డాక్టర్ సుధాకర్ లాగానే నన్ను వేధించారు.. కన్నీటి పర్యంతమైన దళిత మహిళా డాక్టర్

వైజాగ్ లో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ విషయం లో ఎం జరిగిందో అందరికి తెలిసిందే. తాజాగా తిరుపతి లోని ఒక దళిత మహిళా డాక్టర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలుస్తోంది. దళిత మహిళనైన తనను వైసిపి నేతలు అసభ్య పదజాలం తో దూషించి వేధించారని ప్రభుత్వ మహిళా డాక్టర్ సంచలన ఆరోపణలు చేసారు. తిరుపతి కి చెందిన మహిళా వైద్యురాలు అనితారాణి ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు అతి గతి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గమైన గంగాధర నెల్లూరు లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు గా ఆమె పనిచేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం వచ్చినా.. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ఇక్కడే ఉద్యోగంలో చేరారు. ఐతే ఆమె పెనుమూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దిగువ స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు తన పై కక్ష కట్టారని ఆమె పేర్కొన్నారు. గత మార్చ్ 22 జనతా కర్ఫ్యూ రోజు న కొంత మంది తాను ఉంటున్న హాస్టల్ లోనే తనను నిర్బంధించి స్థానిక వైసిపి నేతలను పిలిచారన్నారు. ఆ తరువాత తనను వారంతా కలిసి అనేక రకాలుగా దుర్భాషలాడుతూ, తనను వేధించారని ఈ సందర్బంగా బాత్ రూమ్ కు వెళ్లిన తన ఫోటోలు, వీడియోలు తీసి దారుణమైన వ్యాఖ్యలు చేసి మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. ఇదే విషయమై వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఐతే పోలీసులు మాత్రం కేసు ఫైల్ చేయకుండా ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్టేషన్ లోనే కూర్చో బెట్టారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో కేసు పెట్టవద్దని తన పై అధికారుల ద్వారా ఫోన్ లో వత్తిడి తెచ్చారని చెప్తూ ఆమె విలపించారు. తాజాగా ఆమె ఈ విషయం గురించి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన్ లో వివరించడం తో ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే ఇదే విషయమై ఆమె తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తోంది.

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. అసలీ 'జీవో 111' అంటే ఏంటి?

ప్రస్తుతం తెలంగాణలో 'జీవో 111' చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ 'జీవో 111' కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించడంతో ఈ మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్లు తిప్పడంతో రేవంత్ అరెస్ట్ కూడా అయ్యారు. తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే, తాజాగా ఫామ్ హౌస్ వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో.. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకే చాలామందికి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, సామాన్యులు మాత్రం అసలు ఈ 'జీవో 111' అంటే ఏంటి?.. 'జీవో 111' కి విరుద్ధంగా నిర్మాణాలు ఏంటి? అంటూ చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ ‌కు వరదలు రాకుండా దాదాపు వందేళ్ల క్రితం మూసీ నదిపై ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ అని రెండు రిజర్వాయర్లు కట్టారు. ఈ రిజర్వాయర్లు అప్పట్లో సుమారు పది లక్షల మంది దాహాన్ని తీర్చేవి. అయితే, నగరం నానాటికీ విస్తరిస్తున్న క్రమంలో ఈ రిజర్వాయర్లకు ప్రమాదం ఏర్పడింది. వీటి చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించి.. ఎన్నో​ నిర్మాణాలు వెలిశాయి. దీంతో, సహజ సిద్ధంగా రిజర్వాయర్లకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ రెండు రిజర్వాయర్లు కనుమరుగైపోతాయనే ఆందోళన నుంచే 'జీవో 111' పుట్టింది. ఆ రెండు రిజర్వాయర్లను కాపాడే చర్యలు చేపట్టమని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. 1996లో నాటి ప్రభుత్వం జీవో 111ని జారీ చేసింది. దీని ప్రకారం ఆ రెండు రిజర్వాయర్ల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టరాదు. ఒక స్థలంలో పది శాతం మేరకు, కేవలం నివాసం కోసం మాత్రమే.. అది కూడా జీ ప్లస్‌ 2(మొత్తంగా మూడంతస్తులు)కి మించకుండా నిర్మాణం చేపట్టాలి.  ఆ రెండు రిజర్వాయర్ల పరిధిలోని ఆరు మండలాలు శంషాబాద్‌, మొయినాబాద్‌, షాబాద్‌, శంకరపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల కు 'జీవో 111' వర్తిస్తుంది. ఈ మండలాల పరిధిలో మొత్తం 84 గ్రామాలు ఉన్నాయి. ఈ 84 గ్రామాలలో జీవో 111 కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ, బడా బాబులు మాత్రం జీవో 111 నిబంధనలను పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం జీవో 111 పరిధిలో 13 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని అంచనా. 4,000 వరకు ఫామ్‌హౌస్​లు, 50 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండొచ్చని తెలుస్తోంది. జీ ప్లస్‌ టూ నిబంధనకు తూట్లు పొడుస్తూ ఐదు, ఆపై అంతస్తులతో కట్టిన అక్రమ నిర్మాణాలు ఈ ప్రాంతంలో ఎన్నో కనిపిస్తాయి. మరి ఇప్పుడు అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాల పని పడతారేమో చూడాలి.

