ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం!?

కేసీఆర్ నాయకత్వంలోని బారత రాష్ట్ర సమితి ఎన్సీపీలో విలీనం కాబోతోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. నిజంగా నిజం. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శాఖ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో విలీనం కాబోతోంది.  గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందన్న మాట ఆ పార్టీ అధినాయకత్వమే మరిచిపోయింది. టీఆర్ఎస్ నుంచి పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న ఆ పార్టీ అధినేత ఆశలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆవిరైపోయాయి. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ కన్న కలలు అంతకు ముందే గల్లంతయ్యాయి. దీంతో ఆ పార్టీ జాతీయ రాజకీయాల వైపు చూడటమే మానేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్   ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో పార్టీ కార్యకలాపాలను ఆర్భాటంగా ప్రకటించి ఆయా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేపట్టేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో ఆయా రాష్ట్రాలలో పార్టీ శాఖల విస్తరణకు మంగళం పాడేశారు. అంతే కాకుండా ఓటమి అవమాన భారంతో కేసీఆర్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలు, క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడంలేదు. దీంతో  ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఏపీలో ఆ పార్టీ అనవాలు కూడా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ ఎన్సీపీలో విలీనం కావడానికి రెడీ అయిపోయింది. త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు మంగళవారం (అక్టోబర్ 1) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో  బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలందరూ ఉణ్నారు. దీంతో బీఆర్ఎస్ ఎన్సీపీలో విలీనం కావడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో  శషబిషలకేం తావు లేదనీ, తాము ఎన్సీపీలో విలీనం కానున్నామని బీఆర్ఎస్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు కుండబద్దలు కొట్టేశారు. ఈ నెల 6న పూణెలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో తామంతా ఎన్సీపీ తీర్థం పుచుకుంటామని చెప్పారు.  

మూసీ కూల్చివేతలు షురూ

మూసీ   ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలయ్యాయి.  మూసీ పరివాహక ప్రాంతంలోని శంకర్ నగర్ లో అధికారులు మంగళవారం(అక్టోబర్ 1) ఉదయం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు స్వచ్ఛందంగా తమ నివాసాలను ఖాళీ చేసిన వారివే కావడం గమనార్హం. ఈ ప్రాంతంలోకి బుల్ డోజర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కూల్చివేతలను కూలీల ద్వారా చేయిస్తున్నారు అధికారులు.  ఈ నివాసాల నిర్వాసితులను ఇప్పటికే చంచల్ గూడ  డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి తరలించారు.  మరికొంతమంది నిర్వాసితులను తరలించేందుకు, ఇళ్లల్లోని సామగ్రి తీసుకెళ్లేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు.  మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో దాదాపు 55 కిలోమీటర్ల  పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించి వాటికి మార్కింగ్ వేసిన సంగతి తెలిసిందే.  చాదర్‌అలా మార్కింగ్ చేసిన ఇళ్లలో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి నివాసాల కూల్చివేత ఇప్పుడు ప్రారంభమైంది.  

లడ్డూ ‘సిట్’ దర్యాప్తు వేగవంతం!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు వేగం పెంచింది.  గత మూడు రోజులుగా తిరుమలలో బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు  తిరుమల తిరుపతి దేవస్థానం  పిండిమరతో పాటు ల్యాబ్‌లో   తనిఖీలు నిర్వహించారు. అలాగే తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించారు. గోడౌన్‌లలో నిల్వఉంచిన ముడిసరుకుల నాణ్యతను పరిశీలించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఎలా భద్రపరుస్తారు., వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయిన్‌టేన్ చేస్తారు.. అనే అంశాలపై ఆరా తీశారు.  ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను తిరుమలలో పరీక్షించేందుకు మెషీన్లు ఉన్నాయా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారన్న వివరాలూ తెలుసుకున్నారు.  

ఏపీలో నూతన మద్యం విధానం!

ఆంధ్రప్రదేశ్ లో  నూతన మద్యంపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.    వైఎస్‌ జగన్‌ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలికింది.    దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని  ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.   రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.   కొత్త మద్యం షాపులకు  మంగళవారం (అక్టోబర్ 1) నుంచి అక్టోబర్  9వ  వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11వ తేదీన  3,396 షాపులకు లాటరీ తీస్తారు.   దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ విడతలో 3,396 షాపులను ప్రైవేటుకు కేటాయించారు.

రేట్లు పెంచకుండా ప్రత్యేక బస్సులు!

దసరా సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.  ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా    ఈ నెల 4 నుండి 20 వరకు మొత్తం 6,100 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  ప్రయాణికులపై భారం మోపకుండా   సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశ పెట్టిన  యూటీఎస్ మెషీన్లతో చిల్లర సమస్య కూడా తలెత్తదు. ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ ,  క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. ముందస్తుగా సీటు వివరాలు చెక్ చేసుకుని బస్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉందని ఆర్టీసీ పేర్కొంది. 

మంగళగిరి నుంచి స్కిల్ సెన్సెస్

ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే  చేసిన తొలి  ఐదు సంతకాలలో స్కిల్ సెన్సెస్ ఒకటి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే  చంద్రబాబు తన మొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్‍ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. ఈ నాలుగు హామీలూ అమలు అవుతున్నాయి. ఆయన  ఐదో సంత‌కం స్కిల్ సెన్సెస్ పై చేశారు. స్కిల్ సెన్సెస్ అన్నది అత్యంత కీలకమైనది. భవిష్యత్ లో ఇది దేశానికే ఆదర్శంగా మారుతుందని విద్యావంతులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఇది అత్యంత కీలకంగా మారుతుందనడంలో సందేహం లేదు.  అటువంటి కీలక స్కిల్ సెన్సెస్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆరంభం కానుంది.  ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా ప్ర‌పంచంలోని ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన ప్ర‌ముఖ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశాలు ఉండ‌టంతో పాటు.. ఇక్కడ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది. స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికి వెళ్లి స‌ర్వే చేస్తారు. ఆధార్ కార్డు ద్వారా ఇంట్లో ఎంత మంది చ‌దువుకున్న యువ‌త ఉన్నారు. వారు ఎంత‌వ‌ర‌కు చ‌దువుకున్నారు. ప్ర‌స్తుతం వారు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్న‌ట్ల‌యితే ఏ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. వారు ఏఏ కంపెనీలు, ఏఏ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నారు అనే వివ‌రాల‌ను సేక‌రిస్తారు. ఈ వివ‌రాల ద్వారా రాష్ట్రంలో ఆయా విభాగాల్లో ఉద్యోగం చేస్తున్న‌వారు ఎంత మంది ఉన్నార‌నే విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ఉంటున్న యువ‌త‌కు వారికి ఆస‌క్తి ఉన్న‌రంగాల్లో శిక్ష‌ణ‌  ఇస్తారు. దీని వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పాటుగా రాష్ట్రంలో మ్యాన్ పవర్ కోసం చూస్తారు. ఎందుకంటే ఇత‌ర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల‌ను ఇక్క‌డ‌కు తీసురావ‌డం ఒకింత కష్టమైన పని. దీంతో ఐటీ, నాన్ ఐటీ రంగాల‌కు చెందిన కంపెనీలు అన్నిసౌక‌ర్యాలు అందుబాటులో ఉన్న హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై వంటి రాష్ట్రాలవైపు మొగ్గు చూపుతారు. స్కిల్ సెన్సెస్ ద్వారా కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ రాష్ట్రంలోనే లభ్యమౌతుంది. దీంతో  పెట్టుబడి దారులు ఏపీవైపు మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి.  స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించిన డేటా ప్ర‌కారం.. రాష్ట్రంలో.. ఫైనాన్స్ విభాగం వారు ఇంత మంది ఉన్నారు.. ఎల‌క్ట్రిక‌ల్ విభాగం వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఐటీ రంగంలో ప‌నిచేస్తున్న‌వారు ఎంత‌ మంది ఉన్నారు.. ఇలా ఇత‌ర రంగాల్లో ఏ విభాగంలో ఎంత‌మంది ఉన్నారు..? వారు ఎక్క‌డెక్క‌డ ప‌నిచేస్తున్నార‌నే విష‌యాలు ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంటాయి. వీటిని కంపెనీల ప్ర‌తినిధుల ముందు ఉంచి మా రాష్ట్రంలో మీరు పెట్టుబ‌డులు పెడితే ప్ర‌భుత్వం నుంచి మీకు అన్ని విధాల స‌హ‌కారం అందించ‌డంతోపాటు.. మీకు కావాల్సిన ఉద్యోగులుకూడా అందుబాటులో ఉంటార‌ని లెక్క‌ల‌తో స‌హా వివ‌రిస్తుంది.   చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఐదో సంత‌కం చేసిన స్కిల్ సెన్సెస్ రాష్ట్ర అభివృద్ధిలో కీల‌క భూమిక పోషించ‌బోతున్నది. ఒక‌ విధంగా చెప్పాలంటే.. బీసీ జ‌న‌ గ‌ణ‌న కంటే స్కిల్ సెన్సెస్ దేశంలో కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది.   దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. స్కిల్ సెన్సస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ సిద్ధంచేశారు. ఎన్యుమరేటర్ల శిక్షణ కూడా పూర్తయింది. ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీమ్ లను కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవల్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

 ఆస్పత్రిలో చేరిన కవిత

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రిలో చేరారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కవిత తీవ్ర అనారోగ్యాని గురయ్యారు. రక్తపోటు, గైనిక్ సమస్యలతో బాధపడుతున్న కవిత ఐదున్నర నెలల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఆమెకున్న ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబడటంతో సోమవారం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె  ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ రొటీన్ చెకప్ చేయించుకున్నట్లు సమాచారం. గచ్చిబౌలి ఎఐజీ హాస్పిటల్లో ఆమె చేరారు.  లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాలు జరపాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రానున్న బతుకమ్మ పండగ నుంచి ఆమె రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

వాకింగ్ ట్రాక్ లుగా చెరవుకట్టల అభివృద్ధి

రోజూ ఓ గంట సేపు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెబుతారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు తీసుకునే చర్యలలో భాగంగా నగరాలు, పట్టణాల్లో వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేస్తున్నాయి.కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో అవి తప్పని సరిగా ఉంటున్నాయి. మరి సామాన్యులు వాకింగ్ చేయాలంటే.. అందరికీ వాకింగ్ ట్రాక్ లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గుంటూరు కార్పొరేషన్ వినూత్నంగా ఆలోచించింది. కార్పొరేషన్ పరిధిలోని చెరువు కట్టలను వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. సమ్మర్ పేట చెరువుని పరిశీలించిన మునిసిపల్ కమిషనర్ ఈ చెరువు కట్టను వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని అన్ని చెరువుకట్టలనూ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.  సమ్మర్ పేట చెరువులో కట్ట ఏర్పాటు చేశామని, త్వరలో ఫెన్సింగ్ పూర్తి చేస్తామని చెప్పారు.  చెరువులు ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.  

కేంద్ర సాయం ఏదీ ఎక్కడ?

మాటలు కోటలు దాటుతాయి.. అడుగు మాత్రం గడప దాటదు అన్నట్లుగా ఉంది కేంద్రం తీరు. కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో అతలాకుతలమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఆ విషయంలో ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.  బుడమేరు, కృష్ణా నది వరదలలో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిన సంగతి విదితమే. ముఖ్యంగా విజయవాడ నగరం బుడమేరు వరదతో చిగురుటాకులా వణికి పోయింది. లక్షల మంది రోజుల తరబడి వరద నీటిలో అష్టకష్టాలూ పడ్డారు. ఆస్తుల నష్టపోయారు. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకూ జాతీయ విపత్తు నిధి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన వరద  నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం కూడా జరిగింది.  ఆసందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బెజవాడ వరద విపత్తుని మాటలకందని విషాదంగా అభివర్ణించారు. అయితే పర్యటన ముగించుకుని హస్తిన వెళ్లిన తరువాత ఆయన మౌనముద్ర వహించారు.  సెప్టెంబర్ 1,2 తేదీలలో విజయవాడ భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా నష్టపోయింది.  రాష్ట్ర ప్రభుత్వం వరదల కారణంగా  రూ. 7600 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపింది. ఈ వరదలలో 74 మంది మరణించారు. 2.82 లక్షల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యారు.  7 లక్షల మంది పునరావాస కేంద్రాలలో తలదాచుకున్నారు. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం. అనేక పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు చనిపోయాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర అధికారులు వరద తీవ్రతను, నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇవన్నీ జరిగి నెల రోజులు అయినా ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఒక్క పైసా సహాయం కూడా అందలేదు. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ప్రస్తావించారు. వెంటనే రాష్ట్రానికి  7600 కోట్ల రూపాయలు వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు.  

