గురువారం రాత్రి ఫ్లై ఓవర్లు బంద్! 

హైద‌రాబాద్‌లోని ఫ్లైఓవర్లను గురువారం రాత్రి 10 గంట‌ల నుంచి శుక్రవారం  తెల్ల‌వారు జాము వ‌ర‌కు మూత పడనున్నాయి. నగరంలోని అన్ని ప్లై ఓవర్లను మూసివేయాలని హైదరాబాద్ ‌ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్  అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు గ్రీన్‌ల్యాండ్స్, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే మినహా హైద‌రాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను గురువారం రాత్రి మూసివేయనున్నారు.జగ్‌నేకీ రాత్‌ నేపథ్యంలో హైద‌రాబాద్‌లో అవాంఛనీయ ఘటనలు జ‌ర‌గ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే భారత్ లో ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. శుక్రవారం హైద‌రాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో శుక్రవారం  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయి. వాహనదారులు ట్రాఫిక్  ఆంక్షలను గమనించి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిర్ పోలీసులు సూచించారు.  

100 ఏళ్ల మోదీ తల్లికి కరోనా వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా రెండో దశ కొవిడ్ వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతోంది. అనేక మంది ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేసుకొని ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా, ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ సైతం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  ‘‘మా అమ్మ కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను. వ్యాక్సిన్‌‌కు అర్హులైన వారందరూ టీకా వేయించుకోండి. ఇతరులను కూడా ఈ మేరకు ప్రేరేపించండి.’’ అని ప్రధాని మోదీ ట్విట్టర్ లో పిలుపునిచ్చారు. వృద్ధుల కోటాలో హీరాబెన్ టీకా తీసుకున్నారు. ప్రస్తుతం మోదీ తల్లి వయస్సు 100 ఏళ్లు. ఆ వయసులో కూడా ఆమె ఎలాంటి భయం, బెరుకు లేకుండా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

14 రోజుల డెడ్‌లైన్.. సమ్మెతో ఉక్కు సమరానికి సై

విశాఖ ఉక్కు పోరాటం మరో దశకు చేరుతోంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మెకు సై అన్నారు. కొన్ని వారాలుగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నా.. ఫలితం లేకపోవడంతో ఇక ఆఖరి అస్త్రంగా సమ్మె నోటీసు ఇచ్చారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు సీఎండీకి సమ్మె నోటీసు అందజేశారు. ఆర్‌-కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది.   విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, అమ్మేదెవరు-కొనేదెవరు? అంటూ ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ఉద్యమకారులు కొన్ని రోజులుగా విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇంత ఉధృతంగా ఉద్యమం చేస్తున్నా.. కేంద్రం దిగిరాకపోగా.. ఇటీవల పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో నిరసనలు మరింత ఎగిశాయి. అది స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించి.. డైరెక్టర్‌ ను ఘోరావ్ చేసే దాకా వెళ్లింది. ఆరు గంటల పాటు డైరెక్టర్‌తో పాటు హెచ్‌ఆర్‌ విభాగం ఈడీ బాలాజీని చెట్టు కిందే నిలబెట్టి తీవ్ర స్థాయిలో తమ నిరసన తెలిపారు ఉద్యోగులు. అయినా, స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. స్టీల్ ప్లాంట్ సీఎండీకి సమ్మె నోటీసులు ఇచ్చాయి ఉద్యోగ సంఘాలు. 14 రోజుల డెడ్‌లైన్ పెట్టి.. ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మె చేపడతామని నోటీసులో తెలిపారు. 

