత మరిచిపోతేనే తప్పు. అయితే ఆ విమర్శలు ఎలా ఉండాలి అన్నదానిపై ఇప్పటికీ జగన్ కి అవగాహన రావడం లేదు. జగన్ బాబు ఇప్పటికైనా మాట్లాడటం చేతకాకపోతే ఎలా నాయనా...

"అమ్మ" లేని ఏడాదిలో తమిళనాడులో ఏం జరిగింది..!!

ఎంతమంది ఉన్నా అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరని పెద్దలు అంటూ ఉంటారు.. ఇది కన్నతల్లి విషయంలో.. కానీ తమిళనాడు విషయానికి వచ్చే సరికి అక్కడి జనాలకి కన్నతల్లి అంటే జయలలితే. తమను కన్నబిడ్డల్లా పాలించి అమ్మ అంటే వారికి పంచ ప్రాణాలు.. అమ్మ కనుసైగలే ఆదేశాలు.. అమ్మ కోసం ఏమైనా చేస్తాం అనేవారు ఆ రాష్ట్రంలో సగానికిపైగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అమ్మ కోసం గుడులు, అమ్మకి ఏమైనా అయితే పూజలు.. అంతేందుకు ఆవిడకే పూజలు చేశారు తమిళులు.. ఇప్పుడు ఆ అమ్మ లేదు. డిసెంబర్ 5.. తమిళనాడు ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించిన రోజు. ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరని వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణించి సరిగ్గా నేటికి ఏడాది. ఈ సంవత్సర కాలంలో అమ్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అప్పుడు తలెత్తిన అనిశ్చిత పరిస్థితి నేటి వరకు సర్దుకోలేదు. అవేంటో ఒకసారి చూస్తే:   * జయ ఉండగా తమిళనాడు వైపు కన్నెత్తి చూడటానికి భయపడిన వారు, ఆమె మరణం తర్వాత అన్నాడీఎంకే వ్యవహారాల్లోనూ.. ప్రభుత్వంలోనూ నేరుగా వేలు పెట్టేస్తున్నారు.   * అక్రమాస్తుల కేసులో భాగంగా ఐటీ శాఖ తమిళనాడు సచివాలయంలో సోదాలు నిర్వహించింది.. వీఐపీలు సహా ఏకంగా చీఫ్ సెక్రటరీ నివాసంలోనే సోదాలు చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ఒక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఐటీ శాఖ సచివాలయంలో దాడులు నిర్వహించడం ఇదే ప్రథమం.   * జయలలిత అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెరచాటు వ్యవహారాలు నడిపిన.. ఆమె నెచ్చెలి శశికళ అమ్మ మరణం తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పావులు కదిపారు. తొలుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చిన్నమ్మ... సీఎం పీఠాన్ని ఎక్కేందుకు అత్యంత చాకచాక్యంగా వ్యవహారించారు. ఇక తాను ముఖ్యమంత్రి కావడమే తరువాయి అనుకుంటున్న సమయంలో.. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో.. శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.   * చిన్నమ్మ రాజకీయాల కారణంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. అమ్మ విధేయుడు పన్నీర్ సెల్వం, శశికళ కూర్చొబెట్టిన పళనిస్వామి తమ మద్ధతుదారులతో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ రెండు వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయా అని తమిళనాట తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ చిన్నమ్మ జైలుకెళ్లిన కొద్దిరోజుల్లోనే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు కలిసిపోయాయి.   * జయలలితకు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉండటంతో వాటిని దక్కించుకునేందుకు.. అమ్మ వారసులమంటూ ఒక్కొక్కరు తెరపైకి వచ్చారు. తాజాగా బెంగళూరుకు చెందిన అమృత తాను జయ కుమార్తెనంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.   * అన్నాడీఎంకేలోని అంతర్గత కుమ్ములాటలను క్యాష్ చేసుకొని.. తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలు పావులు కదుపుతున్నాయి.

పవన్ పాదయాత్ర.. కేంద్రమే టార్గెట్...

  ప్రశ్నించడానికే  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే రెగ్యులర్ గా ప్రశ్నించకపోయినా... అప్పుడప్పుడు.. ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. దానికోసం ఇప్పటినుండే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు కూడా. ఇక అక్కడక్కడ పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నిర్మాణం మీద పూర్తిగా దృష్టి పెట్టడమే కాదు త్వరలో జనంలోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే పాదయాత్ర చేయాలని చూస్తున్నాడు.  జనవరి లేదా ఫిబ్రవరి లో ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర మొదలు పెట్టడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. పాదయాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్ కి సంబంధించి జనసేన కోర్ టీం తో పవన్ విస్తృతంగా చర్చిస్తున్నారట. ఇప్పటికే పాదయాత్ర కు సంబంధించి ప్రాధమికంగా ఓ అవగాహనకు వచ్చారట.   అయితే ఈ పాదయాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే...పవన్ పాదయాత్రలో.. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు గురించి మాత్రమే ప్రధానంగా దృష్టి పెడుతున్నారట. ప్రత్యేక హోదా , పోలవరం, నిధులు కేటాయింపులకు సంబంధించి మోడీ సర్కార్ మోసం చేసిన ప్రతి విషయాన్ని పవన్ జనంలోకి తీసుకెళ్లే అవకాశాలు వున్నాయట. పాదయాత్ర చేసేటప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమ రూపంలో ఆంధ్రుల మనోభావాలు వివరించే ఆలోచన కూడా ఉందట. మొత్తానికి ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ ఇన్ని రోజులకు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి రెడీ అవుతున్నాడు. మరి పవన్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.. డైరెక్ట్ గా కేంద్రంతోనే పోటీకి దిగుతున్నాడు.. కేంద్రాన్నే ప్రశ్నించడానికి సిద్ద పడుతున్నాడు...మరి ఏం జరుగుతుందో చూద్దాం..

గిల్లుతుంటే నవ్వుతున్నారు.. నష్టం తెలిస్తే కదా..!

ఒక పెద్ద కుటుంబంలో ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు వచ్చాయే అనుకోండి.. మధ్యలో మూడో వ్యక్తి ఆ ఫ్యామిలీకి నష్టం కలిగిలా ప్రయత్నిస్తే ఈ ఇద్దరు చూస్తూ ఊరుకుంటారా..? ఖచ్చితంగా ఇద్దరూ ఒక్కటై శత్రువుని తరిమి తరిమి కొడతారు కదా..? మరి ఇదే పరిస్థితి ఒక రాష్ట్రానికి ఎదురైతే ఎలా స్పందించాలి. అక్కడి జనానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారంతా ఒక్కటవ్వుతారు కదా..? ప్రాజెక్ట్‌లు, ప్రతిష్టాత్మక సంస్థలు ఇలా ఏదైనా సరే తమ రాష్ట్ర ప్రజలకు లాభం కలుగజేస్తుంది అనుకుంటే పార్టీలు వేరైనా అందరూ ఒక్కటై పోట్లాడి.. అవసరమైతే కొట్లాడి సాధించుకొస్తారు.    ఎక్కడి దాకో ఎందుకు మన పక్కనే ఉన్న తమిళనాడునే తీసుకోండి. వాళ్లలో వాళ్లకి ఎన్ని వైరాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చే సరికి మేమంతా తమిళులమే అని చాటి చెబుతారు. కావేరి నదీ జలాలు కానీ, శ్రీలంకలో తమిళుల ఊచకోత కానీ, జల్లికట్టు కానీ ఏదైనా సరే పోరాడి సాధించుకుంటారు. అయితే ఇంతటి ఐకమత్యం ఆంధ్రప్రదేశ్‌లో ఉండదు. ప్రతి దానిలో రాజకీయ ప్రయోజనాలు చూసుకునే మన ఘనత వహించుకునే రాజకీయ నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంటారు. ఎగువ రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లకు చుక్కునీరు చేరలేదు, అడుగంటిని శ్రీశైలం, నాగార్జున సాగర్.. మోకాళ్ల లోతు నీటితో పులిచింతల.. వ్యవసాయం సంగతి దేవుడెరుగు కనీసం తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అంటూ ప్రజలు ఆకాశం వంక చూస్తోన్న సమయంలో.. మండు వేసవిలోనూ వ్యవసాయానికి నీరు అందించారు చంద్రబాబు. ఇవన్నీ సాధ్యం అయ్యింది పట్టిసీమ వలనే.    కృష్ణా, గోదావరికి ఒకేసారి వరదలు వస్తాయి.. దారి మళ్లించిన నీటిని ఎక్కడ నిలవ చేస్తారు అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు. అయినా అన్నింటికి సమాధానం పట్టిసీమ ఫలితం ద్వారా తెలియజేశారు ముఖ్యమంత్రి. ఇక తన తదుపరి లక్ష్యంగా పోలవరాన్ని ఎంచుకున్నారు చంద్రబాబు.. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి విస్తృత ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 70 ఏళ్ల నుంచి కాగితాలకే పరిమితమైంది. ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుందని తెలుసు. అయినా కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇంతటి ప్రాధాన్యమున్న పోలవరాన్ని పూర్తి చేయడానికి పట్టుదల, కార్యదీక్షతో ముందుకు కదిలారు. జాతీయ హోదా, నిధులు, నిర్వాసితులకు నిధులు, ముంపు మండలాల విలీనం ఇలా ప్రతీ అడ్డంకిని దాటుకుంటూ పనులను పరుగులు పెట్టించారు.    ప్రతి సోమవారం పోలవరం వర్చువల్ విజిట్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అనుకున్న సమయానికన్నా ముందుగానే నిర్మాణం పూర్తవుతుందనుకున్న సమయంలో బ్రేక్ పడింది. పోలవరం స్పిల్‌వే పనుల టెండర్లు ఆపాలని ఆదేశిస్తూ కేంద్రప్రభుత్వం లేఖ రాసింది. ఎంతో వేగంగా పనులు జరుగుతున్న ఈ దశలో కేంద్రం నుంచి వచ్చిన లేఖ లేనిపోని గందరగోళం సృష్టిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి పోలవరాన్ని ఈ స్థితికి తీసుకొచ్చామని.. ఆరు నెలల పాటు ప్రాజెక్ట్ జోలికి వెళ్లకపోతే చాలా నష్టం, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. పనుల కోసం పెద్ద ఎత్తున యంత్రాలు, కార్మికులు, ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నామని.. ఇప్పుడు ఈ పనులన్నీ ఆగిపోతే వారంతా వెనక్కి వెళ్లిపోతారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.    ఇంతటి సంకట స్థితిలో ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సింది పోయి.. పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని అందుకే పనులు నిలిపివేయమని ఆదేశించిందని ప్రధాన ప్రతిపక్షం వ్యాఖ్యానించింది. ఇక కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన రాష్ట్ర నేతల సంగతి సరే సరి. ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకు ఎప్పుడు పాకులాడే ఈ నాయకులు.. వాస్తవాలు తెలిసి కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారు. నిజంగా రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే వారైతే కేంద్రాన్ని నిలదీసి.. అవసరమైతే పోరాడి పోలవరం పనులను ఆగకుండా చేయాలి కానీ. పట్టుదలతో పని చేస్తున్న వ్యక్తిపై బురద జల్లడం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.