బాలకృష్ణకి చంద్రబాబు జ్ఞానోపదేశం!

      భారతంలో బావమరిది అర్జునుడు యుద్ధం చేయనని అస్త్ర సన్యాసం చేస్తే, బావగారైన శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అర్జునుడిని యుద్ధ రంగంలో నిలిపాడు. ఈనాటి ఎన్నికల భారతంలో బావమరిది నందమూరి బాలకృష్ణ ఎన్నికల యుద్ధం చేస్తానని ఉత్సాహం చూపిస్తే, బావగారైన నారా చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణకి జ్ఞానోపదేశం చేసి యుద్ధరంగం నుంచి తప్పించాడు. అసలేం జరిగిందంటే, ‘లెజెండ్’ విజయం సాధించడంతో మాంఛి ఉత్సాహంలో వున్న బాలకృష్ణ ఆ సినిమా విజయయాత్రలో హిందూపురం నుంచి ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్టు ప్రకటించేశాడు. ఆ తర్వాత నేరుగా చంద్రబాబు దగ్గరకి వెళ్ళి హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి తన పేరు అనౌన్స్ చేయమని ఉత్సాహంగా అడిగేశాడట.   బాలకృష్ణ ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పుడు నువ్వు పోటీ చేయడం అవసరమా అని అడిగాడట. దానికి బాలకృష్ణ తాను పోటీ చేయడానికి ఇదే సరైన సమయం అని, ఇప్పుడు పోటీ చేస్తే తాను బంపర్ మెజారిటీతో గెలుస్తానని చెప్పారట. అప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు భారీ స్థాయిలో క్లాసు తీసుకుని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎంత టఫ్‌గా వుందో వివరించడంతోపాటు ఈ ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయడం మంచిది కాదని చెప్పాడట. అయితే బాలకృష్ణ మాత్రం తన ఉత్సాహాన్ని విడిచిపెట్టకపోవడంతో చంద్రబాబు కాస్తంత సీరియస్ అయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పోటీ స్తే ఖచ్చితంగా ఓడిపోతావ్. అప్పుడు ఇటు సినిమాలకి, అటు రాజకీయాలకి జాయింట్‌గా చెడిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చారట. దాంతో జ్ఞానోదయం కలిగిన బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాను కదా.. అక్కడివాళ్ళు, అభిమానులు నిరాశపడతారేమోనని ధర్మసందేహాన్ని వ్యక్తం చేశాడట. అప్పుడు చంద్రబాబు పరిస్థితి మొత్తాన్నీ నేను సెటిల్ చేస్తానుగానీ, ఇకముందు మాత్రం నోరుజారి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని చెప్పాడట. ఈసారి ప్రచారంతో సరిపెట్టుకోమని సూచించాడట. బావగారి నుంచి జ్ఞానోపదేశం పొందిన బాలకృష్ణ బావమాట బంగారు బాట అనుకుంటూ తన డేట్స్ కోసం క్యూలో వున్న ఇద్దరు నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.  

కేసీఆర్ ఆరోగ్యంపై తెరాసలో ఆందోళన

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యం విషయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పడబోయే తొలి ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని తెరాస కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈమధ్యకాలంలో కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళలో ఆందోళన పెరిగింది. వాస్తవానికి కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రమే. ఆమధ్య నిరాహారదీక్ష చేసినప్పుడు ఆరోగ్యం మరింత దిగజారింది. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా కేసీఆర్ తన ఆరోగ్యం గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగించే విధంగా వున్నాయని తెరాస కార్యకర్తలు చెబుతున్నారు.   కేసీఆర్ చాలా సందర్భాలలో తన ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని చెబుతూ వస్తున్నారు. నిన్నగాక మొన్న  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వారి ఆందోళనను మరింత పెంచేలా వున్నాయి. ‘‘దేవుడి దయవల్ల నేను బతికుంటే, ఆరోగ్యం సహరిస్తే తెలంగాణలో అధికారం చేపట్టి సేవ చేస్తాను’’ అని కేసీఆర్ అన్న మాటలు తెరాస కార్యకర్తలకు బాధ కలిగించాయి. కేసీఆర్ నోటి నుంచి ‘బతికుంటే’ అనే మాట రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్ నగర్‌లో నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి వెళ్ళాలని ఎప్పటినుంచో చెబుతున్న కేసీఆర్ ఆనారోగ్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే ఎన్నికల లోపు ఊపిరి సలపకుండా చేసే ప్రచారం కారణంగా తమ నాయకుడి ఆరోగ్యం ఏమవుతోందోనని వారు భయపడుతున్నారు. కేసీఆర్‌కి ఏమీ కాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.  

పవన్ కళ్యాణ్‌కి టీడీపీ గిఫ్ట్

      ఈ ఎన్నికలలో బీజేపీకి, టీడీపికి మద్దతు ప్రకటించిన సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్‌కి తెలుగుదేశం పార్టీ సీట్ల రూపంలో థాంక్స్ చెబుతోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటికి పవన్ కళ్యాణ్ సూచించిన అభ్యర్థులకు కేటాయించేలా లోపాయికారీ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ టిక్కెట్లలో కొన్నింటిని ‘పవన్ కళ్యాణ్ కోటా’ కింద ప్రత్యేకంగా ఉంచినట్టు సమాచారం.   ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్సీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపికైన మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ అనుయాయుడు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పనిచేశాడు. ఏరకంగా చూసినా మేడిపల్లి సత్యానికి చొప్పదండి సీటు ఇవ్వడానికి అవకాశాలు లేవు. సత్యాన్ని మించిన నాయకులు ఆ నియోజకవర్గంలో చాలామంది వున్నారు. మేడిపల్లి సత్యం పవన్ కళ్యాణ్ ‘కోటా’లో వ్యక్తి కావడం వల్లే ఆయనకి సీటు వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా వుంటే తెలంగాణ సీట్లలో తన కోటా మీద పెద్దగా ఆలోచించని పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో మాత్రం తన మనుషులకు కనీసం ఐదు నుంచి పది సీట్లయినా ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. పవన్ కోరిక కూడా సమంజసంగానే వుండటంతో సీమాంధ్రలో పవన్ కోటాకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. త్వరలో ప్రకటించబోయే సీమాంధ్ర అసెంబ్లీ అభ్యర్థులలో పవన్ సూచించిన అభ్యర్థులకు ఛాన్స్ బాగా దొరికే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

సీఎం పదవిపై జగన్ పగటి కలలు!

      తెలంగాణ ప్రాంతలో తన పార్టీ తుడిచిపెట్టుకుపోయినా, సీమాంధ్రలో తన పార్టికి సౌండ్ లేకపోయినా వైసీపీ అధినేత జగన్ కంటున పగటి కలల జోరు ఎంతమాత్రం తగ్గలేదు. సీమాంధ్రకి కాబోయే ముఖ్యమంత్రి తానేని జగన్ చెబుతున్నారు. ఒఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్ తన పగటి కలలను పూసగుచ్చినట్టు వివరించారు. ఆయన కంటున్న పగటి కలలలో కొన్న పాయింట్లు ఇవి.... .....నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం. సీమాంధ్ర ప్రజలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. సీమాంధ్ర ప్రజలంతా పూర్తిగా నావైపే వున్నారు.   .....కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలి? దానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. .....కొత్త రాజధాని నిర్మాణం కోసం నేను అంతర్జాతీయ కన్సల్టెంట్‌తో మాట్లాడుతున్నా. కొత్త రాజధాని పేరు కోస్తా ఆంధ్ర, రాయలసీమ రెండూ ప్రాంతాలనూ ప్రతిబింబించేలా వుంటుంది. .....జపాన్‌లో పరిశ్రమలు నిర్మించడానికి స్థలం లేదు. వాళ్ళంతా సీమాంధ్రలో పెట్టుబడులు పెడతారని నేను అనుకుంటున్నాను.

వైజాగ్ సీటు వైకాపా ఖాతాలోనేనా?

