రేవంత్ రెడ్డి అరెస్ట్..కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

  రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా..అరెస్ట్‌కు నిరసనగా జడ్చర్లలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జడ్చర్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లు రవి, డీసీసీ అధ్యక్షులు ఓబుదుల్లా కోత్వాల్‌, తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్‌ రాజేందర్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డిని చూసేందుకు అనుమతించాలని పోలీసులతో మల్లురవితోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. రేవంత్‌ అరెస్టుకు నిరసనగా ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసీఆర్ సభకి వెళ్లేందుకు నాకూ అనుమతివ్వండి: రేవంత్ భార్య

  ఈరోజు తెల్లవారుజామున కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ భార్య గీత బయల్దేరిన సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది ఎవరో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రేవంత్ ఎక్కడున్నాడో చెప్పాలని నిలదీశారు. రేవంత్‌ను పోలీసులే అరెస్ట్‌ చేశారా? మరెవరైనా అరెస్ట్‌ చేశారా అని పోలీసులను ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు కేసీఆర్ సభ ఎలా నిర్వహిస్తారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆమె ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ.. సభకు అనుమతులున్నాయని చెప్పారు. అయితే సభకు వెళ్లేందుకు తనకు కూడా అనుమతినివ్వాలని ఆమె పోలీసులను కోరారు. తెల్లవారుజామున 3గంటలకు బెడ్‌రూం లోపలికొచ్చి దొంగను ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళితే చూస్తూ ఊరుకోవాలా అని రేవంత్ భార్య గీత పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి ఎక్కడికి తరలించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటలుగా ఓపికగా ఉన్నామని.. కుటుంబసభ్యులతో పాటు రేవంత్‌ అనుచరులు, అభిమానుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే తాము కొరుకుంటున్నామని గీత చెప్పారు. రేవంత్‌ను తీసుకెళ్లింది పోలీసులో కాదో తామెలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. స్థానిక పోలీసులైతే హెల్మెట్లు పెట్టుకుని ఎందుకు వస్తారన్నారు. గుర్తింపు కార్డులు, అరెస్ట్‌ వారెంట్ కూడా చూపించకుండా రేవంత్‌ను తీసుకెళ్లారన్నారు. తీసుకెళ్లింది పోలీసులే అయినప్పుడు ఎక్కడున్నారో చెప్పడానికి ఇబ్బందేంటని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలంతా సంయమనంతో ఉన్నారని, రేవంత్‌ ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కుటుంబసభ్యులుగా రేవంత్‌ వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తమకు లేదా అని ప్రశ్నించారు. మరోవైపు.. కోస్గిలో టీఆర్ఎస్ సభను అడ్డుకుంటామని రేవంత్‌రెడ్డి ప్రకటించడంతోనే ముందస్తుగా ఆయన్ని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని వివరించారు. వికారాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలోనే రేవంత్‌ అరెస్ట్‌ జరిగిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో పోలీసుల అదుపులో సురక్షితంగా ఉన్నారని చెప్పారు.

ఇదే పరిస్థితి నీ కూతురికి వస్తే ఏం చేస్తావ్ కేసీఆర్

  కొడంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి.  హైదరాబాద్‌లో గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయం అన్నారు. స్థానికంగా కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేస్తుంటే నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారని... కానీ, సీఎం కేసీఆర్ సభ దృష్ట్యా బంద్ విరమించుకుని, కోస్గి బయట నిరసన చేపట్టాలని నిర్ణయించినా అరెస్టులు ఎందుకు చేశారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి బెడ్‌రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్ట్‌లు చేయడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘రేపు ఇదే పరిస్థితి నీ కూతురికి జరిగితే...ఎలా ఉంటుందో కేసీఆర్‌ ఆలోచించుకోవాలి’ అని కేసీఆర్‌ను జైపాల్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయొచ్చు కదా అని నిలదీశారు. ప్రభుత్వానికి తొత్తులుగా ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జగ్గారెడ్డి, వంటేరులాంటి నేతలకు స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్.. హైకోర్టులో పిటీషన్

  నేడు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభను అడ్డుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి జడ్చర్లకు తరలించారు. అయితే ఈ అరెస్ట్ ను కాంగ్రెస్ తో పాటు ప్రజకూటమిలోని మిగతా పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని మండిపడుతున్నారు. హౌస్ అరెస్ట్ చేస్తే సరిపోయేదానికి ఇలా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం ఏంటంటూ విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించి లంచ్‌మోషన్‌ పిటీషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు నుంచి ఏం తీర్పు రాబోతున్నదన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రేవంత్ రెడ్డి అరెస్ట్.. కాంగ్రెస్ నేతలు ఫైర్

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా రేవంత్ రెడ్డి అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అర్థరాత్రి రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అరెస్ట్‌ చేశారని, టీఆర్‌ఎస్‌ అరాచక పాలనకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఓ పార్టీ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. కాంగ్రెస్‌ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని..కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి డి.కె.అరుణ చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. కొడంగల్‌లో ఎన్నికల కమిషన్‌ చోద్యం చూస్తోందని..  టీఆర్‌ఎస్‌ నేతలకు అనుగుణంగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు.  టీఆర్‌ఎస్‌ నేతల తీరును ప్రజలు హర్షించరని చెప్పారు. ఇలాంటి పాలనను తెలంగాణ బిడ్డలు కోరుకోరని, ఈ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ కు బుద్ధి చెబుతారన్నారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ప్రజస్వామ్యంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. తలుపులు పగులకొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. కేసీఆర్‌ వ్యవరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఈసీ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీతో ఈసీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. కేసీఆర్‌ ద్వారా లబ్ధిపొందిన అధికారులే ఇదంతా చేస్తున్నారని మధుయాష్కి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ పై సీపీఐ నేత నారాయణ కూడా స్పందించారు. రేవంత్‌‌రెడ్డి అరెస్ట్ ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే అని నారాయణ అన్నారు. కేసీఆర్‌ ఓటమి భయంతోనే అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలన నిజాం పాలనను తలపిస్తోందని నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత మోదీ ఆరెస్సెస్ క్యాంపునకు, కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన అన్నారు. కళ్లకు పొరలు వచ్చి కండకావరంతో మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ డబ్బు మదంతో గూండాయిజం చేస్తున్నారని వంటేరు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో గుడ్లగూబను నమ్ముకున్న ఓ అభ్యర్థి

  ఓ వైపు ప్రపంచం టెక్నాలజీలో నింగిలోకి దూసుకుపోతుంటే.. మరోవైపు కొందరు మాత్రం మూఢనమ్మకాలతో ప్రపంచాన్ని పాతాళంలోకి తీసుకెళ్తున్నారు. ఆ కొందరిలో ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలవడానికి కొందరు ఎంతకైనా దిగజారుతారు. సాధ్యం కానీ తప్పుడు హామీలతో మోసం చేస్తారు.. డబ్బుతో ఓట్లు కొంటారు.. కులాలు, మతాలు అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతారు. అబ్బే ఇవన్నీ చేసినా గెలిచేలా లేమని కొందరైతే ఏకంగా క్షుద్ర పూజలు నమ్ముకుంటున్నారు. తెలంగాణలో ఓ అభ్యర్థి ఓటమి భయంతో తన ప్రత్యర్థికి క్షుద్రపూజలు చేయించడానికి సిద్దమయ్యాడట. తాజాగా కర్ణాటకలోని సేడం పట్టణంలో ఇటీవల కొందరు వేటగాళ్లు రెండు గుడ్లగూబలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. విచారణలో వారు వెల్లడించిన విషయాలను విని.. అక్కడి పోలీసులు అవాక్కయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఈ గుడ్లగూబలు కావాలని తమను పురమాయించారని నిందితులు చెప్పారు. ప్రత్యర్థులకు కీడు జరిగేలా క్షుద్రపూజలు నిర్వహించి వీటిని బలిస్తారని పేర్కొన్నారు.

కారులో 5 కోట్లు

  ఎన్నికల వేళ పోలీసులు తనికీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా డబ్బు కనపడితే స్వాదీనం చేసుకుంటున్నారు. తాజాగా  ఈ తనిఖీల్లో భాగంగా వరంగల్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై జనగామ జిల్లా పెంబ‌ర్తి చెక్‌పోస్టు వద్ద రూ.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఏపీ 37 సీకే 4985 నెంబరు గల స్విఫ్టు కారును పెంబర్తి ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. దీంతో కారు వెనుక సీటు కింద దాచిన నగదు కట్టలను పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్టేషన్ లో ఎన్నికల అధికారుల సమక్షంలో పోలీసులు వాటిని లెక్కించారు. లెక్కించగా పట్టుపడిన మొత్తం డబ్బురూ.5 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది.

అర్ధరాత్రి అరెస్ట్.. రేవంత్ రెడ్డి ఎక్కడ?

  తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ కొడంగల్‌ నియోజవర్గంలోని కోస్గిలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించి సభని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై తెరాస నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌పై కేసు నమోదు చేశారు. బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రేవంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. మంగళవారం వేకువ జామున మూడు గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిగి వద్ద వాచ్‌మెన్‌ను వదిలివెళ్లారు.  పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని, తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని గీత కోరారు. రేవంత్‌ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కూడా తెలపడం లేదని గీత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన్ను జడ్చర్లకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జడ్చర్లలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది. మరోవైపు బొంరాస్‌పేట మండలంలోనూ పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ తప్ప ఏమీ కట్టలేదు

  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే టీడీపీ, కాంగ్రెస్‌ కలిశాయని, దేశం కోసం కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజాకూటమి పేదవాళ్ల కోసం ఏర్పాటు చేసిన కూటమని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జైల్లో పెడుతోందని విమర్శించారు. ఎక్కడ మీటింగ్‌లు పెట్టినా టీఆర్‌ఎస్‌కు తానే కనిపిస్తున్నానని, తనను విమర్శించడం తప్ప వారికి వేరే పనిలేదని ఆయన మండిపడ్డారు. బాగా పనిచేస్తున్నానన్న అసూయతో తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలుగువారి కోసం దూరదృష్టితో ఒక విజన్‌ ఇచ్చానన్నారు. ఆధునికమైన నగరానికి శ్రీకారం చుట్టామని, టీడీపీ కార్యక్రమాలను కాంగ్రెస్‌ కొనసాగించిందన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ తప్ప ఏమీ కట్టలేదని చంద్రబాబు విమర్శించారు. ట్యాంక్‌బండ్‌కు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్‌ అని అన్నారు. కేసీఆర్‌కు ఓట్లు లేవు కానీ.. డబ్బుల మూటలున్నాయని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్‌లో అన్ని స్థానాల్లో గెలుస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందని అన్నారు. ఈవీఎంలను కూడా ట్యాంపరింగ్‌ చేస్తారని సమాచారం ఉందని, డబ్బు, ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయతీగా ఓటేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తెలుగువారి మధ్య తాను చిచ్చు పెట్టడం లేదని చంద్రబాబు అన్నారు. తెలుగువారి అభివృద్ధి కోసమే తాను పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం లేకపోతే కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశంలో నెంబర్‌ వన్‌ కావాల్సిన తెలంగాణ అప్పులపాలైందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే రూ. 5 లక్షలతో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని, సంవత్సరానికి 6 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మాపై కోపమున్నా ఈ సారికి గెలిపించండి: తుమ్మల

  ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన పలువురు టీఆర్ఎస్ నేతలకు నిరసన సెగలు ఏ రేంజ్ లో తగిలాయో తెలిసిందే. నిరసన సెగ తగిలిన వారిలో అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ముందు వరుసలో ఉంటారు. ప్రచారానికి వెళ్లిన పలు గ్రామాల్లో ప్రజలు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో ఈసారి ఆయన గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కూడా ఆయన గెలుపు కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా తాటి వెంకటేశ్వర్లుకు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. 'నాపై, ఎమ్మెల్యే అభర్థి తాటిపై, ఎంపీ పొంగులేటిపై కోపం, అసహనం ఉన్నా.. ఎన్నికల తర్వాత చూపించాలన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఆ కోపాన్ని ప్రదర్శించొద్దని.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నాక కూర్చుని మాట్లాడుకుందాం' అని తుమ్మల వ్యతిరేక వర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. జిల్లా ప్రజల కోసం తన 32 ఏళ్ల రాజకీయ జీవితాన్ని త్యాగం చేసానని అన్నారు. కాబట్టి నాకోసమైనా తాటి వెంకటేశ్వర్లును గెలిపించాలని కోరారు. భారీ మెజారిటీతో కాకపోయినా ఐదు లేదా పదివేల మెజారిటోనైనా గెలిపించాలని తుమ్మల కోరారు. మరి తుమ్మల కోరికను ప్రజలు ఎంతవరకు మన్నిస్తారో చూడాలి.

కేసీఆర్‌ అంటే.. కావో కమీషన్‌ రావ్‌

  గద్వాలలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియమాకాలపై కలలుగన్నారు. ఆ కలలను కేసీఆర్‌ కూల్చివేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో మోసం చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్‌ రూ.10వేల కోట్లతో డీపీఆర్‌ చేస్తే.. టీఆర్ఎస్ దాన్ని రీడిజైన్‌ పేరుతో రూ.60వేల కోట్లకు పెంచింది. కాంట్రాక్టులకు దోచిపెట్టారు. కేసీఆర్‌ అంటే.. కావో కమీషన్‌ రావ్‌ అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డిని రెండు దశల్లో పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ధనిక రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు అప్పుల పాలైంది. ప్రతి కుటుంబంపై ఇప్పుడు లక్ష రూపాయలు చొప్పున అప్పు ఉంది. అదే సమయంలో కేసీఆర్‌ కుటుంబంలో ఒక్కొక్కరూ రూ.400 కోట్లు చొప్పున వెనకేసుకున్నారు. తెలంగాణలో 30 లక్షలమంది ఉపాధి కోసం ఎదురుచూస్తుంటే.. గత నాలుగున్నరేళ్లలో ఎవరికైనా ఉద్యోగం కల్పించారా? లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా వారిని విద్యకు దూరం చేశారు. బంగారు తెలంగాణ అని మనం కలలు కంటే.. బంగారు కుటుంబం ఆవిర్భవించింది అని మండిపడ్డారు. ఆదివాసీలు, రైతులను కేసీఆర్‌ మోసం చేశారు. ప్రజలకు ఇళ్లు ఇవ్వరా? ప్రజల బాధలను పట్టించుకునే మనసే ఉంటే ఇళ్లు కట్టించి ఉండేవారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ కలను మేం నెరవేరుస్తాం. ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు ఇస్తాం. పింఛన్లు రద్దైన వారికి పునరుద్ధరిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేలు భృతి ఇస్తాం. రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యకు కేటాయిస్తాం. ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడతాం. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు‌ ఇస్తాం అని రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు.

జగన్‌ దాడి కేసు.. ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరిన కోర్టు

  వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్ పోర్ట్ లేదా, ఎయిర్ క్రాఫ్ట్ లో అఫెన్స్ జరిగితే విచారణ ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు.వాదనలు విన్న కోర్టు.. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని, కేసు విచారణను ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించింది. ఈ కేసును ఎన్‌ఐఏకు ఎందుకు బదిలీ చేయలేదో వివరణ ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

లగడపాటి సర్వే.. తెలంగాణలో గెలిచే మూడో అభ్యర్థి ఇతనే

  లగడపాటి రాజగోపాల్‌ సర్వేకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన్ని ఆంధ్రా ఆక్టోపస్‌ అని కూడా అంటుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సర్వే కోసం తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లగడపాటి మాత్రం ఆయన సర్వే ఫలితాలను పోలింగ్ జరుగు తేదీ అనగా డిసెంబర్ 7 సాయంత్రం ప్రకటిస్తానని తెలిపారు. సర్లే ఎన్నికల ఫలితాలకు కనీసం మూడు రోజులు ముందైనా ఫలితాల మీద ఒక అవగాహన వస్తుందిగా అనుకుంటుంటగా.. లగడపాటి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి ఇండిపెండెంట్లు 8 నుంచి 10 మంది గెలుస్తారన్నారు. అంతేకాదు గెలిచే ఇద్దరి పేర్లు కూడా చెప్పారు. వారిలో ఒకరు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట అభ్యర్థి  శివకుమార్‌రెడ్డి కాగా.. మరొకరు ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ అభ్యర్థి జాదవ్ అనిల్‌ కుమార్. ఇలా రోజుకి ఇద్దరి పేర్లు చెప్తా అన్నారు. టీఆర్ఎస్ మాత్రం లగడపాటి సర్వేని వ్యతిరేకిస్తూ విమర్శలు చేసింది. ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. మరి ఏమైందో ఏంటో తెలీదు కానీ లగడపాటి తన సర్వే ప్రకారం గెలిచే మిగతా ఇండిపెండెంట్ల పేర్లు చెప్పలేదు. అయితే తాజాగా లగడపాటి ఓ కాంగ్రెస్ అభ్యర్థికి ఫోన్ చేసి తన సర్వే ప్రకారం నియోజకవర్గంలో నీకే గెలుపు అవకాశాలున్నాయని చెప్పారట. కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్‌ చేసి తను చేసిన సర్వే వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. చిన్న వయస్సులోనే పెద్ద ఫాలోయింగ్‌ సంపాదించావు.. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నావు.. ఇది ఎలా సాధ్యమయిందని లగడపాటి మేడిపల్లిని అడిగారట. తాను చేసిన సర్వే వివరాలతోపాటు, ఈ ఎన్నికల్లో మేడిపల్లికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది తెలిపారట. దీంతో మేడిపల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. దీన్ని బట్టి చూస్తుంటే లగడపాటి సర్వే ప్రకారం గెలిచే మూడో అభ్యర్థి మేడిపల్లి సత్యం అనమాట అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే కాల్చిపారేయండి

  ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మద్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం లో పోలింగ్ జరిగింది. ఇక ఈ నెల 7న తెలంగాణ, రాజస్థాన్ లో పోలింగ్ జరగనుంది. అయితే మద్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాంల ఫలితాలు కూడా ఈ నెల 11 నే వెలువడనున్నాయి. దాంతో ఈవీఎం ల వద్ద గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈవీఎంలను కౌంటింగ్ దాకా రక్షించడం కత్తిమీద సాము వంటిది. ప్రత్యర్థులు, సంఘవిద్రోహ శక్తులు ఇలా ఎంతోమంది ఈవీఎంలను ఎత్తుకెళ్లడమో లేదా వాటిని ధ్వంసం చేయడమో చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈవీఎంల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత, ఈవీఎంల భద్రతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. రీవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి సంచలన ఆదేశాలు జారీచేశారు. ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే కాల్చిపారేయాలని ఆదేశించారు. భోపాల్ లోని ఓ స్ట్రాంగ్ రూమ్ లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పని చేయక పోవడంపై ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేసాయి. ముఖ్యంగా ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ నేత అభయ్ మిశ్రాతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ లను పరిశీలించిన ఆమె, ఈవీఎంలు భద్రంగానే ఉన్నాయని అన్నారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అపరిచితులు తిరిగినా, గందరగోళం జరిగినా, పరిమిషన్ లేకుండా ఈ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, 11వ తేదీ వరకూ అనుక్షణం ఈవీఎంలను కాపాడతామని తెలిపారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లో రక్షణ సిబ్బందిని పెంచుతున్నామని అన్నారు. ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే వారిని కాల్చిపారేయాలని రక్షణ సిబ్బందిని ప్రీతి మైథిలి ఆదేశించారు.

నన్ను గెలిపిస్తే బాల్య వివాహాలు జరిపిస్తా

  బాల్య వివాహాలు రద్దు చేసినా, నేరమని తెల్సినా ఇంకా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఆటపాటలతో చదువుకోవాల్సిన వయస్సులో వివాహం పేరుతో పిల్లలని కష్టాల్లోకి నెట్టొద్దంటూ.. పిల్లల తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ పలువురు వారిని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం వారి స్వప్రయోజనాల కోసం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కొందరు నేతలకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు. ఓట్ల కోసం పిచ్చి పిచ్చి హామీలన్నీ ఇస్తుంటారు. రాజస్థాన్‌ ఎన్నికల బరిలో ఉన్న ఓ బీజేపీ మహిళా అభ్యర్థి కూడా అలాంటి పిచ్చి హామీనే ఇచ్చారు. ఆమెని గెలిపిస్తే దగ్గరుండి బాల్య వివాహాలు జరిపిస్తారట. రాజస్థాన్‌లోని సోజత్ నియోజకవర్గం నుంచి శోభ చౌహాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదివారం పీపాలియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తనను గెలిప్తే బాల్య వివాహాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తానని, పోలీసుల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిసినా ఆమె ఈ హామీ ఇవ్వడంతో వివాదాస్పదమైంది.  ఆమె వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేగా బరిలో ఉన్న వ్యక్తి ఇటువంటి దురాచారాలను ప్రోత్సహించడం ఏంటంటూ ప్రత్యర్థులే కాదు, నెటిజన్లు కూడా ఆమెపై దుమ్తెత్తి పోస్తున్నారు.

కొడంగల్ లో 144 సెక్షన్.. రేవంత్ రెడ్డి సవాల్

  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొండగల్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో చూపించాలి అనుకుంటుంటే.. మరోవైపు టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలీదు కానీ కొడంగల్ లో రాజకీయ వేడి రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరగడం కూడా కలకలం రేపింది. ఆ దాడుల్లో కోట్ల రూపాయిలు దొరికినా బయటకి చెప్పకుండా అధికారులు నిజాన్ని దాచిపెట్టారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస పరిణామాలతో వేడెక్కుతున్న కొడంగల్ ఇప్పుడు మరింత వేడెక్కనుంది. రేపు కేసీఆర్ కొండగల్ లో పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. తనపై కోపంతో కేసీఆర్ సర్కారు కొడంగల్ ను అభివృద్ధి చేయలేదేని.. కేసీఆర్ తన నియోజక వర్గానికి తీరని ద్రోహం చేశారని.. అందుకే కేసీఆర్ సభ జరగనీయబోమని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై టీఆర్ఎస్ మండిపడింది. ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఈసీ డీజీపీని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కొడంగల్ లో 144 సెక్షన్ విధించారు. అధికార పార్టీ ఎంతగా ధన, కండ బలాన్ని వినియోగించినా తాను లెక్కచేయబోనని, పోరాటం ఆపేదిలేదని.. తాను కొండను ఢీకొంటున్నానని, కొండగల్ ప్రజలు తనకు సహకారం అందించాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన కొండగల్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

అమీర్‌పేటలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ

  అమీర్‌పేట్‌లో నిన్న అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వీరారెడ్డి, సాంబశివ, కొలిశెట్టి శ్రీనివాస్ అమీర్‌పేట్‌లోని సిల్వర్ పార్క్ హోటల్లో వేర్వేరు గదుల్లో బస చేశారు. అర్ధరాత్రి వేళ అమీర్‌పేట్‌లోని లాడ్జి వద్దకు వచ్చిన కూటమి బలపర్చిన సనత్‌నగర్‌ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్ గౌడ్ గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతుండటాన్ని గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దాంతో అక్కడున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నలుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో టీడీపీ కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై అశోక్‌ను తోసివేశారు. సమాచారం తెలుసుకున్న గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీడీపీ నాయకులకు చెందిన రెండు కార్లతో పాటు.. వారు బస చేసిన హోటల్లోని మూడు గదుల్లో సోదాలు చేశారు. ఓ కారులో రూ.2 లక్షలు లభించగా.. మూడు గదుల్లో మరో 2 లక్షల 74 వేల రూపాయల్ని సీజ్ చేశారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు చెందిన అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు ఆధారాలైతే లభించలేదని, సరైన పత్రాలు చూపించకపోవడంతో టీడీపీ కార్యకర్తలకు చెందిన రూ.4.74 లక్షలను సీజ్ చేశామని చెప్పారు.

హైటెక్‌ సిటీని తీసేయాలి.. ఆ దమ్ము మీకుందా?

  ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్‌ కాలనీలో నిర్వహించిన రోడ్ షోలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. మీది లాటరీ. చంద్రబాబుది హిస్టరీ. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలనుకొంటే దునియాపై మూకుడు కప్పేయడమే. నగరంలో 15 ఏళ్ల క్రితమే రాళ్ల గుట్టలపై ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించి.. ప్రపంచ మేధావులను రప్పించిన ఘనత చంద్రబాబుది. ఆయన చరిత్రను చెరిపేయాలన్నా, పేజీలు చించేయాలన్నా హైటెక్‌ సిటీని తీసేయాలి.. ఆ దమ్ము మీకుందా? ఫ్లైఓవర్లు మాయం చేయాలి.. ఆ ధైర్యం మీకుందా? అని ప్రశించారు. రింగురోడ్డును అదృశ్యం చేయాలి. శంషాబాద్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టును తీసేయాలి. బిడ్డా.. తీసేసి చూడండి. చంద్రబాబు కట్టించిన స్పోర్ట్స్‌ సెంటర్లపై బట్టలు కప్పాలి.. కప్పి చూడండి అని వ్యాఖ్యానించారు. సైబరాబాద్‌ను సృష్టించింది చంద్రబాబేనని.. తెలంగాణలో భూస్వాములు, పెత్తందారులు, గడీల వ్యవస్థను రూపుమాపింది తెలుగుదేశమేనని గుర్తుచేశారు. ఎందరో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు, ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. అమరవీరులు, విద్యార్థుల త్యాగాలను గుర్తించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో రైతు రాజ్యం వస్తుందనుకొంటే రాబందుల రాజ్యం వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడంతోనే వందల మంది ఆత్మహత్యలు చేసుకొన్నారన్నారు. శేరిలింగంపల్లి టీడీపీకి కంచుకోటగా మారిందని, గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచి వలస వెళ్లిన నయవంచకులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. 'తెలుగుదేశం పార్టీ ఉండదని కొందరు కారు కూతలు కూస్తున్నారు. తెలుగుదేశం ఒక కులం కోసం పుట్టిన పార్టీ కాదు కూలిపోవడానికి.. మతం కోసం పుట్టిన పార్టీ కాదు మట్టిలో కలిసి పోవడానికి.. ధనదాహంతో పుట్టిన పార్టీ కాదు అడ్డదారులు చూసుకోవడానికి.. నాయకుల కోసం పుట్టిన పార్టీ కాదు వలస పోతే నట్టేట మునిగిపోవడానికి.. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున పుట్టింది తెలుగుదేశం పార్టీ’ అని బాలకృష్ణ ఉద్వేగభరితంగా మాట్లాడారు.

