టీడీపీ లేకపోతే కేసీఆర్‌ ఎక్కడ ఉండేవారో?

  ఎన్నికల ప్రచారంలో భాగంగా మణికొండలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ, కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. తన పాలనలో ఘనంగా చెప్పుకునే పనిని కేసీఆర్‌ ఒక్కటైనా చేశారా? అని ప్రశ్నించారు. తన కృషి వల్లే హైదరాబాద్‌ దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎదిగిందన్నారు. ప్రపంచమంతా తిరిగి తాను హైదరాబాద్‌కు పెట్టుబడులు తీసుకొచ్చానని, కేసీఆర్‌ ఎక్కడికైనా వెళ్లి రూపాయి పెట్టుబడి పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తనైనా అడిగారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు రెండుసార్లు ప్రధాని పదవిని వదులుకున్నానని చెప్పారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడలేదని, తెలంగాణలో తన హయాంలో భీమ, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలను ప్రారంభించానన్నారు. తాను హైదరాబాద్‌ వస్తే ఇక్కడేం పని అంటున్నారని, టీడీపీ లేకపోతే కేసీఆర్‌ ఎక్కడ ఉండేవారో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ను తాను కట్టించానని ఎక్కడా చెప్పలేదని, కులీకుతుబ్‌షా దాన్ని కట్టారన్నారు. సైబరాబాద్‌ను తానే కట్టానని స్పష్టంచేశారు. శంషాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, మైక్రోసాఫ్ట్‌ కంపెనీని తాను తీసుకొచ్చానన్నారు. తాను చేసిన అభివృద్ధిని, తన విజన్‌ను కాంగ్రెస్‌ చెడగొట్టకుండా కొనసాగించినందువల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. విభజన జరిగిన తర్వాత కేసీఆర్‌ వచ్చి చెడగొట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే తమకు నష్టంలేదని ఆనాడు చెప్పిన కేసీఆర్‌ ఈ రోజు మాట మారుస్తున్నారన్నారు. కేంద్రంలో మోదీ మాట మార్చారు గనకే ఇక్కడ కేసీఆర్‌ కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని నమ్మితే ఆయన దేశానికి, రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన తీరువల్ల బాగా నష్టపోయామన్నారు. దేశంలో ఏటీఎంలు ఎక్కడా సరిగా పనిచేయడం లేదని, డబ్బుల కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్నారు. నోట్ల రద్దు రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నకిలీ కరెన్సీ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనమైందని చెప్పారు. మోదీ, అమిత్‌షా జోడీ చాలా భయంకరమైనదని, పద్ధతిలేని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి తప్పులను ఎవరైనా విమర్శిస్తే ఈడీ, ఐటీ లేకపోతే సీబీఐలచే దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌తో తాము పోరాడామని, దేశం కోసం తొలిసారిగా ఆ పార్టీతో కలిశామన్నారు. ప్రధాని మోదీ చెప్పే అచ్చేదిన్‌ నాలుగున్నరేళ్లలో రాలేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడిస్తే తప్పకుండా అచ్చేదిన్‌ వస్తుందని చంద్రబాబు చెప్పారు.

సైనా ట్వీట్.. కేటీఆర్ రిప్లై

  ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహం ఈ నెల 16న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది ఈ జంట. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ వివాహ రిసెప్షన్‌ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. శుభలేఖ అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది సైనా. ‘‘కేటీఆర్ గారికి థాంక్స్. మిమ్మల్ని కలవడం, క్రీడా అభివృద్ధి గురించి చర్చించడం చాలా ఆనందం కలిగించింది. వివాహ వేడుకలో మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్వీట్ చేసింది. సైనా ట్వీట్ కి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న తనకు సైనా, కశ్యప్‌లతో క్రీడల గురించి చర్చించడం ఎంతో ఉపశమనం కలిగించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.   

