ఫామ్ హౌస్ లో వంకాయలు పండించుకోవటమే

  కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా కేపీహెచ్‌బీలో సీపీఐ జాతీయ నేత నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ.. సుహాసిని పోటీపై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు.  సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. అమెరికాలో చదివిన కేటీఆర్‌కు పోటీచేసే అర్హతల గురించి తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభను కేసీఆర్‌ ఎందుకు అర్థాంతరంగా రద్దు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కూటమి పేరు చెబితేనే కేసీఆర్‌, కేటీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. పరిపాలన చేతకాక 9నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని నారాయణ మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేయడంలో తెరాస ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది ప్రజా కూటమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11 తర్వాత కేసీఆర్‌ ప్రగతి భవన్‌ విడిచి ఫామ్ హౌస్ లో వంకాయలు పండించుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌

  టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌‌కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌ ని నియమించింది. ఆయనతో పాటుగా ఉపాధ్యక్షులుగా వినోద్ కుమార్‌, జాఫర్ జావేద్‌ నియమించింది. 8 మంది జనరల్‌ సెక్రటరీలు, నలుగురు సెక్రటరీలుగా నియామకం కూడా జరిగింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరి అశోక్ గెహ్లాట్ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కుసుమ కుమార్‌ను నియమించిన విషయం తెలిసిందే. అజారుద్దీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మొత్తం నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు అయ్యారు. అజారుద్దీన్‌ 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో రాజస్థాన్‌లోని టాంక్‌సవాయ్ మధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాకుండా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో వచ్చే ఎన్నికల్లో అధిష్టానం అవకాశం ఇస్తే సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తానని తన కోరిక వెళ్లబుచ్చారు. అజారుద్దీన్‌ వ్యాఖ్యలతో పార్టీలో పెను దుమారమే రేగింది. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అజారుద్దీన్‌ కి స్టార్ కంపెయినర్ గా భాద్యతలు అప్పగించింది. తాజాగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కీలక భాద్యతలు అప్పగించింది.  

రేవంత్‌రెడ్డి భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదే: హైకోర్టు

  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి భద్రతకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్‌రెడ్డి భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. రేవంత్ రెడ్డికి 4 ప్లస్‌ 4 భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ ఈ భద్రతను కొనసాగించాలని పేర్కొంది. తనకు భద్రత కల్పించాలని రేవంత్‌ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత.. కేంద్రం రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. స్థానిక నేతల భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రేవంత్‌కు కేంద్రం భద్రత కల్పించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరించాలని కోరింది. రేవంత్ రెడ్డి కూడా తన భద్రతపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించాలంటూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేయలేదంటూ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాజాగా తీర్పును వెలువరించింది. రేవంత్‌రెడ్డికి భద్రత రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ఆదేశించింది.  రేవంత్‌రెడ్డికి 4 ప్లస్‌ 4 భద్రత, ఎస్కార్ట్‌ కల్పించాలని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు భద్రత కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కేటీఆర్ సభలో నేరేళ్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం

  మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న నేరెళ్ల బాధితుడు అత్మహుతుకి యత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటన బాధితులకు మంత్రి ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయం చేయకపోగా తమపై పోలీసులతో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారని నినదిస్తూ బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. తనను చంపేస్తారంటూ రోదించాడు. మా జీవితాలు నాశనం చేసిండు,పోలీసులతో కొట్టించాడు,నేను చేసిన తప్పేంది అంటూ రోదించాడు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోబోయాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకొని తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండేళ్ల క్రితం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవటానికి లారీలను తగలబెట్టిన ఘటనలో 11 మందిపై కేసులు నమోదు కాగా అప్పటి ఎస్పి విశ్వజిత్ కాంపాటి హయాంలో 8మంది బాదితులకు ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదు

  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ తాజాగా సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం కాదని, బ్లఫ్ మాస్టర్ విమర్శించారు. తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో పార్లమెంట్‌లో కేసీఆర్ లేనేలేరని అన్నారు. కేసీఆర్‌ది దీక్షనే కాదని, ఏసీ గదిలో దీక్ష చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపడం ఖాయమన్నారు. హైదరాబాద్‌ వండిపెట్టిన బిర్యాని లాంటిదని.. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి బ్రహ్మానందరెడ్డి, చంద్రబాబు, వైఎస్‌, ఎన్టీఆర్ కృషే చేశారని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు హోదా అడగడం నమ్మక ద్రోహమేనని విమర్శించారు. విభజనచట్టం హామీలు అమలుచేయాలని కేసీఆర్, మోదీని అడగలేదని జైరాం రమేష్ అన్నారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జునఖర్గే కూడా కేసీఆర్ మీద విమర్శల దాడి చేశారు. తాజాగా గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఆమెతో కేసీఆర్‌ ఫొటో దిగారని గుర్తుచేశారు. నాడు ఫొటో దిగి, ఇప్పుడు శత్రువులమంటున్నారని ఆయన మండిపడ్డారు. మోదీ సర్కార్‌కు అనేక విషయాల్లో కేసీఆర్‌ మద్దతిచ్చారన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీకి కేసీఆర్‌ మద్దతిచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఖర్గే విమర్శించారు.

రాహుల్‌ గాంధీ జోకర్‌లా మాట్లాడుతున్నారు

  ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని అన్నారు. ఎవరి వద్ద బిచ్చమెత్తుకోబోమన్నారు. అవసరమైతే సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్‌ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్‌ విషయంలో ఇవాళ మిగులు సాధించి ఇతర రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు చీకట్లు రాలేదు. రాజస్థాన్‌కు పరస్పర ఒప్పందం కింద విద్యుత్‌ను ఇస్తున్నాం. ఎవరూ ధర్నాలు చేయకుండా, అడ్డక్కుండానే అన్నీ చేశాం. గోదావరి నది ఖమ్మం గుండానే పోతోంది. అయినా గత పాలకులు జిల్లాను పట్టించుకోలేదు. పైగా మోసం చేశారు. నాగార్జున సాగర్‌ కట్టినప్పుడు కాలువ ఇల్లెందు మీదుగా పోవాల్సింది. కాంగ్రెస్‌ నాయకులు పట్టించుకోకపోవడంతో నీళ్లను ఆంధ్రకు తీసుకుపోయారు అని విమర్శించారు. తెలంగాణకు ఈ గతి పట్టించింది కాంగ్రెస్‌ కాదా? ఇప్పుడు మళ్లీ ఓట్లడుగుతున్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలి. రాజ్యాంగం వీళ్లే రాశారు. దేశానికి ప్రణాళిక రూపొందించారు. వీళ్లే పరిపాలించారు. అయినా పోడు భూముల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు. మేం అధికారంలోకి రాగానే ఒక్కో జిల్లాకు రెండు మూడు రోజులు అధికారులతో కలిసి వచ్చి సమస్యను పరిష్కరిస్తాం. సంవత్సరంలోపు పోడు భూముల సమస్యకు పరిష్కరిస్తాం అన్నారు. కాంగ్రెస్‌కు సొంత వెన్నుముఖ లేదు. అన్నింటికీ ఢిల్లీ పోవాల్సిందే. రాహుల్‌ గాంధీ జోకర్‌లా మాట్లాడుతున్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు రీడిజైన్లు చేశామంటున్నారు. ‘మాది కమిషన్ల బతుకు కాదు, పోరాట బతుకులు. రాహుల్ నీకు దమ్ముంటే రుద్రమ్మకోటకు రా.. మీ తండ్రి పేరు మీద ఉన్న రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ఎలా ఉన్నాయో చూద్దామా’ అని సవాల్ విసిరారు.ప్రాజెక్టుల రిడిజైనింగ్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన అబద్ధాలనే రాహుల్‌ చెబుతున్నారు. ఇలాంటి వాళ్లంతా వస్తే మళ్లీ మన నెత్తిన టోపీ పెడతారు అని కేసీఆర్‌ విమర్శించారు.

యోగా గురువుకి సుప్రీంకోర్టు నోటీసులు

  ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబాకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఆయన జీవితం ఆధారంగా రూపొందించిన ఓ పుస్తకంపై దాఖలైన పిటిషన్‌ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జుగ్గర్‌నౌట్‌ బుక్స్‌ అనే పబ్లిషర్‌ ‘గాడ్‌మ్యాన్‌ టు టైకూన్’ అనే పుస్తకాన్ని ప్రచురించగా రాందేవ్‌ బాబా దీనిపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. పుస్తకంలో తన పరువుకు భంగం కలిగించే సమాచారం ఉందని, తన ఆర్థిక ప్రయోజనాలను, కీర్తిప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా సమాచారం ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో దిల్లీ హైకోర్టు ఆ పుస్తకం అమ్మకాలను, ప్రచురణను నిలిపేయాలని తీర్పు చెప్పింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సదరు పబ్లిషర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు నేపథ్యంలో రెస్పాండెంట్‌ 1 (రాందేవ్‌)కు నోటీసులు పంపినట్లు జస్టిస్ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్త నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

రోజుకు రెండు పేర్లు.. లగడపాటి సర్వే

  ఎన్నికలప్పుడు ఎవరు ఎన్ని సర్వేలు చేపట్టినా లగడపాటి రాజగోపాల్ సర్వే కోసమే అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తారు. ఆయన చెప్పిన సర్వేకి కాస్త ఆటో ఇటో స్థానాలు వచ్చినా.. ఆయన చెప్పిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అందుకే ఆయనకి ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు కూడా పెట్టేశారు. తాజాగా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఆయన పేరుతో ఇప్పటికే ఫేక్ సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఖండించిన లగడపాటి ఎన్నికల రోజు తన సర్వే వివరాలు ప్రకటిస్తా అన్నారు. కానీ అనూహ్యంగా లగడపాటి తన సర్వే వివరాలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని లగడపాటి జోస్యం చెప్పారు. రెబెల్స్‌గా బరిలోకి దిగిన వీరు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు. తిరుమల వచ్చిన సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొందని చెప్పారు. తన సర్వే ఫలితాలను డిసెంబర్‌ 7న వెల్లడిస్తానని తెలిపారు. అంతకుముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ బోథ్‌ నియోజకవర్గం నుంచి జాదవ్‌ అనిల్‌ కుమార్‌ గెలవబోతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రలాభోలకు తలొగ్గడం లేదు. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబల్స్ కు పట్టం కట్టడం సంతోషకరమన్నారు.

ఎన్నికల వాయిదాకు, నా హత్యకు కుట్ర: రేవంత్ రెడ్డి

  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమీప బంధువు ఫామ్ హౌస్‌లో సోదాలు చేసిన ఐటీ అధికారులకు రూ.55 లక్షల నగదు లభించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కువ మొత్తంలో నగదు దొరికినా కావాలనే అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. నరేందర్ రెడ్డి ఇంటిపై జరిగిన సోదాల్లో రూ. 17.51 కోట్లు దొరికాయని, కేవలం రూ.50లక్షలు మాత్రమే దొరికాయని అధికారులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసిన 50 కోట్ల లావాదేవీల వివరాలున్న డైరీ ఐటీ అధికారుకు దొరికిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ముడుపుల వివరాలు బయటకు రాకుండా రహస్య నివేదికను తొక్కిపెట్టారని ఆరోపించారు. ఇది బయటపడితే కేసీఆర్ వ్యవహారం బయటపడుతుందని ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేసారు. అధికారులు ఎందుకు నివేదికను బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తమిళనాడులోని ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసినట్టుగా, కొడంగల్ నియోజకవర్గ ఎన్నికలు కూడా వాయిదా వేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా తన హత్యకు కూడా కుట్ర జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్ధలకు చెందిన సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని ఆదేశాలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు తనకు భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని, అందుకే తన భద్రతను పెంచడంలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

యువకుడి ప్రశ్న.. కేసీఆర్ ఆగ్రహం

  కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. ముస్లిం రిజర్వేషన్ పై ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ అతన్ని తిట్టారు. సభలో కేసీఆర్ ప్రసంగిస్తుండగా, ప్రేక్షకుల్లోంచి ఓ యువకుడు లేచి 12 శాతం మైనారిటీ కోటా ఏమైందంటూ ప్రశ్నించాడు. సహనం కోల్పోయిన కేసీఆర్.. బాత్ కర్తే, బైఠో కామోష్ బైఠో. ఓహి బారాహ్ పర్సెంట్ హై బోలే కామోష్ బైఠో... బైఠ్ జావో (మాట్లాడుతాను. నోరు మూసుకుని కూర్చో. ఆ 12 శాతం గురించే చెబుతున్నా. నోరు మూసుకుని కూర్చో) అని వారించారు. చెప్తా కదరా భయ్.. ఎందుకు తొందరపడుతున్నావ్ అంటూ తిరిగి ప్రసంగాన్ని ప్రారంభించారు. కానీ ఆ యువకుడు కూర్చోకపోవడంతో.. బైఠో కామోష్ బైఠో.బోల్రూన్ బైఠో,బైఠో నా తుమ్హారే బాప్ కో బోలున్ క్యా బాతెం.( "నోరు మూసుకో. చప్పుడు చేయకుండా కూర్చో. ఏం మాటలు నీ బాబుకి చెప్పాలా? ఎందుకు తమాషా చేస్తున్నావు?" అని గద్దించారు. ఇంతలో అతని వైపు కొంత మంది వాలంటీర్లు దూసుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని కేసీఆర్ ఆపేశారు. ఇలాంటి వారు ఉంటూనే ఉంటారు. తాగి వచ్చి గొడవ చేసేవాళ్ళు అంటూ ప్రసంగం ప్రారంబించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది  కానీ కేంద్రం నుండి సానుకూల స్పందన లభించలేదని తెలిపారు. ఈ సన్నాసులు ఒర్లినట్టు కాదు.. మేము నిజాయితీగా కృషి చేస్తున్నాం..కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కాని ప్రభుత్వాన్ని ఏర్పాటుకు నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను. గిరిజనులు, ముస్లింలకు మనం కోరుకున్న రిజర్వేషన్లు తప్పనిసరిగా లభిస్తాయి 'అని ఆయన అన్నారు.

టీడీపీకి షాక్.. జనసేనలోకి మాజీ మంత్రి

  మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు టీడీపీకి వీడ్కోలు చెప్పి నేడో,రేపో జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరికపై రావెల ఇప్పటికే పవన్‌తో రెండు సార్లు సమావేశమయ్యారు. అయితే టిక్కెట్‌ విషయంలో పవన్‌ కల్యాణ్‌ నుంచి స్పష్టమైన హామీ ఇంకా లభించకపోవడంతో చేరిక ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి రావెల సీఎం చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. రైల్వే శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న రావెల కిషోర్ బాబు.. ఉద్యోగానికి రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రత్తిపాడు నుంచి గెలిచారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి కూడా వరించింది. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన రావెల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కొంతమేరకు సఫలీకృతమైనప్పటికీ రాజకీయంగా రాణించలేకపోయారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత తెచ్చుకున్నారు. కొన్ని కీలక అంశాలలో హద్దులు మీరి మాట్లాడటంతో చంద్రబాబు రావెలను మంత్రి పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న రావెల కనీసం తిరిగి టిక్కెట్‌ అయినా ఇస్తారనే నమ్మకం లేకపోవడంతో వేరే పార్టీలో చేరి వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. తొలుత ప్రత్తిపాడు వైసీపీ సీటును తనకు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత జగన్‌తో మంతనాలు జరపగా అందుకు ఆయన నిరాకరించారనే ప్రచారం జరిగింది. ఆఖరికి తాడికొండ సీటు అయినా ఇస్తారని ఆశించగా ఆ సీటును కూడా ఇటీవల డాక్టర్‌ శ్రీదేవికి ఇచ్చేందుకు జగన్‌ హామీ ఇచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇక జనసేన పార్టీ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న రావెల ప్రత్తిపాడు లేదా వేమూరు సీటు ఇవ్వాలని ఆ పార్టీ నేతలతో కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు రావెల టీడీపీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో హైకమాండ్ అలెర్ట్ అయింది. ఆయనను బుజ్జగించడానికి పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. మరి టీడీపీ బుజ్జగింపులకు ఆయన మెత్తబడతారా లేక జనసేనలోకి వెళతారా అన్నది త్వరలోనే తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే రాజీనామా..టీఆర్‌ఎస్‌ కు షాక్‌

  ఎన్నికలు దగ్గర పడేకొద్దీ టీఆర్‌ఎస్‌ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలు నియోజకవర్గాల నుండి గులాబీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌ పర్యటన రోజే కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ కు ఎదురు దెబ్బ తగిలింది. సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 2009లో సిర్పూర్ నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా సమ్మయ్య గెలిచారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీచేసిన  కోనేరు కన్నప్ప చేతిలో పరాజయం చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో సమ్మయ్య టికెట్ ఆశించారు కానీ అధిష్టానం టీఆర్‌ఎస్‌ లో చేరిన కోనేరు కన్నప్పకు టికెట్ కేటాయించింది. దీంతో సమ్మయ్య అసంతృప్తి చెందారు. దీనికితోడు కేసీఆర్ కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు పిలుపు రాలేదని, కనీసం తన పేరు కూడా ప్రస్తావించలేదని ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.."నన్ను పార్టీ ఘోరంగా అవమానించి,అన్యాయం చేసినా కేసీఆర్ మీద నమ్మకంతో ఓపిక పట్టాను. కానీ కాగజ్‌నగర్ సభలో నాకు కనీస మర్యాద ఇవ్వలేదు. గతంలో నేనున్నాను అని హామీ ఇచ్చిన కేటీఆర్ ఫోన్ చేస్తే ఏ రోజూ లిఫ్ట్ చేయలేదు. కనీసం విషయమేంటని కూడా మాట్లాడలేదు. సిర్పూర్‌లో ఎవరూ దిక్కులేని సమయంలో తెరాస జెండా మోయడమే మేం చేసిన తప్పా?  ఉద్యమకారులను అణిచి వేసి, ఏనాడూ పార్టీ జెండా పట్టని, జై తెలంగాణ అని పలకని నేతలను కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారు.పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. డబ్బులున్న వారికే విలువిస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అన్నింటిని వదులుకొని పని చేసిన వారికి విలువ లేదు. మరి కొంత మంది ముఖ్య నేతలు కూడా టీఆర్‌ఎస్‌ కు త్వరలో రాజీనామా చేస్తారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం కష్టమే.. కార్యకర్తలను, నేతలందరిని దూరం చేసుకుంటే విజయం ఎలా సాధ్యమవుతుంది”  అని సమ్మయ్య అన్నారు. కోనప్పని ఆంధ్రా అప్ప అని గతంలో కేసీఆర్‌ విమర్శించారని, తెలంగాణ ఉద్యమ జెండా మోసిన తనలాంటి వాళ్లను అవమానపర్చారంటూ సమ్మయ్య ధ్వజమెత్తారు. రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. సమ్మయ్య త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

యాక్సిడెంట్ చేస్తే వాహనం వేలమే

  మనం నిత్యం రోడ్ ప్రమాదాలకు సంభందించిన వార్తలు వింటూనే ఉన్నాం. పలానా వాహనం ఢీకొని పలువురు మృతి లేదా తీవ్రంగా గాయపడ్డారని వింటున్నాం. ఇలా ప్రమాదానికి కారణం అయిన వాహనంపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్టు చేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించేవారు. పోలీసుల సమాచారం మేరకు మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బండిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను నివేదిక ఇచ్చేవారు. దీంతో యజమాని రిస్క్‌పై వాహనాన్ని పోలీసులు అక్కడే రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రమాద కేసుల్లో వాహనాన్ని విడిపించుకోవడం కష్టం. మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చే నివేదికతో కేసు నుంచి బయటపడడం ఇకపై సాధ్యం కాదు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మోటారు వాహనాల నియమావళిలో మార్పులు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా సవరణకు ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం ఇకపై కోర్టు అనుమతితోనే పోలీస్‌ స్టేషన్‌ నుంచి వాహనం బయటకు వస్తుంది.  థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాన్ని నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమైన వారు బాధితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని రోడ్డు ప్రమాదాల క్లెయిమ్‌ ట్రైబ్యునల్‌లో జమ చేయాలి. లేకుంటే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని న్యాయస్థానమే వేలంలో విక్రయించి వచ్చిన సొమ్మును బాధితులకు చెల్లిస్తుంది. ఈ మేరకు ఏపీ మోటారు వాహనాల నియమావళిని సవరిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, వినతుల స్వీకరణకు 15 రోజులు గడువు ఇచ్చారు. అనంతరం తుది ప్రకటన జారీ చేస్తారు.  ఢిల్లీకి చెందిన ఉషాదేవి, పవన్‌ కుమార్‌ వాహన ప్రమాద కేసులో సుప్రీం కోర్టు 2016లో ఈ విధమైన తీర్పు వెలువరించింది.

మళ్ళీ మొదటికి అయేషా కేసు

  2007 డిసెంబర్ 27న విజయవాడలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాత్రూమ్‌ సమీపంలో ఆమె మృతదేహం పడి ఉంది. ఒంటినిండా రక్తపు గాయాలయ్యాయి. ఈ కేసులో సత్యంబాబును దోషిగా తేలుస్తూ 2010లో విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తాను నిర్దోషినంటూ సత్యంబాబు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఆయన అప్పీల్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయేషా తల్లితో పాటు పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో కీలక సాక్ష్యాధారాలు, రికార్డులు లేవని కోర్టుకు నివేదిక ఇవ్వగా.. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల తీరు, దర్యాప్తు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు సీబీఐతో విచారణ జరిపిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది.

ఐటీని తిరుపతికి తీసుకుపోయేవాడిని

  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు రాజకీయం కావాలి. నన్ను విమర్శిస్తూ రాజకీయాలు చేస్తారు. ఇద్దరం కలిసి పనిచేద్దామంటే కేసీఆర్‌ ఒప్పుకోలేదు. ప్రధాని నరేంద్రమోదీకి 'బి'టీమే కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయి. ఒకటి బీజేపీ ఫ్రంట్‌, మరోటి బీజేపీ వ్యతిరేకి ఫ్రంట్. ఎవరు ఏ ఫ్రంట్‌లో ఉన్నారో తేల్చుకోవాలి అని పిలపునిచ్చారు. నీళ్లు, పరిశ్రమలు ఏపీకి తీసుకుపోతానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, తన ఊరికి తీసుకుపోవాలనుకుంటే.. ఐటీని తిరుపతికి తీసుకుపోయేవాడిని హైదరాబాద్‌లో ఎందుకు పెడతానని ప్రశ్నించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి, ఐటీ అభివృద్ధికి చంద్రబాబే కారణమని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ గతంలో అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తనను విమర్శిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌, దళితులకు మూడెకరాల భూమి ఎవరికిచ్చారని నిలదీశారు. మాయమాటలతో కేసీఆర్‌ పబ్బంగడుపుతున్నారని విమర్శించారు. ఐదేళ్లలో కనీసం లక్ష ఇళ్లు కట్టలేనివారు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎలా నిర్మించగలరని నిలదీశారు. పనిచేయడం చేతకాదు కానీ, తనపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. తకు స్వార్థంలేదని, రాజకీయ అవసరాలు లేవని స్పష్టం చేశారు. 13 సీట్లతో తాను సీఎం ఎలా అవుతానని, ఏపీలో చేయాల్సిన పనులు, లక్ష్యాలు తనకున్నాయన్నారు. కేవలం తెలంగాణకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చానని చెప్పారు. తెలుగువారున్న ప్రతి చోట టీడీపీ ఉంటుందని, తెలుగువారి కోసం తన గొంతు విన్పిస్తూనే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేసారు.

35 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కండువాతో చంద్రబాబు

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్,టీడీపీ పొత్తు పెట్టుకొని ప్రజకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు. పలు సభల్లో పాల్గొని బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కానీ చంద్రబాబుకి సనత్ నగర్ నియోజక వర్గంలో సత్యం థియేటర్ వద్ద నిర్వహించిన సభలో అనూహ్య పరిణామం ఎదురయ్యింది. కాంగ్రెస్ మహిళా నేత గంగా భవానీ చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు 1983 లో టీడీపీలో చేరారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువాని వదిలేసిన చంద్రబాబు 35 ఏళ్ల తర్వాత కప్పుకోవలసి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తో చంద్రబాబు చేతిలో చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు అప్పటికే పార్టీలో  సీనియర్ నేతగా పేరున్న అజాద్ ను చంద్రబాబు గురువుగా భావించేవారట. చంద్రబాబు టీడీపీలో చేరిన తర్వాత దూరమైన వీళ్ళు నాంపల్లిలో మహాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఒకే వేదికపై కూర్చుని చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నారు. మహాకూటమి పుణ్యమా అని అనేక ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఉచిత విద్యుత్‌పై బహిరంగ చర్చకు కేసీఆర్‌ సిద్ధమా?

  తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి కేసీఆర్ నోట బాగా వినిపిస్తున్న మాటల్లో 24 గంటల ఉచిత విద్యుత్‌ ఒకటి. మేం అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి. ఒకవేళ అవి మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణలో చీకటే మిగులుతుంది అంటూ కాంగ్రెస్, టీడీపీ మీద కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓ వైపు కేసీఆర్ కి సమాధానం చెప్తూనే మరోవైపు ఛాలెంజ్ విసిరారు. విద్యుత్‌పై కేసీఆర్‌ కాకమ్మ కథలు చెబుతున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. గతంలో ఉత్పత్తి తక్కువగా ఉండేది, డిమాండ్‌ ఎక్కువగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువ, డిమాండ్‌ తక్కువ ఉందని అన్నారు. ఇందులో కేసీఆర్‌ ఘనత ఏమీ లేదని తెలిపారు. కమీషన్లకు కక్కుర్తిపడి 24 గంటల విద్యుత్‌ ఇస్తూ రైతుల్లో సెంటిమెంట్‌ రాజేస్తున్నారని అన్నారు. ప్రైవేటు కంపెనీల కమీషన్‌ కోసమే 24గంటల విద్యుత్‌ ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కరెంట్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనివేనని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఒక్క యూనిట్‌ విద్యుత్‌ అయినా అదనంగా ఉత్పత్తి చేశారా? అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో ప్రైవేటు కంపెనీలపై రూ.వేల కోట్ల భారం పడిందన్నారు. ఉచిత విద్యుత్‌పై బహిరంగ చర్చకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

నా 30 లక్షలు ఇవ్వు వీరేశం అన్న.. చనిపోయిన వ్యక్తి పేరుతో ఫ్లెక్సీ

ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్తున్న పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసన సెగలు తగులుతున్న విషయం తెల్సిందే. నిరసన సెగ తగిలిన వారిలో నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన మీద పలు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఒక గ్రామంలోని స్థానికులంతా కలిసి.. వీరేశం ఓ కుటుంబానికి అన్యాయం చేసారు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఆయన తమ గ్రామంలో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు.     నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక సతీష్ రెడ్డి, నర్సింహరెడ్డి సోదరులకు రాజకీయ నేతలుగా స్థానికంగా మంచి పేరుంది. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరిద్దరూ తరువాత టీఆర్ఎస్ లో చేరారు. అయితే 2014 ఎన్నికల సమయంలో వీరేశంకు దుబ్బాక సతీష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తే చివరకు అతని కుటుంబానికి అన్యాయం చేసారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీరేశంకు సతీష్ రెడ్డి 30 లక్షల రూపాయలు ఇచ్చారని.. అవి తిరిగి ఇస్తానంటూ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడుతున్నారు. గతేడాది సతీష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుటుంబానికి వీరేశం డబ్బులు చెల్లిస్తానని చెప్పి.. చివరకు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే వీరేశం ప్రచారానికి గ్రామంలోకి వస్తున్నారనే సమాచారంతో.. చనిపోయిన సతీష్ రెడ్డి పేరిట గ్రామస్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 'నాకు ఇవ్వవలసిన 30 లక్షల రూపాయలు మా కుటుంబ సభ్యులకు చెల్లించు వీరేశం అన్న' అనేది దాని సారాంశం. అంతేకాదు చనిపోయిన ఓ మంచి వ్యక్తి కుటుంబాన్ని మోసం చేయాలనుకోవడం భావ్యం కాదని మండిపడుతున్నారు.     కొందరు టీఆర్ఎస్ నేతలు మాత్రం నేరడ గ్రామస్థుల తీరును తప్పుబడుతున్నారు. నల్లగొండ టీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి దుబ్బాక సతీష్ రెడ్డి సోదరుడు నర్సింహరెడ్డిని తప్పించి కంచర్ల భూపాల్ రెడ్డికి అప్పగించడంలో వీరేశం పాత్ర లేదని చెబుతున్నారు. ఇందులో వీరేశం పాత్ర ఉందనే అపోహతో నేరడ గ్రామస్థులు ఇలా చేయడం సరికాదంటున్నారు. ఒకవేళ సతీష్ రెడ్డి వాస్తవంగా వీరేశంకు డబ్బులు ఇచ్చినట్లైతే కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. చూద్దాం మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందో లేదో.

కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్

  టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. ట్వీట్లతో చురకలంటిచడంలో దిట్ట. తాజాగా ఆయన ప్రజాకూటమిపై ట్విట్టర్ లో తనదైన శైలిలో స్పందించారు.  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న ఫొటోను ట్యాగ్ చేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రాహుల్, చంద్రబాబులు సీట్లలో కూర్చుంటే వెనకే ఉత్తమ్ కుమార్ నిల్చొని ఉన్నారు. ఒకవేళ ప్రజాకూటమికి ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం, వెన్నెముక లేని తెలంగాణ ‘స్కాంగ్రెస్’ నేతలు సిగ్గుపడాలని విమర్శించారు.  అంతకుముందు తెలంగాణలో పొలిటికల్ సీజన్ నడుస్తోందని.. జాతీయస్థాయి నాయకులు చీమల్లా బారులు తీరారని మరో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులన్న ఆయన.. వాళ్లు వచ్చి వెళతారని.. కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటారని పంచ్ వేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబులు ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశించే కేటీఆర్ ట్వీట్ చేశారు.