మమత డ్రామాలో మరో డ్రామా  

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా  నందిగ్రామ్ లో  పర్యటిస్తున్న మమతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో స్వల్పంగా  గాయపడిన ఆమె కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఎడమ కాలు, నడుము, భుజం, మెడ తదితర భాగాల్లో గాయాలైనట్టు వైద్యులు చెబుతున్నారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారనీ.. తనను నెట్టివేసి కారు డోరు బలంగా విసరడంతో గాయాలయ్యాయంటూ మమతా దీదీ ఆరోపించారు.  నిజానికి ముఖ్యమత్రి పై దాడి జరగడం అంటే అది మాములు విషయం కాదు. అందునా ఎన్నికల వేడి ఇంకా పూర్తిగా రాజుకోక ముందే ఏకంగా ముఖ్యమంత్రి పై దాడి జరిగిందంటే ఎనిమిది విడతల్లో  సుదీర్ఘంగా సుమారు రెండు నెలల పాటు సాగే ఎన్నికల క్రతువులో ఇంకెన్ని నేరాలు ఘోరాలు జరుగుతాయో అన్న సామాన్యులలో ఆందోళన కలగడం సహజం. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్ధులు సహా ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్ధులు, ప్రచారంలో పాల్గొనే నాయకులకు రక్షణ కలిపించవలసిన బాధ్యత ఎన్నికల సంఘం పై ఉంటుంది. మమతా బెనర్జీ చేసిన ఫిర్యాదును బట్టి చూస్తే, ఆమెకు భద్రత కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని అనిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే, ఇటు తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ కూడా  ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ అయితే ఈ ఘటనకు సంబందించిన సీసీ కెమెరాల ఫూటేజిని విడుదలచేయాలని కోరడంతో పాటుగా, నిజానిజాలు అందరికీ తెలిసేలా విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అయితే ఏకంగా సిబిఐ విచారణ డిమాండ్ చేశారు.  మరో వంక తృణమూల్ నాయకులు కార్యకర్తలు, రాష్ట్రం అంతటా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ, బీపేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైళ్లను అడ్డుకున్నారు . ఈమొత్తం వ్యవహారానికి కొసమెరుపు ఏంటంటే.. గాయపడిన దీదీని పరామర్శించడానికి బీజేపే నాయకులు అసుపత్రికి వెళ్లారు. అయితే, వైద్యులు అందుకు అనుమతించలేదు అనుకోండి.అయినా, వారు తమ విచారణ వ్యక్తం చేసి, ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతునికి ఓ అర్జీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీదీ పై దాడి, కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా తృణమూల్ ఆడిన  డ్రామా అనుకుంటే, బీజేపీ నాయకులు ఇచ్చిన ట్విస్ట్..డ్రామాలో డ్రామా ..మరీ బాగుంది.

కాంగ్రెస్ కు మరో షాక్ ..రాహుల్ పై నమ్మకం లేకనేనట!  

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. పార్టీ సీనియర్ నాయులు ఎవరూ, ఎన్నికల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీ కూడా సీనియర్లను పట్టిచుకోవడం లేదు. జీ 23 పేరు తిరుగుబాటు జెండా ఎగరేసిన నాయకులు, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రాష్ట్రాలలో ఏమి జరుగుతుందో ఏమో కానీ,  జాతీయస్థాయి నేతలు అయితే, రాహుల్, ప్రియాంక తప్ప ఇతర నాయకులు ఎవరూ ప్రచారంలో కనిపించడం లేదు. ఆ ఇద్దరు కూడా అంతంత మాత్రంగానే కానీ, ప్రభావవంతంగా ప్రచారం సాగిస్తున్నట్లు లేదు.  తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత పీసీ చాకో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తమ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.అయన తమ రాజీనామాకు పార్టీలో వర్గపోరు కారణంగా చూపించేరు. అయితే, పార్టీకి ఇక బతుకు లేదనే నిర్ణయానికి రావడం వల్లనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.  ‘ప్రస్తుతం నాయకత్వం లేని పార్టీగా కాంగ్రెస్‌ మిగిలి పోయింది.సుదీర్ఘ కాలంగా అధ్యక్షుడు లేకుండానే కాంగ్రెస్‌ ముందుకెళుతోంది.ఈ సమయంలో పార్టీ అధినాయకత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించడం లేదు’ అని చాకో ఒక విధమైన నిర్వేదాన్ని వ్యక్త పరిచారు. పార్టీ  ప్రభావం వేగంగా  పడిపోతుందని, తన రాజీనామా అదే అసలు కారణం అని చెప్పకనే చెప్పారు. కేరళలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విషయంలో పార్టీ రాష్ట్ర విభాగాన్ని సంప్రదించకపోవడంపై కూడా చాకో అసంతృప్తిని వ్యక్త పరిచారు. అయితే, జమ్మూలో జీ 23 నేతలు చెప్పిన, ఇంకో చోట ఇంకో కాంగ్రెస్ నాయకుడు చెప్పినా,లేఖలే రాసినా అన్నిటి సారంశం ఒకటిగానే ఉందని, రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.  

విశాఖలో కేటీఆర్ కు పాలాభిషేకం 

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణపై  ఏపీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశాఖ ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీంతో కేటీఆర్‌పై ఆంధ్రప్ర‌దేశ్‌ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ, ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. కేటీఆర్ చిత్ర‌ప‌టాల‌కు స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్థానికులు పాలాభిషేకాలు చేశారు. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంతాక‌లిసి పోరాడి విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణ చ‌ర్య‌ల‌ను అడ్డుకుంటామ‌ని కార్మికులు చెప్పారు.  తెలుగు ప్ర‌జ‌ల‌ ఐక్య‌త వ‌ర్ధిల్లాలంటూ నిన‌దించారు.కేటీఆర్ ప్రకటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.   విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం కలిసివస్తామని బుధవారం ప్రకటించారు కేటీఆర్. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్నారు   కేటీఆర్. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేశారన్నారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం వీలైతే వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొనేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తమ అందరి మద్దతు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ చేస్తున్న ఉద్యమానికి ఉంటుందని.. పోరాటంలో కలిసి ఉంటామని చెప్పారు.    

12 ఏండ్లకే కాలేజీలో చేరావా! చిరంజీవిపై నెటిజన్ల ఫైర్ 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలు అన్నీ విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగానే సాగుతున్నాయి.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కచ్చితంగా 100% ప్రైవేటీకరణ చేసి తీరుతామని పార్లమెంట్ వేదికగా ప్రకటించడంతో.. ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఇంత జరుగుతున్నా టాలీవుడ్ హీరోలు సైతం ఎవరూ మాట్లాడక పోవడం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ నుంచి నారా రోహిత్ ఒక్కరే ఇలా చేయడం అన్యాయమని గళం విప్పారు. అయితే ఆయన చంద్రబాబు సోదరుడి కుమారుడు కావడంతో ఆయనకు కూడా పార్టీ ముద్ర వేశారు.  బుధవారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మెగాస్టార్  చిరంజీవి మద్దతు తెలిపారు.  విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతపట్టి.. గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశామని తెలిపారు. ధర్నాలు, హర్తాళ్లు, రిలే నిరాహార దీక్షలు చేశామని చెప్పారు.  అయితే విశాఖ పోరాటానికి మద్దతు ఇస్తూ చిరంజీవి చేసిన ప్రకటనపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతపట్టి.. గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశామని చెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెగాస్టార్.. నర్సాపురం  YNM కాలేజ్ లో చదివేటప్పుడు స్టీల్ ప్లాంట్ కావాలని గోడల మీద కుంచలతో రాశావా? , నిరాహార దీక్షలు కూడా చెయ్యడం చూశావా?.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 1966-67 లో వచ్చింది.వైజాగ్ స్టీలు ప్లాంట్ స్థాపించింది 1971లో..కానీ నువ్వు YNM కాలేజ్ లో చదివింది 1973-76.ఆల్రెడి వచ్చేసిన స్టీల్ ప్లాంట్ కావాలని రెండేళ్ళ తర్వాత గోడల మీద రాశావా? దేశానికి స్వాతంత్ర్యం కావాలని క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపివ్వలేకపోయావా... అబద్దం చెప్పినా అమెజాన్ లో ఆఫర్ పెట్టినట్లు వుండాలి..అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి 1955లో జన్మించారు. విశాఖ ఉద్యమం జరిగింది 1966-67లో. అంటే అప్పటికి చిరంజీవి వయసు 12 ఏండ్లు. అప్పుడు చిరంజీవి ఆరో, ఏడో తరగతి చదువుతూ ఉంటారు. కాని చిరంజీవి మాత్రం వైఎన్ఎం కాలేజీలో చదువుతున్నప్పుడు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గోడలపై నినాదాలు రాశామని చెప్పారు. దీనిపైనే నెటిజన్లు మండిపడుతున్నరు. 12 ఏండ్ల వయసులోనే చిరంజీవి వైఎన్ఎం కాలేజీలో చేరారా అని ప్రశ్నిస్తున్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా చిరంజీవి  స్పందన వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు. విశాఖ ఉద్యమం మీద స్పందిస్తూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని అవసరమైతే విశాఖ వెళ్లి మరీ టిఆర్ఎస్ ఆందోళనల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మీద మరింత ప్రెజర్ పెరిగింది. దీంతో చిరంజీవి  దీనికి సంబంధించిన ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. కేటీఆర్ ప్రకటన చేశాక చిరంజీవి ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఉక్కు సపోర్టుకో లెక్కుంది.. కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్..

