ఎదుటి వాళ్ల స్టార్ మాన చేతుల్లో...

ఉరుకులు పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా ఉంటాము. ఎందుకంటే బ్రతుకు అనేది పెద్ద పోరాటం. ఆగితే కుదరదు. ఈ కరోనా పుణ్యమా అని బ్రతకడం ఒక యుద్ధం అయింది. ముఖ్యంగా యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాస్ ల తో వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి గానీ స్వార్థంతో అదనపు ఉద్యోగస్తులకు తొలిగించి ప్రైవేట్ టీచర్స్ ని రోడ్డున పడేసారు. ఇదేంటని అడిగే వ్యవస్థలు లేవు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బ్రతుకునీడ్చడానికి ఎంతోమంది పట్టాదారులు, కొలువు పోయిన ప్రయివేటు టీచర్లు ఇంకా చాలామంది వివిధ అత్యవసర సేవా రంగాల్లో తక్కువ జీతాలకే ఉద్యోగాలు చేస్తున్నారు. ఓలా, ఉబర్, స్విగ్గీ, జామోటో, ఇంకా కొరియర్ సంబంధిత బడా సంస్థలు వాటి మాతృకతో వెలసిన ఇంకొన్ని సంస్థలు శ్రమను దోచుకుంటున్నాయి గానీ తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదు. క్లిష్ట సమయాల్లో  ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా మనకి సేవలు అందించే మన యువతకి చేతనైన సహాయం చేయాలి . వెంటనే "మనం ఏమి చేయగలం " అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. అది ఎలాగో చెప్తాను. వారికి రేటింగ్ ఇవ్వడం ద్వారా ఎంతోకొంత మనం వారికి సపోర్ట్ గా నిలిచినవాళ్ళం అవుతాము. మనం ఇచ్చే స్టార్స్ మరియు కామెంట్స్ ద్వారా వారి జీతం వృద్ధి చెందుతుంది. ఇలా మనం ఇచ్చే రేటింగ్స్ ద్వారా వారియొక్క నిబద్ధతని గౌరవించినట్లు అవుతుంది. ఇది చాలా చిన్న విషయం. చాలామంది స్కిప్ చేయడం చూసాను. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను. అయితే కొంతమంది పరిపక్వత లేకుండా ఐదునిమిషాలు లేట్ అయిందనో లేక తెచ్చిన ఆర్డర్ మారిపోయిందనో ఇలా రకరకాల కారణాలతో మన అహం చల్లార్చుకోవడానికి వారిని కోపగించుకుంటాము. ఒక అయిదు నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే "అయ్యో తొందరపడి కోప్పడ్డాము" అని పశ్చాత్తాప పడతాము. అందుకే అలాంటివారితో ప్రేమగా రెండు మాటలు మాట్లాడండి. స్వచ్ఛమైన ఒక చిరునవ్వుతో మిమ్మల్ని పరిచయం చేసుకుంటే అది అవతలవాళ్లకి ఎంతో స్వాంతన గా ఉంటుంది. నిరుత్సాహం దూరమై కొత్త ఉత్సాహం వారిలోకి వస్తుంది. ◆ముగింపు రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే రేటింగ్ వెనుక ఒక కుటుంబం ఆధారపడివుంటుంది అనేది అర్ధమయుంటుంది. ఇలా రుపాయి ఖర్చు లేకుండా అవతలివాళ్ళకి మనం చేయగలిగే సహాయలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయంలో క్షణం ఆలోచించకుండా సహాయపడండి. అది అవతలవాళ్లకి ఎంతో ఉపయోగపడుతుంది. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆ క్షణం... అడుగు ముందుకి వేస్తే

హరిత, నమిత ఇద్దరూ కవలపిల్లలు. ఇద్దరికీ సంగీతం అంటే ప్రాణం. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచానికి తమ ప్రతిభని చూపించాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఊళ్లో జరిగే త్యాగరాయ ఉత్సవాలలో వాళ్లకి కూడా పాడే అవకాశం దక్కింది. అది వాళ్ల మొట్టమొదటి ప్రదర్శన కాబోతోంది. కార్యక్రమం ఇంకో నెల రోజులు ఉందనగా ఇద్దరూ విరగబడి అభ్యాసం చేశారు. ఒకరిని మించి ఒకరు రాగం తీశారు. ఇక వేదిక ఎక్కడమే తరువాయి అన్నట్లుగా ప్రదర్శని సిద్ధపడిపోయారు. కార్యక్రమం రోజున తమ కుటుంబంతోనూ, గురువుగారితోనూ కలిసి ఆడిటోరియంకు చేరుకున్నారు. కానీ లోపలకి వెళ్లగానే వాళ్లిద్దరి కాళ్లూచేతులూ వణకడం మొదలుపెట్టాయి. కార్యక్రమంలో భాగంగా ఒకొక్కరే వేదిక మీదకు వచ్చి తమ సంగీతాన్ని వినిపించసాగారు. ఇంతలో హరిత వంతు కూడా వచ్చేసింది. కానీ హరిత కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి. భయంతో ఆమె కళ్లు తిరుగుతున్నాయి. అడుగు ముందుకు వేయడం కంటే వెనక్కి తిరిగి పారిపోవడం తేలిక అనిపిస్తోంది. కళ్ల ఎదురుగుండా ఎత్తయిన వేదిక, ఆ వేదికని ఎక్కాక వందల మంది ముందు పాడాలి, ఆ పాటలో తడబడితే నవ్వులపాలు కావాలి.... లాంటి ఆలోచనలన్నీ ఆమె మనసులోని దూసుకువస్తున్నాయి. కాసేపటికి ఏ ఆలోచనా లేకుండా కేవలం భయం మాత్రమే ఆమె మెదడంతా నిండిపోయింది. అంతే! తను ఉన్న కుర్చీలో మరింత వెనక్కి, మరింత లోతుకి దిగబడిపోయింది. హరిత పరిస్థితి చూసిన వాళ్ల గురువుగారు ఆమెని బలవంతం చేయలేదు. తర్వాత నమిత వంతు వచ్చింది. నమిత కూడా హరితలాగానే భయపడిపోయింది. ఆమె ఒళ్లంతా చల్లబడిపోయింది. కానీ తడబడే అడుగులు వేస్తూ వేదిక దిశగా బయల్దేరింది. తాను ఎక్కడ తూలిపోతుందో అన్నంత నిస్తేజం నమితను ఆవహించింది. కానీ ఎలాగొలా వేదికను ఎక్కేసింది. అక్కడ మైకుని చూడగానే ఆమె చేతులు వణికాయి. ముందున్న జనాన్ని చూడగానే ఇక తను పాడలేననుకుంది. అంత భయంలో పాడటంకంటే చచ్చిపోవడం తేలికనిపించింది. అయినా బలవంతంగా పాటని మొదలుపెట్టింది. నమిత ప్రదర్శన ఒక మాదిరిగా సాగింది. మధ్యమధ్యలో కొన్ని అపశృతుల దొర్లాయి. కొన్ని గతులు తప్పాయి, కొన్ని చోట్ల స్వరం పలకలేదు. తన ప్రదర్శన తనకే పేలవంగా తోచింది నమితకి. కానీ ప్రేక్షకులేమీ పగలబడి నవ్వలేదు. బ్రహ్మాండం ఏమీ బద్దలవలేదు. ‘ఈసారి మరికాస్త బాగాపాడు’ అంటూ గురువుగారు ప్రోత్సహించారు. ‘మొదటిసారైనా బాగా పాడావు’ అంటూ తల్లిదండ్రులు మురిసిపోయారు. అన్నింటికీ మించి తాను మరోసారి వేదికని ఎక్కి పాడగలను అన్న నమ్మకం కలిగింది నమితకి. మరోసారి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అన్న ఆశ మొదలైంది. హరిత, నమిత ఇద్దరూ కవల పిల్లలు. ఇద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఇద్దరిదీ ఒకటే ప్రతిభ. ఇద్దరూ ప్రదర్శన కోసం తగినంత కృషి చేశారు. వేదిక దగ్గరకు చేరుకోగానే ఇద్దరూ విపరీతంగా భయపడిపోయారు. జీవితాన్ని మలుపు తిప్పే సమయంలో హరిత తన భయానికి లోబడిపోయింది. నమిత బలవంతంగా దాని అవతలి ఒడ్డుకి చేరకుని... అంతగా భయపడాల్సినంత ఖర్మ లేదని తెలుసుకుంది. ఆ అవగాహన ఆమెలో ఓ స్థైర్యాన్ని నింపింది. వందలాది ప్రదర్శనలు ఇచ్చే జీవితానికి బాట వేసుకుంది. హరిత కూడా ఆ ఒక్క క్షణం తన భయాన్ని ఓర్చుకోగలిగితే ఎంత బాగుండేది! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

