Minister Vellampalli Srinivas Fires On Chandrababu

ఐదేళ్లలో బాబు చెయ్యలేనిది.. జగన్ ఐదు నెలల్లో ఎలా చేస్తాడు?

ఐదేళ్లూ అధికారంలో ఉన్న చంద్రబాబు చేయనిది ఐదు నెలల్లో జగన్ చేస్తారా అని ప్రశ్నించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు అన్ని టెంపరరీ పనులు చేశారని జగన్ శాశ్వత కట్టడాల కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన. బాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ వినాశనమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవలంబించిన విధానాల వల్లే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజధానిలో అడుగు పెట్టాలంటే క్షమించండని రైతుల్ని బాబు వేడుకోవాలి అంటున్నారు. లక్షా తొమ్మిది వేల కోట్లు రాజధానికి కావాలని చెప్పి నాలుగు వేల కోట్లతో టెంపరరీగా అసెంబ్లీలు.. సెక్రటేరియట్లు.. హైకోర్టులు కట్టిన వ్యక్తి చంద్రబాబే అని గుర్తు చేశారు. జగన్ రెడ్డి గారు అన్ని పర్మినెంటుగా చేయాలని గ్రాఫిక్స్ ఉండకూడదని భావిస్తున్నారని అన్నారు. తాను చేయగలిగిందే చెబుతాడని.. చెప్పాలనే అభిప్రాయంతో ముందుకెళ్తున్న సమయంలో వచ్చి.. ఐదు నెలల్లో జగన్ ఏమి చేయలేదని అనడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు యాత్రలో కొందరు రైతులు చంద్రబాబునాయడుని రావద్దని చెప్పి నినాదాలు చేశారని వెల్లడించారు. రైతులు తమకు ఎంతో మేలు జరుగుతుందని ఇచ్చిన భూములకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా సిగ్గు శరం లేకుండా ఇవాళ పర్యటణ చేపట్టారని చంద్రబాబు పై తీవ్రంగా మండిపడ్డారు.అమరావతికి వెళ్లి చంద్రబాబు ఏం పరిశిలిస్తారని ఆయన మండిపడ్డారు. రైతులు ధారాదత్తం ఇచ్చిన భూముల్లో ప్రైవేటు కాలేజీల నుంచి కట్టబేడుతున్నారని.. సభలో హైకోర్టు గురించి ప్రస్తావిస్తే కానీ హైకోర్టు కట్టడం గురించి ఆలోచించలేదన్నారు. ఇలా విఫలమయ్యారు కాబట్టే చంద్రబాబు గో బ్యాక్ అని అమరావతి ప్రజలు తిరుగుబాటు వ్యక్తం చేశారని వెల్లంపల్లి ఆరోపించారు.

nayeem assets rs 1200 crores

బయటపడనివి మరెన్నో... నయీం ఆస్తుల విలువ అక్షరాల రూ.1200 కోట్లు

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఆదాయపు పన్ను శాఖ విచారణ వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా నయీం భార్య హసీనాబేగంను ఐటీ అధికారులు విచారించారు. నయీం ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని హసీనా బేగం ఐటి అధికారులకు వెల్లడించారు. నల్లగొండలోని ఇంటితో పాటు మరి కొన్ని ఆస్తులని తాను దర్జీ పని చేసి సంపాదించినట్లు హసీనా బేగం ఐటీ అధికారులకు వివరించినట్టు తెలిసింది. ఇతర ఆస్తులకు సంబంధించి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటావిడ పర్హాన పేరుతో ఉన్న ఆస్తుల గురించి కూడా ఐటీ అధికారులు హసీనాబేగంను ఆరా తీశారు. ఫర్హానా పేరుతో హైదరాబాద్ , సైబరాబాద్ తో పాటు రంగారెడ్డి, నల్గొండలో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఒక్క ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుందని గుర్తించారు ఐటీ అధికారులు. ఆ కోణంలోనూ హసీనా బేగం నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆదాయ మార్గం లేకుండానే విలువైన భూముల సెటిల్ మెంట్ లతో నయీం పెద్ద మొత్తంలో సంపాదించడాన్ని అధికారులు నిర్ధారించారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత సిట్ నిర్వహించిన దర్యాప్తులో గుర్తించిన అంశాల్ని ఐటీ అధికారులు సేకరించారు. సిట్ నివేదిక ప్రకారం తాము గుర్తించిన ఆస్తుల అనధికారికమైనవి ఆయా ఆస్తులకు ఐటీ చెల్లించలేదని నిగ్గు తేల్చిన అధికారులు బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కిడ్నాప్ లు, బెదిరింపులు, సెటిల్ మెంట్ లు, భూకబ్జాలతో నయీం సంపాదించిన ఆస్తులు అతని బినామీల పేర్ల మీద ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది. నయీం ఎన్ కౌంటర్ జరిగిన శంషాబాద్ లోని మిలీనియం టౌన్ షిప్ లోని ఇల్లు, నయీం బావమర్ది సాజిద్ పేరుతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బంధువులు.. గ్యాంగ్ సభ్యుల బినామీ పేర్లతో నయీం రిజిస్ర్టేషన్ చేయించినట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో బహిర్గతమైంది. నయీం బినామీ ఆస్తుల విలువ మార్కెట్ లో రేటు ప్రకారం సుమారు 1200 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. విచారణ అనంతరం త్వరలోనే ఆయా ఆస్తుల్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోనుంది. నయీం ఆస్తుల్ని అటాక్ చేసేందుకు ఐటి శాఖ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోరుతూ ఢిల్లీలోని అడ్జ్యుటికేటింగ్ అథారిటీలో ఐటీ అధికారులు ఇది వరకే పిటీషన్ దాఖలు చేశారు. ఆదాయ మార్గం లేకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంతో సిట్ నిర్వహించిన ఆధారాల మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. తెలంగాణలోని ఆయా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ,ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. అరెస్టు సమయంలో నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం జరిగిన సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా గ్యాంగ్ స్టర్ కు 1015 ఎకరాల భూములు..1,67,117 చదరపు అడుగుల ఇళ్ళస్ధలాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ఎన్ కౌంటర్ తరువాత హైదరాబాద్ లోని నయీం డెన్ లో నిర్వహించిన సోదాల్లో 2.08 కోట్ల నగదు,1.90 కిలోల బంగారు ఆభరణాలు,258 సెల్ ఫోన్ లు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఉన్న 203 ఒరిజినల్ రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ లో పేలుడు పదార్ధాలు ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

