కేసీఆర్ కావాలనే వంటేరును టార్గెట్ చేసారు

  కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని ప్రభుత్వం వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సంఘం వారి బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. పోలీసులు తమ నిష్పక్షపాతాన్ని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే అర్హత ఉందన్నారు. కేసీఆర్ కావాలనే వంటేరును టార్గెట్ చేశారని దుయ్యబట్టారు.తనపై పోటీచేస్తున్న అభ్యర్థిని బెదిరిస్తూ భయానక వాతావరణం సృష్టించడం తగదన్నారు.అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందా? లేక కల్వకుంట్ల చట్టం అమల్లో ఉందా?  అని ప్రశ్నించారు.  వంటేరుపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు.

ఓడిపోతే పారిపోతావ్.. కొడంగల్ దత్తత తీసుకుంటావా?

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తెరాస ప్రభుత్వం, కేసీఆర్,కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. కొడంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ప్రజలతో చర్చించాకే గతంలో ప్రభుత్వాలను రద్దు చేసేవారని తెలిపారు.  ప్రభుత్వ రద్దు గురించి ప్రజలకు వివరించాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని, కానీ కేసీఆర్‌కు రాజ్యాంగం అంటే చులకన భావం ఉందని ఆరోపించారు.  కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కుటుంబసభ్యుల ఆస్తులు పెంచుకోవడం కోసం కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. 52 నెలల పాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలపై కేసీఆర్‌ ఏనాడూ ఆలోచన చేయలేదని రేవంత్‌ తెలిపారు. ప్రస్తుతం తెరాస కూటమి, ప్రజాకూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొడంగల్‌ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరేనని మండిపడ్డారు. రైల్వేలైన్‌ దస్త్రాన్ని తొక్కిపెట్టి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. కొడంగల్‌ కనీస అభివృద్ధికి కూడా సహకరించలేదని ధ్వజమెత్తారు. ఓడిపోతే పారిపోయే కేటీఆర్‌.. కొడంగల్‌ను దత్తత తీసుకొని ఏం చేస్తారని ప్రశ్నించారు. కొడంగల్‌లో తాను ఉన్నత వరకూ ఇటు వైపు ఎవరూ చూసే సాహసం కూడా చేయరని స్పష్టం చేశారు. రేపు కోస్గిలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారానికి వస్తున్నారని, ఆయన రావడం అభివృద్ధికి సూచిక అని రేవంత్‌ అన్నారు. రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. మన కాంగ్రెస్‌ వస్తే మన ప్రభుత్వం వస్తుందని,ఆ‌ ప్రభుత్వంలోనే ఆత్మగౌరవం, సామాజికన్యాయం ఉంటాయని రేవంత్‌ అన్నారు.

మేము పూజలు చేసుకుంటే మీకేం బాధ

  ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన నరేంద్ర మోదీ.. కేసీఆర్ పూజల గురించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన కేసీఆర్.. ‘మేము పూజలు చేసుకుంటే మీకెందుకు బాధ’ అంటూ ఘాటైన సమాధానం ఇచ్చారు. తనకు దేవుడంటే నమ్మకమని అందుకే పూజలు, హోమాలు చేసుకుంటున్నానని అన్నారు. తాను నిజామాబాద్‌కు తాగునీరు, సాగునీరు అందించలేదని ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. నిజామాబాద్‌లో తాగునీరు, విద్యుత్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే మోదీ రావాలి.. నిజామాబాద్‌లో తేల్చుకుందాం అని సవాల్‌ విసిరారు. మోదీ రమ్మంటే తాను మహబూబ్‌నగర్‌ నుంచి హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌కు వస్తానని, ఎక్కడ సమస్య ఉందో ప్రజలముందే తేల్చుకుందామన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎవరికీ భయపడబోనన్నారు. మోదీకి ఎవరు స్క్రిప్ట్‌ రాసిచ్చారో గాని ఆయనంత తెలివితక్కువ ప్రధానిని చూడలేదని వ్యాఖ్యానించారు. 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించిన చరిత్ర టీఆర్ఎస్‌ది అని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఇంతమంది ఏకం కావాలా?’ అని వ్యాఖ్యానించారు. వీటిన్నంటినీ గమనించి ఎవరు ఎటువైపు ఉంటారో ప్రజలే ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎందుకు ఇవ్వలేదని  ప్రశ్నించారు.  18 రాష్ట్రాలలో బీజేపీ అధికారం ఉందని కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు.  దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉందని, పాలకుల నిర్లక్ష్యం వల్ల నీరంతా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పోయి ఫెడరల్‌ ఫ్రంట్‌ రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ వాళ్లు వచ్చి బీజేపీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందంటున్నారు. మోదీ వచ్చి కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలిసిందంటున్నారు. వారి విమర్శలన్నీ పచ్చి అబద్ధం.. మాకెవరితో పొత్తులేదు. అన్నిస్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