మన్మోహన్‌సింగ్ హాయాంలో 3 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి

  'సర్జికల్‌ స్ట్రైక్స్‌' ఇది అంత ఈజీగా మరచిపోలేము. ఒకవేళ మర్చిపోయినా ప్రధాని మోదీ గుర్తు చేస్తారు. అయితే సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ మేమేదో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామని పదే పదే చెప్పుకుంటున్నారు కానీ ఇలాంటివి కాంగ్రెస్ హయాంలో కూడా జరిగాయంటూ మనకి తెలియని విషయాన్ని రాహుల్ బయటపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ హయాంలో మాత్రమే మొదటిసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరగలేదు. మన్మోహన్‌సింగ్‌ హాయాంలో మూడుసార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి. ఈ దాడులు చేయాలా వద్దా అన్నదానిపై స్పష్టత కోసం ఆర్మీ అప్పటి ప్రధాని మన్మోహన్‌‌ను సంప్రదించింది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని సూచించగా ఆయన అంగీకారం తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ దాడులను రహస్యంగా ఉంచాలని ఆర్మీ కోరింది' అని రాహుల్‌ తెలిపారు. ఆర్మీ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ని ప్రధాని మోదీ తన రాజకీయాలకు అనువుగా మార్చుకున్నారని రాహుల్‌ విమర్శించారు. యూపీఏ హయాంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపినప్పుడు ఆర్మీ కోరిక మేరకు మేం దాన్ని అత్యంత గోప్యంగా ఉంచాం. కానీ మోదీ సర్కారు ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం మిలిటరీని రాజకీయ పావుగా వాడుకుంది అని విమర్శించారు. ప్రధాని మోదీ అన్నీ తనకే తెలుసనుకుంటారని అన్నారు. ఆర్మీ గురించి ఆర్మీ జనరల్ కంటే తనకే ఎక్కువ తెలుసునని మోదీ అనుకుంటారు. విదేశాంగ వ్యవహారాలు చూసుకోవాల్సిన విదేశాంగ మంత్రి కంటే తనకే విదేశాంగ వ్యవహారాలు తెలుసని నమ్ముతారు. వ్యవసాయ మంత్రి కంటే తనకే ఎక్కువ తెలుసనుకుంటారు. అన్నీ తనకే తెలుసన్న ఆలోచనలోనే ఆయన ఉంటారు అని రాహుల్ విమర్శించారు. దేశానికి సంబంధించి కీలక నిర్ణయాల విషయాల్లో విపక్షాలను మన్మోహన్ సంప్రదించే వారు. కానీ గత ఐదేళ్లలో కాంగ్రెస్ చీఫ్‌ను మోదీ ఒక్కసారి కూడా పిలిచిన సందర్భం లేదని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 26/11 దాడులు చోటుచేసుకున్నప్పుడు మన్మోహన్ చేసిన రెండో ఫోన్ కాల్ బీజేపీ నేత ఎల్.కె.అద్వానీకేనని రాహుల్ తెలిపారు. ఏదైనా జరిగితే అది విపక్షాలకు కూడా తెలియాలని మన్మోహన్ నమ్మేవారని, అయితే మోదీ గత ఐదేళ్లలో తనకు ఒక్కసారి కూడా సంప్రదించలేదని రాహుల్ అన్నారు.

ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెడతాం..

  రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఏపీలోనూ వేలుపెడతామని టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలుపెట్టారన్నారు.  చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేనేం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు.. నువ్వు తప్పు చేయలేదా..? నువ్వు సుద్దపూసవా..? మీ పార్టీ ఎమ్మెల్యే కాదా 50 లక్షల బ్యాగ్ తో అడ్డంగా దొరికింది? మనవాళ్లు బ్రీఫ్‌ డ్‌ మీ అన్నది ఎవరు, తన వాయిస్‌ కాదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని దుయ్యబట్టారు.  'ఎవరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు సుహాసినికి టికెట్‌ ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా..? నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే తమ కొడుకును మంత్రిని చేసినట్లు ఆమెను కూడా చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉంది ' అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. పొత్తులు లేకుంటే ఎన్నటికి గెలవలేనని చంద్రబాబుకు తెలుసని, కులాల పేరిట చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని, వాటిని తిప్పికొడతామన్నారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని.. ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామన్నారు.  ఆంధ్రప్రదేశ్‌తో తాము ఏనాడూ తగాదాలు కోరుకోలేదన్నారు. 'అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు కేసీఆర్‌ను అహ్వానించారు. చర్చోప చర్చలు తరువాత ఆంధ్రావారు మన సోదరులు అని చెప్పి కేసీఆర్ అమరావతి వెళ్లారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లినప్పుడు కేసీఆర్ 100 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించాలని అనుకున్నారు.కానీ ప్రధాని మోడీ తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు ఇస్తున్నారని తెలిసి.. కేసిఆర్  మౌనంగా ఉండి పోయారు' అని చెప్పారు. నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనలతో జరిపించామని, సీఎం కేసీఆర్‌ స్వయంగా హాజరయ్యారని కూడా గుర్తు చేశారు. జగన్ పై కోడి కత్తి దాడి జరిగితే ఖండించామని చెప్పిన కేటీఆర్‌.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కేసీఆర్‌ని కలసి రైతులకు 24 గంటలు ఇస్తున్నారని అభినందించారని గుర్తుచేశారు. 2014లో చంద్రబాబుకు బీజేపీ, పవన్ తోడవడంతో అదృష్టం బాగుండి గెలిచారని కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్‌, చంద్రబాబులు ఫిడెల్‌ వాయించుకోవడమేనని జోస్యం చెప్పారు.

దుబాయ్‌ శేఖర్‌, శేఖర్‌ మామగా కేసీఆర్ ఎదిగారు

  కాంగ్రెస్ నేత మధుయాష్కి కేసీఆర్ మీద, కేసీఆర్‌ కుటుంబం నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. కేటీఆర్‌ అక్రమాస్తులు నిరూపించేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. 2001లో రూ.10లక్షలున్న కేసీఆర్‌ ఆస్తి.. ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. 2009లో రూ.కోటి ఉన్న కేటీఆర్‌ ఆస్తి, 2014లో రూ.41 కోట్లు ఎలా అయిందని నిలదీశారు. మలేషియా, యూఎస్‌ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. బెంగళూరులో కేటీఆర్‌కు బినామీలున్నారన్నారు. డాలర్‌ కాలనీలో కవితకు విల్లా ఎక్కడిదని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబ సంక్షేమమా?.. 4కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తా? ప్రజలు తేల్చుకోవాలని మధుయాష్కీ అన్నారు.   కల్వకుంట్ల కుటుంబం అక్రమార్జనను ప్రతిరోజు వివరిస్తానని, రేపటి ప్రెస్‌మీట్‌లో కవిత అక్రమాస్తులను ప్రకటిస్తాని తెలిపారు. హవాయి చెప్పుల హరీష్ రావు బండారాన్ని బయటపెడతానని అన్నారు. కేసీఆర్‌ బతుకేంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. దుబాయ్‌ శేఖర్‌, శేఖర్‌ మామగా కేసీఆర్ ఎదిగారన్నారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారకరామారావు కాదని, కల్వకుంట్ల అజయ్‌రావు అని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబానిది దరిద్రపుగొట్టు చరిత్ర అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్తులను కాపాడుకునేందుకే ప్రధాని మోదీతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా బీజేపీకి మద్దతిచ్చారని అన్నారు. ప్రధాని అయ్యే అవకాశాన్ని సోనియా మూడుసార్లు వదులుకున్నారని, సోనియా కుటుంబానిది త్యాగాల చరిత్ర అని కొనియాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా తెలంగాణ ఇచ్చారని మధుయాష్కి పేర్కొన్నారు.

తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు

  తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్ లో అందించే అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓపితో పాటు ఐపీ సేవలనూ నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి నెట్ వర్క్ హాస్పిటల్స్ కు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 1200 కోట్లు విడుదలలో జాప్యం వల్లే డిసెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం గురువారం రూ. 150 కోట్లు విడుదల చేసినా అసోసియేషన్ దిగిరాలేదు. దీనికి ఆరోగ్యశ్రీ సీఈఓ వైఖరి కూడా కారణమని తెలుస్తోంది. నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులను కలిసేందుకు ఆయన విముఖుత చూపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతతో.. ఆపరేషన్లు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లోని ఎమర్జెన్సీ కేసులను ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. మరి పేదవాడి ఆరోగ్యానికి వరంలాంటి ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

లగడపాటిపై టీఆర్ఎస్ ఫిర్యాదు

  తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ పార్టీ లగడపాటి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ కి ఫిర్యాదు కూడా చేసింది. ఎన్నికలను ప్రభావితం చేసేలా ఈ ప్రకటన ఉన్నదని, సర్వే వివరాలు ప్రకటించటం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ తరఫున దండె విఠల్‌ ఫిర్యాదుచేశారు. తిరుపతిలో లగడపాటి చేసిన ప్రకటనను టీవీల్లో ప్రసారం చేశారని.. ఇలాంటి ప్రకటన ఈ సమయంలో సరైంది కాదని పేర్కొన్నారు. రోజుకు ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని... నారాయణ్‌పేట్‌, భోథ్‌లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి టీఆర్ఎస్ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తో ?...ఫిర్యాదు నేపథ్యంలో రోజుకు రెండు పేర్లు ప్రకటిస్తా అని చెప్పిన రాజగోపాల్ ..ఈరోజు మరో రెండు పేర్లు చెప్తారా లేదా? అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

మాజీ స్పీకర్‌ కి పితృవియోగం

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తండ్రి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కె.పున్నయ్య (96) కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన అక్టోబర్‌ 26న ఆస్పత్రిలో చేరారు. అదే సమయంలో ఆయన కుమార్తెకు గుండెనొప్పి రావడంతో హైదరాబాద్‌ తరలించారు. బైపాస్‌ సర్జరీ అనంతరం ఆమె కోలుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన పున్నయ్య 1952లో రెండేళ్లపాటు శ్రీకాకుళం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. కొన్నాళ్ళకు రాజకీయాలను వదిలేసి తిరిగి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాదిగా 1974-85 వరకూ పనిచేశారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2000 సంవత్సరంలో ఎన్డీఎ ప్రభుత్వం నియమించిన రాజ్యాంగ సమీక్షా కమిటీ 11 మంది సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ కన్నుమూశారు

  అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ కన్నుమూశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడుగా పనిచేసిన బుష్ 94ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. బుష్ చనిపోయినట్లు ఆయన కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడైన జార్జ్‌ డబ్ల్యు బుష్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తన తండ్రి ఇకలేరు అని చెప్పడం ఎంతగానో బాధిస్తోందని తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీ నేత అయిన హెచ్ డబ్ల్యూ బుష్‌ 1989 నుంచి 1993 వరకు అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు 1981 నుంచి 1989 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. జార్జ్ హెచ్‌ డబ్ల్యూ బుష్‌ను ఎక్కువగా ‘బుష్‌ 41’, ‘జార్జ్‌ బుష్‌ సీనియర్’ అని పిలుస్తారు. బుష్‌ పెద్ద కుమారుడి పేరు కూడా జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ అయినందున ఇద్దరిని పిలవడంలో తేడా ఉండడం కోసం అలా పిలుస్తారు. బుష్‌ కుమారుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ కూడా అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు.

