25 న ఫలితాలు... 27న మేయర్లు, చైర్మన్ల ఎంపిక!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది నగరపాలికలు, 120 పురపాలికలకు పోలింగ్ జరిగింది. 120 పురపాలక సంఘాల్లో 74.73 శాతం పోలింగ్ జరగగా.. 9 నగర పాలక సంస్థలో 58.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 7,613 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు నెలకొన్నాయి. 120 మున్సిపాలిటీలలో 2,727 వార్డులకు ఇప్పటికే 80 ఏకగ్రీవం అయ్యాయి. 2,647 వార్డులకు పోలింగ్ జరిగింది. తొమ్మిది కార్పొరేషన్లలో 325 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. 324 డివిజన్లకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రెటర్ హైదరాబాద్ శివార్లలో కార్పొరేషన్లు , మునిసిపాల్టీల్లో ఓటింగ్ శాతం తగ్గింది. దొంగ ఓట్లు పడకుండా కొంపల్లిలో తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ యాప్ కూడా వినియోగించారు ఎన్నికల అధికారులు. బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు శనివారం కౌంటింగ్ జరగబోతుబడటంతో..అభ్యర్ధుల భవితవ్యం తేలుతుంది. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల అధికార పార్టీ విపక్షాలకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. నిజామాబాద్ లో 41 వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో టిఆర్ఎస్, బిజెపి నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఇరు పార్టీ నేతలను చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ 8 వ వార్డులో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరిని కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. అక్కడ 60 కార్పొరేటర్ స్థానాలకు రెండు ఏకగ్రీవమయ్యాయి. 58 డివిజన్లకు ఈ నెల 24 న పోలింగ్ జరగబోతోంది. కరీంనగర్ లో ఈ నెల 27 న ఓట్ల లెక్కింపును చేపట్టబోతున్నారు. కాగా.. మేయర్లు, చైర్ పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం, కొత్త పాలక మండలి తొలి సమావేశం తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది.

చంద్రబాబు ఫోన్ లాక్కున్న మార్షల్స్... బాలయ్యతో సెల్ఫీలకు వైసీపీ ఎమ్మెల్యేల పోటీ... 

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. మండలి సమావేశాలు అత్యంత ఉత్కంఠగా సాగుతున్న సమయంలో చంద్రబాబుతోపాటు గ్యాలరీకి వచ్చిన బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు సరదాగా ముచ్చటించారు. అనంతరం, వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కాసు మహేష్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్యచౌదరి, వసంత కృష్ణప్రసాద్, శ్రీనివాసులు తదితరులు బాలయ్యతో సెల్ఫీ దిగారు. దాదాపు పది పదిహేను మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ సెల్ ఫోన్లతో సెల్ఫీలు దిగుతూ హడావిడి చేశారు. అయితే, ఇక్కడే వివక్ష బయటపడింది. మండలి సమావేశాలు అత్యంత ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో చంద్రబాబు కౌన్సిల్ కి వచ్చారు. అయితే, చంద్రబాబు గ్యాలరీలో కూర్చునేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... సెల్ ఫోన్ ఇచ్చేయాలని మార్షల్ కోరారు. దాంతో, రూల్స్ అలాగే ఉంటే ఫోన్ తీసుకోండంటూ మార్షల్స్ ను ఇచ్చేసి గ్యాలరీలో కూర్చున్నారు చంద్రబాబు. అయితే, ఇక్కడే వివక్ష బయటపడింది. అదే మండలి గ్యాలరీలోకి పదుల సంఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వచ్చారు. అయితే, వాళ్లంతా సెల్ ఫోన్లు వినియోగించారు. బాలకృష్ణతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.   అయితే, చంద్రబాబు దగ్గర సెల్ ఫోన్ తీసుకున్న మార్షల్స్... మరి, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల దగ్గర ఎందుకు తీసుకోలేదని టీడీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. తమకో రూల్... అధికార పార్టీకో రూలా? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై మార్షల్స్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పిచ్చి వేషాలు వేసినందుకే ఒకసారి దాడి జరిగింది.. మర్చిపోవద్దు ఓవైసీ!!

ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ,  టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి మద్య మాటల యుద్దం కాకరేపుతోంది. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరోక్షంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన కొడుకు సాయిను ఉద్దేశించి అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ నుండి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఒకసారి గెలిస్తే రెండు సార్లు ఓడతారంటూ ఎద్దేవా చేశారు అక్బరుద్దీన్. ఆయన కొడుకును కూడా గెలిపించలేకపోయారన్నారు. తాను ఐదు సార్లు చాంద్రాయణగుట్ట నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నానని అన్నారు. వారికి దమ్ముంటే చాంద్రాయణగుట్ట నుండి పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు అక్బరుద్దీన్ ఓవైసీ. తాను దేశంలో ఎక్కడ నుండైనా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు అక్బరుద్దీన్. దీని పై అంతే ఘాటుగా స్పందించారు తలసాని సాయికుమార్ యాదవ్. గతంలో బుల్లెట్ దెబ్బలు తిని కత్తిపోట్లకు గురైన ఒవైసీ దేశం కోసం త్యాగం చేయలేదన్నారు సాయి. పిచ్చి వేషాలు వేయటం వల్లే నీపై దాడి జరిగిందని.. ఆ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మిత్రపక్షం మీద అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు సాయి యాదవ్.

ఆర్డినెన్స్ కూడా ఇవ్వలేరా? యనమల కీలక కామెంట్స్

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో ఏం చేయాలనే దానిపై జగన్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని పట్టుదలగా ముందుకెళ్లిన వైసీపీ ప్రభుత్వానికి కౌన్సిల్ లో చుక్కెదురు కావడంతో నెక్ట్స్ ఏం చేయాలనే దానిపై పార్టీ ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ముఖ్యంగా మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మూడు రాజధానుల బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై మంతనాలు జరిపారు. పార్టీ ముఖ్యనేతలతోపాటు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. అలాగే, హైకోర్టులో పెద్దఎత్తున దాఖలైన పిటిషన్లపైనా ప్రభుత్వ వాదనలు ఎలా ఉండాలన్నదానిపై ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీతో చర్చించారు. అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలే కాదు... కొన్నేళ్లు కూడా పట్టొచ్చని కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలే అయినా... అవసరమైతే పొడిగించవచ్చని అన్నారు. సెలెక్ట్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందని యనమల గుర్తుచేశారు. ఈ ప్రక్రియకు ఒక్కోసారి ఏళ్లు కూడా పడతాయన్నారు. అంతేకాదు, బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి కూడా వీలు ఉండదని యనమల అన్నారు. అసలు మండలిని ప్రోరోగ్ చేయకుండా ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదన్నారు. మరోవైపు ఆర్డినెన్సులను గతంలో రాష్ట్రపతి తిరస్కరించారని, అలాగే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చినా కోర్టులో నిలబడదని యనమల అభిప్రాయపడ్డారు. అలాగే, రూల్ 154 కింద మండలి ఛైర్మన్ విచక్షణాధికారాలను కోర్టులు కూడా ప్రశ్నించలేవని యనమల అన్నారు.  

