గెలుపు ధీమా.. ఢిల్లీ ఎన్నికల్లో విజయం తమదే అంటున్న ప్రధాన పార్టీలు!

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడి గెలుపును అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం పై జెండా ఎగుర వేసేందుకు ప్రధాన పార్టీలు వినూత్న ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. అయితే రాష్ట్రం చిన్నది అయినా అసెంబ్లీ సీట్లు తక్కువ గానే ఉన్నా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది ఢిల్లీ. దేశ రాజధాని కావడం అందులో అన్ని వర్గాల.. రాష్ర్టాల.. ప్రజలు నివసిస్తూ ఉండటమే ఇందుకు కారణం. ఈ ఎన్నికల్లో దాదాపు కోటిన్నర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేవలం నెల వ్యవధిలోనే ఢిల్లీ ఓటర్లు పూర్తి భిన్నమైన తీర్పునిస్తారన్న దానికి గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. 2013 ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆమాద్మీ పార్టీ 28 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని 48 రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపే చేతులెత్తేసింది. తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏడు పార్లమెంటు స్థానాలకు ఏడు సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఏకంగా 67 స్థానాల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బిజెపి మాత్రం కేవలం మూడు స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇక ఈ సారి జరగనున్న ఎన్నికలు అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోరుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను అవకాశంగా చేసుకుని హస్తిన అసెంబ్లీలో పునః వైభవం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

లోకేష్ వర్సెస్ వంశీ.. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం!

వల్లభనేని వంశీ టీడీపీని వదలి వెళ్లిన సమయం నుండి వంశీ మరియు లోకేష్ ఒకరి పై ఒకరు సోషల్ మీడియా వేదికగా తెగ పొస్ట్ లు పెడుతున్నారు. మీడియాను ఆసరాగా చేసుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సెన్సేషనల్ గా మారారు.టీడీపీ యువనేత నారా లోకేష్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో హాట్ టాఫిక్ గా మారింది. టిడిపి ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నారంటూ వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, పోతుల సునీత తదితరుల ఫోటోలతో ఉన్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు.  నాడు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లినప్పుడు సంతలో గొర్రెల్లా తమ ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ కొనిందని జగన్ ఆరోపించారు. ఆయన మాటలనే ప్రస్తావిస్తూ వీరి ఫోటోను జత చేసేన లోకేష్ గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కొన్నారంటూ కామెంట్లు కూడా చేశారు.దీని పై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందిస్తూ వద్దంటే వెళ్లి మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడారని ఎద్దెవా చేశారు.మండలి కూడా రద్దు కావడంతో లోకేష్ కు పిచ్చి పట్టి కామెంట్లు చేస్తున్నారని వంశీ విమర్శించారు. గొర్రెలకే కాదు పిచ్చి కుక్కలకు తన దగ్గర వైద్యం ఉందని వంశీ జోడించారు. మితి మీరుతున్న వీరి కామెంట్లు ,పోస్టల పై నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సారీ.. నేను రాను... సీఎం రమేష్ కుమారుడి పెళ్లికి రానని చెప్పిన జగన్!!

తెలుగుదేశం నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ , ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఇద్దరిది ఒకే జిల్లా కానీ ఇద్దరి మధ్య రాజకీయ వైరం తారాస్థాయిలో ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి టైం నుంచే సీఎం రమేష్ తో పొలిటికల్ రైవలరీ ఉండేది. టిడిపిలో ఉన్నంత వరకు జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు రమేష్. బిజెపిలో చేరిన తర్వాత సీఎం రమేశ్ కాస్త సైలెంట్ అయినా అప్పుడప్పుడు విమర్శల బాణాలు వేస్తూనే ఉన్నారు. ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నేపథ్యంలో సీఎం రమేష్ ఏకంగా సీఎం జగన్ ను అమరావతి వెళ్లి కలవడం.. ముసిముసి నవ్వులు నవ్వుకోవడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  సీఎం రమేష్ కుమారుడి వివాహం వచ్చే నెల మొదటి వారంలో జరగబోతోంది. దుబాయి లో ఎంగేజ్ మెంట్ ను అంగరంగవైభవంగా చేశారు రమేష్ . పెళ్లి వేడుకను అంతకు మించి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు సీఎం రమేష్. అమరావతి సచివాలయంలోని సీఎం ఆఫీసుకు కొడుకుతో పాటు సతీసమేతంగా వెళ్లి జగన్ కు ఆహ్వాన పత్రిక అందించారు. పక్కనే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. తన కుమారుడి వివాహానికి తప్పకుండా రావాలని పిలిచారు. కానీ సీఎం జగన్ రియాక్షన్ తో షాక్ అయ్యారట సీఎం రమేష్. పెళ్లికి రాలేనని చెప్పారట సీఎం జగన్. రావాలని పదేపదే అడిగినా జగన్ మాత్రం సారీ అన్నారని సమాచారం.  పెళ్ళికి రాలేను అని జగన్ చెప్పిన దానిపై చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. పెళ్లికి టిడిపి అధినేత చంద్రబాబు అలాగే ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు తన రాజకీయ ప్రత్యర్థులు వస్తారని అందుకే తాను రాలేనని సీఎం రమేష్ కు నవ్వుతూనే చెప్పారట జగన్. రాజధానుల అంశం ఇంగ్లీష్ మీడియంపై ఈ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఒకే వేదికలో కూర్చోవడం మాట్లాడటం తనకే కాదు వాళ్ళకి ఇబ్బందేనని అన్నారట జగన్. అయినా రావడానికి ప్రయత్నించాలని చెప్పి నవ్వుతూ వెళ్లిపోయారు సీఎం రమేష్ దంపతులు.  ఈ మధ్య సీఎం రమేష్ ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారని మాటలు వినపడుతున్నాయి. కొడుకు మ్యారేజ్ కి ఆహ్వానించడమే కాదు సీఎం జగన్ శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్ కార్యక్రమానికి హాజరయ్యారు రమేష్. కడపతో పాటు అనేక చోట్ల సీఎం రమేష్ కు కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు ఇంకా డబ్బులు రావలసి ఉండటంతో ఇదంతా చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వ మాత్రం బిల్లులు క్లియర్ చేయటం లేదట. దీంతో జగన్ తో వైరం పెంచుకుంటే బిల్లులన్నీ మరింత కాలం పెండింగ్ లో పడతాయని భావించిన సీఎం రమేష్ వైసీపీ అధినేతతో కయ్యం కన్నా వియ్యమే మేలని ఆలోచిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా రాయబారం నడుపుతూ జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అధిష్టానం కూడా జగన్ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పుడు తానెందుకు నెగిటివ్ గా ఉంటానని ఆలోచిస్తున్నారు. అందుకే జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సీఎం రమేష్ ను మాత్రం జగన్ దూరం పెడుతున్నారు. అందుకే కొడుకు పెళ్లికి సైతం రాలేనని సున్నితంగా బదులిచ్చారు సీఎం జగన్.

