‘వంశధార’ను పూర్తి చేస్తాం!

శ్రీకాకుళం జిల్లా జీవనాడి వంశధార ప్రాజెక్టు రెండవ దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని, అలాగే ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువను ఆధునికీకరిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  వంశధార కార్యాలయ ఆవరణలో వంశధార ప్రాజెక్టు రూపశిల్పి దివంగత సిఆర్ఎం పట్నాయక్, అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్యల విగ్రహాలను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రులు మాట్లాడారు.  త్వరలోనే నాగావళి వంశధార నదుల అనుసంధానాన్ని కూడా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.  అలాగే  నేరడి బ్యారేజ్‌కి సంబంధించి ఒడిశాతో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఒడిశా ముఖ్యమంత్రిని కలిసేలా ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేకుండా నేరడి బ్యారేజ్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

బాసరలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!

నిర్మల్ జిల్లా బాసరలో నేటి నుంచి  దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. సరస్వతీ దేవి ఈ రోజు శైలపుత్రి అలంకారంలో బక్తులకు దర్శనమిస్తున్నారు.  అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాసరలో   శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు.  అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన, వసతి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయ్!

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజులలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వెల్లడించింది. ఇక  అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వరషాలు కురుస్తాయని పేర్కొంది.  కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది.   ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని.. అలాగే, పొలాల వద్ద ఉండే రైతులు, రైతు కూలీలు చెట్ల కింద ఉండొద్దని పిడుగులు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

విశాఖ స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఊరట!

ఇటీవల 4 వేల 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్లాంట్ యాజమాన్యం విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు పలు పార్టీలు, సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు.  ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది.  తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. దీంతో కార్మికులు తమ ఆందోళనను విరమించారు.  తొలగించిన కార్మికులకు వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానాన్ని వారం రోజుల్లోగా  పునరుద్ధరిస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలిపింది.  ప్లాంట్‌పై ఆధారపడి బతుకుతున్న తమను తీసివేయడంతో ఎంతో ఆందోళనకు గురయ్యాం.. దిక్కు తోచని పరిస్థితిల్లోనే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందని కాంట్రాక్ట్ ఉద్యోగులు పేర్కొన్నారు.

నేడు తిరుపతిలో పవన్ బహిరంగ సభ!

నేడు తిరుపతి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో  జరిగే ఈ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ వేదిక నుంచే జనసేనాని పవన్ కల్యాణ్  వారాహి డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ కల్యాణ్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ కావడం, అలాగే ఈ సభావేదికగానే ఆయన వారాహి డిక్లరేషన్‌ ప్రకటించనుండడంతో ఈ సభ  విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. వారాహి డిక్లరేషన్ ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ!

కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది.  రేపు ధ్వజారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈనెల 8న జరిగే శ్రీవారి గరుడసేవకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం, 11న ర‌థోత్సవం, 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 13 బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.  తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అందుబాగులో 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.

ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. అమ్మవారు ఈ రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నేటి నుంచి ఈనెల 12వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. 4 వేల 500 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది.

మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్‌కు ఈడీ  నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీ లాండరింగ్‌కు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది. అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. హెచ్ సీఏ అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగిన సమయంలో టికెట్ల విక్రయాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే హెచ్ సీఏ నిధుల వినియోగంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆ దర్యాప్తులో భాగంగానే అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.  అజహర్ పై దాదాపు 20కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు, తదితరాల సేకరణలో రూ. 20 కోట్లు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి సుప్రీంకోర్టు తప్పించింది. సంస్థ పనితీరును పరిశీలించేందుకు రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు.  

జాని మాస్టర్ కు ఊరట 

 కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ కు ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.  ఈ నెల ఆరు నుంచి 10 వతేదీ వరకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టపై అత్యాచారం చేసినట్లు జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నార్సింగ్ పోలీసులు జానిమాస్టర్ పై రేప్, బ్లాక్ మెయిల్ తదితర కేసులు  నమోదు చేసి  రిమాండ్ కోసం చెంచల్ గూడ జైలుకు పంపారు.  జానిమాస్టర్ కు ఇటీవల జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఈ అవార్డు తీసుకోవడానికి జానిమాస్టర్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అవార్డు తీసుకోవడానికి మాత్రమే బెయిల్ ఇవ్వనున్నట్టు కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. 

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ 10న

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన  వెలగపూడి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా ఉచిత గ్యాస్ సిలెండర్లు, అమరావతి, పోలవరం నిర్మాణాలపై కేబినెట్ భేటీలో కీలక చర్చ జరగనుంది. కాగా కేబినెట్ భేటీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం ఇచ్చారు. అలాగే కేబినెట్ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల8వ తేదీ  లోగా నిర్దేశిత నమూనాలో ప్రతిపాదనలను సాధారణ పరిపాలనా శాఖకు అందించాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.   ఇక ఈ కేబినెట్ భేటీలో  ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం,  ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకంతో పాటు పీ – 4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన చెత్తపన్ను రద్దును కేబినెట్ ఆమోదిస్తుంది.  జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుపైనా, డీఎస్సీ నోటిఫికేషన్ పైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

మంత్రి సురేఖ‌పై ముప్పేట దాడి.. కాంగ్రెస్‌కు మ‌రో త‌ల‌నొప్పి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ నేతల మధ్య అంతర్గత విబేధాల కార‌ణంగా పార్టీ శ్రేణులు ఇబ్బందులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల్లో పార్టీకి మంచి పేరు తీసుకొస్తున్నాయి అనుకునేలోగా   హైడ్రా విష‌యంలో  ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. భాగ్య‌న‌గ‌రంలో చెరువులు, నాలాల‌ను ఆక్ర‌మించి చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రారంభంలో సినీ న‌టుడు అక్కినేని నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత స‌మ‌యంలోనూ , మ‌రికొంద‌రి బ‌డాబాబుల అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేత స‌మ‌యంలో హైడ్రాపై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. రేవంత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని సర్వత్రా పొగడ్తలు వినవచ్చాయి. కానీ రోజుల వ్యవధిలో పరిస్థితి మారిపోయింది.  మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని పేద‌ల ఇండ్ల‌కూల్చివేత హైడ్రాపైనే కాకుండా రేవంత్ సర్కార్ పై కూడా  తీవ్ర వ్య‌తిరేకతకు కారణమైంది.  రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్ర‌జ‌లు హైడ్రా తీరును త‌ప్పుబ‌డుతున్నారు. దీంతో  విపక్షాలు బీఆర్ఎస్‌, బీజేపీలు హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్ సర్కార్ ను, కాంగ్రెస్ ను ఇరుకుపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. హైడ్రా విష‌యంపై రెండు రోజులుగా అధికార‌, విప‌క్ష‌  పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌రో స‌మ‌స్య‌ ఎదురైంది. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల‌తోపాటు సినీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేశాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందనరావు చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ నూలుపోగు దండను మంత్రి మెడలో వేశారు. దీనిపై కొందరు ట్రోల్స్ చేయడంతోపాటు అసభ్యకరంగా పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన వ్యక్తుల డీపీలో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఫోటో ఉండటంతో వాళ్లు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ అనుమానిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతోనే ఈ పోస్టులు చేశారని, దీని వెనుక కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ట్రోలింగ్స్‌పై హరీష్‌రావు స్పందిస్తూ.. కొండా సురేఖను ఉద్దేశించి చేసిన పోస్టులు సమర్థనీయం కాదన్నారు. అయితే, కేటీఆర్ వీటిపై స్పందిచకపోవడంతో ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ క్ర‌మంలో కొండా సురేఖ మాట్లాడుతూ.. కేటీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లకు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారని ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటుచేయడంతో పాటు.. కేటీఆర్ వారిని వేధించారనీ ఆరోపించారు. కొందరు హీరోయిన్లు కెరీర్ ను వదులుకుని వివాహం చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ వేధింపులే కారణం అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. దీనిపై ఎవరైనా హీరోయిన్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా అనే ప్రశ్నకు మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. వాళ్లెవరూ బయటకురారని, ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై విచారణ చేస్తుందన్నారు. ఇదే స‌మ‌యంలో సమంత, నాగచైతన్య విడాకులపై కూడా కొండా సురేఖ ఆరోపణలు చేశారు. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అన్నారు. ఈ విషయం అందిరికీ తెలుసు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి తెలుసంటూ సురేఖ‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌లు, టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు. మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై హీరో నాగార్జున‌, ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల‌తోపాటు స‌మంత కూడా స్పందించారు. వీరితోపాటు మ‌రికొంద‌రు టాలీవు్ సినీ ప్ర‌ముఖులు మంత్రి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. నాగార్జున ట్విట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు.  రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున పేర్కొన్నారు. నాగార్జున భార్య అమ‌ల కూడా ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాజకీయ స్వలాభం కోసం ఇంత భయంకరమైన ఆరోపణలు చేయడం, మామూలు ప్రజలను వేటగా మార్చుకోవడం కూడా షాకింగ్‌గా అనిపిస్తోంది. రాహుల్ గాంధీ గారు.. మీరు నిజంగా మానవత్వాన్ని నమ్మితే మీ నాయకులను ఆపండి. అలాగే మీ మినిస్టర్ చేసిన ఘోరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మా కుటుంబానికి క్షమాపణలు చెప్పేలా చేయండి. ఈ దేశ ప్రజలను కాపాడండి.. అంటూ రాహుల్ గాంధీకి కూడా అమ‌ల ఓపెన్‌గా రిక్వెస్ట్ పెట్టారు. మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై స‌మంత కూడా స్పందించారు. ఒక అమ్మాయిగా పుట్టడం, బయటికి వచ్చి పనిచేయాలని అనుకోవడం, అమ్మాయిలను ఆటబొమ్మల్లాగా కాకుండా మనుషులుగా ఎక్కువగా ట్రీట్ చేయని గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి ముందుకు సాగడం, ప్రేమలో పడడం, ప్రేమ నుండి బయటపడడం, అయినా నిలబడి పోరాడడం.. ఇవన్నీ అంత సులభం కాదు. దీనికోసం చాలా శక్తి, ధైర్యం కావాలి. ఈ ప్రయాణం నన్ను ఎలా మలిచింది అనే విషయంపై నేను గర్వపడుతూనే ఉంటాను మంత్రి గారు.. దయజేసి దానిని చిన్నచూపు చూడకండి. మినిస్టర్‌గా మీరు మాట్లాడే మాటలు జనాల్లోకి ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచించండి అంటూ కొండా సురేఖ పేరును ప్రస్తావిస్తూ స‌మంత లేఖ‌ విడుద‌ల చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లీగల్ నోటీసు పంపారు. అబద్దాలు, అసత్యాలతో దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు. సురేఖ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. మంత్రి హోదాలో ఉండి ఆమె ఇలా మాట్లాడ‌టం స‌రికాద‌ని పేర్కొంటున్నారు.   మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల‌నేకాక‌.. టాలీవుడ్ నూ కుదిపేస్తున్నాయి. ఇప్ప‌టికే హైడ్రా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పి తెచ్చిపెట్ట‌గా.. ప్ర‌స్తుతం కొండా సురేఖ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీకి కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెబుతారా? ఎదురుదాడికి దిగి వివాదం మ‌రింత తీవ్ర‌రూపం దాల్చ‌డానికి కార‌ణం అవుతారా అనే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే అది ఈ వివాదం సర్దుమ ణగడానికి సరిపోతుందని పరిశీలకులు భావించడం లేదు. 