AmitShah Comments On ShivSena Over Alliance With NCP And Congress

మైత్రి తెచ్చిన కష్టాలు.. శివసేనపై విరుచుకుపడుతున్న అమిత్ షా & కో

  మహారాష్ట్ర లో మూడు దశాబ్దాల మైత్రి బంధాన్ని తెంచుకొని ఎన్సీపీ-కాంగ్రెస్ తో జట్టు కట్టిన శివసేనపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శివసేన నేతలు అవమానించారంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాజాగా బీజేపీ స్పందించింది. సీఎం పదవిపై వ్యామోహంతోనే బీజేపీ కూటమి నుంచి శివసేన తనంతట తానే విడిపోయిందని కమలదళం మండిపడుతుంది. సీఎం పదవి ఇస్తామని ఎన్నికల ముందు శివసేనకు హామీ ఇవ్వలేదని.. బీజేపీ మరోసారి స్పష్టం చేసింది.  శివసేన మహారాష్ట్ర ప్రజా తీర్పును అవమానించిందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. ఎమ్మెల్యేలను క్యాంపుల్లో పెట్టి, ఎన్నికల ముందు పెట్టుకున్న పొత్తును వీడిన శివసేన బిజెపిని నిందిస్తోందని ఆయన దుయ్యబట్టారు. సైద్ధాంతికతకు, అన్ని విలువలకు తిలోదకాలిచ్చి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయని విమర్శించారు. సీఎం పదవిపై శివసేనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉద్దవ్ థాక్రే, ఆదిత్య ఠాక్రే పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లోనూ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని తాము ప్రతిచోటా చెప్పామని ఆయన గుర్తు చేశారు. మరి అప్పుడెందుకు వారు అభ్యంతరం వ్యక్తం చేయలేదని నిలదీశారు. శివసేన ఎమ్మెల్యేలందరూ తమతో కలిసి గెలిచిన వారేనని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టుకోని వారు శివసేనలో ఏ ఒక్కరూ లేరని తెలిపారు. ప్రచార సభల్లో మోదీవే పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టారని ఇవన్నీ దేశ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు అమిత్ షా.  మహారాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇవ్వటంలో ఆంతర్యమేంటని అమిత షా ప్రశ్నించారు. వంద సీట్లు గెలిచిన ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికే ముఖ్యమంత్రి పదవి దక్కాలి తప్ప శివసేనకు ఇవ్వడమేంటని శరద్ పవార్, సోనియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీన్ని బేరసారాలు కాక ఇంకేమంటారని నిలదీశారు బీజేపీ చీఫ్. ఇక దీని పై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, అమిత్ షా ఏమైనా మాట్లాడగలరని అన్నారు. మోడీ కటౌట్ లు పెట్టుకొని శివసేన ఎమ్మెల్యేలు గెలిస్తే బాల్ థాక్రే పోస్టర్ పెట్టుకుని బిజెపి ఎమ్మెల్యేలు గెలిచారు అన్నారు. మొత్తానికి మైత్రి బంధానికి తిలోదకాలిచ్చిన శివసేనపై బిజెపి ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తోంది. మహారాష్ట్ర కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అది ఎన్నాళ్లపాటు అధికారంలో ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Deve Gowda hints at political changes in Karnataka after by elections

బీజేపీకి మరో గట్టి దెబ్బ.. కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం!!

  మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కొద్ది రోజుల్లో కర్ణాటకలో కూడా బీజేపీకి ఇలాంటి షాకే తగిలే అవకాశముందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలిచినా అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ మాత్రం దాటలేదు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్ లు కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కేవలం 9మంది ఎమ్మెల్యేలు తక్కువై అధికారం చేపట్టలేకపోయిన బీజేపీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు ఈ ఏడాది జూలైలో విజయం సాధించింది. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ లేకుండా చేసింది. యడియూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేరికతో ప్రస్తుతం బీజేపీ బలం 105 గా ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బీజేపీకి మెజారిటీ సరిపోయింది. కానీ ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీలో ఉంటే బీజేపీకి మెజారిటీ లేనట్టే. అందుకే ఇప్పుడు బీజేపీకి ఉపఎన్నికలు కీలకం కానున్నాయి. డిసెంబర్ 5 న కర్ణాటకలో 15 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 9 న తేలనున్నాయి. ఉపఎన్నికల్లో కనీసం 7 స్థానాలు గెలిస్తేనే బీజేపీ సర్కార్ సేఫ్‌జోన్‌ లో ఉంటుంది. లేదా మూడు నెలల ముచ్చటగానే మిగిపోయే అవకాశముంది. ఉపఎన్నికల్లో సత్తాచాటి బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్-జేడీఎస్ దృఢనిశ్చయంతో ఉన్నాయి. ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే.. డి.కె.శివకుమార్‌ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే దేవేగౌడ కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఉపఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచి అధికారం నిలుపుకుంటుందో లేక మహారాష్ట్రలో లాగా దెబ్బ తింటుందో చెప్పాలి.

