రైతుల పోరాటానికి భారీ మద్దతు! ప్రశాంతంగా భారత్ బంద్
posted on Dec 8, 2020 9:13AM
రైతు సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రైతుల బంద్ కు వివిధ కార్మిక సంఘాలు విపక్షాలు మద్ధతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. రైతులు రోడ్లు, రైలుపట్టాలపై బైఠాయించడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. యూపీలోని ప్రయాగరాజ్ నగరంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. బనారస్ నుంచి గ్వాలియర్ వెళ్లాల్సిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రైలును ఆపివేశారు. భువనేశ్వర్ రైల్వే స్టేషనులో రైళ్లను రైతులు నిలిపివేశారు. రవాణ సంఘాలు బంద్ కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెటును తెరిచినా రైతుల బంద్ కు మద్ధతు వ్యాపారులు దుకాణాలు తెరవలేదు. జైపూర్ లో రైతులు, ఎన్ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
బంద్ సందర్భంగా నిలిచిపోయిన ప్రయాణికులకు మంచినీరు, పండ్లను ఇస్తున్నారు నిరసనకారులు. ఢిల్లీ సరిహద్దుల్లో 13వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు చలిని సైతం లెక్క చేయకుండా రోడ్లపై భైఠాయించారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రైతుల ఆందోళనతో సింఘు, టిక్రి, జారోదా, ఘజిపూర్, చల్లా, నోయిడా లింక్ రోడ్డు, జటిక్రా సరిహద్దు రహదారులను పోలీసులు మూసివేశారు. హరియనా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాల మోహరించాయి. ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపినా రైతులు పట్టువీడలేదు. బుధవారం మరోసారి రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరపనుంది.