అవిశ్వాసానికి వెళ్లకపోతే… జేసీ ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బ తీసినట్లేనా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. ఇది పాత మాటే. కానీ, కొత్త విషయం ఏంటంటే…. అసలు ఇప్పటి రాజకీయాల్లో మిత్రులు అంటూ ఎవరూ వుండటం లేదు! ఎవరు ఎప్పుడు ఎలా కుట్ర చేస్తారో తెలియదు. ఎవరు ఎందుకు ఇబ్బంది కలిగిస్తారో అర్థం కాదు! అసలు ఎవరి ఎవరి వైపున నిలబడుతున్నారో కూడా క్లారిటీ వుండటం లేదు!     టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. కాంగ్రెస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మద్దతు పలికింది. అసలు చరిత్రలో ఏనాడూ కలవని టీడీపీ, కాంగ్రెస్ లు మోదీ విషయంలో ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఇంత వరకూ అందరికీ అర్థమయ్యే వ్యవహారమే. కానీ, తమ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానికి తానే హాజరుకానని జేసీ దివాకర్ రెడ్డి అనటం … నిజంగా ఆశ్చర్యకర పరిణామమే! ఇంతకీ జేసీ సమస్య ఏంటి? జేసీ దివాకర్ రెడ్డి తాను పార్లెమంట్ కు వెళ్లనని భీష్మించి అనంతపురంలో కూర్చున్నారు. ఎంపీగా ఎన్నికైన ఆయన సభ నడుస్తుంటే ఇంట్లో కూర్చోవటం ఏంటి? ఓట్లు వేసిన జనానికి జవాబుదారి అంటూ ఏం లేదా? అది పక్కన పెడితే టికెట్ ఇచ్చిన పార్టీ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయమని విప్ జారీ చేసింది. దాన్నైనా గౌరవించాలి కదా? ఇంత కాలం జేసీ కూడా మిగతా ఎంపీలతో కలిసి ఆంద్రాకు అన్యాయం జరుగుతోందనే అన్నారు. తీరా ఇప్పుడు ఓటు వేసి మోదీ సర్కార్ ను బోనులో నిలబెట్టే సమయం వస్తే ఆయన వెళ్లకుండా వుండిపోతున్నారు! ఇదెక్కడి విడ్డూరం?     దిల్లీకి వెళ్లకపోవటానికి జేసీ చెబుతోన్న కారణాలు కూడా విచిత్రంగానే వున్నాయి. మోదీ ప్రధానిగా వున్నంత కాలం ఏపీకి ఏమీ రావని కుండబద్ధలు కొడుతున్నారు. ఆయన చెప్పింది నిజమే అయినా జనం కోసం , జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించాలి కదా? అది చేయకుండా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో బాధని పంచుకుంటే ఏం లాభం? ప్రత్యేక హోదా అవిశ్వాస తీర్మానం వల్ల రాదని జేసీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విషయం అపార అనుభవం వున్న చంద్రబాబుకు తెలియదా? తెలిసే ఆయన అవిశ్వాస తీర్మానంతో మోదీని ఢీకొడుతున్నారంటే జనం మనోభావాల్ని జాతీయ స్థాయిలో వినిపించాలనే కదా! మరి అందులో భాగం అవ్వటానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డికి ఏంటి ఇబ్బంది? జేసీ మొరాయింపు వెనుక అసలు కారణం వేరే అంటున్నారు టీడీపీలోని వారు. ఇప్పటికే ఆయనని బుజ్జిగించి దిల్లీ ఫ్లైట్ ఎక్కించే పనిలో వున్న కొంత మంది ఆయన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధూసూదన్ గుప్త విషయంలో గుస్సాగా వున్నారని అంటున్నారు. గుప్తా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. అది పార్టీకి కూడా ఇష్టమే. కానీ, టీడీపీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డి మాత్రం మధూసూదన్ గుప్తా చేరికని ఇష్టపడటం లేదు. అందుకే, అదును చూసి టీడీపీ అధిష్టానం పై ఒత్తిడి పెంచారని టాక్!     జేసీ అలకకి కారణాలు ఎలా వున్నా… ఆయన తన వ్యక్తిగత , రాజకీయ అంశాల కారణంగా ప్రత్యేక హోదా విషయాన్ని లైట్ తీసుకోవటం బాధాకరమే! పార్టీని, పార్టీ అధినేతని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తూ ఆయన జనం ముందు చులకన అవుతున్నారు. ఆంధ్రులకు ఎమోషనల్ ఇష్యూగా మారిన హోదా విషయంలో జేసీ పునరాలోచించుకుంటే మంచిది. దిల్లీకి వెళ్లి మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎంపీగా తన బాద్యత నిర్వర్తిస్తే చరిత్రలో పేరు చెడిపోకుండా స్థిరమవుతుంది!

సుప్రీమ్ శబరిమల తీర్పు… చట్టం ముందు అన్ని మతాలు సమానమేనా?

సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పుల పరంపర కొనసాగుతూనే వుంది. స్వలింగ సంపర్కంపై గొంతు విప్పిన అత్యున్నత న్యాయస్థానం మరో కీలక తీర్పు వెలువరించింది. ఈసారి హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో న్యాయస్థానం సూటిగా అభిప్రాయం వెలువరించింది. శబరిమల ఆలయంలోకి ఆడవారు ప్రవేశించవచ్చని దీపక్ మిశ్రా సహా అందరూ న్యాయమూర్తులు ఏకీభవించారు!     కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలోయంలోకి 10 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు మొదలు 50 ఏళ్ల వరకూ వయస్సున్న వారికి అనుమతి వుండదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఈ నియమంపై కోర్టుకెక్కారు కొందరు ఉద్యమకారులు. కేవలం స్త్రీలన్న వివక్షతో, ప్రకృతి సహజమైన ఋతుస్రావం నెపంగా చూపుతూ దేవుడి దర్శనానికి దూరం చేయటం తప్పన్నది వారి వాదన. నిజానికి నెలసరి సమయంలో హిందూ స్త్రీలు ఏ గుడిలోకి కూడా వెళ్లరు. అంతటా ఇది వర్తిస్తుంది. కానీ, అయ్యప్ప ఆలయంలోకి ఎలాంటి శారీరిక ఇబ్బంది లేని రోజుల్లో కూడా ఇంత కాలం అనుమతించే వారు కాదు. పదేళ్ల నుంచీ యాభై ఏళ్ల వయస్సున్న ఆడవారెవరూ కొండ మీదకి వెళ్లేవారు కాదు. ఇది తప్పా ఒప్పా అనేది పెద్ద చర్చ. ఎంతో కాలంగా జరుగుతూ వస్తోంది కూదా. అయితే, తాజా సుప్రీమ్ తీర్పుతో శబరిమల వివాదానికి తెర పడినట్టైంది.     కోర్టు తీర్పుని అందరూ శిరసావహించటం తప్పనిసరే. అలాగే, అత్యధిక శాతం హిందువులు దీన్ని పెద్దగా విమర్శిస్తారని కూడా భావించలేం. ఎందుకంటే, ఆలయాల్లోకి స్త్రీల్ని నిషేధించటం హిందూ మతంలోని మూలమైన సిద్ధాంతం ఏం కాదు. అసలు అలాంటి నియమం వేదాలు, పురాణాల్లో ఎక్కడా కనిపించదు కూడా. శబరిమల, శని సిగ్నాపూర్ లాంటి క్షేత్రాల్లో కాల క్రమంలో ఏర్పడ్డ నిషేధాలే ఇవన్నీ. కేరళలలోనే ఇతర అయ్యప్ప ఆలయాల్లో కూడా ఎక్కడా స్త్రీల ప్రవేశం కట్టడి చేయలేదు. కేవలం శబరిమల కొండపైకే నిషేధించారు. దాని వల్ల స్త్రీలకి ఏం నష్టం జరుగుతోందని వాదించే చాందసవాదులు కూడా వున్నారు. వారి మాటలో కొంత వరకూ సరైన అంశాలే వున్నా రాజ్యాంగబద్ధంగా పని చేసే కోర్టు మగ, ఆడా మధ్య భేదాలు వుండకూడదన్న సమనత్వ సూత్రంపైనే తీర్పు వెలువరించింది. ఇక ఇక్కడే మరో కోణమూ వుంది. తీర్పు వచ్చింది కాబట్టి నమ్మకాల్ని, విశ్వాసాల్ని పక్కన పెట్టి ఎందరు స్త్రీలు శబరిమల కొండ ఎక్కుతారు? అదీ అనుమానమే! చాలా మంది స్త్రీలు శబరిమల కొండపైకి ఒక వయస్సు వచ్చే వరకూ ప్రవేశం లేకపోవటం పెద్ద సమస్యగా భావించరనేది కూడా సత్యమే!     ఏ మతమైన ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూనే ముందుకు సాగాలి. అది శబరిమల ఆలయం ప్రవేశమైనా, ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారమైనా… అన్నీ కాలక్రమంలో పక్కకు తప్పుకోవాల్సిందే. కాకపోతే, మన దేశంలో అభ్యుదయవాదులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేయవలసిన పనులు కోర్టులు చేయాల్సి వస్తోంది. అదే విచారకరం! ఇప్పటికైనా కోర్టులో, ప్రభుత్వాల్లో ఏవో ఒకటి అన్ని మతాల్లోని దురాచారాల్ని అంతం చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. అలా కాకుండా కేవలం హిందువుల విశ్వాసాలు, నమ్మకాలు దెబ్బతిసేలా మాత్రమే తీర్పులు, ఆదేశాలు, చట్టాలు వస్తే… అది అశాంతికి కారణం అవుతుంది. మైనార్టీ మతాల విషయంలో కూడా ఉద్యమకారులు, అభ్యుదయవాదులు, ప్రభుత్వాలు నిష్పపక్షపాతంగా, నిర్భయంగా స్పందించాలి. ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారాల్ని సమూలంగా అంతం చేసే చర్యలు వేగంగా చేపట్టాలి. అదే సమానత్వం అనిపించుకుంటుంది!

మోదీ గెలిచి ఓడటం, చంద్రబాబు ఓడి గెలవటం… ఖాయమే!

