తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలతో పాటు వారంతం కూడా కావడంతో రానున్న రోజులలో భక్తులు తిరుమలకు పోటెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం ( అక్టోబర్ 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో క్యూ కాంప్లెక్స్ దాటి భక్తుల క్యైలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 54 వేల 866 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 657 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60 లక్షల రూపాయలు వచ్చింది. 

ఎన్‌కౌంటర్... 40 మంది మావోయిస్టులు మృతి!

చత్తీస్‌గఢ్‌ అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్‌, దంతెవాడ సరిహద్దు నెందూర్‌, తులతులి అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసు బలగాలకు ఇంటెలిజెన్స్‌ సమాచారం అందిన నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మొత్తం 12 వందల మంది పోలీసు బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సహజంగానే పోలీసులను చూసి మావోయిస్టులు కాల్పులు జరపడం, పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపడం.. ఆ కాల్పుల్లో మావోయిస్టులు మాత్రమే మరణించడం.. ఇలాంటి కథనాలు చాలాసార్లు చదివే వుంటారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది.    తమ పార్టీ 20 ఏళ్ల వార్షికోత్సవాలను సెప్టెంబరు 21 నుంచి నెల రోజుల పాటు మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో 20 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవరోధాలను చర్చించాలన్నది మావోయిస్టుల అజెండా. ఈ సమావేశాల నేపథ్యంలోనే ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

దర్యాప్తు చకచక.. వైసీపీ నేతలు గజగజ!

తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ క‌ల్తీ వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌చందంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీయుల గొంతులో క‌ల్తీల‌డ్డూ ప‌డి వారి పరిస్థితి కక్కాలేక మింగా లేక అన్నట్లుగా తయారైంది. ఒక‌ప‌క్క కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ,  వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. స్వతంత్ర సిట్ ఎర్పాటు కాగానే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు చకచక సాగుతుందన్న భయంతో వైసీపీయులు గజగజ వణికిపోతున్నారు. కోర్టు తీర్పు త‌రువాత మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా స‌మావేశం చూసిన ఎవరికైనా ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది.    సుప్రీంకోర్టు తీర్పుకే వక్రభాష్యాలు చెప్పుకుని అసలు లడ్డూలో కల్తీనే జరగలేదని జ‌గ‌న్‌ తేల్చేశారు. ఇక ప్రత్యేక సిట్ కూడా అవసరం లేదనేశారు. . సుప్రీం కోర్టు సిట్ కూడా అవసరం లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు.  దీంతో వైసీపీ వర్గాల్లోనే విస్మయం, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తిరుప‌తిలో అనేక అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. అందులో తిరుప‌తి ల‌డ్డూ వివాదం ఒక‌టి. అయితే, తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం చాలా చిన్న‌ద‌ని.. అంత‌కంటే పెద్దెత్తున అవినీతికి వైసీపీ నేత‌లు పాల్ప‌డ్డార‌ని వారాహి స‌భ‌లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ల‌డ్డూ క‌ల్తీ విష‌యంలో అడ్డంగా దొర‌క‌డంతో పాటు,  కొండ‌పై ఐదేళ్లు సాగించిన  అవినీతి అక్ర‌మాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లను వెంటాడుతోంది.  వైసీపీ నేత‌,  టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, పొన్నంవోలు సుధాక‌ర్ రెడ్డి, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి త‌దిత‌రులు తిరుప‌తిలో క‌ల్తీ ల‌డ్డు వివాదం విష‌యంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేశారు,  భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకున్నారు,  రాష్ర ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ కాకుండా,  సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచార‌ణ జ‌ర‌గాలి, సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓ క‌మిటి విచార‌ణ చేయాల‌ని కోర్టును కోరారు. మొద‌టి రోజు విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకొని వైసీపీ నేత‌లు వీరంగం చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయింది. ఆధారం లేకుండా చంద్ర‌బాబు ల‌డ్డూ విష‌యంపై ఎలా మాట్లాడాడ‌ని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింద‌ని, చంద్ర‌బాబు దొరికిపోయారు,  శ్రీ‌వారి భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. మేము స‌త్యహ‌రిశ్చంద్రులం అన్న‌ట్లుగా త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వ్య‌తిరేకించ‌లేక, పూర్తి స్థాయిలో కోర్టు తీర్పును స్వాగ‌తించ‌లేక వైసీపీ నేత‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. అంబ‌టి రాంబాబు వంటి నేత‌లు   సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం.. కానీ, విచార‌ణ బృందంలో చంద్ర‌బాబు నాయుడు మ‌నుషులు ఉండొద్ద‌ని అంటున్నారు. అంటే, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రు విచార‌ణ బృందంలో ఉన్నా వారు చంద్ర‌బాబు మ‌నుషులే అని ముద్ర‌వేయ‌డంతో పాటు,  కేంద్రం తరఫునుంచి అంటే సీబీఐ నుంచి నుంచి విచార‌ణ బృందంలో ఉన్న‌వారిని కూడా చంద్ర‌బాబు మేనేజ్ చేస్తారు అనే త‌ప్పుడు వాద‌న‌ను ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా వైసీపీ నేత‌ల వ్యూహం ఉందన్న విషయం అంబటి మాటలతో తేటతెల్లమైపోయింది. తిరుమల శ్రీవారి లడ్డూ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పును ఓసారి ప‌రిశీలిస్తే.  ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలి. ఇందులో  సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలి.  సరే కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా కోర్టు ఎదుట కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయితే, తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విచార‌ణ‌పై మరింత విశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదు అని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిష‌న్ దారుడు కోరిన‌ట్లు కమిటీని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించడానికి ధర్మాసనం విముఖత చూపింది. అయితే, వైసీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అయితే, వైసీపీ నేత‌లు మాత్రం ఈ వ్యాఖ్య‌ల‌న్నీ చంద్ర‌బాబును ఉద్దేశించిన‌వి అంటూ సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చంద్ర‌బాబుకు చివాట్లు పెట్టింద‌ని పోస్టులు పెడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ప్ర‌య‌త్నిస్తున్నారు.  తిరుప‌తి ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌నేది వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు వైసీపీ నేత‌ల‌కు కూడా తెలుసు. కానీ, త‌ప్పును ఒప్పుకోకుండా..  తాము త‌ప్పు చేయ‌లేదు, చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల శ్రీ‌వారిని కూడా రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నారు,  భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. సిట్ విచార‌ణ చేసినా.. స్వ‌తంత్ర ద‌ర్యాప్తు బృందం ద్వారా విచార‌ణ చేయించినా త‌ప్పు చేశాం కాబ‌ట్టి త‌మ‌కు వ్య‌తిరేకంగానే ఫ‌లితం వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ముందే ఫిక్స్ అయిపోయారనీ, అందుకే ఈ ఎదురుదాడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు‌. విచార‌ణ‌లో క‌ల్తీ నెయ్యి వాడార‌ని తేలినా.. ఆ విచార‌ణ అంతా త‌ప్పుడు విచార‌ణ అని, చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే విచార‌ణ జ‌రిగింద‌ని చెప్పుకోవడానికి వీలుగా  వైసీపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ప‌దేప‌దే సోష‌ల్ మీడియా, త‌మ‌కు అనుకూల మీడియా ద్వారా మేము త‌ప్పుచేయ‌లేదు.. చంద్రబాబు ప్రోద్బ‌లంతోనే విచార‌ణ బృందం త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చిందంటూ ప్ర‌చారం చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందే ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ నేత‌లు ఇప్పటి నుంచే మొదలెట్టేశారని అంటున్నారు.  మొత్తానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నా.. విచార‌ణ‌లో తిరుమల లడ్డూ ప్రసాదంలో క‌ల్తీ నెయ్యి క‌లిసింద‌ని తేలినా.. విచార‌ణ రిపోర్టు మొత్తం చంద్ర‌బాబు మాయ అంటూ ఎదురుదాడికి జగన్  ఇప్పటి నుంచే సిద్ధ‌మ‌వుతుండ‌టం ఆయనలోని భయాన్ని, తప్పు చేశామన్న అంగీకారాన్ని తెలియచెప్పుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి

సినీనటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. గాయత్రి శుక్రవారం నాడు కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె మరణంతో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధివిలాసం ఏమిటంటే, దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు దేశమంతటా అమ్మవారికి ‘గాయత్రి’ అలంకారం చేశారు. ఆరోజే రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి కన్నుమూశారు.