జేసీ దివాకర్‌రెడ్డికి షాక్.. టిక్కెట్ ఇవ్వనన్న చంద్రబాబు

  ఏపీలో రాబోయే ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్టింగ్ ల పనితీరుపై సర్వేలు చేయించి వారి పని తీరు బాగుంటునే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై చర్చిస్తూ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం చంద్రబాబు అనంతపురం జిల్లా వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ సమయంలో వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారట. ఈ కసరత్తులో భాగంగానే తాను ఎమ్మెల్యేల పనితీరుపై వివిధ మార్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నానని, అందులో మంచి ఫలితాలు వచ్చిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని స్పష్టంచేశారట. ఈ తరుణంలో జేసీ దివాకర్‌రెడ్డి కల్పించుకుని 'నా మీద సర్వే నిర్వహించినప్పుడు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే టిక్కెట్ ఇవ్వరా?' అని ప్రశ్నించారట. దీనిపై స్పందించిన చంద్రబాబు 'టిక్కెట్‌ ఇవ్వను' అని చెప్పేశారట. బాబు ఇచ్చిన సమాధానంతో జేసీ దివాకర్‌రెడ్డి షాక్‌కు గురయ్యారట. దీనిబట్టి చూస్తుంటే టిక్కెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు భారీ కసరత్తులే చేస్తున్నట్టు అనిపిస్తోంది. చూద్దాం మరి ఆ టైం కి చంద్రబాబు నాయకులకు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో.

తెలివి లేక పార్టీ మారా - విశ్వేశ్వర్ రెడ్డి

  చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి విదితమే. తాజాగా ఆయన ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో టీఆర్ఎస్ ని వీడటానికి గల కారణాలను వెల్లడించారు. అంతేకాకుండా మరికొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌ పార్టీలో సమస్యను చర్చించే అవకాశమే లేదనీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. రెండేళ్లుగా తాను అవమానాలను ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగానన్నారు. ఉద్యమంలో ఎవరినైతే ద్రోహులంటూ కేసీఆర్ దూషించారో.. వాళ్లే ఇప్పుడు పార్టీలో కీలకమయ్యారని ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఎందుకు అవసరమో తమకు తెలియదన్నారు. పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో.. ఎవరితోనూ చర్చించకుండానే ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారన్నారు. తన పర్సనాలిటీ ప్రాంతీయ పార్టీలకు సరిపోదన్న విషయం ఇప్పుడు అర్థమవుతోందని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ఒక రాంగ్‌ప్లేస్‌ నుంచి కూర్చున్నానని తనకు అనిపించిందన్నారు. టీఆర్ఎస్‌లో తాను ఎక్కువ కాలం ఉంటే.. అన్నాడీఎంకే నేతల్లా చేతులపై ‘కేసీఆర్.. కేటీఆర్’.. అని రాసుకోవాల్సి వస్తుందేమోనని భయం వేసిందన్నారు.  టీఆర్ఎస్‌లో చేరడం, ఆ తర్వాత పార్టీని వీడటం.. ఒక గొప్ప గుణపాఠమని విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైసలు పోయాయి.. పరువు పోయిందనీ చాలాసార్లు ఫీలయ్యానన్నారు. ‘టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా.. రాత్రిళ్లు సరిగా నిద్రపట్టడం లేదు. ఆత్మగౌరవం లేనప్పుడు ఇక ఇక్కడ ఉండి ఏం లాభం..’ అని తనకు అనిపించేదన్నారు. టీఆర్ఎస్‌లో ఎవరు మాట్లాడినా.. ముఖం,నోరు మాత్రమే వాళ్లవాని, మాటలు మాత్రం కేసీఆర్, కేటీఆర్‌లవని విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీలమయిన మా కంటే.. మంత్రులే ఎక్కువగా టీఆర్ఎస్‌లో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ‘ఈ ఎన్నికల్లో వందకు వంద శాతం కాంగ్రెస్ గెలుస్తుంది.. టీఆర్ఎస్ గెలిచే అవకాశాలే లేవు. టీఆర్ఎస్‌కు 30 కంటే తక్కువ సీట్లు వస్తాయి..’ అని తన అభిప్రాయం వెల్లడించారు. ఎన్నికల తర్వాత పార్టీ మారేవాళ్లు చాలామంది ఉంటారనీ, కానీ తనకు అంత తెలివి లేక, చేతకాక ముందే పార్టీ మారానని తెలిపారు.