వైఎస్‌ పొలాలు దోపిడీ.. చంద్రబాబు కాల్పులు

  కోనసీమ నీళ్లు ఒకప్పుడు కొబ్బరినీళ్లలా ఉండేవి, ఇప్పుడు కలుషితమై ఉప్పునీరులా మారిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన వివిధ అంశాలపై అటు చమురు సంస్థలు, ఇటు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. చమురు సంస్థల అన్వేషణ వల్ల కోనసీమలో పర్యావరణం దెబ్బతింటోందని పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అంబానీలను రాష్ట్రానికి పిలిచి కోనసీమకు అండగా ఉండాలని కోరతానని అన్నారు. మిగతా పార్టీల్లా పార్టీఫండ్‌ ఇస్తే లొంగిపోయే పార్టీ జనసేన కాదని, ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రకృతి వనరులను దోచుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. రైతులకు జనసేన అండగా ఉంటుందన్నారు. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆవేదన చెందారు. రైతుల కన్నీళ్లు చూడలేకే రాజకీయాల్లోకి వచ్చాను, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్‌ఈజెడ్‌ల పేరుతో పొలాలు దోచుకుని రైతులను రోడ్డున పడేశారు. చంద్రబాబు హయాంలో బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరపడం కలచివేసింది. ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశామని, రోడ్ల కోసం ఊళ్లను తీసేయడం రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. అవినీతి, దోపిడీని అరికట్టాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రైతుల కష్టాలను తీర్చడం లో జనసేన అగ్రతాంబూలం ఇస్తుందన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని, వినడానికి వచ్చానని ఆయన పేర్కొన్నారు.

అక్కడ ప్రచారం చేయాలి అంటే సంతకం పెట్టాలి

  ఎన్నికలు వచ్చాయి అంటే ప్రజాప్రతినిధులతో గ్రామాలు కళకళలాడుతూ ఉంటాయి. హామీలతో ఓటర్లని ప్రలోభ పెడుతుంటారు. గెలిచిన తర్వాత మళ్ళీ ఆ గ్రామస్తుల మొహం కూడా చూడరు. ఏళ్ళు గడిచాయి ఎన్నాళ్లని ఆ గ్రామస్తులు మాత్రం అలానే నమ్ముతారు. ఇప్పుడు అందరు చైతన్య వంతులు అయ్యారు. ఒకప్పుడు ప్రజాప్రతినిధి అంటే ఆయనేదో దేశానికి రాజు అయినట్టు నెత్తి మీద పెట్టుకొని చూసుకునే వారు. కాలం మారింది వాళ్ళు కూడా మనలా సాధరణ వ్యక్తులే మన దయా దాక్షణ్యాల వల్లే బ్రతుకుతూ మనల్నే అణగదొక్కుతున్నారు అనే భావన మొదలయ్యింది. హామీలు నెరవేర్చకుంటే మొహం మీదే అడిగేస్తున్నారు. ప్రచారం చేయటానికి గ్రామంలోకి అడుగు కూడా పెట్టనివ్వటంలేదు. తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామస్తులు ప్రచారానికి వచ్చిన బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి కొయ్యల హేమాజీ ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.  ప్రచారానికి వచ్చే అభ్యర్థులు రోడ్డు, తాగు, సాగునీరు కల్పించాలని బాండ్‌ పేపర్‌పై హామీ ఇవ్వాలని, లేని పక్షంలో గ్రామంలోనికి రానివ్వమని గ్రామస్థులు తేల్చిచెప్పారు. దీంతో తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఏమాజీ కోరారు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే నమ్ముతామని ప్రజలన్నారు. చేసేదేంలేక బీటీ రోడ్డు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడతానని వంద రూపాయల ప్రామిసరీ నోటుపై ప్రజల సమక్షంలో సంతకం చేశారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేపట్టారు. అభ్యర్థులు ఎవరు గ్రామానికి వచ్చినా ఇలాగే స్పష్టమైన హామీ తీసుకుంటామని గ్రామస్తులు తెలిపారు.

ప్రమాదంలో అభిమాని.. స్పందించని జనసేనాని

  మితిమీరిన అభిమానం ప్రమాదమని పెద్దలు చెప్తున్నా వినకుండా.. కొందరు హీరో మీదనో, నాయకుడి మీదనో అభిమానం పెంచుకుంటారు. చివరికి ప్రాణం మీదకు తెచ్చుకొని తల్లిదండ్రులకు బాధను మిగుల్చుతారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇటీవల దేవరపల్లిలో పవన్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేటకి చెందిన మనోహర్ అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అయితే ర్యాలీలో ప్రమాదవశాత్తు మనోహర్ కిందపడగా అతనిపై నుంచి మరో బైక్ దూసుకుపోయింది. తీవ్రగాయాలపాలైన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా కిడ్నీ తొలగించారు. ఈ ఘటనపై మనోహర్ తండ్రి మొళ్ల వీరబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కుమారుడి స్నేహితులు కొవ్వూరు సభలో పవన్‌ కళ్యాణ్ కు నా కుమారుడి ప్రమాద ఫొటోలు చూపించారు. అయితే ఆయన మనోహర్‌ ఎలా ఉన్నాడని కూడా అడగలేదు. దీంతో రూ.5 లక్షలు అప్పు చేసి బిడ్డను కాపాడుకున్నా. తాజాగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. మరింత డబ్బు అవసరం అవుతుంది. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలోనే ఉంటున్నాం. నా బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటా అని వేడుకున్నారు. మరి ఈ తండ్రి బాధ చూసైనా పవన్ స్పందిస్తారేమో చూడాలి.

పోలీస్ వాహనానికి టీఆర్ఎస్ జెండా

  అధికార టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే పోలీసు వాహనానికి టీఆర్ఎస్ జెండా కట్టిన ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చెల్‌ చేస్తుంది. కాగా దీనిపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ స్పందించారు. కొంతమంది కావాలని, పనిగట్టుకొని సోషల్‌ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్నారని, అది మంచి పద్దతి కాదని తెలిపారు. పోలీసులు ప్రజల రక్షణకు, శాంతి భద్రతల పరిరక్షణకు పనిచేస్తున్నారని, పార్టీలకోసం కాదని స్పష్టం చేశారు. ఈ నెల 23న ఉప్పల్‌ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ సభకు పెట్రోలింగ్ కి వాహనం వెళ్లిందని, రోడ్డుపక్కన కారును ఆపి సిబ్బంది లా అండ్‌ ఆర్డర్‌ పనిలో నిమగ్నమై ఉన్నారు. అదేసమయంలో టీఆర్ఎస్ ప్రచారానికి వచ్చిన ఒక వ్యక్తి కావాలని అక్కడే ఉన్న పోలీస్‌ వాహనానికి టీఆర్‌ఎస్‌ జెండాను కట్టి తన ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేశాడు. ఆ తరువాత జెండాను తొలగించి అక్కడి నుంచి పారిపోయాడని మహేష్‌ భగవత్‌ వివరించారు. ఫొటోను దగ్గరగా పరిశీలిస్తే మనకు విషయం అర్థమవుతుందన్నారు. ఇలా కావాలని పోలీసులను టార్గెట్‌ చేసి ఒక పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుష్ప్రచారం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. పోలీసు వాహనానికి జెండా కట్టింది ఎవరో, ఆ ఫోటోని సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేశారో.. తదితర విషయాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. నిందితులను పట్టుకొని, పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన వివరించారు. వాహనానికి జెండా కట్టిన సమయంలో డ్రైవర్‌ అక్కడ లేకపోవడంతో ఈ తప్పిదం జరిగిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న ఎంఐఎం