ఏపీ పోలీసులపై నమ్మకం లేదని... ఇఫ్పుడు సిట్ ఎందుకు వేశారు? జగన్ కు చెల్లెలు సూటి ప్రశ్న

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు.  ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత. ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.

బీజేపీలో చేరింది.. మోదీ కే మీ ఓటు అని ప్రచారం చెయ్యనున్న సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ జనరల్ సెక్రెటరీ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సైనా నెహ్వాల్ తో ఢిల్లీలో ఎన్నికల ప్రచార నిర్వహించబోతున్నట్లు సమాచారం. బిజెపి జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మోదీ దేశం కోసం పాటుపడుడుతున్న వైనం చూసి ఆయనతో పని చేయాలనే బీజేపీలో చేరినట్లు సైనా నెహ్వాల్ మీడియాతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు నడ్డాతో భేటీ అయ్యారు సైనా. రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైనాతో ప్రచారం చేయించాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ దేశ అభివృద్ధి కోసం, క్రీడ అభివృద్ధి కోసం పాటుపడడం చూసి కొందరు ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. దీని కోసం ముఖ్యమైన నేతలు, సెలబ్రిటీలతో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించే వ్యూహం చేసినట్లు సమాచారం. కేంద్ర మంతి అమిత్ షా తో పాటు వివిధ ముఖ్య నేతల సైతం ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కేజ్రివాల్ కు దీటుగా ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీని సైతం తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.

నిరాశపరిచిన ఫలితాలు.. టీఆర్ఎస్ మంత్రుల పై వేటు పడనుందా? 

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అంచనాలకు మించి విజయం సాధించింది. 100 పైగా పురపాలక సంఘాల్లో పాగా వేసింది. అయితే జడ్పీ తరహాలోనే జిల్లాలో అన్ని మున్సిపాల్టీలు కార్పొరేషన్ లు గెలిపించాలని..క్లీన్ స్వీప్ లక్ష్యమని నిర్దేశించారు కేసీఆర్. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు గానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కేసీఆర్ ఈ టార్గెట్ ఇచ్చారు. ఓడిపోతే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. పెద్ద పదవుల్లో ఉన్నవారైనా బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ఉన్నవాళ్ల పదవులు పోతాయని.. కొత్తవాళ్లకు పదవులు ఇవ్వమని స్పష్టం చేశారు.  కొన్ని చోట్ల ఫలితాలు పార్టీకీ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కొందరు మంత్రుల మెడపై పదవీ గండం కత్తి వేలాడుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వడ్డేపల్లి మునిసిపాలిటీలో టిఆర్ఎస్ ఓడిపోయింది. ఈ మున్సిపాలిటీకి ఇన్ చార్జిగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవికి గండం ఉన్నట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిరంజన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటారా వార్నింగ్ తో సరిపెడతారా అనే విషయం ఆసక్తిగా మారింది.  ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా టిఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. చండూరు, హలియ, నల్లగొండ మునిసిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ వార్డులు దక్కించుకుంది. ఎక్స్ అఫిషియో సభ్యుడితో కొన్ని చోట్ల చైర్మన్ పదవులు దక్కాయి. పార్టీ పనితీరు పై సిఎం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చిట్యాల, యాదగిరి గుట్ట, భువనగిరి లోనూ గులాబితో కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడింది. దీంతో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి వైపు నేతలు చూస్తున్నారు.  ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా టీఆర్ఎస్ కు ఫలితం అనుకూలంగా రాలేదు. అక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. దీంతో ఎంఐఎం మద్దతు కీలకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అక్కడ పార్టీకి సానుకూల ఫలితాలు రాలేదు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మరి జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై ఇది ప్రభావం చూపనుందా అని పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  ఇక గ్రేటర్ కు ఆనుకొని ఉన్న కొన్ని కార్పొరేషన్ లు మున్సిపాలిటీల్లోనూ గులాబీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. తుక్కుగూడలో బిజెపి గెలిచింది. మీర్ పేటలో స్వతంత్రులు ఆధిక్యంతో గెలిచారు. ఇక తుర్కయాంజల్లో ప్రతికూల ఫలితం వచ్చింది. పెద్ద అంబర్ పేటలో కారు జోరు చూపించలేకపోయింది. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై ఇవి ప్రభావం చూపే అవకాశముంది. మొత్తానికి ఐదు నుంచి ఆరుగురు మంత్రుల పని తీరు పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 1న ఉరి.. నిర్భయ దోషి ముఖేష్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

నిర్భయ దోషి ముకేష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాష్ట్రపతి తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు ముకేష్. దీనిపై వాదనలు విన్న జస్టిస్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉరి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు తీహార్ జైలు అధికారులు. ముఖేష్ ను జైలులో లైంగికంగా వేధించారని అలాగే స్పెషల్ సెల్ లో నిర్బంధించారని ఆరోపించారు అతని తరపు న్యాయవాది అంజనా ప్రకాశ్. ఈ ఆరోపణలను కొట్టిపారేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ మెహతా. దోషి ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి క్షమాభిక్ష ఎలా ప్రసాదిస్తారని ప్రశ్నించారు. వాడి వేడిగా సాగిన ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం ముఖేష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది.

వైఎస్ వివేకా కేసులో 15మందిపై అనుమానాలు... కారణాలు చెప్పిన జగన్ చెల్లెలు సునీత...

తన తండ్రి హత్య కేసులో ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపిన వైఎస్ వివేకా కుమార్తె సునీత... అందుకు కారణాలను కూడా వివరించారు. హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో ముగ్గురు నలుగురు మినహా అందరూ వైఎస్ కుటుంబ సభ్యులు, వాళ్ల సన్నిహితులే కావడంతో... ఎందుకు అనుమానిస్తున్నారో క్లారిటీ చెప్పుకొచ్చారు సునీత.   1. వైఎస్ భాస్కర్ రెడ్డి (కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి) - వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక భాస్కర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించగా వైఎస్ వివేకానందరెడ్డి వ్యతిరేకించారు. 2. వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న) - వైఎస్ వివేకా బెడ్రామ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకలను శుభ్రం చేయమని మనోహర్ రెడ్డి తనకు చెప్పారంటూ యర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. మేము జైల్లో యర్ర గంగిరెడ్డిని కలిసినా ఇదే విషయం చెప్పారు. 3. వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ) - వైఎస్ వివేకా హత్య జరిగాక మొదట ఇంటికి వెళ్లిన వ్యక్తి... ఉదయం 6గంటలకే ఘటనాస్థలానికి వెళ్లిన మొదటి కుటుంబ సభ్యుడు... శంకర్‌ రెడ్డి గదులను శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్నారు.. అందుకే, శంకర్‌ రెడ్డిని అవినాష్ రక్షిస్తున్నాడని భావిస్తున్నాం... అలాగే, కడప ఎంపీగా అధికారులపై ప్రభావం చూపించగలరు..  4. వాచ్ మన్ రంగయ్య ( వైఎస్ వివేకా ఇంటి కాపలాదారు ) - వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఇంటి దగ్గరే ఉన్నాడు... మార్చి 14న మధ్యాహ్నం 12-45కి తన భర్త రాజశేఖర్ కు ఫోన్ చేసి పులివెందుల ఎప్పుడు వస్తున్నారని ఆరా తీశాడు... ఆ తర్వాత తాను ఫోన్ చేయలేదని మాట మార్చాడు... ఫోన్ చేయమని వాచ్ మన్ కి చెప్పిందెవరు?... వివేకా హత్య జరిగిన రోజు తాను నిద్రలో ఉన్నాను... తనకేమీ వినబడలేదని వాచ్ మన్ చెబుతున్నాడు... కానీ, ఇంట్లో ఎన్నో వస్తువులను బద్దలు కొట్టారు... ఆ శబ్దాలు రంగయ్యకు ఎందుకు వినిపించలేదో తెలియడం లేదు?... వివేకానంద రెడ్డిని చివరిగా చూసింది వాచ్‌మన్‌ రంగయ్యే... ఏం జరిగిందో బయటకు చెప్పడానికి భయపడుతున్నాడు? సహజంగా రంగయ్య తక్కువ నిద్రపోతాడు. అతను వేకువజామున 5గంటలకే మేలుకొంటాడు. కానీ, సంఘటన జరిగిన రోజు ఉదయం 6గంటల వరకు నిద్రలోనే ఉన్నాడు. కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, ప్రకాశ్‌ వచ్చే వరకూ లేవలేదు. ఎందుకలా? వివేకానంద రెడ్డి బాత్రూంలో ఉన్నట్లు మొదటగా గుర్తించింది రంగయ్యే. సహజంగా అతను ఇంట్లోకి వెళ్లడు. ఎవరి సూచనలు లేకుండా పక్క తలుపుగుండా అతను ఎందుకు లోపలికి వెళ్లాడు? 5. డి.శివశంకర్‌రెడ్డి... ఇతను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు... గతంలో అతనికి నేరచరిత్ర ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్థానంలో పోటీ చేయాలని భావించారు. 2010లో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో శంకర్‌రెడ్డి సాంఘిక వ్యతిరేక కార్యాకాలపాలకు వ్యతిరేకంగా వివేకా ధర్నా చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వివేకా బతికుండగా ఆయన ఇంటికి శంకర్‌ రెడ్డి వచ్చేవారు కాదు. కానీ వివేకా మృతి చెందిన రోజు ఉదయం మాత్రం వివేకా బెడ్రూమ్‌లోనే శివశంకర్‌రెడ్డి ఉన్నారు. ఇతరులను లోనికి రానీయలేదు. ఫొటోలు తీసుకోవడానికి అనుమతించలేదు. కానీ ఆ ప్రాంతం శుభ్రం చేయడాన్ని మాత్రం ఆపలేదు. అంటే ఈ పరిణామాల గురించి ఆయనకు తెలిసే శుభ్రం చేయడానికి అనుమతించాడా? వివేకానంద రెడ్డికి హార్ట్‌ ఎటాక్‌ అని సాక్షి మీడియా హెడ్‌ బాలకృష్ణకు రిపోర్ట్‌ చేశారు. ఆయన ఎందుకలా చెప్పారు? 2016 ఎన్నికల్లో వివేకా స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నారు. అది జరగకపోవడంతో అతను మృతునికి దూరంగా జరిగారు. అతను టీడీపీ నుంచి డబ్బును అనుమతించారు. అంతేగాక వైసీపీ వారు టీడీపీకి ఓటు వేయవచ్చన్న పరిస్థితిని వైసీపీలో కల్పించారు. 6. యర్ర గంగిరెడ్డి: వైఎస్‌ వివేకానందరెడ్డికి 40ఏళ్లుగా అత్యంత సన్నిహితుడు. గంగిరెడ్డి ...వివేకాను హత్య జరిగిన రోజు రాత్రి 11.15 గంటలకు ఆయన ఇంటి వద్ద వదిలేశారు. ఇల్లు మొత్తం ఆయనకు తెలుసు. ఆరోజు 7 గంటలకు సంఘటనా స్థలికి వచ్చిన గంగిరెడ్డి.... భార్య, కుమార్తె, అల్లుడు ఫోన్‌ చేసినా తీయలేదు. అంతేగాక వివేకాది సహజ మరణమని ప్రతి ఒక్కరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తెచ్చాడు. సీఐ సమక్షంలో ఘటనా స్థలిని శుభ్రం చేయడం, మృతదేహం డ్రెస్సింగ్‌, క్లీనింగ్‌ వంటి పనులను పర్యవేక్షించాడు. కుటుంబ సభ్యులం లేకుండానే అదే రోజు అంత్యక్రియలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టాడు. అయితే, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి చెప్పినందుకే సంఘటన స్థలాన్ని శుభ్రం చేయించాల్సి వచ్చిందని ఆ తరువాత తెలిపాడు. 7. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి - వివేకా మృతి గురించి ఉదయ్‌కు తెలుసని, ఆ రోజు వేకువజామున 3.30 గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన స్నేహితులతో ఆయన తల్లి తెలిపింది. అదే సమయంలో హాస్పిటల్లో పరమేశ్వర్‌ రెడ్డికి ఒక విజిటర్‌ ఫోన్‌లో ఏదో చూపించాడు. ఉదయ్‌, ఈసీ సురేందర్‌ రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి 14వ తేదీ అర్ధరాత్రి కలిసినట్లుగా రిపోర్టులున్నాయి. శివశంకర్‌ రెడ్డికి ఉదయ్‌ సన్నిహితుడు. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ప్రకాశ్‌ రెడ్డి, సతీశ్‌ రెడ్డి, డాక్టర్‌ మధులను గత ఆగస్టులో విచారించారు. ఆ తరువాత వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఈసీ సురేంద్రనాధ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి మంగళగిరిలో డీజీపిని ఎందుకు కలవాల్సి వచ్చింది? కొన్ని అరెస్టులు జరుగుతాయన్న అనుమానంతోనే కలిశారా? ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ మధుసూధన్‌ రెడ్డిలను విచారణ కోసం కడప తీసుకెళ్తుండగా కొన్ని ఫోన్లు రావడంతో నందిమండలం నుంచే తిప్పిపంపారు. వారిని అభిషేక్‌ మహంతి నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రశ్నించకుండా అడ్డుకున్నది ఎవరు? 8. పరమేశ్వర్‌ రెడ్డి: ఈయన స్థానిక నాయకుడు. ఆయన భార్య ఎంపీపీ. పరమేశ్వర్‌ రెడ్డికి నేర చరిత్ర ఉంది. గత ఏడాది మార్చి 13వ తేదీన దినేశ్‌ నర్సింగ్‌ హోంలో చేరుతున్నట్లుగా అడ్మిషన్‌ కార్డు అడిగాడు. అందుకోసం ఆ ఆసుపత్రికి వెళ్లాడు. సాధారణంగా అతను హాస్పిటల్లో రిజిస్టర్‌ చేసుకోడు. 14 తేదీ ఉదయం ఛాతీ నొప్పితో సన్‌రైజ్‌ హాస్పిటల్లో చేరాడు. వివేకాకు తను సన్నిహితుడినని ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకలా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది? అతనికి ఆ రోజు కొన్ని అస్వస్థత లక్షణాలున్నా మిగిలినదంతా నార్మల్‌గానే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ఎంఆర్‌ఐ కూడా తీశారు. కానీ ముఖ్యమైన పని ఉందంటూ సాయంత్రం సమయంలో గంటన్నర బయటకు వెళ్లాడు. అలాంటి స్థితిలో అతనికి అంత ముఖ్యమైన పని ఏముంది? అతను ఆ రోజు అత్యధికంగా ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. డాక్టర్‌ వద్దంటున్నా వినకుండా బయటకు వెళ్లి సాయంత్రం 8.30 గంటల సమయంలో మళ్లీ అడ్మిట్‌ అయ్యాడు. ఆ సమయంలో అతనేం చేశాడు? వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 3.40 గంటల ప్రాంతంలో ఒకరు అతనిని కలిసి సెల్‌ఫోన్‌ ఇచ్చారు. ఇది సీసీ టీవీలోనూ నమోదైంది. అతను సెల్‌ఫోన్‌లో ఏదో చూశాడు. ఆ ఫోన్‌ ముందురోజు అతని చేతిలో ఉన్నది కాదు. ఆ తరువాతి రోజు తిరుపతి వెళ్లి మరో ఆసుపత్రిలో చేరాడు. 9. శ్రీనివాస్‌ రెడ్డి: ఇతను పరమేశ్వర్‌ రెడ్డికి చాలా వ్యాపారాల్లో భాగస్వామి. పరమేశ్వర్‌ రెడ్డి నార్కో అనాలిస్‌ నుంచి వచ్చాక శ్రీనివాస్‌ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు భిన్న చేతిరాతలతో అతని పేరుతో లేఖ దొరికింది. వివేకా హత్యకు సంబంధించి పోలీసుల వేధింపుల వల్లనే అతను మృతిచెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ వివేకా హత్యకు, శ్రీనివాస్‌ రెడ్డి మృతికి సంబంధముందని మేం నమ్ముతున్నాం. 10. సురేంద్రనాధ్‌ రెడ్డి - అవినాశ్‌ రెడ్డికి బంధువు. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సురేంద్రనాధ్‌ రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం శంకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆగస్టు 31వ తేదీన అవినాశ్‌ రెడ్డి, శివ శంకర్‌రెడ్డిలతో పాటు డీజీపి కలిశారు. ఆ తర్వాతే దర్యాప్తు నత్తనడకన సాగింది. 11. సురేంద్ర రెడ్డి - పరమేశ్వర్‌ రెడ్డి బావమరిది. ఆసుపత్రిలో ఉన్న సురేంద్రరెడ్డి ఫోన్‌ తీసుకుని ఉదయం 3.40 గంటల ప్రాంతంలో పరమేశ్వర్‌ రెడ్డికి ఏవో వివరాలు చూపించారు. అదే సమయంలో ఉదయ్‌ కుమార్‌ కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ వివరాలు గమనిస్తే హత్య పథకం పూర్తయినట్లు వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 12. శంకర్‌ (సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌): ఉదయం 7.10 గంటలకు శంకర్‌ ఘటనాస్థలికి వచ్చారు. ఎం.కృష్ణారెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలన్న దానికి అతనే సాక్ష్యం. రాజశేఖర్‌ రెడ్డి ఫోన్‌లో చెప్పాకే ఆయన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం ఆయనకు ఎందుకు ఇష్టంలేదు? ఏడు అడుగులు విస్తరించిన రక్తపు మడుగును చూపిస్తూ అది సహజమరణం కాదని షేక్‌ ఇనయతుల్లా వివరించాడు. అయినప్పటికీ వివేకా కిందపడి మరణించి వుంటాడని శంకరయ్య నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. పక్కనున్న వాళ్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. 13. రామకృష్ణా రెడ్డి, ఏఎస్‌ఐ: శివ శంకర్‌ రెడ్డికి సన్నిహితుడు. దర్యాప్తులో పాల్గొన్న ఏఎస్‌ఐనే ఆ తర్వాత సాక్షిగా తీసుకున్నారు. ఇదెలా? 14. ఆదినారాయణరెడ్డి - సంఘటన జరిగినప్పుడు ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉన్నారు. వివేకానంద రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆది నారాయణ రెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి కాంటాక్ట్‌లో వున్నాడు. మార్చి 14వ తేదీ సాయంత్రం శంకర్‌ రెడ్డి టీడీపీ వారిని కలిశారు. అక్కడ వారేమైనా హత్యకు ప్రణాళిక రూపొందించారా? ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వారు అతనిని రక్షిస్తామన్నారా? 15. బీటెక్‌ రవి - 2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాపై బీటెక్‌ రవి విజయం సాధించారు. రవి విజయానికి శివశంకర్‌ రెడ్డి సాయం చేశారు. అప్పుడు వారు కలిసి పని చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కోసం పని చేశారు. వివేకా మృతితో వైసీపీ నేతల్ని అరెస్టు చేస్తారు, జిల్లాలో గందరగోళం ఏర్పడుతుందన్నది వారి అభిప్రాయం కావచ్చు.