తెలంగాణలో బీజేపీ.. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు!?

భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయిలో గత పదేళ్లుగా చక్రం తిప్పుతున్న ఈ పార్టీ దక్షిణాదిలో మాత్రం పట్టు సాధించడంలో విఫలమౌతోంది. కర్నాటకలో ఏదో మేరకు బలం ఉన్నా.. అక్కడ ఆ పార్టీ స్థిరంగా వేళ్లూనుకుందని చెప్పడం కష్టం. ఇక దక్షిణాది ఆ పార్టీకి ఏదో మేరకు ఆశలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో బీజేపీకి పట్టణ ప్రాంతాలలో పట్టు ఉన్నప్పటికీ గ్రామీణంలో మాత్రం అంతంత మాత్రమే. అయితే తెలంగాణలో అధికార పీఠం అందుకోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరాలంటే మాత్రం ఆ బలం సరిపోదు. ఈ విషయం బీజేపీ అగ్రనాయత్వానికీ స్పష్టంగా తెలుసు. దాంతో ప్రజలలో అంతో ఇంతో పలుకుబడి ఉంది అంటే చాలా వారి రాజకీయ నేపథ్యం, వారి సైద్ధాంతాలు వంటి వాటిని ఇసుమంతైనా పట్టించుకోకుండా దొరికిన వారిని దొరికి నట్లు పార్టీలోకి ఆహ్వానించేసి  కండువాలు కప్పేసింది. రాష్ట్రంలో ఇక అధికారమే తరువాయి అన్నట్లుగా భావించింది. అయితే 2023 ఎన్నికలు ఆ పార్టీ విశ్వాసంపై చావు దెబ్బ కొట్టాయి. పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరడానికి ఇష్టారీతిగా పార్టీలో చేరికలను ప్రోత్సహించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకున్నట్లు కనిపించింది. ఏకంగా 9 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. దీంతో 2028 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అయితే  ఆ అడుగులు తడబడుతున్నాయి.  రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీలో నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. క్యాడర్ కు దిశా నిర్దేశం చేసి ముందుండి నడిపించే నేత కరవయ్యారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ తరువాత స్థానం బీజేపీదే.. ప్రత్నామ్నాయం బీజేపీనే అన్నట్లుగా పరిస్థితి మారింది. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధకారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయింది అనిపించేలా పరిస్థితులు మారాయి. అయితే బీజేపీ అంతర్గత కలహాలు, విభేదాలతో ఆ పరిస్థితిని చేజేతులా జారవిడుచుకున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వ మార్పు కోసం ఆ పార్టీలో చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్నా, కిషన్ రెడ్డి స్థానంలో రాష్ట్ర పార్టీకి మరో అధ్యక్షుడిని నియమించే విషయంలో బీజేపీ హైకమాండ్ మీనమేషాలు లెక్కించింది.  గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యకుడిగా ఉన్న సమయంలో అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీ మీద దూకుడుగా ముందుకెళ్ళేది బీజేపీ. అలాగే అటు కాంగ్రెస్ పార్టీని కూడా తన విమర్శలతో ఇరుకున పెట్టి అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసింది బీజేపీ. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచీ బీజేపీలో దూకుడు మాయమైంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీలో కొద్దిగా ఐక్యతా రాగం వినిపించినా, ఇప్పుడు ఆ ఐక్యత కనిపించడం లేదు. అలాగే అటు హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలతో ప్రజల వ్యతిరే కతను మూటకట్టుకుంటుంటే బీజేపీ చేష్టలుడిగి నిలబడిపోయింది. అదే సమయంలో ఇక అయిపోయిందనుకున్న బీఆర్ఎస్ పుంజుకుని ప్రజా మద్దతును కూడగట్టుకుని హైడ్రాకు వ్యతిరేకంగా జనంలోకి బలంగా వెడుతోంది. కానీ బీజేపీ మాత్రం స్తబ్దుగా మిగిలిపోయింది.   అంది వచ్చిన అవకాశాలను జారవిడుచుకుని తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలహీనమౌతోందని పార్టీ శ్రేణులే  అంటున్నాయి. 