  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మజ్లీస్ పార్టీ టీఆర్ఎస్ కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. మజ్లీస్ అభ్యర్థులు పోటీ చేసే నియోజకర్గాల్లో తప్ప రాష్ట్రంలోని మిగతా అన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకే ఆ పార్టీ కార్యకర్తలు, సపోర్టర్లు మద్దతిస్తున్నారు. అయితే ఒక్క నియోజకవర్గంలో మాత్రం మజ్లీస్ టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులో గల నియోజకవర్గం ముథోల్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మరోసారి పోటీకి దిగుతుండగా కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ బరిలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కు మద్దతిస్తున్న ఎంఐఎం పార్టీ ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రావు పటేల్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మజ్లీస్ పార్ట జిల్లా అధ్యక్షుడు జబీర్‌ అహ్మద్‌ ఓ ప్రకటన జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలోని బైంసా పట్టణంలో జరిగిన మైనారిటీ సమావేశంలో జబీర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రావు గత నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యేగా వుండి నియయోజవర్గానికి, మైనారిటీలకు చేసిందేమీ లేదన్నారు. అందువల్లే అతడికి మద్దతివ్వడం లేదని ఆయన తెలిపారు. నిస్వార్థపరుడైన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రావు పటేల్ కు మద్దతుగా మజ్లీస్ కార్యకర్తలు పనిచేయాలని జబీర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడంతో ఆ నియోజకర్గంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలే  మారిపోయాయి.  సదరు నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీకి ఈ నిర్ణయం తీవ్ర నష్టం చేస్తుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బాలసాయిబాబా కన్నుమూత

  ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. 1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి 18 ఏళ్లకే తొలి ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు. తనను తాను బాబాగా చెప్పుకునే బాలసాయి ఏటా శివరాత్రి రోజున నోటిలో నుంచి శివలింగాల్ని తీసేవారు. దీంతో అంతటా ఆయన ప్రాచుర్యం పొందారు. దేశవిదేశాల్లో ఆయనకు శిష్యులు, భక్తులు ఉన్నారు.

సుహాసిని కోసం ఏపీ మంత్రి ప్రచారం

  టీడీపీ తరుపున కూకట్ పల్లి అభ్యర్థిగా బరిలోకి దిగిన నందమూరి సుహాసిని ప్రచారం ముమ్మరం చేశారు. కాగా ఆమె ప్రచారం కోసం ఏపీ మంత్రి తెలంగాణ రానున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో కూకట్‌పల్లి నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నందమూరి సుహాసిని తరపున కేపీహెచ్‌బీలోని ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే రోడ్‌ షోలో మంత్రి పాల్గొననున్నారు. అందుకోసం నందమూరి, పరిటాల యువశక్తి ఏర్పాట్లు చేస్తోంది. కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌, మోతీనగర్‌, బాలానగర్‌, ఓల్డ్‌బోయిన్‌పల్లి ప్రాంతాల్లో ప్రచారం ఉంటుంది. మరోవైపు ఈనెల 29 అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కూకట్‌పల్లిలో సుహాసిని తరుపున ప్రచారం చేయనున్నారు.  సినీ నటుడు, టీడీపీ ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నాలుగు రోజుల పాటు కూకట్ పల్లి సహా మహాకూటమి తరుపున పలు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ప్రచారం చేస్తానని బాలయ్య టీడీపీ నేతలకు హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఎన్నికల సంఘానికి కొత్త కమీషనర్ గా సునీల్

  ఓ వైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. డిసెంబర్ 11 న ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ మారబోతున్నారు. ప్రస్తుతం సీఈసీ గా విధులు నిర్వహిస్తున్న ఓపీ రావత్ పదవీకాలం వచ్చే నెల రెండున ముగియనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త ప్రధాన కమీషనర్ గా సునీల్ అరోరా ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. రావత్ పదవీ విరమణ రోజునే అరోరా కొత్త సీఈసీ గా బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి సునీల్ అరోరా 2017 సెప్టెంబర్ లో ఎలక్షన్ కమిషన్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో బ్రాడ్ కాస్టింగ్, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

తెలుగులో మోడీ ట్వీట్‌

  బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరపున మోడీ ప్రచారం చేయనున్నారు. కాగా తెలంగాణలో పర్యటనపై మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. ట్విట్టర్లో "నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ  మన  తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను...  మొదటగా నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్ నగర్ లో మీతో నా భావాలు పంచుకొంటాను..." అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో "రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను..." అని తెలుగులో ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచారు.    

టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి

  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా మహ్మద్‌ సయ్యద్‌ త్వరలో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ఈమేరకు అమరావతిలో నిన్న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కలిశారు. పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈయన కడప నగరానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రహంతుల్లా తనయుడు. రహంతుల్లా నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాన అనుచరుడు. 1976-82 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన తనయుడిగా 2000లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన అహ్మదుల్లా మొదట మున్సిపల్‌ చైౖర్మన్‌గా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున కడప అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. 2009లోనూ గెలుపొంది వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నారు. తన కుమారుడు అష్ర్‌ఫను రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కడప నియోజకవర్గంలో 1994 నుంచి ముస్లిం అభ్యర్థులనే ప్రజలు గెలిపిస్తున్నారు. దీంతో టీడీపీ కూడా ముస్లిం అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అహ్మదుల్లాకు టీడీపీ అధిష్ఠానం నుంచి పిలుపందిందని సమాచారం.

కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

  గజ్వేల్‌లో పోలీసులు, ఎన్నికల అధికారులు తెరాసతో కుమ్మక్కయ్యారంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సచివాలయంలో సీఈఓ రజత్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పోలీసుల తీరుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేశారు. కొంపల్లిలోని ప్రతాప్‌రెడ్డి కుమారుడు విజయ్‌రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నగదు, మద్యం భారీగా ఉందని ఎన్నికల అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారని, వారి ఆదేశాల మేరకు ఇంట్లో సోదాలు చేసేందుకు వచ్చామని పోలీసులు వివరించారు. ఇంట్లో ఎవరూ లేరని, లోపలకు రావద్దని ఎంతచెప్పినా వినిపించుకోకుండా తనిఖీలు చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. సోదాల్లో నగదు, మద్యం దొరకలేదు. అంతలో అక్కడకు చేరుకున్న ప్రతాప్‌రెడ్డి పోలీసుల తీరుకు నిరసనగా ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. రెండుమూడు రోజులుగా పోలీసులు తనను వెంటాడుతున్నారని ప్రచారం చేసుకోవడానికి కూడా వెళ్లలేకపోతున్నానని వివరించారు. వంటేరు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొందని తెలియడంతో కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోదా చేసినట్లు సమాచారం.

హరీష్ రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా?

  రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజా చైతన్య సభలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను గెలుపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని స్వయంగా కేసీఆరే అన్నారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కేసీఆర్‌ ఏం న్యాయం చేశారని రేవంత్‌ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేతో ఏం సాధించారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల వివరాల కోసం ఒక్క కాలమ్‌ కూడా అందులో కేటాయించలేదని.. పైగా, కుటుంబంలో కోళ్లు, కుక్కలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు అడిగారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులైన తలసాని, తుమ్మలకు మంత్రి మంత్రి పదవులు.. దానం నాగేందర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని దుయ్యబట్టారు. మందుపోసిన సంతోష్‌కు పదవి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క దొరైనా బలిదానం చేసుకున్నాడా? అని ప్రశ్నించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రాబందుల్లా పీక్కుతింటున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రపంచ చరిత్రలోనే స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన వారెవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కేసీఆర్‌ మాత్రం వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు, కేటీఆర్‌ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయన్నారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టాలని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల్ని లక్షాధికారులుగా మారుస్తామన్నారు.

సింహం సింగిల్ గా వస్తుంది: కేటీఆర్

  సోమాజిగూడలో తెరాస అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకూటమి మీద విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నాలుగు పార్టీలు ఒక వ్యక్తిని ఓడించేందుకు కలిశాయంటే.. ఎవరు బలవంతులో అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజాకూటమి పొరపాటున గెలిస్తే నెలన్నరకో సీఎం మారతాడని ఎద్దేవా చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు డబ్బా ఇళ్లు కట్టిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించిందని అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని.. అయితే సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని అన్నారు. పేదవారికి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. కూటమిలో సీఎంను నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి నిర్ణయించాలని.. అదీ సీల్డ్‌ కవర్‌లోనని విమర్శించారు. తెలంగాణకు సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా?.. లేదా తెలంగాణ మట్టిలో పుట్టిన సింహంలాంటి కేసీఆర్‌ సీఎం కావాలా? ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్‌ కోరారు.

