60 కోట్ల భారతీయులు రోడ్డున పడతారు... ఎందుకంటే!

  ఇది ఎవరో దారిన పోయే దానయ్య చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ ప్రపంచ బ్యాంక్‌ చేస్తున్న హెచ్చరిక. ఇంతకీ ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు- వాతావరణంలో మార్పు! మనిషి రోజురోజుకీ ఎదిగిపోతున్నాడే కానీ వాతావరణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా భూగర్భ జలాలు పడిపోవడం, అయితే అతివృష్టి లేదా అనావృష్టి రావడం, కాలుష్యం పెరిగిపోవడం, పంటలు సరిగా పండకపోవడం... లాంటి సవాలక్ష సమస్యలు వస్తున్నాయి. వీటికి తోడు కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యాల సంగతి సరేసరి. వీటన్నింటి కారణంగా 2050 నాటికి మన దేశ జీడీపీ 2.8 శాతం తగ్గిపోయే అవకాశం ఉందంటోంది ప్రపంచ బ్యాంక్‌. దీనివల్ల తీవ్రమైన నిరుద్యోగం తలెత్తే అవకాశం ఉందట. ఇక పంటలు సరిగా పండక రైతులు, అనారోగ్యాల బారిన పడి మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరమయ్యే ప్రమాదం ఉంది. విదర్భ వంటి కొన్న ప్రాంతాల్లో అయితే తీవ్రమైన కరువు విలయతాండవం చేసే ప్రమాదం ఉందట.ఇప్పటికైనా కళ్లు తెరిచి మన చుట్టూ ఉన్న నీటి వనరులనీ, అడవులనీ, పర్యావరణాన్నీ కాపాడుకోకపోతే ఈ హెచ్చరిక నిజమై తీరుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుని ప్రజల ఆదాయంతో ముడిపెడుతూ ప్రపంచ బ్యాంక్‌ నివేదికను రూపొందించడం ఇదే మొదటిసారి.

తెలంగాణాలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు?

  తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంకేతాలు ఇవ్వడంతో, తెలంగాణ కాంగ్రెస్ అలెర్ట్ అయింది.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం, బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ చూస్తుంది.. ఇదే ఫార్ములాని తెలంగాణ కాంగ్రెస్ ఫాలో అవ్వాలనుకుంటుంది.. తెరాస వ్యతిరేక పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తుంది.. తెలంగాణలో తెరాస కాకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, టీఈపీ ఇలా చాలా పార్టీలు ఉన్నాయి.. ఎవరికి వారు ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ తెరాసనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.. అందుకే తెలంగాణ కాంగ్రెస్ తెరాస వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో తెరాసని ఓడించాలని చూస్తుంది. టీడీపీ ఏపీ లో అధికారంలో ఉంది కానీ, తెలంగాణాలో ఆ పార్టీ పరిస్థితి బాలేదు.. టీడీపీ అగ్రనేతలు చాలావరకు పార్టీని వీడి. తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. అయితే టీడీపీకి హైదరాబాద్, ఖమ్మం, అలానే కొన్ని గ్రామాల్లో ఇంకా ఓటు బ్యాంకు ఉంది.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందట.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసింది.. కానీ ఇప్పుడు టీడీపీ,బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.. ఇక తెరాసతో కూడా టీడీపీ కి సఖ్యత లేదు.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తుకు సిద్ధమని సంకేతాలు ఇస్తుంది.. అలానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసిన సీపీఐ ఈసారి కూడా కాంగ్రెస్ తోనే కలిసి నడవాలనుకుంటుంది. ఇక తెలంగాణ ఇంటి పార్టీ (టీఈపీ) ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైంది.. అలానే తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోదండరాం టీజేఎస్‌ కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధంగా ఉంది.. కాంగ్రెస్ కి బీజేపీ పూర్తి వ్యతిరేకం కావున ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.. అలానే సీపీఎం కూడా ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.. తెరాసను అడ్డుకోవాలంటే టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌, టీఈపీ ఇలాంటి పొత్తు తప్పనిసరి అని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోందట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో.

కాంగ్రెస్సా? బీజేపీనా? తేల్చుకోలేకపోతున్న డీఎస్

  తెలంగాణ రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో విపక్షాలకు సవాల్ విసురుతుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మేము ముందస్తు ఎన్నికలకు సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసురుతుంది.. దీనికి తగ్గట్టే పార్టీలు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు గురించి లెక్కలు, ఆలోచనలు చేస్తున్నాయి.. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది.. అదే డీఎస్ చూపు ఏ పార్టీ వైపు?.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డీఎస్, రాష్ట్ర విభజన అనంతరం అప్పటి పరిస్థితుల దృష్ట్యా మరియు కుమారుడు భవిష్యత్తు కోసం, తెరాసలో చేరారు..  తెరాస కూడా డీఎస్ అనుభవానికి గౌరవమిచ్చి రాజ్యసభ సభ్యుడుగా, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.. అయితే డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్, డీఎస్ తో పాటే ఉన్నారు కానీ, రెండో కుమారుడు అరవింద్ మాత్రం బీజేపీ లో చేరారు.. అరవింద్ చేరిక వెనక డీఎస్ ప్లాన్ ఉందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.. ఇలాంటి ఆరోపణలని పెద్దగా పట్టించుకోని డీఎస్.. గత కొంత కాలంగా తెరాసతో మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.. తెరాస పార్టీ కార్యక్రమాల్లో డీఎస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అలానే కుమురుడు సంజయ్, తనతో పాటు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది..  దీనికి తోడు తాజాగా నిజామాబాద్ తెరాస నేతలు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకి లేఖ రాయడంతో.. డీఎస్ కలత చెంది తెరాసను వీడి వేరే పార్టీలో చేరాలని చూస్తున్నారట.. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు కూడా జరిపారట.. కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించి డీఎస్ కి, ఆయన కుమారుడు సంజయ్ కి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందట.. డీఎస్ అంత ఓకే ఇక పాత గూటికే నా పయనం అని సిద్దమవగా, రెండో కుమారుడు అరవింద్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట.. బీజేపీలో చేరాలని డీఎస్ మీద ఒత్తిడి చేస్తున్నాడట..  అలానే బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడిస్తున్నాడట.. కానీ డీఎస్ మాత్రం కాంగ్రెస్ వైపే వెళ్లాలని ఎక్కువ మొగ్గు చూపుతున్నారట.. ఒకప్పటి పార్టీ అయితేనే సంతృప్తి ఉంటుందని భావిస్తున్నారట.. చూద్దాం మరి డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారో లేక రెండో కొడుకు మాటలకు మనస్సు మార్చుకొని బీజేపీలో చేరతారో.. చూద్దాం ఏం జరుగుతుందో.  

మోడీకి దెబ్బ మీద దెబ్బ

ప్రస్తుతం పరిస్థితులన్నీ బీజేపీ మీద బాగా పగపట్టేసినట్టు ఉన్నాయి.. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.. ఇప్పుడు మరో మిత్రపక్షం బీజేపీ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. అదే బీహార్ లోని జేడీయూ పార్టీ.. గత ఏడాది ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసిన నితీష్ కుమార్ జేడీయూ తిరిగి లాలూ పార్టీతో చేతులు కలపాలని చూస్తుందట.. నితీష్ కుమార్, బీజేపీతో ఇమడలేకపోతున్నారని తెలుస్తుంది.. మరోవైపు బీజేపీ మీద వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్నాయి.. బీజేపీతో కలిసుంటే వచ్చే ఎన్నికల ఫలితాల మీద ప్రభావం పడుతుంది.. అందుకే నితీష్ కుమార్ బీజేపీ తో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారట.. ఇప్పటికే నితీష్ సన్నిహితులు ఆర్జేడీ మరియు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆర్జేడీ, నితీష్ తో దోస్తీ అంటే కాస్త ఆలోచిస్తుందట.. నితీష్ ని నమ్మలేం అనుకుంటున్నారట.. అదీకాక లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద సిబిఐని ఉసిగొల్పారు.. అలాంటి వారితో దోస్తీ వద్దని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారట.. ఇక కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉంది.. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, ఏ పార్టీతో అయినా దోస్తీకి సిద్దమే.. కానీ లాలూ ఆర్జెడీకి ఇష్టం లేకుండా జేడీయూతో దోస్తీ చేసే సాహసం చేయదు.. ఇదే విషయం కాంగ్రెస్ నేతలు, జేడీయూ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది.. మీతో దోస్తీకి ఆర్జేడీ ఓకే అంటే మాకు ఓకే అన్నారట.. మరి నితీష్ తనమీద ఆర్జేడీ నేతలకు ఉన్న ఆగ్రహాన్ని తగ్గించి మళ్ళీ ఆర్జేడీతో చేతులు కలుపుతారా? చూద్దాం ఇదే జరిగితే బీజేపీకి మరో దెబ్బ తగిలినట్టే.

టీఆర్ఎస్‌లో గడబిడ మొదలవుతుంది

  తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ అధికారం తమదే అని అంటున్నారు.. ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లాలని చూస్తున్నారు.. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం అంత సులభం కాదంటూ టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు..  ఆ మధ్య కేసీఆర్ హడావుడి చేసిన ఫెడరల్ ఫ్రంట్  ఎక్కడ అంటూ ప్రశ్నించారు.. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూనే మరోవైపు బీజేపీతో కలిసి రహస్య దోస్తీ చేస్తున్నట్లుగా ఆరోపించారు.. కేసీఆర్ ఏ పథకాన్ని స్టార్ట్ చేసినా అది ఫెయిల్ అవుతుందన్నారు..  తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించింది తానేనని చెప్పిన జైపాల్ రెడ్డి, తెలంగాణలో ఆట స్టార్ట్ చేసింది కేసీఆరే అయినప్పటికీ గోల్ కొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.. అలానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు గురించి వస్తున్న విమర్శలపై కూడా జైపాల్ రెడ్డి స్పందించారు.. జాతీయ పార్టీగా కాంగ్రెస్లో విభేదాలు సహజమేనని, ఎన్నికల్లో మాత్రం తామంతా ఒక్కటై టీఆర్ఎస్ పని పడతామన్నారు.. కాంగ్రెస్ తో పోలిస్తే ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేటప్పుడు కేసీఆరే ఎక్కువగా ఇబ్బంది పడతారన్నారు.. కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చిన తర్వాత కలిసి ముందుకు వెళతామని, టీఆర్ఎస్ లో మాత్రం టికెట్లు ఇచ్చిన తర్వాతే గడబిడ మొదలవుతుందన్నారు.. సిట్టింగులకు టికెట్లు ఇస్తే ప్రజలు ఓడిస్తారని, వేరేవారికి టికెట్లు ఇస్తే సిట్టింగులు ఓడిస్తారని జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