ఓ వైపు హైడ్రా.. మరో వైపు రుణమాఫీ.. రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి?

తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వంపై ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ ఏకకాలంలో దాడి చేస్తున్నాయి. రెండూ కూడా రెండు అంశాలను తీసుకుని రేవంత్ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  ప్రస్తతుం తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా చుట్టే రాజకీయం నడుస్తున్నది. హైడ్రాపై ప్రజా వ్యతిరేకతను దన్నుగా తీసుకుని బీఆర్ఎస్ మళ్లీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి శతధా ప్రయత్నిస్తోంది. రేవంత్ సర్కార్ ను ప్రజలలో పలుచన చేయడానికి హైడ్రా తిరుగులేని ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో ఆ పార్టీ రుణమాఫీ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. హైడ్రాకు ముందు బీఆర్ఎస్ రుణమాఫీ అంశంపై ప్రభుత్వంతో యుద్ధానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంది. రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదంటూ రేవంత్ ప్రభుత్వంపై పోరుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. రుణమాఫీ కాని రైతుల కోసం తెలంగాణ భవన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. అయితే ఎప్పుడైతే హైడ్రా తెరమీదకు వచ్చిందో బీఆర్ఎస్ రుణమాఫీ అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. అలా పక్కన పడేయడానికి రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ను జనం నమ్మకపోవడమే. బీఆర్ఎస్ ప్రకటించిన కార్యాచరణకు రైతుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. సరిగ్గా ఆ సమయంలోనే హైడ్రా తెరమీదకు రావడంతో రుణమాఫీని వదిలేసి బీఆర్ఎస్ హైడ్రాకు వ్యతిరేకంగా పోరు మొదలెట్టింది. ఇందుకు ప్రజల నుంచి కూడా స్పందన లభించడంతో ఇక రైతు రుణమాఫీ ముగిసిన అంశంగా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఇక్కడే బీజేపీ రుణమాఫీ విషయాన్నిఅందిపుచ్చుకుంది.  రైతు సమస్యలపై పోరుబాటకు రెడీ అయిపోయింది. అయితే హైడ్రా ద్వారా వచ్చిన అవకాశాన్ని చేజేతులా బీఆర్ఎస్ కు అప్పగించేసి రుణమాఫీ అంటూ బీజేపీ హడావుడి చేయడాన్ని ఆ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ రైతులు రుణమాఫీని పొంది ఆనందంగా ఉన్నారు. రుణమాఫీ అందని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ సమయంలో రైతు సమస్యలంటూ బీజేపీ పోరుబాట పడితే.. ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదన్నది వారి వాదన.  అయితే బీజేపీ హైడ్రా విషయంలో కేవలం విమర్శలు, ఆరోపణలకే పరిమితమై.. బీఆర్ఎస్ చేతకాక చేతులెత్తేసిన రైతు సమస్యలను సీరియస్ గా పట్టించుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని పార్టీ శ్రేణులు అభ్యంతరం చెబుతున్నా.. నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు.  రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే బీఆర్ఎస్ తో సమాంతరంగా నిత్యం క్షేత్ర స్థాయిలో పోరుబాటలో ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలన్నది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో ఒకే సమయంలో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ రేవంత్ సర్కార్ పై వేర్వేరు అంశాలతో పోరుబాట పట్టాయి. దీంతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.