రామోజీతో కన్నా భేటీ.. టీడీపీతో రాజీ కోసమేనా?

  రామోజీ రావు .. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఈనాడు సంస్థల అధినేతగా ప్రజలకు దగ్గరైన రామోజీ.. రాజకీయాలకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు.. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది రాజకీయ ప్రముఖులు ఆయన్ని కలుస్తుంటారు.. ఎంతమంది కలిసినా, ఎవరేం అనుకున్నా ఆయన తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తారని అందరికి తెలిసిందే.. మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న బీజేపీ, టీడీపీ.. ఇప్పుడు విడిపోయి ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నసంగతి తెలిసిందే.. ఈ టైంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, రామోజీతో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది.. రామోజీకి, కన్నాతో అంతగా సాన్నిహిత్యం లేదు.. అయినా కన్నా ఇలా సడెన్ గా రామోజీతో భేటీ అవ్వడంతో.. టీడీపీ తో రాజీ కుదుర్చుకోడానికి, బీజేపీ పంపిన రాయభారం అయ్యుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఈ మధ్య బీజేపీ నేతలు టీడీపీ మీద, చంద్రబాబు మీద ఆరోపణలు, విమర్శలు బాగా చేస్తున్నారు.. దీనికి జవాబుగా కేంద్రం చేసిన రెండు భారీ స్కాములను సాక్షాలతో సహా బయట పెడతామంటూ టీడీపీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.. ఇదే కన్నా, రామోజీల భేటీకి పునాది వేసింది అంటున్నారు.. ఈ టైంలో స్కాములు బయటపడితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.. అందుకే బీజేపీ పెద్దలు టీడీపీ తో సత్సంబంధాలున్నా రామోజీతో, కన్నాని భేటీకి పంపారంట.. ఇదంతా చూస్తుంటే స్కాముల బాంబు బీజేపీకి గట్టిగానే తగిలినట్టు కనిపిస్తుంది...

ఆత్మహత్యలకు కారణం మనమే!

  హత్యలు, ఆత్మహత్యల వార్తలు ఎప్పుడూ వినిపించేవే. కానీ అవి ఇంకా ప్రపంచాన్ని చూడాల్సిన కుర్రవాళ్లవి అయితే బాధాకరం. నవ్వుతూ తుళ్లుతూ సాగే సెలయేరు కాస్తా ఒక్కసారిగా మాయమైపోవడం ఎంత దారుణం! కానీ ఏ దిష్టి తగిలిందో కానీ ఈ వారం ఏ రోజు ఏ పేపరు చూసినా ఇలాంటి వార్తలే కనిపిస్తున్నాయి. - ఆలస్యంగా పరీక్ష హాలుకి వెళ్లినందుకు పరీక్ష రాయలేక ఓ 28 ఏళ్ల యువకుడు దిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. - హైదరాబాదుకి చెందిన 18 ఏళ్ల జస్లీన్‌ కౌర్‌ నీట్‌ పరీక్ష సరిగా రాయనందుకు పదంతస్తుల మీద నుంచి దూకి చనిపోయింది. - తమిళనాడులో ప్రతిభ, శుభశ్రీ అనే ఇద్దరు అమ్మాయిలు నీట్‌లో ఉత్తీర్ణత రానందుకు తనువు చాలించారు. ఏదో ఉదాహరణగా చెప్పుకోవాలి కాబట్టి పై మూడు సందర్భాలూ చెప్పుకొన్నాం. కానీ చెప్పుకొనేందుకు స్థలం చాలని వార్తలెన్నో. ఏదన్నా పరీక్ష ఫలితాలు వస్తున్నాయంటే ఇంతకుముందు ఓ పండుగ వాతావరణం కనిపించేంది. పాసయ్యేవాళ్లు సంతోషించేవాళ్లు, ఫెయిల్‌ అయ్యేవాళ్లు ఓ రెండ్రోజులు బాధపడి ప్రత్నామ్నాయం దిశగా సాగిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్ని ఆత్మహత్యల వార్తలు వినాలో అని భయపడాల్సి వస్తోంది. ఇంత దరిద్రపుగొట్టు పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే- దానికి కారణం మన విద్యావ్యవస్థే అని చెప్పుకోవడంలో సంకోచించాల్సిన అవసరం లేదు. పిల్లల్ని విచక్షణ కలిగిన మనుషులుగా తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ వాళ్లని పందెంకోళ్లుగా దిగజారుస్తోంది. కార్పొరేట్‌ సంస్థల సంతల్లో పిల్లలు బలిపశువులుగా మారిపోతున్నారు. చాలామంది ఇదంతా కేవలం ప్రైవేట్‌ స్కూళ్ల వల్లే జరుగుతున్న అనర్థం అంటారు. ఒకరకంగా నిజమే కావచ్చు. ఫలితాల మర్నాడు టీవీలలో వినిపించే అరుపులూ, పేపర్లలో మొదటి పేజీలలో కనిపించే మెరుపులూ... ర్యాంకుల కోసం రోడ్డున పడి మరీ కొట్టుకునే వివాదాలూ చూసి కార్పొరేట్‌ సంస్థల సంస్కారం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ బలుపుకి బలాన్నిస్తోంది మాత్రం తల్లిదండ్రులే! ఇప్పుడు పిల్లల ర్యాంకులు ఓ స్టేటస్‌, వాళ్లు చటుక్కున ఎంట్రెన్సులలో పాసైపోయి క్యాంపస్ ఇంటర్వ్యూలలో లక్షల జీతానికి కుదురుకుంటేనే సమర్థత, అమెరికాలో గ్రీన్‌కార్డు సంపాదించుకుంటే వంశోద్ధరణ! తెలుగువారిలోనే ఈ తరహా జాడ్యం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దేశంలో ఎక్కడా కనిపించని విధంగా తెలుగుగడ్డ మీద కార్పొరేట్‌ సంస్థలు వీరంగం వేస్తుంటాయి. మార్కులు, ఎంట్రెన్సులకి సంబంధించిన వార్తలలో తెలుగు పేర్లే వినిపిస్తుంటాయి. మరి ఇతర రంగాల మాటో అంతరిక్ష పరిశోధన, సాహిత్యం, సంగీతం, రాజకీయం, సమాజసేవ, వ్యాపారం... ఇలాంటి రంగాలలో మనం కనిపించమే! ఈ ఒక్క ప్రశ్న చాలు, మన ప్రాధాన్యతలు ఏమిటో తెలియడానికి. మన సామర్థ్యాన్ని మార్కులతోను, భవిష్యత్తుని ఎంట్రెన్సులతోను కొలుస్తున్నప్పుడు యువతకి చదువే ‘ప్రాణం’ అన్న భ్రాంతి కలగడంలో తప్పేముంది. అలాగని పిల్లలలో చదువు పట్ల విముఖత కలిగించాలని కాదు. చదువు జీవితంలో ఓ ముఖ్యభాగమే కానీ, చదువే జీవితం కాదని తెలియచెప్పాలి; పిల్లవాడిలో అనూహ్యమైన ఆసక్తులు ఉంటే, వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి; ఆరోగ్యవంతమైన అలవాట్లకీ, ఆటపాటలకీ అవకాశం ఇవ్వాలి; చదువులో వెనకబడినప్పుడు కారణాలు తెలుసుకోవాలి; మార్కులు తక్కువగా వస్తే ప్రత్యామ్నాయాలను సూచించాలి. అన్నింటికీ మించి పిల్లవాడిలో జీవితం పట్ల నిబ్బరాన్నీ, గమ్యం పట్ల స్పష్టతనీ అలవర్చుకునేలా చేయాలి. అప్పుడు పిల్లవాడు ఎప్పుడ్నా పరీక్షలో తప్పుతాడేమో కానీ, జీవితంలో మాత్రం తప్పడు. ఇవేవీ ఎరగని పిల్లవాడు ఎన్ని మార్కులు సాధించినా.... జీవితంలో మాత్రం అరకొర మార్కులతోనే మిగిలిపోతాడు. ఇప్పుడు ఎంపిక మన చేతుల్లోనే ఉంది- పరీక్షా? జీవితమా? ఏది ముఖ్యం!

