ఒక్క ఏడాదిలో ఎంత మార్పు.. విజయసాయిని పక్కన పెట్టేశారా?

2019 మే 23. 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని వైసీపీ ఘన విజయం సాధించిన రోజు. సీఎం కావాలనే వైఎస్ జగన్ కల నిజమైన రోజు. ఆ రోజు వైసీపీ శ్రేణుల ఆనందం అంతాఇంతా కాదు. పక్కనే జగన్ ఉంటే.. ఆయనను కౌగిలించుకుని మనం గెలిచామని గట్టిగా అరిచే అంత ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఆ అదృష్టం మాత్రం పార్టీలో ఒక్కరికే దక్కింది. ఆ ఒక్కరు ఎవరో కాదు విజయసాయి రెడ్డి. ఆ రోజు జగన్ ని కౌగిలించుకుని విజయసాయి తన ఆనందాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఆ ఫోటో బాగా వైరల్ అయింది. వైసీపీ శ్రేణులు ఆ ఫోటోని చూసి తెగ మురిసిపోయారు. ఎందుకంటే వైసీపీలో జగన్ తరువాత ఎక్కువగా వినిపించే పేరు విజయసాయి. ఆయన వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగారు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు తరువాత కూడా విజయసాయి పార్టీలో కీలకంగా, చురుకుగా వ్యవహరించారు. అందుకే వైసీపీ శ్రేణులు.. పార్టీలో జగన్ తరువాత విజయ సాయే అన్నట్టు భావించేవారు. జగన్ కూడా విజయసాయి కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ వ్యవహారాల్లోనూ అంతే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీలో మునుపటిలా విజయసాయి జోరు కనిపించట్లేదు. ఓ రకంగా, జగన్ విజయసాయిని పక్కన పెడుతున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల, సీఎం జగన్ విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళే సమయంలో.. కారెక్కిన విజయసాయిని దించేసి మరీ మంత్రి ఆళ్ళ నానిని ఎక్కించుకుని వెళ్లారు. ఆ వీడియో బయటకు రావడంతో జగన్ విజయసాయిని పక్కన పెడుతున్నారని, మునుపటిలా ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న ప్రచారం మొదలైంది. మరోవైపు, కారు నుంచి దించేయడంతో విజయసాయి నొచ్చుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, విజయసాయి మద్దతు దారులు మాత్రం.. హెలికాప్టర్ లో చోటులేదని, బాధితులను పరామర్శించటానికి వెళుతున్నారు కాబట్టి ఆరోగ్య మంత్రి ఆళ్ళ నానిని తీసుకెళ్ళారని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా పరిణామాలు గమనిస్తే మాత్రం.. విజయసాయికి ప్రాధాన్యత తగ్గిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై సమావేశాలు పెట్టారు. ఆ సమావేశాల్లో పలువురు కీలక నేతలు కనిపించారు.. కానీ ఎక్కడా విజయసాయి కనిపించలేదు. సరే, ఆ సమావేశాలకు విజయసాయి ఎందుకు వస్తారులే అనుకున్నా.. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ ఉత్సవాల్లో కూడా ఆయన కనిపించకపోవడం పార్టీలో కలకలం రేపుతోంది. విజయసాయి శుక్రవారం సాయంత్రమే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారని కొందరు అంటున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి శనివారానికి సరిగ్గా ఏడాది. అలాంటిది ఆ ముందురోజు విజయసాయి హైదరాబాద్ వెళ్లడం ఏంటి?. పార్టీకి ఎంతో ముఖ్యమైన రోజున ఆయన కనిపించకపోవడం.. పలు అనుమానాలకు దారితీస్తోంది. అదీగాక, విజయసాయి ట్విట్టర్ లో బాగా యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా జగన్ ని ప్రశంసిస్తారు, టీడీపీ నేత చంద్రబాబు పై విరుచుకుపడతారు. ఈరోజు కూడా అలవాటు ప్రకారం విజయసాయి చంద్రబాబుపై విమర్శలు చేశారు కానీ.. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జగన్ నిజంగానే విజయసాయిని దూరం పెడుతున్నారా? అది తెలిసి విజయసాయి కూడా చిన్నగా సైడ్ అవుతున్నారా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? అంతా ఆ జగన్నాధుడికే తెలియాలి.

