ఒకే ప్రైవేట్ సంస్థకు అన్ని ఇసుక రీచులు! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్త ఇసుక పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. సబ్ కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేసిందని తెలుస్తోంది. దీంతో ఆ దిశగానే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.             కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రీచులను అప్పగించాలని తొలుత ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ పట్ల మొగ్గు చూపకపోవడంతో... వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అన్ని రీచులను ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తే... రాష్ట్రంలో ఇసుక కష్టాలు తీరే అవకాశం ఉంది.

గంటకో మిస్సింగ్.. పట్టపగలే హత్యలు! తెలంగాణలో పెరిగిన క్రైమ్     

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లని మహాత్మగాంధీ అప్పట్లో చెప్పారు. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చి ఏడు దశాబ్దాలు అయినా దేశంలో పరిస్థితులు మాత్రం మారలేదు.  తెలంగాణలో అర్ధరాత్రి కాదు పట్టపగలు మగవారికే భద్రత లేకుండా పోయింది. ఇటీవలే సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో మిట్ట మధ్నాహ్నం క్లీనిక్ లో రోగులను పరీక్షస్తున్న డాక్టర్ ను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు వైద్యుడిని బెంగళూరువైపు తీసుకెళ్తుండగా రాప్తాడు సమీపంలో అనంతపురం పోలీసులు పట్టుకోవడంతో ఈ  కేసు సుఖాంతమైనా.. పట్టపగలే డాక్టర్ ను ఎత్తుకెళ్లడం ప్రజల్లో భయాందోళన కల్గించింది.           తెలంగాణలో ఇటీవల హత్యలు, హత్యాచారాలు పెరిగిపోయాయి. గత నెలలోనే తమ కూతురిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో  పటాన్ చెరువు ప్రాంతంలో హేమంత్ అనే వ్యక్తిని అమ్మాయి బంధువులు దారుణంగా చంపేశారు. నమ్మించి తమతో తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారు . మహబూబా బాద్ లో బాలుడిని కిడ్నాప్ చేసి చంపేసి.. తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేపింది. తర్వాత రెండు రోజులకే శామీర్ పేటలో మరో బాలుడిని కిడ్నాప్ చేసి మర్డర్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు లెక్కేలేకుండా పోయింది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. గత ఏడాది హాజీపూర్ లో బయటపడిన సైకో కిల్లర్ దారుణా లను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత మేలో వరంగల్  గొర్రెకుంటలో తొమ్మిది మందిని ఒక్కడే చంపేసి బావిలో పడేసి జల సమాధి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ హత్య కేసులో ఇటీవలే వరంగల్ జిల్లా కోర్టు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌ కు ఉరిశిక్ష విధించింది.    బాలికలు మిస్సయ్యారంటూ తెలంగాణలో రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మిస్సింగ్‌ కేసులు భారీగా పెరిగినట్లు పోలీసుల  లెక్కలే చెబుతున్నాయి. అక్టోబర్ చివరి వారంలో నాలుగు రోజుల్లోనే  ఏకంగా 203 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. గత బుధవారం ఒక్కరోజులోనే తెలంగాణలో  65 మంది వ్యక్తులు అదృశ్యం అయ్యారు. ఇందులో  హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13 మంది, సైబరాబాద్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62, 28 న 65 కేసులు, 29న 11 మిస్సింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసుల వెబ్‌సైట్‌లో వెల్లడించారు.                తెలంగాణలో మిస్సింగ్ కేసులు  మిస్టరీగానే మిగిలి పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా నమోదయ్యే మిస్సింగ్‌‌ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు ట్రేస్‌‌ అవుతున్నా.. 15 శాతం కేసులు తేలకుండానే పోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్‌‌ కేసుల్లో ఇంకా 3 వేల 418 కేసులు ట్రేస్‌‌ అవుట్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్‌‌లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్‌‌ఫర్ చేస్తున్నారు పోలీసులు.  అయితే తెలంగాణలో మైనర్ బాల బాలికల అదృశ్యం పై  హైకోర్టులో పిల్  దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా క్లోస్ చేసిన 2 వేల కేసులను మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. పోలీసులు క్లోజ్ చేసిన మిస్సింగ్ కేసులను  మళ్ళీ రీ ఓపెన్ చేయాలని ఆయన వాదించారు.    దిశ హత్యాచార ఘటన, దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత మహిళల భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలంగాణ సర్కార్ హడావుడి చేసింది. ఉమెన్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడంతో పాటు షీ టీమ్స్ ను బలోపేతం చేస్తామని ప్రకటించింది. హైవే పెట్రోలింగ్ టీమ్ లను పెంచుతామని చెప్పింది. సీఎం కేసీఆర్ కూడా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయనే వార్నింగ్ ఇచ్చారు.మహిళల వంక చూడాలంటనే భయపోడిపోయేలా చేస్తామన్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత ఆ ఉద్యోగులతో సమావేశమైన కేసీఆర్.. మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులు రాత్రి 8 గంటల తర్వాత  డ్యూటీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ రూల్ ను అన్ని సంస్థలు పాటించేలా చూడాలని ప్రభుత్వ అధికారులను అదేశించారు. కాని సీఎం ప్రకటనలన్ని ప్రచారానికే పరిమితమయ్యాయి. ఎప్పటిలానే మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.   కేసుల విచారణలో పోలీసులు సీరియస్ గా స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేసింది. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వచ్చాయి. కిడ్నాపర్ డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నా అతడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో ,  లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక శామీర్ పేటలో కిడ్నాప్ చేసి చంపేసిన అదియాన్ ఘటన విచారణలో తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యానికి సాక్షంగా నిలిచింది. బాలుడు కిడ్నాపై పది రోజులైనా పోలీసులు కేసులో పురోగతి సాధించలేకపోయారు. బాలుడిని అతడి పక్కింట్లో నివాసముండే వ్యక్తే హత్య చేసినట్లు తేలడం కలకలం రేపింది. బాలుడి కోసం గాలింపు చేశామని చెబుతున్న పోలీసులు..  పది రోజుల విచారణలో పక్కింటి వారిని ప్రశ్నించకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించేలా చేసింది.    మరోవైపు నేరాల నియంత్రణలో నిత్యం బిజీ గా వున్న పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాల్ విసురుతున్నాయి. పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. కొందరు తమ వాళ్లు అదృశ్యమైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని... మిస్సింగ్ కేసులను చేధించడంలో జాప్యానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా మిస్సింగ్ కేసులను పోలీసుల దృష్టికి తీసుకురావడం వల్ల.. తప్పిపోయిన వాళ్ల ఆచూకీని తొందరగా కనిపెట్టే అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.    శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. అయితే తాజాగా జరుగుతున్న దారుణ ఘటనలు పోలీసులకు మచ్చగా మారాయి. నేరాలను అరికట్టకపోతే పరిస్తితులు మరీ దారుణంగా తయారవుతాయని, ప్రభుత్వాలు మరింతగా పోలీస్ శాఖను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

భారత్ లో మళ్ళీ 50 వేలకు పైగా కేసులు.. సెకండ్ వేవ్ మొదలయిందా..!

మన దేశంలో చలికాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు ఉత్తరాది రాష్ట్రాలలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక పక్క పలు విదేశాల్లో సెకండ్ వేవ్ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో... భారత్ లోనూ ఆ సంకేతాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వింటర్ సీజన్ లో భారత్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుందన్న నిపుణుల అంచనాలు నిజమయ్యేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.    గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం కలిపి 50,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు మూడు వారాలుగా కరోనా కేసులు రోజుకు 40 వేల కు మించడం లేదు. అయితే తాజాగా అవి 50 వేలు నమోదవడం అటు ప్రజలలోను.. ఇటు నిపుణులలోను ఆందోళన కలిగిస్తున్నది. నిన్న నమోదైన తాజా కేసులతో కలిపి భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,64,086 కు చేరకుంది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 704 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,24,315 కు చేరుకున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న దేశవ్యాప్తంగా 55,331 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,27,962 ఉన్నాయి.    మరో పక్క ఉత్తరాది రాష్ట్రాలలో చలి కారణంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 6,842 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. ఇటు దక్షిణాది రాష్ట్రాలలోనూ కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేరళలో నిన్న 8,516 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 2,487 కేసులు, ఏపీ లో 2,477 కేసులు నమోదయ్యాయి.

అంబులెన్స్ ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్.. శభాష్ బాబ్జి అంటున్న జనం

పోలీసులంటే లాఠీ ఊపుకుంటూ జనాన్ని భయపెట్టే వాళ్ళే కాదు.. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి అండగా నిలబడేవాడు కూడా అని నిరూపించాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో బాబ్జి ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న సాయంత్రం విపరీతమైన రద్దీగా ఉండే అబిడ్స్ సర్కిల్ వద్ద డ్యూటీలో ఉన్నాడు. సాయంత్రం కావడంతో పాటు కార్యాలయాలు వదిలే సమయం కూడా అవడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంది. అబిడ్స్ చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌ వైపు వెళ్లే మార్గం పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ సైరన్‌ విన్నాడు బాబ్జి. దాంట్లో ఒక రోగి ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఆ అంబులెన్స్ వద్దకు చేరుకుని తన వెనుకే రమ్మని డ్రైవర్‌కు చెప్పి అక్కడ అడ్డుగా ఉన్న వాహనదారులను "తప్పుకోండి.. తప్పుకోండి.." అంటూ అంబులెన్స్‌ ముందు పరుగులు తీశాడు. తన ముందున్న వాహనాలను క్లియర్‌ చేస్తూ అంబులెన్స్‌కు వెళ్లేందుకు దారి ఏర్పరిచాడు. అలా అబిడ్స్ బిగ్‌ బజార్‌ నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్‌ వరకు పరుగులు తీస్తూ అంబులెన్స్ గమ్యం చేరేందుకు సహాయపడ్డాడు. అయితే ఈ దృశ్యాన్ని అంబులెన్స్‌లోని రోగి బంధువులు తమ మొబైల్ లో వీడియో తీశారు. ఆ అంబులెన్స్ లోని రోగి సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే కానిస్టేబుల్‌ బాబ్జి చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియోను రోగి బంధువులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో అటు నెటిజన్లు. ఇటు పొలిసు ఉన్నతాధికారులు కూడా బాబ్జీని అభినందిస్తున్నారు.

యూఎస్ ఎన్నికల్లో ఐదుగురు ఎన్నారైల విజయం! మూడోసారి గెలిచిన రాజా క్రిష్ణమూర్తి

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల బరిలో నిలిచిన భారతీయ సంతతి నేతలకు భిన్న ఫలితాలు వచ్చాయి. కొందరు గెలిచి సత్తా చాటితే.. మరికొందరు కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. యూఎస్ దిగువ సభ అయిన హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు నలుగురు ఇండియన్​ అమెరికన్లు తిరిగి ఎన్నికవగా.. మొదటి సారి బరిలో నిలిచినోళ్లు కొందరు ఓడిపోయారు. ఎక్కువగా డెమొక్రాట్​ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులే ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నేతలు చేసిన ‘సమోసా కాకస్​’ ప్రచారం బాగానే పనిచేసింది. డాక్టర్​ ఎమీ బేరా, ప్రమీలా జయపాల్​, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, జెన్నిఫర్​ రాజ్​కుమార్​లు మంచి మెజారిటీతో విజయం సాధించారు. మరొక ఇండియన్​ డాక్టర్​ హిరాల్​ తిపిర్నేని లీడింగ్​లో ఉన్నారు.    భారత సంతతి రాజా క్రిష్ణమూర్తి డెమొక్రటిక్ పార్టీ తరఫున వరుసగా మూడోసారి యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌గా ఎన్నికయ్యారు. లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రీస్టన్ నెల్సన్‌పై రాజా ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్లలో రాజా ఏకంగా 71 శాతం ఓట్లు దక్కించుకోవడం విశేషం. రాజా పేరెంట్స్‌ది తమిళనాడు కాగా, ఆయన న్యూఢిల్లీలో జన్మించారు. రాజా మొదటిసారి 2016లో యూఎస్ హౌస్‌కు ఎన్నికయ్యారు.                అమెరికాలోని కొన్ని చోట్ల ఇండియన్ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. ఇండియన్​ అమెరికన్​ ఓటర్లే గెలుపోటముల్లో కీలకంగా మారారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున పోటీ చేసిన రో ఖన్నా మరో ఇండియన్​ రితేశ్​ టాండన్​ను ఓడించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి పోటీ చేసిన ఆయన వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. రో ఖన్నాకు 50 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి. సమోసా కాకస్​లో చాలా సీనియర్​ మెంబర్​ అయిన డాక్టర్​ ఎమీ బేరా కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి విజయం సాధించారు. రిపబ్లికన్​ పార్టీకి చెందిన 65 ఏళ్ల బజ్​ ప్యాటర్​సన్​ను 25 శాతం ఓట్ల తేడాతో ఆయన మట్టి కరిపించారు.   2016లో గెలిచిన ప్రమీలా జయపాల్ మరోసారి విజయం సాధించారు. హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు గెలిచి చరిత్ర సృష్టించిన తొలి ఇండియన్​ అమెరికన్​ ఆమె. మళ్లీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున బరిలో నిలిచిన డేవిడ్​ ష్వూకెర్ట్​పై డెమొక్రాట్​ అభ్యర్థి హిరల్​ తిపర్నేని లీడింగ్​లో ఉన్నారు. అరిజోనా ఆరో కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. ఆమె గెలిస్తే హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​కు ఎన్నికైన రెండో ఇండియన్​ మహిళగా నిలుస్తారు.   న్యూయార్క్​ స్టేట్​ అసెంబ్లీకి జెన్నిఫర్​ రాజ్​కుమార్​ అనే లాయర్​ ఎన్నికయ్యారు. న్యూయార్క్​ స్టేట్​ అసెంబ్లీకి ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డ్​ సృష్టించారు. డెమొక్రాట్​ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. రిపబ్లికన్​ అభ్యర్థి జియోవనీ పెర్నాను ఓడించారు. 38వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్​ నుంచి ఆమె పోటీ చేశారు. న్యూయార్క్​ సిటీకి ఆమె అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తారు. అంతకుముందు న్యూయార్క్​ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. లీగల్​ అడ్వైజరీ కౌన్సిల్​ ఆఫ్​ శాంక్చువరీ ఫర్​ ఫ్యామిలీస్​లో లీగల్​ ఆఫీసర్​గా పనిచేస్తున్నారు. గృహ హింస, సెక్స్​ ట్రాఫికింగ్​, జెండర్​ వయొలెన్స్​ బాధితులకు అండగా నిలుస్తూ.. వారి తరఫున పోరాడుతున్నారు. ఆమె పనితీరు నచ్చి న్యూయార్క్​ రాష్ట్రానికి ఇమిగ్రేషన్​ అఫైర్స్​ అండ్​ స్పెషల్​ కౌన్సెల్​కు డైరెక్టర్​గా నియమించారు గవర్నర్​ ఆండ్రూ క్యువోమో.   కొన్ని చోట్ల డెమొక్రాట్​, రిపబ్లికన్​ పార్టీల తరఫున పోటీ చేసిన మనోళ్లకు ఓటమి తప్పలేదు.  టెక్సస్​లోని 22వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి డెమొక్రాట్​ పార్టీ నుంచి పోటీ చేసిన  చెందిన ప్రెస్టన్​ కులకర్ణి .. రిపబ్లికన్​ క్యాండిడేట్​ ట్రాయ్​ నెల్స్​ చేతిలో ఓడిపోయారు. రిపబ్లికన్​ నుంచి బరిలోకి దిగిన మంగా అనంతాత్ముల.. డెమొక్రాట్​ అభ్యర్థి జెర్రీ కానలీ చేతిలో ఓడిపోయారు. వర్జీనియాలోని 11వ కాంగ్రెషనల్​ డిస్ట్రిక్ట్​ నుంచి ఆయన పోటీ చేశారు.   మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగిన నిషా శర్మ 50 శాతానికిపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఆమెను డెమొక్రాట్​ క్యాండిడేట్​ మార్క్​ డిశాల్నియర్​ ఓడించారు.న్యూ జెర్సీ సెనేట్​ కు పోటీ చేసిన రిపబ్లికన్​ క్యాండిడేట్​ రిక్​ మెహతా ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్​ క్యాండిడేట్​ సెనేటర్​ కోరీ బుకర్​ చేతిలో ఓడిపోయారు. మెహతాకు 37.9% ఓట్లు పోలవగా.. బుకర్​కు 60.6% ఓట్లు వచ్చాయి. అమెరికా ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ అధికారిగా మెహతా పనిచేశారు.