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్...7 గురు నక్సలైట్లు దుర్మరణం 

చత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా నక్సలైట్లు కాల్పులు జరిపారు. పోలీసులు  ప్రతి కాల్పులు జరిపితే ఏడుగురు నక్సలైట్లు చనిపోయారు.   చత్తీస్గడ్లో గత జనవరి నుంచి ఇప్పటివరకు 200 మంది నక్సలైట్లు చనిపోయారు. నారాయణపూర్  దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. చత్తీస్ గడ్ లో మావోయిస్టుల రిక్రూట్ మెంట్ తగ్గింది. ఎన్ కౌంటర్ల ద్వారా నక్సలైట్లను మట్టు పెడితే రిక్రూట్ మెంట్ తగ్గిపోతుందని పరిశీలకులు అంటున్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 

కష్టపడినప్పటికీ సంపన్నులు ఎందుకు కాలేకపోతున్నారు? 

జబ్జార్ భాయ్ బ్యాంకు ఉద్యోగిగా రిటైరయ్యారు. పెన్షన్ తప్పితే మరో ఆదాయ మార్గం లేకపోవడంతో నిరాశ, నిస్పృహ ఆవహించింది. నెలకు లక్ష రూపాయల జీతం రాకపోవడమే ఆయన నిస్పృహకు కారణమైంది.  ఒక రోజు మౌలానా తారసపడ్డాడు.  మౌలానా:  జబ్జార్ భాయ్ మునుపటి మాదిరిగా ఉత్సాహంగా లేకపోవడాన్ని మౌలానా పసిగట్టాడు. ఏమయ్యింది , జబ్బార్ భాయ్ అలా ఉన్నావు అని అడిగాడు.   జబ్బార్ భాయ్: సలాం వాలేకుం మౌలానాసాబ్. నేను 40 ఏళ్లు ఉద్యోగం చేసి రెండు ఇళ్లు , పిల్లల పెళ్లిళ్లు చేశాను. ఇటీవల రిటైరయ్యాను. పిల్లలకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. సంపాదించే నేను రిటైరయ్యాను. పెన్షన్ తప్పితే మరో మార్గం లేదు. మనవడు, మనవరాళ్లను ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించాలంటే డబ్బు లేదు మౌలానా సాబ్  మౌలానా: నేను ఇస్లాం అమలుకు సంబంధించి వేలాది తక్రీర్ ( ప్రవచనం)లు  ఇచ్చాను. వాటిని అమలు చేసే వారు కరువయ్యారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం నేను ఇచ్చిన తక్రీర్ లను మనుషులు అమలు చేసే వారు. ఇప్పుడలా లేదు. డబ్బు ఎక్కువైతే  చాలామంది బుర్ర చెడిపోతుంది. డబ్బున్నవాడు పేదవాడిని అవమానపరుస్తాడు. అహంకారం ఎక్కువైతే మనుషులను వేధించడం ప్రారంభిస్తారు. బేవకూఫ్ హై, పాగల్ హై అని నానా బూతులు తిడుతుంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా పేదవాడు తరతరాలుగా అవమానానికి గురవుతున్నాడు. సమాజంలో ట్రెండ్ నడుస్తుంది. ఖురాన్ మీద విశ్వాసం లేకపోవడమే మనిషి నిరాశకు ప్రధాన కారణం. లాయ్ లా ఇల్లాల్లా మహమ్మదుర్ రసూలుల్లా అని అరబ్బీలో మహమ్మద్ ప్రవక్త ప్రవచించారు. అల్లా తప్పితే మరో దేవుడు సృష్టిలో లేడని ప్రవక్త సందేశం ఇచ్చారు. అల్లా మీద నమ్మకం లేనివారు ఇలా డిప్రెస్ అవుతారు. సంపద పెరిగితే తృప్తి  పడరు. ఇం కా కావాలి కావాలి అంటారు.  నబీ ఎప్పుడు తప్పుడు ప్రవచనం  ఇవ్వడు కదా. మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం.  ఎండాకాలంలో మా చిన్నప్పుడు చేతి విసనకర్రతో ఉక్కపోతతో ఉపశమనం పొందే వాళ్లం. పవర్ జనరేట్ అయ్యాక ఇళ్లలోకి కరెంట్ సప్లయ్ అయ్యింది. అప్పుడు ఫ్యాన్లతో సరిపెట్టుకున్నాం. జనాల దగ్గర డబ్బు ఎక్కువైతే విలాసవస్తువులపై మనసు పడుతుంది. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఎయిర్ కూలర్ల స్థానే ఎయిర్ కండిషన్ల ను కొనుగోలు చేస్తున్నారు. మన చెప్పులను స్థూల కాయులు ఒకసారి వేసుకుంటే ఆ చెప్పులు మళ్లీ మనకు వదులవుతాయి. మన తలకు సరిపడే హెల్మెట్ ను పెద్ద తల కాయ ఉన్న వ్యక్తి పెట్టుకుంటే ఆ హెల్మెట్ కూడా వదులవుతుంది. మనిషి కోర్కెలు పెరిగితే అవి తీరవు . అప్పుడు మనిషి డిప్రెషన్  కు లోనవుతాడు. డబ్బున్న వ్యక్తులను చూసి మనకూ లేదని  మనలో విద్వేషం పెరుగుతుంది. నాకు అంత డబ్బు లేదు అని బాధపడొద్దు. కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులకు అరుగుదల తగ్గిపోతుంది. అరుగుదల ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ధనికుడి కంటే పేదవాడు కంటినిండా నిద్రపోతాడు. డబ్బులెక్కువైన వ్యక్తి నిద్రమాత్రలు వేసుకుంటేనే కంటినిండా నిద్రపోతాడు.40 ఏళ్లు కష్టపడ్డా క్యారెక్టర్ లోపిస్తే అన్నీ పోయినట్టే. క్యారెక్టర్ పెంచుకునే యత్నం చేయాలి. అందం పోయినా పర్వాలేదు  కాని మన వ్యక్తిత్వం పోకుండా జాగ్రత్తపడాలి. పైసా హాత్ కా మైలా హై. ఇల్మ్ నహీతో సబ్ కుచ్  చీన్ లేగా అల్లా                                                                                                -బదనపల్లి శ్రీనివాసాచారి  

తిరుమలకు చంద్రబాబు దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వెళ్ళారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మాఢవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి పద్మావతి అతిథిగృహంలో బసచేస్తారు. శనివారం ఉదయం 7.35 గంటలకు పాంచజన్యం వెనుక నిర్మించిన వకుళమాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారు.

పడవ మునిగి 78 మంది మృతి

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా పట్టణం నుంచి గోమా పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్‌ లోడ్‌ కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. కివూ సరస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. కాంగో ప్రభుత్వ బలగాలకు, ఎం23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది.

యూట్యూబ్‌లో ఇక 3 మినిట్స్ షార్ట్స్!

యూట్యూబ్ లవర్స్.కి గుడ్ న్యూస్. యూట్యూబ్ తన షార్ట్స్.లో కీలకమైన అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇకపై కంటెంట్ క్రియేటర్లు మూడు నిమిషాల నిడివి వున్న వీడియోలను అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటును తీసుకొస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పు రానుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్‌తో యూజర్లకు మరింత చేరువ కావడానికి  వెసులుబాటు కలగనుంది. యూట్యూబ్ షార్ట్స్.ని తీసుకొచ్చిన కొత్తలో కేవలం 60 సెకండ్ల లోపు వీడియోల మాత్రమే దృష్టిని కేంద్రీకరించింది. ఒక విధంగా చెప్పాలంటే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాంటి ఇతర ప్లాట్‌ఫామ్లకు పోటీని ఇవ్వడంలో ఇది యూట్యూబ్‌కి సహాయపడింది. ఈ క్రమంటో కంటెంట్ క్రియేటర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని షార్ట్స్ నిడివిని మూడు నిమిషాలకు పెంచాలని యూట్యూబ్ నిర్ణయించింది. మూడు నిమిషాల నిడివి కలిగిన షార్ట్స్.ని యూజర్లు పొందేలా తన రికమండేషన్స్.లో మార్పులు చేయనుంది. దీంతోపాటు కంటెంట్ క్రియేషన్‌కి సంబంధించిన మరికొన్ని కొత్త ఫీచర్లను యూట్యూబ్ ప్రకటించింది. కొత్తగా టెంప్లేట్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్ వీడియోలను ‘రీమిక్స్ బటన్’ ద్వారా కొత్త వీడియోగా రీ క్రియేట్ చేయొచ్చున. ట్రెండింగ్, పాపులర్ వీడియోలకు పర్సనల్ టచ్ ఇవ్వడంలో కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీజర్ ఉపయోగపడనుంది. అలాగే యూట్యూబ్‌ కంటెంట్‌ని షార్ట్స్.గా మలిచేందుకు రాబోయే కొన్ని నెలల్లో కొత్త ఫీచర్ని యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.

బ్రహ్మోత్సవాల ధ్వజారోహణకు ఇబ్బందేమీ లేదు!

శుక్రవారం సాయంత్రం తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణం జరగనుంది.ధ్వజస్తంభంపై గరుడ పఠాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ఈ ధ్వజారోహణ ఘట్టంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఘట్టానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తుండగా గరుడ పఠాన్ని ఎగురవేయాల్సిన ఇనుప కొక్కి విరిగిపోయినట్లుగా అర్చకులు గుర్తించారు. దీంతో ఆందోళన చెందిన అర్చకులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఈ చిన్న సంఘటన విషయంలో కొన్ని మీడియా సంస్థలు రాద్ధాంతం చేశాయి. ధ్వజారోహణే ఆగిపోతోందన్నట్టుగా కథనాలు వండి వడ్డించాయి. అయితే అలాంటి ప్రమాదమేమీ లేదని, ధ్వజారోహణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని తెలుస్తోంది.

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా రెండో రోజు అయిన శుక్రవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హరినాథ్‌, జస్టిస్‌ దుర్గాప్రసాద్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), సీపీ రాజశేఖర్‌బాబు తదితరులు ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

‘స్టీల్’ ప్రైవేటీకరణ జరగదు!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పునరుద్ఘాటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్   ఆరోపణలపై స్పందించిన ఆయన  ఎన్డీఏ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తోందన్న ఆరోపణలు నిరాధారం, సత్యదూరమని, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారన్న విషయం తన దృష్టికి వచ్చిన 48 గంటల్లోనే తిరిగి వారిని నియమించామని చెప్పారు. సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను 29న మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని పేర్కొన్నారు.   

ఫర్నిచర్ తీసుకెళ్ళండి.. వైసీపీ లేఖ!

మాజీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్‌ ఆఫీస్‌లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని సాధారణ పరిపాలన శాఖకు వైసీపీ   లేఖ రాసింది. వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి రాసిన లేఖలో ఫర్నిచర్ లో కొన్నింటిని తమ దగ్గరే ఉంచుకునేందుకు అనుమతించాలని, వాటికి విలువ  చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని, మిగిలిన వాటిని తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇప్పటికే నాలుగు లేఖలు రాసినా జీఏడీ నుంచి స్పందన లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.   అసలు ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఫర్నీచర్‌ను తీసుకుపోవడం వీలు కాకపోతే, ఎక్కడికి పంపాలో జీఏడీ చెప్పాలని అప్పిరెడ్డి కోరారు. ఈ ఫర్నీచర్‌ వల్ల తమ ఆఫీస్‌లో స్థలాభావం నెలకొందని,  అందువల్ల ఏ విషయమూ వెంటనే చెప్పాలని లేళ్ల అప్పిరెడ్డి  ఆ లేఖలో కోరారు.