హత్రాస్ భాదితురాలి ఇంటికి రాహుల్.. సంచలన విషయాలు బయటపెట్టిన సోదరుడు
posted on Oct 3, 2020 @ 8:48PM
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ మృతురాలి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కలిశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ పోలీసులు రాహుల్, ప్రియాంకతో పాటు మరో ముగ్గురికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. హత్రాస్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురిని మాత్రమే అనుమతించామని పోలీసులు తెలిపారు. దీంతో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి మాత్రమే హత్రాస్ కు పయనమయ్యారు. కాసేపటి క్రితం హత్రాస్ చేరుకున్న కాంగ్రెస్ నేతలు, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మరోవైపు, హత్రాస్ లోకి మీడియాను అనుమతించిన నేపథ్యంలో.. మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన విషయాలు చెప్పారు. మృతురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజు దహనం చేసిన శరీరం ఎవరిదో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అది తన సోదరి మృతదేహమే అయితే.. అలా రహస్యంగా దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తమ సోదరిని చివరిసారి చూడాలని పోలీసులు, అధికారులకు తాము మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా ఇవ్వాలని అడిగితే.. అది ఇంగ్లీషులో ఉంటుందని, మీకు అర్థం కాదని చెప్పారని మండిపడ్డారు. తమను ఇంటి నుంచి కదిలేందుకు కూడా అనుమతించడం లేదని, తాము ఎంతో భయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.