ఏపీలో ఆలయాల పై కొనసాగుతున్న దాడులు.. కర్నూల్ జిల్లాలో మరో విగ్రహం ధ్వంసం..
posted on Sep 23, 2020 @ 12:47PM
ఏపీలో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతున్నాయి. అంతర్వేది నరసింహ స్వామి రధం దగ్దం మొదలు రాష్ట్రంలో ఏదో ఒకచోట దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసమైన ఘటనలు బయటపడుతూనే వున్నాయి. ఓవైపు విజయవాడ దుర్గమ్మ గుడిలో రథానికి ఉండే సింహాలు మాయమైన ఘటన కలకలం రేపుతుండగా తాజాగా కర్నూల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు నిన్న అర్థ రాత్రి సమయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు. విగ్రహం ఉన్న ప్రదేశం నుంచి దాన్ని తొలగించి... రోడ్డుపై కొంత దూరంలో పడేసి వెళ్ళిపోయారు.
ఈ దేవాలయం మంత్రాలయం నుండి బెంగళూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ప్రతిష్టించారు. ఈ ప్రాంతంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ స్వామి వారిని స్థానికులు, రైతులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో, ఎవరు రోడ్డుపై పడేశారో తేల్చాలని స్థానికులు, హిందూ ధర్మ పరిరక్షకులూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.