అమెరికా చరిత్రలో కొత్త రికార్డు సృష్టించిన జో బైడెన్ 

డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇంతకు ముందు ఎవరూ సాధించని రికార్డును స్వంతం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్ష అభ్యర్థికీ రానన్ని పాపులర్ ఓట్లను సంపాదించుకుని జో బైడెన్ ఘన విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కోట్లకు పైగా పాప్యులర్ ఓట్లను సంపాదించుకున్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క అధ్యక్ష అభ్యర్థి కూడా ఇన్ని ఓట్లను సాదించలేదు. అయితే 2008లో జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చాయి. దీంతో జో బైడెన్‌ మ్యాజిక్ ఫిగర్ 270కు చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఖాతాలో 264 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ట్రంప్ ఇప్పటివరకు 214 ఎలక్టోరల్ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. మరో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడికావాల్సి వుండగా, మూడింటిలో ట్రంప్, ఒకదానిలో బైడెన్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు.

బాబు బాటలో.. కామ్రేడ్లు!

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బెంగాల్, కేరళ రాష్ట్రాలు కూడా   సీబీఐకు నో ఎంట్రీ ఇచ్చిన కేరళ సర్కారు   టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినా, ఆయన ఫార్ములాను అందరూ అనుసరిస్తున్నట్లున్నారు. విచారణ సంస్థలను చేతిలో పెట్టుకుని, తనకు సరిపడని రాష్ట్రాలపై కేసుల సవారీ చేస్తున్న, బీజేపీ సర్కారు దూకుడుకు బ్రేకులు వేసిన చంద్రబాబు నాటి ఆలోచనను.. ఇప్పుడు కమ్యూనిస్టులు, శివసేనలు, కాంగ్రెస్ పార్టీలూ అనుసరిస్తుండమే విశేషం.   సీబీఐ అంటే కేంద్రం చెప్పినట్లు పలికే చిలక. పంజరంలో చిలక. ఈ మాట అన్నది ఎవరో కాదు. ఏపీ సీఎం మన జగనన్నే! యుపిఏ హయాంలో, ఆయనపై కేసులు బుక్కయినప్పుడు జగన్ అండ్ అదర్స్ ఈ డైలాగే వాడేవారు. దర్యాప్తు సంస్థలను, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్డుపెట్టుకుని, ప్రత్యర్ధులను వేధిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలకు, విలువ-విశ్వసనీయత లేవని కుండబద్దలు కొట్టారు. బాబు సీబీఐకి పెట్టిన నో ఎంట్రీ బోర్డును, సీఎం అయిన తర్వాత  అదే జగనన్న పీకేశారనుకోండి. ఆ ప్రకారంగా పంజరంలో చిలకను ఏపీకి రానిచ్చారన్నమాట. అది వేరే విషయం!   అలాంటి సీబీఐని, తన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా, చంద్రబాబు గత ఎన్నికల చివరలో నో ఎంట్రీ బోర్డు పెట్టారు. అంటే సీబీఐ ఏ కేసు నిమిత్తం రాష్ట్రానికి వచ్చినా, సదరు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే వెళ్లాలన్నమాట. ఎన్నికల ముందు సంకీర్ణ కాపురంలో కలతలు వచ్చి, బీజేపీకి విడాకులిచ్చిన బాబు.. అందుకు తగిన ఫలితం అనుభవించారు. ఆ తర్వాత  సీబీఐ వేధింపుల గురించి బాగా తెలిసిన బాబు, ముందుజాగ్రత్తగా సీబీఐని రాష్ట్రంలో నిషేధించారు.   ఇప్పుడు దేశంలో కూడా... అలాంటి రాజకీయ పరిస్థితులే కనిపిస్తుండటంతో, మేల్కొంటున్న విపక్షాలు సీబీఐ దూకుడుకు చెక్ పెట్టేందుకు, చంద్రబాబు ఆలోచనను అనుసరిస్తున్నాయి. తాజాగా కేరళలోని పినరై విజయన్ సర్కారు కూడా, తమ రాష్ట్రానికి సీబీఐ రావడానికి వీల్లేదని ఫర్మానా జారీ చేసింది. ఏదైనా ఉంటే, ముందు తన అనుమతి తీసుకోవలసిందేనని కుండబద్దలు కొట్టింది. దేశంలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణంలో సీపీఎం పీకల్లోతు కూరుకుపోయింది. దానిపై సీబీఐ కన్నేసింది. తీగ లాగితే, కామ్రేడ్ల డొంకలే కాదు. కూసాలూ కదులుతాయి మరి. అదీ అసలు సంగతి!   స్వప్న సురేష్ అనే ఓ అమ్మడు, కేరళ సీఎంఓ కేంద్రంగా.. ఎమిరేట్స్ నుంచి విదేశాంగ పార్శిళ్ల ద్వారా,  బంగారం స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణతో కామ్రేడ్లు కలవరపడుతున్నారు. ఆరోపణలలో ఉక్కిరిబిక్కిరయిన సీఎం పినరై  విజయన్.. ఇది విదేశాంగ వ్యవహారమయినందున, దీనిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. దానితో ఈపాటికే ఎన్‌ఐఏ రంగంలోకి దిగగా, సీబీఐ-ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి.   దీనితో తమ పార్టీ ఇమేజీకి జరిగే డ్యామేజీని గుర్తించిన ఎర్రన్నలు, సీబీఐకు నో ఎంట్రీ చెప్పారు. గతంలో బాబు పాటించిన ఈ సూత్రాన్ని,  ఇటీవలే మహారాష్ట్రలో శివసేనీయులు సైతం విజయవంతంగా అమలుచేస్తున్నారు. ఫోనీలే  ఫాఫం.. బాబు ఆలోచనలు ఆంధ్రాజనాలకు ఫనికిరాకఫోయినా.. ఫరాయి రాష్ట్రాలు ఫాటిస్తున్నాయి! -మార్తి సుబ్రహ్మణ్యం

ఏపీలో స్కూళ్ళు తెరిచారు... టీచర్లను, విద్యార్థులను వణికిస్తున్న కరోనా  

వింటర్ సీజన్ మొదలవడంతో దేశంలో త్వరలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది... జాగ్రత్తగా ఉండండి అంటూ ఇటు నిపుణులు, అటు కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో ఏపీలో నవంబర్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం స్కూళ్ళు తెరిచింది. అయితే పాఠ‌శాల‌లు తెరిచిన రెండో రోజు నుంచే కరోనా తీవ్ర స్థాయిలో విజృభిస్తుండ‌డంతో ఇప్పుడు జగన్ స‌ర్కార్ కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెస్టులు చేయగా.. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 239 మంది టీచర్లు, 44 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకినట్టు గుర్తించారు. మరికొన్ని పరీక్షల ఫలితాలు ఇంకా అందాల్సి ఉంది. దీంతో అటు విద్యార్థుల తల్లితండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా ఆందోళన మొదలైంది. తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.   గుంటూరు జిల్లాలో ఏకంగా 25 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు గుర్తించారు. వారిలో వైరస్‌ లక్షణాలు కనిపించనప్పటికీ స్ర్కీనింగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 500 మంది ఉపాధ్యాయులకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 5 శాతం మంది కరోనా బారిన పడినట్లు తేలింది. ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లా వెల్లటూరు జెడ్ పి హెచ్ స్కూల్ లో పదో తరగతి విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. అతడి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయగా విద్యార్థి తండ్రికీ వైరస్‌ సోకినట్టు తేలింది. ప్రకాశం జిల్లాలో మంగళవారం నలుగురు విద్యార్థులు, ఒక టీచర్‌కు కరోనా సోకగా.. బుధవారం ఏడుగురు విద్యార్థులు, ఒక ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్న మూడు రోజులకే ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో 38 మంది టీచర్లు, 125 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో గడచిన రెండు రోజుల్లో 50 మంది టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు కరోనా సోకగా.. ఇద్దరు విద్యార్థులు కూడా కరోనా బారినపడ్డారు. మరి కొంతమంది టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో చేసిన పరీక్షల్లో ఏకంగా 187 మంది ఉపాధ్యాయులకు, 13 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లుగా తేలింది. టెస్టుల ఫలితాలు ఇంకా రావాల్సి ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో 14 మంది విద్యార్థులతోపాటు ఒక టీచర్‌కూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈస్ట్‌ యడవల్లిలో 10 మందికి, కూచింపూడిలో టీచరుతో పాటు నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.   ఇది ఇలా ఉండగా పలు జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండగా గతంలోనే వారికి సోకి తెలుసుకోకపోవటం, పాఠశాలల్లో పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతున్నాయ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకి తెలిపారు. అయితే అధికార వైసిపి నేతలు మాత్రం ఈ సమయంలో స్కూళ్ళు తెరిచి అనవసరంగా కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకున్నామ‌ని అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తోన్నారు.

సర్కారు ఉద్యోగుల స్వామి భక్తి.. చూడతరమా?

కరోనా తగ్గేవరకూ స్థానికం వద్దట   మరి కరోనా వచ్చిన స్కూలు టీచర్ల సంగతేమిటి?   ఏపీలో ఉద్యోగుల సంఘాల స్వామి భక్తిని చూసి.. పరాయి రాష్ర్టాల పాలకులు ఈర్ష్యతో కుళ్లుకుంటున్నారట. అలాంటి నాయకులు తమ రాష్ట్రంలో లేనందుకు, రోజుకు డజనుసార్లు తీరికూర్చుని బాధపడుతున్నారట. ఏపీ సీఎం జగనన్నకు పట్టిన అదృష్టాన్ని చూసి తెగ ఈర్ష్యపడుతున్నారట. జగనన్న ప్రభుత్వంపై, ఈగ వాలితేనే సహించలేని వైసీపీ వీరాభిమానులు సైతం, ఉద్యోగ సంఘ నేతల విశ్వాసం చూసి అసూయతో రగిలిపోతున్నారట. అవును మరి.. ఏ పాలకుడయినా తన గళాన్నే, తన వైఖరినే ఉద్యోగ సంఘాలు ప్రతిబింబిస్తే ఎందుకు ఖుషీ అవరు చెప్పండి? ఏపీలోనూ అంతే! ఇద్దరు ‘పెద్దారెడ్ల’ నాయకత్వంలో తరిస్తున్న ఉద్యోగుల సినిమా కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనట!!   స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు వెల్లడించారు. ఆ సందర్భంగా ఆయన, తన ఈతిబాధలేమిటో కోర్టుకు మొరపెట్టుకోగా, సీఈసీని సతాయించకుండా ఆయన అడిగినవి సమకూర్చమని.. హైకోర్టు కూడా సర్కారును ఆదేశించింది. సరే.. ఎలాగూ అధికార వైసీపీ నేతలు- బూతుల మంత్రులూ.. కరోనా తగ్గేవరకూ స్ధానిక ఎన్నికలు నిర్వహించేది లేదని ఖరాఖండీగా చెబుతున్నారు. ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష భేటీకీ వైసీపీ వెళ్లలేదు. ఎలాగూ విపక్షాలు సహజంగానే, గతంలో ఏకగ్రీవాలయిన వాటిని రద్దు చేసి, మళ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.   ఇంతవరకూ బాగానే ఉంది. ఎస్‌ఈసీ, రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఎవరి ధర్మం వారు పాటిస్తున్నారని భావించవచ్చు. కానీ, విచిత్రంగా.. ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం, అచ్చు వైసీపీ పార్టీ విధానాన్నే ప్రకటించడమే ఆశ్చర్యం. కరోనా తగ్గే వరకూ ఎన్నికలు నిర్వహించవద్దని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎన్నికలు పెడితే, తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు కోర్టుకయినా వెళతామని రెడ్డిగారు సెలవిచ్చారు.   పనిలోపనిగా.. విశాఖ రాజధానిగా వస్తున్నందున, తమ ఉద్యోగులంతా విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రెడ్డిగారు ఎవరూ అడగకుండానే ప్రకటించేశారు. ఉద్యోగులతో చర్చించకుండా, రెడ్డిగారొక్కరే వారి తరఫున ఎలా వకాల్తా పుచ్చుకున్నారన్నది వేరే విషయం. గానీ.. సదరు రెడ్డిగారు ‘ఉద్యోగులను రక్షించుకునేందుకు’.. అని వాడిన పదమే వింతగా ఉందన్న వ్యాఖ్యలపై ఉద్యోగవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తమ ప్రాణాల పట్ల అంత దయ, సానుభూతి ఉన్న నాయకుడిని.. తాము ఇప్పటివరకూ చూడలేదంటున్నారు. ఆయన తమ నాయకుడు కావడం, తమ పూర్వజన్మ సుకృతమని.. కనబడని దేవుళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు.   అయితే.. స్థానిక సంస్థలు పెడితేనే ఉద్యోగుల ప్రాణాలు పోతాయన్నట్లు తెగ బాధపడుతున్న రెడ్డిగారు… సర్కారు ఆదేశాలతో ప్రారంభమైన స్కూళ్ల దెబ్బకు.. తొలిరోజే 50 మంది టీచర్లు కరోనా బారిన పడిన విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ‘ మీరు స్కూళ్లు తెరవడం వల్లే కదా? మా ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని’.. సదరు నేతలు, ఎందుకు నోరు తెరవలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే 50 మంది టీచర్లు కరోనా బారిన పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.   తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకర్రులో, పిల్లలకు అన్నం వడ్డించిన నిర్వహకురాలికి కరోనా సోకింది. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె గ్రామంలోని స్కూల్‌లో ఒక టీచరు, నలుగురు పిల్లలకు కరోనా సోకింది. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని స్కూళ్లలో కూడా.. టీచర్లు, పిల్లలకు కరోనా సోకింది. ప్రభుత్వం స్కూళ్లలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ, కరోనా కేసులు పెరుగుతుండటం.. విద్యార్ధుల తలిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు సచివాలయానికీ కరోనా బెడద తప్పడం లేదు. సెక్షన్లకు సెక్షన్లే ఖాళీ అవుతున్నాయి.   కరోనా వైరస్ తీవ్రత తగ్గేవరకూ స్కూళ్లు తెరవవద్దని, రాజకీయ పార్టీలు మొత్తుకుంటూనే ఉన్నాయి. అయినా జగన్ సర్కారు వాటిని ఖాతరు చేయకుండా, స్కూళ్లపై ప్రారంభించిన ప్రయోగం వికటిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి స్కూళ్లలో పనిచేసే టీచర్లవి మాత్రం ప్రాణాలు కావా? స్కూళ్లు ప్రారంభిస్తే మా ఉద్యోగుల ప్రాణాల సంగతేమిటని, ఇదే ఉద్యోగ సంఘాలు ఎందుకు నిలదీయలేదు? అప్పుడు లేని ప్రాణహాని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితేనే వస్తుందా? అని ఉద్యోగులు నిలదీస్తున్నారు.   కరోనా కాలంలో రెండునెలలు సగం జీతం నిలిపివేసినా, ఒక్క నాయకుడూ ఎందుకు ప్రశ్నించలేదు? స్వయంగా నిలివేసిన బకాయిలకు వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఆదేశిస్తే, తమకు ఆ వడ్డీ అవసరం లేదని స్వామిభక్తి ప్రకటించిన నేతలకు, మా ప్రాణాలపై ఆందోళన చెందే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా మూడు డీఏలు చెల్లించాల్సి ఉండగా, ఒక్క నాయకుడు కూడా గతంలో మాదిరిగా, సర్కారు మెడపై కత్తి పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 డీఏలను.. నాలుగు వాయిదాల్లో ఇస్తామంటే ఉద్యోగ సంఘ నేతలు ఎగిరి గంతే శారు. పైగా అదేదో గొప్ప విజయంగా ప్రచారం చేసుకున్న తమ నేతలకు, పూర్తిస్థాయిలో డీఏ బకాయిలు ఇప్పించే ధైర్యం ఎందుకు లేదన్న ప్రశ్నలకు, జవాబిచ్చే దమ్ము ఏ ఉద్యోగసంఘ నాయకుడికి ఉంది?   అన్నట్లు.. ఏపీఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి గారు, తన పేరు చివర ఉన్న కులాన్ని తొలగించుకున్నారా? లేక సాక్షి మీడియానే మొహమాటపడి.. ఆయన పేరు చివర ఉన్న రెడ్డి అక్షరాలను ఎందుకు తొలగించిందో అర్ధం కాలేదు. ఎందుకంటే.. విశాఖ వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి గారి ప్రెస్‌మీట్‌ను వైసీపీ మీడియా సాక్షి కవర్ చేసింది.. కానీ మరుసటిరోజు తన పత్రికలోమాత్రం, ఆయన పేరు చివరన ఉన్న రెడ్డిని తొలగించి, చంద్రశేఖర్ అని మాత్రమే పెట్టింది మరి! -మార్తి సుబ్రహ్మణ్యం

రాములమ్మ ఇంటికి ఠాగూర్.. శాంతించేనా? 

తెలంగాణలో పార్టీ బలోపేతానికి కొత్త ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల నేతలతో ఆయన టచ్ లో ఉంటూ అందరిని యాక్టివ్ చేస్తున్నారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతోనూ ఆయన మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాణిక్యం ఠాగూర్ విజయశాంతి ఇంటికి వెళ్లారు. సుధీర్ఘంగా ఆమెతో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయశాంతి పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి.. ఠాగూర్‌కు స్పష్టంగా వివరించారట. రాహుల్ గాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా.. తన తెలంగాణ పర్యటనను అడ్డుకున్నారని ఠాగూర్‌కు విజయశాంతి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.    విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. హోరాహోరీ పోరు సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆమె పాల్గొనలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీగా పని చేసిన రాములమ్మ ఆ జిల్లా పరిధిలోని జరిగిన కీలక ఎన్నికలో ప్రచారం చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. పీసీసీ పెద్ద నేతలంతా దుబ్బాకకు వెళ్లగా రాములమ్మ మాత్రం అటువైపు చూడలేదు. ఇక ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆమె సమావేశమయ్యారు. దీంతో విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని అంతా భావించారు. కాని అది జరగలేదు. తాజాగా ఆమెను బుజ్జగించేందుకు మాణిక్యం ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఠాగూర్ చర్చల తర్వాత రాములమ్మ మెత్తబడినట్లు, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.  

గెలుపు నాదే.. సుప్రీం కోర్టుకు వెళ్తా.. ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్

అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది దశకు వస్తున్న సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.. "ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారు. నేను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా.. ఎన్నికల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలి. ఈ ఎన్నికలను మేమే గెలవబోతున్నాం.. నిజంగా చెబుతున్నా.. మేమే గెలిచాం.. చట్టాన్ని సరిగ్గా అమలు చేసి.. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలని కోరుతున్నాం."’ అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. ఒక పక్క ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకుండా తనకు తానే గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. ఇదే సమయంలో భారీ విజయోత్సవానికి సిద్ధంగా ఉండాలంటూ తన అభిమానులకు ట్రంప్ పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ ను అనుమతిస్తున్నారని దీన్ని వెంటనే ఆపాలని అయన కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల కౌంటింగ్ అమెరికా ప్రజలను మోసం చేయడమేనని అయన అన్నారు.   అంతేకాకుండా ఈ ప్రకటనకు ముందు ట్రంప్ "ఈ రోజు రాత్రి నేను కీలక ప్రకటన చేస్తా.. భారీ విజయం మనకే.." అని ట్వీట్ చేశారు. దానికి ముందు ట్రంప్ మరో ట్వీట్ చేస్తూ.. "భారీ విజయం దిశగా మనం దూసుకెళ్తున్నాం.. కానీ ప్రత్యర్థి పార్టీ విజయాన్ని అపహరించుకుపోవాలని చూస్తోంది.. దీన్ని మనం అడ్డుకుని తీరతాం.. పోలింగ్ ముగిశాక ఓటింగ్ ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదు.." అని ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ ట్విటర్ ఆ ట్వీట్‌ను జనంలోకి వెళ్లకుండా చేసింది. దీనిని తప్పుడు ప్రకటనగా అభివర్ణిస్తూ.. అమెరికా ఎన్నికల సెక్యూరిటీ గురించి ఓ లింక్‌ను కూడా ఆ ట్వీట్‌కు జోడించింది.

