డ్రగ్స్ మాఫియాలో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు!
posted on Apr 3, 2021 @ 2:11PM
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ మాఫియా కేసులో అడ్డంగా బుక్కయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను తప్పించటానికి గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్లు అవుతున్నాయని సమాచారం. అధికార పార్టీకి చెందిన కీలక నేతకు.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అత్యంత సన్నిహితులు కావడంతో... అంతా గప్ చుప్ గా సాగుతుందని తెలుస్తోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవలే డ్రగ్ రాకెట్ బయటపడింది. ఈ కేసులో తీగ లాగితే తెలంగాణలో డొంక బయటపడింది. బెంగళూరులో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉద్యమకారుడినని చెప్పుకునే ఓ పెద్ద మనిషి డ్రగ్స్ రాకెట్లో ప్రధానంగా ఉన్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఓ నటుడిని బెంగళూరు పోలీసులు పిలిచి ప్రశ్నించారు. అతని విచారణలో ఎమ్మెల్యేల పేర్లు బయటికి వచ్చాయని తెలుస్తోంది. హైదరాబాద్లో ప్రధానంగా లింకులు కనిపిస్తుండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం బెంగళూరు పోలీసులు సన్నాహాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై స్పష్టత ఉన్నప్పటికీ.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. అలాగే ఉద్యమం పేరుతో హడావుడి చేసే వ్యక్తిని కూడా… అరెస్ట్ చేయనున్నారు. ఈయన పైకి ఉద్యమకారుడినని చెప్పుకుంటారు కానీ సినిమాలకు ఫైనాన్స్ చేయడం క్యాబ్ల వ్యాపారం చేయడం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా వాళ్లతో ఏర్పడిన పరిచయాలు డ్రగ్స్ మార్కెట్లో పాలు పంచుకునేదాకా తీసుకెళ్లాయని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్లో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును హైదరాబాద్ పోలీసులు కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సినీతారల్ని కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీగ మొత్తం లాగుతూంటే కేసు ఎక్కడెక్కడికో వెళ్తోంది. తాజాగా అది తెలంగాణ ఎమ్మెల్యేల వద్దకు చేరుతుంది. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే.. రాజకీయంగా పెను సంచలనం కానుంది.