high tension during chandrababu amaravati tour

బాబు అమరావతి పర్యటన... కాన్వాయ్ పైకి రాళ్లు, చెప్పులు

  ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు అమరావతి యాత్ర చేపట్టారు. కాసేపటి క్రితమే ఉండవల్లిలోని తన నివాసం నుంచి టిడిపి నేతలతో కలిసి బయలుదేరారు. దారివెంటా టిడిపి శ్రేణులు స్థానికులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల తర్వాత తొలి సారి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతో ఆయన ముచ్చటించనున్నారు. రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలనూ చంద్రబాబు పరిశీలించనున్నారు. మరోవైపు అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ వర్గీయులు ఆందోళనకు దిగాయి. నల్లబాడ్జీలు ధరించి చంద్రబాబు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వారు. చెప్పు లు విసిరారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటాయపాలెం దగ్గర పలువురు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.దీని పై టిడిపి కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. నినాదాలు చేయవద్దంటూ హెచ్చరించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టిడిపి కార్యకర్తలను.. స్థానికులను.. అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బాబు అమారావతిలో ఆయన హయాంలో చేపట్టిన పనులు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి అని చూసి జగన్ సర్కార్ ను నిలదీయటానికి ఈ పర్యటణ చేపట్టినట్లు సమాచార. తాను రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు.మొత్తానికి వెంకటయ్యపాలెం వద్ద ప్రజలు రెందు వర్గాలుగా చీలిక అయ్యారు. కొంత మంది చంద్రబాబు తమకు ఏ అన్యాయం చేయలేదని జగన్ కూడా పాలనలో బాబు లాగే అభివృద్ధి చేపట్టాలని వారి భావాలు వెల్లడించారు. మరి కొత మంది నేతలు వైసీపీ ప్రజలు రాళ్ళు రువ్వుతూ గో బ్యాక్ అని నినాదాలు చేపట్టారు. వారిని పోలీసులు మరియు రోప్ టీమ్ బృందం తిప్పి పంపించారు. మొత్తానికి  చంద్రబాబు పర్యటణ ఉద్దండ్రాయునిపాలెం చేరుకోగా అక్కడ ప్రజలు కొంతమంది ఘన స్వాగతం పలుకుతూ తమ ప్రియ నేతకు భ్రమ్మరధం పట్టారు. 

Uddhav Thackeray to take oath as Maharashtra CM

శివసేన 16-ఎన్సీపీ 15-కాంగ్రెస్ 13... ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరే ప్రమాణం

  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్‌లో జరగనున్న ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందు డిసెంబర్ ఒకటిన ప్రమాణం చేయాలనుకున్నా, గవర్నర్ సూచన మేరకు ఈరోజే(నవంబర్ 28)న ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇక, ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది. అలాగే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను కూడా ఆహ్వానించామని... వాళ్లు కూడా ఉద్ధవ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరవుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే, తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ... ఆత్మహత్య చేసుకున్న 400మంది రైతుల కుటుంబాలను ఉద్ధవ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే, ఎంఎన్‌‌ఎస్ అధినేత రాజ్‌ఠాక్రే‌కు కూడా ఆహ్వానం పంపారు. ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవంతో సంకీర్ణ సర్కారు కొలువుతీరుతుండగా, పదవుల పంపకంపైనా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. శివసేనకు ముఖ్యమంత్రి పదవితోపాటు 15మంది పదవులు దక్కనున్నాయి. ఇక, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రితోపాటు 13 కేబినెట్‌ బెర్త్‌లు... అలాగే కాంగ్రెస్‌కు స్పీకర్‌తోపాటు 13మంత్రి పదవులు లభించేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఉద్ధవ్ తోపాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు మాత్రమే ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై అవగాహనకు వచ్చాక డిసెంబర్ మూడున కేబినెట్ విస్తరణ ఉంటుందని కూటమి నేతలు తెలిపారు.

Telangana RTC employees pin hopes on Cabinet meeting

ఏదో ఒకటి తేల్చండి.. ఆర్టీసీ భవిష్యత్తుపై కేబినెట్ సమావేశం

  టీఎస్ఆర్టీసీ భవితవ్యం నేడు తేలిపోనుంది.కార్మికుల డిమాండ్లతో పాటు రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నది. నిజాం హయాంలో నిజాం పూచికత్తుతో పురుడు పోసుకొని కాలక్రమంలో తెలంగాణ ఆర్టీసీగా మారిన ఈ సంస్థ మనుగడ పై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఐదువేల ప్రైవేటు బస్సులను ఆర్టీసీ రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర రవాణా చట్టం కూడా దీనికి పూర్తి వెలుసుబాటు ఇవ్వడం.. హై కోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ పై అభ్యంతరాలు లేవనెత్తటంతో నేడు జరిగే మంత్రి వర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోమంటూ సీఎం కార్యాలయం ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రధాన ఎజెండాగా గురువారం నుంచి రెండు రోజుల పాటు మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల వయో పరిమితి పెంపుతో పాటు వేతన సవరణపై కూడా చర్చ ఉండే అవకాశాలున్నాయి. 10 నుండి 12 రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ గడువు ఈ నెల 22వ తేదీన ముగిసింది. వాస్తవానికి అదే రోజు నివేదిక తెప్పించుకొని ఒక కమిటీ వేసి నివేదికపై అధ్యయనం చేస్తారని ప్రచారం జరిగింది. తరువాత వారం రోజుల కు ఉద్యోగ సంఘాల జేఏసీతో సిఎం సమావేశమవుతారని అనుకున్నారు. నివేదిక గడువు ముగిసినా అలజడి లేకపోవటంతో నివేదిక తుదిరూపునకు మరి కొన్ని రోజులు పడుతోందని సంకేతాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది బడ్జెట్ లోనే ఫిట్ మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు ఆదుకుంటారని తెలుస్తుంది. దీని పై ఉద్యోగ సంఘాల కు కీలక సంకేతాలందాయి.వేతన సవరణపై ఆశలు ఏవీ లేవని ఏప్రిల్ దాకా ఆగాల్సి ఉంటుంద ని కీలక నేత ఒకరు తమ సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దాంతో వేతన సవరణ పై తమకెలాంటి ఆశల్లేవుని ,వచ్చే బడ్జెట్ తర్వాతే జీతాల పెంపు ఉండొచ్చు అని ఉద్యోగ జేఏసీ కీలక ప్రతి నిధి ఒకరు తమ ప్రతినిధులకు స్పష్టం చేశారు.తెలంగాణలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో రద్దయిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టటానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదే పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ నియామకం ఉంటుందని సమాచారం.నేడు,రేపు జరిగే సమావేశాల్లో దీని పై కూడా చర్చించ నున్నట్లు తెలుస్తొంది. పలు రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ పై ప్రజాప్రతినిధులు అధ్యయనం చేశారు. ఆ నివేదిక ఆధారం గానే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం పై చర్చ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం టిఆర్ ఎస్ బలం కాంగ్రెస్ నుంచి చేరిన వారితో కలిపి 103గా ఉంది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు కల్పించేలా పరిమితి ఉంది. దీంతో ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రులు అవుతారని ప్రచారం జరిగినా, చట్ట పరిమితి వల్ల అవకాశం దొరకలేదు. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికి ఆ స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కుదరలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులను వదులుకోకుండా ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తే బాగుంటుందని చర్చలు జరుగుతున్నాయి.  