విశాఖలో ల్యాండ్ పూలింగ్.. పేదలు భూములు ఇస్తే ఉగాదికి కొత్త ఫ్లాట్

విశాఖకు రాజధాని ప్రకటనతో స్టీల్ సిటీలో ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ శివారు గ్రామాల్లో 6,000 ఎకరాల సేకరణకు సర్కారు జీవో జారీ చేసింది. జీవో 72 ప్రకారం సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెదగంట్యాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారుల హడావుడి మొదలయ్యింది. ల్యాండ్ పూలింగ్ కింద సేకరించే భూములను విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీకి అప్పగించారు. ఇప్పటికే అధికారులు ఆయా మండలాల పరిధిలో అసైన్డ్ ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ స్థలాల్లో వీఎంఆర్డీఏ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనుంది. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వ భూములతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తుంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటోందని సిపిఎం మండిపడుతోంది. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తామన్నారు సీపీఎం పార్టీ నేత మధు. భూ సేకరణ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. 

ఆనాడు సీబీఐ కావాలన్నారు? ఇప్పుడెందుకు వేయరు? వైఎస్ జగన్ పై సోదరి సంచలన ఆరోపణలు...

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై... వైఎస్ వివేకా కూతురైన సునీత సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన జగన్మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. సీఎం పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలైనా ఇఫ్పటివరకు ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదని ప్రశ్నను సునీత లేవనెత్తారు. సిట్ అధికారులను పదేపదే మార్చడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. పైగా కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగుతోందని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. ఈ కేసులో జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అసలైన నిందితులను వదిలేసి... అమాయకులను ఇరికిస్తారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తన లాయర్ ద్వారా హైకోర్టుకు వాదనలు వినిపించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత.... 15మందిపై అనుమానాలు ఉన్నాయని తెలిపింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి... అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి.... చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి తదితర పేర్లను ప్రస్తావించింది.  వివేకా హత్య కేసును రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు... లేదా సీబీఐకి అప్పగించాలని ఆయనభార్య వైఎస్ సౌభాగ్యమ్మ... అలాగే, అప్పటి ప్రతిపక్ష నేత... ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు... అప్పట్లో హైకోర్టు వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే, అప్పటి మంత్రి ఆదినారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై ఆరోపణలు రావడంతో... వాళ్లు కూడా కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అలాగే, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి మరో వ్యాజ్యం చేశారు.అయితే, వైఎస్ వివేకా హత్యపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన హైకోర్టు...కేసును  సీబీఐకి అప్పగించానికి అభ్యంతరం ఏమిటంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  అయితే, వైఎస్ వివేకా కుమార్తె సునీత లేవనెత్తిన ప్రశ్నలే ఇప్పుడు సంచలనంగా మారాయి. సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా తమకు అనుమానాలు ఉన్నాయని వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా... కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారేమోనన్న డౌట్ రాక మానదు. మరి వైఎస్ వివేకా కేసులో అసలు నిందితులెవరో తేలతారో లేక... సునీత అనుమానిస్తున్నట్లుగా అమాయకులను ఇరికించి నిజాలను సమాధి చేస్తారో చూడాలి.

హై అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోకి కరోనా వైరస్.. అప్రమత్తమైన కేంద్ర వైద్య బృందం..

చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అన్ని దేశాలకు విస్తరిస్తూ ప్రజల్ని భయపెడుతోంది. హైదరాబాద్ లోనూ కరోనా వైరస్ బాధితుల కోసం 100 పడకలతో వార్డును సిద్ధం చేశారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే గాంధీ లేదా ఫీవర్ ఆసుపత్రికి రావచ్చని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. హైదరాబాద్ లో కరోనా వైరస్ పై వస్తున్న వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్ధారణ కాలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఈటెల అన్నారు.  మరోవైపు మూడు కేంద్ర ప్రత్యేక వైద్య బృందాలు ఫీవర్ ఆస్పత్రిని సందర్శించారు. ఫీవర్ ఆస్పత్రి వైద్యుల పై కేంద్ర వైద్య బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులలో సరైన వసతులు లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అధికారులకు వైద్య బృందం సూచించింది. కరోనా వైరస్ లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రిలో చేరిన అనుమనితులను నమూనాలు సేకరించారు. పూణేకు పంపిన ఇద్దరు బాధితుల రక్త నమూనాలు నెగిటివ్ అని వచ్చాయి. మరో ఇద్దరికి అలాంటి లక్షణాలు లేవని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ ను కేంద్ర బృందం పరిశీలించింది. టెక్నికల్ గా ఎలాంటి సపోర్టు కావాలనే అంశంపై ఆరా తీశారు.  అటు విశాఖ ఎయిర్ పోర్టులో కూడా కరోనా అలర్ట్ కొనసాగుతుంది. కరోనా వైరస్ పై ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో వైద్యారోగ్య శాఖాధికారులతో కరోనా వైరస్ పై సమీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కు సంబంధించి కేసులు నమోదు కాలేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కు సంబంధించి ఐదు పడకలతో ప్రత్యేక వార్డు , వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తిరుపతికి నిత్యం లక్షల మంది భక్తులు వస్తుండడంతో రిఆసుపత్రి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో ఎనిమిది పడకలతో ప్రత్యేక కరోనా వైరస్ వార్డులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక మాస్క్ లు , కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ పై విశాఖ విమానాశ్రయ, కేజీహెచ్, వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేజీహెచ్ లో మూడు పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో పరీక్షించాకే నగరంలోకి అనుమతిస్తున్నారు.  

నిధులపై కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించిన కేటీఆర్...

జీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై పార్లమెంటులో నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు, కొన్ని అంశాలపై అవసరమైతే ప్రభుత్వంతో పోరాడాల్సిందిగా సూచించారు. తెలంగాణ పథకాలకు ప్రశంసలు దక్కాయి గాని ఆరేళ్ళల్లో ప్రత్యేక నిధులు ఇవ్వలేదని కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ ఎంపీలతో చర్చించారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళమెత్తాలని వారికి స్పష్టం చేశారు కేటీఆర్. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డ కేటీఆర్ జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయి నిధులపై పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించటం పైన సభలో కేంద్రాన్ని డిమాండ్ చేయాలని చెప్పారు. రక్షణ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడం పైన ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న విభజన హామీలపై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు సంబంధిత మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పౌరసత్వ సవరణ చట్టం సీఎఎపై అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిపారు.

వైసిపి పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేయనున్న గల్లా జయదేవ్...