భారతదేశం పరువు తీసిన సర్వే

భారతదేశం.. సాంప్రదాయాల నిలయం.. స్త్రీలను గౌరవించడం ప్రపంచానికి నేర్పిన దేశం.. ఇలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం.. కానీ ఇప్పుడు భారతదేశం సిగ్గుతో ప్రపంచం ముందు తల దించుకుంటుంది.. ప్రపంచానికి స్త్రీలను గౌరవించడం నేర్పించిన మనం, విలువలు మర్చిపోయి భారతదేశ పరువుని నడి ప్రపంచంలో తాకట్టు పెడుతున్నాం.. దానికి రుజువే తాజాగా వెల్లడైన థాంమ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే.. మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశమని ఈ సర్వే వెల్లడించింది. అత్యాచారాలు, లైంగిక వేధింపులు,మహిళల అక్రమ రవాణాలో భారత్ అగ్రస్థానంలో ఉందట.. అలానే  మహిళల భద్రత విషయంలో భారత్ మహా డేంజర్ అంటూ సర్వే వెల్లడించింది.. లైంగిక వేధింపులతో పాటు, బలవంతపు పెళ్లిళ్లు, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు ఇలా అన్నింట్లో భారత్ ముందు వరుసలో ఉందని ఈ సర్వే వెల్లడించింది.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలకి పోటీ ఇవ్వాలన్న ఆలోచన దగ్గరే ఆగిపోయిన భారతదేశం, మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా మొదటి స్థానం రావడం భారతీయులుగా సిగ్గుపడాల్సిన విషయం.. ఇప్పటినుండైనా స్త్రీలను గౌరవిద్దాం.. భరతమాత పరువు కాపాడదాం.

కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం?

  టీడీపీని విభేదించాక పవన్ ఒంటరి పోరుకి సిద్ధమన్నారు.. కానీ పవన్, వైసీపీకి మద్దతని ఆరోపణలు వచ్చాయి.. అయితే ఈ ఆరోపణలను పవన్ కొట్టిపారేసే ప్రయత్నం చేసారు.. అలానే కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని, మూడునెలల్లో కార్యాచరణ రూపొందిస్తాం అని పవన్ ప్రకటించారు.. విచిత్రంగా పవన్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. జనసేన, వైసీపీకి మద్దతిస్తే తాము ఆ పార్టీతో కొనసాగలేమని స్పష్టం చేసారు.. స్వయంగా పవన్, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పినా, వాళ్ళకి నమ్మకం లేదా.. కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం? అని చర్చలు మొదలయ్యాయి.. అయితే కమ్యూనిస్టుల అనుమానాలకు కూడా కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది.. కడప ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్న బంద్ కు పవన్ మద్దదైతే తెలిపారు కానీ, కేంద్రాన్ని నిలదీయట్లేదు, ఇదే కాదు ఏ విషయంలోనూ ఈ మధ్య పవన్ కేంద్రాన్ని విమర్శించట్లేదు.. అలానే ఎన్నికల విషయం వచ్చేసరికి పవన్ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాం అని చెప్తున్నాడు.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు గురించి పవన్ స్పష్టత ఇవ్వలేదు.. వీటి మూలంగా తమను వాడుకుని వదిలేస్తున్నారా అనే అనుమానాలు కమ్యూనిస్టులకు వస్తున్నాయట.  

వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి తప్పు చేసారా...!

  ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ ఏం చేసిందనేది కాసేపు పక్కనపెడితే, ప్రత్యేకహోదా సాధించనందుకు ప్రజలు బాధపడుతున్నారనేది వాస్తవం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేసింది.. బీజేపీ ప్రత్యేకహోదాకి బదులుగా అంతే సమానమైన ప్రత్యేకప్యాకేజీ ఇస్తానంది.. దానికీ టీడీపీ అంగీకరించింది.. కానీ బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా వెనకడుగు వేస్తుండటంతో.. టీడీపీ, బీజేపీతో తెగదెంపులు చేసుకొని ప్రత్యేకహోదాకి పట్టుపట్టింది.. ఇప్పటికీ టీడీపీ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. మరోవైపు ఏపీ విపక్ష పార్టీ వైసీపీ, ప్రత్యేకహోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల చేత రాజీనామా చేయించింది.. అయితే రాజీనామాల వల్ల ఉపయోగం లేదని, వైసీపీ రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతుందని విమర్శలు వినిపించాయి.. రాజీనామాల విషయంలో వైసీపీ నిర్ణయం తప్పని పార్లమెంట్ సాక్షిగా నిరూపించే అవకాశం టీడీపీకి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 10వరకు మొత్తం 18 రోజులు జరగనున్నాయి.. ఈ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగా టీడీపీ, బీజేపీ ని నిలదీయాలని చూస్తుంది.. అవసరమైతే బీజేపీ మీద అవిశ్వాసతీర్మానం పెట్టాలనే ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది.. కానీ వైసీపీకి ఆ అవకాశం లేదు.. ఎంపీల రాజీనామా వల్ల పార్లమెంట్లో రాష్ట్రం కోసం పోరాడే అవకాశం కోల్పోయింది.. మరో వైపు ఉపఎన్నికలకు కూడా ఆస్కారం లేదు.. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.. అలానే టీడీపీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద పోరాడితే.. వైసీపీ నిర్ణయం తప్పని ప్రజలకి అర్ధమవుతుంది అంటున్నారు.

రమణ దీక్షితులు ఇక సైలెంట్ అవుతారా

  శ్రీవారి ఆభరణాలు తరలించారంటూ, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొద్దిరోజుల నుండి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ, స్వామీ వారి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచి.. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చేసింది.. టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా పాలక మండలి సభ్యుల కోసం శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించారు.. బోర్డు సభ్యులు వీటిని పరిశీలించారు.. శ్రీవారి ఆభరణాలు అన్నీ ఉన్నాయని, రూబీ ఒకటి పగిలిపోయిందని, దాని విలువ రూ. 50గా రికార్డులో నమోదు చేసి ఉందని తెలిపారు.. అలానే రమణ దీక్షితులు చెబుతున్న పింక్ డైమండ్ అసలు లేనే లేదని పేర్కొన్నారు. శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు..  తాజాగా అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ విషయంపై బాబు స్పందించారు.. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై ప్రత్యేక కమిటీతో న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు.. ఆ కమిటీ ముందే, రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామని, అదే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.. అదే విధంగా కొంతమంది లేని నగలు, డైమండ్లు పోయాయంటూ రాజకీయాలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.. మొత్తానికి శ్రీవారి ఆభరణాల గురించి వస్తున్న ఆరోపణలకి టీటీడీ ఆభరణాల ప్రదర్శన చేసి ఆరోపణలు అవాస్తవమని నిరూపించడం అలానే టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆభరణాల రక్షణకోసం కీలక నిర్ణయం తీసుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ జనసేన...!

  చిరంజీవి సామజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు.. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో, కాంగ్రెస్ లో విలీనం చేసారు.. చిరు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.. తరువాత పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. అదే సమయంలో చిరు సోదరుడు పవన్ జనసేన పార్టీ స్థాపించారు.. బీజేపీ,టీడీపీ పార్టీలకు మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. చిరు చిన్నగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ, మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. పవన్ బీజేపీ,టీడీపీ పార్టీలకు దూరమై, సినిమాలకి బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నారు.  పవన్ అప్పుడప్పుడు ప్రజారాజ్యం సమయంలో అన్నయ్యని మోసం చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా అని ఆవేశంగా మాట్లాడటంతో.. పవన్, చిరు కోసమే పార్టీ పెట్టాడని.. జనసేన, ప్రజారాజ్యానికి సీక్వెల్ అని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.. అయితే పవన్ వీటిని పట్టించుకోకుండా ప్రజల్లో తిరుగుతూ, వచ్చే ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. కానీ మరొక్కసారి చిరు ప్రజారాజ్యం తెరమీదకి వచ్చింది.. చిరు అభిమాన సంఘ సభ్యులకు ' గతంలో ప్రజారాజ్యానికి పనిచేసినట్టే, జనసేనకు పనిచేయాలని' మెసేజ్ లు వస్తున్నాయట.. ఈ వార్త బయటికి రావడంతో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.. చిరు తెర వెనుక ఉండి జనసేన పార్టీ నడిపిస్తున్నాడు.. ఇప్పుడే తెరముందుకు వస్తే జనసేన మరో ప్రజారాజ్యంలా అవుతుందని ప్రజలు భావిస్తారు. అందుకే తమ్ముడిని తెర ముందు ఉంచి తెర వెనుక అంతా అన్నయ్య నడిపిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అభిమాన సంఘ సభ్యులకు మెసేజ్ లు అనే వార్తలో నిజమెంత ఉందో తెలీదు కానీ ఆ వార్త బయటికొచ్చినప్పటి నుండి జనసేన పార్టీ, తెరముందు పవన్, తెర వెనుక చిరు అంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి.. చూద్దాం మరి చిరు, పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో.

తెలంగాణ కాంగ్రెస్ లో ఒకే కులానికి పెద్ద పీట

  ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెరాసని గద్దె దించి అధికారంలోకి రావాలని చూస్తుంది.. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే, మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వచ్చేలా ఉందని అధిష్టానం భయపడుతుంది.. సమిష్టిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, ఎవరికివారు పార్టీకి నేనే పెద్ద దిక్కు, నేనే సీఎం అవుతా అంటున్నారు.. దీనికితోడు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కొందరు, పార్టీ రాష్ట్ర ఇంచార్జిని మార్చాలని మరికొందరు.. వీటితో ఏం చేయాలో పాలుపోక, పరిస్కార మార్గం కోసం అన్వేషణలో ఉన్న అధిష్టానానికి మరో షాక్..  సీనియర్ నాయకుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు.. ఆయన పోతూ పోతూ కాంగ్రెస్ పార్టీ తీరుపైన, నాయకత్వం పైన విమర్శలు చేసారు.. గ్రేటర్ లో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా సొంత ఇంటి పనిలా తన భుజాలపైనే వేసుకుని పని చేశానని, అలాంటిది గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే ఎవరెవరికో అనామకులకి టికెట్లు ఇచ్చారని దానం ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం వస్తుందని పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా చెప్పానని అన్నారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు.. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు.. అందుకే డీఎస్, కేకేలాంటి వాళ్లు పార్టీని వీడారని దానం అన్నారు..  ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య నిర్వహించిన బస్సు యాత్రలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు లేదని విమర్శించారు.. ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడుతున్నా కొందరు నేతలు ఆయన్ని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్ లా పార్టీని కాపాడతానంటూ చెప్పగలిగే ధైర్యం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించిన దానం.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని , ఆత్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు.. మరి దానం చేసిన ఒకే సామాజిక వర్గ ఆధిపత్యం ఆరోపణలకు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ తో పొత్తుకు పవన్ సై అంటాడా?