ప్రతి వస్తువుకీ ఉంటుంది ఓ ఎక్స్పైరీ డేటు

మందులు వేసుకునేటప్పుడు వాటికి ఎక్స్పైరీ దగ్గరపడిందేమో అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. బ్రెడ్డు, జాము, సాస్ లాంటి పదార్థాలు తినేటప్పుడు వాటిని తయారుచేసిన తేదీని చూసుకుంటాం. ఆఖరికి గోధుమపిండీ, ఇడ్లీరవ్వా వాడేటప్పుడు కూడా వాటి ఎక్స్పైరీ గమనించుకుంటాం. కానీ రోజూ వాడే వస్తువులకి కూడా ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుందనే విషయం అస్సలు గమనించుకోము. వాటిని ఎందుకు గమనించుకోవాలో ఇప్పుడు చూద్దాం...   దిండు (Expiry రెండేళ్లు)     దిండుని వాడగా వాడగా దాని ఆకారమే మారిపోతుంటుంది. తల పెట్టే చోట దిగబడిపోతుంది. అదే దిండుతో పడుకుంటే మెడకి సంబంధించిన సమస్యలు ఖాయం అంటున్నారు. అంతేకాదు! రోజుల తరబడి దిండుని వాడటం వల్ల దానిలో అణువణువూ దుమ్ముకణాలతో (డస్ట్ మైట్స్) నిండిపోతాయి. ఇవి చర్మవ్యాధుల దగ్గర్నుంచీ ఊపిరితిత్తుల సమస్యల వరకూ అనేక ఇబ్బందులకి దారితీస్తాయి.   టూత్ బ్రష్ (Expiry మూడునెలలు)     ఈ మధ్య ప్రకటనల్లో మనం తరచూ వింటున్న మాటే ఇది. రెండు మూడు నెలలపాటు పళ్లు తోముకున్న తర్వాత బ్రష్ అరిగిపోవడం సహజం. ఒకవేళ అరగకపోయినా కూడా బ్రిసిల్స్ గట్టిపడిపోవడం మాత్రం ఖాయం. అలాంటి బ్రష్తో తోముకోవడం వల్ల పళ్లు దెబ్బతినక మానవు. పైగా జలుబు, దగ్గులాంటి సందర్భాలలో మన ఒంట్లో ఉండే రోగక్రిములు బ్రష్ మీదకు కూడా చేరుకుంటాయి.   అంటుగుడ్డలు (Expiry వారం)     మన ఇంట్లో వాడే అంటుగుడ్డలు ఎంత భయంకరంగా ఉంటాయో.... ఒక్కసారి వంటింట్లోకి తొంగిచేస్తే తెలుస్తుంది. అయినాసరే వీటిని నెలల తరబడి వాడేయడం ఓ వైపరీత్యం. అంటుగుడ్డలో ఉండే మురికి వల్ల నానారకాల బ్యాక్టీరియా దాని మీద ఉంటుందనీ... పైగా తడిగా ఉండటం వల్ల ఆ బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 89 శాతం అంటుగుడ్డల మీద ఈ.కోలీ లాంటి భయంకరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తేలింది. అందుకని వీటిని వారం మించి వాడవద్దని నిర్మొహమాటంగా సూచిస్తున్నారు.   చెప్పులు (Expiry ఆరునెలలు)     రన్నింగ్ షూస్ అయితే ఓ 300 కిలోమీటర్లు నడిచాక అరిగిపోవడం సహజం. అలాగే చెప్పులు కూడా ఆ ఆర్నెళ్ల తర్వాత అరిగిపోవడం లేదా గట్టిపడటం జరుగుతుంది. ఇక వాటి మీద ఫంగస్ పేరుకునే ప్రమాదమూ లేకపోలేదు. అలాంటి పాదరక్షలు వాడటం వల్ల నడక మీదా, కాలి కండరాల మీదా ప్రభావం చూపుతుంది.   చాపింగ్ బోర్డు (Expiry ఏడాది)     ఈ రోజుల్లో కూరగాయలు తరిగేందుకు ప్రతి ఇంట్లోనూ చాపింగ్ బోర్డు కనిపిస్తోంది. కొన్నాళ్లకి దీని మీద గాట్లు పడి, మురికిమురికగా కనిపించడమూ సహజమే. ఆ గాళ్లలో సూక్ష్మజీవులు ఉండటమే సహజమే! ఇక మాంసం తరిగితే పరిస్థితి చెప్పనవసరం లేదు. పైగా చెక్కతో చేసిన చాపింగ్ బోర్డులో అయితే సూక్ష్మజీవులు ఉండే అవకాశం మరింత ఎక్కువ. మన టాయిలెట్ సీటు మీద కంటే ఇలాంటి చాపింగ్ బోర్డుల మీదే ఎక్కువ బ్యాక్టీరియా కనిపిస్తుందని ఓ పరిశోధన తేల్చింది.   ఇవే కాదు దువ్వెనలు, పౌడరు అద్దుకునే స్పాంజిలు, కార్పెట్లు, దుప్పట్లు.... ఇలా మన కంటికి కనిపించే ప్రతి వస్తువుకీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించకుండా ప్రతి వస్తువునీ నెలలు, సంవత్సరాల తరబడి వాడుతుంటే సమస్యలు తప్పవు. - నిర్జర.  

ఓర్పు జీవితాన్ని శాసిస్తుందా?

‘Patience pays’ అని ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది. ఓర్పుగా ఉండాల్సిన అవసరం గురించీ, అసహనం వల్ల కలిగే నష్టాల గురించీ మన ఇతిహాసాలలో లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. కానీ ఉరుకులుపరుగులతో సాగే ఈనాటి జీవితంలో ఓర్పు అవసరమేనా? అన్న సందేహం కలుగక మానదు. అవసరమే అని నిరూపిస్తోంది ఓ పరిశోధన. 50 ఏళ్లుగా ఈ ప్రపంచానికి ఓర్పుగా ఉండమని హెచ్చరిస్తోంది. అదే...   Marshmallow experiment   మార్ష్‌మలో అనేది పాశ్చత్య దేశాలలో విరివిగా దొరికే ఒక తీపి పదార్థం. అక్కడి పిల్లలకు ప్రాణం. ముఖ్యంగా, రకరకాల చిరుతిళ్లు అందుబాటులో లేని 1960వ దశకంలో మార్ష్‌మలో కోసం పిల్లలు తెగ పేచీ పెట్టేవారు. పిల్లల్లో ఉండే ఈ బలహీనత ఆధారంగా వారిలో ఏ మేరకు సహనం ఉందో పరీక్షించాలనుకున్నాడు... స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘వాల్టర్‌ మిషెల్‌’ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. అందుకోసం తన విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ఒక బడిని ఎంచుకున్నాడు.   సహనంతో ఉంటే బహుమతి     వాల్టర్‌ మిషెల్‌ తన పరిశోధన కోసం 4-6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కొందరు పిల్లలను ఎంచుకొన్నాడు. వారిని ఒంటరిగా ఒక గదిలో ఉంచి, వారి ముందర ఒక మార్ష్‌మలోని ఉంచారు. ‘నువ్వు కనుక ఈ మార్షమలోని కాసేపు తినకుండా ఉండగలిగితే, నేను తిరిగి వచ్చి ఇంకో మార్షమలోని బహుమతిగా ఇస్తాను’ అని ఆ పిల్ల/పిల్లవాడికి చెప్పారు. ఇక అప్పటి నుంచి చూడాలి ఆ పిల్లల తిప్పలు. కళ్ల ముందు ఊరిస్తున్న మార్ష్‌మలోని తినకుండా ఉండేందుకు వారు రకరకాల విన్యాసాలు చేశారు. కొందరు తలతిప్పుకున్నారు. కొందరు దాన్ని నాకి తిరిగి పెట్టేశారు. కొందరు పాటలు పాడుతూ కూర్చున్నారు. ఇంకొందరు ఇవేవీ చేయకుండా..... గబుక్కున ఆ మార్ష్‌మలోని తీసుకుని నోట్లో వేసేసుకున్నారు. వెధవ బహుమతి పోతే పోయింది అనుకున్నారు.   పిల్లలాట కాదు!     మొత్తానికి ఒక మూడోవంతు మంది పిల్లలు మాత్రమే రెండో మార్ష్‌మలోతో పరిశోధకులు వచ్చేదాకా, ఓపికగా ఎదురుచూసినట్లు తేలింది. అయితే ఇదేదో సరదా కోసం చేసిన పరిశోధన కాదు! చిన్నతనంలోనే ఓర్పుని అలవర్చుకున్న పిల్లల జీవితం పెద్దయ్యాక ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు సాగిన ఒక ప్రయత్నం. ఒక పదేళ్ల తరువాత, ఇరవై ఏళ్ల తరువాత... ఆఖరికి ఈ మధ్యకాలంలో కూడా వీరందరి జీవితాలను గమనించినప్పుడు, అసాధారణమైన వ్యత్యాసం కనిపించింది. అప్పట్లో ఓర్పుగా ఉన్న పిల్లలు తరువాత రోజుల్లో మంచి మార్కులను సాధించడం కనిపించింది. వ్యసనాలకు లోనవడం, ఒత్తిడికి గురవడం, ఊబకాయం బారిన పడటం.... వీరిలో తక్కువగా బయటపడ్డాయి. అప్పట్లో ఓర్పు లేని పిల్లలతో పోలిస్తే, వీరిలో సామాజిక నైపుణ్యాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ఆఖరికి ఓర్పు ఉన్నవారు, లేనివారి మధ్య మెదడు పనితీరులో కూడా మార్పులు ఉండటాన్ని గమనించారు.   మార్ష్‌మలో పరిశోధన పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఒక గుణపాఠమే! ఎందుకంటే ఓర్పుని అలవర్చుకోవడం ఎవరికీ అసాధ్యం కాదు. నాలుగేళ్ల పిల్లలే సహనంతో ఉండగలిగితే... 40 ఏళ్ల పెద్దలకు అదేమంత భారం కాబోదు. పైగా ఓర్పుని సాధించేందుకు మన భారతీయుల దగ్గర ధ్యానం, యోగ, గీతాబోధ వంటి సాధనాలు ఉండనే ఉన్నాయి. మరెందుకాలస్యం! మనమూ ఆ ఓర్పుగా ఉన్న పిల్లలని అనుసరిద్దాం! జీవితంలో అమృతఫలాలను బహుమతిగా సాధిద్దాం.   - నిర్జర.

సంతోషం ఎక్కడ ఉంది!

అనగనగా ఓ మంత్రిగారు. ఆయన రోజూ తన భవనం నుంచి రాజుగారి మహలుకి ఓ పల్లకీలో వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్తూ ఉండగా, దారిలో కనిపించే ప్రజలను గమనించడం చాలా ఆసక్తిగా ఉండేది. వాళ్ల నడకలో ఉండే హడావుడి, వాళ్ల మొహాల్లో కనిపించే ఆందోళన చూసి ఆయన తెగ తృప్తి పడిపోయేవాడు. వాళ్లందరితో పోల్చుకుంటే తను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానో కదా అని మురిసిపోయేవాడు. అలా కాలం గడిచిపోతూ ఉండగా, ఓ రోజు మంత్రిగారికి కొత్తగా వెలసిన గుడారం కనిపించింది.    దాని పక్క నుంచి వెళ్తుంటే ఆ గుడారంలో కూర్చుని టోపీలు కుట్టుకుంటున్న ఓ నడివయసు మనిషి కనిపించాడు. మంత్రిగారికి అలాంటి దృశ్యాలు కొత్తేమీ కాదు. కానీ ఆ మనిషి మొహంలో కనిపించిన ప్రశాంతతే చాలా ఆశ్చర్యం కలిగించింది. ‘ఇవాళ ఏదో మంచి బేరం తగిలినట్లుంది. అందుకనే అంత సంతోషంగా ఉన్నాడు’ అనుకుంటూ ముందుకు సాగిపోయాడు మంత్రిగారు. కానీ చిత్రమేమిటంటే ఒక రోజు తరువాత మరో రోజు… ఆ టోపీల వ్యాపారి మొహంలో అదే రకమైన సంతోషాన్ని గమనించాడు మంత్రిగారు.    ఇక ఉండపట్టలేక కొన్నాళ్లకి తన పల్లకీ దిగి గుడారంలోకి అడుగుపెట్టాడు. ‘ఏం పెద్దాయనా చాలా సంతోషంగా ఉన్నావు! బేరాలు అంత బాగుంటున్నాయా?’ అని పలకరించారు మంత్రిగారు. ‘బేరాలా! ఏదో అప్పుడొకటి అప్పుడొకటి వస్తున్నాయంతే!’ అన్నాడు వ్యాపారి చిరునవ్వుతో. ‘అయితే మీ కుటుంబంలో ఏదో శుభకార్యం ఉండి ఉంటుంది. అందుకనే అంత ఆనందంగా ఉన్నావు’ అని ఊహించాడు మంత్రి.   ‘అలాంటిదేమీ లేదండీ! జీవనోపాధిని వెతుక్కుంటూ మా కుటుంబం అంతా తలో దిక్కున బతుకుతున్నాం. మేమంతా ఎప్పటికి కలుస్తామో కూడా మాకే తెలియదు!’ అని బదులిచ్చాడు వ్యాపారి. ‘ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు కదా పెద్దలు. బహుశా నీ ఆరోగ్యం చాలా బాగుండి ఉంటుంది. అందుకే ఇంత తృప్తిగా కనిపిస్తున్నావు’ అన్నాడు మంత్రి. ‘ఆరోగ్యమా! ఇదిగో ఈ చిల్లుల గుడారాన్ని చూస్తున్నారు కదా! పొద్దున్న పూట ఎండలో సగం నా మీదే పడుతుంది. ఇక రాత్రిళ్లు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ పడుకోవల్సిందే. ఆ చలికి పళ్లు పటపట కొరకడం వల్ల సగం పళ్లు ఊడిపోయాయంటే నమ్మండి!’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చాడు వ్యాపారి.   వ్యాపారి జవాబులన్నీ విన్న మంత్రికి సహనం నశించిపోయింది. ‘డబ్బులు లేవు, కటుంబానికి దూరంగా దేశదిమ్మరిలా తిరుగుతున్నావు. ఇక ఆరోగ్యమా అంతంత మాత్రం. అలాంటిది ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా!’ ‘మీకు తెలియంది ఏముంది మంత్రిగారూ! శారీరకంగానూ, మానసికంగానూ నేను ఎదుర్కొనే ప్రతి కష్టమూ జీవితంలో భాగమే అని నేను నమ్ముతాను. అలాంటి కష్టాలు ఎప్పుడూ నేను ఎదిగేందుకే ఉపయోగపడేవి. అందుకే నేనెప్పుడూ వాటికి భయపడలేదు.    పైగా నాకు కష్టాన్ని ఇచ్చిన భగవంతుడే, దాన్ని సవాలుగా తీసుకుని దాటగల శక్తిని కూడా అనుగ్రహిస్తాడని నా నమ్మకం. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బందినీ చిరునవ్వుతో ఎదుర్కొంటాను. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోతే భగవంతునికి కృతజ్ఞత చెప్పుకొంటాను. లేకపోతే, మరింత శక్తిని ఇవ్వమని ఆయనను వేడుకుంటాను… అంతే!’ అంటూ ముగించాడు వ్యాపారి. వ్యాపారి మాటలకి మంత్రిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి.

సాఫ్ట్ వేర్ వ్యవసాయం

కరోనాకి ముందు లాక్ డౌన్ అంటే ప్రపంచానికి పెద్దగా తెలీదు. దీని కారణంగా ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. ఆర్ధికంగా చితికిపోయారు. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తున్నవాళ్లపై కరోనా లాక్ డౌన్ ప్రభావం తక్కువనే చెప్పాలి. కారణం ఇంటి వద్దనుంచే పని చేసే వెసులుబాటు ఉండటం. అయితే  పని విధానం కొత్తగా ఉండటం. ఎప్పటికప్పుడు టీం సభ్యులతో ఫోన్ లో అందుబాటులో ఉండి చర్చల్లో పాల్గొనడం ఇలా కంపెనీ లో వెచ్చించే సమయంకన్నా వర్క్ ఫ్రం హోమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనివలన ఎంతోమంది సాఫ్ట్ వేర్ యువత ఒత్తిడికి లోనై మానసిక సమస్యలకు గురవుతున్నారు. దీనిని అదిగమించేందుకు కొంతమంది ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం. ప్రకాశం జిల్లా,కనిగిరి ప్రాంతం గార్లపేట గ్రామానికి చెందిన రాంబాబు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లాక్ డౌన్ కారణంగా తను కూడాఇంటికి వచ్చేసాడు. అందరిలాగే పని ఒత్తిడి వలన ఇతను కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డాడు. అయితే దానిని అదిగమించేందుకు రొటీన్ కి భిన్నంగా  స్మార్ట్ వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండించాలి అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. కొంత వారి సహాయం కూడా తీసుకొని ఇంటి ఆవరణలోని మట్టిని తవ్వి  పరిసర ప్రాంతంలోనే ఎరువు తో మిశ్రమం అయిన మట్టిని తెప్పించి సత్తువ కలిగిన నేలను తయారు చేసాడు. నాణ్యమైన విత్తనాలు తెప్పించి నాటి చిన్న కూరగాయల తోటని సృష్టి చేసి స్నేహితులకు మిగతా గ్రామంలో యువతకు ఆదర్శంగా నిలబడ్డాడు రాంబాబు. ఇప్పుడు తనకే కాదు చుట్టుపక్కల వాళ్లకి కూడా తను పండించిన కూరగాయలను అందిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు.  కుటుంబానిది వ్యవసాయ నేపధ్యమే అయినా వాణిజ్యపంటలే గానీ కూరగాయలు పండేవి కాదు. ప్రతి రెండు మూడు రోజులకు ఇంటికి కూరగాయలు అవసరమయ్యేవి. అవి అతనే మార్కెట్ కి వెళ్లి కొనుగోలు చేసుకొని వచ్చేవాడు. ఇలా రెండు నెలలు గడిచాక పని ఒత్తిడి, మరోవైపు తరచూ మార్కెట్ కి వెళ్లి ఇవి కొనుగోలు చేసుకురావడం చికాకుగా అనిపించింది. ఆ సమయంలో ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. అలా తన స్మార్ట్ వ్యవసాయ ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ పని వలన నిరంతరం ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఉండే నాకు ఈ తోట పెంపకం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని సంతృప్తిని ఇస్తుంది అన్నారు. రెండు అంకెల జీతం రాగానే పాశ్చాత్య పోకడలకు పోయి, అర్థంలేని వ్యాపకాల ప్రభావంతో వ్యసనాలకు అలవాటు పడి మన మూలలను మరిచిపోతున్న కొంతమంది యువతకు రాంబాబు ప్రయాణం ఆదర్శనీయం. ఆచరణీయం. మీరు కూడా కొత్తగా ఒకటి ప్రయత్నించండి. "ప్రతి ఆలోచనా ఒక అగ్నికణం. దానిని సన్మార్గంలో రగిలించి వెలిగించావంటే నీతోపాటు చుట్టూ సమాజాన్ని కూడా వెలిగిస్తుంది." ◆వెంకటేష్ పువ్వాడ  

పాట జీవితం అయిన వేళ

విజయవాడ, ఆటోనగర్ నుంచి ఎన్టిఆర్ సర్కిల్ కి వెళ్లే పంటకాలువ రోడ్ అది. లైఫ్ స్టైల్ సంబంధించి ఎదో కంటెంట్ రాయడానికి ఆలోచిస్తూ బుర్రకి ఏదీ గోచరించక పరధ్యానంగా ఇంటికి వెళ్తున్నా. వర్షం వచ్చేలా ఉందని ఎక్సలేటర్ కొంచెం రేజ్ చేసాను.  నాలుగు రోడ్ల కూడలికి వచ్చేసరికి  "హా.... నా గొంతు శృతిలోనా" అని ఒక రాగం శ్రావ్యంగా వినిపించింది.పాట కచేరీ ఎదో జరుగుతుందని అనుకున్నాను. ఇద్దరు అందకళాకారుల తమకి సహాయం చేయమని ఊరికే డబ్బులు అర్ధించకుండా వెచ్చని సాయంత్రాన్ని వింజామారాలతో చల్లార్చినట్లు మధురమైన గానంతో మత్తెక్కిస్తున్నారు. కాసేపు నిలబడి చూసాను. "పాట జీవితాన్ని అభిషేకిస్తున్నట్లు సుందర దృశ్యం కనిపించింది" నేను తీసిన చిత్రాలకి అపుడు విన్న పాటనే అతికించాను. *"నా గొంతు శృతిలోనా.....! నా గుండె లయలోనా.....! ఆడవే పాడవే కోయిలా...!"* *అవును మీ గొంతు శృతి, మీ గుండె లయ- మనసు ద్యుతితో కలిసిన మీ హృదయం నుంచి ఆ రాగం వస్తుంటే జీవితం తేనె కలిసిన లెమన్ టీ ఫ్లేవర్ లా ఫ్రెష్ గా ఉంది. కోయిలే కాదు ప్రాణం లేని రాళ్లు కూడా ఆడతాయి పాడతాయి* *"ఒక మాట పది మాటలై- అది పాట కావాలని"* *"ఒక జన్మ పది జన్మలై-అనుబంధం అవ్వాలనీ"* *మాట మాత్రమే కాదు మీ ఉచ్వాశ నిస్వాస లోంచి కూడా సంగీతమే వస్తుంది.నిలబడి విన్నోడికి అది తెలుస్తుంది. అలా వింటే ఎక్కడరా బాబూ లేనిపోని ఫిలాసఫీ ని నెత్తినేసుకొని అర్జంట్ గా సత్యం తెలుసుకొని సచ్చీలులం అయిపోతే మన ఘనకార్యాలన్నీ ఆగిపోతాయి అని మనిషికి భయం. మారడానికి మనిషి సిద్ధంగా లేడు అనిపిస్తుంది. అంతెందుకు ఈ సోదంతా రాస్తున్న నేను కూడా ఉన్నపలంగా మారిపోలేను. కానీ కొంచెం అయినా మారాలనిపిస్తుంది. ఒక సెకను ఆలోచిస్తే చాలా స్వల్పం అయిన విషయాలకు అశాంతికి తలుపులు తెరిచి ప్రశాంతతకు తాళాలేసుకొని ద్వేషాన్ని మోసే మన అజ్ఞానంలో కొంచెం మార్పు వస్తుందని చిన్న ఆశ* *ఒక జన్మ కాదు వంద జన్మలైనా సరే మీతోపాటు నా కళ్లు కూడా తీసేసుకొని అనుబంధం పంచుకోవాలని ఉంది.-ఆ కళ్లను సత్యం చూడలేని ఈ ప్రపంచానికి ఇవ్వు అని దేవుణ్ణి కోరాలని ఉంది.* జీవితం అంటే ఏంటి? అందులో జీవన విధానం అంటే ఏంటి? ఎలా బ్రతకాలి? ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా సర్వై కావాలి అని తెగ ఆలోచిస్తుంటాము. ఆ విషయం ఎవరైనా చెప్పాలి లేదా ఎక్కడైనా చూసి నేర్చుకోవాలి. ఎవరో చెప్పడం ఎందుకు? ఎక్కడో చదవడం ఎందుకు? చీకటి తప్ప వెలుతురు తెలీని ఆ అందకళాకారులను చూస్తే సరిపోతుంది కదా అనిపించింది. వారితో కలిసి "జీవితం తనని తాను అన్వేషించుకుంటుంది". "తనని తాను శోధించుకుంటుంది". శ్రీ శ్రీ గారు అంటారు "సాయంత్రం ఆరు అవుతుంది. గదిలో ఒక్కడినే ఉన్నాను. చీకటి చినుకుల్లా కురుస్తుంది" అని. కానీ వీళ్లకి చీకటి నిత్యం కుంభవృష్టిలా కురుస్తుంది. దాని వలన భౌతిక ప్రపంచం మాత్రమే చూడలేరు గానీ తమలోకి తాము సందర్శించుకొని అందమైన ప్రపంచానికి తారల్ని తగిలిస్తూ నిత్యం దేదీప్యమానంగా వెలుగుతుంటారు.  వారినీ, వారి పాటని,మాటని పది నిమిషాలు కదలకుండా వింటే ఈ ఉరుకులు, పరుగులు, అధికారం, హోదా, కష్టం, సుఖం, బాధా, బందీ,ఆధిపత్య,అహం, అహంకారం, పగలు, ప్రతీకరాలు,కక్ష్యలు, కార్పణ్యాలు, పనికిమాలిన ఎంటర్టైన్మెంట్ అంతా నాన్సెన్స్ లా అనిపిస్తుంది. ఇంత conflict లోంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా! వాళ్ళని చూస్తే అరే ఇంత మధురమైన, అందమైన, శ్రావ్యమైన, రాగవంతమైన, మనో వికాస ప్రకాశిక జీవితం ఇంత తేలికా? అనిపిస్తుంది.ఒక యూనిట్ జ్ఞానోదయం అయినా కలిగిస్తుంది. ఎందుకంటే పాట అక్కడ జీవితాన్ని అభిషేకిస్తుంది. ◆వెంకటేష్ పువ్వాడ    

జీవితాన్ని తట్టుకొని నిలబడాలంటే!

