హనుమంతుడు దళితుడన్న సీఎం కు నోటీసులు

  ఓట్ల కోసం దేవుళ్ళని కూడా కులాల పేరుతో విభజిస్తారు కొందరు నేతలు. అలాంటి వారిలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒకరు. రాజస్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న యోగి హనుంతుడికి కులం ఆపాదించారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా మాలాఖేడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. 'హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు. రామ‌భ‌క్తులు కేవ‌లం బీజేపీకి మాత్ర‌మే ఓటు వేస్తారు, కానీ రావ‌ణ భ‌క్తులు మాత్రం కాంగ్రెస్‌కు ఓటేస్తారని' అన్నారు. యోగి వ్యాఖ్యలను పలు హిందూ సంస్థలు తప్పుపట్టాయి. ఓ హిందూ సంస్థ లీగల్‌ నోటీసులు కూడా ఇచ్చింది. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ రాజస్థాన్ సర్వ్‌ బ్రాహ్మిణ్‌ మహాసభ అధ్యక్షుడు సురేష్‌ మిశ్రా నోటీసులు పంపారు. మరి యోగి వ్యాఖ్యల దుమారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

పవన్ స్టేట్మెంట్ తప్పని రుజువు చేసిన సీఎం

  ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ హిందుత్వ పార్టీ కాదు రాజకీయ పార్టీ అన్నారు. పవన్ అభిప్రాయంతో కొందరు ఏకీభవించొచ్చు కొందరు ఏకీభవించక పోవొచ్చు. అయితే తాజాగా ఒక సంఘటన మాత్రం పవన్ స్టేట్మెంట్ తప్పు అనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తుంది. ఈ అభిప్రాయం ఏర్పడటానికి కారణం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. రాజస్థాన్‌లో బీజేపీ ప్రచార బాధ్యతలను తీసుకున్న ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే రాష్ట్రమంతటా పర్యటిస్తున్న ఆయన ఓ నియోజకవర్గంలో మాత్రం ప్రచారం చేయనంటున్నారట. పార్టీ అభ్యర్థుల కోసం హిందువులను ఏకం చేసేలా ప్రచారం చేస్తున్న యోగి.. కీలకమైన టోంక్ నియోజకవర్గంలో మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అక్కడ బీజేపీ ముస్లిం అభ్యర్థి యూనస్ ఖాన్ ని బరిలోకి దించింది. అయితే హిందవుల ఓట్లను కూడగట్టేందుకు ప్రచారం చేస్తున్న తాను ముస్లిం అభ్యర్థి కోసం ఎలా ప్రచారం చేయాలన్న సందిగ్ధంలో యోగి ఉన్నారట. యోగి తీరుపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. సొంత పార్టీ అభ్యర్థి ప్రచారానికి రాకపోవడం ఏంటని టోంక్ కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత సచిన్ పైలట్ ప్రశ్నిస్తున్నారు. ముస్లిం అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇష్టం లేదని, అందుకే ఆయన రావడం లేదని ఆరోపించారు. ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటడమేంటని సచిన్ పైలట్ విమర్శించారు.

నగరంలో హత్యలకు పోలీసులే సాక్ష్యం

  నగరంలో రోడ్లు రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. వరుస హత్యా ఉదంతాలతో నగరం ఉలిక్కిపడింది. హత్యలు జరుగుతుంది ఏ నిర్మానుష్య ప్రాంతాలలో అనుకుంటే పొరపాటే.. జనావాసాల్లో అందరు చూస్తుండగానే అతికిరాతకంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని పలు మార్లు పొడిచి చంపుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. కళ్లెదుట రక్తం మడుగులో బాధితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నచోద్యం చూస్తున్నారు తప్ప అడ్డుకున్నవారే లేరు. పోలీసుల కళ్లెదుటే హత్యలు జరుగుతున్నా హత్యలకు సాక్ష్యాలుగా మిగిలుతున్నారే తప్ప నిందితున్ని అదుపు చేయలేకపోతున్నారు. నెల క్రితం అత్తాపూర్‌  లో నడి రోడ్డుపై ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మరవక ముందే నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. సాలార్‌జంగ్‌ మ్యూజియం ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్‌ వద్ద రాత్రి 7.30 గంటలకు షకీర్‌ ఖురేషి, అబ్దుల్‌ ఖాజాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంతో ఖురేషి ఆటోలోంచి కత్తి తీసి అబ్దుల్‌ఖాజాపై దాడి చేశాడు. చనిపోయేముందు ఆటోడ్రైవర్‌ కేకలు వేస్తుండగా దూరంగా ఉన్న ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అక్కడికి రాగా..వస్తే నిన్నూ చంపేస్తానంటూ హెచ్చరించడంతో  వెనక్కి తగ్గాడు. అక్కడున్నవారు తమకేం పట్టనట్టు చోద్యం చూశారే తప్ప ఎవరూ అడ్డుకొనే సాహసం చేయలేదు. మరికొందరు హత్య ఉదంతాన్ని అడ్డుకోకపోగా సెల్ ఫోన్లలో చిత్రీకరించటం గమనార్హం. కాగా కడుపులో పోట్లు పొడిచి హత్య చేసిన నిందితుడు..హత్య తర్వాత కూడా పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. సమాచారం తెలుసుకున్న మీర్‌చౌక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు,విచారణ చేపట్టారు. అబ్దుల్‌ ఖాజా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మనకెందుకులే అని కళ్లెదుటే ప్రాణాలు పోతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న ఈ సమాజంలో మార్పు ఏనాడు వస్తుందో..?

చంద్రబాబు రోడ్‌షోకు అనుమతి లేదు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రజకూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో వేదికను పంచుకున్న చంద్రబాబు పలు చోట్ల నిర్వహించిన సభల్లో పాల్గొని టీటీడీపీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపారు. కాగా నేడు కూకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు తలపెట్టిన రోడ్ షోకు సైబరాబద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గంలోఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు పర్యటనలకు అనుమతి కోరుతూ ఈ నెల 27న దరఖాస్తు చేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షోకు అనుమతి ఇచ్చామని,ఆయన ఈనెల 26నే అనుమతి తీసుకున్నారని కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు. ఒకే రోజు మరో పార్టీకి అనుమతి ఇవ్వలేని తెలిపారు. కూకట్‌పల్లిలో టీడీపీ తరుపున మహాకూటమి అభ్యర్థిగా హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కోడలికి మద్దతుగా నేడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్‌షోకు అనుమతి నిరాకరించడం గమనార్హం. కాగా చంద్రబాబు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరుపున మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ నిర్మాత, వ్యాపారవేత్త భవ్య ఆనంద్ ప్రసాద్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

చంద్రముఖి ఆచూకీ లభ్యం..

  రెండు రోజులుగా కనిపించకుండా పోయిన గోషామహల్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి ఆచూకీ లభ్యమైంది. చంద్రముఖిని విజయవాడలో గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే చంద్రముఖి అదృశ్యాన్ని పోలీసులు ఓ డ్రామాగా తేల్చారు. కాగా తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు చెబుతున్నారు. ఈరోజు చంద్రముఖిని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. చంద్రముఖి మంగళవారం వేకువజామున మూడు గంటల నుంచి కనిపించడం లేదని పలువురు ట్రాన్స్ జెండర్స్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  మరోవైపు చంద్రముఖి మిస్సింగ్‌పై హైకోర్టులో ఆమె తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖి ఎక్కడ ఉన్నా కోర్టులో ప్రవేశపెట్టేవిధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయస్థానం చంద్రముఖిని గురువారం ఉదయం 10.30 లోపు కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. కాగా సీసీ టీవీ ఫుటేజ్ ల ఆధారంగా దర్యాప్తు చేప్పట్టిన పోలీసులు ఎట్టకేలకు చంద్రముఖి మిస్టరీ కేసు ఛేదించారు. 

కేసీఆర్‌ వల్ల ప్రతి కుటుంబంపై 2 లక్షల అప్పుభారం

  ప్రజాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభకు వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోందని రాహుల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్రంలో మోదీ ఒక్కో వ్యవస్థను నాశనం చేస్తూ వస్తున్నారని.. సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఈసీ ఇలా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం ఒకవైపు ఉంది. రైతులు, యువకులు, ప్రజలు మరోవైపు ఉన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి గెలిచిన తర్వాత.. దేశంలో మోదీపై పోరాడేందుకు ఇదే కూటమి దిక్సూచిగా నిలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో మోదీకి సంబంధించిన 'బీ టీమ్‌'తో మనం పోటీ పడుతున్నాం. మొదట మోదీ 'బి-టీమ్‌' అయిన టీఆర్ఎస్ ను ఓడించాలి. ఆ తర్వాత కేంద్రంలో మోదీ 'ఏ టీమ్'ను ఓడిద్దాం అని పిలుపునిచ్చారు. ఇటీవల మోదీ తెలంగాణకు వచ్చారు. కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్ కు ఎలాంటి తేడా లేదన్నారు. అయితే పార్లమెంట్‌లో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి టీఆర్ఎస్ నేతలు మద్దతిచ్చారని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంలోనూ బీజేపీకే టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. కాంగ్రెస్ ‌మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తోంది. బీజేపీ కూటమిలో ఉన్న టీఆర్ఎస్ ను ప్రజాకూటమి ఇప్పుడు ఓడించేందుకు సిద్ధమైంది అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ, ఏపీకి కేంద్రం విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. తెలంగాణ, ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ సర్కారు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. టీఆర్ఎస్ మోదీకి మద్దతు ఇస్తున్నప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. విభజన చట్టంలోని ఏ ఒక్కహామీనీ నెరవేర్చని ప్రధానిని కేసీఆర్‌ ఎందుకు నిలదీయడం లేదు అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఇచ్చాం. అయితే ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరిట కేసీఆర్‌ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది‌. రూ.50 వేల కోట్ల వ్యయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును రూపకల్పన చేసింది. అయితే ఆ ప్రాజెక్టుకు పేరు మార్చి అంచనాలు పెంచి.. రూ.90 వేల కోట్లకు చేర్చారు. ప్రాజెక్టు పేర్ల మార్పు కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. కేసీఆర్‌ నిర్ణయం వల్ల ప్రతి కుటుంబంపై రూ.2 లక్షల మేర అప్పుభారం పడింది అని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికి మినహా యువతకు ఉద్యోగాలు రాలేదు. మద్దతు ధర అడిగిన రైతులపై లాఠీఛార్జ్‌ చేశారు. రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. వారికి రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంట్‌గా ఇస్తాం అన్నారు. కేసీఆర్‌ 2 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని 5 వేలు కూడా నిర్మించలేదు అని విమర్శించారు. అంతా ఏకమై టీఆర్ఎస్ ను ఒడిద్దాం అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

సేవ్ ఇండియా సేవ్ కానిస్టిట్యూషన్

  ముప్పైఆరేళ్ల శత్రుత్వాన్ని పక్కనబెట్టి తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీలు జట్టు కట్టాయి. ప్రజాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన సభకు ఇరుపార్టీల జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, చంద్రబాబు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. రాహుల్‌, చంద్రబాబుతో పాటు గాయకుడు గద్దర్ కూడా పంచుకున్నారు. గద్దర్‌కు రాహుల్, చంద్రబాబు అంబేద్కర్ చిత్ర పటాలను బహుమతిగా అందజేశారు. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గాయమా.. కోట్లాది ప్రాణమా.. భూ తల్లి బిడ్డలు, చిగురించే రెమ్మలు ’ అంటూ తన గళాన్ని విప్పారు. గద్దర్ పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు. పాటను వింటూ ఆయన ముసిముసినవ్వులు చిందించారు. ఆనాటి ఆకాంక్షలను గుర్తు చేసేలా సభనుద్దేశించి గద్దర్ ప్రసంగించారు. ‘సేవ్ ఇండియా సేవ్ కానిస్టిట్యూషన్’ అంటూ బయలుదేరినారంటూ రాహుల్, చంద్రబాబుకు గద్దర్ వందనాలు తెలిపారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తుంటే... ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఇద్దరు మహానుభావులు ముందుకొచ్చారని రాహుల్, చంద్రబాబును గద్దర్‌ కొనియాడారు. ప్రజాఫ్రంట్ ఇండియన్ పీపుల్ ఫ్రంట్‌గా మారి వీరిద్దరు దేశవ్యాప్తంగా గొప్ప ఉద్యమాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. దక్షిణ, ఉత్తర భారతదేశాన్ని కలపాలని కోరారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ను ఎదురించాలని కోరారు.

2014లో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దు

  ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్, టీడీపీ అధినేతలు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఆయా పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మందకృష్ణ మాదిగ... తెలంగాణ ఏర్పాటుకు అమరుల త్యాగఫలం ఎంత ముఖ్యమో.. సోనియా సాహస నిర్ణయం అంతే ముఖ్యం అని అన్నారు. సోనియాకు కృతజ్ఞత చూపడంలో మనం విఫలమయ్యామని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్‌కు అండగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. దళితులకు కేసీఆర్ నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి అండగా నిలబడింది చంద్రబాబేనని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు కేసీఆర్ చోటివ్వలేదని నిప్పులుచెరిగారు. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రాలో సక్రమంగా అమలు జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించడం లేదని మందకృష్ణ ఆరోపించారు.  2014లో చేసిన పొరపాటు ఇప్పుడు చేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

డిసెంబర్‌ 12న ఏర్పడేది ప్రజాకూటమి ప్రభుత్వం

  ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్, టీడీపీ అధినేతలు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఆయా పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల్లో నిరాశ, నిస్పృహలే మిగిలాయని, ఏ వర్గాన్ని చూసినా అసంతృప్తితోనే ఉన్నారని అన్నారు. దళిత సీఎం, డబుల్ బెడ్‌రూమ్, మూడెకరాల భూమి అంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టి మోసం చేశారని ధ్వజమెత్తారు. డిసెంబర్‌ 12న ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10సీట్లలో ప్రజాకూటమిదే గెలుపు అన్నారు. ప్రజాకూటమి ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. అదేవిధంగా అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. వృద్ధ దంపతులిద్దరికీ రూ.2వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ రూ.3వేలకు పెంచుతామన్నారు. మహిళా సంఘాలకు రూ. లక్ష గ్రాంట్ ఇస్తామని, ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తామని ఉత్తమ్ ప్రకటించారు. దేశాన్ని నిరంకుశ, నియంతృత్వ పాలన నుంచి కాపాడేందుకే కాంగ్రెస్-టీడీపీలు ఏకమయ్యాయని స్పష్టం చేశారు.

కేసీఆర్‌కు అసలు ఓటు అడిగే అర్హత లేదు

  మహాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా  సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ తమ ముందు తలవంచాల్సిందేనని అక్బరుద్దీన్‌ అన్నారని, అలాంటి ఎంఐఎంతో అంటకాగడానికి కేసీఆర్‌కు సిగ్గుందా? అని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీలు, మేధావులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. గోరక్ష పేరుతో చిత్రవధకు గురిచేస్తున్నారని, దళితులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బీజేపీపై పోరాడుతుంటే.. టీఆర్‌ఎస్‌ బీజేపీతో అంటకాగుతోందని విమర్శించారు. దళితులపై హత్యాకాండ కొనసాగుతుంటే కేసీఆర్‌ ఒక్కమాట మాట్లాడలేదని, బీజేపీకి కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు. ఓ వైపు బీజేపీతో, మరోవైపు ఎంఐఎంతో కేసీఆర్‌ అంటకాగుతున్నారన్నారు. ఇచ్చిన హమీలు కేసీఆర్ నిలబెట్టుకోకపోగా ధర్నాచౌక్‌ను రద్దు చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు అసలు ఓటు అడిగే అర్హత లేదన్నారు. గెలిస్తే సేవ చేస్తా, ఓడితే ఫామ్‌హౌస్‌కు వెళ్తానని కేసీఆర్‌ తన ఓటమిని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ తొత్తు కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లే

  మహాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్, టీడీపీ అధినేతలు రాహుల్ గాంధీ, చంద్రబాబుతో పాటు ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నామా నాగేశ్వరరావు...రాహుల్‌-చంద్రబాబు ఒకే వేదిక పంచుకోవడం చారిత్రక ఘట్టం అన్నారు. తెలంగాణ ప్రజలంతా రాహుల్, చంద్రబాబు ద్వయానికి నీరాజనం పలికారని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మాయమాటలు చెబుతున్నారని టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సందర్భంలో రాహుల్, చంద్రబాబు ఏకమయ్యారని అన్నారు. కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని నామా పేర్కొన్నారు. చంద్రబాబును అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు అనడం సిగ్గుచేటన్నారు. ‘హైదరాబాద్‌కు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తెచ్చినందుకు చంద్రబాబును అడ్డుకోవాలా? హైదరాబాద్‌కు ఐటీ తీసుకొచ్చినందుకు చంద్రబాబును అడ్డుకోవాలా? హైదరాబాద్‌కు ఔటర్‌రింగ్‌ రోడ్డు తెచ్చినందుకు చంద్రబాబును అడ్డుకోవాలా?’ అని నామా ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ నాయకులు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు తీసుకురాలేకపోయారని నిలదీశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందన్నారు. గిరిజన యూనివర్సిటీ ఎటుపోయిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని నామా డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలను ప్రజా కూటమే గెలుస్తుందని నామా ధీమా వ్యక్తం చేశారు.

అటు ఎంఐఎం.. ఇటు టీఆర్‌ఎస్‌.. ఇద్దరూ బీజేపీకే

  వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీద విమర్శల దాడి చేశారు. ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడి ప్రజలు తమకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, నీళ్లు నిధులు, నియామకాలు అన్నీ తమకే అని కలలు కన్నారు. కానీ, ఈ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఆశించినట్లుగా ఏమీ చేయలేకపోయింది. ప్రజల కలలను కేసీఆర్‌ వమ్ము చేశారు. అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణను 2 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంటే .. కేసీఆర్‌ కొడుకు ఆదాయం మాత్రం 4వందల రెట్లు పెరిగిందని విమర్శించారు. రూ.40 వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టు వ్యయాన్ని 80వేల కోట్లకు పెంచారని, కేసీఆర్‌ ప్రాజెక్టు పేరు మార్చి 40 వేల కోట్ల దోపిడీ చేశారని రాహుల్‌ మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు అని చెప్పి యువతను కేసీఆర్‌ మోసం చేశారు. ఎన్ని ఉద్యోగాలో వచ్చాయో యువతే చెప్పాలి. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి ఒక్కరినీ కేసీఆర్‌ మోసం చేశారు అని రాహుల్‌ విమర్శించారు. మహిళా సంఘాలకు కూడా కేసీఆర్‌ అన్యాయం చేశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఎన్నో ఆశలు చూపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీ మోసంగా మారింది అని విమర్శించారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ ఒక్కటేనని ఆరోపించారు. మోదీకి అవసరమైన ప్రతిసారీ కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు. మోదీ దేశాన్ని ఎప్పుడూ విభజించే పనిలో ఉంటారు. కేసీఆర్‌ మద్దతుతో ప్రజల మధ్య మోదీ వివక్ష చూపుతున్నారు. పార్లమెంట్‌లో పాసైన ప్రతి బిల్లుకూ కేసీఆర్‌ మద్దతు ఉంది. టీఆర్‌ఎస్‌ అంటే ‘తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌పరివార్‌’ అని ఎద్దేవాచేశారు. ఇప్పటి వరకు రాఫెల్ గురించి కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అటు ఎంఐఎం.. ఇటు టీఆర్‌ఎస్‌ ఇద్దరూ బీజేపీకే మద్దతిస్తున్నారని ఆరోపించారు. ముగ్గురిని మూకుమ్మడిగా ఓడిస్తేనే దేశానికి విముక్తి కలుగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని, కేసీఆర్‌ను ఓడించడం ఖాయమని జోస్యం చెప్పారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు, నియమకాల కలను నిజం చేస్తామని అన్నారు. 'అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష గ్రాంట్ ఇస్తాం. మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.500 కోట్లు కేటాయిస్తాం. పేదలకు ఇళ్లు.. దళితులు, గిరిజనులకు భూమి ఇస్తాం. యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం. తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం' అని రాహుల్‌ భరోసా ఇచ్చారు.

చంద్రముఖిది కిడ్నాప్ కాదు..

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఓ ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచారు. ఆమే చంద్రముఖి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్టహాసంగా నామినేషన్ వేసిన చంద్రముఖి ప్రచారం ముమ్మరం చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ చంద్రముఖి మంగళవారం నుంచి ఆచూకీ తెలియడం లేదు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్-2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న చంద్రముఖి మంగళవారం వేకువజామున మూడు గంటల నుంచి కనిపించడం లేదని పలువురు ట్రాన్స్ జెండర్స్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు చంద్రముఖి మిస్సింగ్‌పై హైకోర్టులో ఆమె తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖి ఎక్కడ ఉన్నా కోర్టులో ప్రవేశపెట్టేవిధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషనర్ వినతిని కోర్టు అంగీకరించింది. ఈ మేరకు మధ్యాహ్నం విచారించిన న్యాయస్థానం రేపు ఉదయం 10.15 గంటలకు చంద్రముఖిని కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. కాగా చంద్రముఖి అదృశ్యం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక సమాచారం లభించింది. సీసీటీవీ ఫుటేజీలో చంద్రముఖి తానే స్వయంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయని, తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించిందని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. చంద్రముఖిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆమె అదృశ్యమైందని చెప్పారు. చంద్రముఖి తన లాస్ట్ ఫోన్ కాల్స్ సహచర ట్రాన్స్‌జెండర్స్‌తో మాట్లాడిందని, ఆ తరువాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని డీసీపీ వెల్లడించారు. చంద్రముఖి ఆచూకీని కనుగొనేందుకు మొత్తం పది బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, హైదరాబాద్‌తో పాటు అనంతపురం, ఇతర ప్రాంతాల్లో కూడా వెతుకుతున్నామని చెప్పారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే కేసును చేధిస్తామని డీసీపీ పేర్కొన్నారు.

కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు

  40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ కోస్గి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్‌ గెలిచింది. ఇప్పుడు ప్రజాకూటమిని గెలిపించడానికి రాహుల్‌ గాంధీ వచ్చారు. రాహుల్‌ రాకతో కోస్గి పునీతమైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కొస్గిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తనను కొడంగల్‌ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారన్నారు. 9ఏళ్ల క్రితం కొడంగలా.. వరంగలా అని అవమానించారు. ఢిల్లీ వరకు కొడంగల్‌ గళాన్ని వినిపించా అన్నారు. కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నందుకు 39 అక్రమ కేసులు పెట్టారని, అయినా వెనక్కి తగ్గేది లేదు.. ప్రజల అండతో చివరిదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయి. కురుక్షేత్రంలో ప్రజలే గెలుస్తారని అన్నారు. కేసీఆర్‌ దగ్గర అధికారం, ధనం ఉంటే మనవైపు ధర్మం, న్యాయం ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు.   కేసీఆర్‌ కుటుంబాన్ని మరోసారి గెలవనీయం. ఒక్కసారి వాళ్లు గెలిస్తే వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. యువత బలిదానంతో వచ్చిన తెలంగాణలో కేవలం కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశాడు అని విమర్శించారు. కేసీఆర్‌లా కుటుంబంలో ఒకరికి కాదు.. ముసలమ్మ, ముసలయ్యకు రెండు పెన్షన్లు రూ.4వేలు ఇస్తామన్నారు. ఇది కాంగ్రెస్‌ వాగ్ధానమని, గుండెల నిండా ఊపిరి పీల్చుకుని హస్తం గుర్తును గెలిపించండని కోరారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.

యాదాద్రి లో కూలిన విమానం

  యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విమానం కుప్పకూలింది. హకీమ్ పేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఎయి‌ర్‌ ఫోర్స్ శిక్షణా విమానం యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద  కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం కాలి బూడిదైంది. కాగా ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన పైలట్ పారాష్యూట్ సహాయంతో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. పైలెట్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్‌గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే ఆర్మీ వైద్యులు మరో హెలికాఫ్టర్‌లో ప్రమాదస్థలికి చేరుకుని పైలెట్‌కు వైద్యం అందజేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కూకట్ పల్లిలో ప్రచారానికి భువనేశ్వరి దూరం

  కూకట్‌పల్లిలో మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగడంపై నారా భువనేశ్వరి స్పందించారు. తన కోడలు సుహాసిని గెలుపుపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయితే సుహాసిని తరపున ప్రచారంలో పాల్గొనడం లేదని తెలిపారు. సుహాసినికి భువనేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 12 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందజేసినట్లు భువనేశ్వరి తెలిపారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్ ద్వారా డిసెంబర్‌ 9న బాలికలకు స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండేళ్లపాటు ప్రతి నెల రూ.5 వేల స్కాలర్‌షిప్‌ అందజేస్తామన్నారు. ఇంటర్ బాలికలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతోనే స్కాలర్ షిప్ ఇస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ అందిస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. ట్రస్ట్ ద్వారా 4,500 మంది అనాథలకు విద్య అందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్ ద్వారా సేవలందించామని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులకు ట్రస్ట్‌ ద్వారా సేవలు అందజేశామన్నారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌కు రెడ్ క్రాస్ అవార్డ్ రావటం సంతోషకరమన్నారు. ఉచితంగా వైద్య శిబిరాలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో విద్య, వైద్యానికి ఎన్టీఆర్ ట్రస్ట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని భువనేశ్వరి పేర్కొన్నారు.

దొరకని గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆచూకీ

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఓ ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచారు. ఆమే చంద్రముఖి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్టహాసంగా నామినేషన్ వేసిన చంద్రముఖి ప్రచారం ముమ్మరం చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ చంద్రముఖి మంగళవారం నుంచి ఆచూకీ తెలియడం లేదు. దీంతో బీఎల్‌ఎఫ్ నేతలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రంలోగా చంద్రముఖి ఆచూకీ కనుక్కోకుంటే ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని బీఎల్‌ఎఫ్ నేతలు హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్-2లోని ఇందిరానగర్‌లో చంద్రముఖి నివాసం ఉంటున్నారు. ఆమె మంగళవారం వేకువజామున మూడు గంటల నుంచి కనిపించడం లేదని పలువురు ట్రాన్స్ జెండర్స్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు చంద్రముఖి తల్లి అనితమ్మ ఈ రోజు హై కోర్టును ఆశ్రయించనుంది. అలాగే బహుజన్ లెఫ్ట్ పార్టీ మిస్సింగ్ ఎఫ్ఐర్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఇవ్వనుంది. గోషామహల్ నుండి బీజేపీ తరఫున రాజాసింగ్ లోథ్, కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ పోటీ చేస్తున్నారు. బీఎల్ఎఫ్ తరఫున చంద్రముఖి పోటీ చేస్తున్నారు. ఇద్దరు రాజకీయ ఉద్దండుల నడుమ చంద్రముఖి పోరు రసవత్తరంగా మారింది. ఇప్పుడు కిడ్నాప్‌కు గురికావడం కలకలం రేపుతోంది. 

టీడీపీకి షాకిచ్చిన హైకోర్టు.. ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు

  అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు షాక్ తగిలింది. శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  2014 ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓడిపోయిన వైసీపీకి చెందిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా ఈరన్న దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. మంగళవారం ఈ తీర్పును వెల్లడించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఈరన్న, వైసీపీ నుంచి తిప్పేస్వామి బరిలోకి దిగారు. ఈ పోటీలో ఈరన్న, తిప్పేస్వామిపై 14వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు. అయితే ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తన మీద ఉన్న కేసుల వివరాలు, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే వివరాలను పేర్కొనలేదు. దీంతో ఈరన్న ఎన్నికను సవాల్‌ చేస్తూ 2014 జూన్‌లో తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగా కేసుల వివరాలు ఇవ్వలేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే సమాచారం ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించి.. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. టీడీపీ తరపున పోటీ చేసేందుకు తన క్లయింటుకు చివరి నిమిషంలో బీఫాం లభించిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు పేర్కొనలేకపోయారని ఈరన్న తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈరన్న భార్య ప్రభుత్వ ఉద్యోగి అయినా తర్వాత రాజీనామా చేశారని.. 2002లో కర్ణాటకలోని ఓ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు చిన్నదేనని, ఈకేసును అఫిడవిట్‌లో పేర్కొనకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని.. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని న్యాయవాది కోరారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. ఈరన్నకు షాక్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పు వెలువడడంతో వైసీపీ కార్యకర్తలు మడకశిరలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ తీర్పుపై ఈరన్న అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.