అడ్డంగా దొరికిన స‌జ్జ‌ల‌.. క్రైస్త‌వ సంఘాలు ఆగ్ర‌హం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి క‌లిసింద‌ని ల్యాబ్‌ రిపోర్టులు రావ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వైసీపీ హ‌యాంలో త‌క్కువ ధ‌ర‌కు నెయ్యిని కొనుగోలు చేసి ల‌డ్డూ త‌యారీకి  వినియోగించారు. దీంతో తిరుమ‌ల ద‌ర్శ‌నం చేసుకున్న చాలా మంది భ‌క్తులు గ‌తంలో ల‌డ్డూ క్వాలిటీ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ల‌డ్డూ క్వాలిటీగా ఎందుకు లేద‌నే అంశంపై అధికారులు దృష్టిసారించారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. క్వాలిటీ త‌క్కువ నెయ్యి వాడుతున్నార‌ని తేల‌డంతో పాటు.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లుస్తున్న‌ట్లు ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై హిందువు సంఘాలు, హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ బ్యాచ్ మాత్రం త‌ప్పును ఒప్పుకొని దేవుడిని క్ష‌మాప‌ణ‌లు కోర‌కుండా.. ల్యాబ్ రిపోర్టులు అబ‌ద్ద‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్రం అనుమ‌తితో నిర్వ‌హిస్తున్న ల్యాబ్ రిపోర్టుల‌ను చంద్ర‌బాబు ఇంటిలో త‌యారు చేసిన రిపోర్టులు అంటూ జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ ప‌దేప‌దే ప్రెస్ మీట్లు పెట్టి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ఈ అంశం కాస్త కోర్టుకు చేరింది.  ల‌డ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. మంగ‌ళ‌వారం(అక్టోబర్1) దేశ అత్యన్నత న్యాయస్థానం విచార‌ణ జ‌రిపింది. అయితే, ఈ విచార‌ణ‌లో న్యాయస్థానం రాష్ట ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ఓ ప్రశ్న సంధించారు.  ఏ విధమైన ఆధారాలు లేకుండా, సిట్ రిపోర్ట్ రాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి ల‌డ్డూ క‌ల్తీ జ‌రిగింద‌ని ఎలా చెప్తారు..? అన్న‌దే ప్ర‌శ్న‌. దీన్నే ఆయుధంగా మార్చుకున్న‌ వైసీపీ డ్రామా షురూ చేసింది. అస‌లు కోర్టులో ఏం జ‌రిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే.. భక్తులకు, కోట్లాది హిందువులకు అబద్ధపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి సుప్రీం చివాట్లు పెట్టింద‌ని,  దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మొట్టికాయ‌లు వేసింద‌ని వైసీపీ ముఖ్య నేత‌లు తెగ హ‌డావుడి చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేయాలంటూ వైసీపీ నేత‌లు చెత్త డిమాండ్లు చేస్తున్నారు.  వాస్త‌వంగా.. సుప్రీం కోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పు పట్ట‌లేదు. కేవ‌లం ల‌డ్డూ క‌ల్తీ అయింద‌నే విష‌యంపై పూర్తి ఆధారాలు లేకుండానే ఎందుకు మాట్లాడార‌ని ప్ర‌శ్నించింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి మీడియా ముందుకు రాని సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. తాజాగా క‌ల్తీ ల‌డ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా స‌మావేశం లైవ్ అనుకుంటే పొర‌పాటే. రికార్డు చేసిన వీడియోను మీడియాకు విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలో స‌జ్జ‌ల అడ్డంగా దొరికిపోయారు.  మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌య‌ప‌డుతున్నారు. తిరుప‌తి ల‌డ్డూ విష‌యంపై మొన్న జ‌గ‌న్ ప్రెస్ మీట్ పెట్టిన స‌మ‌యంలోనూ విలేక‌రులు కెమెరాలు ప‌ట్టుకొని రావొద్దు.. ప్ర‌శ్న‌లు అడిగేందుకు రండి. మేమే మీకు రికార్డు చేసి వీడియోను పంపిస్తాం అంటూ వైసీపీ కార్యాల‌యం సూచించిన‌ట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తిరుమ‌ల ల‌డ్డూ వివాదంపై విలేక‌రుల స‌మావేశం పెట్టి మాట్లాడాడు. వాళ్ల సొంత గదిలో సొంత వీడియో రికార్డులో పెట్టుకున్నారు. ఇక్క‌డే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఆయ‌న వెనుకాల అల్మారాలో మూడు   శిలువలు ఉన్నాయి. ఈ శిలువ‌లు లైవ్ జ‌రుగుతుండ‌గానే గుట్టుచ‌ప్పుడు కాకుండా ప‌క్క‌కు తీశారు. అంటే.. స‌జ్జ‌ల మీడియా స‌మావేశం ప్రారంభంలో ఆయ‌న వెనుకాల అల్మారాలో శిలువ గుర్తులు ఉన్నాయి. కెమెరా స‌జ్జ‌ల‌ను జూమ్ తీసుకొని.. మ‌ళ్లీ య‌థాస్థితికి వ‌చ్చే స‌రికి వెనుకాల అల్మారాలో శిలువ గుర్తులు క‌నిపించ‌కుండా పోయాయి. ఎందుకు సజ్జ‌ల అనుచ‌రులు వాటిని తొల‌గించారంటే.. మాట్లాడేది తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం గురించి.. ఆయ‌న వెనుకాల శిలువ గుర్తులు ఉంటే ఎవ‌రైనా హిందువులు ఆయ‌న మాట‌ల‌ను విశ్వ‌సించ‌రు.అన్న భయంతోనే. దీంతో మీడియా స‌మావేశం స‌గం పూర్త‌యిన త‌రువాత ఆయ‌న  అనుచ‌రులు ఆ శిలువ గుర్తుల‌ను తొల‌గించారు. దీంతో ప‌లు క్రైస్త‌వ సంఘాల ప్ర‌తినిధులు స‌జ్జ‌ల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  వాస్త‌వానికి స‌జ్జ‌ల మీడియా స‌మావేశం మ‌ధ్య‌లో ఆయ‌న వెనుకాల ఉన్న శిలువ గుర్తుల‌ను తీయ‌మ‌ని ఎవ‌రూ అడ‌గ‌లేదు. కానీ, వాటిని తొల‌గించ‌డం ప‌ట్ల  క్రైస్త‌వులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ఇలాంటి ప‌నులు చేసిన స‌జ్జ‌ల, వైసీపీ నేత‌లు తిరుప‌తి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి క‌ల‌వ‌డానికి కార‌కులు కాలేద‌ని ఎలా అనుమానించ‌కుండా ఉండ‌గ‌ల‌మ‌ని  హిందువులు, స్వామివారి భ‌క్తులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి అంశం వైసీపీ శ్రేణుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే త‌రుణంలో వైసీపీ నేత‌లు అడ్డంగా దొరికిపోతున్నారు.