History Shiv Sena Party

సిద్ధాంతం కాదు... పదవే ముఖ్యం... చరిత్రకెక్కిన సేన పోరాటం...

ఊహించని ట్విస్టులు, మలుపుల తర్వాత మరాఠా పీఠం చివరికి పులి పంజాకి చిక్కింది. అయితే,  ముఖ్యమంత్రి పదవి, అధికారం కోసం పాతికేళ్ల స్నేహాన్ని, నమ్మిన సిద్ధాంతాలను అలవోకగా వదిలేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లాగే తమకు సిద్ధాంతం కాదు... పదవే ముఖ్యమని తేల్చేసింది. శివసేనకు అధికారం, సీఎం పదవి కొత్త కాదు... కానీ ఈసారి చేసిన పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. నిజమే, శివసేనకు అధికారం కొత్తకాదు. 1995లో, 2014లో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. అయితే, మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనది ప్రత్యేకమైన పాత్ర. పొలిటికల్ కార్టూనిస్టయిన బాల్ ఠాక్రే ముంబై రాజకీయాల్లోకి చాలా విచిత్రంగా అడుగుపెట్టారు. ముంబైలో మరాఠీలను కాదని, వలసవాదులకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందంటూ పెద్ద ఉద్యమానికే బీజం వేశారు. అప్పట్నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముంబైలో శివసేన వేళ్లూనుపోయింది. స్థానికతను లేవనెత్తి మరాఠీల మనసుల్లోకి చొచ్చుకుపోయింది. అలాగే, కరుడుగట్టిన మత ఛాందసవాద పార్టీగా ముద్రపడిన శివసేన, ఆ తర్వాత నెమ్మదిగా మరాఠీ అనుకూల సిద్ధాంతం నుంచి హిందూత్వ అజెండా దిశగా అడుగులు వేసింది.  ఇక, మహారాష్ట్రను ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ కాగా, తొలి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి పీఠం శివసేనకే దక్కింది. బీజేపీ సహాయంతో 1995 నుంచి 99వరకు మహారాష్ట్రను శివసేన ఏలింది. అయితే, బీజేపీ-సేన మధ్య స్నేహం కొంతకాలం చెడింది. వాజ్ పేయి ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా ఉన్నా, ఆ తర్వాత 2014వరకు పెద్దగా సత్సంబంధాలు కొనసాగలేదు. అయితే, 2014 ఎన్నికల్లో కూడా విడివిడిగానే పోటీచేశాయి. అయితే, చర్చల అనంతరం అటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా చేరింది. కానీ, రెండు పార్టీల మధ్య మళ్లీ విభేదాలు రావడంతో... 2018లో బంధం తెగింది. అయితే, 2019 ఎన్నికల్లో మళ్లీ కలిసి పోటీ చేశాయి. అయితే,  ఈసారి 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ముఖ్యమంత్రి పీఠం చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో... మళ్లీ ఇద్దరి మధ్య తెగదెంపులు జరిగాయి. అయితే, ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకున్న శివసేన... బీజేపీతో పాతికేళ్ల స్నేహబంధాన్ని తెంచుకుని.... సైద్ధాంతిక విభేదాలున్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అలా, సీఎం పీఠం కోసం శివసేన చేసిన రాజకీయం.... హిందూత్వ వాదాన్ని, సిద్ధాంతాలను పక్కనబెట్టిన విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

AP Govt Sets Target to Complete Polavaram Project in Two Years

ఇంకా టైం పడుతుంది... నామమాత్రంగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు

సుదీర్ఘ విరామం తర్వాత పోలవరం ప్రాజెక్టు దగ్గర పనులు ప్రారంభమైయ్యాయి. స్పిల్ వే, స్పిల్ చానల్ లో నీరు నిలిచిపోవడంతో తోడేసిన తర్వాత పనులు మరింత ఊపందుకోనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కొంత పురోగతి మొదలైందనే చెప్పలి. మొత్తం మీద 6 నెలల తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు దగ్గర గత కొంత కాలం నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను పూర్తిగా నిలిపివేసింది. అంతేకా కుండా రీటెండరింగ్ విధానం ద్వారా కాంట్రాక్టును మార్చాలనే ప్రతిపాదన తలెత్తడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆ తర్వాత కాంట్రాక్టును మార్చారు. నవయుగ స్థానంలో కొత్త మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు. పనులు అప్పగించిన తరువాత ఒక్కసారిగా గోదావరికి వరదలు రావడంతో మొత్తం పనులు ప్రారంభించటానికి ఎటువంటి ఆకాశం లేకుండా పోయింది.వరద అధిక స్థాయిలో రావడంతో స్పిల్ వే పై నుండి నీరు ప్రవహించింది. అందు కారణంగా పనులు అసలు ఏమాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. మరో పక్క ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర కూడా వరద నీరు చాలా వేగంగా వెళ్లడంతో ఆ కాపర్ డ్యామ్ కొట్టుకు పోతుందన్న భయం నెలకొంది. కానీ దాదాపు రెండు నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేది. కాని వరద నీరు తగ్గు ముఖం పట్టినప్పటికీ స్పిల్ వేలో మాత్రం నీరు అలానే ఉండి పోయాయి. స్పిల్ వే తో పాటు స్పిల్ చానల్ లో కూడా నీరు అలాగే నిలబడిపోయింది.ఈ పనులకు సంబంధించి జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సమీక్ష జరిపారు. ఆ సమీక్షలో పనులు వేగంగా జరగటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద చూస్తే పోలవరం పనులు ప్రారంభమైనా పూర్తిస్థాయిలో సాగనట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదో రెండు మూడు యంత్రాలు పెట్టి మాత్రం పనులు నామమాత్రంగా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు అదే విధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు స్పష్టంగా చెప్తున్నారు.