బాబు చేతిలో బీజేపీ స్కాములు

  చంద్రబాబు రాజకీయ దిట్ట.. ఆయన ఆలోచనలు, వ్యూహాలు అంత త్వరగా ఎవరికీ అర్థంకావు.. అందుకే కొందరు ఆయన్ని తక్కువంచనా వేస్తారు.. బీజేపీ కూడా అలా తక్కువంచనా వేసే పప్పులో కాలేసింది.. బాబు తన అనుభవాన్ని, అభిమానాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో నాలుగేళ్లు కలిసున్నారు.. కానీ బీజేపీ కనికరించలేదు.. ఇక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక బాబు, బీజేపీకి దూరమయ్యారు.. తర్వాత బాబు తన శైలికి భిన్నంగా దూకుడు పెంచారు.. అయినా బీజేపీ తగ్గలేదు.. ఈసారి ఏపీలో మాదే అధికారమంటూ బాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టింది.. అప్పుడే బాబు ఆట మొదలైంది.. ఇప్పుడిప్పుడే బాబు వ్యూహాలు ఎలా ఉంటాయో బీజేపీకి అర్థమవుతుంది. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రెస్ మీట్ పెట్టారు.. ప్రెస్ మీట్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి మాట్లాడతారనుకున్నారంతా.. కానీ వాటితో పాటు కుటుంబరావు, బీజేపీ గుండెల్లో బాంబు పేల్చేలాంటి మాట చెప్పారు.. కేంద్ర ప్రభుత్వం రెండు భారీ స్కాములు చేసిందని.. వాటిని నెల రోజుల్లో సాక్షాలతో సహా బయట పెడతామని అన్నారు.. దీంతో బీజేపీ ఒక్కసారిగా షాకైంది.. ఇవి తప్పుడు ఆరోపణలని కప్పిపుచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.. అసలే మోడీ మీద రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. దీనికితోడు ఎన్నికలు సమయం దగ్గరికొస్తుంది.. ఈ టైంలో స్కాములు బయటపడితే బీజేపీకి కష్టకాలమే.. అందుకే, స్కాములు బయటపడకుండా ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తుంది.. మరోవైపు బాబు విషయంలో తొందరపడ్డామంటూ తలలు పట్టుకుంటుంది. బాబు వ్యూహాలు అలా ఉంటాయి మరి.. ఏ విషయంలోనైనా ముందు చూపుతో ఆలోచించే బాబు.. మోడీ, అమిత్ షాల గురించి ముందే పసిగట్టి.. స్కాముల వివరాలు సేకరించారు.. ఇప్పుడు వాటినే అస్త్రంగా మలుచుకున్నారు.. తనని ఇరుకున పెట్టాలని చూసినవాళ్లనే ఇరుకున పెట్టారు.. బాబంటే ఏంటో చూపించారు.. బాబుని తక్కువంచనా వేసిన బీజేపీ.. బాబు దెబ్బకి విలవిలలాడుతోంది...  

మోదీ కొంప ముంచనున్న ఉత్తర్‌ప్రదేశ్‌

  ఉత్తర్‌ప్రదేశ్‌ అంటే ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రంగానే తెలుగువారికి పరిచయం. కానీ రాజకీయంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎవరికి ఎక్కువ లోక్‌సభ సీట్లు వస్తే, ఆ పార్టీనే కేంద్రంలో చక్రం తిప్పుతుంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 80 లోక్‌సభ స్థానాలున్నాయి మరి! 2014 ఎన్నికలలో మోదీ ప్రధానమంత్రి అయ్యారంటే దానికి ఉత్తర్‌ప్రదేశ్‌ చలవే కారణం. ఆ ఎన్నికలలో బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. కానీ క్రమంగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రి కావడం చరిత్ర. ఒక స్వామీజీ ముఖ్యమంత్రి కావడంతో అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ సంబరంలో మునిగిపోయాయి. కానీ ఆ సంబరాలు ఎక్కువకాలం నిలవలేదు. యోగి పాలన పట్ల ప్రజలు ఏమంత సుముఖంగా లేరని తేలిపోయింది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో పిల్లల మరణాల దగ్గర్నుంచీ, వారణాసిలో ఫ్లై ఓవర్ కుప్పకూలిపోవడం వరకు అనేక సందర్భాలలో ఆదిత్యనాధ్ ప్రభుత్వ వైపల్యం స్పష్టంగా కనిపించింది. అందుకేనేమో! ఆదిత్యనాధ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు.... ఏకంగా నాలుగు ఉప ఎన్నికలను కోల్పోయింది. వీటిలో ఆదిత్యనాధ్‌కు పెట్టని కోటలా ఉన్న గోరఖ్‌పూర్‌ కూడా ఒకటి కావడం గమనార్హం. మొన్నటి కైరానా స్థానానికి జరగిన ఎన్నికలో ఓడిపోవడం మరీ సిగ్గుచేటుగా మిగిలిపోయింది. యూపీలో వరుస ఓటముల తర్వాత... ప్రజల సంగతి అలా ఉంచితే, తోటి బీజేపీ నాయకులు కూడా ఆదిత్యనాధ్‌ పాలన మీద దండయాత్రని మొదలుపెట్టారు. ఆయనను దింపేసి కేశవ్ ప్రసాద్‌ మౌర్యని ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్‌ను బహిరంగంగానే వెల్లడించడం మొదలుపెట్టారు. ఒకపక్క ప్రతిపక్షాలన్నీ వ్యూహాత్మకంగా ఒక్కటవుతుంటే... బీజేపీ మాత్రం చీలిక దిశగా సాగుతోంది. సహజంగానే ఈ పరిణామాలతో బీజేపీ నాయకత్వంలో గుబులు మొదలైంది. హుటాహుటిన ఆదిత్యనాధ్‌ను దిల్లీ పిలిపించుకున్నారు. అయితే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు అమిత్‌ షా ఇష్టపడకపోవచ్చు. మోదీ- అమిత్‌ షాలు తమకు వీరవిధేయంగా ఉన్నవారిని కాపాడుకుని తీరతారు. పైగా ఆదిత్యనాధ్‌ను తొలగించడం అంటే తమ ఓటమిని సగం అంగీకరించడమే! అన్నింటికీ మించి ఆదిత్యనాధ్‌ తొలగింపు ఆరెస్సెస్‌ ఆగ్రహానికి కారణం కాక తప్పదు. మరి ఒకప్పుడు బద్ధవైరులుగా ఉన్న కాంగ్రెస్, బహుజన్‌ సమాజ్‌వాదీ, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌, రాష్ట్రీయ జనతాదళ్‌లాంటి పార్టీలన్నీ కలిసి కమ్ముకొంటున్న వేళ... బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తుందో చూడాలి!  