మండలిలో అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు: సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లుకు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. గవర్నమెంటు ప్రైమరీ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం పర్సెంటేజ్ కేవలం 23.67% శాతం మాత్రమే ఉందని సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. మొత్తం మీద 35% కూడా దాటని పరిస్థితి ఉందని అదే ప్రైవేట్ స్కూల్స్ లో 98.5% శాతం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మరెన్ని సంవత్సరాలు పేదవాళ్ల చదువు అలాగే ఉండాలని..  కేవలం పేదలకు ఇంగ్లీష్ చదువులు రాకూడదన్న కుట్రపూరితమైన పరిస్థితులను మార్చాలని.. మన వ్యవస్థను మార్చాలని.. పేదవాడికి భావి ప్రపంచంలో కూడా పోటీ పడే పరిస్థితి తీసుకొని రావాలనే తాను ఎంతగానో కృషి చేయనున్నట్లు జగన్ తెలియజేశారు. నేటి తరంలో కంప్యూటర్స్ లో కానీ ఎక్కడ చూసినా ఇంగ్లీష్ భాషనే ఎక్కుగా ఉంటుందని.. మంచి జీతాలతో మంచి జీవితాన్ని గడపాలంటే ఇంగ్లీషు భాష మాట్లాడగలిగితేనే సాధ్యపడుతుందని ఆయన అన్నారు. ప్రపంచంతో తాము ముందుకు నడవాలని.. పేదరికంలో ఉన్న వాళ్ళ బ్రతుకులు బాగుపడాలని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు జగన్ స్పష్టం చేశారు. ఇదే బిల్లును కొద్ది నెలల కిందట తీసుకొస్తే.. రైట్ టు ఎడ్యూకేషన్ కాదు రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో ఈ బిల్లును ప్రతిపాదించినట్లు జగన్ పేర్కొన్నారు. పేదవాడికి మంచి జరిగే ఈ బిల్లును ప్రతిపాదిస్తే దానిని కూడా కౌన్సిల్ లో అడ్డుకున్నారని కానీ ఈ బిల్లును ఎవరు ఆపినా ఆగేది లేదని, మధ్యాహ్న భోజన పథకం కింద మంచి మెనూను సిద్ధం చేసి దానికి గోరుముద్దా అని పేరు పెట్టి పేద పిల్లలకు అందించినట్లు స్పష్టం చేశారు.  జూన్ 1వ తేదీనే పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు, నోట్ బుక్కులు, టెక్స్ట్ బుక్కులు, మూడు జతల యూనిఫాంలు, బూట్లు, సాక్సులు, బెల్టులు.. పెట్టి ఒక కిట్టు ఇస్తున్నట్లు తెలిపారు. దాదాపుగా ఒక పిల్లాడి పై రూ.1355 రూపాయల కేటాయింపు చేస్తూ దాదాపుగా 36 లక్షల 10 వేల మంది పిల్లలకు విద్యా కానుక కింద జూన్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు జగన్ తెలియజేశారు. తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకూడదని పిల్లలందరికి మామగా తాను ఈ కానుకను ఇవ్వనున్నట్లు జగన్ వెల్లడించారు. ఈ బిల్లు ఇక్కడ ఆమోదం తెలిపితే ఆపడానికి ఇంకేమి ఉండదని జగన్ తెలిపారు.

అమరావతిలో దళితుల భూములు స్వాహా.. చిక్కుల్లో టీడీపీ మాజీ మంత్రులు!!

ఓ వైపు ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా తెల్లరేషన్ కార్డుదారుల భూములు కొన్న వ్యవహారం సంచలనం రేకెత్తిస్తుంటే మరో వైపు మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు నారాయణ పై సీఐడీ కేసు పెట్టడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తమను బెదిరించి భూములు లాక్కున్నారంటూ బుజ్జమ్మ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది సీఐడీ. గుంటూరు జిల్లా , వెంకటపాలానికి చెందిన బుజ్జమ్మకు 90 సెంట్ల అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమిని మాజీ మంత్రులు లాక్కున్నారని ఆరోపించింది బుజ్జమ్మ. ఆ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రులపై సక్షన్ 420,506,120/B కింద కేసు పెట్టింది సీఐడీ. మరోవైపు తన పై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ప్రత్తిపాటి పుల్లారావు. బెల్లంకొండ నరసింహారావు అనే వ్యక్తి ద్వారా బెదిరింపులకు పాల్పడి తమ వద్ద ఈ భూములను కొనుగోలు చేశారంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి కొన్ని కీలకమైన విషయాలు కూడా సేకరించినట్లు సమాచారం. అమరావతి పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి.. మొత్తం ఆరు మండలంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దళితులకు అండగా ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన భూములను బలవంతంగా బెదిరించి తీసుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ పై సీఐడీ కేసు పెట్టడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు... బాబుతో టచ్ లో ఉన్నారు

సాధారణంగా విపక్ష ఎమ్మెల్యేలు... అధికార పార్టీతో టచ్ లో ఉండటం సహజం. వీలు కుదిరితే, అధికార పార్టీలోకి జంప్ చేస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీయే... రివర్స్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ గంభీరం ప్రదర్శిస్తూ ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనే చేసి ఇరకాటంలో పడ్డారు. జగన్ చేసిన ఆ ప్రకటన తర్వాతే... ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు... 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని షాకిచ్చారు. అయితే, ఇలాంటి ప్రకటనలు... మెజారిటీ ఫిగర్ కు కొంచెం అటూఇటుగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య బలాబలాలు ఉన్నప్పుడు చేస్తేనే కొంతలో కొంత నమ్మశక్యంగా ఉంటాయి. కానీ, అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్నపుడు అలాంటి ప్రకటనలు బెడిసికొడుతుంటాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే జరిగింది. అయితే, టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య ఇప్పుడు అలాంటి ప్రకటనే చేశారు. సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తీరుతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని... వాళ్లంతా చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని... త్వరలోనే వాళ్లు టీడీపీలో చేరతారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాబోయే కాలమంతా జగన్ కు అగ్నిపరీక్షే అన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ముందుకెళ్తోన్న జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు తప్పవన్నారు. అయితే, వేమూరి ఆనంద సూర్య వ్యాఖ్యలు  అంత నమ్మశక్యంగా లేకపోయినా... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రకటనలాగే పరిగణించాల్సి ఉంటుంది.