చంద్రబాబు పార్టీ మూసుకోవాల్సిందే! వైసీపీ నేతల విసుర్లు 

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అధికార వైసీపీ బీసీల సమావేశాలు నిర్వహించింది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞత చెబుతూ ఈ సమావేశాలు జరిగాయి. సీఎం అభినందన సభల్లో పాల్గొన్న వైసీపీ మంత్రులు, నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని... హైదరాబాదులో విశ్రాంతి తీసుకోవచ్చని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు. ఆయన కుమారుడు ఈ మధ్య ట్రాక్టర్ స్టీరింగ్ వదిలేసి ప్రజలపైకి పోనివ్వబోయారని.... ఆ పార్టీ పరిస్థితి అంతే అని అనిల్ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక బీసీలకి పెద్దపీట వేసింది వైసీపీనే అని మంత్రి తెలిపారు. తన చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటనే నడుస్తానని... ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.     ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు.. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు ఏకకాలంలో గుప్పించారు నగరి ఎమ్మెల్యే రోజా. బీసీ కార్పొరేషన్ సభలో మాట్లాడిన రోజా .. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. వేల కోట్ల రూపాయల సహాయం అందించారని ప్రశంసించారు. చంద్రబాబు ఇక మీదట పార్టీని మూసివేయాలని రోజా ఉచిత సలహా ఇచ్చారు. బీసీలకు చంద్రబాబు ఏం చేసారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఆర్కే రోజా.

గూడ్స్ రైళ్ల కోసం ఢిల్లీలో పంజాబ్ సీఎం ధర్నా! రూ.1200 కోట్లు నష్టపోయామన్న రైల్వేశాఖ 

కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. పంజాబ్‌‌కు గూడ్స్ రైళ్లను నిలిపేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నాకు దిగారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా  ఆందోళనలో  పాల్గొన్నారు. మోడీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అమరీందర్ సింగ్. పంజాబ్ పరిస్థితిని రాష్ట్రపతికి తెలపడానికి  ప్రయత్నిస్తే  తమకు సమయం కేటాయించలేదని చెప్పారు. అందుకే ఢిల్లీకి వచ్చి  తామ నిరసనన తెలుపుతున్నామన్నారు. ఈ విషయంపై ఇంకా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ అడగలేదని, అదే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు అమరీందర్ సింగ్. తమకు రావాల్సిన జీఎస్టీ నిధులు ఇప్పటికీ రాలేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు.    కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అంతటా రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా రైల్ రోకో, ధర్నాలకు దిగుతున్నారు. దీంతో రైల్వే ఆస్తులకు, యాజమాన్యానికి నష్టాలు కలుగుతోంది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ... పంజాబ్ ప్రాంతానికి గూడ్స్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీనికి నిరసనగానే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధర్నాకు దిగారు.    తమ రాష్ట్రానికి గూడ్స్ రైళ్లను రద్దు చేసి మోడీ  ప్రభుత్వం తమ గొంతు నులిమేస్తోందని పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు కూడా తీవ్రయ్యాయని, రాష్ట్రానికి అవసరమైన 14.50 లక్షల టన్నుల యూరియాను ట్రక్కుల్లో తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యేలు చెప్పారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి నిధులతో  కేంద్రం నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని చెప్పారు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.   మరోవైపు పంజాబ్‌లో రైతుల ఆందోళనలతో  తమకు రూ.1,200 కోట్ల మేరకు నష్టం వచ్చిందని రైల్వేశాఖ ప్రకటించింది. దిగ్బంధాల కారణంగా రవాణా కార్యకలాపాలు ఇప్పటికీ సస్పెండైనట్టు  తెలిపింది. నిత్యావసర సరుకలు తీసుకువెళ్తున్న 2,225 ఫ్రైట్ రేక్స్ తెరుచుకోలేదని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకూ 1,350 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని, కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని ప్రకటించారు. రైతు నిరసనల ప్రభావం పంజాబ్ మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లపై కూడా పడిందని చెప్పారు. ట్రాక్‌ల భద్రత, రైల్ ఆపరేషన్ల పునరుద్ధరణ జరిపే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ అక్టోబర్ 26న రైల్వే మంత్రి పీయూష్ గోయెల్  పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసినా .. అక్కడి నుంచి స్పందన రాలేదని రైల్వే అధికారులు చెప్పారు.

మందడంలో కూలిన మూడు శిబిరం! ప్రకృతికి నచ్చలేదన్న ఆర్ఆర్ఆర్

జగన్ సర్కార్ తలపెట్టిన మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలోని మందడంలో ఏర్పాటు చేసిన శిబిరం కూలిపోయింది. నిన్న సాయంత్రం కురిసిన గాలి, వానకు ఆ శిబిరం టెంట్ కుప్పకూలిపోయింది. మందడం సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరం కూలినప్పుడు అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శిబిరం ఖాళీ చేశాక టెంట్ కూలిపోవడంతో నిర్వాహకులు, శిబిరంలో పాల్గొనేవారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ రోజు ఉదయం ఈ శిబిరం ప్రారంభం కావాల్సి ఉంది.    నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ 323 రోజులుగా రైతులు, కూలీలు, మహిళలు దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. వీరి దీక్షలకు పోటీగా మూడు రాజధానులను సమర్థిస్తూ.. ఏపీ వ్యాప్తంగా 30 లక్షల మందికి సెంటు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ మందడంలో ఈ పోటీ శిబిరాలను ఏర్పాటు చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో వేసిన శిబిరం కూలిపోవడంపై ప్రజల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ నిర్ణయం ప్రకృతికి నచ్చడంలేదని జనాలు అభిప్రాయపడుతున్నారు. 320 రోజులపైగా అమరావతి రైతులు ధీక్షలు చేస్తున్నా ఎలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు ఈ టెంట్ వేస్తుండగానే కూలిపోయిందని చెప్పుకుంటున్నారు.    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా అలానే స్పందించారు. ప్రకృతి కూడా కొన్ని కొన్ని దుష్ట శక్తుల్ని ప్రొత్సహించదని అనటానికి ఉదాహరణగా పడిపోయిన డేరాల ఫోటోను ఆయన చూపించారు. పడిపోయిన డేరాలు ఏంటంటే... మూడు రాజధానులు కావాలని ఆటో పెయిడ్ ఆర్టిస్టుల కోసం నిర్మించిన డేరాలని.. ఆ డేరాలు కూలిపోయాయని రఘురామ అన్నారు. నిజమైన రైతులు రాజధాని అమరావతి కోసం ఎక్కడ ఆందోళన చేస్తున్నారో.. అక్కడ చిన్న గడ్డిపరక కూడా చెక్కు చెదరలేదని రాఘురామ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి న్యాయం ఎటువైపు ఉందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రకృతికి మించిన శక్తి లేదని, ప్రకృతి ఏం చెప్పిందన్నది గహించాలన్నారు రఘురామ కృష్ణం రాజు.

దుబ్బాకలో మళ్లీ షి ‘కారు’?