అది ఒక చిన్న ఊరు. ఆ ఊళ్లో రెండు అందమైన ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. వాటి యజమానులు ఇద్దరూ స్నేహితులే. ఆ ఇద్దరు స్నేహితులూ కలిసి ఓ రోజు బజారుకి వెళ్లారు. వస్తూ వస్తూ ఓ రెండు మొక్కలు తెచ్చుకొన్నారు. తీరా ఇంటికి వచ్చాక మొదటి ఇంటి యాజమాని- ‘మనం సరదాగా ఒక పందెం వేసుకుందామా! ఇద్దరం ఒకేరకం మొక్కను తెచ్చుకొన్నాం కదా! వీటిలో ఏది బాగా పెరుగుతుందో చూద్దామా!’ అన్నాడు. ‘ఓ అదెంత భాగ్యం!’ అంటూ సవాలుకి సిద్ధమయ్యాడు రెండో యజమాని. మొదటి ఇంటి యజమాని పందేన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తను తెచ్చిన మొక్కని జాగ్రత్తగా నాటాడు. దాని కోసం ఎక్కడెక్కడి నుంచో ఎరువులు తీసుకువచ్చాడు. మూడుపూటలా మర్చిపోకుండా దానికి నీళ్లు పోసేవాడు. మొక్కలు బాగా పెరగడానికి ఇంటర్నెట్‌లో కనిపించే చిట్కాలన్నీ పాటించేవాడు. రెండో ఇంటి యజమాని మాత్రం తన మొక్క విషయంలో చాలా నిర్లిప్తంగా ఉన్నాడు. రోజూ ఉదయం కాస్త నీళ్లు పోయడం మాత్రమే చేసేవాడు. రోజులు గడిచేకొద్దీ మొదటి ఇంట్లో మొక్క ఏపుగా పెరగసాగింది. దాని ఆకులు నవనవలాడుతున్నాయి. పండ్లు, పూలతో ఆ చెట్టు చూడముచ్చటగా ఉంది. రెండో చెట్టు కూడా బాగానే ఉంది. కానీ మొదటి చెట్టుతో పోలిస్తే అది కాస్త కాంతివిహీనంగా కనిపిస్తోంది. ‘చూశావా! ఒక్క ఆర్నెళ్లలోనే నా చెట్టు ఎలా తయారైందో. ఇక నువ్వు ఓడిపోక తప్పదు,’ అంటూ రెండో ఇంటి యజమానిని రెచ్చగొట్టాడు మొదటి ఇంటి యజమాని. దానికి రెండో యజమాని ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుండిపోయాడు. ఈ సంభాషణ జరిగిన రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. ఉదయం లేచి చూసేసరికి ఏముంది? ముందురోజు వరకూ నవనవలాడుతూ కనిపించిన మొదటి ఇంటి చెట్టు కాస్తా వేళ్లతో సహా పక్కకి పడిపోయింది. రెండో చెట్టు మాత్రం ఏం జరగనట్లు నిబ్బరంగా కనిపించింది. ‘అదేంటి! ఇంత జాగ్రత్తగా పెంచిన చెట్టు ఇలా ఒరిగిపోయింది,’ అంటూ ఏడుపుమొహం పెట్టుకున్నాడు ఆ ఇంటి యజమాని. దానికి రెండో యజమాని చిరునవ్వుతో- ‘నువ్వు చెట్టుని అందంగా, ఎత్తుగా పెంచాలని చూశావు. దానికి పళ్లు, పూలు కాయాలని మాత్రమే చూశావు. అందుకే దాని అవసరానికి మించిన నీళ్లు అందించావు. ఎప్పటికప్పుడు కావల్సిన నీరు అందడంతో దాని వేళ్లు భూమి లోపలకి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. కానీ నేను నాటిని మొక్క ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని సహజంగా ఎదగాలని కోరుకున్నాను. అందుకే దానికి తగినంత సాయం మాత్రమే చేశాను. ఫలితం! నేను నాటిన మొక్క వేళ్లు భూమి లోతుకి వెళ్లాయి. ఎండకి ఎండి, వానకి తడిసి దాని కాండం బలపడింది. గాలివానని సైతం తట్టుకొని నిలబడింది,’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కథ కేవలం మొక్కలకి సంబంధించింది మాత్రమే కాదు! పిల్లలు కూడా ఇంతే! వారికి ఏ కష్టమూ, లోకజ్ఞానమూ తెలియకుండా అవసరానికి మించిన సౌకర్యాలు అందిస్తుంటే... జీవితంలో అలజడి రేగినప్పుడు తట్టుకోలేరు. అలా కాకుండా వారు స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తూ, ఒక కంట వారి అవసరాలను కనిపెడుతూ ఉంటే... ఎలాంటి తుఫానునైనా తట్టుకొని నిలబడతారు.                                   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

నరకమంటే ఏమిటి?

చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.   ఒక శిష్యుడికి ఏది స్వర్గం? ఏది నరకం? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు. తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు. ‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు.... ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు... మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.  

మన బతుకుబండి స్టీరింగ్ మనచేతుల్లోని వుంది!

నేనీ మధ్య  నా చిన్నప్పటి ఫ్రెండ్ ని కలవటం జరిగింది.  ఎప్పుడూ చలాకీగా వుండే తాను, ఈమధ్య చాలా డల్ గా తయారైంది. విషయo ఏంటని అడుగుతే, తన భర్త ఉద్యోగ రీత్యా దూరంగా బదిలీ కావటం, పిల్లలు ఎదుగుతున్న, మాట వినకుండా అల్లరి చేయడం , శారీరకమైన మానసికమైన ఒత్తిడి పెరగటం, ఇవన్నీ నా వల్ల కావడం లేదు అని చెప్పుకుంటూ వచ్చింది. మనలో చాలా మంది కి  చాలా సార్లు, పరిస్థితులు గాడి తప్పినపుడల్లా , చీకాకు కలగటం, ఇక నా వల్ల కాదు అన్నట్టు, బాధ , అసహనం కలుగుతూ ఉంటుంది కదా, మరి ఈ పరిస్థితి నుంచి బయటడం ఎలా? మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి , వంద కిలోమీటర్ల దూరం లో వున్న ఊళ్లో జరిగే కజిన్ పెళ్ళికి వెళ్లాలనుకున్నామనుకోండి, ఆ ఫీలింగ్  మనకు యెంత ఎగజయిట్మెంట్ ఇస్తుంది. పెళ్ళికి అందరూ వస్తారు , అందరిని కలవచ్చు , చాలా చాలా ఎంజాయ్ చేయచ్చు అని బయలుదేరుతాం. కదా.. ఓ రెండు గంటలు ఎక్స్ప్రెస్  హైవే లో నడిపాక, , పల్లెటూరు కి వెళ్లే చిన్న రోడ్డు లోకి టర్నింగ్ తీసుకుంటాం. అప్పటిదాకా హాయిగా డ్రైవ్ చేసిన మనకు, కుదుపులు వున్న కంకర రోడ్డు, రోడ్డు పై అక్కడక్కడా గుంతలు , మధ్యలో కారుకి అడ్డంగా వచ్చే , ఆవులు, మేకలు ఇవన్నీ ఎదురవుతుంటే, మన కారు స్పీయేడు కూడా తగ్గించాల్సి వస్తుంది. అవునా? ఇది ఎంత అసౌకర్యంగా వున్నా, మన ప్రయాణం కొనసాగిస్తాం. ఎందుకంటె, ఈ చిన్న చిన్న ఇబ్బందులు దాటుకుని గమ్యాన్ని దాటితే అక్కడ యెంత హ్యాపీనెస్ ఉంటుందో మనకు తెలుసు కనుక. అంతే కానీ, రోడ్డు బాగాలేదు, జర్నీ విసుగ్గా వుంది అని వెనక్కి వెళ్లి పోయావాలని ఎన్నడూ అనుకోము.  మన జీవితం కూడా, అచ్చముగా ఇలాగే ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పుడల్లా , ఈ కుదుపుల ప్రయాణం  తరువాత మళ్ళీ మన బతుకు బండి స్పీడు అందుకుంటుందన్న నమ్మకం ఉండాలి. జీవితం లో ప్రతీ ప్రయాణం, ప్రతీ అనుభవం మనకు కొత్త పాఠాలను నేర్పి, ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. అంతే కాదు, ఖాళీ గా, సాఫీ గా వున్నా రోడ్డు మీద నడిపే వాళ్ళు కాదు, ఒడిదొడుకులు వున్న రోడ్డు మీద నడిపేవాళ్ళు అసలు గొప్ప. అంతే కానీ, ఈ గుంతల రోడ్డు లో నడపటం నావల్ల కాదు అని స్టీరింగ్ వదిలేస్తే ఎలా ఉంటుంది? రోడ్డు సాఫీ గ లేనప్పుడే ఇంకాస్త జాగ్రత్తతో , ఒడుపుగా బండి ని నడపాలి. జీవితపు స్టీరింగ్ ని కూడా ఇలాగే ఒడుపుగా తిప్పడం నేర్చుకోవాలి.ఎలాంటి పరిస్థితుల్లోనూ, చేతులెత్తేయకుండా, పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటం మన బాధ్యత.  జీవితం లో ఎత్తుపల్లాలు ఉంటేనే, మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. మన నైపుణ్యం ఏంటో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.  జీవితం లో, సంతోషం  సమస్యలు రెండు కలగలిపి ఉండటం సహజం, అలాంటి పరిస్థుల్లో హాయిగా నెగ్గుకు రావడమే అసలైన విజయం.  అందుకే, సమస్యలు వచ్చినపుడే, అవి మనకు కొత్త విషయాలు నేర్పే మాస్టార్లని , మనలోని ప్రతిభని వెలికి తీసే గురువులని గురుతుంచుకోండి.  -Bhavana  

పాతికేళ్లలోపే డిప్రెషన్‌ వచ్చేస్తోంది!