టీడీపీ పంతం నెగ్గించుకుంది! చంద్రబాబు వ్యూహం ఫలించింది! అవిశ్వాస రాజకీయం మోదీని కార్నర్ చేయగలిగిందనే చెప్పాలి! నిజానికి స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాల్సి రావటమే ఒక మైనస్ పాయింట్. అందులోనూ తమతో నాలుగేళ్లు కలిసి సాగిన టీడీపీ లాంటి పార్టీయే అవిశ్వాసం పెట్టటం మోదీకి ఇబ్బందికర పరిస్థితే. అందుకే, గత పార్లమెంట్ సమావేశాల్లో రోజుల తరబడి సమయం వృథా అయినా ప్రధాని చర్చకు సిద్ధపడలేదు. కానీ, అది రివర్స్ రిజల్ట్స్ ఇచ్చింది. మీడియాలో, దేశ వ్యాప్తంగా కూడా మోదీ ప్రతిపక్షాల ప్రశ్నలకి భయపడుతున్నారని ప్రచారం జరిగింది. మళ్లీ ఈసారి కూడా పోయిన సారిలాగే టీడీపీ అవిశ్వాస అస్త్రం ఎక్కుపెట్టడంతో మోదీ చర్చకు దిగి రాక తప్పలేదు…     ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందంటూ రాష్ట్రంలో అన్ని పార్టీలు నిరసనలు చేస్తున్నాయి. కానీ, పార్లమెంట్ వేదికగా ఉద్యమిస్తేనే దేశమంతా గమనిస్తుంది. అందుకే, టీడీపీ పోరుబాట ఎంచుకుంది. కానీ, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం తప్పులో కాలేసింది. జగన్ తన ఎంపీల చేత రాజీనాలు చేయించి ట్రాప్ లో పడ్డారు. ఇప్పుడు మోదీ అవిశ్వాసం పై చర్చకు సై అనటంతో టీడీపీ ఎంపీల స్వరమే లోక్ సభలో వినిపించనుంది. జనం తరుఫున మాట్లాడే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది. ఈ విషయంలో టీడీపీదే పై చేయి అయిందని చెప్పుకోవాలి…     టీడీపీ, వైసీపీ మధ్య పోటీ పక్కన పెడితే చంద్రబాబు గత కొన్ని రోజులుగా బీజేపిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీయే విలన్ అని జనానికి చెప్పగలిగారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా అదే మరింత స్పష్టం కానుంది. ఖచ్చితంగా బీజేపీ నేతలు, ప్రధాని కూడా తీవ్ర స్థాయి ఎదురు దాడికి సిద్ధమయ్యే చర్చకు ఒప్పుకుని వుంటారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, కాషాయ దళం ఎంత ప్రతి దాడి చేసినా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం అనే ప్రధానమైన తప్పిదం మాత్రం కప్పిపుచ్చలేనిది. జనం ఆ విషయం గుర్తిస్తే చంద్రబాబు అవిశ్వాస వ్యూహం ఫలించినట్లే!     అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ జరగటం, ప్రధాని సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వటం ఎప్పుడైనా మామూలే. అయితే, చివర్లో ఓటింగ్ జరిగి ప్రభుత్వాలు కూలుతుంటాయి. అంతటి పరిస్థితి ఇప్పుడైతే లేదనే చెప్పాలి. మోదీ సర్కార్ కూలటం దాదాపు అసాద్యమే. ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ కే కేవలం 44 సీట్లు వుండటం, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా టీఆర్ఎస్, అన్నాడీఎంకే లాంటి పార్టీలు లోపాయికారిగా కేంద్రానికి సాయపడుతుండటం, వైసీపీ కూడా తన ఎంపీల రాజీనామాతో మోదీకి హెల్ప్ చేయటం… ఇలాంటి బోలెడు కారణాలున్నాయి! వీటన్నిటి వల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు నష్టం లేన్నట్టే. కానీ, టీడీపీతో సహా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీలు, మద్దతిస్తున్న పార్టీలు మాత్రం జనం ముందు దిల్లీ పెద్దల్ని దోషులుగా నిలిపే ఛాన్స్ వుంటుంది. అంత వరకూ చంద్రబాబు ఇతర నేతలు సక్సెస్ అయినట్టే! 

మా బాబు మంచివాడని రమణ దీక్షితులు ఇందుకే అన్నారా?

తిరుమల వెంకన్న ప్రధానార్చకులుగా రమణ దీక్షితులు ఇప్పుడు అందరికీ తెలిసిన వారే! నిజానికి ఆయన అర్చకులుగా వున్నప్పటి కంటే పదవీ విరమణ తరువాతే మరింత ఫేమస్ అయ్యారు. కారణం వివాదాల పరంపరనే! టీటీడీలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించటం మొదలు పింక్ డైమండ్ అని ఒకసారి, అమిత్ షాను కలిసి ఒకసారి, జగన్ తో బేటీ అయ్యి ఒకసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. లోపలి కారణాలు అసలేంటో ఎవ్వరికీ తెలియదు. తప్పు టీటీడీదా? రమణ దీక్షితులుదేనా? అంతా అయోమయమే! కానీ, ఈ గొడవ మొత్తంలోకి చంద్రబాబు పేరు కూడా పదే పదే వచ్చేస్తోంది. ఆయన ప్రమేయం ఎంత మేర అన్నది కూడా అస్పష్టమే. రమణ దీక్షితులు లాంటి అర్చకులకి 65 ఏళ్ల వయో పరిమితితో బలవంతంగా రిటైర్మెంట్ ఇవ్వటం చంద్రబాబు ఆలోచనా? లేక టీటీడీ బోర్డులోని వారిదా? దాన్ని ముందుగానే సీఎంకి చెప్పి అమలు చేశారా? ఇలా బోలెడు ప్రశ్నలు! అయితే తాజాగా రమణ దీక్షితులు బాబుకి క్లీన్ చిట్ ఇవ్వటం నిజంగా ఆసక్తికరమే!     ఇంత కాలంగా పోరుబాట పట్టిన రమణ దీక్షితులు ఇప్పుడు రూటు మార్చారా? సుప్రీమ్ గడప తొక్కుతాననీ, న్యాయపోరాటం చేసి తన అర్చకత్వ పదవి తాను తిరిగి పొందుతానని చెప్పుకొచ్చిన ఆయన వున్నట్టుండీ చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో జూనియర్ అని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు, చంద్రబాబు మంచివాడని కూడా కితాబునిచ్చారు. సీఎంగా ఆయన ఆంధ్రా ప్రజల అభివృద్ధి కోరతారని అన్నారు. ఇతరులెవరో చంద్రబాబుని పక్కదోవ పట్టించారని కూడా రమణ దీక్షితులు అనటం కొసమెరుపు! చంద్రబాబు తనకు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారని వాపోయారు!     ఈ తాజా కామెంట్స్ తో రమణ దీక్షితులు చెప్పదలుచుకున్నది ఏంటి? తనకు సీఎంతో సంధి ఓకేనని చెబుతున్నారా? అలాగే, తనకు అప్పాయింట్ మెంట్ ఇస్తే బాబుని కలిసి ఆయన ఏమైనా చెప్పదలుచుకున్నారా? బాబు మంచివాడే కానీ… అంటూ ముక్తాయింపు ఇచ్చారంటే… ఆ అసలు విలన్లు ఎవరు? బోలెడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీక్షితులు మాటలతో! ఏది ఏమైనా స్వరం మార్చిన రమణ దీక్షితులు తత్వం గ్రహించారనే భావించాలి. దిల్లీలో మకాం వేసి న్యాయ పోరాటం చేయటం అంత సులువేం కాదని అర్థమై వుండవచ్చు. టీటీడీ తీసుకున్న నిర్ణయం కోర్టు కొట్టివేస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. అలాగే కేసులో ఆయన విజయం సాధించినా అది ఎన్నాళ్లు సాగుతుందో ఊహించలేని వ్యవహారం. వీటన్నటి మధ్యా సమరం కంటే సంధే మంచిదని భావించారనుకోవాలి! మహాసంప్రోక్షణ సందర్భంగా తొమ్మది రోజులు భక్తుల్ని రానివ్వమని ప్రకటించిన టీటీడీ పెద్ద దుమారం రేపింది. అయితే, దాన్ని చంద్రబాబు ఒక్క ఆదేశంతో సద్దుమణిగించారు. భక్తుల్ని పరిమిత సంఖ్యలో అనుమతించాల్సిందేనని తెలిపారు. రమణ దీక్షితులు వ్యవహారం కూడా సీఎం అలాగే డీల్ చేస్తే సరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఆయనకి అప్పాయింట్ మెంట్ ఇచ్చి అతడి వాదన కూడా వింటే సమస్య చాలా వరకూ సద్దుమణగవచ్చు. ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న తరుణంలో ఒకవేళ దీక్షితులు సుప్రీమ్ గడప తొక్కిదే టీడీపీకి ఎంతో కొంత ఇబ్బందికరమే. దీన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా చంద్రబాబు చర్చకు ఆస్కారం కల్పించి రమణ దీక్షితులు వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తే ఎంతో బావుంటుంది. 

సుప్రీమ్ చెప్పాకైనా మోదీ సర్కార్ గోరక్షకులపై దృష్టి పెడుతుందా? 

గతంలో అసలు జరిగేవి కావో లేక మీడియా ఇంతగా రిపోర్ట్ చేసేది కాదో… కానీ, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ పెద్ద తలనొప్పిగా మారిపోయిన సమస్య గోరక్షకుల దాడులు! నిజంగా ప్రధానికి ఈ దాడుల్లో ప్రమేయం వుండదని తెలిసినా చివరకు ఆయనని, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది ప్రతీ ఒక్కరికి. ఎందుకంటే, ఎక్కడైనా ఓ రాష్ట్రంలో కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా ఒకరిద్దరిపై దాడి చేస్తే అది శాంతి భద్రతల సమస్య. రాష్ట్రం పరిధిలోనిది. కానీ, మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచీ ఒక మతాన్ని, కొన్ని కులాల్ని కావాలని గురి చూసి దాడులు జరుగుతున్నాయని వాదన వినిపిస్తోంది. ఇది ఆందోళనకరమైన పరిణామమే. స్వయంగా సుప్రీమ్ కోర్టు కూడా అదే అంటోంది…     కోర్టులో దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రత్యేక చట్టం చేయమని ఆదేశించింది. రాష్ట్రాల్ని కూడా జనం చట్టాల్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా చూడాలని ఆదేశించింది. గో రక్షకులమని చెప్పుకుంటూ మందలుగా మారి దాడులు చేయటం నిజంగా దుర్మార్గం. కానీ, ఉత్తరభారతంలో గత కొన్ని ఏళ్లుగా ఇది మామూలైపోయింది. దీనికి ప్రస్తుత మోదీ ప్రభుత్వం కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది ఎంత వరకూ నిజమనేది పక్కనపెడితే చాలా రాష్ట్రాల్లో అమాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా గోరక్షకుల దాడులతో కలవర పెడుతున్నాయి. దీన్ని అరికట్టడానికి అవసరమైన చట్టం తేవాలని సుప్రీమ్ సూచించింది. పార్లమెంట్లో ఈ తరహా చట్టం తేవటానికి పెద్దగా అడ్డంకులు కూడా వుండకపోవచ్చు. అన్ని పార్టీలు అంగీకరిస్తాయి కూడా.     చట్టం తీసుకురావాలన్న కోర్టు మరిన్ని సూచనలు కూడా చేసింది. దాడి జరిగినప్పుడు నష్ట పరిహారం బాధితుల మతం, కలం చూసి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. వారికి జరిగిన నష్టం ఆధారంగా నిర్ణయించాలని సూచించింది. బాధితులు ఏ మతం వారైనా వుండవచ్చిన అభిప్రాయపడింది. సుప్రీమ్ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా చట్టాన్ని తెస్తే అంత మంచిది. లేదంటే ఎంతో మంది అమాయకులు ఇంకా బలయ్యే అవకాశాలున్నాయి. కేవలం గోరక్షకుల దాడులే రాజకీయంగా చర్చకు వస్తున్నాయి కానీ… చాలా చోట్ల అనేక కోణాల్లో జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రోడ్లపైనే హింసతో చెలరేగిపోతున్నారు.     కొద్ది రోజుల క్రితమే కేవలం ఒక వాట్సప్ మెసేజ్ కారణంగా ఒక సాఫ్ట్ వేర్ టెక్కీ జనం దాడిలో మరణించాడు. అతడ్ని పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిగా భావించి జనం కొట్టి చంపారు. ఇలాంటివి జరగటానికి అనేక కారణాలే వున్నా… ప్రధానంగా మందగా మారిపోయి దాడి చేస్తే ఎవరికీ శిక్షలు పడటం లేదు. అదే జనంలోని అరాచకులకి ఊతం ఇస్తోంది. కొంత వరకూ అనుమానం వున్నా, లేదా ఏదో ఇతర కోపం వున్నా… మరో పది మందితో కలిసి దాడులు చేస్తున్నారు. చివరకు ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకుంటున్నారు. ఇది సమాజానికి అస్సలు క్షేమం కాదు. కఠినమైన చట్టం తీసుకు రావటమే సమస్యకి కొంత మేర పరిష్కారం చూపుతుంది!  

అజ్జు భాయ్‌ని సికింద్రాబాద్ పిచ్‌పై స్వంత పార్టీ నేతలే రనవుట్ చేస్తారా?