ఇంటర్వెల్లో ‘సినిమా’ చూపిస్తున్న హాళ్లు

  సూరిబాబు కుటుంబంతో సహా ‘భరత్‌ అనే నేను’ సినిమా చూద్దమనుకున్నాడు. హాయిగా ఇంటర్వెల్లో ఏదో ఒకటి తిందామనుకుంటే... బయటి ఆహారం ఏదీ లోపలకి తీసుకువెళ్లకూడదని చెప్పారు. దాంతో హాల్లోనే ఏదో ఒకటి కొనుక్కోవచ్చులే అనుకున్నాడు. దాంతో సూరిబాబు అడ్డంగా బుక్కైపోయాడు. సమోసా 20 రూపాయలు, కూల్‌డ్రింక్‌ 30 రూపాయలు చొప్పున కొనుక్కునేందుకు అతని జేబుకి చిల్లు పడిపోయింది. ఒక్క క్షణం ఇక్కడో చిన్న లెక్క వేసుకుని చూద్దాం. సినిమా హిట్‌ అయితే హాల్లో జనాలు బాగా నిండుతారు. ఒకో షోకి కనీసం 100 సమోసాలు అమ్ముడుపోతాయి. హోల్‌సేల్‌లో ఏడు రూపాయలకి వచ్చే సమోసాని కనీసం 20 రూపాయలకి అమ్మడం వల్ల షోకి 1300 రూపాయల లాభమన్నమాట. అంటే రోజుకి నాలుగు షోలకీ కలిపి 5200 రూ.ల లాభం- నెలకి ఏకంగా లక్షన్నర ఆదాయం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకి కూడా రాని సంపాదన, హాల్లో గంట పనిచేస్తే వచ్చేస్తుంది కదూ! మరి ఇంత దర్జాగా దోచుకుంటున్న వ్యక్తుల మీద చర్యలేవీ అంటే నామమాత్రమే! ఈ పరిస్థితి అక్కడా ఇక్కడా అని కాదు... బహుశా దేశం అంతటా ఉండే ఉంటుంది. చిన్న చిన్న పట్నాలలో ఉండే హాళ్లలో కూడా యథేచ్చగా దోపిడీ సాగుతుంటోంది. ప్రభుత్వాధికారులు చూసీచూడనట్లు ఊరుకుంటారు. ఒకవేళ ఏదన్నా చర్య తీసుకోవాలన్నా తూనికలు, కొలతలు; శానిటరీ అధికారుల కొరత చాలా తీవ్రంగా ఉంటుంది. చర్యలు తీసుకున్నా కూడా అవి ఎక్కువగా జరిమానాలకే పరిమితం అవుతూ ఉంటాయి. జరిమానా కట్టేసి, ఓ వారం రోజులు గమ్మున ఉండి... తిరిగి ప్రేక్షకులని దోచుకోవచ్చు. మహా అయితే హాల్లో అమ్ముకునే కాంట్రాక్టరు మారతాడు. దోపిడీ యథావిధిగా సాగుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవల్సి వస్తోందంటే... తూనికలు, కొలతల శాఖ నిన్న హైదరాబాదులోని 15 మల్టీప్లెక్సుల్లో తనిఖీలు నిర్వహించి 105 కేసులు నమోదు చేశాయి. ఈ వార్త చదువుకోవడానికి కాస్తా బాగానే ఉంది. హాళ్ల పాపం పండిందని వినియోగదారుడు కాసేపు సంతోషపడొచ్చు కూడా! కానీ ఇదంతా తాత్కాలికం మాత్రమే అన్న చేదు నిజాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కోర్టులకి జరిమానా కట్టి, ఆ జరిమానాలని తిరిగి కస్టమర్ల మీద దండుకుంటారు కాబట్టి... ఆ శిక్ష ప్రేక్షకులకి విధించినట్లుగానే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జరిమానాలను భయపడే స్థాయిలో విధించాలి. తప్పు జరుగుతున్న హాళ్లను సీజ్ చేయాలి. కఠిన చర్యలు తీసుకోనంత వరకూ సినిమాహాళ్ల దోపిడీ ఆగుతుందని ఆశించలేం. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇది కేవలం సమోసాలకీ, పాప్‌కార్న్‌లకీ సంబంధించిన విషయం కాదు. మన సమాజంలో దోపిడీ ఎంత యథేచ్ఛగా జరిగే అవకాశం ఉందో తెలిపే ఉదాహరణ కూడా! నోరెత్తి అడగాల్సిన ప్రజలు మనకెందుకులే అని నోరు మూసుకుంటారు. ప్రజల తరఫున పని చేయాల్సిన అధికారులు లంచాలకో, అలసత్వానికో బానిసైపోతారు. అధికారుల పనితీరు గమనించుకోవాల్సిన ప్రభుత్వం స్కీములతోను, స్కాములతోనూ బిజీగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యవస్థలోని అణువణువూ ఇంతే లోపభూయిష్టంగా ఉంటుంది.

