రెబల్ అభ్యర్థి కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేత

  ఎన్నికల్లో కీలక ఘట్టం అభ్యర్థులు నామినేషన్లు వేయటం. తెలంగాణలో జరగనున్న ఎన్నికలకు పలు పార్టీలకు చెందిన పలువురు రెబల్స్ గా నామినేషన్ వేశారు. నేడు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు కావటంతో రెబల్స్ ని బుజ్జగించే పనిలో పడ్డారు అన్ని పార్టీల నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు ఆ పార్టీ రెబల్స్ ఇంటికి వెళ్లి మరీ మంతనాలు జరిపి నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఒప్పిస్తున్నారు. తాజాగా ఓ కాంగ్రెస్ నేత అయితే రెబల్ అభ్యర్థి కాళ్ళ మీద పడి మరీ తనకు సహకరించాలని అడుగుతున్న ఫొటో.. ఇప్పుడు వైరల్‌ అయ్యింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టికెట్‌ తనకు ఇవ్వమని నియోజకవర్గం ఇన్‌చార్జి పడాల వెంకటస్వామి అధిష్టానాన్ని కోరారు.కానీ కాంగ్రెస్ అనూహ్యంగా ఇటీవలే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేఎస్‌ రత్నంకు టికెట్‌ కేటాయించింది. దీంతో అలకవహించిన వెంకటస్వామి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. అధిష్టానం నచ్చజెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో కేఎస్‌ రత్నం..వెంకటస్వామి ఇంటికి వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయాల్లో పదవుల కోసం నేతలు ఏం చేయటానికి అయినా సిద్ధపడతారని పలువురు అభిప్రయం వ్యక్తం చేస్తున్నారు.

వీహెచ్‌ హత్యకు కుట్ర జరిగిందా..?

  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రథం ప్రమాదానికి గురైంది. ప్రచార రథం రెండు చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం వద్ద గత రాత్రి ఈ ప్రమాదం జరిగింది. అయితే వీహెచ్ సురక్షితంగా బయటపడ్డారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి తరఫున  ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో వీహెచ్ పాల్గొన్నారు.అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా నేరెళ్ల గ్రామ శివారు వద్ద రథం రెండు చక్రాలు ఊడిపోయాయి. సుమారు 100 మీటర్ల మేర బస్సు వెనక చక్రాలు లేకుండానే ముందుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేయటంతో వీహెచ్, వాహనంలోని ఇతరులు ఎలాంటి గాయాలూ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా బస్సు స్క్రూలను తొలగించడంతో చక్రాలు ఊడిపోయాయని, తన హత్యకు ఎవరో కుట్ర పన్నారని వీహెచ్‌ ఆరోపించారు.  స్థానిక పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు చేశారు. 

బీఎస్పీ అభ్యర్థికి కూటమి మద్దతు..

  కూటమిలోని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి దక్కింది. సామ రంగారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది. రంగారెడ్డి మొదటి నుంచి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ ఎల్బీనగర్ స్థానాన్ని కూటమి పొత్తుల్లో కాంగ్రెస్‌ నేత సుధీర్‌రెడ్డికి కేటాయించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రంగారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యి తనకి ఎల్బీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ స్థానం కాంగ్రెస్ కి కేటాయించామని ఈసారికి సర్దుకుపొమ్మనటంతో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. టీడీపీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన సోదరుడు మల్‌రెడ్డి రామిరెడ్డి ఎన్సీపీ నుంచి నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్ కి చెందిన వీరిద్దరూ అనూహ్యంగా బీఎస్సీ, ఎన్సీపీల నుంచి నామినేషన్లు దాఖలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడింది. అయిష్టంగానే ఇబ్రహీంపట్నంలో నామినేషన్‌ వేసిన సామ రంగారెడ్డి తనకు పోటీగా మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్‌ వేయడంతో విజయావకాశాలపై అనుమానాలు మొదలయ్యాయి. అందుకే, ఎల్బీనగర్ నుంచి స్వతంత్రుడిగా నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా మల్రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మల్రెడ్డి సోదరులతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు. మల్‌రెడ్డి రామిరెడ్డి పోటీ నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు.  దాంతో మల్‌రెడ్డి రంగారెడ్డికి మార్గం సుగమం అయ్యింది.  మల్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో ? అసలే గెలుపై అనుమానం వ్యక్తం చేస్తున్న రంగారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది.

రేవంత్‌ రెడ్డి రాజకీయాలను వదిలేస్తారా?

  తెలంగాణలో ఎన్నికలను అటు మహాకూటమి ఇటు టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా టీఆర్ఎస్ ని గద్దె దింపాలని కూటమి ప్రయత్నిస్తుంటే .. కూటమిని చిత్తుగా ఓడించి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ తలమునకలవుతుంది. ఇందులో భాగంగా కేసీఆర్,కేటీఆర్ విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. తాజాగా కేటీఆర్ కొడంగల్ లో ప్రచారం నిర్వహించారు. కొడంగల్  కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంచుకోట అక్కడ ఎలాగైనా తమ పార్టీ జెండా ఎగరెయ్యాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా కేటీఆర్‌ కొడంగల్‌లో భారీ ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు భారీగా తరలివచ్చిన జనం సమక్షంలో రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఈ ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రేవంత్‌ రెడ్డి రాజకీయాలను వదిలేస్తారా? అని సవాల్‌ విసిరారు. అసలే టీఆర్ఎస్ అంటే విరుచుకుపడే రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి మరీ కేటీఆర్ సవాల్ చేస్తే ఎలా స్పందిస్తారో..? ఒకవేళ కేటీఆర్ చేసిన సవాల్ ని స్వీకరిస్తే ఇద్దరిలో ఎవరు రాజకీయాలకి దూరం అవుతారో అని ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూడక తప్పదు..

సిట్ నోటీసు..జగన్ లేఖ

  విశాఖ ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది విదితమే. ఈ దాడిపై సిట్ విచారణ జరుపుతుంది. గతంలో దాడికి సంబంధించి వాగ్మూలం ఇమ్మని జగన్ కి సిట్ నోటీసులు పంపింది. జగన్ మాత్రం ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని, పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతుందని ఆరోపిస్తూ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో కేసును విచారణ జరపించాలని జగన్ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. కానీ తాజాగా సిట్ మరోసారి జగన్ కి వాంగ్మూలం ఇవ్వవలసిందిగా నోటీసులు పంపింది.  సిట్‌ పంపిన నోటీసులపై జగన్‌ స్పందించారు. విశాఖలోని సిట్‌ అధికారులకు ఆయన ఓ లేఖ రాశారు. జగన్‌ రాసిన లేఖను ఆ పార్టీ జిల్లా నేతలు విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని సిట్‌ అధికారులకు అందజేశారు. హైకోర్టులో జగన్ వేసిన రిట్ పిటిషన్ ఈ నెల 27కు విచారణకు వస్తోందని.. అందుకే సిట్ ఎదుట తాను హాజరుకాలేకపోతున్నానని జగన్‌ లేఖలో పేర్కొన్నట్టు వైకాపా విశాఖ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్ వివరించారు. తమకు కూడా సిట్ నుంచి నోటీసులు వచ్చాయన్న ఆయన సిట్‌కు రేపు తాము సమాధానం ఇస్తామని తెలిపారు. ఇన్ని మలుపులు తిరుగుతున్న ఈ కేసు ఏనాటికి కొలిక్కి వస్తుందో..?

పవన్ కళ్యాణ్ అనే నేను

  తమిళనాడులో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కాంగ్రెస్‌, బీజేపీలే కారణమని ధ్వజమెత్తారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందిని విమర్శించారు. రాజకీయంలో మార్పు రావాలి. అందుకోసం దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రముఖులను మేధావులను కలిశా. నేను ఇప్పుడు తమిళనాడుకు రావడానికి కూడా కారణం ఉంది. తమిళనాడుకు జనసేనను పరిచయం చేద్దామని వచ్చా. నా పేరు పవన్‌ కళ్యాణ్.. ఇది జనసేన. ఇక్కడ నేను పలువురు రాజకీయ నేతలను కలుస్తా. బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ వంటి పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాయి. అందుకే నిజమైన పార్టీల అవసరం ఇప్పుడు ఏర్పడింది. జల్లికట్టు కోసం మీరు పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో జల్లికట్టు నిరూపించింది అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు స్నేహితుడుగా ఉంటారో, ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని.. ఆయనతో ప్రయాణం ప్రమాదకరమన్నారు. టీడీపీ నుంచి ఏమీ ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తే జరిగింది శూన్యమన్నారు. ఎన్నో ఆశలతో 2014లో ఏపీలో చంద్రబాబును సమర్థించా. కానీ మొత్తం తారుమారు అయింది. టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. ప్రాజెక్టుల నుంచి ప్రతి చోట అవినీతి తాండవిస్తోంది. అది వైట్‌కాలర్‌ అవినీతి. ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లపైనే అవినీతి జరిగింది అని ఆరోపించారు. చంద్రబాబు రిటైర్‌మెంట్‌ తీసుకునే సమయం దగ్గర పడింది. ఆయన తనయుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడు. అలాంటిది పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఉంది. ఏపీ భవిష్యత్‌ జనసేనదే అని అభిప్రాయపడ్డారు. తాను సీఎం అయితే దేశ రాజకీయాల్లో దక్షిణ భారతదేశం క్రీయాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. ద్రవిడుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తానన్నారు. అయితే తాను ప్రత్యేక ద్రవిడ దేశం వాదనను సమర్థించనని.. దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రత్యేకతను గుర్తించమని కోరుతున్నట్టు తెలిపారు. జాతీయస్థాయి కూటమి ఏర్పాటులో చంద్రబాబు ప్రయత్నాలు సత్ఫలితాలు అందివ్వవన్న పవన్.. జాతీయ రాజకీయాల్లో మూడో కూటమి అవసరమని స్పష్టం చేశారు.

నారా వారి ఆస్తులు..తాత కన్నా మనవాడి ఆస్తే ఎక్కువ..

  ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి రూ.88.66 కోట్లుగా ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆస్తి మొత్తం రూ.2.9 కోట్లు అన్నారు. హైదరాబాద్‌లో నివాసం విలువ రూ.8 కోట్లు కాగా, నారావారి పల్లెలో రూ.23.83 లక్షల విలువైన నివాసం ఉందన్నారు. నారా భువనేశ్వరి ఆస్తి రూ.31.01 కోట్లు కాగా, తన ఆస్తి రూ.21.40 కోట్లు, నారా బ్రాహ్మణి ఆస్తి రూ.7.72 కోట్లు, తన కుమారుడు దేవాన్ష్‌ ఆస్తి రూ.18.71 కోట్లు అని వెల్లడించారు. నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అన్నారు. హెరిటేజ్‌ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లుగా ప్రకటించారు. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకే తాము అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆస్తులను ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. 2011 నుంచి తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నామని లోకేశ్‌ అన్నారు. దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఆస్తులను ప్రకటించడంలేదని చెప్పారు.తమ కుటుంబానికి ఆదాయం హెరిటేజ్‌ ద్వారా మాత్రమే వస్తోందని చెప్పారు. కుటుంబం రాజకీయంపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే 1992లో హెరిటేజ్‌ను స్థాపించినట్టు తెలిపారు.