అజహరుద్దీన్… ఈ పేరు వినగానే మనకు ఇప్పటికీ క్రికెట్టే గుర్తుకు వస్తుంది. అలాంటి మంచి ట్రాక్ రికార్డ్ వున్న క్రికెటర్ అండ్ కెప్టెన్ ఆయన. కానీ, ఇప్పుడు అజహరుద్దీన్ క్రికెటర్ కాదు. పొలిటీషన్. అసలు ఆయన అలా ప్రవర్తిచింది ఎప్పుడూ లేదు. పోయిన ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలిచి ఈ అయిదళ్ల కాలంలో దాదాపు స్థబ్దుగా వుండిపోయారు. చాలా మంది సినీ, క్రికెట్ ప్రముఖల్లాగే కాంగ్రెస్ కు ఓ ఎంపీ సీటు సంపాదించి పెట్టి తన పని తాను చేసుకుంటూ వుండిపోయాడు. పార్లమెంట్లో , బయటా ఎక్కడా అజహరుద్దీన్ రాజకీయ వ్యాఖ్యలు చేసిందీ లేదు, రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించింది కూడా లేదు! కాకపోతే, తాజాగా ఆయన చేసిన ఒక చిన్న కామెంట్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. అదీ తెలంగాణ , హైద్రాబాద్ కాంగ్రెస్ లలో!     2014లో ఉత్తరాదిన పోటి చేసిన అజహరుద్దీన్ ఈసారి స్వంత రాష్ట్రం తెలంగాణ నుంచీ పోటీకి రెడీ అయ్యాడు.అయితే, చాలా రోజులుగా ఆయన హైద్రాబాద్ ఎంపీ స్థానానికి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తారని టాక్ వినిపించింది. దిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఓవైసీకి అజహరుద్దీన్ సరైన పోటీ అని భావించిందట. కారణం… ముస్లిమ్ జనాభా ఎక్కువ వుండే హైద్రాబాద్ లో ఓవైసీకి పెద్దగా పోటీనే లేదు ప్రస్తుతం. అతడిపై విమర్శలు చేయటం కూడా బీజేపీ వారు చేయాల్సిందే తప్ప ఇతర పార్టీలు ఓవైసీల ఎంఐఎం ప్రాపకం కోసం పాకులాడుతూనే వుంటాయి. టీఆర్ఎస్ కానీ, తెలంగాణ కాంగ్రెస్ కానీ ఎప్పుడూ ఓవైసీల్ని టార్గెట్ చేసింది లేదు. కానీ, గత ఎన్నికల్లో మోదీ తుఫాన్ కారణంగా కాంగ్రెస్ 44 సీట్లకు దిగజారింది. తమకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ఓటు బ్యాంక్ గా వున్న ముస్లిమ్ లు కూడా కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. అందుకే, రాహుల్ టీమ్ ముస్లిమ్ జనాభా ఎక్కువగా వుండే నియోజక వర్గాలపై దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి పెడుతోంది ఈ సారి.     హైద్రాబాద్ లోని ముస్లిమ్ ఓటు బ్యాంక్ ను అజహరుద్దీన్ తిరిగి తమ ఖాతాలోకి తెస్తాడని కాంగ్రెస్ హై కమాండ్ భావించి వుండవచ్చు. కానీ, ఓవైసీపై పోటీ చేస్తే తాను తప్పక ఓడిపోతానని అజహరుద్దీన్ కు బాగా తెలుసు. ఎంఐఎం అధినేతకు అలాంటి పట్టు నియోజకవర్గంపై వుంది. అంతే కాక అజహరుద్దీన్ కు అసదుద్దీన్ తో వున్న బంధం కూడా పోటీకి వెనుకంజ వేసేలా చేసి వుండవచ్చు. ఇవన్నిటి కారణంగా అజహరుద్దీన్ సికింద్రాబాద్ బాంబు పేల్చాడు!     హైద్రాబాద్ అంత ముస్లిమ్ జనాభా లేనప్పటికీ సికింద్రాబాద్ లో కూడా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిమ్ ఓటర్లు మెజార్టీగా వున్నారు. అందుకే, అజహరుద్దీన్ సికింద్రాబాద్ నుంచీ పోటీ చేస్తానని తన అభిప్రాయం బయటపెట్టారు. ఇది వరుసగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తూ వస్తోన్న అంజన్ కుమార్ యాదవ్ కి నచ్చలేదు. 2014లో ఓడినప్పటికీ 2004, 2009 ఎన్నికల్లో ఆయన మంచి మెజార్టీతోనే గెలిచారు. 2019లో బీజేపీ దత్తాత్రేయ నెగ్గారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు మంచి పట్టున్న నియోజక వర్గం వదలటానికి అంజన్ ఏ మాత్రం సిద్దంగా లేరు. అంతే కాదు, అజహరుద్దీన్ కి మతం కలిసి వస్తే అంజన్ కు కులం కలిసి వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించాలి. పైగా కాంగ్రెస్ అజహరుద్దీన్ లాంటి ముస్లిమ్ అభ్యర్థిని పోటీకి పెడితే అది బీజేపీకి ఆటోమేటిక్ గా కలిసొచ్చే అంశం. అజహరుద్దీన్ పై బహిరంగంగా బీజేపీ మతపరమైన కామెంట్లు చేయకపోయినా… బూతు లెవల్లో ఓటర్లను హిందూత్వ భావజాలంతో ప్రభావితం చేయగలదు. అలా కాంగ్రెస్ కు సికింద్రాబాద్ నియోజక వర్గం మొత్తానికి పోయే ప్రమాదం వుంది. లోకల్ నేతైన అంజన్ కుమార్ నే బరిలోకి దించటం ఎంతైనా తెలివైన పని అంటున్నారు రాజకీయ పండితులు!     రాహుల్ గాంధీ నిజంగా ముస్లిమ్ లకు దగ్గరవ్వాలనుకుంటే అజహరుద్దీన్ ను ఓవైసీ పైన పోటికి ఒప్పించటమే తెలివైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే, ఎన్నిసార్లు గెలిచినా హైద్రాబాద్ ముస్లిమ్ ల సమస్యలపై ఓవైసీలు పెద్దగా చేసిందేం లేదు. ఆ విషయాన్ని ఓటర్లుకు అజహరుద్దీన్ చేత చెప్పిస్తే కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించుకోవచ్చు. అలాగే, అసదుద్దీన్ బీజేపీతో పాటూ కాంగ్రెస్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్య. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దగ్గరగా మసులుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆయనేం కాంగ్రెస్ కు మద్దతు పలకటం లేదు. కాబట్టి ఓవైసీలపై అజహరుద్దీన్ చేత పోరు చేయించి హైద్రాబాద్ వశం చేసుకుంటే అది పెద్ద లాభంగా మారుతుంది. లేదంటే సికింద్రాబాద్ నియోజక వర్గంలో లేనిపోని గందరగోళంతో అంజన్ కుమార్ లాంటి మాస్ లీడర్ ని కూడా ఏ బీజేపీకో, టీఆర్ఎస్ కో కోల్పోవాల్సి రావచ్చు! 

టీటీడీ చెలగాటం… టీడీపీకి ప్రాణ సంకటం!

మహాసంప్రోక్షణ మహావివాదం ఒక్క మాటతో ముగిసింది. చంద్రబాబు కలుగజేసుకుని భక్తులకి నిత్యం దర్శనాలు కల్పించాల్సిందేనని అదేశించటంతో టీటీడీ బోర్డు నిర్వాకం మరింత దుమారం కాకుండా ఆగిపోయింది. అయితే, అసలు ఇంత వరకూ పరిస్థితి రాకుండా వుంటే ఇంకా బావుండేదని మాత్రం చెప్పుకోవాలి. ఇదంతా సీఎంపైనా, అధికార పార్టీపైనా అనవసర రాద్ధాంతానికి మూలమైంది. కేవలం టీటీడీ బోర్డు వారి అనాలోచిత నిర్ణయం పెద్ద గొడవకి తెర తీసింది.     ఎన్నికల ముందు సంవత్సరం అంటే అధికార పక్షం డిఫెన్స్ లో సాగుతుంటుంది. అపోజిషన్ దూకుడుగా ఆడుతుంది. ఈ విషయం తెలియని వారు కాదు టీటీడీ చైర్మన్, ఇతర సభ్యులు, ఈవో. అయినా కూడా సరిగ్గా ప్రతిపక్షం అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మహాసంప్రోక్షణ వివాదం కోరి తల మీద తెచ్చి పెట్టారు. అసలు వెయ్యి సంవత్సరాలుగా రామానుజచార్యుల కాలం నుండీ ఈ క్రతువు జరుగుతూనే వుంది. ప్రతీ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి స్వామి వారికి విశేష పూజలు, ఆగమ శాస్త్ర యుక్తంగా సేవలు జరుగుతాయి. మరి గతంలో చేసిన విధంగానే ఇప్పుడూ చేస్తే పోయేదానికి కొత్తగా భక్తుల్ని నిషేధించటం ఎందుకు? దీనికి టీటీడీ దగ్గర సరైన సమాధానం వుందని అనుకోలేం.     ఎందుకంటే, వారు చెబుతున్నట్టు గతంలో వచ్చిన దాని కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారన్నది నిజం. కానీ, అందుకు తగ్గట్టే సాంకేతిక సౌకర్యాలు కూడా పెరిగాయి. మనసుంటే మార్గమూ వుంటుంది. రోజుకు ఇరవై వేల మందికి ఏ విధంగా చూసినా దర్శనం కల్పించే అవకాశం వుంటుందని బోర్డు వారే ఒప్పుకున్నప్పుడు ఆ పని చేయకుండా మొత్తంగా దర్శనాలు రద్దు చేయటం, అవసరం వున్నా లేకున్నా కొండపైకి దార్లు మూయటం, సీసీ కెమెరాలు పని చేయవని చెప్పటం… ఇదంతా ఎందుకు? రమణ దీక్షితులు కేంద్రంగా సాగుతోన్న వివాదానికి మరింత ఆజ్యం పోసింది మహా సంప్రోక్షణ! చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిర్ధిష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో పెద్ద దుమారం తప్పిందనాలి. ప్రతిపక్ష నేత జగన్ దీనిపై నోరు విప్పకున్నా ఆయన పార్టీ ప్రతినిధి రోజా కొండపైనే కామెంట్స్ చేశారు. సామాన్య భక్తులు కూడా కొంత వరకూ ఆగ్రహం చెందారనే చెప్పాలి. ఒకవేళ ఈ లోపే ఎవరైనా కోర్టుకి వెళ్లి పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ లాంటిది వేసి వుంటే? అది మీడియాలో మరింత రచ్చకి దారి తీసేది! ప్రత్యేక హోదా విషయంలో తమని టార్గెట్ చేస్తున్న చంద్రబాబుని బీజేపీ ఈ విషయంలో కార్నర్ చేసి వుండేది. హిందూ మతపరమైన విషయాలు, అదీ తిరుమల వెంకన్నకు సంబంధించిన వివాదం అయితే… కాషాయ పార్టీని నియంత్రించటం కష్టమే అయివుండేది.     వారికి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న ప్రచారం నుంచీ ఏపీ ప్రజల దృష్టి మరల్చటానికి అచ్చంగా ఇలాంటి గొడవే కావాలి. దాన్ని టీటీడీ చక్కగా అందించింది. సమయానికి ఏపీ సీఎం తేరుకోవటంతో హిందువుల మనోభావాల చుట్టూ జరిగే రాజకీయం ఆదిలోనే ఆగిపోయింది! ఆ మధ్య దుర్గ గుడి వివాదం, ఇప్పుడు తిరుమల… ఇలాంటివి ఎన్నికల ఓటర్ల మీద తీవ్ర ప్రభావమే చూపే అవకాశం వుంది. కానీ, వీటిల్లో చాలా వరకూ ప్రభుత్వం, మంత్రులు, సీఎం పాత్ర చాలా తక్కువ. ఈవోలు, దేవాలయ బోర్డుల నిర్వాకాలే ఎక్కువ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నడుస్తోన్న ఈ కీలక సంవత్సరంలో ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇక ముందు మరింత జాగ్రత్తగా వుంటే మంచిది! గొడవ జరిగాక సద్దుమణిగించటం… ఎంతో కొంత డ్యామేజ్ చేసే తీరుతుంది. వివాదం చెలరేగకుండా వుండేలా చర్యలు వుండాలి.

ఓట్ల  కోసం గ్లామర్ మంత్రాన్ని నమ్ముకుంటోన్న బీజేపీ! 

సినిమా నటులు, ఇతర సెలబ్రిటీలకు దాదాపుగా అన్ని పార్టీలు పిలిచి టికెట్లు ఇస్తుంటాయి. ఎందుకు? దీని వెనుక పెద్ద లాజిక్కే వుంది. సినిమా వాళ్లో, సెలబ్రిటీలో అయితే గెలిచే అకాశాలు చాలా ఎక్కువ. అదీ తొలిసారి రంగంలోకి దిగుతున్న వారైతే జనం క్రేజ్ తో ఓట్లు వేసేస్తారు. ఆ తరువాత వారు ఎంత వరకూ నియోజక వర్గానికి ఉపయోగపడతారన్నది వాళ్ల ఆసక్తి, నిజాయితీ మీద ఆధారపడి వుంటుంది. కానీ, ఎవరికీ తెలియని కొత్త వార్ని తెచ్చి నిలబెట్టేదాని కన్నా కాస్త పేరున్న సెలబ్రిటీల్ని నిలపటం పార్టీలకి సేఫ్. అందుకే, వారి కోసం ఎన్నికల సీజన్లో గాలం వేస్తుంటాయి. ఇక గెలుపు కంటే మరో ముఖ్యమైన అంశం… సెలబ్రిటీలు పార్టీల అధినాయకత్వానికి పెద్దగా ప్రమాదం కాదు. వారు ఎంత మెజార్టీతో గెలిచినా తమ పని తాము చేసుకుపోతుంటారు తప్ప దాదాపు ఏ సందర్భంలోనూ పార్టీ నాయకత్వానికి తలనొప్పులు తీసుకురారు. సెలబ్రిటీలకు అసలు సిసలు పార్టీల అంతర్గత రాజకీయం తెలియదు కాబట్టి నాయకత్వాన్ని ధిక్కరించి ముఠాలు కట్టటం లాంటివి చేయరు. ఇలా రెండు విధాలా లాభం వుండటం వల్లనే ఈ సారి మరో మారు బీజేపి సెలబ్రిటీ గ్లామర్ పై ఆశలు పెట్టుకుంటోంది.     దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా సినిమా వాళ్ల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాయి. అలాంటిది బీజేపీ, కాంగ్రెస్ వార్ని ఎలా వదిలేస్తాయి. ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్లు కాంగ్రెస్ , బీజేపీల టికెట్లపై గెలిచారు. అమితాబ్ బచ్చన్ మొదలు మన కృష్ణంరాజు దాకా వున్న వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే! అయితే, 2014లో మోదీ యూపీఏ పై దండయాత్ర చేసి స్వంత మెజార్టీతో నెగ్గారు. అందులో కూడా సెలబ్రిటీల పాత్ర కాస్త వుందనే చెప్పాలి. హేమామాలిని లాంటి వారు ఎప్పటిలాగే కమల దళం కోసం పోటీ చేయగా కొత్తగా పరేష్ రావల్, అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లాంటి వారు ఎన్నికల బరిలో దూకారు.     2014 కంటే ఇప్పుడు మోదీ పరిస్థితి కాస్త క్లిష్టంగా వుంది. అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత పైకి కనిపించకున్నా ఆందోళన కలిగిస్తోంది. అందుకే, జనం ఈజీగా కన్విన్స్ అయ్యేలా మరింత మంది సెలబ్రిటీలను బ్యాలెట్ బ్యాటిల్ లోకి దించాలని డిసైడ్ అయ్యారట. ముఖ్యంగా, బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్, ఆమీర్ ఖాన్లకు ధీటుగా నిలుస్తూ కరుడుగట్టిన ఉత్తరాది బీజేపీ అభిమానులకు ఫేవరెట్ అయిన అక్షయ్ కుమార్ ని రంగంలోకి దించే యోచనలో వున్నారట. కానీ, ఆయన బీజేపీ పెద్దలు ఆశించినట్టు పంజాబ్ నుంచో, దిల్లీ నుంచో తలపడాలంటే ముందు కెనడా పౌరసత్వం వదులుకోవాలి. ఇప్పటికే మోదీ, అమిత్ షా టీమ్ అక్కీకి రెడీ అవ్వమని చెప్పారట. బాలీవుడ్ ఖిలాడీ ఏం చేస్తాడో! అక్షయ్ తో పాటూ అనుపమ్ ఖేర్ ని కూడా బీజేపీ పోటీలో పెట్టాలని భావిస్తుందంటున్నారు.     నానాపటేకర్ ని ఆయన స్వంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచీ పోటీ చేయిస్తారట. వీరే కాకుండా ఎన్నికలు దగ్గర పడుతోన్నకొద్దీ మరింత మంది కాషాయ కండువాలతో పార్టీకి సెలబ్రిటీ గ్లామర్ తెస్తారని ప్రచారం జరుగుతోంది. కాకపోతే, ఇటు తెలంగాణలో పెద్దగా బలం లేక, అటు ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న బీజేపీతో ముందకు సాగటానికి ఇక్కడైతే ఏ సెలబ్రిటీ సాహిసించే పరిస్థితి లేదు! తెలుగు రాష్ట్రల్లో కొత్తగా బీజేపీ కండువాలు కప్పుకునే మూడ్ లో ఏ ప్రముఖులు కూడా కనిపించటం లేదు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే అంత రిస్క్ తీసుకుంటారని అస్సలు భావించలేం. కాబట్టి బీజేపీ సెలబ్రిటీ గ్లామర్ మంత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే చింతకాయలు రాలవనే నిర్ణయించుకోవాలి!

కేసీఆర్‌కు గద్దర్, కోదండరామ్‌ల డ్యామేజ్ తప్పదా?

ఒకవైపు ఏపీ రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఓ సారి పవన్, చంద్రబాబు ఫైట్, మరోసారి చంద్రబాబు, జగన్ మాటల యద్ధం, ఇవేవీ కాకపోతే, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటాలు… ఇలా రోజూ ఆసక్తికరంగానే సాగిపోతోంది ఆంధ్రా వ్యవహారం. కానీ, తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణం వుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు ఎన్ని ఏర్పాటు చేసినా అధికార పక్షంపై దుమారం రేగేలా కామెంట్లు చేయలేకపోతోంది. టీ కాంగ్ అద్యక్షుడు ఉత్తమ్ సహా అందరూ కేసీఆర్ ని, ఆయన పథకాల్ని టార్గెట్ చేస్తున్పప్పటికీ మీడియాలో, జనంలో పెద్ద చర్చకు దారి తీయటం లేదు. దీనికి ప్రధానమైన కారణం… ఏపీలో వున్నట్టుగా చంద్రబాబు, జగన్, పవన్ వంటి వ్యక్తుల చుట్టూ తెలంగాణలో రాజకీయం లేదు! కేసీఆర్ తో సమానమైన ఛర్మిష్మా గల నేత కాంగ్రెస్ లో కనిపించటం లేదు. అలాగే, ఎవరు సీఎం క్యాండిడేటో తెలియని స్థితిలో … పూర్తిగా దిల్లీ అదుపు, ఆజ్ఞాల్లో టీ కాంగ్రెస్ పని చేయాలి. కానీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ప్రత్యక్ష నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ అయిన తెరాస దూసుకుపోతోంది. ఇదే పోటీలో సమతుల్యం దెబ్బతినేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ రెండూ ప్రాంతీయ పార్టీలు కావటంతో పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టు వుంటోంది.     ఇప్పుడు పరిస్థితి ఎలా వున్నా… కనీసం వచ్చే ఎన్నికల తరువాతైనా తెలంగాణలో అధికార మార్పు వుంటుందా? కాస్త రాజకీయ అవగాహన వున్న వారు ఎవరైనా తెలంగాణ కాంగ్రెస్ అంత ఈజీగా కేసీఆర్ ని గద్దె దించలేదని చెప్పేస్తారు. అందుకు తగిన కారణాలు కూడా వున్నాయి. కేసీఆర్ వైఫల్యాలు అడపాదడపా కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు చెబుతోన్నా గట్టిగా జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. పైగా రైతులకి ముఖ్యమంత్రి ఎకారానికి ఇంతంటూ డబ్బులు ఇవ్వటం, బీమా కల్పించటం, కొన్ని వర్గాలకి గొర్రెలు, బర్రెలు వంటివి పంపిణీ చేయటం లాంటివి చేస్తూ కులాల వారీగా ఆకట్టుకుంటున్నారు. మైనార్టీల్ని కూడా మతపరమైన సంతుష్టీకరణ చేస్తూ పట్టిపెడుతున్నారు. కేసీఆర్ చాణక్యానికి టీ కాంగ్ వద్ద పెద్దగా ఎదురు సమాధానాలు లేవు. ఇక బీజేపీ లాంటి ఇతర ప్రతిపక్షల సంగతైతే మరీ దయనీయం. వారు కూడా ఎలాంటి ప్రతిఘటన చూపటం లేదు. ఈ సమయంలో జనంలో కొంత ఆసక్తి రేపుతున్న వారు ఇద్దరున్నారు! వారే… కోదండ రామ్, గద్దర్!     కోదండరామ్ ఇప్పటికే తెలంగాణ జన సమితి పెట్టేశారు. ఆ మద్య సభలు, సమావేశాలు, నిరసనలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. కేసీఆర్ కూడా ముందు జాగ్రత్తగా ఆయన ప్రయత్నాల్ని గట్టిగా ఎదుర్కొన్నారు. స్వయంగా కోదండరామ్ ని విమర్శించారు కూడా. ఇక ఇప్పుడు గద్దర్ రంగంలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలు ఏర్పాటు చేసిన బహుజన ఫ్రంట్ మీటింగ్ లో ఆయన ఓట్ల రాజకీయం వైపు తాను రాబోతున్నానని సంకేతాలిచ్చారు. ఇది ఒక విధంగా పెద్ద వార్తే! గద్దర్ లాంటి వ్యక్తులు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఓటర్లపై ఖచ్చితంగా ప్రభావం వుంటుంది. కానీ, ఎంత అనేదే పెద్ద ప్రశ్న. ఓట్ల రాజకీయాల్ని వ్యతిరేకించే నక్సల్ వాదిగా గద్దర్ ఇంత కాలం కొనసాగారు. కానీ, ఇప్పుడు ఆయనే ఓట్ల కోసం జనంలోకి వెళతానని అంటున్నారు. లాల్, నీల్ కలయిక అంటూ మాట్లాడారు. లెఫ్ట్ తో దళితులు కలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదంతా కేసీఆర్ కు ఎంత వరకూ నష్టం చేయగలదు?     కోదండరామ్ అయినా, గద్దర్ అయినా నిజాయితీ విషయంలో మచ్చ లేని వారు. వాళ్లని జనం నమ్ముతారు. కానీ, మందు, బిర్యానీ, కులం, మతం ప్రధానంగా జరుగుతుంటాయి మన ఎన్నికలు. వాటిలో వీరికి మన ఓటర్లు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అనుమానమే! చాలా మంది ఓట్ల పోరాటంలో ఓడిపోయిన ఉద్యమకారుల విషయంలో ఇది గతంలో జరిగింది కూడా. లక్షలాది జనం తరలి వచ్చే ఉద్యమకారులకి ఓట్లు మాత్రం అంత తేలిగ్గా పడవు. అందుకు బోలెడు కారణాలు. ప్రధానమైంది ఎన్నికల సమయంలో జరిగే మనీ మ్యానేజ్మెంట్. ఆ విషయంలో గద్దర్ వ్యతిరేకిస్తున్న కేసీఆర్, మోదీ ఇద్దరూ సిద్ధహస్తులే! మరి ఇటువంటి సమయంలో కేసీఆర్ ని కట్టడి చేయాలని నిజంగా గద్దర్, కోదండరామ్ అనుకుంటే ఏం చేయాలి?     కోదండరామ్, గద్దర్లే వేరు వేరు వేదికల ద్వారా ఎన్నికలకి వెళుతున్నారు. ఇక ఎప్పుడూ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వుండే కాంగ్రెస్, బీజేపీలు వుండనే వున్నాయి. ఇలా ప్రతిపక్షంలో ఎందరు ఎక్కువై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కేసీఆర్ కు అంత ఆనందం! ఆయనకు వచ్చే సీట్లు మరింతగా పెరుగుతాయి. ఇది తెలియనంత అమాయకులు కాదు గద్దర్, కోదండరామ్, కాబట్టి వారిద్దరూ టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జతకట్టి ముందుకు సాగితేనే కొంతైనా ఫలితం రాబట్టగలిగే అవకాశం వుంటుంది. టీ కాంగ్రెస్ కూడా గద్దర్, కోదండరామ్ లాంటి వార్ని తమతో కలుపుకుని ముందుకు పోయే పరిపక్వత చూపాలి. అలాంటిదేం ఇంత వరకూ కనిపించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ద్వారా … గద్దర్, కోదండరామ్ ల ప్రచారం అంతా కేసీఆర్ కు వరంగా మారే ప్రమాదముంది!

చంద్రబాబు వ్యూహంతో… జగన్ ఒత్తిడికి లోనవుతున్నాడా? 

ఒక్కసారి మనం 2014 కంటే వెనక్కి వెళితే… మళ్లీ తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు కనిపిస్తుంది! అప్పటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చినవే. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీపీఐ… ఇలా ప్రతీ పార్టీ జైతెలంగాణ అనక తప్పలేదు. అయితే, మిగతా పార్టీలన్నీ ఆంద్రాలో నష్టం జరుగుతోన్న తెలంగాణకు సై అని ఎందుకు అన్నాయి? జనంలో వున్న సెంటిమెంట్ ని టీఆర్ఎస్ గుర్తించి క్యాష్ చేసుకుంది కాబట్టి! గులాబీ బాస్ కేసీఆర్ జనకాంక్షని గ్రహించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి మిగతా అన్ని పార్టీల్ని కార్నర్ చేయగలిగారు! ఇప్పుడు అలాంటి వ్యూహమే చంద్రబాబు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు! అందులో జగన్ ఒత్తిడికి లోనుకావటం అసలు విశేషం!     ప్రత్యేక హోదా అంటూ గత కొంత కాలంగా టీడీపీ తన ఉద్యమాన్ని తార స్థాయికి చేర్చింది. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో, దిల్లీలో పోరుబాట పట్టింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి జనం ముందు బీజేపీని దోషిని చేసింది. ఇదంతా సక్సెస్ అవుతున్నట్టేనా? కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే సూచనలైతే కనిపించటం లేదు. కానీ, చంద్రబాబు పొలిటికల్ స్కోర్ అయితే పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా, ప్రతిపక్ష నాయకుడు జగన్ అంకంతకూ కార్నర్ అవుతున్నారు. టీడీపీ ఒకవైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని బీజేపీని, బీజేపితో సీక్రెట్ దోస్తీ చేస్తున్నారని జగన్ ని ఇరుకున పెడుతోంది. దాని ఫలితం పదే పదే కనిపిస్తోంది.     స్పెషల్ స్టేటస్ విషయంలో టీడీపీ జోరుని తగ్గించేందుకు జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించారు. పార్లమెంట్లో నిరసనలు చేయించారు. కాకపోతే, ఏదీ కూడా మోదీకి మరి ఇబ్బందికరంగా మారకుండా జాగ్రత్తపడుతూనే వచ్చారు. ప్రసిడెంట్, వైస్ ప్రసిడెంట్ ఎన్నికలప్పుడు బేషరతుగా మద్దతిచ్చి మోదీ, షాల దృష్టిలో పడ్డారు. కానీ, ఈ మెతకదనం అసలుకే ఎసరు తెచ్చేలా వుందని భావించి ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. మరోసారి మరో పరోక్ష ఎన్నికల్లో బీజేపికి మద్దతిస్తే టీడీపీ జనంలోకి ఆ విషయం తీసుకెళ్లి రచ్చ చేస్తుందని భయపడ్డ జగన్ కమలానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటూ సెలవిచ్చారు!     రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పదవికి ఈ పార్లమెంట్ సెషన్లో ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ప్రస్తుతం శత్రుపక్షం కాబట్టి ఎలాగూ మద్దతివ్వదు. కానీ, అనూహ్యంగా జగన్ కూడా తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. బీజేపి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయటం అంటే మోదీ, షాలకు కోపం తెప్పించటమే. అయినా జగన్ ఈ సాహసానికి పూనుకోవటం టీడీపీ వల్లే అనాలి.     ఇప్పటికే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంతో మోదీ సర్కార్ ను ఓ ఆటాడాలని టీడీపీ యోచిస్తోంది. ఎన్డీఏలో లేని ప్రతీ పార్టీని కలిసి మద్దతు అడుగుతోంది. శివసేన లాంటి పార్టీల్ని కూడా కదలించే ప్రయత్నం చేస్తోంది. ఇలా ప్రత్యేక హోదా ఇవ్వని మోదీపై చంద్రబాబు యుద్ధం చేస్తోంటే… జగన్ బీజేపికి మద్దతెలా ఇస్తారు? ఇస్తే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయి? టీడీపీ నేతలు చూస్తూ ఊరుకుంటారా? ఈ ప్రశ్నల కారణంగానే జగన్ మోదీ వ్యతిరేక టీమ్ లోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఒత్తిడి వ్యూహమనే చెప్పాలి! ఏపీలో బాబు బీజేపిని ఒంటరని చేశారనే అనాలి! 

రామ మందిర రాజకీయం మళ్లీ రాజుకుంటోంది!

ఓవైసీ అయోధ్య రామ మందిరం వివాదం పై మళ్లీ నోరు విప్పాడు. ఆ కేసులో తీర్పు ఇవ్వాల్సింది సుప్రీమ్ కోర్టు అన్నాడు. అమిత్ షా కాదంటూ సెటైర్లు వేశాడు. అంతే కాదు, ఎన్నికల ముందు రాబోతోన్న అయోధ్య తీర్పు పారదర్శకంగా వుండాలని పేర్కొన్నాడు. ఇలా హఠాత్తుగా ట్విట్టర్ లో అయోధ్య గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింధి?     అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనకి కారణం అమిత్ షా! ఆయన హైద్రాబాద్ వచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులతో, ఆరెస్సెస్, వీహెచ్పీ నేతలతో మాట్లాడారు. మీడియాకు నేరుగా వివరాలేవీ తెలియజేయనప్పటికీ … ఆయన రామ మందిరం గురించి మాట్లాడారని మ్యాటర్ లీకైంది. 2019 ఎన్నికల లోపే అయోధ్యలో రామ మందిరం సాకారం అవుతుందని షా అన్నారట. ఇది ఎలా బయటకు వచ్చిందోగానీ జాతీయ మీడియాలో కూడా కలకలం రేపింది. కోర్టులో వున్న విషయంపై బీజేపీ అధ్యక్షుడు అయ్యి వుండి అమిత్ షా అలా ఎలా మాట్లాడతారని నిరసనలు మొదలయ్యాయి. ఓవైసీ ట్విట్టర్ వ్యాఖ్యలకు ఇదే కారణం! ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ అన్ని పార్టీలు తమ తమ బలాల్నీ, బలహీనతల్ని మథింపు చేసుకుంటాయి. బీజేపీకి ఖచ్చితంగా రామ మందిరం పెద్ద బలం. బలహీనత కూడా! మోదీ ప్రస్తుతం స్వంత మెజార్టీతో ప్రధానిగా వున్నారు. ఆయన వాజ్ పేయ్ లా పొత్తుల వల్ల మందిరం కట్టలేకపోయానని చెప్పలేరు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయదళం రామ మందిరానికి పునాదులు వేశాకే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. సుప్రీమ్ లో కేసు విచారణ జరుగుతున్న వేగం కూడా ఆ దిశగానే వుంది. కోర్టు తీర్పు ఎలా చూసినా ఎన్నికల లోపే వచ్చేస్తుంది. అయితే, తీర్పు ఏంటన్నది ఎవ్వరం చెప్పలేం. కానీ, షా తనకు ఇప్పటికే తెలుసునన్నట్టు నాయకులకి, కార్యకర్తలకి మందిరం కట్టేస్తామని చెప్పటం వివాదాస్పదం అవుతోంది.     కోర్టులో వున్న వ్యవహారంపై తాను వ్యాఖ్యలు చేయకూడదని అమిత్ షాకి తెలియదనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ ఆయన తెలిసే మాట్లాడి వుంటే… ముందు ముందు మరోమారు రామ జన్మభూమి రాజకీయాలకు కీలకం అవ్వనుందని భావించవచ్చు. ఓవైసీ లాంటి వాళ్లు అప్పుడే పాదర్శకం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటే… తీర్పు ఎలా వచ్చినా గందరగోళం తప్పకపోవచ్చు. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లోని షియా ముస్లిమ్ నాయకులు కూడా రామ మందిర నిర్మాణానికి బీజేపీ డైరెక్షన్లో అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మొత్తం మీద రామ మందిర అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పెద్ద రచ్చే జరగవచ్చు రానున్న ఎన్నికల సీజన్లో! ఖచ్చితంగా 2014లో లాగా అభివృద్ధి, అవినీతి వంటి విషయాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరి ఇదంతా చివరాఖరుకు ఎవరికి లాభిస్తుంది? ప్రస్తుతానికి రాముడికే తెలియాలి! ఎన్నికల ఫలితాల నాడు మాత్రమే మనకు తెలుస్తుంది!

అసలు బిజినెస్ చేసుకోమంటే… సైడ్ బిజినెస్సే ముద్దంటున్న మల్టీప్లెక్స్లు!