బజారున పడ్డ భారతీయ పత్రికలు

  ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలలో మీడియా కూడా ఒకటని మాటమాటికీ వింటాం. కానీ ఆ మీడియా పరిస్థితిని చూస్తే మాత్రం చిరాకో, కోపమో కలగక మానదు. మొన్నటివరకూ మీడియా అంతా మోదీని ఆకాశానికి ఎత్తేసింది. ఆయన పాలనలో పొరపాట్లు జరుగుతున్నాయన్న విషయాన్ని చెప్పేందుకు ఏ ఒక్క ప్రముఖ పత్రికా సాహసించలేదు. ద వైర్‌, స్క్రోల్ వంటి ఒకటి రెండు వెబ్‌ పత్రికలు మాత్రమే కాస్త ధైర్యం చేయగలిగాయి. ఎప్పుడైతే మోదీ ప్రభ తగ్గి, ఆయన వల్ల తమకు పెద్దగా నష్టం జరగదనుకున్న నిర్ణయానికి వచ్చాయో... అప్పుడే ఎక్కడలేని ఉత్సాహంతో బీజేపీ పాలన మీద యుద్ధం ప్రకటించాయి. మోదీ మీద కార్టూన్లు, ఆయన మనస్తత్వం మీద ప్రత్యేక విశ్లేషణలు మొదలయ్యాయి. చాలా జాతీయ/ ప్రాంతీయ పత్రికల అవకాశవాదం ఎంత లోతుకి దిగజారిందో చెప్పేందుకు ఈ ఉదాహరణ చెప్పుకొంటే సరిపోతుందేమో! కానీ తాము అంతకంటే హీనస్థాయిలో ఉన్నామని కొన్ని పత్రికలు కెమెరా సాక్ష్యంగా చెప్పుకొచ్చాయి. డబ్బులిస్తే మళ్లీ మోదీని ఆకాశంలో నిలబెడతామని అమ్ముడుపోయేందుకు సిద్ధపడ్డాయి. కోబ్రాపోస్ట్‌ అనే పరిశోధనా పత్రిక ఆ మధ్య ‘ఆపరషన్‌ 136’ పేరుతో ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. భగవద్గీత, కృష్ణుని బోధల ముసుగులో హిందుత్వని ప్రచారం చేయాలని కొన్ని పత్రికలను సంప్రదించింది. ఇలా చేసినందుకు 500 కోట్ల వరకూ భారీ నగదుని ఎర చూపింది. ఈ ఆపరేషన్‌లో ఒకటి కాదు, రెండు కాదు- ఏకంగా 27 పత్రికల మీద ఉచ్చు బిగించారు. వాటిలో రెండు బెంగాలీ పత్రికలు మినహా, మిగతా పత్రికల ప్రతినిధులంతా తోలుబొమ్మల్లా ఆడేందుకు ఉత్సాహం చూపించారు. ఈ ఆపరేషన్‌లో చిక్కుకున్న సంస్థలు సామాన్యమైనవి కావు. టైమ్స్ ఆఫ్‌ ఇండియా అధినేత వినీత్ జైన్‌ స్వయంగా కెమెరా ముందు ఫోజులిస్తూ దొరికిపోయాడు. ఇండియా టుడే వైస్‌ చైర్మెన్‌ ‘కాలీ పురి’ కూడా డబ్బు కోసం హిందుత్వ అజెండాకు సిద్ధపడింది. ఇక హిందుస్థాన్‌ టైమ్స్‌, దైనిక్‌ భాస్కర్, జీ న్యూస్‌, స్టార్ ఇండియా, రేడియో వన్, లోక్‌మత్‌, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్....తదితర పత్రికలూ ఈ జాబితాలో ఉన్నాయి. కోబ్రాపాస్టు ఉచ్చులో రెండు తెలుగు మీడియా సంస్థలు (ఏబీఎన్, టీవీ5) కూడా ఉండటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. తాము తెలుగుదేశానికి సానుకూలం అని ఏబీఎన్ ప్రతినిధి హొయలు పోతే, మీరెలా కావాలంటే అలా చేసి పెడతామని టీవీ5 ఉద్యోగి దేబిరించాడు. అందుకేనేమో... కోబ్రాపోస్టు ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే తెలుగు మీడియా మాత్రం ఎక్కడా ఏమీ జరగనట్లు గుంభనంగా మిన్నకుండిపోయింది. సహజంగానే కోబ్రాపోస్టు ఉచ్చులో చిక్కుకున్న పత్రికలన్నీ తమకేం తెలియదని భుజాలు తడుముకున్నాయి. కొన్ని పత్రికలైతే కోర్టు కేసులకి సిద్ధపడ్డాయి. కానీ కొన్నాళ్లుగా మీడియా తీరు గమనిస్తున్న ప్రజలు మాత్రం, వాటి నడవడిలో ఏదో లోపం ఉందని గాఢంగా విశ్వసిస్తున్నారు. అది తప్పనీ తాము నిప్పనీ నిరూపించుకునే బాధ్యత సదరు మీడియా మీద ఉంది. లేకపోతే మీడియా తీరు కూడా ‘నాన్నా పులి’ కథలో పిల్లవాడి అబద్ధపు బతుకులా మారిపోతుంది. కాకపోతే ఇందులో నష్టపోయేది మాత్రం ప్రజలే!

కష్టపడి ఒక్కపైసా తగ్గించారుగా.. అంత పరాచకాలా..!

  నిజంగా ప్రజలంటే ఎంత చులకనగా కనిపిస్తున్నారో మరోసారి రుజువు చేసింది కేంద్రప్రభుత్వం. మరీ ఇంత తేలికగా కనిపిస్తున్నారా..అన్నట్టు చేసింది. గత కొద్దిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకూ ధరలు పెరుగుతుండటంతో... ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పడు మొదటిసారి ఆయిల్ కంపెనీలు వీటి ధరలను తగ్గించాయి. కానీ తగ్గిన ధరలు చూసి ప్రజలు ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో ఉన్నారు. ఇంతకీ ధరలు ఎంత తగ్గాయో తెలుసా...?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గింది. పోనీలే కాస్త తగ్గాయి అని సామాన్యులు సంతోషించే కొద్దిసేపటికే.. ఇదంతా తూచ్....తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వచ్చిందని, అందుకే పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దాంతో ఒక్క పైసా తగ్గడంతో వినియోగదారులు షాకయ్యారు. అంతేకాదు... ఐఓసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో కూడా కామెంట్లు విసురుతున్నారు.   ఇదిలా ఉండగా.. ఇక ఈ ఒక్కపైసా తగ్గింపుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించి మోడీపై సెటైర్లు వేశారు. మీరేమైనా ప్రజలతో పరాచకాలు ఆడుతున్నారా.. ఒక్క పైసా తగ్గించడం ఏంటీ... మీరు చేసింది పిల్ల చేష్టల్లా ఉన్నాయి అని మండిపడ్డారు. అంతేకాదు..తాను చేసిన ఫ్యూయల్ ఛాలెంజ్ పై కూడా స్పందించి.. నేను ఫ్యూయల్ ఛాలెంజ్ చేశాను కదా అని... దానికి ఈ రకంగా సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. మరి నిజంగానే పరాచకాలు కాకపోతే.. తగ్గించకపోతే అసలు తగ్గించకుండా ఉండాలి అంతేకానీ... ఒక్క పైసా తగ్గించి ప్రజలతో పరాచికాలు ఆడటం ఏంటీ..!  

ఆ విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే..