జనసేనకు అంత సీన్ లేదు.. పృధ్వీ సంచలన వ్యాఖ్యలు

  కమెడియన్ పృధ్వీ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శలు చేసిన పృధ్వీ.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో పెద్దగా రాణించలేదని అన్నారు. తను వైసీపీలో ఉండడం వల్ల ఈ మాట చెప్పడం లేదని, ఎన్నో ప్రాంతాలు తిరిగి జనాలను పరిశీలించిన తర్వాతే ఈ అభిప్రాయానికి వచ్చానని తెలిపారు. పవన్ కల్యాణ్ ఏ అన్నం తింటున్నాడో తను చెప్పలేకపోవచ్చని, కానీ జనసేన హవా ఎలా ఉందో మాత్రం లెక్కకట్టగలనని అన్నారు. 'ఆయన వాదనలు ఆయనకున్నాయి. అవన్నీ ప్రజలకు నచ్చుతాయని నేను అనుకోవడం లేదు. నేను కూడా స్టేజ్ ఎక్కి వంద మాట్లాడతాను. పవన్ కూడా అంతే. అవన్నీ వినే ఓపిక, పట్టించుకోవాల్సిన అవసరం జనాలకు లేదు. ఆయనకు ఓ పార్టీ ఉంది, ఎజెండా, మేనిఫెస్టో కూడా ఉంది. చూద్దాం, ఆయన హవా ఎలా ఉంటుందో జనాలు తేలుస్తారు' అన్నారు. జనసేన వల్ల తమ ఓటు బ్యాంక్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. 'ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా జనసేనకు పడదు. ఎందుకంటే, ప్రభుత్వాన్ని వ్యతిరేస్తున్న ప్రజలు వైసీపీని ఆరాధిస్తున్నారు. జగన్ వెంట నడుస్తున్నారు. పవన్ ను కేవలం చూడ్డానికి మాత్రమే ప్రజలు వస్తున్నారు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు వర్గం ఓటు బ్యాంకు విషయంపై కూడా పృధ్వీ స్పందించారు. 'కాపు వర్గం ఓట్లు ఎటు వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన సరైంది కాదు. కులం మీద ఓటు వేసి గెలిచే సంస్కృతి లేదు. ఓ కాపు వర్గానికి చెందిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. కుల రాజకీయాల మీద ఎన్నికలు గెలుస్తామని భావించడం మూర్ఖత్వం ' అని పృధ్వీ పరోక్షంగా కాపులంతా పవన్ వైపే ఉన్నారనే వాదనను తిప్పికొట్టారు. మరి రాబోయే ఎన్నికల్లో జనసేన రాణిస్తుందో లేక పృధ్వీ చెప్పినట్టు డీలా పడుతుందో చూద్దాం.

రోడ్డుమీద కుప్పలుతెప్పలుగా ఆధార్ కార్డులు

  ఒకే దేశము ఒకే గుర్తింపు అనే లక్ష్యంతో ఆధార్ అనే 12 అంకెల గుర్తింపు కార్డును ప్రవేశపెట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు రోడ్డు పాలు అయింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు రోడ్డు మీద కనిపిస్తున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల పోస్టాఫీసుకు లబ్ది దారులకు పంపిణీ చేయాల్సిన ఆధార్ కార్డులు వచ్చాయి. అయితే వాటిని పంపిణీ చేయటంలో నిర్లక్ష్యం వహించాడు పోస్ట్ మాన్ హుస్సేన్. భోజనానికి వెళ్లి అక్కడి హోటల్ లో వాటిని మర్చిపోయాడు. ఆ హోటల్ వాళ్లు వాటిని కొన్నాళ్లుగా భద్రపరిచి ఇక చేసేదేమీ లేక రోడ్డుపై పడేశారు. వీటిని గమనించిన కొందరు విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు విచారించగా పోస్ట్ మాన్ నిర్లక్ష్యమే దీనికి కారణమని తేల్చేసారు. అయితే హుస్సేన్ మాత్రం ఎప్పటి నుంచో వెతుకుతున్న కనపడట్లేదని, తాను రోజు ఆ హోటల్ లోనే భోజనం చేసేవాన్నని తెలిపారు. కావాలని తప్పు చేయలేదని , ఆ రోజు అక్కడ మర్చిపోవటం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నారు. 

వాళ్ళకేమో నోటీసులు..నాపై మాత్రం వేటా?

  రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌పై వేటు పడింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పిస్తూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఇబ్రహీంపట్నం స్థానం నుంచి బరిలో దిగాలని ఆ పార్టీ నేత క్యామ మల్లేష్ భావించారు. కానీ పొత్తులో భాగంగా పార్టీ ఆ స్థానాన్ని టీడీపీ కి కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన క్యామ మల్లేష్ స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు చేశారు.టికెట్‌ ఇప్పిస్తామని ఆశావహుల దగ్గర రూ.3 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేగాకుండా టికెట్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓటమే ధ్యేయంగా యాదవ, కురమ సామాజికవర్గాన్ని ఏకం చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. మల్లేష్‌పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులోభాగంగా ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. క్యామ మల్లేష్ చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా వేటుపై స్పందించిన క్యామ మల్లేష్... కుంతియా, ఉత్తమ్‌ను అడ్డగోలుగా దూషించిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు షోకాజ్‌తో సరిపెట్టారని, టికెట్‌ దక్కలేదని జెండా దిమ్మె, సోనియా, రాహుల్‌ ఫ్లెక్సీలను చించేసిన కార్తీక్‌రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, బీసీని కాబట్టే తనను బలిపశువు చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లు అధ్యక్ష పదవికీ, 35 ఏళ్లు పార్టీకి సేవకు చేసినందుకు నాకు ఇచ్చే బహుమానం ఇదా అని క్యామ మల్లేశ్‌ ప్రశ్నించారు. పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని, క్రమశిక్షణా ఉల్లంఘించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పొలంలో విమానం.. కేసు నమోదు చేసిన పోలీసులు

  రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలో శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ఢిల్లీకి చెందిన భరత్ భూషణ్ నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టులో విమానంలో బయలు దేరాడు. అయితే మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం ప్రమాదానికి గురైంది. చెట్టుకు తగిలి గ్రామంలోని శంకరమ్మ అనే మహిళా రైతు పొలంలో కుప్పకూలింది. పైలట్ భరత్ భూషణ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని శంకర్ పల్లి బీఎన్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విమానయాన శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కుప్పకూలిన విమానం శకలాలను ఫొటోలు తీసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు. 

హైకోర్టు విభజనకు అడ్డుపడింది చంద్రబాబే

  అంబర్‌పేటలో ‘అడ్వకేట్స్‌ ఫర్‌ టీఆర్‌ఎస్‌’ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే కారణమని కేటీఆర్‌ విమర్శించారు. గతంలో హైకోర్టు విభజన విషయంలో కేంద్రం పలుమార్లు మాట ఇచ్చినా.. ఎన్డీయే భాగస్వామిగా ఉండి నాలుగేళ్లుగా అడుగడుగునా ఆయన అడ్డుపడ్డారని అన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు మౌన దీక్షలు చేసినా, వెల్‌లోకి దూసుకెళ్లినా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సైందవుడిలా అడ్డుపడింది మాత్రం ముమ్మాటికీ చంద్రబాబేనన్నారు. ఆయనకు ఉన్న అన్ని సంబంధాలను వినియోగించుకొని స్టేలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టు విడిపోతే తన అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే ఆయన హైకోర్టు విభజన అడ్డుకున్నారన్నారు. ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వెళ్లాక మళ్లీ హైకోర్టు విభజన అంశంలో కదలిక వచ్చిందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జనవరిలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటవుతుందన్న నమ్మకం తనకుందన్నారు.

చంద్రబాబుని తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే

  కాంగ్రెస్, టీడీపీ మహాకూటమితో దగ్గర అయినప్పటి నుంచి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. జడ్చర్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మరోసారి చంద్రబాబు మీద విమర్శల దాడి చేశారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు వలసలు తగ్గాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి జిల్లాకు వస్తున్నారు. తెలంగాణ కల సాధించుకున్నాం. ఇప్పుడు కోటి ఎకరాల తెలంగాణ పచ్చగా చేయాలన్న కలను సాకారం చేసుకుందాం. రాష్ట్రం రానే రాదని అందరూ హేళన చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏకతాటిపై నిలిచి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పెండింగ్‌ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసుకున్నాం. ప్రాజెక్టుల పనులు చేపట్టి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశాం’ అన్నారు. చంద్రబాబు ఈ జిల్లాలో కొందరిని పోటీకి పెట్టారు. ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ‘వదల బొమ్మాళి.. వదలా’ అంటూ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నారు. గతంలో నా వంతు నేను ఒకసారి తరిమి కొట్టా. ఇప్పుడు ఆయన్ను తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే. పాలమూరు జిల్లాను తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఆయన ఏం చేశారు?. కానీ, ఇప్పుడు అన్ని పనులు వరుసగా జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. మహాకూటమి పేరుతో మళ్లీ చంద్రబాబు మన ఇంట్లో దూరి ‘మిమ్మల్ని కొట్టి పోతా’ అంటున్నారు. రానీద్దామా?.. కాంగ్రెస్‌ వాళ్లు చంద్రబాబును మోసుకొస్తున్నారు' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ కి తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా

  టీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీ వీడుతుండటం ఆ పార్టీని కలవరపెడుతుంది. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యి చేరికపై మంతనాలు జరిపారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తాజాగా వికారాబాద్ జిల్లా వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన తాజా మాజీ  ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం వికారాబాద్‌ టికెట్‌ను డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు కేటాయించింది.అనారోగ్య కారణాలతో సంజీవరావుకు టికెట్‌ నిరాకరించింది. దీంతో టీఆర్ఎస్‌ పార్టీకి సంజీవరావు గుడ్‌బై  చెప్పారు.ఈ మేరకు రాజీనామా లేఖను టీఆర్ఎస్ కార్యాలయానికి పంపారు. అంతేకాకుండా అభ్యర్థి విషయంలో తనని సంప్రదించలేదని, పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ప్రకటించారు. వరుస రాజీనామాలతో 100 స్థానాలు గెలుస్తామన్న టీఆర్ఎస్ ధీమా పటా పంచలయ్యింది.

టీఆర్ఎస్ పార్టీని వీడటానికి కారణం అదికాదు

  టీఆర్ఎస్ పార్టీని వీడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈరోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియాతో కలిసి ఆయన రాహుల్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీని కలిశాక చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని.. మహేందర్‌రెడ్డితో వివాదాల కారణంగా తాను టీఆర్ఎస్ పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని.. అందుకోసమే తాను పార్టీని ఎందుకు వీడతానన్నారు. అలాంటి చిన్న విషయాలు పార్టీని వీడేందుకు కారణం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అని.. ప్రాంతీయ పార్టీలతో సమస్యల పరిష్కారం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌తోనే తన నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమస్యల గురించి తాను రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. ఎంఎంటీఎస్‌, వికారాబాద్‌ శాటిలైట్‌ సిటీ తదితర సమస్యల గురించి వివరించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీతో మంచి సమావేశం జరిగిందని, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. 23న మేడ్చల్‌ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కుంతియా మీడియాకు తెలిపారు.

శంకరా ఏమి నీ రాజకీయం..?

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు రెబల్స్ గా మారి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి డాక్టర్‌ పి. శంకర్‌రావు కూడా షాద్ నగర్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డికి కేటాయించింది. దీంతో అసహనానికి గురైన శంకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెబల్ గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. శంకర్‌రావు గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2009లో షాద్‌నగర్‌ స్థానం జనరల్‌ కేటగిరికి మారడంతో ఆయన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా పని చేశారు.కానీ 2014 లో శంకర్‌రావుకు అధిష్టానం టికెట్ నిరాకరించడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ,రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్ లో పోటీ చేస్తానంటూ ముందుకొచ్చారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి షాద్‌నగర్‌ ఆర్డీవో, రిటర్నింగ్‌ అధికారి కృష్ణకు నామినేషన్‌ సమర్పించారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆయన సతీమణి విశ్వశాంతి చేత కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వెంటనే సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేయాలని ఫోన్‌ రావడం.. కాంగ్రెస్ లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన షాద్‌నగర్‌కు తన కూతురుతో కలిసి వచ్చి సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే షాద్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ తరఫున వేసిన నామినేషన్‌ను, తన సతీమణి విశ్వశాంతి స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. కాంగ్రెస్, మహాకూటమి తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల గెలుపుకు తాను కృషి చేస్తానని శంకర్‌రావు స్పష్టం చేశారు .ఈ పరిణామంతో ఆయనకు టికెట్ కేటాయించిన సమాజ్‌వాది పార్టీ షాకయింది. దీంతో శంకరా ఏమి నీ రాజకీయం అని పలువురు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.

జగన్, కేసీఆర్‌, పవన్‌.. ముగ్గురి టార్గెట్ ఒక్కటే

  తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తమ నియోజకవర్గాలకు రానివ్వని పరిస్థితి నెలకొందని.. స్వయంకృతాపరాధమే దీనికి కారణమని చంద్రబాబు అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదని అన్నారు. సమర్థంగా పని చేసినంత వరకు ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని గుర్తు చేశారు. బీజేపీ సీబీఐని కలెక్షన్ బ్యూరోగా మార్చేసిందని మండిపడ్డారు. సీబీఐలో పీఎంవో జోక్యంపై ఆ శాఖ అధికారే వెల్లడించారని చెప్పారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన ఒకే తానులో గుడ్డలని విమర్శించారు. జగన్, కేసీఆర్‌, పవన్‌ అజెండా ఒక్కటేనని అన్నారు. ఆ ముగ్గురూ మోదీని విమర్శించరని, టీడీపీనే టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకూడదనేదే వారి అజెండా అని విమర్శించారు. రాష్ట్రాన్ని వదిలేసి దేశంలో తిరుగుతున్నానన్నది అసత్యమని, ఏపీని అన్నిరంగాలలో నెంబర్ వన్ చేశానని, ఆ తర్వాతే దేశంపై దృష్టి పెట్టానని స్పష్టం చేశారు. తాను ప్రధాని అవుతానని ఎవరూ మాట్లాడవద్దని సూచించారు. తన సామర్ధ్యం మన రాష్ట్రానికే ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వంపై 76శాతం సంతృప్తి ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. ఆ 76 శాతం మంది ఓట్లేస్తే ప్రత్యర్ధులకు డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు.

బాలకృష్ణ ఇంటి వద్ద చెత్త.. కార్మికుల నిరసన

  అనంతపురం జిల్లా హిందూపురంలో నటుడు,ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులు ఆయన ఇంటివద్ద ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 279ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూపురం మున్సిపాలిటిలో విధుల నుంచి తప్పించిన 220 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. అనంతరం ఇంటిలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. కాగా మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జీవో నెంబరు 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు గతంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వంతో చర్చల అనంతరం 15 రోజుల తర్వాత సమ్మె విరమించారు. 279 జీవో రద్దుకు ప్రభుత్వం ఒప్పుకుందని కార్మికులకు యూనియన్ లీడర్లు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కానీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, 279 జీవో ప్రకారమే పని చేయాలని మున్సిపల్ కమిషనర్లు స్పష్టం చేయడంతో ఐదు రోజుల క్రితం కార్మికులు మళ్లీ సమ్మెలో దిగారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు.

కాంగ్రెస్ పై కోదండరాం అసంతృప్తి

  మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనే ఘట్టం ముగిసింది కానీ నామినేషన్ల గడువు ముగిసినా ఇంకా కొన్ని స్థానాల్లో సందిగ్దత మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సుమారు 11 స్థానాల్లో కూటమిలోని పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ తప్పేలా లేదు. అయితే ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని కోదండరాం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ.. బీసీల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకున్నామనీ, కానీ కాంగ్రెస్‌ మాత్రం తాము కోరుకున్న మిర్యాలగూడలో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్యను రంగంలోకి దించిందని.. కృష్ణయ్య పోటీపై తమకు కనీస సమాచారం కూడా లేదని అన్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షాలకు సీట్లు సర్దుబాటు చేయడంలో కాంగ్రెస్‌ జాప్యం చేయడంవల్ల కొంత నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆఖరి నిమిషం వరకూ స్పష్టత లోపించిన కారణంగానే 14 చోట్ల అభ్యర్థులను నామినేషన్‌ వేయించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ మాకు 8 సీట్లు ఇస్తామంది. కానీ 6 మాత్రమే ఇచ్చింది. సీట్ల సర్దుబాటు సరిగా జరగలేదు. అందరినీ ఒప్పించే పరిస్థితి ఉంటేనే జనగామ ఇవ్వమని కోరాను. కానీ అది రాద్ధాంతమైంది. బీసీలకు నా వల్ల నష్టం కలగకూడదనే పోటీ నుంచి తప్పుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఒకట్రెండు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ పెడతామని కాంగ్రెసే ప్రతిపాదించింది. మేం ఒప్పుకోలేదు. మాకు కేటాయించిన 8 సీట్లు ఏవో స్పష్టం చేసి.. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీదే. కూటమి అభ్యర్థులు పరస్పరం పోటీ పడడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ఒకవేళ కాంగ్రెస్‌ నుంచి స్పష్టత రాకపోతే స్నేహపూర్వక పోటీ తప్పకపోవచ్చు అని తెలిపారు. కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని అన్నారు. మేడ్చల్‌లో సోనియాగాంధీ సభలో తాను పాల్గొంటానని కోదండరాం తెలిపారు. దీన్నిబట్టి చూస్తుంటే కోదండరాం ఏదేమైనా కూటమిలో కొనసాగి, టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి కోదండరాం ఆశ నెరవేరుతుందో లేదో.