వీకెండ్ వస్తే గతంలో ఎటు వెళ్లాలా అని జనం తెగ ఆలోచించే వారు! ఒక్కొక్కరూ ఒక్కో దారి చూసుకునే వారు. కొందరు సినిమాకి, కొందరు చుట్టాల వద్దకి, కొందరు షికార్లకి వెళ్లే వారు. కానీ, ఎప్పుడైతే షాపింగ్ మాల్స్ అండ్ మల్టీప్లెక్సులు ప్రత్యక్షం అయ్యాయో జనం వారాంతాలు అక్కడే గడిచిపోతన్నాయి. చాలా మంది మల్టీప్లెక్సుల్లో సినిమాలకి విపరీతంగా అలవాటు పడిపోయారు. శనివారం, ఆదివారం సినిమాలు చూస్తూ, చిరుతిళ్లు తింటూ , షాపింగ్ చేస్తూ గడిపేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో తమ జేబులకి చిల్లులు కూడా పెట్టుకుంటున్నారు. విచిత్రంగా జనం సొమ్ము దోచేస్తున్నది సినిమా టికెట్లు కాదు. సినిమా మధ్యలో నోట్లో నమిలే చిరుతిళ్లు!     మల్టీప్లెక్సుల్లో ఓ కాఫీ, ఓ కోక్, ఓ పాప కార్న్ లేదా ఓ బర్గర్… ఇవన్నీ ఎంత రేటు వుంటాయో అందరికీ తెలిసిందే! నిజానికి బయట కంటే డబుల్ రేట్లు పలుకుతుంటాయి. కొన్ని చోట్ల మూడింతలు కూడా! కానీ, కామన్ ఇండియన్స్ వీట్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కారణం… అంత పోష్ గా, అద్దాల మేడల్లో ప్రదర్శించే సినిమాల్లో… ఇలాంటి ఖరీదైన ఫుడ్సే వుంటాయని కన్విన్స్ అయిపోయారు. అయితే, ఎవరికో ఒకరికి మాత్రం ఒళ్లు మండకుండా వుంటుందా? అదే జరిగింది. ఓ ముంబై వాసి నేరుగా వెళ్లి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. మల్టీప్లెక్సుల్లో మామూలు క్వాలిటితోనే సర్వ్ చేయబడే ఫుడ్స్ ఎందుకు విపరీతమైన ధరకు అమ్ముతున్నారని అతడి ప్రశ్న! కోర్టు స్వీకరించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది!     ఒకవైపు కోర్టులో కేసు వుండగానే మహరాష్ట్ర అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ జరిగింది. మొదట ఎన్సీపీ నేత మల్టీప్లెక్సుల దోపిడి అంశం లేవనెత్తినప్పటికీ తరువాత అన్ని పార్టీల వారు గొంతు కలిపారు. అందరూ ఇది అన్యాయమనే అన్నారు. అధికార బీజేపీ మంత్రి నేరుగా ఇక మీదట తమ ఇష్టానుసారం రేట్లు నిర్ణయించడం కుదరదని చెప్పేశారు! ప్రతీ ఆహారం ఎమ్మార్పీ రేటుకే అమ్మేలా రూల్ తెస్తామన్నారు. పైగా మల్టీప్లెక్సుల్లోకి ప్రేక్షకులు తమ స్వంత ఆహారం కూడా తెచ్చుకోవచ్చని ప్రకటించారు!   మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన వ్యవహారమంతా మనకు పైకి చిన్న విషయంగా కనిపించినా పీవీఆర్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్ కంపెనీల షేర్లే డౌన్ అయిపోయాయి స్టాక్ మార్కెట్లో! ఎందుకంటే, మల్టీప్లెక్సుల్లో తినుబండారాలు, పానీయాల మీద రేట్లు తగ్గిపోతే దాదాపు 30-35 శాతం లాభాలు తగ్గిపోతాయట యాజమాన్యాలకి! ఇది బాహాటంగానే చెప్పేస్తున్నారు. అంటే, ఇంత కాలం మల్టీప్లెక్సుల వారు సినిమా టికెట్ల మీద కంటే ఈ కొసరు అమ్మకాల మీదే ఎక్కువ రాబట్టుకుంటున్నారన్నమాట!     బయట పదికి దొరికేది మల్టీప్లెక్స్ లో యాభై రూపాయాల కంటే ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారంటే… రెండింతలు, మూడింతలు డబ్బు ఎక్కువ చెల్లిస్తూ ఇంత కాలం ప్రేక్షకులు ఎంత నష్టపోయి వుంటారు? పైగా ఇప్పటికీ వ్యవహారమంతా మహారాష్ట్రలోనే జరుగుతుంది! హైద్రాబాద్, బెంగుళూరులోని మల్టీప్లెక్స్ ల దోపిడికి ఎప్పుడు అంతం? ఇంకా కొన్ని నెలలైనా పట్టవచ్చు! కోర్టు తీర్పు వస్తే తప్ప మహా సర్కార్ కూడా అంతిమ నియమ, నిబంధనలు నిర్ణయించలేదు. ఆ తరువాత మెల్లగా ఒక్కో రాష్ట్రం మల్టీప్లెక్సుల దోపిడీని అరికట్టాలి! అంత వరకూ సామాన్యుడు వినోదం కోసమో, బలహీనతకొద్దో ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూనే వుండాలి. చేతులకు చిలుము వదులుతూనే వుండాలి. ఇదీ పరిస్థితి!

జగన్‌కి బంపర్ ఆఫర్! స్వీకరించక తప్పదా?

  2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమిత్ షాకి మిత్రుల అవసరం తెలిసి వస్తోందా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బీహార్ కు వెళ్లిన ఆయన నితీష్ తో చర్చలు జరిపారు. టిఫిన్ చేస్తూ, లంచ్ చేస్తూ మీటింగ్ లు నడిపిన షా ఎట్టకేలకు కొంచెం నమ్మకం కలిగించగలిగాడు నితీష్ లో. సీట్ల పంపకం సాకుగా చూపి ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావించారు నితీష్. తన అనుకూలాన్ని బట్టి ఇటు వైపు, అటు వైపు గోడ దూకటం జేడీయూ నేతకి మామూలే. కాకపోతే, ఇప్పుడు మోదీ, షా ఆయనని వదులుకునే స్థితి లేదు. అందకే హుటాహుటిన పాట్నా వెళ్లి చర్చల రాజకీయం చేశారు షా. అయినా కూడా నితీష్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితి!     బీహార్ నుంచి తెలంగాణకొచ్చిన అమిత్ షా ఎవ్వరూ ఊహించని విధంగా రామోజీ రావును కలిశారు. ఆయనతో ఏం మాట్లాడారు అన్నది సస్పెన్సే! అయితే, రానున్న ఎన్నికల్లో అన్ని దిక్కుల్లోంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండటంతో అమిత్ షా ఈ మధ్య చాలా మంది ప్రముఖుల్నే కలుస్తున్నారు. వారిని తమకు మద్దతు తెలపమని కోరుతున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా కూడా అమిత్ షాతో బేటీ అయ్యారట. కానీ, ఇవన్నిటికంటే కీలకమైన వ్యాఖ్యలు అమిత్ షా హైద్రాబాద్ వదిలి వెళ్లాక వచ్చాయి. పైగా అవి కేంద్రంలోని ఓ మంత్రి చేశారు. ఆయన బీజేపీ వాడు కాకపోవటమే ఇక్కడ ట్విస్ట్!   మహారాష్ట్రకు చెందిన రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్ దాస్ అథావలే. ఆయన ఎన్డీఏలో భాగంగా కేంద్రంలో మంత్రిగా వున్నారు. ఆయన తాజా వ్యాఖ్యల్లో విస్పష్టంగా జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అలా వస్తే తాము జగన్ ని ఏపీ సీఎం చేసేందుకు కూడా సహకరిస్తామన్నారు! ఇక్కడ తాము అంటే ఎవరో రామ్ దాస్ అథావలే చెప్పలేదు. మహాలో చాలా చిన్న పార్టీ అయిన రిపబ్లిక్ పార్టీ సహకారంతో జగన్ సీఎం అవుతారా? కాదు! అంటే, అథావలే మాట్లాడుతున్నది మోదీ, అమిత్ షాల గురించేననుకోవాలి! వారి సహకారంతో జగన్ సీఎం అవ్వొచ్చునని చెప్పటం… తీవ్రమైన పరిణామామే! ఇంత బహిరంగంగా జగన్ ను తమ కూటమిలోకి రమ్మనటం 2019 ఎన్నికల ఫీవర్ కారణంగానే అనుకోవచ్చు!     చంద్రబాబు ఎన్డీఏ నుంచీ వెళ్లిపోతే నితీష్ వచ్చాడని షా అన్నారు ఈ మద్య! అదే సమయంలో కేంద్రంలోని మంత్రి జగన్ ను రమ్మంటున్నారు. సీఎం చేస్తామంటున్నారు. అంటే, చంద్రబాబు లేని లోటు జగన్ చేరికతో పూడ్చుకోవాలని కమలం పెద్దలు డిసైడ్ అయిపోయారా? ఇంచుమించూ అదే అనుకోవాలి! కానీ, ఈ బంపరాఫర్ కి జగన్ ఎలా స్పందిస్తారు? ఇప్పటికే టీడీపీ జగన్ని, విజయసాయిరెడ్డిని మోదీ మనుషులంటూ ప్రచారం చేస్తోంది. అలాగే, ప్రత్యేక హోదా ఇవ్వని హిందూత్వ పార్టీతో జగన్ చేతులు కలిపితే ఆంద్రా ప్రజలు , ముఖ్యంగా, మైనార్టీలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? టీడీపీ క్యాష్ చేసుకోకుండా వుంటుందా? జగన్ ను వెనక్కి పట్టి వుంచే ప్రశ్నలు ఇవే!     జగన్ కు రాజకీయంగా కొంత డ్యామేజ్ వున్నా రిస్క్ చేసి ఎన్డీఏలో చేరతాడనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన మీద వున్న కేసులే ఇందుకు కారణం అవుతాయని వారి అంచన. మోదీ, షా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వైసీపీని లొంగదీసుకోవచ్చిన అనుమానిస్తున్నారు! చూడాలి మరి… జగన్ ఎన్డీఏలో చేరితే… అది చంద్రబాబుకి, టీడీపికి పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది!

నిందలు మోపిన ఏపీ బీజేపి! నితిన్ పొగడ్తల వర్షం!

ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపికి ఓ చిక్కు సమస్య వచ్చిపడుతోంది. ఒక్కసారి కాదు. పదే పదే వస్తోంది! అదేంటంటే… రాష్ట్ర బీజేపి నాయకులు కేసీఆర్ ని ఎడాపెడా విమర్శిస్తారు. ఆయన పాలన, పథకాలు దండగంటారు. కానీ, అంతలోనే కేంద్ర మంత్రులో, బీజేపీ పెద్దలో తెలంగాణకి వచ్చి సీఎం భేష్ అంటారు. పథకాలు సూపర్ అంటారు! ఇంకేముంది, టీ బీజేపీ నాయకులది కుడితిలో పడ్డ వ్యవహారం అవుతుంది! అయితే, తాజాగా ఏపీ బీజేపీ నాయకులకి కూడా పరిస్థితి అలాగే తయారైంది.     చంద్రబాబు నాలుగేళ్లు కమలంతో చెలిమి చేసినప్పుడు ఏపీ బీజేపీ నాయకులకి పెద్ద ఇబ్బందులు వుండేవి కావు. చంద్రబాబుని మిత్ర ధర్మంతో విమర్శించే వారు కాదు. జగన్ ను కూడా ఏమంత పెద్దగా టార్గెట్ చేయకుండానే బండి లాగించేసే వారు. కానీ, ప్రత్యేక హోదా విషయంలో బాబు సీరియస్ అయ్యాక పరిస్థితి తలకిందులైంది. రాత్రింబవళ్లూ టీడీపీని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకే, పూర్తి స్థాయిలో సోము వీర్రాజు లాంటి వారు బాబు మీద నోరు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కూడా రోజుకో ప్రెస్ మీట్ తో విరుచుకుపడుతున్నాడు. అయితే, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదన్న చంబ్రాబాబు ప్రశ్నకి ఎవరి వద్దా సమాధానం లేదు. అది పక్కన పెడితే… ఎలాగో మాటల గారడి చేసి ఏపీ సీఎంను ఇరుకున పెట్టినా… బీజేపీ పార్టీ అగ్రనేతలే రాష్ట్ర పార్టీ నాయకుల విమర్శలపై నీళ్లు చల్లుతున్నారు!     ఆంధ్రాలో పర్యటించిన నితిన్ గడ్కరీ చాలా వరకూ పాజిటివ్ కామెంట్సే చేశారు. భారీ నీటి పారుదల శాఖా మంత్రి అయిన ఆయన పోలవరం ప్రత్యక్షంగా సందర్శించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత విశాఖలోనూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, వీటన్నటిలో ఏపీ బీజేపీ నాయకులకి పచ్చి వెలక్కాయల పరిణమించిన కామెంట్స్ … చంద్రబాబు గురించి నితిన్ గడ్కరీ అన్న మాటలే! గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేసిన నితిన్ గడ్కరీ కేవలం మంత్రిగా మాట్లాడేస్తారని అనుకోలేం. కానీ, ఆయన ఎంతో రాజకీయ అనుభవం వున్నప్పటికీ చంద్రబాబుని నిజాయితీగా మెచ్చుకున్నారు. ఆయన విజనరీ అంటూ కితాబునిచ్చారు. పోలవరం విషయంలో బాబు పడుతోన్న తపన చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న రచ్చ తెలియకుండానే చేసి వుంటారా? అస్సలు కాదు. టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో నేరుగా మోదీనే కారకుడ్ని చేస్తోందని తెలిసినా నితిన్ బాబుని మెచ్చుకున్నారు! ఇప్పుడు ఇదే ఏపీ బీజేపీ నాయకులకి మైండ్స్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది! తాము నిత్యం విమర్శిస్తోన్న అధికార పక్షాన్ని, సీఎంని తమ జాతీయ నేత, కేంద్ర మంత్రి పొగడ్తల్లో ముంచెత్తటం ఎవ్వరికీ జీర్ణం కావటం లేదు!     ఒకవైపు రాష్ట్ర నేతలతో తిట్టిస్తూ మరో వైపు జాతీయ నేతలతో పొగిడిస్తూ మోదీ, అమిత్ షా విచిత్ర రాజకీయమే నడిపిస్తున్నారు. దీని వల్ల చంద్రాబుకి వచ్చే నష్టమేం లేకున్నా ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఇరుకున పడుతున్నారు!