సగానికి తగ్గనన్న మెజారిటీ   రెండోస్థానంలో బీజేపీ?   దుబ్బాక ఉప ఎన్నికలో మళ్లీ టీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి గత ఎన్నికలో కంటే సగం మెజారిటీ తగ్గనుంది. గత ఎన్నికలో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్.. ఈసారి మూడవ స్థానంలో, బీజేపీ రెండో స్థానంలో నిలిచే అవకాశాలున్నట్లు పోలింగ్ సరళి వెల్లడిస్తోంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా దివంగత రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేయగా, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు. అయితే.. తొలి విడత ప్రచారంలో దూసుకుపోయిన కాంగ్రెస్, ఆ తర్వాత చతికిలపడింది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానం, ఆయన తనయుడైన కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డికి సానుకూలంగా మారిన వాతావరణం కనిపించింది. ఆ మేరకు తొలి దశ ప్రచారమంతా,  టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది.   అయితే, బీజేపీ అనూహ్యంగా పుంజుకుని, కొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దిగడంతో వాతావరణం మారిపోయింది. రఘునందన్‌రావు బంధువు నివాసంపై పోలీసు దాడులు, టీఆర్‌ఎస్ నేతలు బస చేసిన హోటల్‌పై బీజేపీ కార్యకర్తల దాడులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంతో.. పోటీ కాస్తా, టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు మారింది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎందుకో వెనుకబడి పోయినట్లు కనిపించింది. ఈ క్రమంలో జరిగిన పోలింగ్.. అనూహ్యంగా 82.61 శాతం నమోదుకావడం పార్టీలను కలవరపరిచింది. కరోనా కాలంలో కూడా పోలింగ్ ఆ స్థాయిలో ఓటెత్తడంతో, పెరిగిన ఆ ఓటింగ్ శాతం.. ఎవరి పుట్టి ముంచుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే పోలింగ్ సరళి పరిశీలిస్తే... టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమయినప్పటికీ, గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే, సగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. అంటే దాదాపు 25-30 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే రావచ్చంటున్నారు. ఒక అంచనా ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 80-85 వేల ఓట్లతో మొదటి స్థానం, బీజేపీకి 50 నుంచి 55 వేలతో రెండవ స్థానం, కాంగ్రెస్‌కు 12 నుంచి 15 వేలతో మూడవ స్థానం దక్కవచ్చని తెలుస్తోంది.   అయితే, టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రచార వ్యూహకర్తగా మంత్రి హరీష్‌రావు నిలిచారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు, రాష్ట్ర నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  -మార్తి సుబ్రహ్మణ్యం

విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌! వణికిపోతున్న ఢిల్లీ జనం 

దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి మళ్లీ షేక్ చేస్తోంది. గతంలో తగ్గినట్లు కనిపించిన కేసులు.. కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరిగాయి. వారం రోజులుగా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత తొలిసారిగా డిల్లీలో 6వేలను దాటేసాయి. రోజువారీ కేసుల సంఖ్య 6000 మార్కును దాటడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన 6 వేల 700 సులతో మొత్తం కరోనా సంఖ్య 4 లక్షలను అధిగమించింది. అంతకుముందు అత్యధిక సింగిల్డే  స్పైక్ అక్టోబర్ 30 న  5 వేల 891 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మ‌ళ్లీ  మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్నక‌రోనా పాజిటివ్ కేసులు ఆందోళన  రేపుతున్నాయి.    ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ విస్త‌ర‌ణ‌ను థ‌ర్డ్ వేవ్‌గా చెప్ప‌వ‌చ్చ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. పండుగ సీజన్, కాలుష్య స్థాయి పెరుగుతున్న మధ్య కేసులలో అకస్మాత్తుగా పెరిగినట్టు తెలుస్తోందని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌ని సీఎం కేజ్రివాల్ తెలిపారు. ప‌రిస్థితిని తాము ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని, మునుప‌టిలా కొత్త కేసులు విజృంభించ‌కుండా అవ‌స‌ర‌మైన‌ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు సీఎం కేజ్రీవాల్.    ఇప్పటికే భయంకరమైన కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీ ప్రజలు కరోనా మహమ్మారి విజృంభణతో వణికిపోతున్నారు, ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. శీతాకాలానికి సంబంధించిన శ్వాసకోశ సమస్యలు, బయటి నుండి పెద్ద సంఖ్యలో రోగులు రావడం, పండుగ సీజన్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రోజుకు సుమారు 15 వేల కరోనా పాజిటివ్‌ కేసులకు సిద్ధం కావాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఒక నివేదికలో ఇటీవల హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.

కమలం-కోడిగుడ్డు కథ!

కరుణించని కాంట్రాక్టర్లు   టీడీపీ నుంచి వైసీపీ వరకూ అదే కథ   కమలం పార్టీలో ఇదో ఆసక్తికర కహానీ. ఏపీ కమలదళాలకు-కోడిగుడ్లకూ ఏదో అవినావ సంబంధం ఉన్నట్లుంది. ఈ కథ ఇప్పటిది కాదు. చంద్రబాబు నుంచి మొదలయి, జగనన్న వరకూ కొన‘సాగుతోంది’. ఏపీలో బీజేపీ పెద్దాయన ఒకరు.. సందర్భం ఏదయినా గానీ, సమయం ఏదయినా గానీ.. అంటే అది తుపానయినా కావచ్చు. కరవయినా కావచ్చు. కానీ ఆయనకు గుర్తుకు వచ్చేది మాత్రం కోడిగుడ్ల కథే. అంటే పేరు కోడిగుడ్డుదయినా.. తీరు మాత్రం ఆవుకథ అన్నమాట! ఆయనకు అది ఎవర్‌గ్రీన్!!   అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం కోసం, ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తుంటుంది. దానికి వందల కోట్లు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం 50-60 గ్రాముల సైజు ఉండే, కోడిగుడ్లు మాత్రమే కాంట్రాక్టర్లు సరఫరా చేయాలి. కానీ పాపం.. సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉండే పెద్ద తలలు, చిన్న తలలతోపాటు, రాజకీయ పార్టీలనూ తృప్తి పరుస్తుండాలి. వీరుకాకుండా, స్థానిక విలేకరులు, విద్యార్థి సంఘాల నేతలనూ ‘చూసుకోవాలి’ మరి! కాబట్టి.. సర్కారు చెప్పిన సైజు కోడిగుడ్డు సర ఫరా చేస్తే,  వచ్చే ఆదాయం సున్నకు సున్నా, హళ్ళికి హళ్లి. అందుకే ‘కాస్తంత చిన్నసైజు’ కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ఇదంతా రహస్యమేమీ కాదు. బహిరంగమే.   ఈ చిదంబరహస్యం తెలిసిన ఓ కమలదళ మేధావి.. పాపం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచీ, జగన్ వరకూ ఇప్పటిదాకా కోడిగుడ్డు కాంట్రాక్టర్లపై మనసుపారేసుకుంటూనే ఉన్నారట. అప్పటి నుంచీ వీలు దొరికినప్పుడల్లా.. ‘ఆ కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో నాణ్యత లేదు. దాని సంగతి తేల్చమని’ తెగ పోరాడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడూ అదే అంశంపై, సీఎంలకు లేఖ రాస్తుంటారు. వీలు దొరక్కపోయినా, దొరికించుకుని మరీ చట్టసభలో కోడిగుడ్డనే ఆవుకథను వినిపిస్తూనే ఉన్నారు. అయినా.. అక్క ఆర్భాటమే తప్ప, బావబతికుంది లేదన్నట్లు.. ఎవరూ పట్టించుకోరు. అందుకే.. సదరు నాయకుడు, తన పార్టీ వేదికలపైనే కోడిగుడ్ల కథను వినిపిస్తుంటారు.   అసలు ఇంతకూ ఈ ఆవు కథ.. సారీ... కోడిగుడ్డు కథేమిటంటే.. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టరును, సదరు నాయకుడు ఓసారి వచ్చి తనను కలవమన్నారట. పెద్ద నాయకుడు. పైగా గవర్నమెంటులో భాగస్వామిగా ఉన్న నోరున్న నాయకుడాయె! పిలిచిన వెంటనే వచ్చి వాలిపోయిన కాంట్రాక్టరుకు, సదరు బీజేపీ నాయకుడు.. ‘అసలు’ విషయం చెప్పారట. ‘మమ్నల్నీ చూసుకోండనేది’ ఆయన కవి హృదయమన్నమాట! అయితే, ఆ కాంట్రాక్టరు అస్సలు భయపడకుండా.. ఇప్పటికే మేం ఉద్యమాలు చేసే పార్టీకి క్రమం తప్పకుండా నెలవారీ చందాలిస్తున్నాం. పైన ఉన్న ఉన్నవాళ్లకూ ఇస్తున్నాం. ఇక మీకూ ఇస్తే దివాళా తీస్తామని, చావుకబురు చల్లగా చెప్పి వెళ్లిపోయారట. దానితో బాగా హర్టయిన ఆ నాయకుడు, అప్పటి నుంచీ, కోడిగుడ్ల కథను, ఆవుకథ మాదిరిగా వినిపిస్తున్నారన్నది కమలదళాల్లో వినిపిస్తున్న చర్చ.   ఈ కోడిగుడ్డు కథకూ ఓ నేపథ్యం ఉందట. గతంలో ఉద్యమాలు చేసే పార్టీలో పనిచేసి, అంగన్‌వాడీలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ మహిళా నేత బీజేపీలో చేరారు. ఆమె ‘ప్రతిభ’తెలుసుకున్న సదరు బీజేపీ నేత, ఆమెను పార్టీలో బాగా ప్రోత్సహించారట. పనిలోపనిగా ఉద్యమాలు చేసే పార్టీకి అంగన్‌వాడీల నుంచి చందాలు ఎలా వస్తున్నాయన్న దానిపై పరిశోధన చేసి, ఆమె ద్వారా ఆ వివరాలు సేకరించారట. ఆ ప్రకారంగా.. ఒక్కో సెంటర్ నుంచీ వెయ్యి రూపాయలు, ఉద్యమాలు చేసే పార్టీకి విరాళాలుగా వెళతాయని తెలుసుకున్నారట. ఇక ఆ తర్వాత కథ తెలిసిందే కదా? అదే ఈ కోడిగుడ్ల కథ! -మార్తి సుబ్మ్రహ్మణ్యం

జూనియర్ ట్రంప్ ట్వీట్ పై తీవ్రంగా మండి పడుతున్న భారతీయులు..  

హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందనే విషయం పై ప్రపంచం మొత్తం అమెరికా వైపు ఉత్కంఠతో చూస్తోంది. అయితే, ఈ ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్ తాజాగా చేసిన ఒక ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఆయన చేసిన ట్వీట్‌ పై అటు ఎన్నారైలు, ఇటు భారత రాజకీయ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రపంచ పటాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్రంప్ జూనియర్.. అన్ని దేశాలను రిపబ్లికన్‌ పార్టీ కలర్‌ "ఎరుపు రంగు" లో చూపించారు. ఈ దేశాలన్నీ ట్రంప్ విజయాన్ని సాధిస్తాడని విశ్వాసంతో ఉన్నాయని అయన తెలిపారు. అయితే ఆ ట్వీట్ లో భారత్, చైనా, లైబేరియా, మెక్సికో వంటి కొన్ని దేశాలను మాత్రం డెమోక్రట్‌ పార్టీ కలర్ "నీలి రంగు" లో చూపించారు. ఈ దేశాలు తమ ప్రత్యర్థి జో బైడెన్‌కు మద్దతుదారులని చెప్పుకొచ్చారు. అలాగే, తమ దేశంలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్‌ వంటి రాష్ట్రాలను సైతం ఆయన నీలి రంగులోనే చూపించారు.   అయితే భారత్‌లోని జమ్మూకశ్మీర్‌, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలను మాత్రం ఎరుపు రంగులో చూపించడం వివాదాస్పదమవుతోంది. భారత్‌లోని అన్ని ప్రాంతాలను నీలి రంగులో చూపి, కొన్ని ప్రాంతాలను మాత్రం ఎరుపు రంగులో చూపడం పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ట్రంప్ భారత్‌కు స్నేహితుడని భావిస్తే, అయన తనయుడు మాత్రం తన బుద్ధిని చూపించారంటూ బీజేపీయేతర పార్టీల నేతలు ట్వీట్లు చేస్తున్నారు.   ప్రెసిడెంట్ ట్రంప్‌తో భారత్ కు ఎంతో స్నేహం ఉందని, అయితే, ట్రంప్ జూనియర్ మాత్రం భారత్‌ను‌ జో బైడెన్‌, కమల హారిస్‌ మద్దుతుదారుగా చూపించారని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. మరింత ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారని అన్నారు. అసలు ఆయన వద్ద ఉన్న కలర్‌ పెన్సిల్‌ను ఎవరైనా లాక్కోవాలని సెటైర్ వేశారు.   అయితే జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో కలుపుతూ జూనియర్ ట్రంప్ ఈ ట్వీట్ చేయడం తాజాగా భారతీయుల కోపానికి కారణమైంది. జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. పాకిస్థాన్ తో ఎలా కలుపుతారంటూ ట్రంప్ జూనియర్ పై భారతీయులు నిప్పులు చెరిగారు.. మరోపక్క, పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌పై స్పందిస్తూ జమ్మూకశ్మీర్‌ని పాక్ ‌లో భాగంగా చూపించారని, చాలా ప్రోత్సాహకరంగా ఉందని అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

అర్ణబ్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు! చొక్కా పట్టుకుని లాక్కొచ్చారంటున్న రిపబ్లిక్ టీవీ

రిపబ్లిక్ టీవీ ఎడిటర్, దేశంలోని ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో ఆయనను ముంబై అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తనతో పాటు తన అత్తయ్య, మామయ్య, కుమారుడు, భార్యపై ముంబై పోలీసులు భౌతిక దాడి చేశారని అర్ణబ్ గోస్వామి ఆరోపించారు.    అర్ణబ్ గోస్వామి అరెస్టుపై పలు ఆరోపణలు చేస్తూ రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని అర్నాబ్ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసే క్రమంలో భౌతిక దాడికి దిగారని తెలిపింది. అర్నాబ్ గోస్వామిపై పోలీసులు దాడికి దిగి, ఆయనను చొక్కాపట్టుకుని బయటకు లాక్కొచ్చి పోలీసు వ్యాను ఎక్కించి తీసుకెళ్లారని తెలుపుతూ రిపబ్లిక్ టీవీ ఓ వీడియోను కూడా ప్రసారం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ  వైరల్ అవుతున్నాయి. అర్నాగ్ గోస్వామిపై ముంబై పోలీసులు ప్రవర్తించిన తీరును దేశంలోని ప్రజలు ఖండించాలని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించింది.    ముంబైలో 2018, మేలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అన్వయ్ రాసిన ఆత్మహత్య లేఖ పోలీసులకు లభ్యమైంది. గోస్వామితో పాటు ఫెరోజ్ షెయిక్, నితీశ్ సర్దా అనే ఇద్దరు వ్యక్తులు తనకు 5.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇవ్వలేదని దీంతో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని అన్వయ్ అందులో రాశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు జరిపిన రాయ్‌గడ్ పోలీసులకు అందుకు తగ్గ ఆధారాలు లభ్యం కాకపోవడంతో 2019 లో ఈ కేసును మూసివేశారు. ఈ ఏడాది మేలో   మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఈ కేసు విషయంపై అన్వయ్ నాయక్ కుమార్తె ఆధ్యనాయక్ ఆశ్రయించి, పోలీసులు ఈ కేసులో సరైన విచారణ జరపలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కొత్తగా సీఐడీ విచారణ జరుపుతుందని హోం మంత్రి ప్రకటించారు.