  జనసేన పవన్ కళ్యాణ్ కు అన్ని విషయాల్లో ఏమో కానీ కొన్ని విషయాల్లో మాత్రం బాగానే క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అదేంటంటే... పార్టీలోకి ఎవరిని తీసుకోవాలీ అన్న విషయంలో. దీనికి కారణం కూడా లేకపోలేదు. తన అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎవర్ని పడితే వాళ్లని పార్టీలోకి తీసుకొని.. చుట్టు పక్కల వాళ్ల మాటలు విని చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆ తప్పు పవన్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవర్ని పడితే వాళ్లని కాకుండా.. కాస్త సెలెక్టివ్ గా అందర్నీ ఎంపిక చేసుకుంటున్నాడు. ఆఖరికి కుటుంబసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాడంటేనే అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. తమ కుటుంబ సభ్యులు తన పార్టీల్లోకి రావడంపై కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   నిజానికి పవన్ కుటుంబ సభ్యులకు పవన్ అంటే ఎంత ఇష్టమో.. ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సందర్భంలో బాబాయ్ పిలవాలే గానీ, మైక్ పట్టుకుని జనసేన తరపున ప్రచారం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధం అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామెంట్ కూడా చేశాడు. ఇక అన్నయ్య నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనసేన తరపున బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ వార్తల నేపథ్యంలో.. ఈ విషయంపై పవన్ ను అడగ్గా... దానికి పవన్ నుండి సమాధానం లభించింది. ‘ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతేతప్పా తన కుటుంబ సభ్యులను రమ్మని గానీ, ప్రచారం చేయమని గానీ అడగబోనని’ స్పష్టంగా చెప్పేశారు. ఒకవేళ పార్టీలోకి వస్తానని చెప్పినా, ఒకటికి పది సార్లు ఆలోచించుకోమని కోరుతానని, రాజకీయాల్లోకి రావడం అంటే చాలా నిబద్దతో కూడుకున్న వ్యవహారం అని, ఇష్టపడి రావాలి తప్ప బలవంతంగా తీసుకురాకూడదని అన్నారు. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు.. వారినెందుకు ఇబ్బంది పెట్టడం అని తాను భావిస్తానని, ఇంతకుమించి తానేమీ చెప్పలేనని అన్నారు. దీంతో మొత్తానికి ప్రజారాజ్యం పార్టీలో జరిగింది ఓ ఎక్స్ పీరియన్స్ అయినట్టుంది. అందుకే పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో.. వద్దో అని క్లారిటీగానే ఉన్నారు అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఈ ఒక్క విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. రాజకీయాల్లోకి ఇష్టపడి రావాలి తప్పా, తాను ఆహ్వానించడం జరగదని చెప్పడం, పవన్ ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది అని అంటున్నారు.

బ్యాంకులు, ప్రభుత్వాలు... మధ్యలో సామాన్యుడు!

  బాలు.. ఇంట్లో చిల్లిగవ్వ లేదు. ఆమధ్య నాలుగైదు ఏటీఎంలు తిరిగి తెచ్చుకున్న అయిదువేలు ఖర్చయిపోయాయి. ఎలాగొలా మళ్లీ ఏటీఎం దగ్గరకి వెళ్లాలనుకుంటూ ఉండగానే ఓ వార్త కంటికి కనిపించింది. మే 30, 31న జాతీయ బ్యాంకులలో పనిచేసే పదిలక్షలమందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారన్నదే ఆ వార్త. తమ డిమాండ్లకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదన్నదే వారి ఆరోపణ. సరే! అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. వాటిని వ్యక్తపరిచే హక్కూ ఉంటుంది. కానీ కోట్లాది మంది బడుగు జీవులకి జీతాలు చేతికందే వేళ సమ్మెకి దిగడం ఎంతవరకు మానవత్వం!   ఇప్పటికే ఏ సంస్థలకీ లేని విధంగా బ్యాంకులకు వరుసపెట్టి సెలవలు వచ్చేస్తుంటాయి. వాటికి తోడు శనివారాలు సెలవనీ ప్రకటించేశారు. బ్యాంకు దాకా వెళ్తే కానీ ఆ రోజు బ్యాంకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. వెళ్లాక పని జరుగుతుందో లేదో అనుమానం. ఇలాంటి పరిస్థితి మధ్య బ్యాంకు ఉద్యోగులకి, తమ అసంతృప్తిని తెలియచేసేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించలేదా! ఈ దేశంలో పని మానేయడం ఒక్కటే, అసంతృప్తిని తెలియచేసే మార్గంగా స్థిరపడిపోయిందా!   చాలా ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ప్రభుత్వరంగంలో వేతనాలు, సౌకర్యాలు, ఉద్యోగ భద్రతా ఎక్కువే! తమ డిమాండ్లను సాధించుకునేందుకు అక్కడ యూనియన్లు కూడా చాలా బలంగా ఉంటాయి. కానీ బ్యాంకులు ఇలా చటుక్కున సమ్మెకి దిగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరోవైపు ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా ప్రవర్తించినా చెల్లిపోతుంటుంది. అక్కడ సమ్మె చేసే ధైర్యం కానీ, దానికి మద్దతు పలికే నైతిక బలం కానీ చాలా తక్కువగా ఉంటాయి. మన దేశంలో... ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కనిపించే ఈ వ్యత్యాసం చాలా దారుణం!   ఇక తమ సంస్థలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సిబ్బంది ఎందుకు దాన్ని సమ్మెతో సవరించే ప్రయత్నం చేయరన్నది సామాన్యులకి కలిగే మరో ప్రశ్న. ఒకప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్‌ వ్యవస్థ మూలస్తంభంగా నిలిచేది. ప్రపంచవ్యప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా, మన దేశం స్థిరంగా ఉండటానికి కారణం ఆ వ్యవస్థే! కానీ నేషనలైజేషన్‌ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడూ లేనంత దుర్బలంగా ఉందని ఎవరో నిపుణుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి పెద్ద నోట్ల రద్దు లాంటి ప్రభుత్వ నిర్ణయాలతో పాటు యాజమాన్య వైఫల్యం కూడా ఓ కారణమే! ఈ వైఫల్యాల మీద ఏనాడూ బ్యాంకు దిగువ సిబ్బంది తగినంత గొంతుకని వినిపించనేలేదు!   సామాన్యుల దగ్గర ఒకప్పటి షావుకారులాగా రూపాయికి రూపాయి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు... బడాబాబుల దగ్గర సాగిలపడుతున్నాయి. ‘ఇస్తే ఇవ్వండి లేకపోతే మొండి బకాయిలలో రాసుకుంటామని’ ఆఫర్ చేస్తున్నాయి. దీనికి NPA (non performing assets) అని ఓ ముద్దు పేరు పెడుతున్నాయి. DENA బ్యాంకులో ఈ NPAలు ఇచ్చిన అప్పులలో నాలుగో వంతు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. NPAలను స్పష్టంగా చూపించాన్న రిజర్వ బ్యాంక్‌ సూచనే ఇందుకు కారణం అయినప్పటికీ... గత ఐదేళ్లలో బడా బాబులకి ఇచ్చే రుణాలలో అవినీతి పెరిగిపోయిందన్నది జగమెరిగిన సత్యం.   బ్యాంకు ఉద్యోగులకి మాత్రం ఇవేవీ పట్టలేదు. NPAలతో సంబంధం లేకుండా తమ జీతాలు పెంచాలని వాళ్లు కుండబద్దలు కొట్టేశారు. తగినంత పెంచనందుకు నిరసనగా సమ్మెకు దిగేశారు. ఈ సమ్మె వల్ల ఉద్యోగులకి లాభం జరిగితే మంచిదే! కానీ ప్రజలకి జరిగిన నష్టానికి ఎవరు ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నించినా సమాధానం వస్తుందా!

మాట్లాడే హక్కు లేదంటున్న షా...ప్రశ్నించడానికి మీరెవరంటున్న బాబు..

ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా మిత్రపక్షంగా బీజేపీ-టీడీపీ విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇక విడిపోయిన దగ్గరనుండి రెండు పార్టీల నేతల పోటీ పడి మరీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. ఏపీకి మేము అంతిచ్చాం... ఇంతిచ్చాం... అని ఒకపక్క బీజేపీ మొత్తుకుంటుంటే.. అసలు మీరు మాకు ఏం ఇచ్చారయ్యా బాబు అంటూ బీజేపీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి అమిత్ షా.. చంద్రబాబు నువ్వా నేనా అన్నట్టుగా విమర్సలు గుప్పించుకున్నారు.   ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన... ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 2,100 కోట్లను ఇచ్చిందని, వాటి లెక్కలు ఇంతవరకూ కేంద్రానికి చేరలేదని, ఆ పరిస్థితుల్లో మరిన్ని డబ్బులు ఎలా ఇస్తారని అడిగారు. ఒక్క భవన నిర్మాణానికైనా టెండర్లు పిలిచారా? అని అమిత్ షా ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే స్వీయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు కావని అన్నారు. చంద్రబాబు పలు సార్లు రాజధాని నిర్మాణం కోసమంటూ తయారుచేయించిన డిజైన్లన్నీ నేటికీ సింగపూర్ దగ్గరే ఉన్నాయని... ఇప్పటికీ సింగపూర్ ను దాటి బయటకు రాలేదని విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబుకు గుజరాత్ లో అభివృద్ధి చెందిన నగరాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గుజరాత్ నగరాలన్నీ రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లనున్నామని, కొత్త మిత్రపక్షాలేమీ ఉండబోవని స్పష్టం చేశారు.   ఇక షా చేసిన విమర్శలపై స్పందించిన చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎపీ ప్రభుత్వం యుటిలిజైషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని అమిత్ షా చెప్పడం సరికాదన్నారు. అసలు అమిత్ షా ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడని, ఆయనకు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. అమరావతిలోని రాజధాని భవనాలకు తాము ఇప్పటికే టెండర్లు పిలిచామని.. వివరాలు తెలియకుండా అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. అసలు ఎపి ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు.. అయినా యూసీల విషయంలో ప్రధాని అడిగితే తాను సమాధానం చెబుతానని, వాటి గురించి అడగడానికి అమిత్ షా ఎవరిని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఏకంగా చంద్రబాబు షాకి వార్నింగ్ ఇవ్వడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ముందు ముందు ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని కీలక మలుపులు చోటుచేసుకుంటాయో..

ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం.. కమ్మ కులంలో చెడపుట్టారు..

  టీటీడీపీ నేత మోత్కుపల్లి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడిపై విమర్సలు కురిపించారు.తనను గవర్నర్ చేస్తానని, రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత మోసం చేశారని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని... ఇప్పుడు కనీసం మహానాడు కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వాపోయారు. ఎన్టీఆర్ పార్టీకి తనను దూరం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన... కన్నీటిపర్యంతం అయ్యారు.   ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే తాను రాజకీయాల్లో ఉన్నానని...తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పాలించే అర్హత కూడా లేదని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతికి కాని, వర్ధంతికి కాని ఘాట్ వద్దకు వచ్చి చంద్రబాబు ఎప్పుడైనా నివాళి అర్పించారా? అని ప్రశ్నించారు. అంతేకాదు... టీడీపీ బాగుండాలంటే ఎన్టీఆర్ వారసులకు పార్టీని అప్పగించాలని...ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్రలు చేశారని.. టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కూర్చొని మాట్లాడాలని... తామంతా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం.

రాహుల్ బలే కౌంటర్ ఇచ్చాడుగా.. బీజేపీ ఎక్కువ కష్టపడొద్దు..

  కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి రాహుల్ గాంధీ కాస్త హుషారైనట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ అంటే అమూల్ బేబి, పప్పు, ఇంకా ఇలా ఎన్నో ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకునేవాళ్లు విపక్ష నేతలు. కానీ ఈ మధ్య రాహుల్ గాంధీ కాస్త రూట్ మార్చారు. ఏకంగా మోడీ పైనే ఘాటుగా విమర్శలు చేస్తూ నేను పప్పు ఏం కాదని నిరూపించారు. రాహుల్‌ ప్రసంగాలలో కాస్త పరిణతి, దూకుడు కనిపిస్తుండటంతో... రాహుల్‌ పట్ల ప్రజాభిప్రాయంలో కూడా కాస్త మార్పు వస్తోంది. ఇక అతని ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నాయి. అంతేనా...ఇంతకుముందు ప్రభావవంతమైన నేతల జాబితాలో ఎక్కడో కనిపించేవాడు కాస్తా ఇప్పుడు, మోదీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు మోదీ స్థానం మాత్రం ఓ రెండడుగులు దిగజారినట్లు సర్వేలలో తెలుస్తోంది.   ఇక ఇప్పుడు తాజాగా మరోసారి రాహుల్ గాంధీ బీజేపీకి చురక అంటించారు. గతంలో రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ  పోస్టర్లు వేయడం, కామెంట్లు చేయడం చేస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ప్రతిపక్షనేతలకు ఇవ్వాలనుకోలేదు రాహుల్. అందుకే ముందుగానే బీజేపీ నేతలను ఉద్దేశించి చురకలు అంటించారు. అమ్మను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నానని... కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండనని..ఈ సందర్భంగా బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి ఒక విన్నపం చేస్తున్నానని... తనను విమర్శించడానికి ఎక్కువగా కష్టపడవద్దని, త్వరలోనే తిరిగి వస్తానని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మొత్తానికి రాహుల్ గాంధీ బాగానే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి తనపై కామెంట్లు చేసే అవకాశం ఇవ్వలేదు.

ఉద్దానంపై చంద్రబాబు.. పనిచేసేవాళ్లపై విమర్శలా..

  శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని... కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని..లేకపోతే దాను నిరాహారదీక్షకు దిగుతానని డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలసిందే. అయితే ఆ గడువు ముగియడంతో. పవన్ నిరాహార దీక్షకు దిగిన సంగతి కూడా విదితమే. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌లో నిన్న సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్షకు దిగారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష కొనసాగుతుంది.   అయితే ఇప్పుడు దీనిపై చంద్రబాబు స్పందించినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థులని ఆదుకుంటున్నామని..ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "క్రానిక్ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనడానికి పరిశోధన మొదలైంది. ఉద్ధానం ప్రాంతంలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న వారికి దగ్గరలోనే డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యాన్ని చేరువ చేస్తున్నాం. శ్రీకాకుళం రిమ్స్‌లో 16, టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 8, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 5, పలాస సామాజిక ఆసుపత్రిలో 8, సోంపేట సామాజిక ఆసుపత్రిలో 12 డయాలిసిస్ మిషన్లను ఏర్పాటు చేశాము. ఉద్ధానం సమస్యపై ప్రత్యేక చొరవతో కార్యక్రమాలు చేపడుతున్నాము. గత ఏడాది జనవరి నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉద్ధానం 7 మండలాల్లోని 176 గ్రామాల్లో స్క్రీనింగు నిర్వహించి 1,01,593 మందిలో రుగ్మతలను గుర్తించారు. వారిలో 13,093 మందిని కిడ్నీ సంబంధిత వ్యాధి పరీక్షలకు సిఫారసు చేశారు" అని చంద్రబాబు అన్నారు.   అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా రోగుల నుంచి నమూనాలు సేకరించామని.. 13వేలమందికిపైగా క్రమం తప్పకుండా చికిత్స జరుగుతోందన్నారు. ప్రతి నెలా 2761మంది పేషంట్లకు రూ.రూ.2,500 పింఛన్ ఇస్తున్నామని.. రూ.17కోట్లతో 7 ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రోగులకు ప్రతి 15 రోజులకు ఒకసారి నెఫ్రాలిజిస్టు ద్వారా వైద్య సేవలు కూడా అందుతున్నాయని చెప్పారు. ఇక 5 డయాలసిస్ సెంటర్లలో.. 50 మిషన్ల ద్వారా 3 సెషన్లు పని చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ రోగులకు పింఛన్లు ఇష్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు బాబు. ఉద్ధానం బాధితుల్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్నట్లు ఎవరూ పట్టించుకోలేదని..గత ప్రభుత్వాలు ఇలాంటి సేవలు చేశాయా... పనిచేసే వారిని విమర్శిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు... మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూద్దాం...

సీఎం అనాలా? లేక బావగారు అనాలా..?

ఇటీవల విడుదలైన 'మహానటి' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కూడా ‘మహానటి’ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాల్‌లో ‘మహానటి’ చిత్రబృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్బంగా ఆయన  ‘మహానటి’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి జీవితానికి సార్థకత తీసుకురావాలనే పట్టుదలతో ఈ సినిమాలో కీర్తి సురేష్ బాగా నటించారని కొనియాడారు. సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టిందని... కష్టాల్లో కూడా ఇతరులకు సహాయ పడాలనే సావిత్రి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ‘మహానటి’ సినిమాను చాలా చక్కగా తీసినందున నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్‌లను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు సంవత్సరాలు ‘మహానటి’ జీవితాన్ని అధ్యయనం చేసి, మంచి సినిమాను తీసినందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను మెచ్చుకున్నారు. చిత్ర బృందం ఎంతో సాహసంతో ఈ సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకుందని చంద్రబాబు అన్నారు. సావిత్రిది కూడా రాజధాని అమరావతిలోని గ్రామమే కావటం విశేషమని పేర్కొన్నారు.   అనంతరం చిత్ర యూనిట్ ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సన్మానించారు. ఇక తనకు సన్మానం అనంతరం సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం అనాలా? లేక బావగారు అని పిలివాలో’ తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ‘అక్కా’ అని పిలిచే దానినని చెప్పారు. చిత్రయూనిట్ ని సన్మానించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నికల నాటికి రాహుల్‌ పుంజుకుంటాడా!

ఒకప్పుడు రాహుల్ గాంధి ఓ అనామకుడు. ప్రజల దృష్టిలో తల్లి చాటు బిడ్డ, ప్రతిపక్షాల విమర్శలలో పప్పు. రాహుల్‌ గాంధి కామెడీ అని కొడితే యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు కనిపించేవి. ఇక మోదీ అయితే చెప్పనే అక్కర్లేదు. ‘కొంతమందికి బాదం పప్పులు తిన్నా బుద్ధి పెరగదంటూ’ రాహుల్‌ని గడ్డిపోచలా తీసిపారేసేవారు. కానీ నిరంతరం శత్రువు మీదే ధ్యాస పెడితే, ఆ శత్రువుకి బలాన్ని అందిస్తూ మనం బలహీనులం అయిపోతామన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయారు మోదీ! పిల్లవాడిని రెచ్చగొట్టి పరిగెత్తించే తల్లిలాగా రాహుల్‌లో కసిని పెంచారు. ఫలితం ఇప్పుడు రాహుల్‌ పట్ల ప్రజాభిప్రాయంలో కాస్త మార్పు వస్తోంది. రాహుల్‌ ప్రసంగాలలో కాస్త పరిణతి, దూకుడు కనిపిస్తోంది. ఇక అతని ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నాయి.ఇంతకుముందు ప్రభావవంతమైన నేతల జాబితాలో ఎక్కడో కనిపించేవాడు కాస్తా ఇప్పుడు, మోదీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు మోదీ స్థానం మాత్రం ఓ రెండడుగులు దిగజారినట్లు సర్వేలలో తెలుస్తోంది. మైనారటీల మీద దాడులు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకు కుంభకోణాలు, నిరుద్యోగం... లాంటి సవాలక్ష సమస్యలు ఇప్పుడు మోదీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఈ మంటల్ని మరింతగా రగులుస్తూ పెట్రోలు ధరలు ఎలాగూ పెరుగుతున్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇవన్నీ ప్రతిబంధకాలే! డైనమిక్‌ నేతగా ప్రతి విషయం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మోదీ సమస్యల మీద నోరెత్తకపోవడం కూడా ప్రజల్ని అసహనానికి గురిచేస్తోంది. ఒకవేళ ఏదన్నా సమస్య గురించి మాట్లాడినా, దానికి యాభై ఏళ్ల నాటి నెహ్రూ పాలనే కారణం అని చెప్పడం మరింత చిరాకు తెప్పిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. తెరాస పాలనలో లోటుపాట్లు ఉన్నా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నారనే నమ్మకంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆంధ్రలో పెద్దగా అభివృద్ధి జరగకపోయినా, దానికి కారణం బీజేపీ చేసిన ద్రోహమే అన్న కసితో అక్కడి ప్రజలు ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇలాంటి స్థానిక పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే లోక్‌సభ్‌ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌లు పెద్దగా లాభపడకపోయినా... ప్రాంతీయ పార్టీలు మాత్రం బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కనిపించిన దృశ్యమే వచ్చే జాతీయ ఎన్నికలలో పార్లమెంటులోనూ కనిపించవచ్చు. అప్పుడు ఎవరు ఎలాంటి ఎత్తులు వేస్తారనేదాని మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకప్పుడైతే ఇలాంటి సందర్భాలలో మోదీ- షా ద్వయం వేసే ఎత్తులదే పైచేయిగా ఉండేది. కానీ కర్ణాటకలో రాహుల్ చూపిన సమయస్ఫూర్తితో, ఒకప్పటి పప్పుని అంత తేలికగా అంచనా వేయడానికి లేకుండా పోయింది. ఏకు మేకవడం అనే సామెత రాజకీయానికి అతికినట్లు సరిపోతుందేమో!

పూనమ్ సంచలన కామెంట్లు... జల్సా చూపిస్తాడు.. అజ్ఞాతవాసంలో వేస్తాడు..

  నిన్నటి వరకూ శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లు సినీ పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల నుండి ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఓ రకంగా దీనంతటికీ పవన్ కళ్యాణే కారణమని చెప్పొచ్చు. మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. మీడియా కూడా కాస్త వెనక్కి తగ్గి.. అదే పనిగా డిబెట్లు పెట్టడం ఆపేశారు. ఇక డిబెట్లు లేకపోవడం.. ఇంటర్వ్యూలు లేకపోవడం వల్ల సోషల్ మీడియాకు కూడా పెద్దగా వార్తలు లేకుండా పోయాయి. అయితే మరోసారి నెటిజన్లకు మంచి న్యూస్ దొరికింది. ఈసారి ఈ న్యూస్ కు కారణమయ్యింది ఎవరో కాదు పూనమ్ కౌర్.   నిజానికి అందాల కథానాయికే అయినా టాలీవుడ్ లో సరైన హిట్ కొట్టి నిలబడలేకపోయింది పూనమ్ కౌర్. ఫేడవుట్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, కత్తి మహేశ్ ఇష్యూతో వెలుగులోకి వచ్చింది. కత్తి మహేశ్ పవన్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పవన్ సపోర్ట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక ఆ తరువాత పూనమ్ కౌర్ ను ఉద్దేశించి కూడా కత్తి మహేశ్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనమ్ కౌర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక కొన్ని రోజులు ఈ విషయంపై చర్చలు జరిగినా... ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా తన ట్విట్టర్లో ఒక స్టార్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి ఈ భామ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జల్సాలు చూపిస్తూ.. అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త... నమ్మకద్రోహి అని పూనమ్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు... ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉంటూ... ఎన్నారై హీరోయిన్లను అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాడు... నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి... ఆ ఎన్నారై హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్ కు హిట్లు ఉన్నాయా..? ఆ ఎన్నారై హీరోయిన్ మీరు ఏ పని చెప్పినా చాలా శ్రద్దగా చేస్తారట... నేను విన్నాను.. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది అంటూ పూనమ్ తన ట్విట్టర్లో చాలా ఘాటుగానే కామెంట్లు విసిరింది. ఇక పూనమ్ కామెంట్లు చేసిన ఆ దర్శకుడు కూడా ఎవరికో దాదాపు క్లారిటీ వచ్చింది. మరి ముందు ముందు పూనమ్ ఇంకెంత మంది గురించి ఇలా కామెంట్లు చేస్తుందా.. లేకపోతే...దీంతో ఆపేస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో..

దీదీ దెబ్బకి డీజీపీ బదిలీ...

  కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే కదా. ఈ కార్యక్రమానికి వచ్చిన మమతా బెనర్జీ.. విధాన సౌధకు వెళ్లే దారిలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. కారు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో కొంతదూరం నడిచి విధాన సౌధకు చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రాగానే డీజీపీ నీలమణిపై విరుచుకుపడ్డారు. వేదికపైనే డీజీపీకి చీవాట్లు పెట్టారు. అంతేకాదు... అదే ఆవేశంతో దేవెగౌడకు ఫిర్యాదు చేశారు. ఇకేముంది...ట్రాఫిక్ నిర్వహణ తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి మమత నుంచే ఫిర్యాదు రావడంతో తక్షణం నివేదిక సమర్పించాల్సిందిగా సీఎం కుమారస్వామి డీజీపీని ఆదేశించారు. భారీ వర్షం కారణంగానే సమస్య తలెత్తిందని, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ కార్లు ఒక్కసారిగా విధాన సౌధ ప్రాంగణానికి రావడంతో ఇబ్బంది తలెత్తిందని డీజీపీ తెలిపారు. ఆఖరికి మమతా బెనర్జీకి జరిగిన అవమానంపై తీవ్రంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం డీజీపీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ కు బాబుకు అక్కడే చెడిందట..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్సల తీవ్రత పెంచారు. గత ఏడాది ఈ టైంలో టీడీపీ-జనసేన కలిసే ఉన్నాయి. కానీ ఏడాదికి వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. నిన్నటి వరకూ మిత్రులు అనుకున్నవాళ్లే ఇప్పుడు శత్రువులుగా తయారయ్యారు. ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున టీడీపీని విమర్శించి అందరికీ షాకిచ్చారో ఆ రోజు నుండి ఏదో ఒక సందర్భంలో టీడీపీపై చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ మాత్రమే చంద్రబాబు ను తిట్టేవాడు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణమంటూ టైం దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శలు గుప్పించేవాడు. ఇక ఇప్పుడు పాదయాత్ర నేపథ్యంలో మొత్తం చంద్రబాబునే టార్గెట్ చేశారనుకోండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు పవన్ జగనే మించి పోయాడు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంలో జగన్ కు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పవన్ శ్రీకాకుళం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఏకంగా  తనపై దాడి చెయ్యడానికి ముఖ్యమంత్రి కిరాయిగూండాలను పంపించారు అని అభియోగించారు. చంద్రబాబు బద్దశత్రువులు కూడా ఎప్పుడు ఇటువంటి ఆరోపణలు చెయ్యలేదు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబుపై పవన్ ఇంతలా విమర్శలు చేయడానికి కారణం ఏంటీ.. అసలు వీరిద్దరికీ ఎక్కడ చెడింది అన్న చర్చల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. జనసేన టీడీపీ పొత్తు చర్చలు విఫలం అవ్వడమే దీనికి కారణం అంటున్నారు. టీడీపీని జనసేన 50 సీట్లు అడగగా, చంద్రబాబు కేవలం 16 ఇస్తా అన్నారట. దీనిని పవన్ కళ్యాణ్ అవమానంగా ఫీల్ అయ్యారట పవన్. అందుకే చంద్రబాబుపై పవన్ ఇంతలా విరుచుకుపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే నేను గెలవకపోయినా టీడీపీని ఓడిస్తా అని శబధం చేసి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారట. మరి ముందు ముందుపవన్ ఇంకెన్ని విమర్శలు గుప్పిస్తారో చూద్దాం... 

నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా కోహ్లీ...

విరాట్ కోహ్లీ ఛాలెంజ్ ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. విరాట్ కోహ్లీ ఏంటీ..? ప్రధానికి సవాల్ విసరడం ఏంటీ..?దాన్ని మోడీ కూడా స్వీకరించడం ఏంటీ.. అసలు మోడీకి కోహ్లీ విసిరిన సవాల్ ఏంటీ అనుకుంటున్నారా... ? అదేంటంటే... మోదీకి కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరాడు. అసలు సంగతేంటంటే...రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌లో ఆయన స్వయంగా పుషప్స్‌ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దానితో పాటు రాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌, హృతిక్‌ రోషన్‌ కు ఈ ఫిట్‌నెస్‌ సవాల్ ను విసిరారు. దీంతో సైనా, హృతిక్‌ రోషన్‌ ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మరికొందరికి ఈ సవాలును విసిరారు. తాజాగా కోహ్లీ కూడా రాథోడ్‌ సవాలును స్వీకరించాడు. తాను కసరత్తులు చేసిన వీడియోను పోస్త్ చేస్తూ.. తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ధోనీ ఈ సవాలును స్వీకరించాల్సిందిగా కోరాడు. ఆశ్చర్యం ఏంటంటే.. కోహ్లీ సవాలుకు ప్రధాని మోదీ స్పందించారు. ‘నీ సవాలును స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోను పంచుకుంటాను’ అని తన మోదీ ట్విటర్‌లో తెలిపారు.