అమరావతిలో నెల రోజులుగా రైతు కుటుంబాలు ఆందోళన చేస్తున్నా ఇంత వరకూ సీఎం గాని ఎమ్మెల్యేలు గాని పట్టించుకోలేదన్నారు ఎంపీ గల్లా జయదేవ్. దీంతో తమ గోడు చెప్పుకోవడానికి అసెంబ్లీకి వెళుతుంటే రైతులతో పాటు టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసులు తమ వాళ్లతోనే మట్టి పెల్లలు వేయించుకుని లాఠీ చార్జి చేశారని ఆరోపించారు. దీనిపై పార్లమెంటుతో పాటు ప్రధాని, కేంద్ర హోం మంత్రికి, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు గల్లా జయదేవ్. నరేగా నిధులు పెండింగ్ పై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్రం మరియు హై కోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నరేగా నిధులు విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ లకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఆ బిల్డింగ్ లకు మాత్రం రంగులు వేసుకుంటుందని విమర్శించారు. ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో ఆ పథకం ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా వినియోగించుకోలేని విధంగా మన రాష్ట్రంలో వినియోగించుకొని అనేక పథకాలతో చంద్రన్న బాటని సీసీ రోడ్లు, కమ్యూనిటీ బిల్డింగ్స్, అంగన్ వాడీ బిల్డింగ్స్, పంచాయతీ బిల్డింగ్ లు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు నరేగా నిధులతో గతంలో టిడిపి చేయించడం జరిగిందని అన్నారు. అటువంటి కార్యక్రమాలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరముందో కేవలం తెలుగు దేశం పార్టీ హయాంలో ఆ కార్యక్రమాలు జరిగాయనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ బిల్లులు కూడా చెల్లించకుండా చాలాకాలం జాప్యం చేశారు అని ఆరోపించారు.  

దేశం ఉలిక్కిపడి ఏడేళ్లు దాటింది... నిర్భయ దోషులకు మిగిలింది కొన్ని గంటలే...

2012 డిసెంబర్ 16న భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున వైద్య విద్యార్ధిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. అంతేకాదు, నిర్భయ ప్రైవేట్ పార్ట్స్ లో తుప్పుపట్టిన ఇనుప రాడ్డును పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఢిల్లీ నడిబొడ్డున ప్రధాన రహదారిపై నడుస్తున్న బస్సులో నిర్భయపై ఇష్టానుసారంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి జీవచ్ఛవంగా మారిన వైద్య విద్యార్ధినిని రోడ్డుపక్కన విసిరేశారు. అలా, మృగాళ్ల చేతిలో దేహమంతా ఛిద్రమై నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన నిర్భయ ఉదంతంపై దేశమంతా భగ్గుమంది. అయితే, ఈ దారుణ సంఘటన జరిగి ఏడేళ్లు దాటిపోయింది. కానీ, దోషులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అయితే, ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత దోషులకు మరణశిక్ష విధించినా... రకరకాల కారణాలతో ఉరిశిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ, ఇక టైమ్ దగ్గరకొచ్చింది. నిర్భయ దోషులకు... ఇంకా, కొన్ని గంటలే మిగిలాయ్. ఈసారి ఎలాంటి అడ్డంకులు రాకపోతే ...ఫిబ్రవరి ఒకటిన నలుగురు దోషులను... ఒకే ఉరికంబంపై... ఒకేసారి... ఒకే సమయంలో... ఉరితీయనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తిచేసిన తీహార్ జైలు అధికారులు.... నిర్భయ దోషుల కోసం ప్రత్యేక ఉరికంబాన్ని సిద్ధం చేయించారు.  నిజానికి, జనవరి 22నే నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా... దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ సుప్రీంను ఆశ్రయించడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఇప్పుడు, మరోసారి ముఖేష్... సుప్రీంలో రిట్ పిటిషన్ వేయడంతో ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత నెలకొంది. అయితే, ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకపోతే... నిర్భయ దోషులైన... వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్‌లను... ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఒకే ఉరికంబంపై ఒకేసారి ఒకే సమయంలో ఉరితీయనున్నారు.

మండలి రద్దు అయితే తాము దురదృష్టవంతులమే అని భావిస్తున్న మండలి సభ్యులు...