స్వచ్ఛ భారత్ కు పదేళ్లు

స్వచ్ఛ భారత్ అభియాన్.. దేశంలో ఈ కార్యక్రమం ప్రారంభమై నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యింది. పూజ్య బాపూజీ కలలు గన్న పరిశుభ్ర భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. మోడీ తొలి సారి ప్రధాని పదవి చేపట్టినది 2014లో. అదే ఏడాది అక్టోబర్ 2న మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. అప్పటి నుంచీ ప్రతి ఏటా అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలో పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  స్వయంగా చీపురు పట్టి పరిశరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఆరంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పరిశుభ్రత, స్వచ్ఛత కు సంబంధించి 96వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  ప్రజల చొరవే స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రజలంతా స్వచ్ఛ భారత్ లో పాల్గొని తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇలా ఉండగా దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో ప్రజలు, ప్రజా ప్రతినిథులు పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మచిలీపట్నంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కిందట స్వచ్ఛ భారత్ నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు. ఐదేళ్లలో అంటే 2029 నాటికి ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మారుస్తానమి చెప్పారు. రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.  

లడ్డూ కల్తీ.. సుప్రీం తీర్పుపైనే అందరి దృష్టీ!

లడ్డూ వివాదం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కొత్త రూపు సంతరించుకుంది. సీఎం ప్రకటనతో ప్రారంభమై అన్ని రాజకీయపార్టీ నాయకుల వ్యాఖ్యలు,ఆందోళనలతో రాజకీయ రంగుపులుముకుని వేడి పుట్టింది. ఒక దశలో సీఎం, మాజీ సీఎంల మధ్య రాజకీయపోరాటమా  అనిపించింది. ఆధారాలు లేకుండా రాజ్యాంగ పదవిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయడం శ్రీవారి కోట్లాది భక్తుల మనోభావాలకు భంగం కలిగిందని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, లడ్డూలో కల్తీ జరిగిందనటానికి ఆధారాలు మీ దగ్గర ఏమి ఉన్నాయి అని ప్రశ్నించడంతో అందరి దృష్టీ గురువారం (అక్టోబర్ 3) ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు  వెలువరించనున్న తీర్పుపైనే కేంద్రీకృతమైంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య స్వామి వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.  సుప్రీం తుది తీర్పు ఇవ్వకుండానే విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి.   కూటమి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే వైసీపీ ముందస్తు సంబరాలను న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. తొందరపాటు అని అభివర్ణిస్తున్నారు. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించిందనీ, గురువారం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనను వివరించాల్సి ఉందనీ అంటున్నారు. కాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ హుందాగా వ్యవహరించిందని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీం కోర్టు సిట్ విచారణను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు. సీఎం ప్రకటనపైనే వ్యాఖ్యానించింది.  అయినా తెలుగుదేశం ప్రభుత్వం సిట్ విచారణ నిలుపుదల చేయాలని నిర్ణయించింది.   వైసీపీ హయాంలో తిరుమలలో అనేక అవకతవకలు జరిగిన నేపధ్యంలో అక్కడి సిబ్బంది,భక్తుల నుంచి లడ్డూ  నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులు, కనీసంరూ.800 ఉన్న ఆవునెయ్యి కిలో 320రూపాయలకు సరఫరా చేయడంతో కల్తీ జరిగిందనేది అనుమానాలు పొడసూపాయి. రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదాన్ని కోర్టు ఏలా పరిష్కరిస్తుందనేది వేచిచూడాలి.  

జగన్ చౌకబారు.. పవన్ హుందాయే వేరు!

తిరుమల లడ్డూ వివాదంలో  వైసీపీ అధినేత జగన్ ఎంత చౌకబారుగా వ్యవహరించారో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంత హుందాగా వ్యవహరించారు. లడ్డూ వివాదాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి జగన్ తాపత్రేయపడ్డారు. అందు కోసం చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. తిరుమల పర్యటనకు రెడీ అయ్యారు. లడ్డూ వివాదం నేపథ్యంలో తన పర్యటనను తెలుగుదేశం, జనసేన శ్రేణులు అడ్డుకుంటాయనీ తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనీ జగన్ భావించారు. అయితే జగన్ పర్యటనను అడ్డుకోబోమని జనసేనాని ప్రకటించడం, ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేయడం, భద్రత కల్పించడంతో జగన్ వ్యూహం విఫలమైంది. అదే సమయంలో డిక్లరేషన్ వివాదం ఆయన మెడకు చుట్టుకుంది.  అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను స్వయంగా తనంత తాను తిరుమల  పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వం తనను అడ్డుకుందంటూ ఎదురుదాడికి ప్రయత్నించారు.   మరో వైపు  ఇదే లడ్డూ ప్రసాదం విషయంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ ఆ దీక్ష విరమణకు తిరుమల వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రాయశ్చిత దీక్ష విరమించారు. అయితే ఆయన రెండో కుమార్తె అంజనా పననోవా హిందువు కాదు. కనుక ఆమె తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎ టువంటి చర్చ, వివాదానికి తావు లేకుండా ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. ఆమె  మైనర్ కనుక ఆమె డిక్లరేషన్ ఫారంపై పవన్ కూడా సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ  సోషల్ మీడియాలో షేర్ చేసింది.   లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత.. డిక్లరేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం విదితమే. పవన్ కల్యాణ్ చాలా హుందాగా ఆ చర్చకు తన చర్య ద్వారా సమాధానం ఇచ్చారు. 

ప్రకాశ్ రాజ్ వదలడం లేదుగా?!

తిరుమల లడ్డూ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్ టార్గెట్ గా ట్వీట్లు కురిపిస్తూనే ఉన్నారు. ఈ వివాదం జాతీయ సమస్యగా పరిణమించడమే కాకుండా సుప్రీం వద్దకు కూడా వెళ్లింది. లడ్డూ వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతోంది.  ఈ విషయంలో దోషులెవరు, వారిని ఎలా శిక్షిస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఇంకో పక్క   ప్రకాష్‌రాజ్‌  ఈ విషయంలో పవన్ కల్యాణ్ టార్గెట్ గా వరుస ట్వీట్లు పెడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సామాజిక మాధ్యంలో ఆయన పవన్ కల్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేరుగా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనకే  ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.   ప్రకాష్‌రాజ్‌ మొదట పెట్టిన ట్వీట్‌పై పవన్‌కళ్యాణ్‌ తీవ్రంగా స్పందించడంతో తన రెండో ట్వీట్‌లో నేను చెప్పింది ఏమిటి, మీరు అర్థం చేసుకున్నదేమిటి.. అంటూనే తాను విదేశాల్లో ఉన్నాననీ, వచ్చిన తర్వాత అన్నింటికీ సమాధానం చెప్తానని అన్నారు. ఇది జరిగిన రెండు రోజులకే కార్తీ వ్యాఖ్యల విషయంలో పవన్‌కళ్యాణ్‌ సీరియస్‌ కావడం, దాంతో కార్తీ.. పవన్‌కి సారీ చెప్పడంపై స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించారు.. హ్యాపీనా అంటూ ట్వీటారు.  తాజాగా మరో వివాదాస్పదమైన ట్వీట్‌తో మరో సారి పవన్ ను నిలదీశారు ప్రకాష్‌రాజ్‌.  కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా?  ఇక చాలు. ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇటీవల పవన్‌కళ్యాణ్‌ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టార్గెట్‌ చేస్తూ దీక్షలు మానేసి ప్రజలకు చెయ్యాల్సిన పనులు చూడండి అని అర్థం వచ్చే పెట్టిన ట్వీట్‌ వైరల్ అయ్యింది. నెటిజనులు ప్రకాశ్ రాజ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అనవసర వివాదాలను రేపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.