విశ్వేశ్వర్‌రెడ్డికి మతిస్థిమితం లేదు

  టీఆర్ఎస్ నేతలపై ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఖండించారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ,నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా జితేందర్‌ రెడ్డి , ఎంపీ కేకే టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు ఎంపీలు,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై జితేందర్‌ రెడ్డి స్పందించారు. మంత్రి మహేందర్‌ రెడ్డితో విభేదాలు ఉండటం వల్లే విశ్వేశ్వర్‌ రెడ్డి టీఆర్ఎస్ ను వీడారని జితేందర్‌ రెడ్డి తెలిపారు. రాజకీయం సరిగా రాదని, తానొక వ్యాపారవేత్తనని ఆయనే తన రాజీనామా లేఖలోనే పేర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సీఎం కేసీఆర్‌ను విమర్శించడం, కుటుంబ పాలన చేస్తున్నారని అనడం, తన సొంత నిర్ణయాలను తెరాస ఎంపీలపై రుద్దుతారంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తనతో పాటు ఎంపీ కేకే అసంతృప్తితో ఉన్నామని చెప్పడంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. విశ్వేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీలో కేసీఆర్ తమకు సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు. ఇక, ఏ ఎంపీ కూడా టీఆర్ఎస్‌ను వీడబోరని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించి విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మరి విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన జితేందర్‌ రెడ్డి పార్టీలో చేరతారా లేదో చూద్దాం..!!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌,బీజేపీలకు వైసీపీ మద్దతు

  గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నకరికల్లు వద్ద ఐదు దశల్లో చేపట్టనున్న గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి తొలిదశ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గోదావరి-పెన్నా అనుసంధానం.. నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉపకరిస్తుందని, గుంటూరు జిల్లాలో తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరవు అనేదే ఉండదని చంద్రబాబు వివరించారు. పంచనదుల మహా సంగమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో 65శాతం పనులు పూర్తయ్యాయని, గ్రావెటీ ద్వారా నీళ్లు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతిగా కలిసుండాలని తాను అంటుంటే కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసునని,ఆయనకు టీడీపీనే రాజకీయ జీవితం ఇచ్చిందన్నారు. గతంలో తన అనుచరుడుగా ఉన్న కేసీఆర్‌ తనను తిడుతుంటే బాధేసిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రి, పగలు కృషి చేశానని, మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డ, ఎయిర్ పోర్టు, ఇంకా ఎన్నో సంస్థలు నగరంలో ఏర్పాటు కావడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీలకు వైసీపీ పరోక్ష మద్దతు ఇస్తోందని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఓడిపోయి ప్రజాకూటమి గెలిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని కూడా ఈ సందర్బంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ పూర్తిగా దెబ్బతీశారని, ఆర్బీఐని కూడా వదలిపెట్టలేదని మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలుగుజాతి కోసం శత్రవుతో చేతులు కలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. దేశంలోని అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతున్నామన్నారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న వారిపై కేంద్రం ఐటీ, ఈడీ దాడులు చేస్తోందని ఆయన విమర్శించారు. మోదీ నోట్లు రద్దు చేసి దేశాన్ని భ్రష్టుపట్టించారని, కేంద్రం ప్రభుత్వానికి అసహనం పెరిగిందని చంద్రబాబు విమర్శించారు.

50 వేలు తగ్గితే రాజీనామా

  హుజూర్‌నగర్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించి నిరాశ చెందిన అల్లం ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు చిలకరాజు అజయ్‌కుమార్ తదితరులు పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ ప్రజలపై తనకు ఎంతో విశ్వాసం ఉందని, 50వేల మెజార్టీతో గెలుపొందుతానన్న నమ్మకం ఉందన్నారు. మెజార్టీ తగ్గితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీఆర్‌ఎస్ నేతలకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలోని మట్టపల్లి క్షేత్రం కేంద్రంగా వేయి కోట్లతో టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. నాగార్జునసాగర్‌ టూరిజం ప్రాజెక్ట్‌ను తలదన్నేలా మట్టపల్లి ప్రాంతాన్ని సుందర రూపంగా తీర్చిదిద్దుతానన్నారు.హుజూర్‌నగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మంత్రి చెంచాలు, అనుచరులు, బంధువర్గం పేరుతో దందా చేయాలని చూస్తే సహించరన్నారు. కలెక్టరేట్‌ భూముల కుంభకోణాల్లో నిందితులు ప్రజల మనసులను గెలవలేరన్నారు. కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్‌ నేతలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులు చిలకరాజు అజయ్‌కుమార్‌ లాంటి వ్యక్తులు కాంగ్రెస్‌లో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.