జగన్ కూడా లాలూప్రసాద్‌లా జైలుకే వెళ్తాడు

  అనంతపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసైనికులతో కవాతు నిర్వహించారు. గుత్తి రోడ్డులోని మార్కెట్‌యార్డు నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు యువతతో భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ప్రధానంగా టీడీపీ, వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. సీఎం కావాలని తానెప్పుడూ కలలు కనలేదన్నారు. రాజ్యాంగం తనకు ఆ అవకాశం కల్పించే సమయమొచ్చిందని చెప్పారు. జగన్‌ తనకు శత్రువూ కాదని, సీఎం చంద్రబాబు మిత్రుడూ కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మనల్ని ఏ కులమో, ఏ మతమో అని చూడకుండా ఆంధ్రులుగా చూసి తెలంగాణ నుంచి తన్ని తరిమేశారని అన్నారు. ఏపీ ప్రజలను తెలంగాణ నాయకులు దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల పనిమీద హైదరాబాద్‌లో ఉన్నారని, పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి రావాల్సిన కర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన జగన్‌ ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ నేరాలు చేశాడు. ఎప్పటికైనా లాలూప్రసాద్‌ యాదవ్‌లా జైలుకే వెళ్తాడు అని విమర్శించారు. అప్పట్లో చంద్రబాబు జనసేన సాయం అడిగారు. నేనేమీ ఆశించకుండా సహకరించా. రాష్ట్రాన్ని అవినీతిరహితంగా ఉంచాలని ఆయన్ను కోరా. నోట్లో వెన్నముద్ద పెట్టినా కొరకలేడని చెప్పే మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఇసుకను మింగేశారు. 2016లో అమరావతి రాజధాని నిర్మాణానికి భూముల కోల్పోతున్న రైతుల తరఫున చంద్రబాబును కలిసి భూసేకరణను ఆపాలని కోరాను. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గ రైతులకు జగన్‌ గుర్తుకు రాలేదు. పవన్‌ గుర్తుకొచ్చాడు. మళ్లీ ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ సాగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నా వద్ద ఆధారాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అధికారంలోకి రావు. 2019 నుంచీ 2021 వరకూ సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. యుద్ధానికి యువత సన్నద్ధంగా ఉండాలి అన్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నా గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. విజయనగరం వచ్చి ఆయన సంగతి తేలుస్తా. నేనేమంత మంచివాడిని కాదు అని హెచ్చరించారు. పవన్‌ బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు. నేనెప్పుడూ బీజేపీకి, మోదీకి భయపడను. ఆయన మహా అయితే కేసులు పెట్టి జైల్లో పెడతారు. మోదీ అంటే జగన్‌తోపాటు చంద్రబాబు, లోకేష్ కూ భయమే. వారంతా పాత దొంగలు. అందుకే భయపడుతున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో ముగ్గురే నాయకులున్నారు. వారిలో అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోయిన జగన్‌ ఒకరయితే మళ్లీ తనకు అధికారం ఇవ్వాలని అడిగే చంద్రబాబు మరొకరు. ఓట్లు వేయకపోయినా ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్‌ ఇంకొకరు. పంచాయతీ ప్రెసిడెంటు కూడా కాకుండా కొందరు సీఎం కావాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయకపోతే మాది జనసేన పార్టీయే కాదు. జనసేన అధికారంలోకి వస్తే విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పరుగెత్తుకొస్తారు. సీఎం, లోకేష్ మాదిరిగా నేను లంచాలడగను అని పవన్ విమర్శించారు.