కేసీఆర్ తో కయ్యమా? వియ్యమా? తేల్చుకోలేకపోతోన్న టీ బీజేపీ!

అమిత్ షా మరోసారి తెలంగాణకి వచ్చారు! హైద్రాబాద్ లో ఒక్క రోజు పాటూ బిజి బిజీ పర్యటన చేస్తున్నారు. అసలు ఇంత హడావిడి టూర్ తో ఆయన ఏం ఆశిస్తున్నారు? ఇదే ఇప్పుడు పెద్దగా సమాధానాలు చిక్కని ప్రశ్న!     ఏ పార్టీ అయినా తమ ప్రభుత్వం ఏర్పడాలనే పావులు కదుపుతూ వుంటుంది. కానీ, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు అసాధ్యం. అంత బలహీనంగా వుంది పార్టీ పరిస్థితి. త్రిపురలో ఒక్క సర్పంచ్ కూడా లేకున్నా అధికారం చేపట్టామని బీజేపీ అభిమానులు వాదించవచ్చు. అయినా కూడా త్రిపుర, తెలంగాణ ఒక్కటి కాదు. ఇక్కడ టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ బలంగా వుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా గట్టిగానే వుంది. ఇక మూడో స్థానానికి టీటీడీపీ, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో బీజేపీ పోటీ పడాల్సి వుంది. ఇటువంటి స్థితిలో కమలదళానికి మరో ఇబ్బందికర అంశం కూడా తెలంగాణలో వుంది!     అమిత్ షా గతంలో ఒకసారి తెలంగాణ పర్యటన చేసినప్పుడు కేసీఆర్ పైన ఘాటు విమర్శలే చేశారు. అందుకు ప్రతిగా స్వయంగా తెలంగాణ సీఎం ప్రతి దాడి చేశారు. కానీ, తరువాత రకరకాల సందర్భాల్లో పలువురు కేంద్ర మంత్రులు గులాబీ సర్కార్ ని మెచ్చుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ పథకాల్ని బీజేపీ అగ్రనేతలు చాలా సందర్భాల్లో అభినందిస్తున్నారు. వీలైతే తమ పరిధిలో కాపీ చేస్తున్నారు కూడా! ఇదంతా చూస్తే … అసలు ఎన్డీఏలో లేనేలేని టీఆర్ఎస్ పట్లే దిల్లీ నేతల వైఖరి అనుకూలంగా వుంది. నాలుగేళ్లు కలిసున్న టీడీపీతో మాత్రం ఉప్పు నిప్పులా వుంది. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ పై ఎందుకు మోదీ బృందం సానుకూలంగా వుంటోంది? రానున్న ఎన్నికల్లో మోదీకి ఎంపీలు తక్కువ పడితే ఆదుకునే ఎన్డీఏ యేతర పార్టీల్లో ప్రధానమైనవి టీఆర్ఎస్, వైసీపీలే. పోలింగ్ కి ముందు కాకున్నా తరువాతైనా కేసీఆర్, జగన్ మోదీకి అండగా నిలుస్తారని కమలదళం భావిస్తోంది. అందుకే, కేంద్ర మంత్రులు వీలైనప్పుడల్లా తెలంగాణ రథసారథని పొగిడేస్తూ వస్తున్నారు. కానీ, ఇదే తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారింది!     తమ పార్టీ నేతలే కేసీఆర్ పథకాల్ని మెచ్చుకుంటూ వుంటే టీ బీజేపీ నాయకులకి ఎలా విమర్శలు చేయాలో తెలియని గందరగోళం ఏర్పడుతోంద. అలాగని, తెలంగాణలో ప్రతిపక్షానికే పరిమితం అయిన కాంగ్రెస్ ని కూడా వారు ఏమంత టార్గెట్ చేయలేరు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఏమనకుండా జనంలోకి ఎలా వెళ్లాల్లో తెలంగాణ బీజీపీకి అర్థం కావటం లేదు. ఈ డైలామా కారణంగానే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల అసతంతృప్తిగా వున్న నేతలు సైతం కాషాయ కండువా కప్పుకోవటం లేదు. అసలు ఏ మాత్రం దిశా, దశా లేకుండా సాగుతోంది టీ బీజేపి! అంతా అయోమయంగా వున్న వేళ తెలంగాణలో కాలుమోపిన అమిత్ షా ఏం చేయనున్నారు? పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేసి హిందూత్వవాదుల వ్యతిరేకతకి కారణమైన కేసీఆర్ పై ముప్పేట దాడి చేయమని తన పార్టీ వారికి చెబుతారా? లేక ఎన్నికల ఫలితాల తరువాత మోదీ ప్రధాని అయ్యేందుకు కేసీఆర్ ఉపయోగపడతారని మెతక వైఖరి ప్రదర్శించమంటారా? ఇదే ఇప్పుడు తేలాల్సింది. అమిత్ షా ఇచ్చే ఆజ్ఞాలపైనే తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఆధారపడనుంది!   

కుల వివాదాలు పెరుగుతున్నాయి… కులం బలహీనపడుతోంది!

మామూలుగానే మన దేశంలో కులం అంటే అందరూ అలెర్ట్ అవుతారు. వందలాది ఏళ్లుగా వున్న కులం స్వతంత్రం వచ్చాక కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికలు వస్తే మరింత మసాలా దట్టించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ నాయకులు కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. పార్టీలు అభ్యర్థుల కులాలు చూసే సీట్లు ఇస్తుంటాయి. చివరకు, పోలింగ్ రోజున ఓటర్లు కూడా కులం ఆధారంగానే తీర్పునిస్తుంటారు! ఇంత వ్యవహారం వుంది కాబట్టే కులం ఎప్పుడూ హాట్ టాపిక్కే! కానీ, తాజాగా జరిగిన ఓ సర్వే ఇండియాలో ఆవిష్కృతం అవుతోన్న కొత్త కోణం బయటపెట్టింది!     కులం పుట్టినప్పటి నుంచీ చచ్చేదాకా చాలా ముఖ్యమే. చదువులో, ఉద్యోగంలో అంతటా కీలకమే. కానీ, పెళ్లి విషయానికి వచ్చే సరికి కులం మరింత ప్రాముఖ్యత వహిస్తుంది. వేరు వేరు కులాల వారు పెళ్లి చేసుకుంటే ఎంత రచ్చవుతుంటుందో మనం చూస్తూనే వుంటాం. పరువు హత్యల దాకా వెళుతుంటాయి కేసులు. కానీ, ఒకవైపు ఇంత కుల మౌఢ్యం వున్నా కూడా మరో వైపు ఆధునిక భారతదేశం కులాన్ని లైట్ తీసుకుంటోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇన్ షార్ట్ అనే యాప్ వారు నిర్వహించిన సర్వే ఫలితాలే!     ఈ ఆన్ లైన్ సర్వేలో ఒకరిద్దరు కాదు… ఏకంగా 1.3లక్షల మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అవేంటో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతీ 10 మందిలో 8 మంది తమకు కులాంతర వివాహం ఓకే అని చెప్పారట! 70 శాతం అబ్బాయిలు పెళ్లయ్యాక అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోకున్నా ఫర్వాలేదు అన్నారట! ఇక ఎప్పుడూ అమ్మాయిల మీద జోకులేస్తూ… వాళ్లు బాగా డబ్బున్న అబ్బాయిలకి పడిపోతారని అంటూ వుంటారు. కానీ, ఈ సర్వే అది నిజం కాదని తేల్చింది. సర్వేలో పాల్గొన్న అమ్మాయిల్లో 84 శాతం మంది అబ్బాయి తమ కంటే ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదని అన్నారట! ఇంకో విస్తుగొలిపే విషయం ఏంటంటే… నిన్న మొన్నటి దాకా వరకట్నం కోసం తహతహలాడిన అబ్బాయిలు ఇప్పుడు రూటు మార్చారు. కట్నం కాదు… పెళ్లి ఖర్చులు అమ్మాయి తరుఫు వారికి తగ్గించేందుకు సై అంటున్నారట! 90 శాతం అబ్బాయిలు వధువు తరుఫు వారికి పెళ్లి ఖర్చులు తగ్గిస్తామనీ, అవసరం అయితే తమ వంతుగా కొంత భరిస్తామనీ అన్నారట!     ఒక సర్వేలో ఇలాంటి అభిప్రాయాలు వస్తే దేశం మారిపోయినట్టు కాదు. అది అంగీకరించాల్సిన విషయమే. కానీ, అదే సమయంలో ఈ ఫలితాలు క్రమంగా పొడచూపుతున్న మార్పుకి మాత్రం ఖచ్చితంగా సంకేతమే! కులం రాజకీయాల్లో, మీడియా చర్చల్లో పెద్ద ఇంపార్టెంట్ గొడవగా కనిపించినా… ఆధునిక కార్పొరేట్ యువత రాను రాను లైట్ తీసుకుంటున్నారు. పెళ్లి విషయంలో కూడా పట్టింపుల కంటే సర్దుకుపోవటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి పాజిటివ్ ధోరణుల్ని ప్రభుత్వాలు, మీడియా, మేధావులు ఎంకరేజ్ చేయాలి. కానీ, దురదృష్టవశాత్తూ మన సమాజంలో రెచ్చగొట్టి పది మంది దృష్టి ఆకర్షించే వారు ఎక్కువవుతున్నారు.

పవన్ ఇమేజ్‌కు రేణు డ్యామేజ్ తప్పదా?

రాజకీయాల్లోకి దూకిన గబ్బర్ సింగ్ ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. ఉత్తరాంధ్రలో తనదైన రాజకీయం చేస్తున్నాడు. యాత్ర చేస్తూ జనంతో మమేకం అవుతున్నాడు. దీని తరువాత ఆంధ్రలో మరిన్ని చోట్ల జనసేనాని కవాతు కొనసాగనుంది. అయితే, తీరా ఎన్నికల వేళ పోలింగ్ నాడు పవన్ ప్రభావం ఎంత వుంటుంది? ఇది చెప్పటం కష్టమే. ఎందుకంటే, పవన్ డ్యామేజ్ టీడీపీ, వైసీపీలకు ఎంత వుంటుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడ్డది. అసలు వుంటుందా అనే అనుమానం వ్యక్తం చేసేవారూ లేకపోలేదు!     వచ్చే ఎన్నికల్లో జనసేన ఫలితాలు ఎలా వున్నా ఇప్పుడు మాత్రం పవన్ చుట్టూ వివాదాలు బాగానే ముసురుకుంటున్నాయి. రాజకీయాల్లోకి రావటం, అందులోనూ ఒక పార్టీ పెట్టి స్వంతంగా రణరంగంలోకి దిగటం మామూలు విషయం కాదు. ఇదే అదనుగా గత తప్పిదాలు, పొరపాట్లు అన్నీ బయటకు వస్తాయి. అదే జరుగుతోంది పవర్ స్టార్ విషయంలో కూడా! ఆయన గురించి ఏదైనా ఆరోపణ చేయాల్సి వస్తే ముఖ్యంగా వ్యక్తిగత జీవితమే ఈజీ టార్గెట్ అవుతుంటుంది. అందులోనూ ఆయన మూడు పెళ్లిల్లు ఎప్పుడూ వివాదాస్పదమే. విమర్శలకు కారణమే! ఎన్నికల ఫీవర్ మొదలైన ప్రస్తుత తరుణంలో కూడా మరోసారి ఆయన ట్రిపుల్ మ్యారెజెస్ తిప్పలు తెచ్చిపెట్టేలా వున్నాయి!     పవన్ రెండో భార్య రేణు దేశాయ్ చాలా కాలం సైలెంట్ గానే వున్నారు. కానీ, వున్నట్టుండీ ఈ మధ్య కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు. ఆమెను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం అసలు గొడవకి కారణం. అయితే, ఇదంతా పాత సంగతే. కానీ, ఈ మద్యే ఎంగేజ్ మెంట్ చేసుకుని రెండో పెళ్లికి సిద్ధమైన రేణు గతంలో ఎప్పుడూ బయటపెట్టని సంగతులు బయటపెట్టి పవన్ ను డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. పవన్, రేణు విడిపోవటం నిజానికి పెద్ద వివాదమేం కాదు. వారు బాహాటంగానే విడిపోయారు. డైవోర్స్ కూడా తీసేసుకున్నారు. కానీ, సమస్యంతా ఇప్పుడు ఆమె పవన్ మూడో భార్య మొదటి సంతానం గురించి చెప్పటంతోనే మొదలైంది.     పవన్ ని బాగా విమర్శిస్తూ, టీడీపీకి అనూకులంగా గొంతు వినిపించే ఓ ఛానల్లో రేణు తన బాధ వెళ్లగక్కారు. తనకి విడాకులు కూడా ఇవ్వకుండానే పవన్ మరో స్త్రీతో బిడ్డకు తండ్రయ్యాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇది నిజంగా కొంత డ్యామేజింగ్ అంశమే! దానిపై యధావిధిగా సోషల్ మీడియాలో రచ్చ జరగటంతో తాజాగా రేణు దేశాయ్ పీఆర్ టీమ్ మరిన్ని వివరాలు బయటపెట్టింది. డేట్లతో సహా పవన్ తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేసింది!     2012 మార్చ్ 13న పవన్ మూడో భార్య లెజోనోవాకి పొలెనా పుట్టిందని ఫేస్బుక్ లో చెప్పిన రేణు పీఆర్ టీమ్… మార్చ్ 16న పవన్, రేణుల విడాకులు జరిగాయని గుర్తు చేసింది! అంటే, అంతకు ముందు సంవత్సర కాలం రేణు భార్యగా వుండగానే లెజోనోవా గర్భవతిగా వుందన్నమాట. ఇలా ఒకరితో చట్టబద్ధమైన వైవాహిక బంధంలోవుంటూ మరొకరితోనూ రిలేషన్ షిప్ మెయింటైన్ చేయటం… తప్పు, నేరమూ కూడా అవుతుంది! ఈ విషయంలో రేణు వ్యక్తిగతంగా పవన్ ను ఇప్పుడేం అనకపోయినా…. అదును చూసి విషయం బయటపెట్టడం… కాస్త ఆసక్తికరం, ఆందోళనకరమే! ఎన్నికలకి ముందు ఇలాంటి విషయాలు పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయనే చెప్పాలి. మరి ఓట్ల రూపంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే!