మండలిలో విజయం గుండె ధైర్యాన్ని ఇచ్చిందంటున్న రైతులు

షరీఫ్ నినాదాలతో తుళ్లూరు మహా ధర్నా శిబిరం మారుమోగిపోతోంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు సెలెక్టు కమిటీ పంపాలన్న ఆయన నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిందంటూ రాజధాని రైతులు, మహిళలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహాధర్నా 36 రోజులను పూర్తి చేసుకుంది. నేడు 37 వ రోజు  మహాధర్నా శిబిరంలో పాల్గొన్నారు. ఇన్ని రోజులు పడిన శ్రమకు కాస్త ఉపశమనం లభించిందని అంటున్నారు రైతు జేఏసీ. తమ గోడును శాసన మండలి కనీసం ఆలకించిందని.. ఈ ఉపశమనం మాత్రం తమకు గొప్ప మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందంటున్నారు. నిన్న ( జనవరి 22వ తేదీన ) జరిగిన శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లుకు తాత్కాలిక బ్రేక్ పడింది . న్యాయ పోరాటం చేయటం వల్ల న్యాయం గెలిచిందని.. ఈ ఉద్యమానికి ఇదే మొదటి విజయం అని రైతులు అంటున్నారు. ఇక్కడితో ఇది ఆగదని అమరావతి ప్రజలు వెల్లడించారు. శాసన మండలి తీర్పుతో ఉద్యమాలు చేసేవాళ్ళకి మరింత బలం చేకూరుతుందని అమరావతి ప్రజలు తెలియజేస్తున్నారు. అమరావతిని అక్కడ నుంచి కదిలివ్వమని చెప్పేవరకు న్యాయ పోరాటం సాగుతూనే ఉంటదని అన్నారు. నిన్నటి తీర్పు అందరికి గుండె నిబ్బరం, స్ఫూర్తిని నింపిందని అక్కడి ప్రజలు తెలిపారు.  

దౌర్జన్య రాజ్యం.. మండలి చైర్మన్ ను బెదిరించిన వైసీపీ నేతలు!!

తెలుగుదేశం ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారని తెలుగు దేశం అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ధ్వజస్థంభాల్లా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని.. వారి స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. అయితే మండలి చైర్మన్ ఫరూక్, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడారన్నారు. లోకేష్ పై ముగ్గురు మంత్రులు దౌర్జన్యం చేశారన్నారు. ఉన్మాదం పై పోరాడటానికి సర్వశక్తులు పెట్టాలని ధైర్యం నూరి పోశారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల రామకృష్ణుడు నిరూపించారన్నారు చంద్రబాబు. అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు రింగు దాటితే బయటపడేయాలంటూ మార్షల్స్ ను ఆదేశించిన సీఎం జగన్ మండలి లో చైర్మన్ పోడియం ఎక్కి పేపర్లు చించేసిన వైకాపా ఎమ్మెల్సీలను ఏం చేయాలో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 25 మంది మంత్రుల మండలిలో తిష్ఠవేసి వీరంగం సృష్టించారని చైర్మన్ షరీఫ్ పై దాడి చేసినంత పని చేశారని మండిపడ్డారు. చైర్మెన్ కు పిల్లలూ.. మనువళ్లు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారని చంద్రబాబు ఆరోపించారు.

శాసనమండలిలో ఎదురుదెబ్బ ఎఫెక్ట్... సతమతమవుతున్న వైసీపీ!!

