ys jagan forgot his promises

జగన్ హామీలకే దిక్కు లేదా? మాట తప్పం...మడం తిప్పమనేది ఉత్తుత్తి మాటలేనా?

రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని హామీలైనా ఇస్తారు... గెలిచాక ముఖం చాటేస్తారు... ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రకటనలను... నేతల హామీలను నమ్మి... ప్రజలు మోసం పోవడం కామన్... అదే, పరిస్థితి రాజకీయ నేతలకు ఎదురైతే... అప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో... వైసీపీలో కొందరు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది... తొమ్మిదేళ్లుగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన కొందరిని వివిధ హామీలిస్తూ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని... లేదా నామినేటెడ్ పోస్ట్ కట్టబెడతానని హామీ ఇచ్చారు. ఇక కొందరికైతే ఏకంగా మంత్రి పదవినే ఆఫర్ చేశారు. వీళ్లలో కొందరికి వ్యక్తిగతంగా చెప్పగా, మరికొందరికైతే బహిరంగంగా ప్రజలు ముందే హామీ ఇచ్చారు.  జగన్ అనుకున్నట్లే వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే ఆర్నెళ్లు కూడా గడిచిపోయాయి. కానీ, జగన్ నుంచి హామీలు పొందినవాళ్ల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. కనీసం వాళ్లకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలాంటి బాధితుల బాధితుల జాబితా వైసీపీలో ఎక్కువగానే ఉంది. ఈ లిస్ట్ లో  గుంటూరు జిల్లా చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్ ఒకరు. ఎన్నికలకు ముందువరకు మర్రి రాజశేఖరే చిలకలూరిపేట వైసీపీ అభ్యర్ధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఒకసారి పోటీచేసి ఓడిపోయారు. అయితే, ఎన్నికలకు ముందు అనూహ్యంగా మర్రిని తప్పించి ఎన్నారై విడదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా మర్రికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత 90శాతం కేబినెట్ ను మార్చేస్తానని జగన్ చెప్పడంతో.. మరి రెండో విడతలో అవకాశమిస్తారో లేక ఆ హామీనే పక్కనబెడతారో చూడాలి.  ఇక, గుంటూరు వెస్ట్ లేళ్ల అప్పిరెడ్డిదీ ఇదే పరిస్థితి. అప్పిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కనీసం జగన్ నుంచి పిలుపే రాలేదు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పంలో పోటీచేసి ఓడిపోయిన చంద్రమౌళి పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. చంద్రబాబుపై పోటీ అంటే ఆశలు వదులుకుని బరిలోకి దిగాల్సిందే. అయితే, వైసీపీ అధిష్టానం చంద్రమౌళిని టెంప్ట్ చేసి పెద్దఎత్తున నిధులు ఖర్చు పెట్టించిందని అంటున్నారు. ఎన్టీఆరే ఓడిపోయిన సందర్భాలున్నాయని, నీవు కూడా చంద్రబాబును ఓడిస్తావంటూ భారీగా డబ్బు ఖర్చు పెట్టించారని, దాంతో చంద్రమౌళికి దాదాపు రోడ్డునపడిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఓడిపోయినాసరే, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని చంద్రమౌళికి కూడా జగన్ హామీ ఇచ్చారట. కానీ, ఇప్పుడు జగన్ దర్శన భాగ్యం కూడా దొరకడం లేదని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై అనూహ్య విజయం సాధించిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిదీ ఇదే పరిస్థితి. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ బహిరంగంగా ప్రజల ముందే జగన్ ప్రకటించారు. తీరా చూస్తే కేబినెట్లో ఆర్కేకి చోటు దక్కలేదు. ఇక, ప్రకాశం జిల్లా పర్చూరులో గొట్టపాటి భరత్ దీ కూడా ఇదే పరిస్థితి. చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వర్రావుకి టికెట్ కేటాయిండంతో... గొట్టిపాటి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తానంటూ హామీ ఇఛ్చారు. అయితే, ఇప్పుడు జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని అంటున్నారు. వీళ్లందరి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు ఉందంటున్నారు. తమకిచ్చిన హామీలపై జగన్ ను నిలదీయలేక... కనీసం తమకు ఎప్పుడు న్యాయం చేస్తారని అడగలేక... తమలో తామే కుమిలిపోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, జగన్ మాటిస్తే తప్పడని, కొంచెం ఆలస్యమైనా, తమకిచ్చిన హామీని నిలబెట్టుకుంటారనే ఆశతో ఎదురుచూస్తూ గడిపేస్తున్నారు. మరి వీళ్ల టైమెప్పుడు వస్తుందో... ఎప్పుడు పదవులు దక్కుతాయో చూడాలి.   

These Old Phones Will Be Cut off From WhatsApp in 2020

2020 ఫిబ్రవరి నుండి ఆ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు

2020 ఫిబ్రవరి నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మీద నడిచే కొన్ని స్మార్ట్ ఫోన్ లకు ఇక పై వాట్సప్ నిలిచిపోనున్నట్లు ప్రకటించింది సంస్థ. విండోస్ ఫోన్లకైతే పూర్తిగా ఈ సపోర్టు నిలిచిపోనుంది. వీటికి సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లో తెలిపింది. అంతేకా కుండా ఆయా స్మార్ట్ ఫోన్లలో కొత్త వాట్సప్ ఖాతాను సృష్టించటం కానీ దాన్ని వెరిఫై చేసే అవకాశం కూడా ఉండదు. ఇంతకీ ఏ ఏ స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ నిలిచిపోతుందంటే ఐవోఎస్ 8 లేదా దానికంటే పాత ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేసే ఆపిల్ ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ పనిచేయదు. అప్పటి వరకూ వీరు ఈ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ ను ఉపయోగించుకోవచ్చు.  ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ 2,3,7 అంతకన్నా పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మీద నడిచే అన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఫిబ్రవరి 1,2020 వరకు మాత్రమే ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేస్తుందనీ తర్వాత పని చేయదని సంస్థ ప్రకటించింది. ఒకవేళ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ల పై మాత్రమే నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ వాడాలనుకుంటే ఒకటే దారి, ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లలో ఇన్ స్టాల్ అయిన వాట్సాప్ ను అప్ డేట్ చెయ్యకూడదు, అన్ ఇన్ స్టాల్ చేయకూడదు, అప్పుడు మాత్రమే మీరు ఈ ఫోన్లలో వాట్సాప్ ను వాడగలరు. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే ఫోన్లన్నింటికీ ఈ సపోర్టు నిలిచిపోనుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫిబ్రవరి 1,2020 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తూ వుంటే విండోస్ ఫోన్లకు కాస్త ముందుగానే అంటే 2019 డిసెంబర్ 31 తరువాత వీరికి వాట్సప్ అప్ డేట్స్ రావు. జియో ఫోన్ వినియోగదారులకు ఈ అప్ డేట్స్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టం 251 పైన నడిచే అన్ని మొబైల్స్ లోనూ వాట్సప్ పనిచేయనుంది. వీటిలో జియో ఫోన్ జియో ఫోన్ 2 కూడా ఉన్నాయి కాబట్టి ఆయా ఫోన్లలో వాట్సప్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

Manda Krishna Madiga Fires on AP CM YS Jagan

జగన్ పై మందకృష్ణ ఫైర్.. రెడ్డి కులానికి ఓ న్యాయం, వేరే కులాలకు ఓ న్యాయమా?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ నిప్పులు చెరిగారు. పైకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా... సొంత సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డమ్మీ పదవులు కట్టబెట్టి... ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం రెడ్డి సామాజికవర్గంతో నింపేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ ఎస్సీ, బీసీ మైనారిటీలకు అన్యాయం జరిగితే పట్టించుకోని సీఎం జగన్.... తన సొంత సామాజికవర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఆగమేఘాల మీద స్పందిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం మీద ప్రమాణంచేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి... న్యాయ వ్యవస్థకు, చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్ కౌంటర్ ను అసెంబ్లీ సాక్షిగా సమర్ధించమేంటని ప్రశ్నించారు. బాధితురాలు దిశ... జగన్ సామాజికవర్గం కాబట్టే నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారని, అలాగే కేసీఆర్ కు హ్యాట్సాప్ చెప్పారని.... మరి హాజీపూర్ లో ముగ్గురు బీసీ బాలికలను హత్యాచారం చేసి మృతదేహాలను బావిలో పూడ్చేసిన శ్రీనివాస్ రెడ్డిని.... అలాగే జడ్చర్లలో బాలికపై అత్యాచారం చేసిన చంపేసిన నవీన్ రెడ్డిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయమని కోరలేదని మందకృష్ణ నిలదీశారు. ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్ కౌంటర్ చేసినప్పుడు... నలుగురు అమ్మాయిలను చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయమని కోరడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. ఇక, వైఎస్ హయాంలో 11మంది గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారానికి పాల్పడి చంపేసినా.... ఆయేషామీరాను రేప్ అండ్ మర్డర్ చేసినా... ఇప్పటివరకూ న్యాయం జరగలేదని మందకృష్ణ గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్.... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఇద్దరూ కూడా తమ తమ సొంత సామాజికవర్గాలకు అన్యాయం జరిగితే ఒకలా... ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరిగితే మరోలా స్పందిస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. అయినా, ఆర్ధిక నేరగాళ్లపై వేగంగా న్యాయ విచారణ జరిపించి, నేరం రుజువైతే ఉరిశిక్ష విధించేవిధంగా వైసీపీ ప్రభుత్వం చట్టం చేయగలదా అంటూ మందకృష్ణ ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి చట్టాన్ని కేంద్రం చేస్తే సమర్ధించే దమ్ము జగన్ కి ఉందా అంటూ మందకృష్ణ నిలదీశారు.  

Harish rao missing in finance ministry meetings

సమావేశాల్లో కనిపించని హరీష్ రావు.. ఆర్ధిక మంత్రి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ శాఖపై రివ్యూ చేస్తారో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించటం కూడా కష్టంగా మారింది. మెరుపులు లేకుండానే పిడుగుల్లాంటి నిర్ణయాలను గతంలో ఎన్నో ఆయన ప్రకటించారు. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత శాఖల మంత్రులు తప్పకుండా ఉంటారు. కానీ తెలంగాణ రాజకీయంలో ఆర్ధిక శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం ఆ మంత్రి ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సీఎం ఈ శాఖపై సమీక్ష జరిగేటప్పుడు యాదృచ్చికమో మరేమిటో కాని ఆ శాఖ మంత్రి మాత్రం ఉండటం లేదు. గతంలో ఈటెల రాజేందర్ ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడు కూడా ఇలానే జరిగింది. బడ్జెట్ పై రివ్యూలు జరిగినా.. ఆర్థిక పరిస్థితి పై సమీక్ష జరిగినా ఆయన ఉండకపోయేవాడు. కొన్నిసార్లు శాఖకు సంబంధించిన మంత్రికి నిర్ణయాలను చెప్పే వారు కాదని ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వచ్చారు. సీఎం కేసీఆర్ ఫైనాన్స్ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అంతేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆర్థిక శాఖపై సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర విధానాలను విమర్శించారు.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు.. ఇవన్నీ కూడా హరీశ్ రావు లేకుండానే జరిగాయి. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశమై వారికి వరాల జల్లు కురిపించినప్పుడు కూడా హరీశ్ లేరు. ఇక ఆర్థిక శాఖను ఎవరు నిర్వహించినా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనక తప్పదేమో అనేలా ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ చర్చ ఆర్థిక శాఖలోనూ, సెక్రటేరియట్ లోను జోరుగానే నడుస్తోంది. మరి ఆర్ధికశాఖ రివ్యూలకు ఆ శాఖ మంత్రి హాజరు కాకుండా ఉండటం కొనసాగుతుందో.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

DK Aruna in race for post of Telangana BJP chief

మహిళా సంకల్ప దీక్ష.. తెలంగాణ బీజేపీ చీఫ్ గా డీకే అరుణ!! 

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి తమదైన శైలిలో వెళుతున్నారు ఆశావహులు. అధ్యక్ష పీఠం ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా రెండు రోజుల పాటు మహిళా సంకల్ప దీక్ష చేపట్టనున్నారు మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. ఇదే అంశం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తో సంబంధం లేకుండా నేరుగా జాతీయ స్థాయి నాయకుల అండదండలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మహిళల పై జరుగుతున్న అనేక దాడులకు మద్యమే కారణమని భావించి తెలంగాణలో మద్యం నిషేధించాలంటూ రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు.  జాతీయ స్థాయి నేత రాంమాధవ్ ద్వారా బీజేపీలో చేరిన జేజమ్మకు ఆయన ఆశీస్సులు మెండు గానే ఉన్నాయి. దీంతో రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండానే నేరుగా అధిష్టానం ఆదేశాల మేరకు స్వయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు దీక్ష కార్యక్రమం చేపడుతున్నారని బిజెపి పార్టీలో వినిపిస్తున్న మాట. ఒక వైపు లక్ష్మణ్ తనకి మరోసారి అవకాశం వస్తుందని భావిస్తున్నప్పటికీ.. డీకే అరుణ అధిష్టానం లోనూ ఇటు ప్రజల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలుస్తోంది. ఈ నెల 12,13 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద అరుణ దీక్ష చేయనున్నారు. మద్యపాన నిషేధ ఉద్యమం వెనుక అసలు ఎజెండా ఇదేనా అన్నది హాట్ టాపిక్ అయ్యింది. రామ్ మాధవ్ ఆశీస్సులతోనే.. అధ్యక్ష పదవి డీకే అరుణకు రాబోతున్నదా అన్నది బిజెపి వర్గాల్లో చర్చకు దారితీసింది.  

Atchannaidu Fires On Marshals Over Denied Chandrababu Entry Into AP Assembly

చంద్రబాబుపై మార్షల్స్ దౌర్జన్యం... ఏపీ అసెంబ్లీలో రణరంగం

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీ మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారు. జీవో 2430పై నిరసన తెలుపుతున్న చంద్రబాబు అండ్ టీడీపీ ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ బయట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న బాబు, టీడీపీ సభ్యులపై చేయి చేసుకున్నారు. ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా చంద్రబాబును మార్షల్స్ చేయి పట్టుకుని లాగేశారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చీఫ్ మార్షల్స్ కు అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదని... కానీ ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా వ్యవహరించడం మాత్రం దారుణమన్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇదొక మాయని మచ్చ అన్నారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ చేయి వేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమను అసెంబ్లీ లోపటికి వెళ్లకుండా గేటు దగ్గరే అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్లకార్డులు, బ్యానర్స్, నల్ల బ్యాడ్జీలు వద్దని చెబితే తీసేశామని, కానీ పేపర్స్ కూడా తీసుకెళ్లొద్దని ఆదేశించడమేంటని అచ్చెన్న ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో చిన్న తెల్లకాగితం ఉండటంతో 40 నిమిషాలపాటు బయటే నిలబెట్టారని... ప్రతిపక్ష నేతతో వ్యవహరించే పద్ధతి ఇదేనా అంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే, అచ్చెన్నాయుడు ఆరోపణలను మంత్రి బుగ్గన ఖండించారు. అసెంబ్లీలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురాకూడదని టీడీపీ హయాంలోనే రూల్స్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. అంతేకాదు, టీడీపీ సభ్యులే రౌడీయిజం చేశారని, మార్షల్స్ ను తోసివేశారని బుగ్గన కౌంటరిచ్చారు. తమపై దాడి చేశారని టీడీపీ సభ్యుల తీరుపై మార్షల్స్ ఫిర్యాదు చేశారని బుగ్గన అన్నారు. అసెంబ్లీ సజావుగా సాగుతుంటే... టీడీపీ కావాలనే నానా యాగీ చేస్తోందని మండిపడ్డ బుగ్గన.... తెలుగుదేశం హయాంలో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదని గుర్తుచేశారు. బుగ్గన వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన అచ్చెన్నాయుడు.... రూల్స్ ఎప్పట్నుంచో ఉన్నాయని, కానీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకురాలేదా? బెంచీలు ఎక్కి అరవలేదా? అంటూ ప్రశ్నించారు. వైసీసీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని రాలేదని, బెంచీలు ఎక్కలేదని నిరూపిస్తే... ఇప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ అచ్చెన్న సవాలు విసిరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతోను, టీడీపీ ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన చీఫ్ మార్షల్ ను సభకు పిలిపించి స్పీకర్ మాట్లాడాలని, లేదంటే తాము సభలో ఉండలేమని అన్నారు. అయితే, స్పీకర్ తమ్మినేని విచిత్రంగా స్పందించారు. ప్రతిపక్షం ఇష్టానికి వదిలేస్తున్నట్లు తెలిపారు.

tdp mlas and mlcs protest on 2430

ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్న 2430... బాబుపై మరోసారి జగన్ తీవ్ర వ్యాఖ్యలు

2430 జీవో ద్వారా జగన్ ప్రభుత్వం మీడియాకి సంకెళ్లు వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీడియాను అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయమని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ విషయంలో కొన్ని ఛానళ్లపై ఎందుకు ఆంక్షలు విధించారని చంద్రబాబు ప్రశ్నించారు. జీవో 2430ను రద్దు చేయాలంటూ నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు.... సచివాలయం ఫైర్ స్టేషన్ దగ్గర నోటికి, చేతులకు, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని ఆందోళన నిర్వహించారు. 2430 జీవో తీసుకొచ్చి మీడియాను బెదిరించడం సరికాదని... ఆంక్షలను ఎత్తివేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. అనంతరం అసెంబ్లీలోనూ జీవో 2430పై తెలుగుదేశం ఆందోళనకు దిగింది. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. దాంతో, అధికార-ప్రతిపక్షాల మధ్య జీవో 2430పై తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. జీవో 2430పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసలు జీవోను చంద్రబాబు పూర్తిగా చదవారా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ అర్ధంకాక ఇలా మాట్లాడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. 2430 జీవోను సభలో చదివి వినిపించిన సీఎం జగన్.... నిరాధార వార్తలు రాసిన వారిపై ఫిర్యాదు చేసే అధికారాన్ని.... సంబంధిత శాఖలకు ఇచ్చామన్నారు. అసలు జీవోను తప్పుబట్టేందుకు అవకాశమే లేదన్నారు. అయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఇంగిత జ్ఞానం లేదని, అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. దాంతో, సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

KCR Fires on Narendra Modi

కాక మీదున్న కేసీఆర్... తెలంగాణకు రావాల్సిన కనీస నిధులను అందించని కేంద్రం

తెలంగాణ ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుతూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం పై మండిపడుతూ.. నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు కేసీఆర్. ఆ తరువాత బిజెపికి, టీఆర్ఎస్ కి మధ్య క్రమంగా సఖ్యత పెరుగుతూ వచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కీలక నిర్ణయాల విషయంలో కేసీఆర్ మోదీకి మద్దతు పలికారు. ఇంకా చెప్పాలంటే ఒకడుగు ముందుకేసి నోట్ల రద్దు సమయంలో రాష్ట్రంలో మొదటిగా స్పందించిన వ్యక్తి కేసీఆర్. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అనేక సవరణ బిల్లులు తీసుకొచ్చినప్పుడు టిఆర్ఎస్, బిజెపి వైపునే నిలబడింది. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టీఆర్ఎస్ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చాయి. ఈ సెకెండ్ టర్మ్ లో మాత్రం రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ కనబడుతుందనే చెప్పాలి. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలను అందించడం లేదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. పదేపదే తెలంగాణ సమస్యల పై కేంద్ర మంత్రులను కలుస్తున్నా వారు పెడచెవిన పెడుతున్నారని వినిపిస్తుంది. రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులు..పరిశ్రమల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనేది టీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇక ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణకు రావాల్సిన నిధుల్లో ఎంత మేరకు కత్తిరింపులు జరిగిందో పేర్కొన్నారు. ఆర్థిక మాన్యం లేదంటూ కేంద్రం అబద్ధాలు చెబుతోందంటూ మండిపడ్డారు. తెలంగాణకు రావలసిన నిధులను మంజూరు చేయండి లేదా ఆర్థికమాన్యం ఉందని ఒప్పుకోండి అంటూ కేంద్రాన్ని నిలదీశారు. రేపు జరుగుతున్న క్యాబినెట్ లో కూడా కేంద్రం వైఖరిపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇతర నిధులపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం. మరోవైపు క్యాబినెట్ సమావేశం తర్వాత రెండు 2,3 రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి మోదీని కలిసే అవకాశం ఉంది. మొత్తం మీద కేంద్రం వైఖరి పై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణలో పథకాలు బాగున్నాయని మెచ్చుకుంటున్నారు, తెలంగాణలోని సంక్షేమ పథకాలను బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు, తెలంగాణ చేస్తున్న విజ్ఞప్తులను మాత్రం పక్కన పెడుతున్నారు. ఈ ధోరణిపై ఖచ్చితంగా నిరసన తెలపాలని కెసిఆర్ భావిస్తున్నారు. కేంద్రం వైఖరి ఇలాగే కొనసాగితే రావలసిన నిధుల కోసం పోరాటానికి కూడా దిగాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక పై మోదీ సర్కారుపై మెతక వైఖరి వేడి తాడోపేడో తేల్చుకోపోతోంది కేసీఆర్ సర్కార్.

TDP MLAs ready to join bjp

బై బై బాబు.. టిడిపి నుండి బయటపడటానికి నేతల వ్యూహాలు..బీజేపీలోకేనా ??

  జంప్ అవ్వడం లేటవ్వచ్చేమో కానీ జంపింగ్ మాత్రం పక్కా అనే నినాదంతో ముందుకెళ్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు. అయితే ఆ జంప్ ఎటు చెయ్యాలన్నది తేల్చుకోలేక టిడిపి ఎమ్మెల్యేలు సతమతమైపోతున్నారు. మొదట బీజేపీలో చేరబోతున్నారని విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బిజెపి వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత మంది ఎమ్మెల్యేలతో త్వరలోనే బిజెపి కండువా కప్పు కుంటారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది.గంటా శ్రీనివాసరావు కూడా తాను పార్టీ మారట్లేదని చెప్పినప్పటికీ కుడా తెర వెనుక మాత్రం ఆయన బిజెపి నేతలతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బిజెపి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా బిజెపి అగ్ర నేత రామ్ మాధవ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యే దుబాయిలో జరిగిన సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్ మెంట్ లోను వీరు బిజెపి నేతలతో చర్చించినట్టుగా ప్రచారం జరిగింది. బిజెపి ఏపీలో పాగా వేసేందుకు మరియు పార్టీని బలోపేతం చేసేందుకు విపరీతమైన ప్రయత్నాలలో భాగంగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే గంటా ఇంకో పార్టీలోకి చేరడానికి రాజీనామా చేసి రావాలనే కండిషన్ లేకుండా చూడాలని కోరుతున్నారట. ఒకవేళ రిజైన్ చేసి ఎన్నికలకు వెళితే మళ్లీ గెలుస్తామో లేదో అన్న డౌట్ తో జాగ్రత్త పడుతున్నారు.గంటాకి రూట్ క్లియర్ అయితే ఆయన టిడిపిలోని ఐదుగురు ఎమ్మెల్యేలను కమలం గూటికి చేరుస్తానని చెప్తున్నారు. ఇక ఇప్పటికే వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా జరిగినా.... ఆయన టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం మరియు ఏలూరి సాంబశివరావులతో కలిసి ఆలోచన మార్చుకున్నట్టుగా ప్రచారం జరగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపిలోకి వెళ్లే కన్నా బిజెపిలోకి వెళితేనే ప్రయోజనముంటుందని భావిస్తున్నారు.వైసిపిలో ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ విషయంలోనైనా సరే వారికే ప్రయారిటీ ఉంటుంది తప్ప తమను పెద్దగా పట్టించుకోకపోవచ్చు అని అనుకుంటున్నారు. గ్రానైట్ క్వారీల మీద ఈ మధ్య విజిలెన్స్ దాడులు జరుగుతూండటంతో.... గొట్టిపాటి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన కూడా ఈ మధ్య పార్టీ లోని పరిస్థితులను చూసి మనసు మార్చుకున్నారు. కేవలం వ్యాపారం కోసమైతే బీజేపీలో చేరిన కూడా రక్షణ ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తన జోలికొచ్చే సాహసం బహుశా వైసిపి చెయ్యదని అనుకుంటున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన కరణం బలరాం కూడా వైసిపిలో తాను ఇమడలేనని భావిస్తున్నారు. తనకు బిజెపి అయితే మంచి ప్రాధాన్యత ఉంటుంది అని సన్నిహితులతో చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆ గంటా, గణబాబు చేరితే 2 బలమైన సామాజిక వర్గాలతో పార్టీ మరింత పటిష్టమవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. అన్ని కుదిరితే అతి త్వరలోనే తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగి కమలం కండువా కప్పుకోబోతున్నారు.

citizenship amendment bill rajya sabha

పౌరసత్వ బిల్లు.. మైనారిటీలకు భారత్ లోనే రక్షణ ఉందంటున్న అమిత్ షా

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.  ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందింది కనుక రాజ్యసభలో కూడా తప్పకుండా బిల్లుకు ఆమోదం లభిస్తుందని స్పష్టం చేశారు అమిత్ షా. పౌరసత్వ సవరణ బిల్లు చారిత్రక బిల్లు అని దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. పొరుగు దేశాల్లో మైనార్టీలకు రక్షణ లేదన్నారు. భారత్ లో మాత్రం మైనారిటీలకు పూర్తి రక్షణ ఉందన్నారు.  తృణమూల్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. నాజీల నుంచి ప్రేరణ పొందిన అమిత్ షా ఈ బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్. ఈ బిల్లు బెంగాలీలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారని ఆరోపించారు. క్యాబ్ బిల్ తప్పుల తడక అని విమర్శించారు. దేశ భక్తి గురించి తమకు అమిత్ షా పాఠాలు అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లును బెంగాల్ లోనే కాదు దేశ వ్యాప్తంగా తృణమూల్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు డెరిక్ ఒబ్రెయిన్.  ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చినట్లు విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు అమిత్ షా. పౌరసత్వ సవరణ బిల్లు మానిఫెస్టోలో ఉందని స్పష్టం చేశారు. భారత్ లో ముస్లింలకు పూర్తి రక్షణ ఉందన్నారు. పొరుగు దేశాల్లో వివక్ష కారణంగా భారత్ కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆనంద్ శర్మ. మతం ప్రాతిపదికన గత 70 ఏళ్ళలో ఎప్పుడూ భారత పౌరసత్వం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. ఎప్పట్నుంచో శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇస్తోందని స్పష్టం చేశారు ఆనంద్ శర్మ.

Pawan Kalyan to hold Rythu Soubhagya Deeksha in Kakinada

రైతుల సమస్యలపై నిరాహారదీక్ష చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్

మరో దీక్షకు సిద్ధమవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు ( డిసెంబర్ 12న ) కాకినాడలో చేపట్టనున్న దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో పవన్ ఈ దీక్షకు సిద్ధమవుతున్నారు. వరి పంట వేయటానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలున్నాయని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. గిట్టుబాటు ధర లేక ఖర్చుల రాబట్టుకోలేక రైతులు అప్పులపాలవుతున్నారని పవన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఈ నిరాహార దీక్ష తలపెట్టింది కేవలం జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతుల తాలూకు సమస్యలు మరియు బాధలను తెలియజేయటానికి " అని తెలిపారు. గత రబీ సీజన్ లోనూ ధాన్యం రైతులు తమ దుస్థితిని తన దృష్టికి తీసుకువచ్చారు అని తెలిజేసారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా!.... ఎందుకులే అని చెప్పి నేను ఒక లెటర్ తో సరిపెట్టాను. కాని ఇప్పుడు ఖచ్చితంగా వారికి గిట్టుబాటు ధర రావాలి..... కనీసం లాభసాటి ధర గురించి తరువాత చర్చించుకుందాం.. ముందు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయని పవన్ కళ్యాన్ తెలియజేశారు. జగన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన ముఖ్యంగా పంట చేతికి రావడానికి నెల రోజుల ముందే కస్టమ్ మిల్లు రైస్ ను ప్రకటించి ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు ధాన్యం తీసుకున్న 40 రోజుల తర్వాత హడావుడిగా అర్ధరాత్రి సిఎంఆర్ ప్రకటించి ఇంత వరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి మళ్లీ వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి వచ్చిందని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు అని తెలిజేసారు. కౌలు రైతులకి కూడా రైతు భరోసా కల్పించడంలో కుల విభజన ఎందుకని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటిని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది అని మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరారు.

Abhinandan Tops the Most Searched Personalities in Google

అభినందన్ నెంబర్ వన్.. ఆయన తర్వాతే సినిమావాళ్లు, క్రికెటర్లు

గూగుల్‌లో ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 ప్రముఖుల జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. గూగుల్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో వింగ్ కమాండర్ అభినందన్ మొదటి స్థానంలో ఉన్నారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను ఎదుర్కొనే ప్రయత్నంలో పాక్‌కు చెందిన యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చేశారు. అయితే ఆయన నడుపుతున్న మిగ్ 21 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయింది. ఆ తర్వాత అభినందన్‌ను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. దౌత్య ఒత్తిడితో ఆయన్ను మూడు రోజుల తర్వాత భారత్‌కు పాక్ అప్పగించింది. పాక్ బలగాల అదుపులో ఉన్నా.. చెక్కుచెదరని స్థయిర్యంతో భారత రక్షణ రంగ రహస్యాలను ఎక్కడా వెల్లడించకపోవడం అభినందన్ ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి. తాజాగా, గూగుల్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితా విడుదల చేయగా, అందులో అభినందన్ కు ప్రథమస్థానం లభించింది. రెండో స్థానంలో లతా మంగేష్కర్, మూడో స్తానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు.  

nara lokesh strong counter to roja

నేను ఆ బ్యాచ్ కాదు.. రోజాకి లోకేష్ కౌంటర్

  టీడీపీ నేత నారా లోకేష్... వైసీపీ నేత రోజాకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేత చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రోజా అయితే.. సొంత కొడుకుని గెలిపించుకోలేని.. చేతకాని, దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు మిగిలిపోయారు.. ఇప్పుడు ఆయనకు అసలు జగన్ గారిని అనే అర్హత లేదంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా రోజా వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. మాట్లాడితే నా ఓటమిని ప్రస్తావిస్తూ చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే బ్యాచ్ కాదు. నేను కావాలనుకుంటే మా నాన్న గెలిచిన కుప్పం నుంచి పోటీ చేసి.. నేను గెలిచానని కాలర్ ఎగరేయొచ్చు. కానీ నేను ఆ బ్యాచ్ కాదు. ఎక్కడైతే టీడీపీ బలంగా లేదో అక్కడ పోటీ చేసి గెలవాలి అనుకున్నా. మంగళగిరిలో 1985 నుండి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకే అక్కడ పోటీ చేసి గెలిచి చరిత్ర తిరగరాయాలనుకున్నా. ఆ దిశగా పని చేశా. కానీ ఓటమి ఎదురైంది. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని లోకేష్ వ్యాఖ్యానించారు.

Salary disbursal by AP govt delayed due to financial crisis

మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు వినబడటం లేదా?

సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలు నిజమేననిపిస్తున్నాయి. మాట తప్పం... మడమ తిప్పమని చెప్పుకునే జగన్... అధికారంలోకి వచ్చాక అనేక హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేను విన్నాను... నేను ఉన్నానంటూ చెప్పే సీఎం జగన్... కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గోస మాత్రం వినడం లేదంటున్నారు. ముఖ్యంగా మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మంత్రుల దగ్గర పీఆర్వోలుగా చేరి ఆర్నెళ్లు అవుతున్నా ఇఫ్పటివరకు జీతం ఇవ్వలేదని, కనీసం అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదని మాజీ జర్నలిస్టులు ఆవేదనకు గురవుతున్నారు. మంత్రులు తమకు నచ్చినవాళ్లను పీఆర్వోలుగా ఏర్పాటు చేసుకున్నాక అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని జీఏడీకి లేఖలు రాశారు. అలాగే నెలకు 30వేలు వేతనం ఇవ్వాలని సూచించారు. అయితే, 30వేలు సరిపోవని, కనీసం 50వేలు ఇవ్వాలంటూ మరో లేఖ రాశారు. మంత్రుల లేఖలు ఆర్ధికశాఖకు వెళ్లాయి. అయితే, పీఆర్వోలకు 30వేలు సరిపోతాయని ఆర్ధికశాఖ మెలిక పెట్టడంతో ఆ ఫైల్ ఎటూ కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు ఆర్నెళ్లు కావొస్తున్నా, పీఆర్వోలు మాత్రం మంత్రుల దగ్గర గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇవాళోరేపో అపాయింట్ మెంట్ ఆర్డర్స్ వస్తాయని, జీతాలు కూడా వస్తాయన్న ఆశతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఆర్నెళ్లు దాటినా ఇంకా అపాయింట్ మెంట్లు, జీతాలు రాకపోవడంతో పీఆర్వోలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కనీసం టీ తాగేందుకు కూడా డబ్బుల్లేక... తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమలిపోతున్నారు. అయితే, మంత్రుల పీఆర్వోలకు సంబంధించిన ఫైలు ఇప్పటివరకు సమాచారశాఖకు అందలేదని అంటున్నారు. అక్కడ్నుంచి ఫైలు ముందుకు కదిలితే తప్ప పీఆర్వోలకు జీతాలు వచ్చే అవకాశమే లేదంటున్నారు.  తమ పాలనలో ఉద్యోగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానంటూ గొప్పుగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి... ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదని అంటున్నారు. కనీసం మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోలకే జీతాలు ఇవ్వకపోతే, ఇక మిగతా ఉద్యోగుల బాధలు ఎలా అర్ధమవుతాయని అంటున్నారు. నేను విన్నాను... నేను ఉన్నాననే జగన్మోహన్ రెడ్డికి... సచివాలయంలో మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల దుస్థితి వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మరి, మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు ఎప్పుడు వినబడుతుందో... వాళ్ల కష్టాలు ఎప్పుడు తీరతాయో... ఆ దేవుడికే తెలియాలి.

ys jagan excellent strategy in politics

కొత్తవారికి స్వాగతం.. పాతవారికి న్యాయం.. జగన్ రాజకీయం అమోఘం

కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుక పోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటిది కృష్ణాజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిజానికి రాజకీయ చైతన్యానికి మారుపేరు కృష్ణా జిల్లా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ రాజకీయంగా ఎప్పుడూ ఏదో ఒక కలకలం జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు గన్నవరం నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి వీరిద్దరూ ఒకనాడు మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ఇరువురి మధ్య వైరం పెరిగింది. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చొరవ చూపడంతో ఎట్టకేలకు వీరిరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ మోహన్ టిడిపికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన వాట్సప్ లో పంపించిన లేఖ ఆ తర్వాత చేసిన వ్యతిరేక వ్యాఖ్యల పై టిడిపి హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ తన పై టిడిపి సస్పెండ్ వేటు వేయడానికి ముందే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని తెలుసుకున్న గన్నవరం పార్టీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంకటరావుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి బాలశౌరిలు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయనను జగన్ తో కూడా మాట్లాడించారు. వంశీని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావును వదులుకునేందుకు మాత్రం ససేమిరా ఇష్టపడలేదు. ప్రస్తుతానికి వంశీ శాసన సభలో తటస్థ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. అవసరమైనపుడు ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గన్నవరం నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలా లేదా అనేది నిర్ణయం తీసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది. ఇదిలా వుంటే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారొచ్చినా పాతవారిని వదులుకోకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానంగా కనిపిస్తుంది. తను ఇచ్చిన మాట ప్రకారం యార్లగడ్డ వెంకట్రావుని వెంటనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా జగన్ నియమించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఘన చరిత్రే ఉంది. ఇలాంటి బ్యాంకు చైర్మన్ గా నియామకం కావడం వెంకట్రావు కూడా సంతృప్తినిచ్చింది. ఆయనకు పదవి ఇవ్వడంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా జగన్ లైన్ క్లియర్ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారు. అలాగే గన్నవరం నియోజక వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా న్యాయం చేశారని వారు చెప్పుకుంటున్నారు. ఇక పెడన లోనూ ఇదే విధానాన్ని సీఎం జగన్ అనుసరించారు. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పార్టీ టిక్కెట్ ని ఆశించి భంగపడిన ఉప్పాల రాంప్రసాద్ కి కూడా సంతృప్తి కలిగేలా వ్యవహరించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని రాంప్రసాద్ కు కట్టబెట్టారు. నిజానికి పెడనకు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన జోగి రమేష్ కు చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పట్లో రాంప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించారు. అధికారం లోకొచ్చిన తర్వాత రాంప్రసాద్ కు న్యాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని ఉప్పాల రాంప్రసాద్ కు ఇచ్చారు. దీంతో జోగి రమేష్ కి కూడా పెడన నియోజకవర్గంలో పార్టీ పరంగా తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికి సీఎం జగన్ న్యాయం చేయడంతో పాటు పార్టీలోకి రావాలనుకునే వల్లభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఈ పరిణామం పై పార్టీ కేడర్ లో కూడా ఎటువంటి సందిగ్ధం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. మరి ఆ వ్యూహాలు మున్ముందు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.

డిబేట్ లకు వెళ్ళకండి.. సబ్జెక్టు లేకుండా టీవీ ఛానెల్లో కూర్చునే వాళ్లపై కేసీఆర్ ఫైర్

  టీవీ ఛానళ్ళు నిర్వహించే డిబేట్ లకు వెళ్లద్దని దాదాపు ఆరు నెలల క్రితమే పార్టీ నేతలపై ఆంక్షలు పెట్టారు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. అధికార స్పోక్స్ పర్సన్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఆ సమయంలోనే చెప్పారు. ఎంపీలు , ఎమ్మెల్యేలతో పాటు ఇది పార్టీలో అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఏకంగా పార్టీ అధ్యక్షుడే షరతు పెట్టడంతో నేతలంతా స్టూడియోలకు వెళ్ళడం మానేశారు. అవగాహన లేకుండా కొందరు ఛానెళ్లలో మాట్లాడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ప్రెస్ మీట్లు.. అది కూడా అనుమతి తీసుకొని పెడుతున్నారు. పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్.. అటు శాసనసభాపక్షం ఆఫీసులోనైనా పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడానికి వీళ్లేదని సీఎం హెచ్చరించారు.ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై.. పార్టీపై.. విమర్శలొచ్చిన రెండు సంఘటనలున్నాయి. ఒకటి ఆర్టీసీ సమ్మె కాగా రెండోది దిశ హత్య ఘటన. ఈ రెండు విషయాల్లో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు కేసీఆర్. పార్టీ నుండి వాయిస్ లేకుండా పోతోందని కొందరు సలహా ఇచ్చిన లెక్కచేయలేదు. కేవలం కేటిఆర్ సానుభూతిపరులో లేక పార్టీలో అధికారికంగా సభ్యత్వం లేని వారో న్యూస్ చానళ్ల ప్రత్యేక చర్చలకు వెళ్లారు తప్ప మిగిలిన వాళ్లు మాత్రం పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ముఖ్య నేతలు  టీవీ ఛనళ్ల చర్చలకు ఎవరు వెళ్లాలి అన్న ప్యానల్ మాత్రం రెడీ చేశారు. ఈ జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ కూడా పంపారు. ప్రస్తుతానికి అవసరం లేదనే ధోరణిలో ముఖ్యమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. పార్టీ రెండో సారి అధికారంలోకి ఏడాది మాత్రమే అయింది. ఇంకా దాదాపు నాలుగేళ్లు సమయముంది. అందుకే ప్రస్తుతం ప్రతి విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది కేసీఆర్ ఆలోచన అని కొందరు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఎవరూ మాట్లాడటం లేదు. టీవీ ఛానళ్ళకు వెళ్లే కొందరు సరిగా మాట్లాడటం లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. నేతలను ఫిల్టర్ చెయడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే టిఆర్ఎస్ నేతలు ఇక శాశ్వతంగా టీవీ స్టుడియోలో కనిపించే పరిస్థితి లేనట్లే ఉంది. మరోవైపు ముఖ్యంగా ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ తన వాణిని వాదాన్ని బలంగా వినిపించింది. మీడియా మాధ్యమాలను బాగా ఉపయోగించుకున్న పార్టీలో టిఆర్ఎస్ ఒకటి. టిడిపి లాంటి పార్టీలు ఏ ఛానల్ కి ఎవరు వెళ్లాలి.. వెళ్ళేవాళ్ళకు సబ్జెక్టు సమకూర్చుతూ లాంటి అంశాలు కూడా ఉన్నాయి. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఛానళ్ళకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టడంతో అసలు కారణం ఏంటని ఆ పార్టీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.  

ఉరి తాళ్ళు సిద్ధం... ఇంతకీ అవి ఆ దోషుల కోసమేనా !?

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఎప్పుడు పడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి సైతం రేపిస్టులకు క్షమాభిక్షను రద్దు చేశారు. దీంతో నిర్భయ దోషుల ఉరికి లేటు ఉండదని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీహార్ లోని బక్సర్ జైలు అధికారులకు ఓ మెసేజ్ వెళ్లింది. ఈ వారాంతం నాటికి పది ఉరితాళ్ళు తయారు చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశాలందాయి. దీంతో ఆ ఉరితాళ్లు నిర్భయ దోషుల కోసమే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 14వ తేదీ నాటికి పది ఉరితాళ్లను తయారు చేసి వుంచాలని జైళ్ల డైరెక్టరేట్ నుంచి బక్సర్ జైలు సూపరింటెండెంట్ కు సూచనలు వెళ్లాయి. అయితే వీటిని ఎక్కడకు పంపిస్తారు అనేది మాత్రం తమకు తెలిదంటున్నారు అక్కడి అధికారులు. ఒక్క ఉరితాడును తయారు చేయాలంటే దాదాపు మూడు రోజుల సమయం పడుతుంది. గత కొన్నేళ్లుగా బక్సర్ జైల్లో ఉరితాళ్లను తయారు చేస్తున్నారు. పార్లమెంట్ దాడుల దోషి అఫ్జల్ గురును ఉరి తీసేందుకు కూడా ఇక్కడి నుంచే పంపించారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఈ నెలాఖరు లోగా ఊరు తీయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బక్సర్ జైలుకు ఉరితాళ్లను తయారు చేయాలంటూ సూచనలు రావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇస్తోంది.  నిర్భయకేసులో వినయ్ శర్మ అనే నిందితున్ని ఇప్పటికే మండవల్లి జైలు నుంచి తీహార్ కి  తరలించారు. మరో ముగ్గురు నిందితులు ముఖేశ్, పవన్, అక్షయ్ తీహార్ జైల్లోనే ఉన్నారు. క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఆదేశాల కాపీ కోసం జైలు అధికారులు ఎదురు చూస్తున్నారు. అది అందగానే తదుపరి ఆదేశాల అమలుకు చర్యలు తీసుకుంటారు. మరోవైపు నిర్భయ కేసులో దోషుల ఊరి అమలుకు తలారి కొరత నెలకొంది. ఈ క్రమంలోనే అనుమతిస్తే నిర్భయ కేసులో దోషులను ఉరితీసేందుకు తాను సిద్ధమని అంటున్నాడు తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్. రామనాథపురంలో శ్రీనివాసన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తీహార్ జైలు అధికారులకు లేఖ రాశాడు శ్రీనివాసన్. అనుమతిస్తే సొంత ఖర్చులతో తీహార్ వచ్చి ఉరిశిక్ష చేసేందుకు సిద్ధమని అంటున్నాడు శ్రీనివాసన్.

ఇప్పటివరకు ఒక లెక్క... ఎన్ కౌంటర్ తర్వాత మరో లెక్క... ఖైదీల్లో ఒక్కసారిగా మార్పు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలోని ఖైదీల్లో అనూహ్య మార్పు వచ్చిందంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక గొడవ, కొట్లాటతో రభస రభస చేసే ఖైదీలు దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సైలెంట్ అయిపోయారట. నిత్యం కూర బాగోలేదనో... అన్నం బాగోలేదనో... జైలు అధికారులతో, సిబ్బందితో వాగ్వాదానికి దిగే ఖైదీలు ఇప్పుడు పెట్టింది తింటూ బుద్ధిగా ఉంటున్నారని అంటున్నారు. అధికారులు, జైలు సిబ్బంది ఏ పని చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తున్నారట. ఇప్పటివరకు ఒక లెక్క... దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఖైదీల్లో ఊహించని మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీలు, ఘనారా నేరగాళ్లు, కరుడుగట్టిన నేరస్థుల ప్రవర్తన... దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు ముందు ఒకలా ఉంటే... ఎన్ కౌంటర్ తర్వాత మరోలా ఉందంటున్నారు. మొన్నటివరకు ప్రతి చిన్న దానికీ జైలు సిబ్బందిని సతాయించడం... చెప్పిన పని చేయకుండా ఎదురు తిరగడం, తోటి ఖైదీలతో గొడవ, కొట్లాటలకు దిగేవాళ్ల ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. మెనూ ప్రకారం పెట్టింది తింటూ... చెప్పింది చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఎదురు తిరిగితే దిశ నిందితులకు పట్టిన గతే మనకూ పడుతుందని ఖైదీలు భయపడుతున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది ఖైదీల ప్రవర్తనను చూస్తే ఒక్కోసారి తామే భయపడతామని, అలాంటిది ఒక్కసారిగా మార్పు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు జైలు సిబ్బంది. ఖైదీల్లో అనూహ్యంగా వచ్చిన మార్పుతో జైల్లో వాతావరణం కూల్ గా మారిపోయిందని చెబుతున్నారు. ఇక, కరుడుగట్టిన నేరాలు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలైతే... కుక్కిన పేనుల్లా ఉంటున్నారని అధికారులు అంటున్నారు. తోటి ఖైదీలను భయపెట్టడం, వారి చేత పనులు చేయించుకోవడంలాంటి పనులు మానేసినట్లు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్... ఘరానా నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోందని, అందుకే ఆకస్మిక మార్పు వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా ఖైదీల్లో అనూహ్యంగా మార్పు రావడంతో జైలు అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.  

ముస్లింలకి పౌరసత్వం ఇవ్వబడదు.. ఏదేమైనా రాజ్యసభలో బిల్లు పాస్ చెయ్యనున్న బీజేపీ

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లును మొదటి మెట్టు ఎక్కించడంలో మోదీ సర్కార్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రాజ్య సభలోను బిల్లు పాస్ చేయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. కేవలం ముస్లిమేతర మతాలకు చెందిన వారికి మాత్రమే భారత పౌరసత్వం వచ్చేలా బిల్లును సవరించడం పై పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. అటు ఈశాన్య రాష్ట్రాలు అగ్ని గుండంలా రగులుతున్నాయి. అయినా మోదీ సర్కార్ వెనకడుగు వేయటం లేదు. ఏదేమైనా బిల్లును పాస్ చేయించేందుకు సిద్ధమైంది. లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఓటింగ్ కు అనుకూలంగా 311 ఓట్లు పడితే వ్యతిరేకంగా 80 ఓట్లు పడ్డాయి. మరి రాజ్య సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 245 మంది సభ్యులున్న సభలో 123 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం రాజ్య సభలో 240 మంది సభ్యులే ఉన్నారు. అంటే 121 మంది బిల్లుకు జై కొడితే పాసైనట్లే అనుకోవాలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే రాజ్య సభలో బిల్లు పాస్ కావడం పెద్ద వింతలా అనిపించడం లేదు. ప్రస్తుతం రాజ్య సభలో బీజేపీకి సొంతంగా 83 మంది సభ్యుల బలం ఉంది. అదే ఎన్డీఏ బలం 106 గా ఉంది. అటు కాంగ్రెస్ బలం 46 , యూపీఏ బలం 62 గా ఉంది. ఇటు ఎన్డీయే లోనూ అటు యూపిఏలోనూ లేని పార్టీల సభ్యులు మొత్తం 44 మంది ఉన్నారు. వీరంతా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అన్నా డీఎంకే, బీజేడీ, శివసేన, వైసిపి, టిడిపితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు 28 మంది ఉన్నారు. వీరంతా బిల్లుకు మద్దతు పలుకుతున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే రాజ్య సభలో 134 మంది బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లే.పౌరసత్వ సవరణ బిల్లును పాస్ చేసి బిజెపి తామిచ్చిన హామిని మరొకటి నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే రాజ్యసభలో బిల్లుకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ప్రభుత్వం పక్కాగా అడుగులు ముందుకు వేస్తోంది. రాజ్యసభలో ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే సునాయాసంగా పౌరసత్వ సవరణ బిల్లు గట్టెక్కిస్తుంది. అయితే రాజ్యసభలో తమకు 122 మంది సభ్యులు బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. నిజానికి 121 మంది సభ్యులు బిల్లుకు మద్దతు పలికితే అది పాసైనట్లే. ఇటు వైపు నుంచి చూసినా రాజ్యసభ లోనూ బీజేపీకి అంతా ఫేవర్ గానే కనిపిస్తుంది.