RTC employees

ఆర్టీసీ కార్మికులకు బలవంతపు రిటైర్మెంట్..! సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ కేబినెట్

ఆర్టీసీ సమస్యకు శాశ్వత ముగింపు పలికేందుకు కేసీఆర్ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రగతిభవన్‌లో సమావేశమవుతోన్న తెలంగాణ మంత్రివర్గం... ఆర్టీసీ కార్మికుల భవితవ్యాన్ని తేల్చేయబోతోంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతోన్న ప్రభుత్వం.... కార్మికులకు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేసి ఇంటికి పంపించనుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆర్టీసీ సమ్మె చట్టబద్ధంకాదని లేబర్ కమిషనర్ అండ్ లేబర్ కోర్టు తేల్చితే... కార్మికులకు తప్పనిసరి రిటైర్మెంట్ స్కీమ్‌ ఇప్లిమెంట్ చేయాలని భావిస్తోంది. 15ఏళ్ల సర్వీస్... 50ఏళ్లు దాటిన కార్మికులందరినీ ఇంటికి పంపేందుకు రంగంసిద్ధమైందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, 48వేల మంది కార్మికుల్లో మెజారిటీ సిబ్బంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. అయితే, తప్పనిసరి రిటైర్మెంట్ స్కీమ్‌ అమలుచేస్తే, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, గత తీర్పులు, ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేస్తే, ఆర్టీసీ కార్మికులకు పెన్షన్, గ్రాడ్యుటీతోపాటు ఫైనల్ సెటిల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 48వేల మంది కార్మికులు ఉండటంతో... ఎంతమేర నిధులు అవసరమవుతాయి... వాటిని ఎలా సమీకరించుకోవాలన్నదానిపై కేబినెట్ చర్చించనుంది. అయితే, కంపల్సరీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది అత్యంత సున్నితమైన కీలక నిర్ణయం కావడంతో... కేబినెట్ సమావేశాన్ని రెండ్రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీసీయే ప్రధాన అజెండాగా సమావేశమవుతోన్న మంత్రివర్గం.... చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుందని అంటున్నారు.

No funds to pay salary to RTC employees

ఒక్కరోజు మానేస్తే 8రోజుల జీతం కట్... 52డేస్ మానేస్తే ఇంకా జీతమేంటన్న ప్రభుత్వం

ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. ఒకవైపు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకునేందుకు ససేమిరా అంటోన్న ప్రభుత్వం.... మరోవైపు జీతాలు కూడా చెల్లించేది లేదంటూ మరో షాకిచ్చింది. వేతనాలు చెల్లించకపోవడంతో... 48వేల మంది కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే జీతాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరగా, ప్రభుత్వం సరికొత్త వాదనలు వినిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు చెల్లించలేమన్న ప్రభుత్వం... పేమెంట్ ఆఫ్ పేజెస్ యాక్ట్-7 ప్రకారం ఒకరోజు విధులకు హాజరుకాకుంటే... 8రోజుల జీతం కట్ చేయవచ్చని... ఆ లెక్కన, కార్మికులు 52రోజులుగా సమ్మెలో ఉండటంతో జీతాలు చెల్లింపు సాధ్యంకాదంటూ హైకోర్టు వాదించింది. దాంతో, జీతాలు కూడా వస్తాయో రావోనన్న భయం ఆర్టీసీ కార్మికులను వెంటాడుతోంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల ఆందోళనలతో డిపోల దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బలవంతంగా విధుల్లో చేరేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండటంతో ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాంతో, కొన్ని డిపోల దగ్గర పోలీసులు-కార్మికుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరుగుతున్నాయి. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరిపై మండిపడుతోన్న ఆర్టీసీ జేఏసీ... సమస్య పరిష్కారం కోసం కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయం తీసుకుంది. సమ్మె విరమించినా, కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడంపై అఖిలపక్షాలతో చర్చించిన ఆర్టీసీ జేఏసీ... ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.

ycp govt wasting public money for advisors

ఏపీ ఖజానాలో డబ్బుల్లేవు కానీ.. 19 మంది సలహాదారులు, లక్షల్లో జీతాలు!

  వైసిపి అధికారం లోకి వచ్చినప్పటి నుంచిసలహాదారుల నియామకం ఒక ప్రవాహంగా సాగుతుంది. టిడిపి హయాంలో 6 సలహాదారులు మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురికి క్యాబినెట్ ర్యాంక్ ఉండేది. ఈ సలహాదారుల్లో చివరి దాకా ఉన్నవారు ఒకరిద్దరేనని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు వైసీపీ కి ఏకంగా 19 మంది సలహాదారులున్నారు. అందులో 10 మందికి క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. ఒక్కొక్కరికీ జీతభత్యాల కింద రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షలు చెల్లిస్తున్నారు. వారి సహాయక సిబ్బంది జీతభత్యాలు దీనికి అదనం. ఒక వైపు డబ్బుల్లేవంటూ ఆర్భాటాలకు పోకూడదని అంటూనే సలహాదారుల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో 25 మంది సభ్యులున్నారు. ఈ సంఖ్యకు పోటా పోటీగా సలహాదారుల నియామకాలున్నాయి. విచిత్రమేమిటంటే రాష్ట్రంతో సంబంధం లేని వారిని కూడా సలహాదారుడుగా నియమించుకున్నారు.  మొత్తం సలహాదారుల్లో ఎక్కువ మందిని రాజకీయ లేదా ఇతర పునరావాసం కోసం నియమించుకున్నారని ఆరోపణులున్నాయి. వీరు ఎలాంటి సలహాలిస్తున్నారు.. ఇస్తున్న సలహాలను ప్రభుత్వ పెద్దలు ఎలా స్వీకరిస్తున్నారన్నదే అర్థం కావటం లేదు. చాలా మందికి ఈ పదవులు అలంకార ప్రాయమేనని ప్రభుత్వ పెద్దలకు సలహాలిచ్చేంత సాహసం వీరు చెయ్యలేరనే వాదన కూడా ఉంది. మరింత విచిత్రమేంటంటే చాలా మంది సలహాదారులకు సచివాలయంలో కూర్చునేందుకు ఛాంబర్ల కూడాలేవు. సలహాదారులు ఎక్కడ కూర్చొని సలహాలు ఇస్తున్నారని దానిపై స్పష్టత లేదు. పెంపకమే లక్ష్యంగా పదవులను సృష్టించటానికి సలహాదారుల నియామకమే ఒక ఉదాహరణ. మీడియాకు సంబంధించే ముగ్గురు సలహాదారులున్నారు. పరిశ్రమల శాఖకు కూడా 3 సలహాదారులను నియమించారు. ఐటీకి 2 సలహాదారులను ఇచ్చారు. అష్టకష్టాల్లో ఉన్న ఆర్ధిక శాఖకు ఒక సలహాదారును కేటాయించారు. ఆ సలహాదారు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ప్రజా వ్యవహారాలకు ఒక సలహాదారును ప్రజా విధానాలకు ఒక సలహాదారును విడివిడిగా నియమించారు. గల్ఫ్ దేశాలతో ఏపీ పారిశ్రామిక సంబంధ బాంధవ్యాలు నెలకొల్పేందుకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి మరీ ఒక సలహాదారును నియమించారు. వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్ కుమార్ చంద్రబాబు హయాం నుంచి అదే పోస్టులో ఉన్నారు.