కాశ్మీర్‌పై మోదీ సరికొత్త వ్యూహం… అసలుకే మోసమా?  

దేశంలో చాలా చోట్ల వలస రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పార్టీ నుంచీ గెలిచి మరో పార్టీలోకి దూకేవారు మరీ ఎక్కువైపోతున్నారు. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపేం కాదు. అయితే, దేశాన్ని ఏలుతోన్న బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు. ఎంపీల విషయంలో బేరసారాలు చేసే అవసరం మోదీ సర్కార్ కు లేదు. కానీ, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల విషయంలో చాలా చోట్ల ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూనే వున్నాయి. దక్షిణాదిలో తమిళనాడులో, కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు ఓ రేంజ్లో నడవటం మనం చూశాం. అయితే, ఉత్తరాదిలోనూ కమలం జంప్ జిలానీలతో రాజకీయం రక్తి కట్టిస్తోంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీశారు అమిత్ షా. ఎన్నికలకు ముందు తరువాత అన్న భేదం లేకుండా వలలు వేసి పట్టేశారు. తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అయితే అధికారంలో వున్న కాంగ్రెస్ ని అమాంతం కూల్చేశారు! ఇక ఇప్పుడు ఇదే అమిత్ షా మార్కు రాజకీయం వివాదాస్పద జమ్మూ కాశ్మీర్ కు మారటంతో అందరి దృష్టి పార్టీ ఫిరాయింపు పాలిటిక్స్ పై పడింది!     కాశ్మీర్ దేశంలోనే అత్యంత సున్నితమైన సమస్యాత్మక రాష్ట్రం. దానితో పదే పదే మన కేంద్ర ప్రభుత్వాలు తప్పుగా వవ్యహరించి సమస్య మరింత జటిలం చేస్తూ వచ్చాయి. గతంలో అనేక సార్లు కాశ్మీర్ అంశంతో కాంగ్రెస్ ఆటలాడింది. ఇప్పుడు బీజేపీ సర్కార్ కూడా వివాదాస్పద ధోరణి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. చివరకు దీని ఫలితం మంచా? చెడా? తెలియని విధంగా పరిస్థితి నెలకొంటోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన ఘాటు కామెంట్ అందుకు నిదర్శనం! దిల్లీ పెద్దలు పీడీపీ పార్టీని చీల్చాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ముఫ్తీ హెచ్చరించారు. ఇందుకు కారణం పీడీపీలోని అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో రామ్ మాధవ్ లాంటి బీజేపీ నేతలు టచ్ లో వుండటమే. ఈ మధ్యే పొత్తుకు స్వస్తి చెప్పి ప్రభుత్వాన్ని కూల్చిన కమలదళం ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. మెహబూబా ముఫ్తీ పార్టీని చీల్చి తమ స్వంత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. అదే జరిగితే పీడీపీ ఇక చరిత్రలో కలిసిపోవాల్సిందే. అందుకే, తాము హింసకైనా సిద్దమన్నట్టు మాట్లాడుతోంది మెహబూబా.     దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తమ ప్రభుత్వాలు వుండాలనుకోవటం వేరు. కాశ్మీర్ విషయంలోనూ అదే నీతి ప్రద్రర్శించటం వేరు. ఎందుకంటే, సమస్యాత్మకంగా వున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో బేరాసారాలు నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జనం రెచ్చిపోయే ప్రమాదం వుంది. వేర్పాటు వాదులు మరింత రెచ్చగొట్టే అవకాశమూ వుంది. ఇక పాకిస్తాన్ ఎలాగూ గోతి కాడి నక్కలా చూస్తూనే వుంటుంది. కాబట్టి ప్రస్తుతం గవర్నర్ పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అదే కొనసాగించి సాధ్యమైనంత త్వరగా జమ్మూ కాశ్మర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా గోడ దూకిన ఎమ్మెల్యేలతో సర్కార్ ఏర్పాటు చేస్తే నిత్యం రాష్ట్రమంతా గందరగోళం నెలకొనవచ్చు. దాని పై సరైన అంచనా వుండాల్సిందే! కొందరి అభిప్రాయం ప్రకారం బీజేపీ పీడీపీ పార్టీని చీల్చి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కారణం… ఆర్టికల్ 370 నిర్మూలనట! రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేనిదే ఆ ఆర్టికల్ తీసేయటం కుదరదు. కాబట్టి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీర్మానం చేయించి ఆర్టికల్ 370 తొలగిద్దామని మోదీ ఆలోచిస్తున్నారట. ఇది హర్షించదగిని వ్యూహమే అయినా సులవైంది మాత్రం కాదు. ప్రజా వ్యతిరేకత, దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ఉగ్రవాదులు పెను సవాళ్లు అయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మోదీ ఏం చేసినా ఆచితూచి చేయాలి. లేదంటే లాభం కంటే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదముంది. పైగా పాకిస్తాన్ ఈ వ్యవహారమంతా అంతర్జాతీయంగా తనకు అనుకూలం చేసుకునే వీలు కూడా వుంది!

కేటుగాడు.. కోట్లు కొట్టేసాడు.

  'మేడి పండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు' అన్నట్టుగా.. ఓ వ్యక్తి ఉన్నాడు.. మెడలో భారీ గోల్డ్ చైన్, చేతికి బ్రాస్ లెట్, అన్ని వేళ్లకు ఉంగరాలు, వంటిమీద ఖద్దరు డ్రెస్, తిరగడానికి ఖరీదైన కార్లు.. అబ్బో, అతను పైకి చూడటానికి అంబానీలా కనిపిస్తాడు.. కానీ లోపల ఒరిజినల్ క్యారక్టర్ పెద్ద మోసగాడు, కేటుగాడు.. అతనే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నైనాల చంద్రశేఖర్‌.. ఒకప్పుడు గ్రానైట్‌ కంపెనీల వద్ద లారీ డ్రైవర్‌ గా పనిచేసిన ఇతను.. తరువాత గ్రానైట్ కంపెనీ కొనే స్థాయికి ఎదిగాడు.. అతను ఆ స్థాయికి చేరడానికి కష్టాన్ని నమ్ముకోలేదు మోసాన్ని నమ్ముకున్నాడు.. డ్రైవర్ గా పనిచేసేటప్పుడు లారీలో గ్రానైట్‌ లోడుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. దొంగ బండ్లు కొని, అమ్మే అక్కడి ముఠాలతో పరిచయం ఏర్పడింది.. ఆ ముఠాలతో కలిసి జేసీబీలను కాజేసి అమ్మడం చేసేవాడు.. వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి, వాటిని ఆర్‌టీఏ కార్యాలయంలో అందజేసి సుమారు రూ.లక్ష వరకు రోడ్డు ట్యాక్స్‌ చెల్లించి స్థానిక రిజిస్ట్రేషన్‌ పొందేవాడు.. ఆ తరువాత ఆ వాహనం అమ్మేసేవాడు.. తర్వాతర్వాత ఆ మోసాన్ని కార్లు, జీపులకు కూడా విస్తరించాడు.. ఇలా చూస్తుండగానే కోట్ల రూపాయల సొమ్ము వెనుకేసుకొన్నాడు.. ఏడాది తిరిగేసరికి ఒక గ్రానైట్‌ కంపెనీనే కొనేసే స్థాయికి ఎదిగిపోయాడు.. 2015లో తన భార్య అపర్ణ పేరిట చీమకుర్తిలో ఒక కంపెనీ ఏర్పాటుచేశాడు.. ఒంగోలులో రెండు కోట్లు పెట్టి ఒక ఇల్లు కూడా కట్టాడు. మరి చంద్రశేఖర్ కి కొన్నాళ్ళకు ఇలా వాహనాలు కొట్టేయడం అమ్మడం బోర్ కొట్టిందేమో.. కొత్త తరహా మోసం మొదలు పెట్టాడు.. ముందుగా షోరూమ్ కు వెళ్లి ఓ ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తాడు.. ఆ తరువాత ఆ వాహనంపై ఏదో ఒక ఫైనాన్స్‌ సంస్థ నుంచి రుణం తీసుకుంటాడు.. అయితే దొంగ పత్రాల సృష్టి అనుభవంతో దానిపై అప్పు తీర్చకుండానే, అంతా డబ్బు కట్టేసినట్టు ఓ నకిలీ ఎన్‌వోసీ సృష్టిస్తాడు.. ఆ పత్రాలు ఆర్‌టీఏ కార్యాలయంలో చూపించి, దానికి క్లియరెన్స్‌ పొందుతాడు.. తిరిగి అవే పత్రాలతో మరో ఫైనాన్స్‌ సంస్థను సంప్రదించి, అక్కడ నుంచి మరోసారి రుణం పొందుతాడు.. ఇలా మూడు నాలుగు సంస్థల నుండి రుణాలు పొందుతాడు.. అతనికి కోట్ల రూపాయల డబ్బు వచ్చిపడుతుంది.. ఇదంతా ఓ సినిమా కథని తలపిస్తుంది కదా.. సముద్రమంతా ఈది ఇంటిముందు మురికి కాలువలో పడి చనిపోయినట్టు.. చంద్రశేఖర్ కూడా మోసాలు చేస్తూ కోట్లు సంపాదించి, చివరికి చిక్కాడు.. చంద్రశేఖర్ ఇటీవల గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి 30 లక్షలకు రెండు ఇన్నోవా కార్లను అమ్మాడు.. అమ్మేటప్పుడు ఈ వాహనాలకు రిజిష్ట్రేషన్‌ తో సహా అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయని చెప్పాడు.. అయితే ఎన్నిరోజులైనా క్లియరెన్స్‌ డాక్యుమెంట్లు ఇవ్వకపోతుండటంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది.. దీంతో నేరుగా ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అనుకోకుండా ఇతగాడు చేస్తున్న మోసం బయటపడింది.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు.