హరీష్ రావు, కేటీఆర్ చర్చకు సిద్ధమా?
posted on Nov 26, 2018 @ 5:07PM
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తిమండలంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా చైతన్య సభలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు గెలిచినా, ఓడినా ఆయన జర్మనీలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కేవలం సెలవుల్లోనే ఆయన ఇక్కడకు వస్తారన్నారు. నిత్యం ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ను గెలుపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ అని స్వయంగా కేసీఆరే అన్నారని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 1569 అమరుల కుటుంబాలకు కేసీఆర్ ఏం న్యాయం చేశారని రేవంత్ ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేతో ఏం సాధించారని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల వివరాల కోసం ఒక్క కాలమ్ కూడా అందులో కేటాయించలేదని.. పైగా, కుటుంబంలో కోళ్లు, కుక్కలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు అడిగారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులైన తలసాని, తుమ్మలకు మంత్రి మంత్రి పదవులు.. దానం నాగేందర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని దుయ్యబట్టారు. మందుపోసిన సంతోష్కు పదవి ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో ఒక్క దొరైనా బలిదానం చేసుకున్నాడా? అని ప్రశ్నించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను రాబందుల్లా పీక్కుతింటున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రపంచ చరిత్రలోనే స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన వారెవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే అంశంపై అమరవీరుల స్తూపం వద్ద హరీష్ రావు, కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులు ఎక్కడికి పోయాయన్నారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 58 ఏళ్లు నిండిన భార్యా భర్తలకు ఒక్కొక్కరికి రూ.2వేలు చొప్పున పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల్ని లక్షాధికారులుగా మారుస్తామన్నారు.