మండలి రద్దు ప్రక్రియ ఇంకా పూర్తి కాకున్నా, పరిణామాలు ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పకున్నా ప్రస్తుతం సభ్యులుగా ఉన్న 55 మంది మాత్రం తమ పదవులు కోల్పోతారనే భావనతో ఉన్నారు. తమను తాము దురదృష్టవంతులుగా భావించుకుంటున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో ఉండాల్సిన సభ్యుల సంఖ్య 58. అయితే మూడు ఖాళీలు ఉండటంతో ప్రస్తుతం 55 మంది సభ్యులున్నారు. వచ్చే నెల రెండవ తేదీ (ఫిబ్రవరి 2) నుంచి మొదలుకొని 2025 సంవత్సరం మార్చి వరకు విడతల వారీగా ఈ సభ్యులు రిటైర్ కావాల్సి ఉంది. అతి తక్కువ కాలంలో రిటైరయ్యే సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే 2025వ సంవత్సరం వరకూ గడువు ఉన్న సభ్యులు మాత్రం ఇదెక్కడి గొడవరా అంటూ నిట్టూరుస్తున్నారు. వీరిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఎవరెవరు ఎప్పుడు రిటైర్ కాబోతున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వచ్చే నెల రెండవ (ఫిబ్రవరి 2) తేదీన ఇద్దరు సభ్యులు రిటైర్ కాబోతున్నారు. ఈ రెండు స్థానాలూ గవర్నర్ కోటాలోనే ఉన్నాయి. వీరిలో ఒకరు కంతేటి సత్యనారాయణ రాజు అయితే మరొకరు టి రత్నాభాయి. వీరిలో కంతేటి సత్యనారాయణ రాజు మండలి పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. అటువంటి కంతేటి రాజు మండలి రద్దు ప్రతిపాదన సమయంలోనూ ఉండటాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.  ఇక 2021 ఏడాదికి రిటైరయ్యే సభ్యుల జాబితా పెద్దదిగానే ఉంది. ఎమ్మెల్యే కోటా నుంచి ఎనిమిది మంది ఉన్నారు, వీరిలో టిడిపి నుంచి ప్రస్తుత మండలి ఛైర్మన్ షరీఫ్ మొదలుకొని తిప్పేస్వామి, సంధ్యారాణి, వీవీవీ చౌదరి వంటి నలుగురు సభ్యులు ఉంటే వైసీపీ నుంచి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇటీవలె మండలి లోకొచ్చిన ఇక్బాల్ దేవసాని చిన్న గోవిందరెడ్డి ఉన్నారు అలాగే బిజెపి నుంచి సోము వీర్రాజు ఉన్నారు. హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన ఇక్బాల్ కు మండలిలో స్థానం కల్పించి చట్ట సభల్లోకి ప్రవేశం కల్పించింది వైసీపీ. ఇప్పుడాయన చట్టసభల ముచ్చట మూన్నాళ్లకే పరిమితం కానుంది. ఇక స్థానిక సంస్ధల కోటా నుంచి 2021 ఏడాదిలో రిటైరయ్యే సభ్యుల సంఖ్య పదకొండు మంది అయితే వీటిల్లో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే తొమ్మిది మంది సభ్యులు రిటైర్ కానున్నారు, వీరిలో టిడిపి నుంచి డిప్యూటీ చైర్మన్, రెడ్డి సుబ్రహ్మణ్యం సహా వైవీబీ రాజేంద్ర ప్రసాద్, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, బుద్దా వెంకన్న, ద్వారంపూడి జగదీష్, బుద్ద నాగదీశ్వరరావులు ఉన్నారు. ఇక వైసీపీ నుంచి మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వరులు ఉన్నారు. వీరిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఆయన సతీమణి గాలి సరస్వతీకి కట్టబెట్టింది టిడిపి. ఇక టీచర్ ల కోటా నుంచి ఇద్దరు, గవర్నర్ కోటా నుంచి నలుగురు రిటైర్ కాబోతున్నారు. 2021 తరువాత తిరిగి 2023 ఏడాది లో ఇంకొందరు రిటైర్ కానున్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఏడుగురు ఉంటే వారిలో టిడిపి నుంచి నలుగురు వైసీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. టిడిపి నుంచి రిటైరయ్యే వారిలో చంద్రబాబు తనయుడు లోకేశ్ 2023 లో రిటైర్ కావాల్సి ఉంది.  లోకేష్ తో పాటు బచ్చుల అర్జునుడు, మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత ఉన్నారు. వీరిలో మాణిక్యవరప్రసాద్ ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, పోతుల సునీత పార్టీ మారారు. ఇక వైసీపీ నుంచి రిటైరయ్యే వారిలో మంత్రి మోపిదేవి, ఇటీవల పార్టీలో చేరి ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్న చల్లా రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి వంటి వారు ఉన్నారు. స్థానిక సంస్ధల కోటా నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు. వీరంతా టిడిపికి సంబంధించిన వారే, దీపక్ రెడ్డి, బీటెక్ రవి, కేఈ ప్రభాకర్, బిఎన్ రాజసింహులు, చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజు, శత్రుచర్ల, వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. వీరిలో వాకాటి ప్రస్తుతం బిజెపికి జంప్ అయ్యారు. అలాగే గ్రాడ్యుయేట్స్ కోటాలోని ముగ్గురు రిటైర్ కావలసి ఉంది. అలాగే గవర్నర్ కోటా నుంచి ఇద్దరు రిటైర్ కానున్నారు. ఇక 2025 ఏడాది లో రిటైరయ్యే ఎమ్మెల్సీలనూ అత్యంత దురదృష్టవంతులుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలు ముగిసిన ఏడాది తరవాత కూడా మండలిలో సభ్యులుగా కొనసాగే అవకాశం వీరికుంది. వీరిలో ఎమ్మెల్యేల కోటా నుంచి రిటైరయ్యే సభ్యుల సంఖ్య ఐదుగురు కాగా వీరిలో టిడిపి నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఒకరు రిటైర్ కాబోతున్నారు. టిడిపి నుంచి యనమల, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారాపు రామారావు ఉంటే వైసీపీ నుంచి జంగా కృష్ణ మూర్తి ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కోటా నుంచి కేఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారు 2025 లో రిటైర్ కావలసి ఉంటుంది. టీచర్ ల కోటా నుంచి పాకాలపాటి రఘువర్మ కూడా పీడీఎఫ్ నుంచి ఉన్నారు. వీరిని అత్యంత దురదృష్టవంతులుగా రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.

2020 బడ్జెట్ కేటాయింపులకు సర్వం సిధ్ధం...

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. గత ఏడాది తొలి సారిగా ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రెండో సారి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాల మెప్పు పొందేలా బడ్జెట్ ను రూపొందించడం కత్తిమీద సామే. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసేందుకు ఈ బడ్జెట్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు. శనివారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో ఏయే రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు, ఎలాంటి ఉద్దీపనలు ప్రకటిస్తారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. మౌలిక వసతుల రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే పారిశ్రామిక వర్గాల వ్యక్తిగత పన్నుల భారాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ప్రారంభం కాబోయే క్యాబినెట్ భేటీలో ఈ అంశాలపై చర్చించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏవైనా అమెండ్ మెంట్ బిల్లులు ఉన్నా వాటికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టడానికి వీలుగా వాటిని సిద్ధం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పరిస్థితి ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సారి బడ్జెట్ కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పటికే బడ్జెట్ ఒక ముసాయిదా సిద్ధమైంది దానిని ఎల్లుండి  ప్రారంభమయ్యే పార్లమెంటు ఉభయ సభలలో (ఫిబ్రవరి 1) ఒకటో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టే ముందు మరొకసారి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా దాన్ని ఆమోదించి పార్లమెంట్ లో దానిని ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సారి బడ్జెట్ లో ఎటువంటి అంశాలుండాలి, ఎటువంటి వడ్డింపులు ఉండాలి అనేది సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ ఈ సారి తమకేమైనా వెసులుబాటు లభిస్తుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పన్ను వడ్డింపులు పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకే ఉరికంబంపై... ఒకేసారి... నలుగురు ఉరితీత... తీహార్ జైలు సరికొత్త రికార్డు