  పవన్ కళ్యాణ్.. 2014 లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, 'కాంగ్రెస్ హటావో దేశ్ బచావో' అంటూ బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. అనుకున్నట్టే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. పవన్ బీజేపీ, టీడీపీ లను విభేదించి ఒంటరిగా 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. హోదా ఇవ్వలేదని బీజేపీతో విభేదించిన పవన్, కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందంటూ వార్తలు బయటికొస్తున్నాయి.. ఇప్పుడిప్పుడే మోడీ మీద వస్తున్న వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకొని మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్నకాంగ్రెస్, ఏపీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది..  విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఏపీలో ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, ప్రత్యేకహోదా అంశంతో తిరిగి పుంజుకోవాలని చూస్తుంది.. ఇప్పటికే రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమై ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి చర్చించారు.. కాంగ్రెస్ నుండి వెళ్లిపోయిన బలమైన నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చేలా చూడాలన్నారు.. రాహుల్ ఏపీ మీద ప్రత్యేకదృష్టి పెట్టడంతో ఏపీ కాంగ్రెస్ నేతల్లో నూతనుత్తేజం వచ్చి పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు.. ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడొక భేటీ అందరిని ఆశ్చర్య పరుస్తుంది..  అదే, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పవన్ భేటీ.. కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శలు చేసిన పవన్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతతో భేటీ అవడంతో అందరు షాక్ అవుతున్నారు.. ప్రత్యేకహోదా కోసం పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రధాన జాతీయ పార్టీలు రెండు.. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్.. బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదా నిరాకరించింది.. కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది..అందుకే, పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ భావన.. మరి పవన్ ప్రత్యేకహోదా కోసం తన పంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటారో లేదో చూద్దాం.  

కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి కాంగ్రెస్ లోకి వస్తారా?

  ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్, ఐతే అధికారంలో ఉండేది లేదా బలమైన ప్రతిపక్షంగా ఉండేది.. కానీ రాష్ట్ర విభజన తరువాత 'ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉండేది' అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది.. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచింది.. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ఏపీలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. 2019 ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంది.. విభజనకి ముందు కాంగ్రెస్ లో చాలామంది బలమైన నాయకులు ఉండేవారు.. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో..  చాలామంది కాంగ్రెస్ ని వీడి టీడీపీ,వైసీపీ,బీజేపీ పార్టీలలో చేరారు.. ఇక కొందరు నాయకులైతే అసలు రాజకీయాలకే దూరమయ్యారు..  అతి కొద్దిమంది నాయకులు మాత్రమే వేరే పార్టీలలో ఇమడలేమనో లేదా ఎప్పటికైనా కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశతోనో పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు.. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కాస్త వ్యతిరేకత మొదలవడంతో, కాంగ్రెస్ లో ఉత్సాహం మొదలైంది.. 2019 లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తూ.. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.. అలానే ప్రాంతీయ పార్టీలతో దోస్తీకి సిద్ధమైంది.. ఐతే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.. పార్టీని వీడిన సీనియర్ నాయకులని తిరిగి పార్టీలోకి ఆహ్వానించి, ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది..  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివరావు లాంటి సీనియర్ నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట.. అలానే కాంగ్రెస్ నుండి మిగతా పార్టీలకు వెళ్లిన నేతలని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట.. అలానే 'తప్పనిసరి  పరిస్థితుల్లో విభజన జరిగింది.. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారట.. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులు ధైర్యం చేసి తిరిగి కాంగ్రెస్ కి రావడం.. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ ని నమ్మి ప్రజలు ఓటెయ్యడం కష్టమే' అంటున్నారు విశ్లేషకులు.. చూద్దాం ఏం జరుగుతుందో.  

అలక వీడిన గంటా

  ఏపీ రాజకీయాల మీద ఒక తెలుగు న్యూస్ ఛానల్ లగడపాటి టీంతో కలిసి సర్వే చేయించిన విషయం తెలిసిందే.. ఈ సర్వే, మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది కానీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలిలో ఓడిపోతారని చెప్పింది.. దీనితో మిగతా టీడీపీ నేతలు హ్యాపీగా ఉన్నా, గంటా మాత్రం హ్యాపీగా లేరు.. ఈ సర్వే వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటున్నారు.. దీనికి తోడు గంటా టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి.. అయితే ప్రస్తుతానికి ఆ వార్తలు వార్తలుగానే మిగిలిపోనున్నాయి..  ఎందుకంటే గంటా అలక వీడారు.. పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పచ్చజెండా ఊపారు.. ఈ రోజు భీమిలి నియోజక వర్గంలో చంద్రబాబు పర్యటన ఉంది.. ఆ నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా పాల్గొనకపోతే బాగుండదని భావించిన బాబు, మంత్రి చినరాజప్పను గంటా ఇంటికి పంపారట.. అలానే బాబు గంటాతో ఫోన్లో స్వయంగా మాట్లాడారట.. "అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? రాజకీయాల్లో ఇవి సహజం.. నా మీద రోజూ ఏవేవో వార్తలొస్తాయి..  అంతెందుకు ఆ సర్వేలో కొన్ని నియోజక వర్గాల్లో నా పనితీరు కూడా బాలేదని అభిప్రాయపడినట్టు వచ్చింది.. వీటిని మనం ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని ముందుకు వెళ్తుండాలి అంతేకాని ఇలా ముభావంగా ఉండకూడదు" అని బాబు, గంటాకు ఫోన్ లో ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది.. దీంతో గంటా అలక వీడి సీఎం పర్యటనలో పాల్గొనడానికి ఒప్పుకున్నారు.  

తెలంగాణ కాంగ్రెస్.. ఉత్తమ్ పదవి ఊడుతుందా?

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో ప్రతిపక్షానికి పరిమితమైంది.. ఇక ఏపీలో అయితే పార్టీ పరిస్థితి దారుణం, ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. అందుకే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మునుపటిలా కాంగ్రెస్ పార్టీ వెలిగేలా చేయాలని అధిష్టానం భావిస్తుంది.. దానికి తగ్గట్టే రోజురోజుకి తెలంగాణలో పార్టీ బలపడుతూ బలమైన ప్రతిపక్షంగా ఉండటమే గాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అధిష్టానానికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఏర్పడింది.. అయితే ఇప్పుడు ఆ నమ్మకం భయంగా మారుతున్నట్టు తెలుస్తుంది.. దానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు.. ఒకవైపు కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇతర పార్టీలను కలుపుకొని పోవాలని చూస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడట్లేదు.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాల్సింది పోయి, నేను సీఎం అంటే నేను సీఎం అని చెప్తూ పోటీపడుతున్నారు.. దీనికితోడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ని తొలిగించాలని కొందరు.. ఇవన్నీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. రీసెంట్ గా రాహుల్ జన్మదినం సందర్బంగా కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ మీద ఫిర్యాదు చేశారట.. ఉత్తమ్ పార్టీలోని మిగతా నేతలని పట్టించుకోకుండా అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, అందుకే ఉత్తమ్ స్థానంలో వేరొకరిని పీసీసీ చీఫ్ గా నియమించాలని కోరారట.. ఇది విని రాహుల్ ఆలోచనలో పడ్డారట.. ఇప్పటికే ఉత్తమ్ మీద పార్టీ పదవుల నియామకాల లిస్ట్ విషయంపై ఆరోపణలు వచ్చాయి. అందుకే ఇక రాహుల్ తెలంగాణపై దృష్టి పెట్టబోతున్నారట.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు తొలిగించాలని చూస్తున్నారట.. మరి రాహుల్ ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ పదవి నుండి తొలగిస్తారా? లేక వేరే పరిస్కారం ఏమైనా చూపుతారో చూడాలి.. ఇదిలా ఉంటే ఉత్తమ్ మాత్రం మా పార్టీలో విభేదాలు లేవు, అంతా కలిసే ఉన్నాం అంటున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో.

శ్రీవారి గుప్త నిధులకు దారి చెప్తున్న రమణదీక్షితులు

  వెంకటేశ్వర స్వామి.. కలియుగ దైవం.. 'మేం చేసిన పాపాలకు మన్నించు, మా చుట్టూ ఉన్న పాపాత్ముల నుండి రక్షించు' అని అని వేడుకుంటాం.. కానీ పాపం ఈ మధ్య ఆ వెంకన్నకు కూడా కష్టాలు వస్తున్నాయి.. ఆయన చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి..  మనుషులకి కష్టం వస్తే దేవుడికి మొరపెట్టుకుంటాం.. మరి దేవుడికే కష్టం వస్తే, మనుషులం మాట్లాడుకోవడం తప్ప ఏం చేయగలం.. గత కొన్నిరోజులగా ఏపీ రాజకీయాల్లో వెంకన్న పేరు బాగా వినిపిస్తుంది.. దానికి కారణం టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు.. వయస్సు పరిమితి నిబంధనతో ఏపీ ప్రభుత్వం, రమణ దీక్షితులుని పదవి నుండి తొలగించింది..  అప్పటినుండి ఇక దీక్షితులు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు.. శ్రీవారి సన్నిధిలోని విలువైన ఆభరణాలు తీసుకున్నారని ప్రభుత్వం మీద, అక్రమాలు చేస్తున్నారని పాలకమండలి మీద ఆరోపణలు చేసారు.. అయితే రమణదీక్షితులు వెనక విపక్షాలు ఉండి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నాయని ప్రభుత్వం కూడా ధీటుగా ఆరోపణలు చేసింది.. ఇప్పడు రమణ దీక్షితులు శ్రీవారి గుప్త నిధుల రహస్యాల గురించి చెప్పారు.. అంతేకాదు ఆ గుప్త నిధులకోసం తవ్వకాలు జరిగాయని కూడా ఆరోపించారు.. ఇంతకీ దీక్షితులు ఏమన్నారంటే.. మూడవ మహారాజు విజయనగర సామ్రాజ్యాధిపతి తిరుమలరాయల వారు, కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు ఇలాంటి రాజులు అప్పట్లో శ్రీవారికి రత్నాలు, బంగారు ఆభరణాలు, విగ్రహాలు ఇలా చాలా సంపద సమర్పించారు..    ఆ సంపదంతా నేల మాళిగలో భద్రపరిచారు.. ఆ నేల మాళిగ వంటశాల దగ్గర్లో ఉంది.. గతేడాది స్వామి వారి లోపలి పోటును మూసేసారు.. ఎందుకు ముసారని అడిగితే,  నాలుగు రాతి బండలు పగిలాయని కొద్ది రోజులు పోటు మూసివేశామని జేఈఓ చెప్పారు.. కానీ ప్రధాన అర్చకులకు కూడా చెప్పకుండా పోటు ఎందుకు మూయటం జరిగింది.. గుప్త  నిధుల కోసం తవ్వకాలు జరిపి ఉండొచ్చు.. నా ఆరోపణలకు స్పందించాలి అని రమణ దీక్షితులు అన్నారు.. అంతా బాగానే ఉంది గాని ఇలా స్వామి వారి గుప్త నిధుల ఉన్న ప్రదేశం గురించి బయటపెట్టడం ఎంత వరకు సబబు దీక్షితులు గారు.. ఆ నిధులకి ఇప్పుడు రక్షణ కల్పించడం ఇంకా కష్టమవుతుంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.. ఏంటో ఇదంతా, ఆ వెంకన్నకే తెలియాలి.  

జగన్‌ను భయపెడుతున్న అమరావతి

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని ఏంటా అని అందరూ ఆలోచిస్తుండగా.. చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి అని చెప్పారు, అలానే అమరావతిని ప్రపంచంలోని ప్రముఖ రాజధానుల్లో ఒకటిగా నిలుపుతానని మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారమే ప్రపంచ స్థాయి కంపెనీల చేత అమరావతి డిజైన్లు వేయించారు.. గొప్ప రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.. ఇదంతా బాగానే ఉంది.. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? రాజధానిగా అమరావతి ఉంటుందా? లేక కొత్త రాజధాని తెర మీదకు వచ్చి మళ్ళీ రాజధాని వ్యవహారం మొదటికొస్తుందా? అంటూ ఏపీ ప్రజల్లో భయం మొదలైంది.. ఆ భయం వెనుక కూడా కారణం ఉందిలేండి.  జగన్ మొదటినుండి అమరావతిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.. రాజధానిగా అమరావతి భూమి పూజ కార్యక్రమానికి  దేశ వ్యాప్తంగా ఎందరో నేతలొచ్చారు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం రాలేదు.. అదీగాక జగన్ పలు సందర్భాల్లో అమరావతి గురించి తన వైఖరి వెల్లడించారు.. రాజధాని నిర్మాణం కోసం రైతులిచ్చిన భూములను తాను అధికారంలోకి రాగానే తిరిగిస్తానని జగన్ అన్నారు.. దీన్నిబట్టి జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉండటం కష్టం, రాజధాని వ్యవహారం మళ్ళీ మొదటికొస్తుందని ప్రజల్లో భయం మొదలైంది.. అయితే ఇప్పుడు అమరావతి భయం జగన్ లో కూడా మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అందుకే జగన్ ఆచి తూచి మాట్లాడుతున్నాడట.. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేదు.. జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధానిని మారుస్తా అంటే.. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని ప్రజలంతా జగన్ కి వ్యతిరేకమవుతారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశలకు జగన్ గండి కొట్టాడన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది.. ఇది రాజకీయంగా జగన్ కి చాలా దెబ్బ.. అందుకే ఇప్పుడు జగన్ అమరావతి విషయంలో సతమతం అవుతున్నాడట.. రాజధాని మారుస్తా అంటే రెండు జిల్లాల్లో అసలు పార్టీనే లేకుండా పోయే ప్రమాదం ఉంది, మరో వైపు రాష్ట్ర అభివృద్ధి మరో ఐదేళ్లు వెనక్కెళ్తుందని యువత జగన్ ని వ్యతిరేకించే ప్రమాదం ఉంది.. పోనీ అమరావతినే రాజధానిగా ఒప్పుకుంటే మాట తప్పినట్టు ఉంటది, అదీకాక బాబు సెలెక్ట్ చేసిన రాజధాని కాబట్టి జగన్ కి మనస్సు ఒప్పదు.. అందుకే జగన్ అమరావతి విషయంలో సతమతమవుతూ కాస్త భయపడుతున్నాడట.. చూద్దాం మరి అమరావతి విషయంలో జగన్ ఎలా ముందుకెళ్తాడో.  

కశ్మీర్‌ టూ పీఎం చైర్ వయా అయోధ్య

అర్జునుడి గురి పిట్ట కన్ను అన్నట్టుగా, ప్రస్తుతం మోడీ గురి 2019 లో మళ్ళీ అధికారం సాధించటం మీద ఉంది.. ఇప్పటికే అధికారం కోసం మోడీ ఏదైనా చేస్తాడనే ఆరోపణలు వస్తున్నాయి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మోడీ చర్యలు చూసి కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. గుజరాత్ సీఎంగా చేసిన మోడీ, 2014 ఎన్నికల్లో బీజేపీ తరుపున పీఎం అభ్యర్థి స్థాయికి ఎదిగారు.. 'కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలతో దేశాన్ని దోచుకుంది, మేం అధికారంలోకి వస్తే దేశానికి మంచిరోజులు వస్తాయి' అంటూ మోడీ ప్రజల్లోకి వెళ్లారు.. అనుకున్నట్టే పీఎం అయ్యారు.. మొదట్లో అంతా బానే ఉంది.. కానీ తర్వాతర్వాత మోడీ మీద వ్యతిరేకత మొదలైంది.. నోట్లరద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధర ఇలాంటి వాటితో ప్రజలకి దూరమవుతున్న మోడీ, మరో వైపు దేశమంతటా బీజేపీని విస్తరింప చేయాలన్న ఆశతో మిత్ర పక్షాలకు దూరమయ్యాడు, కొన్ని ప్రాంతీయ పార్టీలకు శత్రువయ్యాడు. అసలే ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేదు.. ఇలా రోజురోజుకి అందరిలో వ్యతిరేకత వస్తే 2019 లో అధికారం కూడా దూరమవుతుంది.. అసలే అధికారం కోసం ఏదైనా చేస్తాడని మోడీ మీద ఆరోపణలు ఉన్నాయి.. అధికారం కోసం మోడీ కశ్మీర్‌ సాక్షిగా తన మార్క్ రాజకీయాన్ని స్టార్ట్ చేసారని విశ్లేషకులు అంటున్నారు.. బీజేపీ వ్యూహాత్మకంగానే కశ్మీర్‌ లో మెహబూబా సర్కార్ కి మద్దతు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది.. రోజురోజుకి కశ్మీర్‌ లో అల్లర్లు పెరుగుతున్నాయి.. ఇది బీజేపీ వైఫల్యం కిందకి వస్తుంది.  ఈ ప్రభావం ఎన్నికల మీద పడుతుందని భావించి బీజేపీ ముందే బయటికొచ్చింది అంటున్నారు.. అలానే దేశ ప్రజల దృష్టి పడేలా, సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాక్ ఉగ్రమూక మీద బీజేపీ ప్రభుత్వం దాడులు చేయించాలని చూస్తుందట.. దీని వల్ల ప్రజల్లో బీజేపీ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది.. అలానే అయోధ్యలో రామజన్మభూమి సెంటిమెంట్ తో కూడా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుందట.. మొత్తానికి బీజేపీ  జాతీయవాదం, రామ సెంటిమెంట్ తో 2019 ఎన్నికల వైపు అడుగులు వేయాలని చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. చూద్దాం మరి మోడీ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.

బీజేపీకి షాక్.. కీలక వ్యక్తి రాజీనామా

  వేరే పార్టీల్లో ఉన్న వ్యక్తులు, రాజీనామా చేసి అధికారంలో ఉన్న పార్టీలోకి రావడం కామన్.. కానీ ఓ వ్యక్తి అధికారంలో ఉన్న బీజేపీకే రాజీనామా చేసి షాకిచ్చాడు.. బీజేపీ జాతీయ కార్యదర్శి 'రామ్ మాధవ్' ప్రచార బృందంలో 'శివం శంకర్ సింగ్' అనే వ్యక్తి ప్రముఖ పాత్ర పోషించాడు.. 2014 లో బీజేపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేసాడు.. ఇప్పుడు 'నేను మోడీ మాయలో పడి తప్పు చేశాను' అంటూ బీజేపీకి రాజీనామా చేసి మోడీ మీద, పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసాడు.. 2013 లో మోడీ అభివృద్ధి మంత్రాన్ని నమ్మాను, దేశ  రాజకీయాల్లో మోడీ ఒక ఆశాకిరణంలా కనిపించారు.. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది.. నాలుగేళ్ళ మోడీ పాలనలో మంచికంటే చెడే ఎక్కువ జరిగింది.. బీజేపీ ప్రచార వ్యూహాలతో ప్రజల్ని మభ్యపెడుతుంది.. ప్రజలు గుడ్డిగా నమ్మి వీటి మాయలో పడొద్దు అంటూ శంకర్ సింగ్ వ్యాఖ్యానించాడు.. అలానే నోట్ల రద్దు పెద్ద వైఫల్యమని తెలిసినా బీజేపీ ఒప్పుకోదని, నోట్లరద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని శంకర్ అన్నాడు.. జీఎస్టీ కూడా ఆదరాబాదరాగా ప్రవేశపెట్టారని, ఇప్పటికీ గందరగోళంగానే ఉందని విమర్శించాడు.. సిబిఐ, ఈడీలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని.. మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి మీద వెంటనే దాడులు జరుగుతాయని ఆరోపించారు.. శివం శంకర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేయడమే గాక వెళ్తూ వెళ్తూ ఘాటు విమర్శలు చేయడంతో బీజేపీ నాయకులు షాక్ తిన్నట్టు తెలుస్తుంది.