డాక్టర్ సుధాకర్ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ.. విశాఖ పోలీసులు పై ఎఫ్ఐఆర్ నమోదు

డాక్టర్ సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసును సీబీఐకి అప్పగిస్తూ డాక్టర్ సుధాకర్‌ తో దురుసుగా ప్రవర్తించిన పోలీస్ లపై కేసు నమోదు చేయడంతో పాటు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ అధికారులు శుక్రవారం పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. సీబీఐ విశాఖ ఎస్పీ పుట్టా విమలాదిత్య పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐదవ అడిషనల్ సివిల్ జడ్జి మరియు విశాఖ ఐదవ అడిషనల్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్‌లకు డాక్టర్ సుధాకర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ కేసులు నమోదయ్యాయి. డాక్టర్‌ సుధాకర్‌ అభియోగాల మేరకు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖ సీబీఐ ఎస్పీ కేసు నమోదు చేశారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ చికిత్స పొందుతున్న విశాఖ మానసిక వైద్యశాలకు సీబీఐ అధికారులు చేరుకొని, సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన అంశాలు, తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు.

నిమ్మగడ్డ తీర్పు పై సుప్రీం కోర్టుకు.. కానీ రివర్స్

ఏపీ ఎన్నిక‌ల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపు చెల్లదని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిన్న స్పష్టం చేశారు. అయితే దీనిపై ఎపి కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ ప్రభుత్వం కంటే ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా ఆయన తరపున లాయర్ నర్రా శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో ఈ రోజు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విష‌యంలో అప్పీల్ కు వెళ్తే.. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌రాద‌ని ఆ పిటిషన్ లో సుప్రీం కోర్టును కోరినట్లు తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. మరి జగన్ ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.

గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్‌ చేసేవారు

ఏపీ సీఎంగా‌ బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్బంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను వైఎస్‌ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి  ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ సీఎం ఆరంభించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అన్నీ రైతుభరోసా కేంద్రాల్లో లభ్యం అవుతాయని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని, రైతు భరోసా ద్వారా 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,200 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. "కేవలం రెండు పేజీల్లోనే మేనిఫెస్టో పెట్టాం. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హామీల్లో ఇప్పటికే 77 అమలు చేశాం. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశాం" అని సీఎం చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్‌లు రిలీజ్‌ చేసేవారని సీఎం ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 600లకుపైగా హామీలిచ్చి, పది శాతం కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకు.. అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాలని గత ప్రభుత్వం కోరుకునేదని విమర్శించారు. ఆంగ్ల మాధ్యమాన్నీ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దక్కాలంటే జన్మభూమి మాఫియాకు లంచాలు ఇవ్వాల్సిందే. కానీ, తమ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికే వెళ్లి పథకాలు అందిస్తున్నాం అని సీఎం‌ జగన్‌ పేర్కొన్నారు.

ఏపీ సెక్రటేరియట్ లో కరోనా కలకలం

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఇది అమరావతి లోని ఏపీ సెక్రటేరియట్ లోకి కూడా ఎంటర్ అయింది. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులు ఎంప్లాయిస్ ఇంటర్ సిటీ ట్రైన్ లో ప్రయాణించి విధులకు హాజరయ్యేవారు. ఐతే దాదాపు రెండు నెలలుగా లాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లో చిక్కుకు పోయిన ఉద్యోగులు విధులకు హాజరు కాలేక పోయారు. దీంతో వీరి కోసం ఏపీ ప్రభుత్వం గత బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుండి ఏపీకి కొన్ని ప్రత్యేక బస్సులు నడిపింది. ఇపుడు ఆలా ప్రత్యేక బస్సులో మంగళగిరికి చేర్చి అక్కడ వారి నుండి కరోనా టెస్టుల కోసం సాంపిల్స్ తీసుకొని వారి తాత్కాలిక నివాసాలకు పంపించారు. ఐతే తాజాగా ఆ టెస్టులలో వ్యవసాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని తో కలిసి తిరిగిన వ్యక్తులతో పాటు అతని తో పాటు అదే బస్సులో ప్రయాణించిన ఉద్యోగులందరు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

నిమ్మగడ్డ రాకతో సీఎస్‌ నీలం సాహ్ని పదవికి గండం!!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చీఫ్‌ సెక్రెటరీ గా ఉన్న నీలం సాహ్ని జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ఈ కరోనా కష్టకాలంలో సీఎస్‌ విధులు కీలకమైనందున.. ఆమె పదవీ కాలం మరో ఆరునెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు ఊహించని విధంగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ రీఎంట్రీ ఇవ్వడంతో.. సీఎస్ పదవికి గండం ఏర్పడిందని అంటున్నారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడం. ప్రభుత్వం పంతానికి పోయి.. ఆయన్ని ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్‌ని నియమించడం. తాజాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ‌ని కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం.. ఇవన్నీ తెలిసినవే. అయితే, నిమ్మగడ్డ రీఎంట్రీతో కొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే సమయంలో కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించారు. అయితే ఆదేశాలను చీఫ్‌ సెక్రెటరీ నీలం సాహ్ని అమలు చేయలేదు. నిమ్మగడ్డని తొలగించడంతో ఆయన ఆదేశాలు మరుగునపడ్డాయి. కానీ, ఇప్పుడు ఆయన రాకతో, ఆ ఆదేశాలు అమలవుతాయని అధికారాలు భయపడుతున్నారు. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను ప్రస్తుతం సీఎస్ పక్కన పెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఒకవేళ పక్కన పెడితే, ఆమె పదవికే గండమంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇలానే ఈసీ ఆదేశాలను పక్కన పెట్టినందుకు అప్పటి సీఎస్‌ పునేఠాని ఏకంగా విధుల నుంచి తప్పించి, ఆయన స్థానంలో ఎల్‌వీ సుబ్రహ్మణ్యంని తీసుకొచ్చారు. ఈసీ ఆదేశాలను పక్కన పెడితే, నీలం సాహ్నికి కూడా పునేఠా విషయంలో జరిగినదే పునరావృతమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్ని.. అధికారులకు సంబంధించి నిమ్మగడ్డ‌ జారీచేసిన ఆదేశాల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జగన్ గారి ఏడాది పాలన.. కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, మంత్రుల బూతులు

వైఎస్ జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ ఏడాది పాలన కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, దౌర్జన్యాలు అంటూ విరుచుకుపడ్డారు. "వైఎస్ జగన్ గారి ఏడాది పాలన గురించి చెప్పాలంటే 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు,కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం,తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు,భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు,భజనలు,దౌర్జన్యాలు అని చెప్పుకోవాలి." అని విమర్శించారు. "ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ  కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు." అని పేర్కొన్నారు. "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలన అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుగువారి పరువుతీయకుండా పాలించాలి." అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

వలంటీరు వేధింపులు భరించలేక.. మాజీ మంత్రి డ్రైవర్ ఆత్మహత్య

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం జరిగింది. మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్ సన్యాసినాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు తానెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ వివరిస్తూ బంధువులకు నాయుడు ఆడియో మెసేజ్ పంపాడు. వలంటీర్‌ జాగరపు నర్సింగరావు వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. నాయుడి మృతితో.. కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా?.. ఏం సాధించారని?...

వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో వైఎస్ ఏడాది పాలనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు." అని విమర్శించారు. "ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యధేచ్ఛగా సాగించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారు." అని మండిపడ్డారు. "రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా  అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం." అని పేర్కొన్నారు. "ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత. ఇన్ని విషాదాల్లో వైసిపి ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని...? ఎవరికేం ఒరగబెట్టారని..?  ఇకనైనా బాధ్యతగా పనిచేయండి." అని చంద్రబాబు హితవు పలికారు.

శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మృతి

లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. రైల్వేశాఖ మే 1నుంచి 27వతేదీ వరకు దేశంలో 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి, దాదాపు 50 లక్షల మంది వలసకార్మికులకు వారి స్వస్థలాలకు చేర్చింది. అయితే ఈ రైళ్లలో ఇప్పటి వరకు 80 మంది మరణించారు. మే 9 నుంచి 27 వరకు నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్లలో 80 మంది వలసకార్మికులు మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడైంది. ఎక్కువగా, దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వలసకార్మికులు రైలు ప్రయాణంలో మరణించారని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే, రైళ్లలో భోజనం దొరక్క మాత్రం ఎవరూ మరణించలేదని తెలిపింది. కాగా, రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే రైలును ఆపి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

తెలంగాణలో ఒక్కరోజే 169 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 169 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే, శుక్రవారం కరోనాతో నలుగురు మృతి చెందారు. దాంతో మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక కొత్తగా నమోదైన 169 కేసులలో, స్థానికంగా 100 కేసులు నమోదు కాగా, బయటి నుంచి వచ్చినవారిలో 69 మందికి కరోనా నిర్దారణ అయింది. ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజులో 82 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 400 కు పైగా కేసులు వచ్చాయి. మే 27న 107, మే 28న 158, మే 29న 169 కేసులు.. ఇలా రోజూ 100కు పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి.. జేసీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీకి జగన్ లాంటి సీఎం మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు ౧౧౦ మార్కులు వేస్తానని ఎద్దేవాచేశారు. జగన్ నిరంకుశ ధోరణి, పట్టుదల పరాకాష్ఠకు చేరాయని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ఉదాహరణ అని అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే నైజాన్ని జగన్ వదులుకోవాలని సూచించారు. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని, అయినా మొండి వైఖరితో ముందుకు సాగుతోందని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమన్నారు. టీటీడీ ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్ రాముడో, రావణుడో ప్రజలే తేల్చుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