16 day old girl kidnapped from govt hospital in Khammam

శోకసంద్రంలో తల్లి.. ఖమ్మం జిల్లాలో 16 రోజుల పసికందు అపహరణ

  నవంబర్ 26వ తేదీ ఉదయం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవి, నాగరాజు దంపతుల పసిబిడ్డ అపహరణకు గురైంది. ఖమ్మం ధర్మాస్పత్రిలో రమాదేవి 16 రోజుల క్రితం డెలివరీ అయింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా ఉంటున్న రమాదేవిని ఒక మహిళ గమనిస్తూ వచ్చింది. మంగళవారం ఉదయం ఇంజక్షన్ చేయించి తెస్తానంటూ పసికందును తీసుకెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో రమాదేవి ఆస్పత్రి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. సైబర్ టీం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని పోలీస్ స్టేషన్ లను ఎలర్ట్ చేశారు. సైబర్ సిబ్బందితో పాటు పెట్రోలింగ్ సిబ్బంది అలాగే ఇతర పోలీస్ విభాగాలకు చెందిన వారితో 3 బృందాలను ఏర్పాటు చేసి పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళతో పాటు ముగ్గురు ఉన్నట్టు సమాచారం. ఖమ్మం నగరంతో పాటు విజయవాడ, నందిగామలో దర్యాప్తు చేస్తున్నారు. 2 ప్రత్యేక టీంలు నిందితుల కోసం గాలిస్తున్నాయని తెలిపారు ఖమ్మం సీఐ గోపి. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు అమర్చినా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల రోగుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. నిత్యం జన సంచారం వైద్య సిబ్బంది కదలికలు.. సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉన్నప్పటికీ శిశువు అపహరణకు గురి కావడం విమర్శలకు తావిస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరాలను నమ్ముకుని భద్రతా విషయాల పై దృష్టి సారించడం లేదనే వాదనలున్నాయి. సీసీ కెమెరాలు ఆవరణలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

occults pooja performed at srikalahasti temple

శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన ఆలయ ఏఈవో ధనపాల్ అరెస్ట్

  లంకెబిందెలు..నిధులు.. ఉన్నాయని నమ్మి క్షుద్రపూజలు.. చేతబడులు.. చేస్తునే ఉన్నారు కొందరు అమాయకులు. కానీ అన్ని తెలిసి.. చదువుకున్న మూర్ఖులను తక్కువగా చూస్తూ ఉంటాము. ఆ కోవలోకే చెందుతాడు మన ఆలయ ఏఈవో ధనపాల్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల పై ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ఆరా తీసింది. ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  శ్రీకాళహస్తి అనుబంధాలయమైన భైరవకోనలో నవంబర్ 26న అమావాస్య రోజు కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వాళ్లలో ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ కూడా ఉన్నారు. ఆలయానికి చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటపెట్టారు తమిళనాడుకు చెందిన ముఠా. ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ చెబితేనే క్షుద్ర పూజలు నిర్వహించామని చెప్తున్నారు. భైరవకోన ఆలయంలో నిక్షిప్తమైన నిధుల కోసమే క్షుద్ర పూజలు నిర్వహించారా అనే విషయం విచారణలో తెలియాల్సి ఉంది. ఆలయ ఏఈవో ధన్ పాల్ గతంలో కూడా క్షుద్ర పూజలు నిర్వహిస్తూ సస్పెన్షన్ కు గురయ్యారు.

it officials enquired gangstar nayeem wife haseena begum

టైలరింగ్ చేసి ఆస్తులు సంపాదించానని చెప్పిన నయీం భార్య

  నయీం ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడింది ఐటీ శాఖ. నయీం ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరారు ఐటీ అధికారులు. అటు నయీం భార్య హసీనాబేగంను కూడా విచారించారు ఐటి అధికారులు. ఆమె దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు. టైలరింగ్ ద్వారా ఆస్తులు సంపాదించినట్లు తెలిపారు నయీం భార్య హసీనా బేగం. ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేసుకున్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్ లకు పాల్పడిన గ్యాంగ్ స్టర్ నయీం 2016 లో జరిగిన పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. అప్పటి నుంచి నయీం దందాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు నయీం అనుచరులను కూడా జైలులో వేశారు. తాజాగా ఐటీ శాఖ నయీం ఆస్తులపై ఫోకస్ పెట్టింది.ఎనకౌంటర్ తర్వాత ఆయన బినామీ ఆస్థుల వ్యవహారం పెద్ద ఎత్తున బయటికి వచ్చింది. ఆ ఆస్తుల పైన ఐటి శాఖ , ఇంటితో పాటుగా వాళ్ల కుటుంబ సభ్యులకు 2016-17 సంవత్సరంలోనే నోటీసులు జారీ చేసింది. వాళ్ళ ఇంటికి ఐటీ శాఖకు సంబంధించిన నోటీసులు కూడా అంటించారు. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన ఆస్థుల వివరాలు ఇవ్వాలని గతంలో లేఖ రాసారు ఐటి అధికారులు. ఆ లేఖ ఆధారంగా కొంత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఐటీ అధికారులు నయీం భార్య హసీనా బేగంని పిలిపించారు. ఆమె చెప్పిన సమాధానాలతో ఒక్క సారిగా షాక్ కి గురైయ్యారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వైఎస్ఆర్ కాపునేస్తం, కడప స్టీల్ ప్లాంట్‌

  ఏపీ ప్రభుత్వం పథకాల పరంపర కొనసాగిస్తోంది. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో జగన్ సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కాపు సామాజికవర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ. 1101 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. కుటుంబానికి రూ. 2.5 లక్షల లోపు ఆదాయం ఉండి.. 45 ఏళ్లు దాటిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేల సాయం అందించనున్నారు.  కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. నవశకం సర్వే ద్వారా వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపైన చదువుకునే విద్యార్థులకు రూ.20వేల ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇళ్ల పట్టాలపై హక్కు కల్పిస్తూ పేదలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరుగుతుందన్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిల్లో రోగులకు అందని మందులు.. ఎంపీ ఆకస్మిక తనిఖీ

  సకాలంలో ఆస్పత్రులకు మందులు సప్లై చేసి రోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత జిల్లా వైద్యశాఖాధికారులది. అయితే మందుల సరఫరా విషయంలో అధికారులు అంతులేని జాప్యం వహించారు. కర్నూలులో వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో కోట్ల విలువ చేసే మందులు హాస్పిటల్స్ కు సరఫరా చెయ్యక మూలనపడ్డాయి. సరైన సమయంలో ఆసుపత్రులకు మందులు సరఫరా అవుతున్నాయా.. వాటిని డాక్టర్లు రోగులకు పంపిణీ చేస్తున్నారా లేదా అని పర్యవేక్షణ లేకపోవటంతో ఖరీదైన మందులు కాలం చెల్లిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూల్ జనరల్ ఆస్పత్రి పక్కన ఉండే కర్నూల్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు ఆసుపత్రులకు మందుల సరఫరా మందులు రోగులకు ఏ మేరకు పంపిణీ అవుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. దాదాపు 2 కోట్ల విలువ చేసే మందులు జిల్లాలోని సర్కారు ఆస్పత్రులకు సరఫరా కాలేదని. దీనివల్ల 112 రకాల మెడిసిన్స్ ఎక్స్ పైర్ అయ్యాయని ఎంపీకి తెలిపారు. అధికారుల మాటలు విన్న ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ షాకయ్యారు.  కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,18 సామాజిక ఆరోగ్య కేంద్రాలు,22 అర్బన్ హెల్త్ సెంటర్లు, నంద్యాలలో జిల్లా ఆస్పత్రి, ఆదోనిలో ఏరియా ఆసుపత్రి ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్యను బట్టి 3 నెలలకు ఒకసారి మందుల కోసం అధికారులు ఆన్ లైన్ లో ఇండెంట్ పెడతారు. ప్రభుత్వం మందులకు సరిపడా బడ్జెట్ కూడా ఏమాత్రం ఆలస్యం కాకుండా మంజూరు చేస్తుంది. ఆ నిధులతో మందుల కంపెనీల ద్వారా మెడిసిన్స్ కొని జిల్లాలకు పంపుతారు. కంపెనీల నుంచి వచ్చిన డ్రగ్స్ మంచివా కాదా అని అధికారులు పరిశీలించాక ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇండెంట్ ప్రకారం మందులు ఆసుపత్రికి సరఫరా అయ్యాయా లేదా అని వైద్యాధికారులు దృష్టి సారించడం లేదు. సర్కార్ హాస్పిటల్స్ కు మందుల సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ చేసే ఆఫీసర్ లు లేకపోవటం వల్ల మందులు జిల్లా కేంద్రంలోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సర్కార్ మందులు అందడం లేదు. మరోవైపు డాక్టర్ లు కూడా హాస్పటల్స్ కు వచ్చే పేషెంట్ లకు మెడిసిన్స్ బయటకు రాసిస్తున్నారు.  కర్నూలులోని ఒక జనరల్ ఆసుపత్రిలో మినహా మిగతా ఆసుపత్రుల్లో ఏడాది క్రితం నుంచి మందులు రోగులకు అందటం లేదు. ప్రభుత్వం ఇచ్చే మందుల కోసం వారాల పాటు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది మందులు ఇవ్వడం లేదంటూ ఏవో కొన్ని మందులు ఇచ్చి మిగతా మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్న మందులు దొరకడం లేదని పేషెంట్స్ మండిపడుతున్నారు.  