క‌రోనాను జయించిన న్యూజిలాండ్‌.. యాక్టివ్ కేసులు జీరో!

కరోనాను అరికట్టడానికి ప్రపంచ దేశాలు నానా పాట్లు పడుతున్న వేళ.. న్యూజిలాండ్ మాత్రం కరోనాను జయించిన దేశంగా అవతరించింది. తమ దేశంలో చివరి కరోనా పేషంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. ఆక్లాండ్‌కు చెందిన క‌రోనా బాధిత మ‌హిళ సెయింట్ మార్గరెట్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పుడు ఆ దేశంలో కరోనా యాక్టివ్ కేసులు జీరో అయ్యాయి. ఫిబ్రవరి 28న న్యూజిలాండ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఫిబ్రవరి 28 నుండి మే 22 వరకూ 1504 కేసులు నమోదు కాగా, మే 22 తర్వాత కొత్త కేసులు నమోదు కాలేదు. చివరి కరోనా పేషెంట్ తాజాగా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో, ఇప్పటివరకూ మొత్తం 22 మంది చనిపోగా, 1482 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా ఇప్పుడా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. అమెరికాతో సహా ఎన్నో అగ్ర దేశాలు కరోనా నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న వేళ.. న్యూజిలాండ్ సాధించింది గొప్ప విజయమే అని చెప్పాలి. ప్రపంచంలో లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలుచేసిన దేశాల్లో న్యూజిలాండ్‌ ముందు వరుసలో ఉంది. అందుకే, ఇప్పుడా దేశం కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. ఇళ్ల నుంచి ఎవ్వర్నీ బయటకు రానివ్వలేదు. అత్యవసర, నిత్యవసరాలకు మాత్రమే బయటకు పంపారు. అది కూడా పూర్తీ జాగ్రత్తలు పాటించారు. దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యం లోకి కూరుకుపోయినా పర్వాలేదన్న అక్కడి ప్రధాని.. ఒక్కసారి కరోనా వెళ్లిపోతే మళ్లీ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని, అందుకోసం అందరం కలిసి గట్టిగా ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. అటు ప్రధాని, ఇటు ప్రజలు కలిసి ఉక్కు సంకల్పంతో కరోనాను జయించారు. 

పీఐబీ అధికారికి కరోనా.. ఆందోళనలో కేంద్ర మంత్రులు!

దేశమంతటికీ కరోనా సమాచారం అందిస్తున్న పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - జాతీయ మీడియా కేంద్రం) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధాట్ వాలియాకు కరోనా వైరస్ సోకింది. అనారోగ్యంతో బాధపడుతున్న వాలియాకు పరీక్షలు నిర్వహించిన అధికారులు కరోనా పాజిటివ్ గా తేల్చారు. వాలియాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని మూసివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వాలియా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పీఐబీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. నేటి నుంచి పీఐబీ కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల నిర్వహణను శాస్త్రిభవన్ కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు.  కాగా, కరోనా సోకిన పీఐబీ అధికారి వాలియా.. జూన్ 3వ తేదీన కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమార్, ప్రకాష్ జవదేకర్ లతో కలిసి.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఆ రోజు మీడియా సమావేశానికి వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేయాలని నిర్ణయించామని, వారికి కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు.

కరోనా విజృంభణ.. నాలుగో స్థానానికి చేరువలో భారత్!!

భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 9,983 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనాతో 206 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది. ఇప్పటివరకు 1,24,095 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 1,25,381  మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల్లో స్పెయిన్‌ను దాటి భారత్‌ 5వ స్థానానికి చేరింది. ప్రస్తుతం దాదాపు 2,86,000 కేసులతో యూకే నాలుగో స్థానంలో ఉండగా.. 2,41,000 కేసులతో స్పెయిన్‌ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్.. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే.. మూడు నాలుగు రోజుల్లో నాలుగో స్థానానికి చేరే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎన్టీఆర్... చంద్రబాబు... అందులో ఒక్కటే!

క్రమశిక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఒక్కటేనని నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. తన తండ్రి తర్వాత అంతటి క్రమశిక్షణను చంద్రబాబులో చూశానని ఆయన ప్రశంసించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో తెల్లవారుజామున ఎన్ని గంటలకు ఎన్టీఆర్ నుండి ఫోన్ వచ్చినా... డ్రైవర్ లేకపోయినా సరే స్వయంగా చంద్రబాబు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారని బాలకృష్ణ తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభిమాని అని తెలుసుననీ, కడప టౌన్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా చేశారనీ బాలకృష్ణ అన్నారు. అయితే అభిమానం, రాజకీయాలు వేర్వేరు అని స్పష్టం చేశారు. అభిమానిగా జగన్ తనను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. అప్పట్లో ఎన్టీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీలో బోల్డంతమంది అభిమానులు ఉండేవారనీ ఈ సందర్భంగా బాలకృష్ణ  గుర్తు చేసుకున్నారు. 

శ్రీవారి దర్శనం ప్రారంభమైంది

కరోనా వైరస్‌ ప్రభావంతో 80 రోజుల పాటు నిలిచిన శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం నుంచి శ్రీవారి దర్శనాన్ని టీటీడీ పున:ప్రారంభించింది. మూడు రోజుల పాటు ట్రైల్ రన్ క్రింద ఉద్యోగులు, స్థానికులను  టీటీడీ దర్శనానికి అనుమతించనుంది. రెండురోజులు టీటీడీ ఉద్యోగులకు, మూడో రోజున స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించి ట్రయల్‌ నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి ఇతర ప్రాంతాల భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.   ఈ ఉదయం 9 గంటలకు దర్శనాలను ప్రారంభించగా, స్వామివారి సేవలో తరిస్తున్న టీటీడీ ఉద్యోగులు స్వామిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. మాస్క్ లను ధరించిన ఉద్యోగులు.. భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు. కాగా, సుదీర్ఘ విరామం అనంతరం, దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ.. శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలకరించారు.

హైదరాబాద్ ను పక్కన పెట్టి టెన్త్ పరీక్షలు జరుపుకోండి: హైకోర్టు

ఇండియాలో కరోనా ఎంటర్ కావడం తో దేశం మొత్తం మార్చ్ 23 నుండి లాక్ డౌన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి కాకుండానే పాఠశాలలకు సెలవులు ప్రకటించడం తో 10 వ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఐతే తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ లో ఈ నెలలోనే 10 వ తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యం లో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కొంత మంది తల్లితండ్రులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని పై ఈ రోజు జరిగిన విచారణ లో కోర్టు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది. రంగారెడ్డి, జీహెచ్ఎంసి పరిధిలో కరోనా కేసులు ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకున్నామని.. అందువల్ల ఇక్కడ కూడా రాష్ట్రం తో పాటు టెన్త్ పరీక్షలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును అనుమతి కోరింది. ఐతే హైదరాబాద్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్క విద్యార్ధి అయినా కరొనతో మరణిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ లోగా పరీక్షా కేంద్రాలుగా ప్రకటించిన ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా మారితే అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించింది. జీహెచ్ఎంసి పరిధిలో కరోనా తీవ్రత దృష్ట్యా అక్కడ పరీక్షలకు పర్మిషన్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఐతే జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ద్వారా అనుమతించాలని ఐతే వారిని కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

అమెరికా కంటే ఎక్కువ కేసులు భారత్ లోనే!!

కరోనా కేసులలో అగ్రరాజ్యం అమెరికా అగ్ర స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాము ఎక్కువ పరీక్షలు చేసాం కాబట్టి, ఎక్కువ కేసులు వచ్చాయని.. ఒకవేళ భారత్, చైనా వంటి దేశాలలో కూడా తమలాగే ఎక్కువగా పరీక్షలు చేస్తే.. అక్కడ కూడా ఎక్కువ కేసులు బయటపడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వ్యాఖ్యానించారు. మెయిన్ న‌గ‌రం‌లో ఓ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ కంపెనీని సందర్శించిన ట్రంప్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేశామన్నారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. పరీక్షలు ఎక్కువ చేస్తే.. కేసులు పెరుగుతాయి. ఒక వేళ ఇండియా, చైనా వంటి ఇతర దేశాల్లో పరీక్షలు విస్తృతంగా చేస్తే.. అక్కడా ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడతాయి అని నేను హామీ ఇస్తున్నాను అన్నారు. జర్మనీ, ద‌క్షిణ కొరియాతో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువ పరీక్షలు చేసినట్లు ట్రంప్ తెలిపారు. జ‌ర్మ‌నీలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 40 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారని, ద‌క్షిణ కొరియాలో 30 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారని తెలిపారు. అమెరికాలో పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉందని ట్రంప్ చెప్పారు‌.

జో బిడెన్.. ట్రంప్ తో సమరానికి సై!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్య‌ర్థిగా 'జో బిడెన్' అధికారికంగా ఖరారయ్యారు. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది. అలాగే, అదే పార్టీకి చెందిన బెర్ని శాండర్స్ సైతం ఏప్రిల్‌లో పోటీ నుంచి తప్పుకోవడంతో బిడెన్‌కు రూట్ క్లియర్ అయ్యింది. దీంతో, న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న అధ్యక్ష ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్‌ తో బిడెన్ తలపడనున్నారు. . ‌77 ఏళ్ల బిడెన్ 36 ఏళ్ల నుంచి సెనేటర్‌గా కొనసాగుతున్నారు. బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిడెన్‌ 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.  అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి బిడెన్‌ ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించారు. అయితే, డెమొక్రాట్ల మద్దతు పొందలేకపోయారు. తాజాగా, మూడోసారి ప్రయత్నించి విజయం సాధించారు.  ప్రతినిధులు తనకు మద్దతు ఇవ్వడంపై  బిడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన గౌరవమని అన్నారు. దేశం గతంలో ఎన్నడూ చూడని నిరుద్యోగాన్ని చవిచూస్తోందని, 1960 తర్వాత అంతటి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అంటూ ట్రంప్ పై విమర్శలు కూడా మొదలుపెట్టారు. త్వరలో బిడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.  అంతకుముందు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ఆరోపణలు చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లారీ ఓనర్లను అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ధర్నా వ్యవహారం వెనక ఉన్న అధికార పార్టీ ఉందని ఆరోపించారు. ఇదంతా జేసీ కుటుంబంపై బుదరజల్లే ప్రయత్నమని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.

గర్భం తో ఉన్న ఏనుగు ఘటన మరిచిపోక ముందే.. తాజాగా ఆవు

కేరళ లోని పాలక్కాడ్ లో గర్భం తో ఉన్న ఏనుగు కు ఆహారంగా క్రాకర్స్ నింపిన పైన్ ఆపిల్ ఇచ్చి దాని ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. దీని పై సెలబ్రిటీల దగ్గరనుండి సామాన్యుల వరకు తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా గర్భంతో ఉన్న ఆవు పై ఇదే తరహాలో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని జాందూత ప్రాంతంలో గర్భంతో ఉన్న ఓ ఆవు పై ఇదే తరహా ప్రయోగం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ అవుకు పెట్టిన గోధుమ పిండి ముద్దలో క్రాకర్స్ పెట్టటం తో ఆ పేలుడు ధాటికి ఆవు దవడలు మొత్తం పగిలిపోయి, నోటి నుంచి వేలాడుతున్నాయి. దాని నోటిలో బాంబు పేలడం తో ఏమి తినలేని తాగలేని పరిస్థితుల్లో ఆ ఆవు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి స్థానికంగా వైరల్ గా మారింది. ఆ ఆవు యజమాని గురుదయాళ్ సింగ్ కథనం ప్రకారం ఆయన ఇంటి పొరుగున ఉన్న నందలాల్ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.ఈ దాడి జరిగిన తరువాత నందలాల్ పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు.

ఏపీ సచివాలయంలో పది కరోనా కేసులు!!

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. తాజాగా సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సచివాలయంలో కరోనా బారిన పడ్డ ఉద్యోగుల సంఖ్య పదికి చేరింది. కరోనా కలకలంతో, అప్రమత్తమైన అధికారులు ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.  ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌రావడంతో.. సచివాలయంలో పని చేస్తున్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగితో సన్నిహితంగా ఉన్నవారంతా, బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. అయినప్పటికీ ఇప్పటివరకు పది కేసులు నమోదయ్యాయి. మరోవైపు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‌సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఆరోగ్యసేతు యాప్‌ ఉంటేనే ఇకపై కార్యాలయంలోకి అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. కరోనా ‌విజృంభిస్తున్న కారణంగా ఉద్యోగులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ ‌చేసుకోవాలని, యాప్‌ ఉన్న ఉద్యోగులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే, థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ చేశారు.

జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభం కానుందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 45 రోజుల యాత్రను 15 రోజులకు కుదించింది. జూన్ 21 నుంచి ఆగస్టు 3 వరకు కేవలం 15 రోజులు మాత్రమే యాత్ర కొనసాగనుంది. వాస్తవానికి ఈ యాత్ర షెడ్యూల్‌ను జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకూ కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా తేదీలను మార్చి.. జులై 21కు వాయిదా వేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సాధు సంతువులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని అధికారులు తెలిపారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 55 ఏళ్లు దాటినవారికి యాత్రకు అనుమతి లేదు. యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్ సోకలేదని, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లను.. యాత్రకు వెళ్లడానికి ముందే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ కి.. క్షవరం అయితే కానీ వివరం రాలేదు!!

క్షవరం అయితే కానీ వివరం రాదు.. ఈ సామెత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ గా సరిపోతుంది. అసలే కేంద్రంలో అధికారంలో లేదు. సర్లే, ఒకటి అరా రాష్ట్రాలలో అధికారంలో ఉందని అధిష్టానం సంతోషించే లోపే.. పలువురు నేతలు కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి.. ఉన్న ఆ కొన్ని రాష్ట్రాలలో కూడా అధికారం దూరం చేస్తున్నారు. ఇక, తాజాగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. పార్టీ రాష్ట్ర నాయకత్వాలు ప్రతి నాయకుడి మీద కన్నేసి ఉంచాలి. కానీ, గుజరాత్ కాంగ్రెస్ కి ఆ ఆలోచనే లేనట్టుంది. ఆదమరిచి ఉన్న సమయంలో గట్టి దెబ్బ తగిలింది. రెండు రోజుల వ్యవధిలో కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. రిసార్టు రాజకీయాలకు తెరలేపింది. 65 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌లోని రిసార్టులకు తరలించేసి.. ఎవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజ్యసభ ఎన్నికల వేళ.. ఆదమరిస్తే రాజ్యసభలో సీటు మిస్సవుతుంది. దీంతో ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేసి.. ఎవరూ హ్యాండ్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. ముగ్గురు ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తేనే కానీ, కాంగ్రెస్ కి జ్ఞానోదయం కాలేదన్నమాట.

కరోనా కేసుల విషయం లో ఇటలీని దాటి ఆరో స్థానం లోకి భారత్

భారత దేశం లో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క లాక్ డౌన్ సడలించడం తో పాటు ప్రజల రాకపోకలు పెరుగుతుండటం తో వైరస్ పల్లెలకు కూడా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం నాటికీ భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2,35,000 గా నమోదయింది. దీంతో భారత్ ఇటలీ ని దాటి ఆరో స్థానం లోకి చేరింది. మొదటి స్థానం లో అమెరికా ఉండగా తరువాతి స్థానాల్లో బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ నిలిచాయి. ఇక భారత దేశం లో గత 24 గంటల్లో 9.851 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఇప్పటివరకు 6,348 మంది మరణించారు. తాజాగా ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,250 కి చేరింది. ఇటు తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య 3,290 కి చేరింది.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్ళు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మొత్తం 60వేల మంది ఉండగా, వారిలో 30 నుండి 40శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా విద్యార్థులకు 5వేల నుండి 6వేల రూపాయల విలువ గల స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించినట్టు సమాచారం.

గోదావరిపై ప్రాజెక్టులను తక్షణమే ఆపేయండి!!

గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) ఆదేశించింది. అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని స్పష్టం చేసింది.  శుక్రవారం హైదరాబాద్‌లోని జీఆర్‌ఎంబీ కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని గతనెల 19న ఏపీ‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చ జరిగింది.   గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను రెండు రాష్ట్రాలూ తక్షణమే నిలుపుదల చేయాలని.. వాటి డీపీఆర్‌లను సమర్పించాలని జీఆర్‌ఎంబీ ఆదేశించింది. ఈ నెల పదో తేదీలోపు డీపీఆర్‌లను సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సమ్మతించాయి. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చించాల్సిన ఎజెండాను కూడా అదే తేదీలోగా ఇచ్చేందుకు అంగీకరించాయి.