ఛార్జిషీట్‌ లో కేసీఆర్‌ పేరును బీజేపీ తొలిగించింది

  ఎన్నికల దగ్గరపడుతుంటే ప్రతి పార్టీ, ప్రత్యర్థి పార్టీని.. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా విమర్శించడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో కేసీఆర్ కేంద్ర కార్మికమంత్రిగా పనిచేసిన సమయంలో స్కాం చేసారని, దాని నుంచి బయటపడటానికే బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌ పాషా, టీజేఎస్ నేత విద్యాధరరెడ్డితో కలిసి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. 2006లో కేసీఆర్‌ కేంద్ర కార్మికమంత్రిగా ఉన్నపుడు ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ ద్వారా నిర్మించాల్సిన వైద్య కళాశాల భవనాల పనులను నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌కు కాకుండా అప్పటికే కేసుల్లో ఇరుక్కున్న వెలుగుబంటి సూర్యనారాయణ ద్వారా నాటి ఆంధ్రప్రదేశ్‌ మత్స్యశాఖకు కట్టబెట్టారని ఉత్తమ్‌ తెలిపారు. ఈ కాంట్రాక్ట్‌ మత్స్యశాఖకు ఇవ్వడం కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు. కేసీఆర్‌ ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి ఈఎస్‌ఐసీ అధికారులను పిలిపించుకుని కాంట్రాక్ట్‌ ఇప్పించారని సీబీఐ తన ఛార్జిషీట్‌ లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఆ మేరకు కేసీఆర్‌పై కేసు కూడా నమోదు చేశారని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బీజేపీ నాయకుల ద్వారా మోదీతో కుమ్మక్కై సీబీఐ ఛార్జిషీట్‌ లోని తన పేరుని కేసీఆర్‌ తొలగింపజేసుకున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కేసీఆర్‌ లాలూచీపడినందునే ఇది సాధ్యమయ్యిందని పేర్కొన్నారు. అందుకే విభజన చట్టంలోని హామీల అమలుపై కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదన్నారు. ఛార్జిషీట్‌ లో ఉన్న కేసీఆర్‌ పేరును ఎందుకు తొలగించారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ వెలుగుబంటి సూర్యనారాయణకు ఇచ్చింది నిజం కాదా? ఆ గుత్తేదారుతో కేసీఆర్‌ సంబంధం నిజం కాదా? అని ప్రశ్నించారు. వైద్య,కంటి పరీక్షల పేరుతో కేసీఆర్‌ ఢిల్లీకి తిరిగిందంతా కూడా తనపై ఉన్న సీబీఐ కేసును తొలగించుకునేందుకే అని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైనపుడు బహిర్గతం చేస్తామని ఉత్తమ్‌ తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. కేసీఆర్‌ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నపుడే బీడీ కట్టలపై పుర్రెగుర్తు వచ్చిందని, ఇది లక్షల మంది బీడీ కార్మికులకు నష్టం కలిగించిందని ఆరోపించారు. సహారా సంస్థ రూ.7000 కోట్ల పీఎఫ్‌ నిధులు వాడుకునేందుకూ కేసీఆర్‌ అప్పుడే అనుమతిచ్చారని ఇది భారీ కుంభకోణమన్నారు. సీబీఐ అధికారులు విచారణకు రావడంతోనే ట్యాంక్‌బండ్‌పై ఒకసారి బతుకమ్మ వేడుకలకు సీఎం రావాల్సి ఉన్నా రాలేదన్నారు. గత 83 రోజులుగా ఎన్నికల్లో టీఆర్ఎస్ రూ.వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేసిందని, మరో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనుందని రమణ ఆరోపించారు.

టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం

  ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ అభ్యర్థులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలను తమ గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాణోత్‌ మదన్‌లాల్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మదన్‌లాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్‌ తండాకు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. కొంతకాలంగా మదన్‌లాల్‌ లంబాడాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన ప్రచార వాహనం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మదన్‌లాల్‌ తమ గ్రామంలో పర్యటించడానికి అంగీకరించబోమన్నారు. ఈ క్రమంలో మదన్‌లాల్‌ అనుచరులు కొందరు స్థానికులతో వాదనకు దిగారు. కొందరు మదన్‌లాల్‌కు వ్యతిరేకంగా, మరికొందరు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి.. ఇరువర్గాలనూ శాంతింపజేశారు. అనంతరం మదన్‌లాల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి నిరసనలు ఎదుర్కొంటున్న నేతల గెలుపు పరిస్థితి ఏమిటో అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హంగ్‌ పై లగడపాటి సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్టోప్‌సగా పేరున్న లగడపాటి రాజగోపాల్‌ సర్వే ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. నారాయణపేటలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి, బోధ్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అనిల్‌ జాదవ్‌ గెలుస్తారని చెప్పిన రాజగోపాల్..రోజుకి ఇద్దరి పేర్ల చొప్పున ప్రకటిస్తా అని సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హంగ్‌ పై స్పందించారు. "మా అంచనా ప్రకారం తెలంగాణలో ఎక్కువ 8 నుంచి 10 మంది వరకు స్వతంత్రులు గెలుస్తున్నట్లు తేలింది. 10 సీట్లు (స్వతంత్రులకు) పోయినా పార్టీలు ఇంకా 109 సీట్లలో చూసుకోవచ్చు. ‘హంగ్‌ అసెంబ్లీ’ అనే ముచ్చటే లేదు. ఇండిపెండెంట్లు ఇచ్చే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావు. ప్రజా కూటమిగానీ, టీఆరెస్ఎస్ గానీ స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి" అని వెల్లడించారు. మరోవైపు "మా బృందం ఆగస్టులో ఒక టీవీ చానెల్‌ కోసం సర్వే చేసింది. అప్పుడు విడుదల చేసిన సర్వే టీఆర్ఎస్ కు అనుకూలంగానే వచ్చింది. సంవత్సరం, ఆరు నెలల ముందుగానే సర్వే చేస్తే ఎలా నిరూపిస్తావన్న ఆరోపణలు వస్తాయి. ఆగస్టులో పరిస్థితిని నేను విశ్లేషించలేదు. అప్పటి డేటాను పరిశీలిస్తూనే ఇప్పుడు వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నాను" అని తెలిపారు. ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు ఎన్నికల వివరాలు చెప్పమంటే చెప్పగలను. 3 నెలల ముందు ఫలితాల గురించి చెప్పమంటే చెప్పలేను. డిసెంబరు ఏడో తేదీ సాయంత్రం సర్వే ఫలితాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

మంత్రి హరీశ్‌రావుపై కేసు

  ఎన్నికలు వచ్చాయి అంటే ప్రచారంలో భాగంగా ప్రజా ప్రతినిధులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఎంత ఉత్సహంగా ప్రచారంలో పాల్గొన్నా ఎన్నికల నియమావళిని మాత్రం మరువకూడదు. నియమావళిని ఉల్లంగిస్తే నేతలకు ఈసీ నోటీసులు, పోలీస్ స్టేషన్ లో కేసులు తప్పవు. తాజాగా మంత్రి హరీష్ రావు పై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణపై హరీష్ రావుపై సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని సీఐ నందీశ్వర్‌రెడ్డి  ధ్రువీకరించారు. సిద్దిపేటలో సెప్టెంబరు 30న ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆశీర్వాద సభకు మంత్రి హాజరై విరాళాలు స్వీకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జయచంద్రారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 సెక్షన్‌ కింద, ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదైందని సీఐ వెల్లడించారు.  ఇటీవల ఆర్యవైశ్యుల సంఘం సమావేశానికి హరీష్‌రావు హాజరైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో హరీష్‌ను ఆర్యవైశ్యులు సన్మానించారు. ఆయన ఎన్నికల కోసం విరాళాలు సేకరించారని ఈసీ రజత్‌కుమార్‌కు ఫిర్యాదు అందింది. కుల, మత కార్యక్రమాలకు హరీష్‌రావు హాజరై ఓ వర్గానికి ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఫిర్యాదులో ప్రతిపక్షనేతలు పేర్కొన్నట్లు సమాచారం. అయితే సీడీలు, ఫొటోలు, ఇతరత్రా ఆధారాలు పరిశీలించి హరీష్‌ రావు పై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారికి ఈసీ సూచించింది. ఈ మేరకు హరీష్ రావు పై కేసు నమోదైంది. 

నలుగురిని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్‌

  తెలంగాణలో ఎన్నికల వేళ టికెట్‌ ఆశించి భంగపాటుకు గురైన నేతలు తీవ్ర అసంతృప్తితో రెబల్స్‌గా బరిలో నిలవడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో తిరుగుబాటు జెండా ఎగరేసిన నలుగురు నేతలపై టీఆర్ఎస్‌ బహిష్కరణ వేటు వేసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూకుడుతో ముందుకెళ్తున్న టీఆర్ఎస్‌ కు కొన్ని నియోజకవర్గాల్లో రెబల్స్‌ ప్రచారం ఇబ్బంది కరంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి జి.వినోద్‌, గజ్జల నగేష్‌, జలంధర్‌ రెడ్డి, శంకర్‌ని అధిష్టానం సస్పెండ్‌ చేసింది. సస్పెండ్ అయిన వారిలో గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్దిగా బరిలో ఉంటే.. గజ్జల నగేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి రెబల్‌గా పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ రెడ్డి మక్తల్ నుంచి, శంకర్... షాద్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

సుజనా చౌదరికి మరో షాక్

  ఢిల్లీ కోర్టులో తెదేపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కి చుక్కెదురైంది. ఈడీ సమన్లను రద్దుచేయాలంటూ సుజనా చౌదరి పెట్టుకున్న పిటిషన్‌పై  హైకోర్టు ఈ రోజు విచారించింది. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఇటీవల ఈడీ, ఐటీ అధికారులు సుజనా నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన 5700 కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించారని ఈడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఈ మేరకు సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఈ నెల 27వ తేదీన సుజనా చౌదరికి ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎదుట విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుజనా చౌదరి ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై ఈడీ దాడులు రాజకీయ దురుద్దేశంతో కూడినవని, తన కంపెనీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, దీనిపై విచారించిన న్యాయస్థానం సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సిందేనని సుజనాకు తేల్చి చెప్పింది. సుజనాపై బలవంతంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఈడీని కోర్టు ఆదేశించింది.

ఫామ్ హౌస్ లో వంకాయలు పండించుకోవటమే

  కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా కేపీహెచ్‌బీలో సీపీఐ జాతీయ నేత నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. సుహాసిని పోటీపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు.  సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. అమెరికాలో చదివిన కేటీఆర్‌కు పోటీచేసే అర్హతల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభను కేసీఆర్‌ ఎందుకు అర్థాంతరంగా రద్దు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కూటమి పేరు చెబితేనే కేసీఆర్‌, కేటీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. పరిపాలన చేతకాక 9నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని నారాయణ మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేయడంలో తెరాస ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది ప్రజా కూటమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11 తర్వాత కేసీఆర్‌ ప్రగతి భవన్‌ విడిచి ఫామ్ హౌస్ లో వంకాయలు పండించుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌

  టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌‌కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌ ని నియమించింది. ఆయనతో పాటుగా ఉపాధ్యక్షులుగా వినోద్ కుమార్‌, జాఫర్ జావేద్‌ నియమించింది. 8 మంది జనరల్‌ సెక్రటరీలు, నలుగురు సెక్రటరీలుగా నియామకం కూడా జరిగింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరి అశోక్ గెహ్లాట్ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కుసుమ కుమార్‌ను నియమించిన విషయం తెలిసిందే. అజారుద్దీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మొత్తం నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు అయ్యారు. అజారుద్దీన్‌ 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో రాజస్థాన్‌లోని టాంక్‌సవాయ్ మధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాకుండా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో వచ్చే ఎన్నికల్లో అధిష్టానం అవకాశం ఇస్తే సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తానని తన కోరిక వెళ్లబుచ్చారు. అజారుద్దీన్‌ వ్యాఖ్యలతో పార్టీలో పెను దుమారమే రేగింది. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అజారుద్దీన్‌ కి స్టార్ కంపెయినర్ గా భాద్యతలు అప్పగించింది. తాజాగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కీలక భాద్యతలు అప్పగించింది.