  దగ్గుబాటి దంపతులతో చంద్రబాబు వైరం ఈనాటిది కాదు. బహుశః అది ఎన్నటికీ సమసిపోదని పార్లమెంటు ప్రాంగణంలో యన్టీఆర్ విగ్రహ స్థాపన విషయంలో రుజువయింది, మళ్ళీ ఇప్పుడు పురందేశ్వరికి వైజాగ్ లోక్ సభ టికెట్ విషయంలో మరోమారు రుజువవుతోంది. తెదేపా-బీజేపీ పొత్తులలో భాగంగా వైజాగ్ లోక్ సభ సీటు బీజేపీకి వెళ్ళడంతో, సహజంగానే అది సిటింగ్ యంపీ పురందేశ్వరికే దక్కుతుందని అందరూ భావించారు. కానీ, ఆమెకు ఆ సీటు ఇవ్వకూడదని చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఒకవేళ వైజాగ్ కాకపోతే విజయవాడ లేదా ఒంగోలు నుండయినా ఆమె పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ, బీజేపీకి దక్కిన వైజాగ్ సీటు నుండే ఆమె పోటీకి అభ్యంతరం తెలుపుతున్న చంద్రబాబు, తెదేపా కోటాలో ఉన్న ఆ రెండు సీట్లను ఆమెకు ఇచ్చేందుకు అంగీకరిస్తారని భావించలేము. పైగా ఆ రెండు సీట్లకు ఇప్పటికే తెదేపా అభ్యర్ధులను ఖరారు చేసేసారు కూడా. అందువల్ల పురందేశ్వరి తను ఎక్కడి నుండి పోటీ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారిప్పుడు.   అక్కడ నుండి పోటీ చేసేందుకు సిద్దపడుతున్న సీమంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు అభ్యర్ధిత్వానికి చంద్రబాబు ఎటువంటి అభ్యంతరమూ చెప్పడం లేదని సమాచారం. అయితే పురందేశ్వరితో పోలిస్తే ఆయన చాలా బలహీనమయిన అభ్యర్ధి అని చెప్పవచ్చును.   ఒకవేళ ఆయనే పోటీలో నిలబడితే, జగన్ అక్కడ తమ పార్టీ తరపున తన తల్లి విజయమ్మను పోటీలో నిలబెట్టేందుకు, పురందేశ్వరే పోటీ చేస్తున్నట్లయితే అప్పుడు తన సోదరి షర్మిలను అక్కడ నుండి బరిలో దింపేందుకు సిద్దంగా ఉన్నారని తాజా సమాచారం. హరిబాబుని ఓడించేందుకు విజయమ్మ చాలని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందువల్ల తెదేపా, బీజేపీల సీమాంధ్ర అభ్యర్ధుల తుది జాబితాలు విడుదల కాగానే దానిని బట్టి వైకాపా అభ్యర్ధి ఎవరనేది తేలుతుంది.   కీలకమయిన ఈ ఎన్నికలలో చంద్రబాబు పంతాలకు పోయి, బలమయిన అభ్యర్ధి పురందేశ్వరికి అడ్డుపడి, ఆమె స్థానంలో హరిబాబుని పోటీ చేయిస్తే దానివలన ఆ పార్టీలకే నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైజాగ్ నుండి బీజేపీ తరపున హరిబాబే పోటీలోకి దిగాలని వైకాపా కోరుకోవడం సహజమే. ఒకవేళ ఆయనే పోటీలో దిగితే విజయమ్మకు నామినేషన్ వేయక ముందే సగం విజయం ఖరారు అయిపోయినట్లేనని వైకాపా నేతలు దృడంగా నమ్ముతున్నారు. మరి చంద్రబాబు ఈ సంగతి గ్రహించి పురందేశ్వరికి సహకరిస్తారో లేక తన పంతానికే పోయి వైజాగ్ సీటుని వైకాపా ఖాతాలో జమా చేయిస్తారనే సంగతి నేడో రేపో ఆ పార్టీలు తుది జాబితాలు ప్రకటించగానే తెలిసిపోతుంది.

ఈ ఐడియా కాంగ్రెస్ కి వర్కవుట్ అవుతుందా

  కాంగ్రెస్ పార్టీలో మిగిలిన రఘువీరా రెడ్డి, చిరంజీవి వంటి నేతలందరూ కూడా పార్టీని వీడి బయటకు పోయినవారందరూ ద్రోహులేనని వారికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని ఇంతవరకు పదేపదే కోరారు. కానీ, తమ బస్సుయాత్రకి ప్రజల నుండి బొత్తిగా స్పందన లేకపోవడంతో, వారికి తమ అసలు పరిస్థితి అర్ధమయింది. ఆ తరువాత వారు చిరంజీవి అభిమానులను పోగేసి వారికి కూడా (కాంగ్రెస్) టోపీలు పెట్టేసి, వారంలోగా ఓ పది లక్షల మందిని అర్జెంటుగా పార్టీలో చేర్పించండని హుకుం జారీ చేసారు. కానీ అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది. దానితో దిగాలుపడి కూర్చొన్న వారందరికీ కాంగ్రెస్ హైకమండ్ సరికొత్త ఐడియా ఇచ్చింది. అదే పార్టీ నుండి బయటకు వెళ్ళిన పోయిన వారిని మళ్ళీ సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం!   నిన్నటి వరకు తిట్టినా నోటితోనే మళ్ళీ వారిని ఆహ్వానించడం కొంచెం ఇబ్బందికరమే! అయినప్పటికీ, ఇటువంటి చిలిపి చేష్టలు కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే మరెవరు చేయలేరని నిరూపిస్తూ, సీమాంధ్రలో పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసిన దిగ్విజయ్ సింఘే ఆ పని మొదలుపెట్టక తప్పలేదు. ఆ ప్రయత్నంలో ఇప్పటికే తమ యంపీ సాయి ప్రతాప్ ని వెనక్కి తెచ్చుకొని, “ఇక మీరు కూడా నాలాగే ప్రయత్నిస్తే తప్పకుండా మిగిలిన వారిని కూడా వెనక్కి రప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు” అని ఆయన తన సీమాంధ్ర కాంగ్రెస్ జీవులకు భరోసా ఇచ్చేరు.   ఆయన పాయింటు అందరి కంటే ముందు క్యాచ్ చేసేసిన కిల్లి రాణీ వారు, “కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్ళిన వారిలో 99శాతం మంది ఆ పార్టీలలో ఇమడలేక ‘కాంగ్రెస్ సిండ్రోం’ అనే సమస్యతో బాధపడుతున్నారని నాకు తెలుసు. నా శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన కాంగ్రెస్ నేతలెవరయినా తిరిగి రాదలుచుకొంటే నేనే స్వయంగా వెళ్లి వారికి బొట్టుపెట్టి సాదరంగా పార్టీలోకి తీసుకువచ్చేందుకు సిద్దంగా ఉన్నాను” అని మీడియా ముందు ప్రకటించేశారు. పార్టీలో మిగిలిన కాంగ్రెస్ జీవులు కూడా ఇంచుమించు ఈవిధంగానే మాట్లాడుతున్నారిప్పుడు.   దాదాపు అన్ని నియోజక వర్గాలకు టికెట్స్ ఖరారయిపోయాయని ఇక ప్రకటన వేలువడటమే ఆలశ్యమని చెపుతూ, ఇంకా ఆలసిస్తే ఆశాభంగం తప్పదని అన్యాపదేశంగా తమ మాజీ కాంగ్రెస్ నేతలకు పదేపదే సందేశాలు పంపుతున్నారు. ఇది చూసి మాజీలు ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడకపోయినా ప్రజలు మాత్రం ‘ఔరా కాంగ్రెస్!’ అని ముక్కున వేలేసుకొంటున్నారు. ఒకవేళ వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఇంతకాలం తిట్టిన పార్టీని, తిట్టుకొన్న సహచరులతో ఏవిధంగా కలిసి కాపురం చేస్తారో చూసి తరిద్దామని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరూ వేర్వేరు రంగుల కండువాలు కప్పుకొని వస్తుంటే గుర్తుపట్టలేక తికమక పడుతున్న ప్రజలు కూడా మళ్ళీ వారందరూ ఒక్క గూటికి చేరుకొంటే తమపని సులువయిపోతుందని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అలాగే వారివల్ల టికెట్స్ పోగొట్టుకొన్న ఇతర పార్టీల నేతలు కూడా వారు బయటకు దయచేస్తే కొబ్బరికాయలు కొట్టేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ‘ఇదంతా జరిగేపనేనా!’ అని అందరూ అపనమ్మకంతోనే ఉన్నారు ఇంకా.

కోమటిరెడ్డి కొంప కొల్లేరవుతుందా?

      సీమాంధ్రులను నోటికొచ్చినట్టు తిట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంప కొల్లేరయ్యే పరిస్థితి ఇప్పుడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి తాను ఎన్నికల సంఘానికి సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో తాను హైదరాబాద్‌లో బీటెక్ చదివినట్టు రాశాడట.   అసలు విషయమేంటంటే హైదరాబాద్‌లో బీటెక్ చదవడానికి చేరిన అయ్యగారికి అంత సీన్ లేక మధ్యలోనే చదువు మానేసి ఎవరైనా రాణించగలిగే రాజకీయ రంగానికి షిష్టయ్యారట. చదువు పూర్తి చేయకుండానే బిల్డప్పు కోసం చదివేసినట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న విషయాన్ని అక్కడి టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు కనిపెట్టేశారు. వెంకట్‌రెడ్డికి అంత సీన్ లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఎన్నికల సంఘానికి చూపించారు. దాంతో కోమటిరెడ్డి ఇరకాటంలో పడ్డాడు. ఎన్నికల సంఘం తప్పుడు సమాచారం ఇచ్చావంటూ కోమటిరెడ్డి నామినేషన్ తిరస్కరిస్తే ఇక ఐదేళ్ళపాటు సారుగారు ఈగలు తోలుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే.

బాలయ్యకు కూడా బాబు హ్యాండ్?

  తెదేపాలో సీనియర్ నేత రేవంత్ రెడ్డి పరిస్థితి చూసిన తరువాత, ఇంకా టికెట్ దొరకని సీమాంధ్ర తెదేపా నేతల గుండెల్లో కూడా రైళ్ళు పరిగెడుతున్నాయి. చంద్రబాబుకి స్వయాన్న వియ్యంకుడయిన బాలకృష్ణ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనబడటం లేదు.   “బాలయ్య లోక్ సభకు పోటీ చేస్తారో లేకపోతే శాసనసభలే పోటీ చేస్తారో, ఎక్కడి నుండి పోటీ చేస్తారో అంతా ఆయనిష్టం. ఆయన ఎక్కడి నుండి దేనికి పోటీ చేయాలనుకొన్నా నాకెటువంటి అభ్యంతరమూ లేదు,” నిన్న మొన్నటి వరకు చెపుతూ వచ్చిన చంద్రబాబు, మొన్న విడుదల చేసిన మొదటి జాబితాలో బాలకృష్ణ పేరు లేకపోవడంతో మీడియా అదే ప్రశ్న లేవనెత్తినపుడు, “ఈవిషయమై బాలయ్యతో చర్చించవలసి ఉంది. ఆయనతో చర్చిన తరువాత నిర్ణయం తీసుకొంటాము” అని చెప్పడం గమనిస్తే, బాలయ్యకు కూడా చంద్రబాబు హ్యాండ్ ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ, ఆయన పోటీ చేయాలనుకొంటున్న హిందూపురం నియోజక వర్గానికి వేరే ఏ అభ్యర్ధిని మొదటి జాబితాలో ప్రకటించకపోవడం చూస్తే ఇంకా బాలయ్యకు అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ ఈసారి కూడా ఆయనను ప్రచారానికే వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిజమనుకొంటే, బాలయ్యను ప్రచారానికి ఒప్పించగలిగితే ఆ సీటుని వేరొకరికి లేకుంటే ఆయనకే కేటాయించేందుకు ఆలోచిస్తున్నారేమో అనుకోవలసి ఉంటుంది!   సీమాంద్రాలో కూడా నామినేషన్లు వేయడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమె మిగిలి ఉంది గనుక ఈలోగా ఒకరి స్పందన మరొకరు చూసిన తరువాతనే ఈ విషయంపై మాట్లాడుకోవచ్చని భావిస్తున్నట్లున్నారు. అందుకే ఇద్దరూ బయటపడకుండా ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని చెపుతున్నారు. ఏమయినప్పటికీ, మరొక రెండు రోజుల్లో లిజండ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారో లేదో స్పష్టమయిపోతుంది. 

మోడీ పెళ్ళి కాంగ్రెస్‌ చావుకొచ్చింది!

      ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందంటారే.. అచ్చం అలాంటి సిట్యుయేషనే జాతీయ రాజకీయాల్లో వచ్చింది. బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ వదోదరా పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేస్తూ తనకు 17 సంవత్సరాల వయసు వున్న సమయంలో యశోదాబెన్ అనే అమ్మాయితో పెళ్ళయిందని డిక్లేర్ చేయడం కాంగ్రెస్ పార్టీ చచ్చే చావు తెచ్చిపెట్టింది.   నరేంద్ర మోడీ పెళ్ళి విషయంలో ప్రజల్లో వున్న కన్ఫ్యూజన్ తొలగిపోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీ మోడీని విమర్శించడానికి ఒక ఆయుధంగా పెట్టుకున్న మోడీ పెళ్ళి వ్యవహారం కూడా ఇప్పుడు ఆ పార్టీ చేతుల్లోంచి జారిపోయింది. 17 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిన మోడీ ఆ తర్వాత దేశసేవ కోసం సంసార బంధాలు వదిలించుకున్నారు. ప్రజాసేవలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. మోడీ పెళ్ళి విషయంలో ఏదో రహస్యం దాచేస్తున్నట్టు కాంగ్రస్ పార్టీ లేనిపోని హడావిడి చేస్తూ ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు మోడీ తనకు పెళ్ళి జరిగినట్టు తానే స్వయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో వున్న ఒక ఆయుధం మాయమైపోయింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ చావుకి మార్గం మరింత సుగమమైంది.

వైఎస్సార్ కాంగ్రెస్ : సినిమావాళ్ళతో డ్రామా!

      ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో పాతాళంలో కూరుకుపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి ఇంకా వుందని చాటుకోవడానికి చేతనైన డ్రామాలన్నీ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. బుధవారం తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా నియోజకవర్గాలలో నామినేషన్లే పడలేదు. మిగతా స్థానాల్లో నామినేషన్లు వేసిన వాళ్లు కూడా ఆరు నూరైనా, భూమి తలకిందులైనా గెలవని వాళ్లే. దీన్ని చూసి తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ సమాధైపోయినట్టేనని జనంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిసైడైపోయారు. కనీసం సీమాంధ్రలో అయినా ఉనికి చాటుకుందామనే ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న పనులు చిత్రంగా వున్నాయి. తన చిత్రమైన పనుల్లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో పనిలేకుండా వున్నవాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ మా పార్టీకి ఎంత క్రేజుందో చూశారా అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. వంద సినిమాలు చేసేసి ప్రస్తుతం చేసే పనేమీ లేక విశ్రాంతి తీసుకుంటున్న దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని పార్టీలో చేర్చుకుంది. తెలుగు సినిమా రంగం, ప్రేక్షకులు ఏనాడో మర్చిపోయిన పూర్ణిమని గురువారం పార్టీలో చేర్చుకుని వైసీపీ నాయకులు మురిసిపోతున్నారు. ఈ ఎన్నికలలో దుంపనాశనం కాబోతున్న ఈ పార్టీకి చివరికి మిగిలేది ఈ ఆనందమేనేమో!

మెగా తమ్ముడు కనబడుట లేదు

  రాజకీయాలలోకి దూకుతా...దుమ్ము దులుపుతా...తాట తీస్తా..అంటూ రంకెలు వేసి జనసేనతో జనాల మధ్యకు ఊడిపడిన పవన్ కళ్యాణ్, తన రెండవ (వైజాగ్) సభతోనే పార్టీకి మంగళ హారతి పాడేసి మళ్ళీ కనబడకుండా మాయమయిపోయాడు. “ఆయన సోదరజీవి ప్రజారాజ్యాన్ని దాదాపు ఓ ఏడాది పాటు నెట్టుకొచ్చి చివరికి కాంగ్రెస్ గూటికి చేర్చగలిగాడు. కానీ, ఈ మెగా తమ్ముడు మాత్రం ముచ్చటగా మూడో మీటింగ్ కూడా అవసరం లేకుండానే బోర్డు తిప్పేసి చేజేతులా పరువు తీసుకొన్నాడు” అని జనాభిప్రాయం. “కనీసం ఎన్నికలలో ఓ పది మందిని నిలబెట్టి ఓడిపోయినా ఇంత ఇదిగా ఉండేది కాదు కదాని” అనుకొంటున్నారు. అయితే కాకుల వంటి లోకులు అప్పుడు మాత్రం నోరు పారేసుకోరని గ్యారంటీ ఏమీ లేదు గనుకనే ఇంకా టైము, డబ్బు, శ్రమ ఎందుకని పవన్ బాబు బ్రేకులేసుకొని జనసేన బండిని గ్యారేజీలో పార్క్ చేసేసాడు. అయితే దానిని లోపల పెట్టక ముందే మళ్ళీ వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ దుమ్ము దులిపి, సర్వీసింగ్ చేయించి తప్పకుండా బయటకి తీస్తానని ఆయన హామీ కూడా ఇచ్చేరు.   ‘ఈ లోగా మరో ఐదో పదో సినిమాలు తీసుకొని పదో పరకో పోగేసుకొంటూ, ఏవయినా కొత్త రచనలు కూడా మొదలుపెడితే బెటర్ కదా’ అని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ‘రాజకీయాలలోకి వచ్చే దమ్ము, దైర్యం లేనప్పుడు అలా జగన్ గురించి కాంగ్రెస్ గురించి నోరు పారేసుకోవడం ఎందుకు, కొత్త శత్రువులను సృష్టించుకోవడం ఎందుకు? ఒకవేళ రేపు వారే అధికారంలోకి వస్తే తీరికగా బాధపడటం ఎందుకని’ కొందరు శ్రేయోభిలాషులు బాధ పడుతున్నారు.   ఆయన ఎన్నికల వేళా పనిగట్టుకొని పార్టీ పెట్టి, గుజరాత్ వెళ్లి మోడీకి దండం పెట్టి, అడగకుండానే తమ పార్టీలకే మద్దతు ప్రకటించినందుకు తెదేపా, బీజేపీలు చాలా సంతోషిస్తున్నపటికీ కనీసం తమ పార్టీలకి ఉచిత ఎన్నికల ప్రచారమయినా చేయకుండా ఎలా వచ్చాడో అలాగే మాయమయిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ‘ఇంత హడావుడి చేసిన తరువాత ఈ చిన్నసాయం చేసిపెట్టినా బాగుండేది కదా!’ అని సదరు పార్టీల నేతలు నిట్టూర్పులు విడుస్తున్నారు.   ‘చేతిలో కత్తిలాంటి ఛానలొకటి, న్యూస్ పేపర్ ఒకటీ ఉంది గాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే మెగా ఫ్యాన్ల ధాటికి తమ ఫ్యాన్ తిరగడం కూడా కనా కష్టమయిపోయేది కదా!’ అనుకొంటూ జగన్ పార్టీ వాళ్ళు మెటికలు విరిచారు.   మొత్తం మీద పవన్ కళ్యాణ్ మీకు నచ్చిన వాళ్ళకే ఓటేసుకోమని జనాలకి పర్మిషన్ కూడా ఇచ్చేసి వచ్చినంత వేగంగాను మాయమయిపోయారు. జనాలు మాత్రం “ఎవరో వస్తారని... ఏదో చేస్తారని...ఎదురు చూసి మోసపోకుమా..’ అనే పాత పాటనే మళ్ళీ పాడుకొంటూ ఎదురుగా కనబడుతున్న పాత పార్టీలలో కొత్తగా చేరిన పాత కాంగ్రెస్ నేతలకి ఓటేయాలా వద్దా... అని డైలేమాలో ఉన్నారు.

రేవంత్‌రెడ్డిని వాడుకుని వదిలేశారు!

      తెలుగుదేశం పార్టీలో సత్తావున్న నాయకులలో ఒకరైన రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అండగా నిలిచిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కూరలో ఏరిపారేసే కరివేపాకులా వాడుకుని వదిలేసిన వ్యక్తిలా అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని అంటున్నారు. ఈ అంశం పూర్వాపరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా వున్న రేవంత్‌రెడ్డి గత రెండు సంవత్సరాలుగా తనకు వచ్చే ఎన్నికలలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి వుందని చెబుతూ వస్తున్నారు. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. మంచి వాగ్ధాటి, అన్ని అంశాల మీద సంపూర్ణమైన అవగాహన, విషయ పరిజ్ఞానం వున్న రేవంత్‌రెడ్డిని చంద్రబాబు రాజకీయంగా బాగా ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్నారని అనడం కంటే, అడ్డదిడ్డంగా వాడుకున్నారనడం బెటర్. అటు జగన్ మీదకి అయినా, కిరణ్ కుమార్‌రెడ్డి మీదకి అయినా, ఇటు కేసీఆర్ దగ్గర్నుంచి ఏ తెలంగాణ నాయకుడి మీదకి అయినా రేవంత్‌రెడ్డి అనే అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించేవారు. రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసి తెలుగుదేశానికి రాజకీయంగా మైలేజీ పెంచారు. అలా తెలుగుదేశం పార్టీకి అస్త్రంలా ఉపయోగపడిన రేవంత్‌రెడ్డి వస్త్రాలు ఒలిచే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. ఈ ఎన్నికలలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని రేవంత్‌రెడ్డి చంద్రబాబు దగ్గర వ్యక్తం చేసినప్పుడు అటు వైపు నుంచి నో రెస్పాన్స్. ఆ తర్వాత రేవంత్‌రెడ్డికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా కట్టయింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు టిక్కెట్ రేవంత్‌రెడ్డిని కాదని ఆర్థికంగా బలంగా వున్న ఒక వ్యాపారవేత్తకు ఇచ్చే ప్రయత్నం జరిగినప్పుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మల్కాజిగిరి టిక్కెట్ని సదరు వ్యాపారికి కేటాయించడానికి నలభై కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు కూడా వున్నాయి. తనకు టికెట్ కేటాయించాలని మరోసారి కోరేందుకు రేవంత్‌రెడ్డి మూడు రోజులుగా చంద్రబాబుని కలవటానికి ప్రయత్నిస్తున్నా బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగిన తనకు ఇప్పుడు అపాయింట్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి వచ్చేసరికి రేవంత్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. టిక్కెట్ ఇవ్వకపోయినా తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచే నామినేషన్ వేస్తానని రేవంత్‌రెడ్డి బెదిరించేసరికి చంద్రబాబు దూతలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ రంగంలోకి దిగి రేవంత్‌రెడ్డిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రేవంత్‌రెడ్డి  నామినేషన్ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేశారు. దీనికితోడు బుధవారం నాడు కోడంగల్ అసెంబ్లీ స్థానానికి రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో నామినేషన్లకు బుధవారమే చివరి రోజు కావడంతో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాలా.. లేక పార్టీ చెప్పిన సీటులో నామినేషన్ వేయలా అన్న సందిగ్ధంలో రేవంత్‌రెడ్డి వున్నారు. ఇంతకాలం పార్టీకి సేవ చేసినా తనను చంద్రబాబు ఎంతమాత్రం పట్టించుకోకపోవడం, కనీసం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి అయినా మాట్లాడకుండా మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడపటం పట్ల రేవంత్‌రెడ్డి ఎంతో బాధపడుతున్నట్టు సమాచారం. కనీసం తాను చంద్రబాబు స్వయంగా మాట్లాడ్డానికి కూడా పనికిరాకుండా పోయానా అని తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సీట్లకి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారా?