ఇంటర్నెట్‌ గురించి అవగాహన ఉన్నవారు ‘PRACTO’ అన్నపేరు వినే ఉంటారు. మనకి దగ్గరలో ఉన్న వైద్యుల వివరాలను అందచేస్తూ, అవసరమైతే వారితో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా చికిత్సను అందించే సంస్థే practo. వైద్యుల కోసం తమ సైట్‌ను సంప్రదించే వ్యక్తుల వయసు, అవసరాల ఆధారంగా ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను చూడగానే ఇప్పటి యువత మానసిక సమస్యలతో సతమతం అయిపోతుదని తేలిపోతోంది. ఆ నివేదికలో ముఖ్య అంశాలు ఇవిగో…   - మానసిక సమస్యల కోసం వైద్యులను సంప్రదించేవారిలో 79 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! - 25 నుంచి 34 వయసువారితో పోలిస్తే.... 24 ఏళ్లలోపువారే మానసిక వైద్యులని సంప్రదించడం ఆశ్చర్యం కలిగించే విషయం.   - గతంతో పోలిస్తే డిప్రెషన్, ఉద్వేగం వంటి సమస్యలతో మానసిక వైద్యులని సంప్రదించేవారి సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగిందట.   - తమ మానసిక సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా వైద్యుల పరిష్కారాన్ని కోరాలనుకునేవారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందట. మానసిక సమస్య అనగానే సమాజం చిన్నచూపు చూడటం వల్లే ఎక్కువమంది ఆన్‌లైన్లోనే వైద్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.   - ముంబై, దిల్లీ, బెంగళూరు నగరాల్లో మానసిక వైద్యులను సంప్రదించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగని మిగతా నగరాలు కూడా ఏమంత ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. గతంతో పోలిస్తే చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో కూడా మానసిక వైద్యులని ఆశ్రయించేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది.   Practo అందిస్తున్న ఈ నివేదికని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే యువత ఎక్కువగా ఆన్‌లైన్ మీద ఆధారపడుతుంది కాబట్టి... 30 ఏళ్లలోపు వారే ఈ సౌకర్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. పైగా ఒకప్పుడు మానసిక సమస్య కోసం వైద్యుడి దగ్గరకి వెళ్లడం అంటే ‘నాకేమన్నా మెంటలా!’ అని నొచ్చుకునేవారు. కానీ ఇప్పటి యువత వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడానికి  జంకడం లేదని తృప్తిపడాలేమో కూడా! కానీ ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుపెడుతున్న యువత మానసిక సమస్యలతో ఎందుకు సతమతం కావాల్సి వస్తోంది అన్నదే ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఎదుగుతున్న తీరులోనూ, ఎదిగాక వారు జీవించే విధానంలోనూ ఏదో లోటు ఉందేమో విశ్లేషించి తీరాల్సిందే! - నిర్జర.  

అతను ఇంటర్నెట్ని ముందుగానే ఊహించాడు

‘మార్షల్ మెక్లుహాన్’ – ఈ పేరుని చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ ‘గ్లోబల్ విలేజ్’ అన్న పదాన్ని వినే ఉంటారు కదా! ఆ మాటని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తే మార్షల్ మెక్లుహాన్. అంతేకాదు... సాంకేతికతకు, మీడియాకు సంబంధించి ఆయన చేసిన అనేక ప్రతిపాదనలు సంచలనం సృష్టించాయి. సరిగ్గా 106 ఏళ్ల క్రితం మార్షల్ కెనడాలో పుట్టాడు. మంచి చదువు చదువుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. అప్పుడే ప్రజలు నిదానంగా టీవీకి అలవాటుపడుతున్నారు. అదో అద్భుతం అనుకుని మురిసిపోతున్నారు. మీడియా అన్న పదం అప్పుడప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఆ సమయంలో మార్షల్ మీడియా గురించి ప్రత్యేకించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిలో అనేక సిద్ధాంతాలు చేశాడు. మార్షల్ 1962లో The Gutenberg Galaxy అనే పుస్తకం రాశాడు. అందులో ఆయన మానవచరిత్రను నాలుగురకాలుగా విభజించాడు. * మొదటి దశ acoustic age- ఈ దశలో కేవలం వినికిడి ద్వారానే సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది. * రెండో దశ literary age – ఈ దశలో నిదానంగా రాయడం అలవాటు అవుతుంది. ఆకుల మీదో, కాగితాల మీదో సమాచారాన్ని రాసుకుంటారు. * మూడో దశ print age – ఈ దశలో పుస్తకాలను ముద్రించడం సులువుగా మారిపోతుంది. కావల్సినంత సమాచారం పుస్తకాల రూపంలో దొరుకుతుంది. * నాలుగో దశ electronic age – ఈ దశంలో సమాచారం అంతా కూడా టీవీ, కంప్యూటర్ వంటి పరికరాల ద్వారానే ఒకరి నుంచి ఒకరికి చేరతాయి. మానవుడు మొదటి మూడు దశలనీ దాటేసి నాలుగో దశలోకి చేరిపోయాడనీ, ఇక మున్ముందు అంతా సమాచార విప్లవమే అని తేల్చి చెప్పేశాడు మార్షల్. అంతేకాదు! కంప్యూట్ అనే పరికరం కేవలం లెక్కలు చేయడానికే కాదునీ... పరిశోధనలు చేయడానికీ, ఒకరొకొకరు సమాచారం అందించుకోవడానికి సాయపడుతుందనీ ఊహించాడు. ఆ తర్వాత ఎప్పుడో 25 ఏళ్లకి కానీ జనాలకి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. దీన్ని బట్టి మార్షల్ ఊహ ఎంత ఖచ్చితమైనదో తెలిసిపోతుంది. మీడియాదే రాజ్యమనీ మున్ముందు ప్రతి విషయాన్నీ మీడియా తనదైన దృష్టిలో ప్రజలకు చేరవేస్తుందనీ ఆనాడే పసిగట్టారు మార్షల్. అందుకే ‘the medium is the message’ అన్న మాటని ఉపయోగించారు. ‘మీడియా ఎంత చెబితే అంత’ అన్న భావం ఇందులో స్ఫురిస్తుంది. మార్షల్ బతికున్నంతకాలమూ ఆయన మాటల్ని ఎవరూ పెద్దగా నమ్మలేదు. తరచూ టీవీలూ, మేధావులూ ఆయనను తల్చుకున్నా... ఆయన మాటలు నిజమవుతాయని ఎవరూ భావించలేదు. కానీ 1980లో మార్షల్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత జరిగినదంతా మనకి తెలిసిన చరిత్రే! ఏదన్నా పరిణామం జరిగిన తర్వాత దాని గురించి విశ్లేషించడం, అందులో మనం కూడా పాలుపంచుకోవాలని కోవడం సహజమే! కానీ భవిష్యత్తులో ఇలా జరగబోతోంది అని ముందుగానే ఊహించడం గొప్ప లక్షణం. అందుకే ఇవాళ గూగుల్ సైతం మార్షల్ని గౌరవించుకోవాలని అనుకుంది. ఆయన పేరుతో ఒక డూడుల్ని రూపొందించింది. - నిర్జర.

18+లో చూసే దృష్టికోణం మారాలి

సమాజాన్ని అంతో ఇంతో ప్రభావితం చేయగలిగేది సాహిత్యం అని నా అభిప్రాయం. ఇందులో కథ, కవిత్వం, నాటకం, సంగీతం, సినిమా ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి. వేటికవే ప్రత్యేకం. అయితే ఇప్పుడు యువతను బాగా ప్రభావితం చేస్తుంది సినిమా. మరి అలాంటి సినిమాని యువత ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నారు? అనేది మనం గమనించాలి. కథలో ముఖ్యంగా సినిమా కథల్లో ప్రత్యేకించి మంచిని వేరు చేసి చూపించరు. కథలో భాగంగా ఉంటుంది. ఇది చర్చ ద్వారానే అవగతమవుతుంది. అయితే ఆ చర్చ ఎవరితో జరగాలి? తల్లిదండ్రులతో జరగాలి. గురువులతో జరగాలి అప్పుడే అందులో ఉన్న అంతః సారం గురించి అర్ధవంతమైన చర్చ జరుగుతుంది. అంతేగాని సమవయస్కులైన మిత్రులతో కలిసి చర్చిస్తే అనవసరమైన విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఉదాహరణకు "పోకిరి" సినిమాని తీసుకుందాం. ఆ సినిమాని చూసిన పద్దెనిమిది, ఇరవయ్యేళ్ల వయసువాళ్లు మిత్రులతో కలిసి ఎక్కువగా ఏమి చర్చిస్తారో తెలుసా? హీరోయిన్ డైలీ ఆఫీస్ కి తీసుకెళ్లే ఉప్మా గురించి. ప్రతి కథానాయకుడు స్త్రీల పట్ల అసభ్యంగా చేసిన పద ప్రయోగాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు.  ఇదే కథని తల్లిదండ్రులవద్ద లేదా గురువుల వద్ద చర్చకు వస్తే విషయం వేరుగా ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం లెక్క చేయక, దుష్టుల చేతిలో భార్యను కోల్పోయిన తండ్రి నే స్ఫూర్తిగా తీసుకొని పోలీస్ ఆఫీసర్ అయిన కొడుకు అయిన హీరో గొప్పతనం గురించి కచ్చితంగా చర్చకు వస్తుంది.  అయితే ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు చూసి వచ్చిన సినిమా గురించి చర్చిస్తున్నారు. విని వారి అనుభవ సారం నుంచి అర్ధమైన విషయం పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పగలుగుతున్నారు అంటే వెళ్లపై లెక్కపెట్టవచ్చు. కునుకు మంచి అయినా చెడు అయినా పిల్లలతో చర్చించండి. వారికి అర్ధమైంది తెలుసుకోండి. మీకు అర్ధమైంది వివరించండి. అప్పుడే శోధనాత్మకమైన యువ సమాజం నిర్మితమవుతుంది. - వెంకటేష్ పువ్వాడ

డోంట్ వర్రీ తమ్ముడూ - ఓసారి వివేకానందున్ని చదువుదాం!