హైకోర్టు తీర్పు పై హాట్ కామెంట్స్

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలన్న ఏపీ హైకోర్టు తీర్పు పై వివిధ పార్టీల నాయకులు స్పందించారు. ఈ తీర్పు పై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు స్పందిస్తూ ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని అయన హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అయన హెచ్చరించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ తీర్పు పై వ్యాఖ్యానిస్తూ ఇది ముందుగా ఉహించిందేనన్నారు ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేయడాన్ని అయన స్వాగతించారు. తమిళనాడు హై కోర్ట్ కూడా 2006లో ఇలాంటి తీర్పే ఇచ్చిందని, రాజ్యాంగ బద్ద పదవుల పదవీ కాలాన్ని తగ్గించే ఆర్డినెన్సులు చెల్లవని స్వయంగా వైసీపీ ఎంపీ స్పష్టం చేసారు. కోర్ట్ లకు ఈ ఆర్డినెన్స్ ను కొట్టేయడం మినహా వేరే మార్గం లేదన్నారు ఇప్పటికైనా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు,సూచనలతో ఆడగు ముందుకు వేయాలని అన్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం జగన్ కి కొత్త కాదని, రోజు వారీ మొట్టికాయల్లో కేవలం ఇది ఒకటని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కులాన్ని ఆపాదించడం దారుణమన్న ఆమె ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా, జగన్ సర్కార్ చలించడం లేదని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అతని మంత్రి వర్గాన్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆమె అన్నారు.

నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్.. ఎవరిది పై చేయి

ఎ.పి ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఎ.పి హైకోర్టు ఈ రోజు స్పష్టం చేసింది. జగన్ సర్కార్ రమేశ్ ‌కుమార్‌‌ను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డ‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం కమిషనర్ కనగరాజ్ పదవి నుండి తొలగినట్టేనని న్యాయ నిపుణులు తెలియచేస్తున్నారు. ఐతే ఈ విషయం నేపధ్యం లోకి వెళితే గత మార్చ్ నెలలో ఏపీలో స్థానిక ఎన్నికల కోలాహలంగా నడుస్తున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఐన వైసిపి అనేక నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవ చేసుకునేందుకు అడ్డ దారుల ద్వారా ప్రయత్నించడంతో ప్రతి పక్షాలు ప్రభుత్వం పై ఎలక్షన్ కమిషనర్ కు ప్రూఫ్ ల తో సహా ఫిర్యాదు చేసాయి. దీని పై స్పందించిన రమేష్ కుమార్ విచారణ జరిపి కొన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేయాల్సిందిగా ఎపి సీఎస్ కు లేఖ రాసారు. ఐతే దీని పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కలకలం రేగటంతో స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్ ఆరు వారాల పాటు వాయిదా వేశారు. దీనితో ఆగ్రహించిన సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషనర్ ది బాబుది ఒకే కులం కాబట్టి ఎన్నికలను వాయిదా వేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రజలు తనకు అధికారం అప్పచెపితే అధికారుల బదిలీ పై అయన పెత్తనం ఏంటంటూ అసలు సీఎం నేనా లేక నిమ్మగడ్డనో అర్ధం కావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో రెచ్చిపోయిన విజయ్ సాయిరెడ్డి, కోడలి నాని, స్పీకర్ తమ్మినేని నిమ్మగడ్డను తీవ్ర పదజాలం తో దూషించారు. దీంతో ఎలక్షన్ కమిషనర్ కేంద్ర హోమ్ శాఖకు ఒక లేఖ రాస్తూ సాక్షాత్తు సీఎం, అధికార పార్టీ నాయకులు తన పై తీవ్ర విమర్శల చేస్తున్న నేపథ్యంలో తనకు తన కుటుంబానికి రాష్ట్రంలో రక్షణ లేదని తమ పై దాడి జరిగే అవకాశం ఉన్నందున కేంద్రమే రక్షణ కల్పించాలని అలాగే హైదరాబాద్ నుండి పని చేసే అవకాశం కల్పించాలని కోరారు. దీని పై స్పందించిన కేంద్రం ఆయనకు సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తూ హైద్రాబాద్ నుండి పనిచేసే వెసులుబాటు కల్పించింది. ఐతే ఈ లేఖ విషయంలో కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ ఐంది. అసలు ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని దాని పై ఉన్న సంతకం ఫోర్జరీదని ఎంపీ విజయ సాయి రెడ్డి సిఐడి కి కంప్లైంట్ చేయడం తో దాని పై దర్యాప్తు కూడా జరిగింది ఇది ఇలా ఉండగానే ఏప్రిల్ 10 న జగన్ ప్రభుత్వం కమిషనర్ పదవి కాలాన్ని మూడు సంవత్సరాలకు కుదిస్తూ ఆర్డినెన్సు తెచ్చి నిమ్మగడ్డ ను తొలిగించి ఆగమేఘాలపై రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను కొత్త ఎలక్షన్ కమిషనర్ గా నియమించింది. ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రమేష్ కుమార్ ఏపి హైకోర్టును ఆశ్రయించగా దాదాపు నెల రోజుల పైగా విచారణ జరిపిన కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎలక్షన్ కమిషనర్ గా తిరిగి బాధ్యతలు అప్పగించాలని అయన పదవి కాలాన్ని తగ్గించే అధికారం ఏపి ప్రభుత్వానికి లేదని తన తీర్పుతో స్పష్టం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ కు బాధ్యతలు అప్పగిస్తుందో లేక ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళుతుందో వేచి చూడాలి.