విశాఖ ఉక్కు పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు. అవసరమైతే తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానన్న కేటీఆర్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల రోజులుగా పోరాడుతున్నారు ఆంధ్ర ప్రజలు. ఇన్ని రోజులూ లేనిది సడెన్ గా ఇప్పుడే కేటీఆర్ లో విశాఖ ఉక్కు మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందనే డౌట్ కొందరికి వచ్చింది. కేసీఆర్ అనుమతితో కేటీఆరే స్వయంగా ఉక్కు ఉద్యమంలో పాల్గొనేంత చొరవ ఎందుకు తీసుకుంటున్నారంటే.. దానికో లెక్కుంది అంటున్నారు రేవంత్ రెడ్డి.  విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు ఇవ్వడం వెనుక దురుద్దేశం ఉందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది కోసమే అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. ఆ మేరకు మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేశారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడతారా? మీ ఎంపీలు పార్లమెంటులో పోరాడరు. మీరు జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూడా రారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం మాత్రం వచ్చా? ఎన్నికలయ్యాక ఇచ్చిన హామీలను మరచిపోవడం మీకు మీ పార్టీకి అలవాటుగా మారింది. పెరిగిన నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్‌ ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో పోరాటానికి మీ ఎంపీలు ముఖం చాటేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయపడుతున్నారా? రాజీ పడుతున్నారా?’ అని రేవంత్ లేఖలో ప్రశ్నించారు.  రేవంత్‌రెడ్డి లేఖతో ప్రజల్లో అనుమానం మొదలైంది. గతంలో ఏపీ రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేసినప్పుడు స్పందించలేదు. స్పెషల్ స్టేటస్, విశాఖ రైల్వే జోన్ పైనా పైనా నో రియాక్షన్. అలాంటిది.. నెల రోజుల తర్వాత ఉన్నట్టుండి విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ మద్దతు ప్రకటించడమేంటని ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాభం పొందడానికే ఇలాంటి ప్రకటన చేశారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఎందుకంటే, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా ఉంది. టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె వాణీదేవిని ఆలస్యంగా బరిలో దింపినా.. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో వాణీదేవి పట్ట ఓటర్లు అంత సుముఖంగా లేరని అంటున్నారు. బీజేపీ నుంచి రాంచందర్ రావు, కాంగ్రెస్ కేండిడేట్ చిన్నారెడ్డి, ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన ప్రొ.నాగేశ్వర్‌ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బలమైన పోటీతో వాణీదేవి విజయంపై గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది. అందుకే, వ్యూహాత్మకంగా విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు ఇచ్చారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ ఓట్లే టార్గెట్ గా కేటీఆర్ ఈ స్టేట్‌మెంట్ చేశారని చెబుతున్నారు. ఆంధ్రులు సెంటిమెంట్‌గా భావిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సపోర్ట్‌గా మాట్లాడటం వల్ల అక్కడి వారిని సంత‌ృప్తి పరిచి.. తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఓ వర్గం ఓట్లను గంపగుత్తగా ఆకర్షించాలనే ఐడియాతోనే కేటీఆర్ ఆ స్టేట్‌మెంట్ చేశారని విశ్లేషిస్తున్నారు. తాజాగా, కేటీఆర్ కు రేవంత్ రెడ్డి రాసిన లేఖలోనూ ఇదే విషయం ప్రస్తావించారు.  ఇదే పార్లమెంట్ సెషన్ లో.. కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయలేమంటూ కేంద్రం ప్రకటన చేసింది. ఉత్తర తెలంగాణవాసులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కేంద్రం చేతులెత్తేసినా.. కేటీఆర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. హైదరాబాద్ కు ఐటీఐఆర్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విభజన హామీలు తదితర తెలంగాణకు చెందిన అంశాలపై ఉద్యమం చేయకుండా ఉదాసీనంగా ఉంటున్న టీఆర్ఎస్.. ఎవరూ అడగందే విశాఖ ఉక్కు కోసం తాము సైతం కలిసి పోరాటం చేస్తామంటూ ప్రకటనలు చేయడం ప్రజలను మభ్యపరచడమే అని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేటీఆర్ ఇలా ఉక్కు స్టేట్‌మెంట్ చేశారనేది రేవంత్‌రెడ్డి లేఖ సారాంశం.

సీఎం మ‌మ‌తకు తీవ్ర గాయాలు! 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి ఘటన పశ్చిమ బెంగాల్ లో దుమారం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు . అయితే బీజేపీ నేతలు మాత్రం మమతపై ఎలాంటి దాడి జరగలేదని, ఎన్నికల్లో లబ్ది కోసమే ఆమె డ్రామాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బెంగాల్ కాంగ్రెస్ నేతలు కూడా దీదీ రాజకీయ ఎత్తులు వేస్తున్నారని మండిపడుతున్నారు. నందిగ్రామ్ నుంచి సాయంత్రమే కోల్ కతా వచ్చిన మమతా బెనర్జీ.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  దాడి ఘటనపై రాజకీయ రగడ సాగుతున్న సమయంలో మమతపై ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. మమతా బెనర్జీ ఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. అంతేకాదు ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో మమత ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్పారు.  మ‌రో రెండు రోజుల పాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు తెలిపారు. మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని చెప్పుకొచ్చారు వైద్యులు. మ‌మ‌త‌ ఆరోగ్య పరిస్థితిపై  టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. ఇప్ప‌టికే ఆమెపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఈ ఘ‌ట‌న‌పై ప‌శ్చిమ బెంగాల్ డీజీపీని సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిచింది. మరోవైపు మమత తనపై దాడి జరిగిందని చెబుతున్న ప్రాంతంలో ఉన్న కొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు మాత్రం అస‌లు ఆమెకు అక్క‌డ ఏమీ కాలేద‌ని చెబుతున్నారు. స్థానిక‌ విద్యార్థి సుమ‌న్ మైతీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి కారులో ఇక్క‌డ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో చాలా మంది ఆమె చుట్టూ చేరారని అన్నాడు. మ‌మ‌తను ఎవ‌రూ తోయ‌లేద‌ని, అయితే, ఆమె మెడ, కాలికి గాయం అయిన‌ట్లు అనంత‌రం తెలిసింద‌ని, ఆ స‌మ‌యంలో ఆమె కారు మెల్లిగా క‌దులుతూ ముందుకు వెళ్ల‌డాన్ని చూశాన‌ని చెప్పాడు.    

కొల్లు రవీంద్రకు బెయిల్‌.. భయపడేది లేదంటూ వార్నింగ్

ఉదయం అరెస్ట్. మధ్యాహ్నం బెయిల్. మచిలీపట్నంలో జరుగుతున్న హైడ్రామా మరో టర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరైంది. కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో హైటెన్షన్. బుధవారం పురపాలక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కొల్లు రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై  356, 506, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గురువారం ఉదయం మచిలీపట్నంలోని ఆయన నివాసంలో రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు. పోలీసులు ప్రొసీజర్‌ ఫాలో కాలేదని అభిప్రాయపడిన న్యాయమూర్తి.. కొల్లు రవీంద్రకు బెయిల్‌ మంజూరు చేశారు.     అరెస్టులకు భయపడేది లేదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేం న్యాయమని అడిగితే నాపైనే కేసు పెట్టారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నరు రవీంద్ర.  పోలింగ్ రోజు మచిలీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. ఓటు వేసేందుకు వెళ్లిన తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ మచిలీపట్నం జలాల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు కొల్లు రవీంద్ర. ఓటు వేసేందుకు వచ్చిన రవీంద్రకు, వైసీపీ ఏజెంట్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇనగుదురుపేట సీఐ శ్రీనివాసరావు కొల్లు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. తనను చంపేయాలనుకుంటున్నారా అంటూ రవీంద్ర పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గొడవ నేపథ్యంలో రవీంద్రపై కేసు నమోదు చేసి గురువారం ఉదయం ఆయన ఇంటికెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొల్లును కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. 

లేపాక్షిలో బాలకృష్ణ పూజలు

ఎమ్మెల్యే బాలకృష్ణకు దైవ భక్తి ఎక్కువ. మహా శివరాత్రి పర్వదినాన బాలయ్య లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే బాలకృష్ణ దంపతులు ఆలయానికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భార్య వసుందరతో కలిసి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.  ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతుల రాక సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక స్వాగతం పలికారు. దేవాలయ విశిష్టతను, క్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. బబాలకృష్ణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులుగా హిందూపురంలోనే ఉంటున్నారు బాలయ్య. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు పూర్తి అవడం.. మహా శివరాత్రి రావడంతో అనంతపురం జిల్లాలోనే ఉన్న బాలకృష్ణ.. లేపాక్షి ఆలయాన్ని దర్శించారు. బాలయ్య రాక సందర్భంగా ఆయన్ను చూసేందుకు అభిమానులు, భక్తులు ఆసక్తి కనబరిచారు. 

జగన్ రెడ్డికి చిప్పకూడే! 

కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. మహా శివరాత్రి రోజున కొల్లు రవీంద్రను అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. మంచి సీఎం రాష్ట్ర అభివృద్ధితో ఆనందాన్ని పొందుతాడని... మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి రాక్షస ఆనందం పొందుతాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కోడికత్తి జగన్ రెడ్డి, తాపీకత్తి నాని కలిసి కొల్లు రవీంద్ర ఈక కూడా పీకలేరని అన్నారు నారా లోకేష్. తమరు ఎంత అణచినా ఉప్పెనలా టీడీపీ సైన్యం తమపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అధికార మదంతో వైసీపీ నేతలు చెప్పినట్టు ఆడుతున్న కొంతమంది అధికారులు జగన్ రెడ్డితో కలిసి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి అని నారా లోకేష్ హెచ్చరించారు.  బీసీ నేతలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు  కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొల్లు రవీంద్ర అరెస్టు బీసీలపై కక్ష్య సాధింపులకు నిదర్శనమన్నారు. జగన్ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీసీలపై కక్ష్య సాధింపులు ఏవిధంగా ఉన్నాయో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. శివరాత్రి పర్వదినం రోజున కూడా టీడీపీ నేతలను అరెస్టులతో వెంటాడుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబంతో ఆనందంగా  పండుగ జరుపుకుంటున్న జగన్ రెడ్డి మరో వైపు టీడీపీ నేతల్ని అరెస్టులు చేయించి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు మరోవైపు కొల్లు రవీంద్ర అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రవీంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  బుధవారం జరిగిన మున్సిపల్ పోలింగ్ సందర్భంగా విధుల్లో ఉన్న ఉద్యోగులు, పోలీసులపై దౌర్జన్యం చేశారంటూ కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో గురువారం ఉదయం కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు.   

నందిగ్రామ్ లో మమతపై దాడి!  డ్రామా అంటున్న బీజేపీ

ముఖ్యమంత్రిపై దాడి... కాదు కాదు డ్రామా.. ఇదీ బెంగాల్ లో కొన్ని గంటలుగా సాగుతున్న వివాదం.  నందిగ్రామ్‌ పర్యటనలో తనపై దాడి జరిగిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. నందిగ్రామ్‌ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బుధవారం ఆమె నామినేషన్‌ వేశారు. అనంతరం, వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత వివరించారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో రేయపరా వద్ద ఈ ఘటన జరిగిందని మమత తెలిపారు. ‘నా కారు వెలుపల నిల్చుని ఉన్నా. కారు డోర్‌ తెరచి ఉంది. అక్కడి నుంచి కనిపిస్తున్న గుడివైపు చూస్తూ ప్రార్ధించాను. ఆ తరువాత కార్లోకి వెళ్దామనుకుంటుండగా, అకస్మాత్తుగా నలుగురైదుగురు నా దగ్గరకు వచ్చి, కారు డోర్‌ను నా వైపు గట్టిగా నెట్టారు. ఆ డోర్‌ తగిలి నా ఎడమ కాలికి గాయమైంది. నేను ఒక్కసారిగా ముందుకు పడిపోయాను’ అని వివరించారు. గాయంతో కాలు వాచిందని, జ్వరంగా అనిపిస్తోందని, ఛాతీలో నొప్పిగా ఉందని తెలిపారు. ‘కావాలనే కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది కుట్ర. ఎస్పీ సహా స్థానిక పోలీసులెవరూ ఆ సమయంలో నా దగ్గర లేరు’ అని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వ్యక్తిగత భద్రత సిబ్బంది మమతను కారులో వెనుక సీటులో కూర్చోబెట్టారు. బుధవారం రాత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లోనే ఉండాలనుకున్నారు. కానీ ఈ ఘటన జరగడంతో కోల్‌కతా వెళ్లారు. వెంటనే కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో ఆమెకు  చికిత్స అందించారు. మమతని స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకువెళ్తున్న సమయంలో భారీగా చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక  నినాదాలు చేశారు. కాలికి ఎక్స్‌రే తీస్తామని, గాయం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు. తమ పార్టీ అధినేత్రిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించే లక్ష్యంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది.  మమతపై దాడి జరిగిందన్న వార్తలపై బీజేపీ స్పందించింది. చిన్న ప్రమాదాన్ని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై సీబీఐ  దర్యాప్తు జరపాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్ఘియ డిమాండ్‌ చేశారు. ఇలాంటి ప్రచారాలతో సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఫలించబోవని కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర హోం మంత్రి కూడా ఆమెనే. అందువల్ల ఈ వైఫల్యానికి బాధ్యతగా ఆమె రాజీనామా చేయాలి’ అన్నారు.  

పండుగ పూట అరాచకమే!

కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు.  ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపై నిన్న దురుసుగా ప్రవర్తించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ఉదయం 6 గంటలకే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.  కొల్లు రవీంద్ర అరెస్ట్ నేపథ్యంలో ఉదయం నుంచి మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రవీంద్రను అరెస్ట్ చేయవద్దంటూ  పోలీసులను కార్యకర్తలు, అభిమానులు అడ్డుకున్నారు. రవీంద్రను పోలీసు వాహనం ఎక్కనీయకుండా అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు వారిని పక్కకు తొలగించేందుకు యత్నించగా కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు కార్యకర్తలను అడ్డుతొలగించిన పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై  రవీంద్ర వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లు రవీంద్ర ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.  మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో వైసీపీ పాల్పడిన అక్రమాలను అడ్డుకున్నందునే రవీంద్రను అరెస్టు చేశారని ఆరోపించారు. పండుగ పూట కూడా బీసీలను జగన్ రెడ్డి ప్రభుత్వం సంతోషంగా ఉండనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని బాబు డిమాండ్ చేశారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా? అని ప్రశ్నించారు.  కొల్లు రవీంద్ర చేసిన నేరమేంటి? అని చంద్రబాబు నిలదీశారు. బూతుల్లోకి వెళ్లి దొంగఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు దిగిన వైసీపీ నాయకులను ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు, దాడులు, అరెస్టులు పతాక స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. బీసీల వ్యతిరేకి సీఎం జగన్ అని.... బీసీలు బుద్ధి చెప్పే రోజులు రానున్నాయని చంద్రబాబు హెచ్చరించారు. 

దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం!     

తెలంగాణ పర్యాటక శాఖలో నెలకొన్న బ్రాండ్ అంబాసిడర్  వివాదం మరింత ముదురుతోంది. తెలంగాణ పర్యాటక శాఖ ప్రచారకర్తగా నియామకం అయిన తర్వాత తన చుట్టూ రగులుకున్న వివాదంపై యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక తీవ్ర మనస్తాపం చెందినట్టు కనిపిస్తోంది. దీంతో తనకు అలాంటి పదవులేమీ వద్దని, మునుపటిలా తన పనేదో తాను చేసుకుంటానంటూ ట్విట్టర్ ద్వారా హారిక వెల్లడించింది. మహిళా దినోత్సవం రోజున తనను తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన దగ్గరి నుంచి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసని, కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు హారిక పేర్కొంది. ఈ విషయంలో తనకు మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన హారిక.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని బిగ్ బాస్ ఫేం వేడుకుంది. హారికను పర్యాటకశాఖ ప్రచారకర్తగా నియమించినప్పటి నుంచి వివాదం మొదలైంది. ప్రభుత్వానికి, ఆ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండానే ఆమెను పదవిలో నియమించారన్న ప్రచారం జరిగింది. ఆమె నియామకంపై పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు  తెలిసింది. హారిక ఎవరో తనకు తెలియదని, ఆమెను నియమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు, త్వరలోనే మరో సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్‌గా  నియమిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.

విశాఖ ఉద్యమానికి చిరంజీవి మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి  సినీ నటుడు, మెగాస్టార్  చిరంజీవి మద్దతు తెలిపారు.  విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు.నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతపట్టి, గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశామని తెలిపారు. ధర్నాలు, హర్తాళ్లు, రిలే నిరాహార దీక్షలు చేశామని చెప్పారు. దాదాపు 35 మంది పౌరులతో పాటు ఒక తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నామని చిరంజీవి తెలిపారు. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఒక ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయని తెలిసి గర్వించామని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్ని సంవత్సరాలుగా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం దారుణమని చిరంజీవి అన్నారు. నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చేయాలనుకోవడం సరికాదని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడిన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఉద్యోగస్తులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాలను గౌరవించి తన నిర్ణయాన్ని కేంద్రం పునఃసమీక్షించుకోవాలని మెగా స్టార్ చిరంజీవి కోరారు. విశాఖ ఉక్కును రక్షించుకోవడం ప్రస్తుతం మనందరి ముందున్న ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఇది పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయసమ్మతమైన హక్కు అని... ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకోవాలని చిరంజీవి పిలుపిచ్చారు. 

యువతిపై జొమాటో డెలివరీ బాయ్ అటాక్

జొమాటోలో ఆర్డర్ బుక్ చేసింది ఓ యువతి. ఫుడ్ ఆలస్యంగా రావడంతో ఆర్డర్ క్యాన్సిల్ చేసింది. ఆగ్రహించిన డెలివరీ బాయ్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోతూ ఆ యువతిపై దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ.. ముక్కు పగిలి రక్తం వచ్చేలా దారుణంగా కొట్టాడు. రక్తం కారుతున్న ముఖంతో.. ఏడుస్తూ.. విషయం మొత్తం వెల్లడించింది బాధితురాలు. జొమాటో సేవలు సురక్షితమేనా అంటూ ప్రశ్నించింది. తనకు సపోర్ట్ చేయాలంటూ నెటిజన్లను కోరింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బెంగళూరులో జరిగింది ఈ దారుణం. బాధితురాలు హితేషా చంద్రానీ నెత్తురోడుతున్న ముఖంతో వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు. మార్చి 9న మధ్యాహ్నం మూడున్నరకు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశానని, అది సాయంత్రం నాలుగున్నరకు డెలివరీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే, సమయానికి ఆర్డర్ రాకపోవడంతో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌కి ఫోన్ చేసి ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయాలని కోరింది. అంతలోనే డెలివరీ బాయ్‌ ఆర్డర్‌ తీసుకొని ఆమె ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా ఫుడ్ ఆలస్యంగా రావడంపై ఇద్దరి మధ్యా వాదన జరిగింది. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆగ్రహంతో ఘర్షణకు దిగాడు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేశాడు. పిడిగుద్దులతో ఆమె ముక్కు పగిలేలా కొట్టాడు. తరువాత ఆర్డర్‌ను తీసుకొని మరీ పారిపోయాడని ఆమె చెప్పారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనతో ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటేనే భయపడిపోతున్నారు కస్టమర్లు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీలోకి  జగన్ మాజీ సలహాదారు..! 

ఆంధ్రప్రదేశ్ లో  కొద్దిరోజుల క్రితం వరకు సీఎం జగన్ వద్ద అత్యంత కీలక పదవిలో ఉన్న ఆ మాజీ ఐఏఎస్ అధికారి త్వరలో పొలిటికల్ ఏంటి ఇవ్వనున్నారని సమాచారం. ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు కేంద్రంలో పని చేస్తున్న అయన రాష్ట్రంలో కీలక పదవిలో ఉంటూ ప్రభుత్వానికి పలు కీలక అంశాలపై తన సలహాలు ఇచ్చారు. అత్యంత క్లిష్టమైన కరోనా వ్యాప్తి సమయంలో కూడా అయన ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను భుజాన వేసుకుని ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చే ప్రయతం చేసారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ హఠాతుగా సీఎం జగన్.. ఆ అధికారి నుండి కొన్ని బాధ్య‌త‌ల‌ను తప్పించడంతో ఆయన మనస్తాపంతో తప్పుకున్నారు. అక్కడి నుండి బయటకు వచ్చిన అయన తరచుగా తన ట్వీట్లతో ఎపి సర్కార్ పై పరోక్షంగా దాడి చేస్తున్నారు. ఆయనే మాజీ ఐ ఏ ఎస్ అధికారి పీవీ రమేష్. అయితే అయన ఒక్క‌సారిగా ఇలా తన ట్వీట్లతో జగన్దా సర్కార్ పై దాడి చేయ‌డానికి బ‌ల‌మైన కార‌ణమే ఉందంటున్నారు. బీజేపీలో చేరాలని ఆయనకు ఆహ్వానం అందడంతోనే ఆయ‌న ఇలాంటి వ్యాఖ‌లు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. పరిస్థితులు కలిసి వస్తే త్వ‌ర‌లో ఆయ‌న బీజేపీ కండువా కప్పుకోవ‌డం ఖాయ‌మ‌ని వార్తలు వస్తున్నాయి.  ఇప్ప‌టికే ఏపీలో బీజేపీకి సరైన నేత‌ల కొర‌త తీవ్రంగా ఉంది. ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎపి బీజేపీపై అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా సమాచారం దీనిలో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారులను పార్టీ లోకి ఆహ్వానించి వారితో పోటీ చేయించాలని ప్రయత్నిస్తునట్లుగా తెలుస్తోంది. ఈ వ్యూహాంతోనే మాజీ ఐఏఎస్ అధికారి దాస‌రి శ్రీనివాసులును ఎపుడో పార్టీలోకి తీసుకున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే తిరుప‌తి పార్ల‌మెంట్ ఉపఎన్నికలో ఆయనే అభ్యర్థిగా దింపుతున్నట్లు బీజేపీలో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. మరోవైపు  జ‌గ‌న్ సర్కార్ లో చాలా కీల‌కంగా ప‌ని చేసిన మాజీ ఐఏఎస్ పివీ రమేష్ సడెన్ గా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం వెనుక బీజేపీ వ్యూహం ఉందా అనే విషయంపై వైసిపి వర్గాలు ఆరా తీస్తున్నాయి . తాజాగా అయన వరవరరావును ఉటంకిస్తూ "నేరమే అధికారం అయితే..అది ప్రజలను వెంటాడుతుంది. ఊరక కూర్చున్ననోరున్న వాడూ నేరస్థుడే" అంటూ చేసిన ట్వీట్ పై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే దీనిపై అయన సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. అసలు కారణం మాత్రం బీజేపీ నుండి వచ్చిన ఆహ్వానం ప్రభావమేనని సమాచారం.

స్టీల్ ప్లాంట్‌కు స్వామి సపోర్ట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదు. ఈ మాట ఏ ప్రతిపక్ష నేత నోటి నుంచో వచ్చింది కాదు. బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామే కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను వ్యతిరేకమని ప్రకటించారు. ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు సుబ్రహ్మణ్యస్వామి. ప్రతీదాన్నీ ప్రైవేటీకరించడం మంచిది కాదని, బలమైన కారణాలుంటేనే అలా చేయాలన్నారు.  ఆంధ్రప్రదేశ్ వచ్చిన బీజేపీ నేత పలు అంశాలపై స్పందించారు. తిరుమల ఆలయంపై గత కొంత కాలంగా అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందంటూ ఓ మీడియా సంస్థ ప్రచారం చేసిందని... ఆ సంస్థపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానన్నారు. టీటీడీ అకౌంట్లను కాగ్ తో ఆడిటింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. టీటీడీపై ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా చేయాలని.. టీటీడీని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలని.. భక్తులే నడిపించే చర్యలు తీసుకోవాలన్నారు సుబ్రహ్మణ్యస్వామి.   అమరావతిలో సీఎం జగన్ తో సమావేశమైన అనంతరం పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణను సైతం తప్పుబట్టారు. పెట్రోల్ ధరల పెరుగుదల ప్రజలకు భారంగా మారిందన్నారు. ఇలా, బీజేపీ ఎంపీనే స్వయంగా సొంత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.