బాహుబలి బలంగా ఉన్నాడు...!

  ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ఈ చిత్ర షూటింగ్ లో ప్రభాస్ కు తీవ్ర గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు విని తన అభిమానులు ఆందోళన చెందుతున్నారని ప్రభాస్ తన ఆరోగ్య పరిస్తితి గురించి అభిమానులకు ఫేస్ బుక్ ద్వారా తెలియజేసాడు. ఫేస్ బుక్ ద్వారా ప్రభాస్ " నాకెలాంటి ప్రమాదం జరగలేదు. నాకు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మీరు ఎలాంటి ఆందోళన చెందకండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు దెబ్బలు తగిలాయని తెలిసి నా అభిమానులు కంగారు పడుతున్నారు. అంతటి ప్రేమ చూపుతున్న అభిమానులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం "బాహుబలి" షూటింగ్ కేరళలో చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు మీ ముందుకొస్తానా అని చాలా ఎదురుచూస్తున్నాను" అని తెలియజేసారు.

సినీ నటి హేమను వేధించి దొరికిపోయాడు

      సూర్యాపేటకు చెందిన పాతికేళ్ళ కుర్రోడు సినీ నటి హేమ పై మనసు పరేసుకున్నాడు. అంతే కదా..ఈ కాలంలో ఎంతో మంది సినీ నటిలపై మనసుపడడం లేదు అని అనుకుంటున్నారా, కాని మనోడు అంతటితో ఆగకుండా హేమ ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని అసభ్యకరమైన మెసేజ్‌లతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై హేమ, మాధాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు పక్కా వ్యూహంతో అతన్ని పట్టుకున్నారు. పిల్లాడికి కౌన్సిలింగ్ ఇస్తే చాలని పోలీసులు అనుకుంటున్న సమయంలో… మనోడి హిస్టరీ బయటపడింది. ఇదివరకు కూడా మధు ఫోన్‌ ద్వారా ఇతరుల్ని వేధించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో సైబర్‌ క్రైమ్‌ యాక్ట్‌ని బట్టి అతనిపై కేసులు నమోదు చేస్తారట.

క్రేజీ శంకర్ తో చిరు 150..!

      టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈ సారి క్రేజీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త రావడం మళ్ళీ మాయమవడం ఇలా జరుగుతూ వస్తుంది. అయితే ఈ సారి మాత్రం మెగాస్టార్ 150వ సినిమా మెయిన్ ట్రాక్ ఎక్కబోతున్నట్లు మెగా అభిమానులు పక్కగా చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా 150వ సినిమాపై సైలెంట్ గా వున్న చిరంజీవి...ఇంత సడన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సినీ విశ్లేషకులకు అర్ధంకావడం లేదు. మరి ఈ వార్త కూడా నిజమా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

రెండోసారి నరకం చూపిస్తాడా...?

  దర్శకుడు సెల్వరాఘవన్ మీద ఉన్న నమ్మకంతో భారీ బడ్జెట్ తో "వర్ణ" చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ప్రసాద్.వి.పోట్లురి మరో సాహసం చేస్తున్నాడు. అసలే "వర్ణ" సినిమాకు కలెక్షన్లు లేక అట్టర్ ఫ్లాప్ అవడంతో ప్రసాద్ పూర్తిగా నష్టాలపాలయ్యారు. ఆర్య, అనుష్క జంటగా నటించిన ఈ సినిమాకు కనీస కలెక్షన్లు కూడా రాలేకపోయాయి. అయితే ఈ నిర్మాత మాత్రం ఇలాంటివి ఏం పట్టించుకోకుండా దర్శకుడు సెల్వరాఘవన్ తో కలిసి మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటించనున్నాడు. కానీ ఈ సినిమాకు సెల్వ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని తెలిసింది. మరి ఈసారైన సెల్వ హిట్టు చిత్రాన్ని అందిస్తాడో లేక "వర్ణ" చిత్రం చూసి భయపడినట్లుగా..తనను చూసి జనాలు, నిర్మాతలు భయపడే విధంగా చేసుకుంటాడో త్వరలోనే తెలియనుంది. పి.వి.పి. సంస్థ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఆయన రామ్...నేను హనుమాన్...!

  అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ కలిసి నటించిన తమిళ చిత్రం "ఆరంభం". ఇటీవలే విడుదలై రికార్డులను తిరగరాస్తూ, కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో "ఆట ఆరంభం" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ పాటల విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. రానా తన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పడం పూర్తయ్యింది. ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ... ఈ సినిమా ఒక రామాయణం లాంటిది. ఇందులో రాముడైతే, ఆర్య లక్ష్మణుడు, నేను హనుమంతుడిలాంటివాడిని. ఎందుకంటే అజిత్ లాంటి మంచి వ్యక్తిని నేను ఇప్పటివరకు కలవలేదు. అందుకే ఆయనను రాముడితో పోల్చాను అని అన్నారు.

పెళ్లి చూపించబోతున్న చైతు...!

  "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో హిందీలో సూపర్ హిట్టయిన "సింగ్ వర్సెస్ కౌర్" చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం రుపొందబోతుంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఎనిమిది నెలల పాటు శ్రమించిఈ కథను సిద్ధం చేశాం. "గుండెజారి గల్లంతయ్యిందే" కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉండబోతుంది. ఈ సినిమా చూశాక బంధువుల పెళ్ళికి వెళ్లోచ్చిన అనుభూతి కలుగుతుంది. నాగచైతన్యను కొత్తగా చూపించబోతున్నాం. డిసెంబర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభించనున్నామని అన్నారు.

నిర్మాత అవతారం ఎత్తనున్న బన్నీ

  స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంతవరకు తన నటన మీదనే దృష్టి పెట్టాడు. అప్పుడప్పుడు మధ్యలో ఏవో కొన్నికమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తుంటాడు. అయితే త్వరలో తను నటించబోయే సినిమాకి సహా నిర్మాతగా మారనున్నాడు. ఈ సినిమాను గతంలో తనతో ‘జులాయి’ సినిమాని నిర్మించిన యస్.రాధాకృష్ణతో కలిసి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా మరో సహ నిర్మాతగా వచ్చి జేరారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘అత్తారింటికి దారేది’ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘రేసు గుర్రం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. బహుశః అది పూర్తవగానే ఈ కొత్త సినిమా ఆరంభించవచ్చు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా హీరోయిన్, సాంకేతిక నిపుణులను ఇంకా ఖరారు చేయవలసి ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమా త్వరలో షూటింగ్ ఆరంభించ గలిగితే వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలుంటాయి.

కమలకు అవార్డు ఖాయం...!

  శివాజీ, అర్చన జంటగా నటించిన చిత్రం "కమలతో నా ప్రయాణం". నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడ్డారు. అర్చన తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఒకవేళ ఎటువంటి రాజకీయాలు జరగకపోతే... ఈ సినిమాతో అర్చనకు అవార్డు రావడం ఖాయం అని అన్నారు. "అర్చన లాంటి ప్రతిభ ఉన్న హీరోయిన్లు తెలుగులో చాలామంది ఉన్నారు. వారికి సరైన అవకాశాలు రావట్లేదు. మనం కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. ఉత్తరాది వారిని కాకుండా తెలుగు వారిని ప్రోత్సహించే ధోరణి రావాలని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

హీరోయిన్ గా వస్తున్న కరీనా కూతురు..!

  బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కు ఇటీవలే కరీనాకపూర్ తో వివాహం జరిగింది. త్వరలోనే కరీనా కూతురు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటీ.. కరీనా సైఫ్ లకు పిల్లలే లేరు కదా. మరి ఈ కూతురు ఎలా వచ్చింది. అపుడే హీరోయిన్ గా ఎలా ఎదిగింది అని అనుకుంటున్నారా?   అసలు విషయం ఏమిటంటే... సైఫ్ తన మొదటి భార్య అమ్రిత్ తో 2004 లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత సైఫ్ ఇటీవలే కరీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్-అమ్రిత్ ల కూతురు అయిన సారా, ఇపుడు కరీనాకు కూడా కూతురు వరసే అవుతుంది కదా. సారా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయడానికి సిద్దంగా ఉందని తెలిసింది. సారా ఎంట్రీపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ చెప్తున్నాడు.   మరి సారా ఒకవేళ సినిమాల్లోకి వస్తే ఈ తల్లికూతుళ్ళ మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

రాక్ స్టార్ గా వస్తున్న రేయ్

  సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "రేయ్". వైవియస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... అతడో రాక్ స్టార్. సంగీతంలోనే కాకుండా జీవితంలో కూడా రాకింగ్ గానే ఉండాలనుకునే తత్త్వం అతనిది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాక్ స్టార్ గా ఎదగాలన్నది అతని కోరిక. ఈ క్రమంలో ఎదగాలన్నది అతని కోరిక. మరి ఈ క్రమంలో అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది తెరపైనే చూడాలి అని అంటున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ...రెండు దేశాల నేపధ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. తొలి సగభాగం వెస్టిండీస్ సంస్కృతీ, మలిభాగం అమెరికా నేపధ్యంలో ఉంటుంది. సాయిధరమ్ తేజ్ పాత్ర నేటి యువతకు అద్దం పట్టేలా ఉంటుంది. చక్రి అందించిన పాటలను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తామని అన్నారు.

విష్ణు కోరిన పుట్టినరోజు కోరిక

  "దేనికైనా రెడీ", "దూసుకేల్తా" చిత్ర విజయాలతో చాలా ఆనందంగా ఉన్న మంచు విష్ణు పుట్టినరోజు నేడు. ప్రస్తుతం విష్ణు "పాండవులు పాండవులు తుమ్మెద" చిత్రంలో నటిస్తున్నాడు. అయితే విష్ణు పుట్టినరోజున ఒక పెద్ద కోరిక కోరుకుంటున్నాడు. విష్ణు ఇద్దరు కూతుళ్ళు అరియానా, వివియానాలకు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయంట. దాంతో వాళ్ళ నోటి నుండి "హ్యాపీ బర్త్ డే డాడీ" అనే మాట వినాలని విష్ణు ఆశగా ఎదురుచూస్తున్నాడు. వాళ్ళు అలా చెప్తే అదొక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది అని చెప్తున్నాడు విష్ణు. మరి విష్ణు కోరిక ఈ పుట్టినరోజుకి నెరవేరుతుందో లేక వచ్చే ఏడాది పుట్టినరోజుకి నెరవేరుతుందో చూడాలి.

నేడే పుట్టిన సూర్య చెప్పిన మాటలు...!

  "జోష్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు నేడు. చైతన్య ప్రస్తుతం "ఆటోనగర్ సూర్య", "మనం" చిత్రాలలో నటిస్తున్నాడు. పుట్టినరోజు సందర్భంగా తన సినిమాల గురించి మాట్లాడుతూ.. "ఆటోనగర్ సూర్య" నా కెరీర్ లోనే ఓ మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుంది. దర్శకుడు దేవకట్టా నా పాత్రను తీర్చిదిద్దిన విధానం అధ్బుతం.నిర్మాత అచ్చిరెడ్డి ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక ఐటెం సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఈనెల 27 నుండి ఈ పాటను చిత్రీకరిస్తారు. అనూప్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పాటలను కూడా విడుదల చేయనున్నాం అని అన్నారు. అదే విధంగా తాతయ్య, నాన్నతో కలిసి చేస్తున్న "మనం" చిత్రం కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. వారిద్దరితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ కుమార్ అధ్బుతంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 1 నుండి కర్ణాటకలొని కూర్గ్ లో తాజా షెడ్యుల్ ని ప్రారంభించానున్నాము. ఈ చిత్రం అభిమానులందరినీ అలరించే విధంగా ఉండబోతుంది అని అన్నారు.

ఆ నరకం ‘వర్ణ’నాతీతం

  అందాల అభినేత్రి అనుష్క పది సినిమాలు చేస్తే అందులో కేవలం ఒకటి మాత్రమే విజయం సాధిస్తున్నపటికీ తెలుగు చిత్ర సీమలో బాగానే నిలద్రోక్కుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆమె అందం, నటనలో లోపంలేకపోవడం వలననే ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చును. చాల రోజుల తరువాత ప్రభాస్ తో చేసిన మిర్చి సినిమా సూపర్ హిట్ అయింది గనుక, మళ్ళీ తన ఫ్లాప్ రికార్డ్ పదిలంగా నిలబెట్టుకొంటూ ‘వర్ణ’ చేసింది.   పది పంచ్ డైలాగులు, ఆరు పాటలు, నాలుగు ఫైట్స్, ఒక ఐటెం సాంగుకి బాగా ట్యూన్ అయిపోయిన జనాలని వేరే గ్రహం మీదకు తీసుకు వెళ్లాలని నిర్మాత చేత రూ.65కోట్లు ఖర్చు పెట్టించినా జనాలు మాత్రం వెళ్లేందుకు ఇష్టపడలేదు. పైగా దియేటర్లో ఈ నరకం ‘వర్ణ’నాతీతమని ట్వీట్ మెసేజులు ఫేస్ బుక్ మెసేజీలు పెట్టుకొంటూ ప్రేక్షకులు తమ స్నేహితులని ఈ సినిమా భారి నుండి కాపాడే ప్రయత్నం చేయడం విశేషం.   ఇక ఈ వర్ణ సినిమా గురించి క్లుప్తంగా వర్ణించుకొంటే, ఈ సినిమాలో అనుష్క, ఆర్య ఇద్దరూ సింగిల్ పెమెంట్ కి డబుల్ రోల్స్ చేసారు. ఒకటి మన మధ్యనే ఈ భూమీద మరొకటి వేరే గ్రహం మీద. భూమీద రమ్య (అనుష్క) డాక్టరుగా, మధు బాలకృష్ణ (ఆర్య) లెక్చరర్ గా మామూలు మనుషులే. కానీ వేరే గ్రహంలో వర్ణ (అనుష్క) ఒక గొప్ప యుద్దనారి, మహేంద్ర (ఆర్య) ఒక యువరాజు.   భూమ్మీద వీరిద్దరి లవ్ స్టోరీ మూడు పాటలేసుకొంటూ చాలా స్మూత్ గానే సాగిపోతుంది. కానీ వేరే లోకంలో మాత్రం వన్ సైడ్ లవ్ స్టోరీ. అంటే రామేశ్వరం వెళ్ళినా అన్నట్లు వేరే గ్రహం వెళ్ళినా మన కాన్సెప్ట్ మాత్రం మారదన్నమాట. అక్కడ యువరాజు గారు వర్ణని ప్రేమిస్తుంటాడు. అయితే భూమ్మీద ఉన్నఅర్యుడికి అర్జెంటుగా వేరేలోకం వెళ్ళవలసి రావడంతో చెప్పాపెట్టకుండా లిఫ్ట్ ఎక్కిపై అంతస్తుకి వెళ్ళినట్లు వేరే గ్రహానికి వెళ్ళిపోతాడు.   ఆ తరువాత అక్కడ లవ్ స్టోరీ ఏమయింది? అక్కడ ఎలాంటి ఫైట్స్ జరిగాయి? చివరికి ఈ రెండు జంటలు ఏవిధంగా కలిసాయి? అన్నదే దీని ఇష్టోరీ. భూమ్మీద అనుష్క, ఆర్యాలిద్దరూ బాగానే చేసినప్పటికీ వేరే గ్రహం మీద వెళ్లేసరికి అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువయిందో మరేమో కానీ ఇద్దరూ తేలిపోయారు.   అసలు ఇటువంటి జమానాలో కూడా ఇంత వర్ణనాతీతమయిన నరకం చూపగల సినిమాను తీసిన దర్శకుడు శ్రీ రాఘవను, అతనిపై ఇన్ని కోట్లు కుమ్మరించిన ప్రసాద్‌ వి. పొట్లూరి దైర్యానికి ప్రత్యేక అవార్డులు ఈయవలసిందే. ఈ సినిమాలో ఏమి చెప్పాలనుకొంటున్నాడో దర్శకుడి తెలియదు. ఏమి చేస్తున్నారో నటులకీ తెలియదు. ఎందుకు సంగీత వాయించవలసి వచ్చిందో సంగీత దర్శకుడికి తెలియదు. ఏమి చూస్తున్నారో ప్రేక్షకులకి అర్ధం కాదు. కనుక అసలు ఈ సినిమా గురించి ఆలోచించి బాధపడటం అనవసరం. ఇంత చదివిన తరువాత కూడా ఈ సినిమాకి రేటింగ్ ఎంత?అని వెతికేమాటయితే, వెళ్లి ఆ సినిమా చూసి తెలుసుకోవడమే బెటర్.   బ్యానర్‌: పివిపి సినిమా నిర్మాత: ప్రసాద్‌ వి. పొట్లూరి; కథ, కథనం, దర్శకత్వం: శ్రీ రాఘవ; తారాగణం: ఆర్య, అనుష్క, అశోక్‌ కుమార్‌ తదితరులు; నేపథ్య సంగీతం: అనిరుధ్‌;; సంగీతం: హారిస్‌ జైరాజ్‌; ఛాయాగ్రహణం: రామ్‌జీ

బాలయ్య సింహం ఖరీదు కోటి రూపాయలు...!

  బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "లెజెండ్". ఈ సినిమాలో దాదాపు అన్ని ప్రత్యేకతలే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే... బాలయ్య ఈ సినిమాలో కొత్తరకం గెటప్ లో కనిపించనున్నాడు. అదే విధంగా తన ఆయుధాలు, వస్త్రాలంకరణ, సంభాషణలు అంత బాలయ్య అభిమానులకు కొత్త పండగను తెచ్చే విధంగా ఉండబోతుందట.   బాలయ్య అంటేనే ఒక సింహం. అలాంటి సింహానికి వాహనం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాగే ఇందులో బాలయ్య వాడే బైక్ కు ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. దేశ,విదేశాల నుంచి కూడా ఈ బైక్ ను తమ సొంతం చేసుకోడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బైక్ ధర ఇండియాలో సుమారు 8 లక్షల నుండి 40 లక్షల వరకు ఉందని తెలిసింది. కానీ ఈ బైక్ కు ఉన్న డిమాండ్ వల్ల, పైగా బాలయ్య సినిమాలో వాడడం వలన మరింత క్రేజ్ పెరిగి.. కోటి రూపాయలైన ఇచ్చి ఈ బైక్ ను కొందామని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అంటే ఈ బైక్ బాలయ్యకు సింహం లాంటి వాహనంల తయారయ్యింది.అదే విధంగా ఈ సినిమాలో బాలయ్య వాడిన మరో ఒక వాహనంకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.   మరి ఇపుడే ఇలా ఉంటె.. ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే మాత్రం.. బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సింహ గర్జన మోగించడం ఖాయం.

ఏదేమైనా డబ్బులు కావాలంటున్న సమంత

  "అత్తారింటికి దారేది" చిత్రంతో టాప్ హీరోయిన్ స్థానంలో ఉన్న సమంతకు డబ్బు ఖచ్చితంగా కావాలంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే పదవీ విరమణ వరకు ఎలాంటి బెంగ ఉండదు. కానీ సినిమాలు అలా కాదు. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతుంటాయి. ఏరోజు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అని అంటుంది సమంత. చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అందులో కావలసినంత స్వేచ్చ ఉంటుంది. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను. కానీ డబ్బులు తీసుకోకుండా మాత్రం కాదు. అంత పెద్ద మనసు నాకు లేదు. కాకపోతే సినిమాకు తగినట్టు నా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను అని చెప్తుంది.