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసన మండలి నిర్ణయంపై న్యాయ నిపుణులు, వైకాపా ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో గంట పాటు సాగిన సమావేశంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి , అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం, వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందకపోవటం పై ప్రధానంగా చర్చించారు. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం పై ప్రభుత్వ పరంగా తదుపరి వ్యూహం ఎలా ఉండాలనే అంశంపైన మంతనాలు జరిపారు. ఈ విషయంలో సీఎం జగన్ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాజధాని రైతుల పిటిషన్ పై హై కోర్టులో విచారణకు సంబంధించిన అంశం పై కూడా చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణ పై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు. ఈసారి రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. ఎదురుదెబ్బలు తగలకుండా ముందుకు సాగేలా నిర్ణయాలను తీసుకోవాలని నేతలకు దిశా నిర్ధేశం చేశారు జగన్.

కొత్త చిక్కుల్లో కాంగ్రెస్... వరంగల్ జిల్లా సహకార బ్యాంకు రుణాల్లో అవినీతిపై విచారణ!!

ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పంట రుణాలు లీజుల పేరుతో 7 కోట్ల 90 లక్షల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు రెండేళ్ల క్రితం కలకలం రేపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి బ్యాంకు చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలకు గేట్లు ఎత్తారని విమర్శలు ఆనాడు చుట్టుముట్టాయి. ఆయన 2013 నుంచి 2017 వరకు బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. ఆనాటి అక్రమాల అంతు తేల్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. విచారణను సీఐడీకి అప్పగించింది. దీంతో జిల్లాలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది.  రెండేళ్ళుగా పెండింగ్ లో ఉన్న కేసు ఒక్కసారిగా దుమ్ముదులపడం ఏమిటనేది మొదటి ప్రశ్న.. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది రెండో అంశంగా మారింది. సీఐడీ నెట్ పరిధిలోకి ఎవరెవరు వస్తారో అనేది మూడో ప్రశ్నగా జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు మునిసిపల్ ఎన్నికల హడావుడి నుండి ఇంకా బయటకు రాని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆదేశాల గురించి తెలుసుకొని ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఈ విచారణ ద్వారా జంగా రాఘవరెడ్డినే లక్ష్యంగా చేసుకున్నారా లేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా టార్గెట్ పెట్టారా అనేది ఉత్కంఠ రేపుతోంది.  జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవ రెడ్డి మునిసిపల్ ఎన్నికల్లో అన్నీ తానై కాంగ్రెస్ కు వ్యవహరించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు సన్నిహితుడిగా ఆయన అండదండలతో పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవరెడ్డి. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కొండామురళి, సురేఖ పేర్లు వినిపించాయి. కొండా మురళీ అనుచరుడిగానే కాంగ్రెస్ లోకి అడుగుపెట్టారు జంగా రాఘవ రెడ్డి. కొండా దంపతులు అనేక పార్టీలు తిరిగి తిరిగి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ కాగా రాఘవ రెడ్డి మాత్రం వారితో సమానంగా రాజకీయం చేసే ఎత్తుకు ఎదిగారని పార్టీలో టాక్. ముఖ్యంగా జనగామ జిల్లాలో జంగాకు చెక్ చెప్పాలని భావిస్తున్న మంత్రి దయాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఒత్తడి తెచ్చి రాజకీయంగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గ్రామీణ స్థాయిలో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు. జంగాకు ధీటుగా ఎర్రబెల్లి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ జనాలను కలుస్తున్నారు. దీంతో జంగాతో ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మంత్రి ముందు గానే బ్రేకులు వేసేందుకు సిద్ధపడ్డారని జనాల టాక్. ఒక్క జంగానే కాదు సీఐడీ విచారణ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ నేతలందరికీ టీఆర్ఎస్ ఝలక్ ఇవ్వబోతున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఆది లోనే వారి దూకుడుకు బ్రేక్ వేయాలన్న చూస్తోంది అధికార పార్టీ. అయితే డీసీసీబీ రూపంలో వారికి అవకాశం చిక్కడంతో దానిని వినియోగించుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

రాజధానిపై బీజేపీ డబుల్ గేమ్.. పవన్ పరిస్థితి ఏంటి?

మూడు రాజధానుల అంశంపై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఓ వైపు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు.. మరోవైపు మండలిలో జగన్ సర్కార్ కి అండగా నిలబడ్డారు. ఈ పరిణామాలతో అసలు బీజేపీ స్టాండ్ ఏంటో అర్థంగాక... సామాన్యుల నుండి రాజకీయ విశ్లేషకులు వరకు తలలు పట్టుకుంటున్నారు. రాజధాని విషయంలో మొదటి నుండి బీజేపీ నేతలు రోజుకో ప్రకటన చేస్తూ అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. ఒక నేత ఏమో రాజధానికి మేము వ్యతిరేకం అడ్డుకుంటాం అంటారు, ఒకరేమో మంచి నిర్ణయమే అంటారు.. ఇంకో నేతేమో రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. ఇలా ఒక్కో నేత ఒక్కో ప్రకటన చేస్తూ.. రాజధాని మార్పుకు బీజేపీ అనుకూలమో వ్యతిరేకమో అర్థంకాకుండా చేస్తున్నారు. మరోవైపేమో, కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ దోస్త్ జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారు ఖండిస్తున్నారు. వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని, మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్రం సమ్మతి లేదని అంటున్నారు. అయితే వీరి మాటలకు, బీజేపీ చేతలకు అసలు పొంతన కుదరడం లేదు. మండలిలో బీజేపీ సభ్యుల తీరే దానికి నిదర్శనం.   మండలి లో బీజేపీకి సంబందించిన 3 సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి సహకరించారు. వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి వైసీపీతో కలిసి ఛైర్మెన్ పై ఒత్తిడి తెచ్చారు. రూల్ 71 పై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి, ప్రభుత్వ నిర్ణయానికి మేము వ్యతిరేకం అని చెప్పే అవకాశం ఉన్నా అది ఉపయోగించుకోలేదు. దీనిబట్టి చూస్తుంటే బీజేపీ మాటలకు, చేతలకు పొంతన లేదని అనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి బీజేపీ వ్యతిరేకమైతే.. మరి మండలిలో ఆ పార్టీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశమున్నా ఎందుకు ఉపయోగించుకోలేదు?. ఇదంతా చూస్తుంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గేమ్ లో పవన్ బలి అవుతున్నారా?.. అది ఆయనే ఆలోచించుకోవాలి.

పార్టీ కీలక నేతలతో జగన్ వరుస భేటీలు.. ఊహించని స్టెప్ పడనుందా?

మూడు రాజధానుల బిల్లుకు మండలిలో అడ్డుపుల్ల పడడంతో తర్వాత అడుగులు ఎలావేయాలన్న దానిపై వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరుస భేటీలతో దీని గురించి చర్చిస్తున్నారు. ఈ రోజు ఉదయం వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి.. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశం వికేంద్రీకరణ బిల్లేనని తెలుస్తోంది. రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఏపీ మంత్రులు, తమ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుపై వారు కీలక చర్చలు జరుపుతున్నారు. తమ తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై జగన్ చర్చించి.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ చీఫ్ తో పవన్ భేటీ... కేంద్రం మనసులో మాట తెలిసిపోయింది!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, బీజేపీ ఎంపీ జీవీఎల్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. రాజధాని అమరావతి తరలింపుతో పాటు అసెంబ్లీ, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలను పవన్, నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని.. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు తనకు స్పష్టం చేశారని పవన్ చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అసత్య ప్రచారాన్ని.. జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భూదందాల కోసమే వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని పవన్ ఆరోపించారు.

రెక్కలు రానున్న తెలంగాణ భూముల మర్కెట్ విలువ...

  తెలంగాణలో భూముల మార్కెట్ విలువకు త్వరలో భారీగా పెరగనున్నాయి.భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయంగా అంచనా వెయ్యాలి అంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రాంతాల వారీగా ఉన్న బహిరంగ మార్కెట్ విలువలను ఆధారంగా చేసుకొని రేట్లను నిర్ణయించాలని సూచించింది. ఇప్పటికే కొత్త మార్కెట్ విలువలతో ప్రతిపాదనలనూ స్టాంపులు రిజిస్ట్రేషన్ ల ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయం తయారు చేసింది. ఆయా ప్రాంతాలకు  అనుగుణంగా 35 నుంచి 150% వరకు మార్కెట్ విలువలను పెంచుతూ వీటిని రూపొందించింది.పెంపు ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి సోమేష్ కుమార్ కు అందచేసింది. ఈ ప్రతిపాదనలను పునః పరిశీలించాలి అంటూ తిరిగి రిజిస్ర్టేషన్ల శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ ను ఆదేశించారు. కొత్తగా రాబోతున్న పారిశ్రామిక కారిడార్ లు క్లస్టర్ లు ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాలను ఆధారంగా చేసుకొని రేట్లను అంచనా వేయాలని ఆదేశించారు. మార్కెట్ రేట్లతో పోల్చి చూస్తే ప్రభుత్వ మార్కెట్ విలువలు శాస్త్రీయంగా నిక్కచ్చిగా ఉండాలని సూచించారు. దీంతో రిజిస్టేషన్ల అధికారులు మళ్లీ కసరత్తు మొదలు పెట్టారు. ఏ ప్రాంతంలో బహిరంగ మార్కెట్ విలువ ఎంతుంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందన్న వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలలు వెలుస్తున్నాయి. ములుగు ప్రాంతంలో ఉద్యానవన యూనివర్శిటీ అందుబాటులోకి వచ్చింది. గిరిజన వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వంటివి ఏర్పాటు కావాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. కొన్ని జాతీయ రహదారుల విస్తరణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ లను తయారు చేసి కేంద్రానికి అందజేసింది.ఇలాంటి ప్రాజెక్టులు, కారిడార్లు, హైవేలు, విద్యా సంస్థలు ఏర్పడే ప్రాంతాల చుట్టుప్రక్కల భూములు స్థలాల విలువలు అనూహ్యంగా పెరగనున్నాయి. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువలను రూపొందించనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి అర్బన్ ప్రాంతాల్లో లెక్కలోకి రానున్నాయి.  జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో గజం ధర లక్షకు పైగానే పలుకుతోంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధర మాత్రం ఇప్పటికీ నలభై వేల రూపాయలే ఉంది. ఇలా పెరిగిన రేట్లను పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయంగా మార్కెట్ విలువలను అంచనా వేయనున్నారు. చాలా చోట్ల వంద శాతానికి పైగా రేట్లు పెరిగాయి.కొన్ని చోట్ల 150 నుంచి 250 శాతం వరకు రేట్లను పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గా లు చెప్తున్నాయి. త్వరలో ప్రభుత్వ మార్కెట్ విలువల పెంపు పై అధికారికంగా ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు.తెలంగాణలో సామాన్య ప్రజలు ముందుముందు భూములు కొనాలంటే నిజంగానే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి.   

జగన్ సర్కార్ కి షాక్... ఫలించిన బాబు వ్యూహం.. మూడు రాజధానుల బిల్లుకి బ్రేక్!

జగన్ ప్రభుత్వానికి మండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల బిల్లును ఎలాగైనాసరే ఆమోదించుకోవాలనుకున్న వైసీపీ సర్కారుకు ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి, బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీ వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది. మంగళవారం రూల్ 71తో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చేసుకున్న ప్రతిపక్ష టీడీపీ తాను అనుకున్నట్లుగా ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో సక్సెసైంది. దాంతో, మూడు రాజధానుల ప్రక్రియ మూడు నెలలపాటు ఆగిపోనుంది.  ఎందుకంటే, ఏ బిల్లు అయినాసరే సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తే ఆ ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లు సెలెక్ట్ కమిటీ వెళ్లకుండా చేయాలని జగన్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా వీగిపోయినా ఫర్వాలేదని ప్రభుత్వం భావించింది. కానీ వైసీపీ సర్కారు వ్యూహాన్ని టీడీపీ తెలివిగా దెబ్బకొట్టింది. దాంతో, ఆగమేఘాల మీద రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ముగించాలనుకున్న జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. అనేక పరిణామాలు, అత్యంత ఉత్కంఠ మధ్య మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ శాసనమండలి నిర్ణయం తీసుకుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాదాపు 20మంది మంత్రులు మండలికి రావడమే కాకుండా, బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిపక్ష టీడీపీ పైచేయి సాధించింది. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడంతో వైసీపీ వ్యూహాలను అడ్డుకునేందుకు కౌన్సిల్ గ్యాలరీలోనే కూర్చున్న చంద్రబాబు.... టీడీపీ ఎమ్మెల్సీలను గైడ్ చేస్తూ... రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చక్రం తిప్పారు. అయితే, ఓటింగ్ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు లాగేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఏకంగా 20మందికి పైగా మంత్రులు కౌన్సిల్ కు రావడమే కాకుండా అత్యధిక సమయం మండలిలోనే గడిపారు. పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన సైతం చేయడంతో కొద్దిసేపు మండలిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించడంతో మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లింది.  

అమరావతి పై దాఖలైన 5 పిటీషన్ ల పై విచారణలు చేపడుతున్న హైకోర్ట్...

ఏపీ హైకోర్టులో అమరావతి పై దాఖలైన పిటిషన్ లపై విచారణ మొదలైంది. కర్నూలుకు హై కోర్టు తరలింపు సవాల్ చేస్తూ మొదటి పిటిషన్, మూడు రాజధానుల నిర్ణయం పై 37 మంది రైతుల పిటిషన్ వేశారు. సీఆర్డీఏకు రైతులు ఇచ్చే వినతి గడువు పెంచాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు పై ఇంకో పిటిషన్, సీఆర్డీయే రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పై నాలుగో పిటిషన్ ఇలా దాఖలైన  పిటిషన్ల పై ఏపీ హై కోర్టు విచారణ చేపట్టింది.ఏపీ హై కోర్టులో అమరావతికి సంబంధించి ఐదు కీలకమైన 5 పిటిషన్ ల మీద  హై కోర్టు విచారణను చేపట్టింది. ప్రధానంగా  కర్నూల్ కి హై కోర్టు తరలింపు విషయంలో న్యాయవాదులు స్థానికంగా ఉన్న  రైతులందరూ  హైకోర్టును తరలించటానికి వీల్లేదంటూ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు.రెండువ పిటీషన్ రాజధాని నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 37 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ లను దాఖలు చేశారు. సీఆర్డీయేకి రైతులిచ్చే వినతి గడువు పెంచాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పోలీసుల మీద కావచ్చు అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ పోలీసు యాక్టు 30 అమలును కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. మరో పిటిషన్ ను నిన్న అర్థరాత్రి సమయంలో సీఆర్డీయేను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ మరో పిటిషన్ ఇంకో ఇద్దరు రైతులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఐదు కీలకమైనటువంటి పిటిషన్ ల మీద హై కోర్టు న్యాయ స్థానంలో విచారణ చేపడుతున్నారు. ఈ కేసుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదాని  పై సర్వత్ర ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్నదని సమాచారం.

కొనసాగుతోన్న మండలి ఉత్కంఠ... టీడీపీ నెక్ట్స్ స్టెప్ అదేనా?

మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందినా, మండలిలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మండలిలో మూడు రాజధానుల బిల్లును టీడీపీ వ్యూహాత్మకంగా అడ్డుకోవడంతో తర్వాత జరుగుతోందన్న టెన్షన్ అధికార పార్టీని వెంటాడుతోంది. మండలిలో ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడంలో విజయవంతమైన తెలుగుదేశం... మళ్లీ మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే... వాటిని సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ పట్టుబడుతోంది. ఆ మేరకు ఇఫ్పటికే నోటీసులు కూడా ఇఛ్చారు.  అయితే, తాము మంగళవారం సాయంత్రమే మండలిలో బిల్లులను ప్రవేశపెట్టామని మంత్రి బొత్స చెబుతున్నారు. మంగళవారమే మండలిలిలో బిల్లులను ప్రవేశపెట్టేశామని ప్రభుత్వం చెబుతుండటంతో... టీడీపీ కూడా తెలివిగా కౌంటరిస్తోంది. తాము కూడా మంగళవారం ఉదయమే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. ఏదిఏమైనాసరే, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం మినహా మరో గత్యంతరం లేదని టీడీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు. మొత్తానికి, మూడు రాజధానుల బల్లుపై మండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరి, రూల్ 71ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చి మండలిలో ప్రభుత్వానికి షాకిచ్చిన టీడీపీ... నెక్ట్స్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి.

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. అయితే, కొన్ని చోట్ల మాత్రం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇక బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కాంగ్రెస్ అభ్యర్థి కొరకడం కలకలం రేపింది. 32వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును, వేళ్లను కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కొరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇమ్రాన్ ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.