ప్రత్యర్థితో లాలూచీ.. సిద్ధాంతాలు, విధి విధానాలతో పనిలేదు.. అధికారమే ముఖ్యం

  ఈమధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు తీరును పరిశీలిస్తే సామాన్యులందరికి పలు సందేహాలు కలుగుతున్నాయి. తమ పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా పోరాడిన వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలు పరుగులు పెడుతున్నాయి. అధికారం అనే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలు దత్తత తీసుకున్నాయి. ఫలితంగా ఓటర్లకు ఏ భావజాలను చెప్పి ఆకర్షించారో.. అందుకు భిన్నమైన అభిప్రాయాలున్న పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు వాళ్లు చేస్తే మేము చేయడం తప్పా అని ఎదురుదాడితో తమ వాదనను సమర్థించుకుంటున్నారు.  కొన్నాళ్ల క్రితం కశ్మీర్ లో బీజేపీ,పీడీపీ తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీది వేర్పాటువాద భావజాలం, బీజేపీది కరుడు గట్టిన జాతీయవాదం. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్ గా మారిపోయింది. శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని బిజెపి ప్రశ్నిస్తే కశ్మీర్ అంశాన్ని సమాధానంగా చెబుతోంది. ఒక్క కశ్మీర్ మరో మహారాష్ట్ర మాత్రమే కాదు, ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసి ఒకరి పై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసి ప్రజా తీర్పు అంటూ కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేసిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అలా చూస్తే భావజాలం సిద్ధాంతాలు అన్ని ఓటర్లను మభ్య పెట్టటానికేనని అర్థమవుతుంది. చివరికి అంతిమ సూత్రం అధికారమే అవుతుంది.  ప్రతిపక్షంలో వుండడానికి ఏ ఒక్క పార్టీ కూడా సిద్ధపడటం లేదు.ఆ ఆలోచనే వారిని అసహనానికి గురిచేస్తోంది. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలు ఏది లెక్కలోకి రావడం లేదు. గతంలో అధికార పార్టీతో సమానంగా ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత ఉండేది. కానీ రానురాను రాజకీయం ఓ వైపు మగ్గిపోతోంది. అధికార పార్టీ అంటే తిరుగులేని రాజ్యాధికారాన్ని అనుభవించమని నయా పాలకులు నేర్చుకున్నారు. ఫలితంగా ప్రతిపక్షంలో ఉండటం నేతలకు నచ్చడం లేదు. అందుకే అధికారం అందుకనే సమీకరణాలూ ఏ పార్టీతో సరిపోతాయో లెక్కలేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా సుస్థిరంగా లేకపోయింది. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు కళ్ళముందు కదలాడుతుండగానే మధ్యప్రదేశ్ లో సింధియా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో తిరుగులేని మెజారిటీ ఉన్న వైసిపి సర్కార్ కూడా నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.  పార్టీలు మారడం అనేది చొక్కా మార్చినంత సులువుగా తయారైంది. ఫిరాయింపు నిరోధక చట్టాలు తెచ్చినా పార్టీలే తమ కోసం కొన్ని లూప్ హోల్స్ ఉంచుకున్నాయి. దాంతో ఆ చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ఆ చట్టాలు తెచ్చిన పార్టీలే బాధితులుగా మారుతున్నాయి. బాధితులైన పార్టీలు అధికారంలోకి వచ్చాక దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేయడం లేదు. తాము ఆ లూప్ హోల్స్ నుంచి లబ్ధి పొందకూడదా అనే ధోరణిలో ఆపరేషన్ లు చేసుకుంటున్నాయి. దాంతో పార్టీ ఫిరాయించే వారికి ఏ ఆటంకం లేకుండా పోయింది. విపక్షంలో ఉండటమే అసహనంగా భావించే పరిస్థితి రావడానికి అసలు కారణం ఏమిటి.. అధికారం అండతో ప్రభుత్వాల్ని మార్చేసే ప్రజా తీర్పుకు అర్థం ఏముంటుంది.. ఈ పరిస్థితులు మారాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి.

టీటీడీ డాలర్ల కుంభకోణం కేసు మళ్ళీ విచారణ జరపాలని ఆదేశాలు జారీ

  తిరుమల శ్రీవారి ఆలయంలో 2006 లో వెలుగు చూసిన డాలర్ల కుంభకోణం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. నిత్యం విక్రయించే బంగారు డాలర్లలో 300 బంగారు డాలర్లు గల్లంతయ్యాయి. డాలర్ల చోరీపై ప్రాథమికంగా టిటిడి విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించారు. ఈ కేసును విచారించిన విజిలెన్స్ అధికారులు డాలర్లు విక్రయించే షరాబు వెంకటాచలపతి పైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అయితే వెంకటాచలపతి నేరం అంగీకరించకపోవటంతో శ్రీ వారి ఆలయంలో విక్రయించే డాలర్ల కౌంటర్ లో 300 డాలర్లు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో షరాబు వెంకటాచలపతితో పాటు అప్పటి బొక్కసం ఇన్ చార్జ్ డాలర్ శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఈవో ప్రభాకర రెడ్డి, పేష్కార్ వాసుదేవన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వెంకటాచలపతి ఇంట్లో 3 బంగారు డాలర్లు లభించటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ అధికారులు షరాబు వెంకటాచలపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో వెంకటాచలపతి నేరాన్ని ఒప్పుకున్నాడు. తప్పుడు లెక్కలు చూపి ఆ డబ్బును తన అవసరాల నిమిత్తం వినియోగించుకున్నానని చెప్పాడు.  అయితే డాలర్ కేసు అంతటితో ఆగలేదు. డాలర్లతో పాటు వేల కోట్ల విలువ చేసే శ్రీవారి ఆభరణాల కూడా మాయమైపోయాయని దీని వెనుక ఆభరణాల ఇన్ చార్జి డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. టీటీడీ అధికారులు శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని ఎన్ని ప్రకటనలు చేసిన ఆందోళనలు విమర్శలు ఆగడం లేదు.దీంతో డాలర్ల కుంభకోణం కేసును టిటిడి అధికారులు సీబీసీఐడీకి అప్పగించారు. విచారించిన సీబీసీఐడీ అధికారులు శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని తేల్చి చెప్పారు.  2008 లో అప్పటి ఈవో రమణాచారి ఆదేశాలతో డాలర్ కుంభకోణం కేసును సీవీఎస్వో రమణ కుమార్ మళ్లీ విచారించారు. వెంకటాచలపతితో పాటు ఆలయ డిప్యూటీ ఈవో ప్రభాకర్ రెడ్డి, పేష్కార్ వాసుదేవన్, డాలర్ శేషాద్రికి కుంభకోణంలో సంబంధం ఉందని వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలంటూ నివేదిక ఇచ్చారు. నివేదిక లీకవడంతో టిటిడి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నివేదిక తప్పుల తడకని డాలర్ శేషాద్రితో పాటు ఇతర ఉద్యోగులెవరికీ ఈ కేసుతో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్ల కుంభకోణంకు సంబంధించి పలు విచారణలు దర్యాప్తుల అనంతరం 2014 లో రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ప్రకటించడం జరిగింది. కేసుకు సంబంధించి టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అలాగే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాలర్ శేషాద్రితో పాటు మరి కొందరు అధికారులు నిర్దోషులుగా బయట పడ్డారు.  ఇక డాలర్ కుంభకోణం ముగిసిపోయిందని అంతా భావించగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించడం చర్చనియాంశంగా మారింది. ప్రధాన నిందితుడు వెంకటాచలపతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మందిని విచారించి 3 నెలల్లో నివేదిక సమర్పించాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సత్యనారాయణను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి ఉషా రాణి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో చెంచులక్ష్మి మృతి చెందటంతో 16 మంది ఉద్యోగులను అధికారులు విచారించనున్నారు. డాలర్ శేషాద్రితో పాటు ప్రభాకరరెడ్డి, వాసుదేవన్ కు క్లీన్ చిట్ లభించటంతో వారి పేర్లను తొలగించారు. ఎప్పుడో ముగిసిన కేసును తిరిగి తెరపైకి తేవడంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఈ బంగారు డాలర్ల కుంభకోణం ఓ మాయని మచ్చలా మిగిలిపోవడం ఖాయం.