ఏడేళ్లుగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిర్భయ దోషులను ఫిబ్రవరి ఒకటిన ఉదయం ‎ఆరు గంటలకు ఉరితీయనున్నారు. ఒకే ఉరికంబంపై... ఒకేసారి... ఒకే సమయంలో... నలుగురినీ ఉరి తీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. నిర్భయ దోషుల కోసం ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఉరికంబంపై తలారులతో డమ్మీ ఉరితీత ప్రక్రియ నిర్వహించారు. దోషుల ఎత్తు, బరువునకు సమానమైన ఇసుక సంచులను ఉరికొయ్యపై వేలాడదీశారు. అలాగే, ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి తెప్పించిన ఉరితాళ్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ పరిశీలించారు. ఇదిలా ఉంటే, ఒకేసారి నలుగురిని ఉరి తీయబోతున్న కారాగారంగా తీహార్ జైలు సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరితీసిన సందర్భాలుండగా... మొదటిసారి నలుగురినీ ఒకే ఉరికంబంపై ...ఒకే సమయంలో ఉరి తీయబోతున్న జైలుగా రికార్డులకెక్కబోతోంది. అయితే, తీహార్ జైల్లో కూడా ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరి తీసేందుకు వీలుండగా... ఇప్పుడు, నలుగురు నిర్భయ దోషులను ఒకేసారి తీయాల్సి ఉండటంతో... ప్రత్యేకంగా ఉరికంబాన్ని సిద్ధంచేశారు. నలుగురినీ ఒకేసారి ఉరితీసేందుకు అనుగుణంగా జేసీబీతో పెద్ద గుంతను తవ్వించారు. అలాగే, ఉరి తీసిన తర్వాత అక్నడ్నుంచి మృతదేహాలను తరలించేందుకు అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మించారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడమే కాకుండా... దారులన్నీ మూసుకుపోవడంతో ఫిబ్రవరి ఒకటిన ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసేశారు. అయితే, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ మరోసారి సుప్రీంను ఆశ్రయించాడు. సహా దోషి అక్షయ్ సింగ్ తనపై అనేకసార్లు జైల్లో లైంగిక దాడి చేశాడని, ఇదంతా జైలు అధికారుల ప్రోద్బలంతోనే జరిగిందంటూ రిట్ పిటిషన్ వేశాడు. దాంతో, ముఖేష్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. దాంతో, నిర్భయ దోషుల ఉరితీతపై మరోసారి సందిగ్ధత నెలకొంది.

దిశ కేసులో కీలకంగా సీసీటీవీ విజువల్స్... ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన నిజాలు...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిశ కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. పోలీసులు అందజేసిన సాక్ష్యాధారాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు మరో రెండ్రోజుల్లో నివేదికను అందజేయనున్నారు. దిశ రేప్ అండ్ మర్డర్ ఘటనలో మొత్తం 40 సాక్ష్యాధారాలను పోలీసులు పరీక్షలకు పంపగా... ఫోరెన్సిక్ నిపుణులు సునిశిత సూక్ష్మ విశ్లేషణ చేశారు. ముఖ్యంగా తొండుపల్లి టోల్‌ప్లాజా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన నిందితుల దృశ్యాలే దిశ కేసులో అత్యంత కీలకంగా మారాయి. నిందితులు దిశలో మాట్లాడటం... దిశను లారీ దగ్గరకు లాక్కెళ్లడంలాంటి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అయితే, సీసీటీవీ విజువల్స్ అస్పష్టంగా ఉండటంతో... అవి స్పష్టంగా కనిపించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు కృషిచేశారు. ముఖ్యంగా మహ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, నవీన్‌లు.... దిశను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలను... అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి మరింత సృష్టంగా కనిపించేలా డెవలప్ చేశారు.  అలాగే, తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర్నుంచి దిశ... ఆమె సోదరితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను విశ్లేషించారు. దిశ తన సోదరితో మాట్లాడుతుండగా నిందితుల వాయిస్ కూడా రికార్డయినట్లు తెలుస్తోంది. అలాగే, సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల వాయిస్‌లను పరీక్షించి... ఆ స్వరాలు వాళ్లవేనని తేల్చారు. అదేవిధంగా, దిశ 15రోజుల కాల్ డేటాను, మొబైల్లో ఉన్న ఫోన్‌ నెంబర్లు, ఎస్‌ఎంఎస్‌లను కూడా విశ్లేషించారు. అంతేకాదు ఘటన జరిగిన రోజు నుంచి అంతకుముందు 15రోజుల వరకు దిశ ఎవరెవరితో మాట్లాడిందో వివరాలు సేకరించి నివేదికలో పొందుపర్చారు. ఇక, దిశ ఘటన జరిగిన రోజు... రాత్రి 9గంటల నుంచి 9-40 వరకు నిందితుల ఫోన్ సిగ్నల్స్ తొండుపల్లి ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు.  అయితే, దిశ హత్యాచార ఘటనలో అత్యంత కీలకమైన దృశ్యాలు తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరున్న సీసీ కెమెరాల్లోనే నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడా దృశ్యాలే దిశ కేసులో అత్యంత కీలకంగా మారాయి. మరోవైపు, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన రివాల్వర్లను, తూటాలను బాలిస్టిక్ నిపుణులు పరిశీలించి రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు దాదాపు తుది దశకు చేరుకోవడం... మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా సిద్ధమవడంతో... త్వరలోనే ఢిల్లీ బృందం హైదరాబాద్ కి రానుంది. దిశ ఘటన జరిగిన నాటి నుంచి నిందితుల ఎన్ కౌంటర్ వరకు నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

అన్యాయం జరిగితే సహించను... అధికారులకు జగన్ హెచ్చరిక...

ఫిబ్రవరి ఒకటి నుంచి 21లోపు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులను డోర్ డెలివరీ చేయాలంటూ అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఫిబ్రవరి 15కల్లా ఇళ్ల పట్టాల లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. పది రూపాయల స్టాంపు పేపర్ల మీద మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు  ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏదో మొక్కుబడిగా ఇవ్వకుండా, నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలను కేటాయించి... ఉగాదినాడు లబ్దిదారుల్లో సంతోషం నింపాలని జగన్మోహన్‌రెడ్డి సూచించారు. అలాగే, ఫిబ్రవరి 15నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఫిబ్రవరి ఒకటి నుంచి వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత చేపడతామన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇకపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించనున్నట్లు జగన్ తెలిపారు.  అదేవిధంగా ఫిబ్రవరి 28న 3వేల 300 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ-వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నామని, అయితే 336 సర్వీసులు 72గంటల్లోనే పూర్తిచేసి తీరాలని సూచించారు. ఇక, ఫిబ్రవరి 28నుంచి దాదాపు 11లక్షల మందికి విద్యావసతి దీవెన అమలు చేయబోతున్నట్లు తెలిపిన జగన్... మధ్యాహ్నం భోజనం నాణ‌్యత విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్లకు ఆజ్ఞాపించారు. ఆర్డీవోలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తూ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఇక, ఫిబ్రవరి చివరి నాటికి దాదాపు అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ విధానం అమలు కావాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అన్ని చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలందరి ముఖాల్లో సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హులైనవారందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నారు. తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు అర్హుల జాబితాను కచ్చితంగా తనిఖీ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు.