కేసీఆర్ అవినీతి పై కేంద్రం కన్ను.. త్వరలోనే జైలుకి: సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
posted on Aug 31, 2020 @ 12:00PM
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ సర్కార్ హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రంజాన్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులను తగ్గించి చూపించిన సర్కార్.. హిందువుల పండగైన గణేశ్ ఉత్సవాల సందర్భంగా కేసులు పెరిగాయని చెప్పడం హిందూ సమాజం పై చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు. గడచిన మూడు రోజులుగా వినాయక నిమజ్జనాలను కూడా అడ్డుకుంటున్నారని అయన విమర్శించారు. కేసీఆర్ సర్కార్ రంజాన్ సందర్భంగా కేసులను తగ్గించి చూపే ప్రయత్నం చేసి... ఇప్పుడు గణేశ్ నవరాత్రుల సందర్భంగా కేసులను పెంచి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడిందని.. అందులో భాగంగా ప్రాజెక్టుల అంచనాలను పెంచుతూ, కమీషన్లు తీసుకుంటూ కేసీఆర్ కుటుంబం, అక్రమాలకు తెగబడుతూ బడా కంపెనీలకు దాసోహమైందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ పాల్పడుతున్న అవినీతిపై కేంద్రం ఒక కన్ను వేసిందని, వారి ఆర్ధిక లావాదేవీలన్నిటిని ఎప్పటికప్పుడు గమనిస్తోందని.. త్వరలోనే కేసీఆర్ జైలుకెళ్ళటం కూడా ఖాయమని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు.
అంతేకాకుండా కరోనా మహమ్మారి కట్టడిలో కేసీఆర్ పభ్రుత్వం పూర్తిగా విఫలమై చేతులెత్తేసిందని, దీంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే విషయాన్నీ గవర్నర్ ప్రస్తావించగా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆమెను విమర్శించే స్థాయికి టీఆర్ఎస్ నాయకత్వం దిగజారిందని సంజయ్ విమర్శించారు. కరోనా విషయమై ఇప్పటికే పలు సందర్భాల్లో గవర్నర్ లేఖలు రాసినప్పటికీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను తెలంగాణ సర్కార్ విస్మరించడం వల్ల అనేక రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయన అన్నారు. నిరుద్యోగ భృతిని తెలంగాణ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడంలేదని, కేంద్రం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ల్లో కేసీఆర్ మాట్లాడేది ఒకటైతే.. తర్వాత కేంద్రం మెచ్చుకుందని చెప్పుకుంటూ రాష్ట్ర మంత్రులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని.. ఎందుకిలా చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.