నిమ్మగడ్డ రీఎంట్రీ.. అధికార పార్టీకి పెద్ద తలనొప్పి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు చెప్పడంతో.. ప్రస్తుతం నిమ్మగడ్డ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిమ్మగడ్డ రీఎంట్రీ తో జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పవా? నిమ్మగడ్డను జగన్ సర్కార్ ఎలా ఫేస్ చేస్తుంది? వంటివి హాట్ టాపిక్ గా మారాయి. కరోనా కారణంగా గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అగ్గి రాజుకుంది. నిమ్మగడ్డ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రభుత్వం మండిపడింది. అసలు కరోనా ప్రభావం లేదు ఏంలేదు, చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, ప్రతిపక్ష టీడీపీ కోసమే ఎన్నికల వాయిదా వేశారంటూ.. అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నిజానికి ఎన్నికల వాయిదాకి ముందు నిమ్మగడ్డ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అధికార పార్టీ నేతలు పలు చోట్ల బెదిరింపులకు, దాడులకు పాల్పడి.. ఇతర పార్టీల వారిని నామినేషన్లు వేయకుండా చేసి.. ఏకగ్రీవం చేసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి. నామినేషన్ల ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఒకానొక టైములో ఎన్నికల సంఘం తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే, ఇంతలో కరోనా ఉదృతి పెరుగుతుండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికార పార్టీ ఒక్కసారిగా నిమ్మగడ్డపై విరుచుకుపడింది. అంతేకాదు, కరోనా ప్రభావం లేదని చెప్పి.. ఎలాగైనా ఎన్నికలు నిర్వహిచాలని పంతానికి పోయారు. అందుకే ఆర్డినెన్స్ తెచ్చి నిమ్మగడ్డని తప్పించారు.. ఆ స్థానంలో కనగరాజ్ ని కూర్చోబెట్టారు. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అన్నట్టుగా.. అధికార పార్టీ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఓ వైపు కరోనా ఉదృతి, మరోవైపు కోర్టు కేసుతో..  కనగరాజ్ కూడా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు కోర్టు తీర్పుతో మళ్లీ నిమ్మగడ్డనే రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పుపై స్పందించిన నిమ్మగడ్డ.. తాను గతంలో పని చేసినట్లుగానే నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతో సంప్రదించి, సాధారణ స్థితికి వచ్చిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో సాధారణ స్థితి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. గత కొద్దిరోజులుగా ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో అసలు ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అని అభ్యర్థుల్లో భయం మొదలైంది. నామినేషన్ వేసిన ఉత్సాహంలో ఉన్న చాలామంది అభ్యర్థులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా బాగా ఖర్చుపెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులు లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలు, పండ్లు వంటివి పంచుతూ పరోక్షంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు నిమ్మగడ్డ ఎంట్రీతో ఇప్పటిదాకా మేం చేసిన ఖర్చంతా వృధానేనా అని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి చాలా రోజులైంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియపై ఆరోపణలున్నాయి. నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానంటూ రీఎంట్రీ ఇచ్చిన నిమ్మగడ్డ.. ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అధికార పార్టీ ఏకగ్రీవాలు ఆగిపోతాయి, అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడి ఇతరులను నామినేషన్లు వేయనివ్వలేదన్న సంకేతాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. మరోవైపు, అభ్యర్థులకు కూడా తిప్పలు తప్పవు. ఇప్పటికే కరోనా మూలంగా ఎన్నికలు ఆలస్యంగా జరిగేలా ఉన్నాయి. ఇక ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభిస్తే మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. పాపం, ఎన్నికలు త్వరలోనే ఉంటాయనుకొని చాలామంది అభ్యర్థులు సాయం పేరుతో చాలా ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నారు. కొందరైతే అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఖర్చుపెట్టారు. కానీ ఏం లాభం?. ఎన్నికలు ఆలస్యమైతే ఈ ఖర్చంతా జనాలు మర్చిపోతారు. మళ్లీ ఎన్నికలప్పుడు ఫ్రెష్ గా ఖర్చుపెట్టాలి. మొత్తానికి నిమ్మగడ్డ ఎంట్రీతో బాగా ఖర్చు పెట్టిన అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది.

భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్.. నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదు

నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ తొలగింపు వ్యవహారంలో జగన్ సర్కార్ కి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో నిబంధనలు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ స్పందించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. హైకోర్టు సూచనలతో, తాను తిరిగి చార్జ్ తీసుకున్నానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. తాను గతంలో పని చేసినట్లుగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులను  నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీలతో సంప్రదించి, సాధారణ స్థితికి తిరిగి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తానని అన్నారు. వ్యవస్థలో వ్యక్తులు శాశ్వతంగా ఉండరు.. రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన వారంతా రాజ్యాంగ విలువలు, సమగ్రతను కాపాడాలని నిమ్మగడ్డ అన్నారు. హైకోర్టు తీర్పుపై పలువురు స్పందించారు. జగన్ సర్కార్ ఇకనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయన్న విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అన్నారు. "రాజ్యాంగ సంస్థల విషయంలో నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే భంగపాటు తప్పదు.ఇది మరోసారి రుజువైంది.ఎస్ఈసీగా రమేష్ కుమార్ తొలగింపు,అర్హత లేని కనగరాజ్ నియామకం రాజ్యాంగవిరుద్ధమని ఆరోజే చెప్పాను.రాష్ట్ర ప్రభుత్వమూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైందనే విషయం గుర్తుంచుకోవాలి." అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. 'భారత న్యాయ వ్యవస్థకు హ్యాట్సాఫ్. న్యాయవ్యవస్థ ప్రజల్లో విశ్వాసం నింపింది. అన్యాయంపై పోరాడే బలాన్ని ఇచ్చింది' అని జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. "న్యాయం గెలిచింది చట్టం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది రాజ్యాంగం గెలిచింది న్యాయ వ్యవస్థ పై వున్న నమ్మకం నిలబడింది." అని కేశినేని నాని ట్వీట్ చేశారు.

జగన్ సర్కార్ కి ఊహించని దెబ్బ.. మళ్లీ ఎన్నికల కమిషనర్‌గా రానున్న నిమ్మగడ్డ!

జగన్ సర్కార్ కి ఏపీ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో నిబంధనలు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలన్నీ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఐదు జిల్లాల స్వప్నం.. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. మర్కుక్‌ పంప్ ‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను చినజీయర్‌స్వామితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌లోకి చేరుకున్నాయి. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు.  అంతకముందు కొండపోచమ్మ ఆలయంలో ఉదయం వైభవంగా చండీయాగం నిర్వహించారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ యాగం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతో పాటు చినజీయర్ స్వామీ కూడా పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కడంతో.. ఐదు జిల్లాల స్వప్నం సాకారమైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను ఈ రిజర్వాయర్‌ తీర్చనుంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ రిజర్వాయర్‌ చేపట్టారు. 557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ ఆ తర్వాత అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడంతో గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మకు చేరుకుంటాయి.  కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు. కొండపోచమ్మతో ఐదుజిల్లాలో మొత్తం 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి

భారత్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి ఆరువేలకు పైగా నమోదవుతున్న కేసులు.. ఇప్పుడు ఏడు వేల మార్కుని దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,466 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. భారత్‌లో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. 24 గంటల్లో 175 మంది కరోనాతో మరణించారు. భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4706కు చేరింది. కరోనా సోకిన వారిలో ఇప్పటివరకూ 71,105 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 89,987 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.