చిన్న కష్టానికే హడలిపోతున్నారు. అర్ధం లేని కారణాలకు ఆత్మ త్యాగాలను చేస్తుంది ఈ జనరేషన్. కారణం ఇంట్లో సరి అయిన మార్గనిర్దేశం చేయాల్సిన తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపారాలలో పడి పిల్లలతో సరిగా మాట్లాడలేకపోవడం. ఎవరి పరుగు వాళ్లది. బాధపడాల్సిన పని లేదు తమ్ముడూ! స్వామి వివేకానంద కొత్త తరాలను జాగృతం చేసే గొప్ప మాటలను గ్రంధస్తం చేసి మనకోసం వదిలేసి వెళ్లిపోయాడు. యువతే భావిభారత నిర్మాణానికి పునాదులని దేశంలో యువతిని తన సమ్మోహ నయనాలతో గొప్ప సూక్తులను ఉపదేశించి చైతన్యం దిశగా నడిపారు. ఆ క్రమంలో ఎన్నో సందేశాలను ప్రవచించారు. ప్రతి పౌరుడు హృదయంలో చెరగని సంతకంగా నిలిచిపోయారు. ఒకసారి వివేకానందున్ని చదువుదాము.  కాలం మారింది, సామాజిక పరిస్థితులు మారాయి పాశ్చాత్య పోకడలు నవీన నాగరికతను నిర్వచిస్తున్నాయి. ఈ సమయంలోనే మనం తరం జాగృతం కావాలి " బలమే జీవనం - బలహీనతే మరణం" (strength is life - weakness is death) అంటారు వివేకానంద. ప్రకృతి ఉపద్రవాలు వైపరీత్యాలు, మనిషి ఉనికినే ప్రశ్నిస్తున్న కరోనా లాంటి వాటిని దీటుగా ఎదుర్కొని నిలబడాలంటే ఇప్పుడు మానిసికంగా ఎంతో బలపడాల్సి ఉంది. బలహీనతల్ని ఐక్యతతో ఎదుర్కోవాల్సి ఉంది. ఇంకా ఆర్ధిక అసమానతలతో నిరుద్యోగ యువత కి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి అదే బలహీనతగా దారి తీసి చీకటి అగాధంలోకి జారిపోయి ఆత్మ త్యాగాలను చేసే ఎంతోమంది అమాయక యువతను మానసికంగా శారీరకంగా బలమే జీవనం అని హెచ్చరిస్తారు వివేకానంద. ఇంకో సందర్భంలో  " ఎవరైతే తనని తాను విశ్వసించడో వాడే పెద్ద నాస్తికుడు" అంటారు. ప్రస్తుతం యువత ఆస్థికతకు నాస్తికతకు మధ్య ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు. అయితే కాల గమనంలో కొంతమంది సూడో మేధావితనాన్ని ఆపాదించుకొని దేవుడు- నమ్మకం గురించి అనవసర చర్చలు జరిపి దేశ యువతిని భారతీయతకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీనిద్వారా కల్పిక నాస్తికతపై ఎక్కువ చర్చ జరిగి యువ సమాజం అయోమయంలో పడిపోతుంది. దేవుడికంటే ముందు నిన్ను నువ్వు నమ్ము అంటాడు వివేకానంద. ఇలా ప్రతి సంక్షోభానికి వివేకానందను చదివితే పరిష్కారం దొరుకుతుంది. మనసు ప్రశాంతత పొందుతుంది. ఇలా తన జ్ఞాన తేజస్సుతో స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటల్ని మూటకట్టి విజ్ఞాన బాండాగారాన్ని మనకోసం వదిలేసి వెళ్లిపోయారు. అందుకే ఆయన చెప్పిన మాటలు నిత్యం మనం స్మరణం చేసుకుంటే చాలు. నిరాశ నిస్తేజం కి చోటు ఉండదు. - వెంకటేష్ పువ్వాడ   

మన గమనం ఎలా ఉండాలి?

జీవితం తెల్లని కాగితం లాంటిది. అందమైన రంగులతో చక్కగా మలుచుకుంటే గొప్పగా ఉంటుంది. కాదని కుదురైన ఆలోచనలు లేక పిచ్చి గీతలు గీసుకుంటే అర్ధం లేకుండా ఉంటుంది. పాశ్చాత్య పోకడలు మన నవీన నాగరికత పై తద్వారా యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది కాదనలేని నిజం. పదవ తరగతి పూర్తయిన విద్యార్థి నుంచి డిగ్రీ విద్యార్థి వరకు తర్వాత ఏం చదవాలి ఎలా ముందుకు వెళ్లాలి అని స్పష్టమైన అభిప్రాయం లేని ఎంతోమందిని మన చుట్టూ చూస్తున్నాం. నిర్దిష్టమైన ఆలోచనలు లేకపోవడమే దీనికి కారణం.  స్థిరత్వం కావాలి... ఒక పని లేదా ఒక అంశాన్ని ఎంచుకొన్నపుడు అందులో ఎదో చిన్న సమస్య ఎదురైందని, అయ్యో! ఇది తీసుకోకుంటే బాగుండు ,ఇది ఎంచుకోకుంటే బాగుండు అనే ఆలోచనలు రానివ్వడం ద్వారా మనిషికి తన మీద ఉన్న తన నమ్మకం తెలీకుండా సడలిపోతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బద్దకం. ఇది  స్కూల్ స్థాయి నుంచే అలవడటం ప్రమాదం. ఉదాహరణ గా చెప్తే ఒకసారి రాయడం ద్వారా పది సార్లు చదివినట్లు అని చెప్తారు. చెప్పడం కాదు నిజం. అయితే ఇప్పుడు విద్యావ్యవస్థలో నోట్స్ రాసే విద్యార్థులు ఎంతమంది. ఆ స్థానంలో జిరాక్స్ లు వచ్చాయి. శ్రమ లేని చదువు మత్తుని ఇస్తుంది కానీ మనో నిబ్బరాన్ని ఇవ్వలేదు. దీని వలనే ఈరోజు యువత చిన్న కష్టానికే తన పనిని, వృత్తిని, చదువుని పదే పదే మార్చుకుంటూ స్థిరత్వం కోల్పోతున్నాడు. "సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్ధించకు. ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకొని నిలబడే శక్తి కోసం ప్రార్ధించు" అంటాడు బ్రూస్లీ. వీలైనంత వరకూ బద్దకానికి దూరంగా ఉండి పోరాడే శక్తిని అలవరుచుకోవడం ఉత్తమం. ఆ విధంగానే మన విద్యా వ్యవస్థ ఉండాలి. అప్పుడే జీవితం కాన్వాస్ పై రంగు కలల అడుగులు పడతాయి. - వెంకటేష్ పువ్వాడ

హాయ్ బ్రో! - నేను క్షేమమే!

హాయ్ బ్రో! నేను క్షేమమే! ఈ మాటల్ని చూడగానే రెండు వేరు వేరు కాలాలను కలిపి ముడేసినట్లు ఉంది కదా! పాత రోజుల్లో ఎవరికైనా సమాచారాన్ని చేరవేయడానికి జాబులు రాసేవారు. ఇంకా కొంచెం ఎక్కువ విషయం అయితే ఇంగ్లాండ్ కవర్ లో రాసేవారు. అనురాగలను, అభిమానాలను హృదయం పై "ఉభయకుసులోపరి" అంటూ అచ్చేసుకొని మనిషి మమతల్ని ఆవిష్కరించేవి ఆనాటి ప్రత్యుత్తరాలు.  "నేను క్షేమమే! మీరు క్షేమమే అని తలుస్తున్నా!" " నాన్న గారికి నమస్కరిస్తూ! వ్రాయునది" "పెద్దలకు హృదయపూర్వక సుమాంజలి" ఇలాంటి తొలి తొలి మాటల్లోనే ఎంతటి ద్వేషాన్ని అయినా కరిగించి ప్రేమను కురిపిస్తాయి. అలాంటి మనసు తడి అక్షరాలను మోసుకొచ్చే ఆనాటి జాబు ముక్కలు, తోక లేని పిట్టలు ఈరోజు ఎక్కడ?  కాల గమనంలో  కనుమరుగయ్యాయి.  కాలం మారింది ~~~~~~~~ ఇప్పుడు యువత స్మార్ట్ ఫోన్ సాక్షిగా తోకా, పిట్టా రెండూ లేని సమాచారాలు, సందేశాలు గాల్లో తిరుగుతున్నాయి. అక్షరాలు తేలిక అయిపోయాయి. వాట్సప్, ఫేస్బుక్ మెస్సెంజర్స్ ,టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్ లలో  కొన్ని వందల సందేశాలను పంపిస్తున్నారు. సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. కానీ మాటలు ముక్కలై పోతున్నాయి. "హాయ్ బ్రో హౌ ఆర్ యూ" "హాయ్ సిస్ ఎలా ఉన్నావ్" ఇలా మొదలై రాత్రి భోజనం వరకూ మాట్లాడుకుంటారు. సగం సగం మాటలు. షార్ట్ అండ్ కోడ్ సంభాషణలతో షార్ట్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయినట్లు ప్రేమలు కూడా ఎగిరిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కూడా వృధా చేస్తున్నారు నేటి యువత. ఎదురెదురు కలిసిన మిత్రులను విష్ చేసుకోలేక వాట్సాప్ లో మాట్లాడే వాళ్లని చూస్తున్నాం. మానవ సంబంధాలు ఈ తీరుగా మారడానికి కారణాన్ని ప్రశ్నించుకోవాలి. చాటింగ్ భూతాన్ని కంట్రోల్ చేసుకుని యువత వాస్తవిక ప్రపంచంలోకి రావాలి. గతాన్ని వర్తమానాన్ని కలిపి ముడి వేయండి. తోకలేని పిట్టల్ని పట్టుకు రండి తల్లిదండ్రులకు ,మిత్రులకు మనసారా ఓ ఉత్తరం రాసి చూడండి. జీవితం కొత్తగా ఉంటుంది. - వెంకటేష్ పువ్వాడ

ఇలా చేస్తే భయం కాస్తా పారిపోతుంది

ఏం జరగబోతోందో అన్న అనుమానమే భయానికి దారితీస్తుంది అంటారు పెద్దలు. మనలో ఏర్పడే భయాలు కొంతవరకూ సహేతుకమే కావచ్చు. ప్రమాదాల నుంచి పరాజయాల నుంచి మనల్ని కాపాడవచ్చు. కానీ చీటికీ మాటికీ భయపడుతూ కూర్చుంటే జీవితమే ఒక జాగ్రత్తగా మారిపోతుంది. అందుకనే భయాలను దాటినవారికే విజయం లభిస్తుందని చెబుతుంటారు నిపుణులు. మరి ఆ భయాలను దాటేందుకు వారు ఇచ్చే సలహాలు...   భయాన్ని పసిగట్టండి మెదడులో అసంకల్పితంగా ఏర్పడే భయం తన ప్రభావాన్ని శరీరం మీద చూపి తీరుతుంది. ఆ లక్షణాలను పసిగట్టే ప్రయత్నం చేస్తే... మనలో ఉన్న భయం అవసరమా కాదా అని తర్కించే అవకాశం దొరుకుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, తల దిమ్మెక్కిపోవడం, చెమటలు పోయడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది... లాంటి లక్షణాలు ఏర్పడిన వెంటనే, వాటికి భయమే కారణమేమో గమనించాలి.   అలవాటు చేసుకోండి ఇదివరకు ఎప్పుడూ చేయని పని అనుమానానికి దారితీస్తుంది. ఆ ఆనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది. కాబట్టి మీకు భయం కలిగిస్తున్న పనిని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భయం నిర్హేతుకం అని తేలిపోతుంది. పరీక్షలంటే భయముంటే మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి, కొత్త వ్యక్తులను కలవడంలో భయం ఉంటే చొరవగా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి.   భయపడే పని చేసేయండి ఒక పని చేయాలంటే మీకు చాలా భయం. కానీ ఆ పని విజయవంతం అయితే మీ జీవితమే మారిపోతుందని తెలుసు! అలాంటప్పుడు భయపడుతూ కూర్చుంటే లాభం లేదు కదా! ఒక్కసారి గుండెని అదిమిపట్టి అనుకున్న పనిని చేసేయండి. శరీరాన్ని ముందుకు దూకించండి. ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ అంటే భయం. కానీ ఫలానా కంపెనీలో మీలాంటివారికి ఉద్యోగం ఉందని తెలిసింది. వెంటనే మీ రెజ్యూమ్ని తీసుకుని ఆఫీసుకి చేరిపోండి. ఆ తర్వాత ఎలాగూ ఇంటర్వ్యూని ఎలాగూ ఎదుర్కోక తప్పదు.   తాత్సారంతో లాభం లేదు భయపడే పనిని వాయిదా వేసి, ఆ భయం నుంచి తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా పని మరింత క్లిష్టతరం అయిపోతుంది. దాంతో భయమూ అంతకంతకూ పెరిగిపోతుంది. కాబట్టి వాయిదా వల్ల హాని తప్ప ఉపయోగం లేదు. అందుకనే అనుకున్న పని పూర్తిచేయడానికి కొన్ని నిర్దిష్టమైన డెడ్లైన్స్ పెట్టుకోండి. పని చేయబోతున్నానని ఇతరులతో ఒప్పేసుకోండి. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాధ్యతని తలకెత్తుకోండి.   చిన్నపాటి టెక్నిక్స్ పాటించండి భయాన్ని ఎదుర్కోవడానికి చాలా చిట్కాలే ఉన్నాయి. వాటిలో మీకు అనువుగా ఉండేదాన్ని ఎన్నుకోండి. ఊపిరి నిదానంగా పీల్చుకుని వదలడం, ఉద్వేగంతో బిగుసుకుపోయిన కండరాల మీద ధ్యాస నిలపడం... లాంటి చిట్కాలు చాలావరకూ సాయపడతాయి. - నిర్జర.  

ప్రపంచం చుట్టుతా ఓ రహదారిని నిర్మిస్తే...!?

భూమి గుండ్రంగా బంతి ఆకారంలో ఉందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఓ భూగోళాన్ని చుట్టివచ్చే ప్రయత్నం చాలామంది చేశారు. అయితే ఈ ప్రపంచం చుట్టుతూ ఒక రహదారిని నిర్మిస్తే ఎలా ఉంటుంది. భూమికి అడ్డంగా, భూమధ్య రేఖ వెంట ఒక పొడవైన రహదారిని ఉన్నట్లుగా ఊహించుకోండి.. ఇప్పటికైతే భూమధ్యరేఖ వెంట అలాంటి రహదారి లేదు. కానీ, నిర్మిస్తే ఎలా ఉంటుంది..?   అయినా భూమిపై అంత పొడవైన రహదారిని ఎలా నిర్మిస్తాము? దీని పైన ప్రయాణించాలంటే ఎంత సమయం పడుతుంది?  పర్యావరణానికి ఇది నష్టం చేస్తుందా ? ఒకవేళ ఇలాంటి రహదారిని నిర్మించినట్లయితే ఎలా ఉంటుంది. అది తెలియాలంటే కొన్ని విషయాలు మనం పరిశీలించాల్సిందే. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల రోడ్లు కలిసి 64 మిలియన్ కిమీ (40 మిలియన్ మైళ్ళు ఉన్నాయని ఓ అంచనా. కానీ వీటిలో ఏ ఒక్క హైవే నెట్‌వర్క్  కూడా మిమ్మల్ని న్యూయార్క్ నుండి నేరుగా కేప్ టౌన్‌కు తీసుకెళ్లదు. కానీ మనం ఊహిస్తున్న రోడ్డు నిర్మాణం మనల్ని  కొలంబియా నుండి ఇండోనేషియాకు సులభంగా తీసుకువెళుతుంది. ఇప్పటికే ఉన్న కొన్ని రహదారి వ్యవస్థలతో అనుసంధానం చేసుకుంటే సులభంగా ప్రయాణించవచ్చు.  ఇది ఉహించడానికి బాగున్నా నిర్మాణం చేయాలంటే చాలా ఖరీదైన ఇంజనీరింగ్ ప్రక్రియ వలనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ రహదారిని ఎక్కువ భాగం నీటి అడుగున నిర్మించాల్సి ఉంటుంది. పైగా దీన్ని నిర్మించడానికి సగటున ఐదు నుండి పది సంవత్సరాలు పడుతుంది. కానీ దీన్ని ఏదో  రహదారిని నిర్మించినట్లుగా నిర్మించలేం. 40,000 కిలోమీటర్ల పొడవైన రెండు లేన్ల ఈక్వటోరియల్ రహదారిని సాధారణ రహదారి వలె ఒకే సమయంలో వివిధ భాగాల్లో నిర్మించాల్సి  ఉంటుంది. అన్నీ ప్రాంతాల్లో ఒకే సమయంలో ఈ నిర్మాణం చేపట్టాలి అంటే సుమారు 8 మిలియన్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు పనిచేయాలి. ఇందుకోసం 9.2 ట్రిలియన్లు డబ్బు ఖర్చు అవుతుంది. మరీ, ఈ రహదారిపై ప్రయాణించడం ఎలా ఉంటుందనేగా..? చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. భూమధ్యరేఖ వెంబడి 13 దేశాలను చుడుతూ, మూడు మహాసముద్రాల గుండా వెళుతుంది ఈ రహదారి. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ప్రారంభమై, కొలంబియా ద్వారా బ్రెజిల్‌కు తూర్పున ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం, అధిక టెంపరేర్లను చవిచూడాల్సి  ఉంటుంది కాబట్టి  యాత్రకు బయలుదేరే ముందు కారు ఎయిర్ కండిషనింగ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చూసుకొని బయలుదేరితే మంచిది. ఈ ప్రయాణం పర్వతాల గుండా, అమెజాన్ నది మీదుగా సాగుతుంది. ఒకవేళ ఈ మార్గంలో రిఫ్రెష్ కోసం ఈతకొట్టాలని అనుకుంటే అమెజాన్ నదిలో ఈతకు వెళ్ళవచ్చు. అమెజోనియన్ లో సాహసాలు చేయవచ్చు. ఆ తర్వాత బ్రెజిల్, అట్లాంటిక్ తూర్పు తీరం వెంట టన్నెల్ లో ప్రవేశిస్తారు. ఈ గొప్ప అనుభూతిని సొంతం చేసుకోవాలంటే అట్లాంటిక్ సముద్రపు అడుగున నిర్మించిన టన్నెల్ లో ప్రయాణం సాగించాల్సి  ఉంటుంది. ఇక్కడ ప్రయాణం కాస్త మందకొడిగా సాగుతుంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆఫ్రికా ఖండంలోని భూమిని చూడటం సాధ్యమవుతుంది.  సవన్నాల ద్వారా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. గబన్' కాంగో చిత్తడి నేలలు' దట్టమైన వర్షారణ్యం, కెన్యా  , సోమాలియా ఎడారుల గుండా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో ఏనుగులను చూడవచ్చు. గొరిల్లాస్, గేదెలు, చిరుతపులు తారసపడతాయి. ఈ ప్రయాణం  అట్లాంటిక్ మహా సముద్రం లోని సొరంగం ద్వారా సాగిన సుదీర్ఘ ప్రయాణం కంటే కూడా కాస్త ఎక్కువనే ఉంటుంది.  ఆ తర్వాత మరో టన్నెల్ లో ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సారి భారతీయ సొరంగా మార్గం గుండా ప్రయాణించాలి. ఆ తర్వాత మళ్ళీ  ఇండోనేషియాలో భూమి కనిపిస్తుంది. ఇక్కడ  భూమధ్యరేఖ చుట్టూ 17000 ద్వీపాలు చెల్లాచెదురుగా కనిపిస్తాయు. ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి వెళ్ళడానికి చిన్న చిన్న సొరంగాల గుండా ప్రయాణం చేయాలి. సొరంగం నుండి భూమిపైకి వచ్చిన ప్రతిసారీ గంభీరమైన దృశ్యాలు కనిపిస్తాయి. అగ్నిపర్వతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వరి పొలాలు, ఉష్ణమండల వర్షారణ్యాలు కనిపిస్తూ ప్రయాణాన్ని అద్భుతంగా మారుస్తాయి. ఈ లాంగ్ డ్రైవ్ లో బీచ్‌ లో ఎంజాయ్ చేయొచ్చు కూడా.  ఆ తర్వాత గ్రేట్ పసిఫిక్ సముద్రంలో నిర్మించిన సొరంగా మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది మూడు రెట్ల ప్రయాణం అనుకోవచ్చు. సుదీర్ఘంగా సాగే ఈ ప్రయాణం మొత్తం నీటి అడుగునే సాగుతుంది. ఆ తర్వాత ఉత్తేజపరిచేందుకు అన్నట్లుగా అద్భుతమైన గాలాపాగోస్ దీవులు దర్శనమిస్తాయి. ఇక్కడే జీవ పరిణామానికి చెందిన అనేక జంతు జీవజాలాలను, అసాధారణమైన జీవిత రూపాలను చూడవచ్చు. ఈ లాంగ్ డ్రైవ్ కన్నులపండుగ అనే  చెప్పవచ్చు. ఆ తర్వాత చివరకు చిన్న నీటి అడుగున సొరంగం మార్గం ద్వారా మీరు కొంచెం దూరం వెళ్లితే  ప్రయాణం ప్రారంభమైన ఈక్వెడార్‌లోనే  మీ లాంగ్ వరల్డ్ టూర్ ముగుస్తుంది.  గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా ఈ భూగోళం చుట్టూ ప్రయాణించడానికి 400 గంటల సమయం పడుతుంది. లేదా 17 రోజుల 17 గంటల సమయం అవుతుంది. ఇందులో దాదాపు 12 రోజులు సముద్రపు అడుగున సొరంగంలో ప్రయాణిస్తూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కొన్ని దృశ్యాలను ఆస్వాదిస్తూ ఉండిపోతారు.  ఈ మొత్తం ప్రయాణ ప్రశాంతంగా, ఆస్వాదిస్తూ  సాగాలంటే మీకు ఓ రెండు నెలల సమయాన్ని కేటాయిస్తే తప్ప సాధ్యం కాదు.  కానీ ఈ ఆలోచన చూడటానికి, వినటానికి బాగున్నా భూ గ్రహంపై అధిక వేడికి కారణం అవుతుంది. రహదారి నిర్మాణం కోసం భూమిపైన, సముద్రంలోపల పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. అది కాకుండా ఈ యాత్రలో మీరు కారు  సగటున సంవత్సరంలో విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ల కంటే కూడ దాదాపు రెండు రెట్లు ఎక్కువ విడుదల చేస్తుంది.  భూమధ్యరేఖ గుండా సాగే ఈ ప్రయాణం మనం ఎప్పటికీ చూడలేమేమో కానీ ఈ మార్గం గుండా ఎగిరే కార్లను నిర్మించడం సాధ్యమవుతుందేమో  చూడాలి.

ఒకవేళ మీరు 10 వేల సంవత్సరాలు ముందుకెళ్తే ఏం జరుగుతుంది?

భూమి ఏ రకంగా కనిపిస్తుంది? భూభాగం అంత అగ్నిపర్వతాలతో నిండిపోతుందా? లేక మంచులో గడ్డకట్టుకుపోతుందా? ఒకవేళ భవిష్యత్తులో మీరింకా ఒక మిలియన్ ముందుకెళ్తే ఏం జరుగుతుంది?సముద్రాలన్నీ ఆవిరైపోతాయా? లేక ప్రపంచం అంత నీటిలో మునిగి పోతుందా? అసలేం అవుతుంది?   సరే ఇపుడు మనం ఒక బిలియన్ సంవత్సరాల ముందుకెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. అపుడు మనుషులెవరైనా మిగిలి ఉంటారంటారా? వున్నా వాళ్ళు ఇంకే ఇతర గ్రహాల మీదో సెటిల్ అయి ఉంటారంటారా? ఏమైనా అవ్వచ్చు. ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత మీకు ఎదురుపడిన వ్యక్తులెవరైనా మీ ముందుకొచ్చి మాట్లాడటం అనేది బహుశ చాలా అరుదై ఉండొచ్చు.   ఒక బిలియన్ సంవత్సరాల వరకు మనం జీవించాలి అంటే ఎన్నో రకాల ఆటంకాలని ఎదురుకోవాల్సి ఉంటుంది, వాటన్నింటిని తట్టుకొని బతకాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఈ కరోనా మహమ్మారిలో మనం ఆల్రెడీ చాలా చూసాం. చాలా ఎదుర్కొని, బతకడానికి ఎంత కష్టపడాలి అనేది నేర్చుకున్నాం. అలాగే మనం భవిష్యత్తులో రాబోయే వాతావరణ మార్పులకి కారణంగా జరిగే విద్వాంసాలని, పెరిగిన జనాభా వాళ్ళ వచ్చే సమస్యలని, గ్లోబల్ న్యూక్లియర్ వార్ ని, ఆస్టరా యిడ్స్ ఇలా అనేక రకాల విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోగలమా?   సూర్యుడు రోజు రోజుకి వేడెక్కి పోతున్నాడు, మంచుకరిగిపోతుంది, సముద్రాల మట్టం పెరిగిపోతుంది  వీటన్నింటిని మనం భవిష్యత్తులో ఎలా తట్టుకోబోతున్నాం??   భవిష్యత్తులోకి ఒకసారి వెళ్ళి చూద్దాం... కేవలం పది వేల సంవత్సరాల ముందుకెళ్ళి చూద్దాం..... మనం  "deca- millennium bug" అనబడే ఒక పెద్ద సమస్యని ఎదుర్కోబోతున్నాం. 10 వేల సంవత్సరాల లో సాఫ్వేర్ నాలుగు దశాంశాలు మించి డెట్స్ ను చుపించదు.   Y2k గుర్తుందా?? హ.... ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్నంత భయం మాత్రం లేదనే చెప్పాలి అపుడు. 10 వేల సంవత్సరాలలో bright side ని చూస్కుంటే,మనుషులలో అపుడు జన్యు సంబంధిత మార్పులు -గుర్తులు బహుశ ప్రాంతీయ పరంగా ఉండకపోవచ్చు. మనిషి చర్మము -వెంట్రుకల కలర్ కూడ ప్రపంచమంత విస్తరించి ఉండొచ్చు. బహుశ అది మనందరినీ ఒక్కటిగా కలపడానికి సహాయ పడుతుంది.   20 వేల సంవత్సరాల తరవాత......? ఇపుడున్న భాషలేవి అపుడు వాడుకలో ఉండకపోవచ్చు. భవిష్యత్తులో మాట్లాడబోయే భాష బహుశ 1శాతం ఒక కోటి పదజాలం తో ఉండొచ్చు.   50 వేల సంవత్సరాల తర్వాత......? భూమి ఒక గడ్డకట్టుకు పోయిన పదార్థంలా మారోచ్చు, ఒక కొత్త మంచు సంవత్సరం అక్కడ ప్రారంభం అవుతుంది. నయగర జలపాతాలు క్షిణించి  ఏరిక్ సరస్సులోకి పూర్తిగా చొచ్చుకు పోయి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో భూమిపై పూర్తి రోజు కూడా పెరుగుతుంది. కార్యకలాపాలకు ఎక్కువ సమయం ఉంటుంది.   250,000 సంవత్సరాల తర్వాత..? ఇహి అగ్నిపర్వతం నీటి పైకి లేచి హవాలిలో కొత్త ద్వీపం ఏర్పడుతుంది.   500,000 సంవత్సరాల తర్వాత..? కిలోమీటర్ (0.62 మైళ్ళు) కంటే ఎక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఉంది. గ్రహం అంతటా మంటలను సృష్టిస్తుంది. గాలి పీల్చుకోవడానికి కూడా లేకుండా చేస్తుంది. అదీ సరిపోలేదా అయితే ముందు ఉందిగా..?   1, 000,000 సంవత్సరాల తర్వాత..? మరొక సూపర్ వోల్కానో విస్ఫోటనం సంభవిస్తుంది. 3,200 క్యూబిక్ కిలోమీటర్ల బూడిదను బయటకు పంపేంత పెద్దది. ఇది 70,000 సంవత్సరాల క్రితం మన మానవాళిని దాదాపుగా తుడిచిపెట్టిన టోబా విస్ఫోటనం మాదిరిగానే ఉంటుంది. ఈ సమయానికి సూపర్నోవాలో పేలిపోతుంది, ఇది పగటిపూట కూడా భూమి నుండి కనిపిస్తుంది.   2,000,000 సంవత్సరాల తర్వాత..? సౌర వ్యవస్థలో మానవాళి స్థావరాలు ఉంటాయి. వివిధ గ్రహాలపై జనాభా వేరుగా ఉంటే, మానవులు వారి నిర్దిష్ట ప్రపంచానికి అనుగుణంగా ఇతర జాతులుగా పరిణామం చెందుతారు.   10,000,000 సంవత్సరాల తర్వాత..? తూర్పు ఆఫ్రికాలో చాలా భాగం విచ్ఛిన్నమవుతుంది. కొత్తగా మహాసముద్ర బేసిన్ ఏర్పడుతుంది. 50 మిలియన్ సంవత్సరాలలో, ఆఫ్రికా యురేషియాతో ఢీకొంటుంది. మధ్యధరా సముద్రాన్ని మూసివేస్తుంది. రెండు భూభాగాల మధ్య కొత్త పర్వత శ్రేణి ఏర్పడుతుంది. ఈ పర్వత శ్రేణిలో ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తైన పర్వతం ఉండవచ్చు. అంతరిక్షంలో, మార్స్, దాని ఉపగ్రహంతో ఢీకొంటుంది. దీని ఫలితంగా సాటర్న్ వంటి శ్రేణి వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.   60,000,000 సంవత్సరాలు తర్వాత..? కెనడియన్ , అమెరికన్ రాకెట్లు పూర్తిగా క్షీణించాయి.   80 మిలియన్ సంవత్సరాల తర్వాత..? అన్ని హవాయి ద్వీపాలు నీటి కిందకు వెళ్లిపోతాయి.   100 మిలియన్ సంవత్సరాల తర్వాత..? 66 మిలియన్ సంవత్సరాల కిందట  డైనోసార్లను చంపిన మాదిరిగానే ఒక గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఉంది. అది 10 కి.మీ వెడల్పు ఉంటుంది.   250 మిలియన్ సంవత్సరాల తర్వాత..? భూమి  ఖండాలన్నీ పాంగేయా లాగా కలిసిపోతాయి. ఈ సమయంలో దీనిని పాంగేయా అల్టిమా అంటారు. కానీ 400-500 మిలియన్ సంవత్సరాలలో పాంగే అల్టిమా మళ్లీ వేరు అవుతుంది.   500-600 మిలియన్ సంవత్సరాల తర్వాత..? భూమి నుండి 6500 కాంతి సంవత్సరాలలో దూరంలో గామా కిరణం విస్ఫోటనం సంభవిస్తుంది. అది భూమిని తాకితే అది ఓజోన్ పొరను దెబ్బతీయడమే కాకుండా సామూహిక విలుప్తానికి కారణమవుతుంది.   600 మిలియన్ సంవత్సరాల తర్వాత..? చంద్రుడు భూమికి దూరంగా ఉంటాడు. మొత్తం సూర్యగ్రహణాలు ఇకపై సంభవించడం ఉండదు. సూర్యునిపై పెరుగుతున్న ప్రకాశం భూమిపై ఉష్ణోగ్రతను పెంచుతుంది, ఇది ప్లేట్ టెక్టోనిక్స్ కదలికను నిలిపివేస్తుంది.   800 మిలియన్ సంవత్సరాల తర్వాత..? కార్బన్ డయాక్సైడ్ స్థాయి గణనీయంగా పడిపోతుంది. కిరణజన్య సంయోగక్రియ ఇకపై సాధ్యం కాదు. ఆక్సిజన్ , ఆక్సోన్ వాతావరణం నుండి అదృశ్యమవుతాయి. సంక్లిష్టమైన జీవిజాతి చనిపోతుంది.   చివరకు, 1000 మిలియన్ సంవత్సరాల తర్వాత..? సూర్యుని ప్రకాశం 10శాతం పెరుగుతుంది. భూమిపై సగటు ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియాస్ అవుతుంది. మన వాతావరణం తడిగా ఉన్న గ్రీన్ హౌస్ లాగా ఉంటుంది. మహాసముద్రాలు ఆవిరైపోతాయి, ప్రతి ధ్రువాల వద్ద కేవలం నీటి చెలిమెలు మిగిలిపోతాయి. మీరు మీ టైమ్ మెషీన్లో ఇక్కడకు చేరుకుంటే, మీరు గుర్తుంచుకున్నట్లుగా కనిపించని గ్రహం ఉంటుంది. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. మానవ జాతి అంతరించి పోతుంది. ఆశాజనక, మంచి జీవితాన్ని మరికొన్ని దూర గ్రహం మీద గడుపుతోంది. తీవ్రమైన వేడి, నీరు లేకపోవడం ,  గాలి లేకపోవడం వల్ల భూమి నివాసయోగ్యంగా ఉండదు. కాబట్టి మీరు ఎక్కువసేపు ఉండలేదు. దానికి బదులుగా మీరు మిగిలిన సౌర వ్యవస్థను చూడటానికి బయలుదేరాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ, మీ తోటి మానవులను లేదా ఇతర రకాల తెలివైన జీవవులను కనుగొంటారు. కానీ అది మరొక కథ.