  రాజకీయ పార్టీలు సీట్లకు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ, ఆయా సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడేలా చేసి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా డిమాండ్ సృష్టించడం ద్వారా పార్టీలకు ఆర్థికంగా బాగా గిట్టుబాటు అవుతున్నట్టు కనిపిస్తోందని పరిశీకులు అంటున్నారు. రాష్ట్రంలో చాలా సీట్ల విషయంలో అనేకమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా సీట్లను పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆశిస్తున్నారు. వారిలో ఆయా టిక్కెట్ల మీద భారీగా ఆశలు పెంచిన తర్వాత, పార్టీలోని కొంతమంది సదరు టిక్కెట్లను ఆశిస్తున్నట్టు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఈ టిక్కెట్ మీకు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నామని సదరు సౌండ్ పార్టీలకు చెబుతున్నారు. దాంతో పారిశ్రామికవేత్తలు ఎంత ఖర్చయినా పర్లేదు నాకు టిక్కెట్ కావాల్సిందేనని పట్టుపట్టేట్టు చేస్తున్నారు. దాంతో పార్టీల అధ్యక్షులు భారీ స్థాయిలో ‘పార్టీఫండ్’ డిమాండ్ చేసి వారికి టిక్కెట్లు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చేతులు మారుతున్న డబ్బు 40 కోట్లు దాటిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీకులు చెబుతున్నారు. ఈ ధోరణి ఏ ఒక్క పార్టీలోనో కాకుండా.. అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోందని అంటున్నారు. పంచ్ లైన్ సీట్ ఫర్ సేల్

టీడీపీకి ‘కన్నా’లు పొడుస్తున్నారు!

      గుంటూరు-2 నియోజకవర్గంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను భారీ మెజారిటీతో గెలిపించడానికి తెలుగుదేశం నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ మాట చదివి మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు. కాంగ్రెస్ నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణని గెలిపించడానికి టీడీపీ నాయకులు కృషి చేయడమేంటబ్బా అని మీకు అనిపించడం న్యాయం. ఒకవేళ అలా జరుగుతోందంటే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌కి గుడ్ బై కొట్టేసి తెలుగుదేశంలో చేరబోతున్నారా అనే డౌట్ కూడా రావొచ్చు. కానీ, కన్నా అలా పార్టీ మారకుండానే కన్నా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే పరిస్థితులు కొంతమంది స్థానిక తెలుగుదేశం నాయకులు కల్పిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఇష్యూ గురించి పూర్తి సమాచారం చిత్తగించండి...     సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాషౌట్ అయిపోయింది. మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ గెలుపు కూడా డౌట్‌గానే వుంది. తెలుగుదేశం పార్టీ అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని నిలబెడితే కన్నా లక్ష్మీనారాయణ గుండెజారి, డిపాజిట్ గల్లంతయ్యే ఛాన్సుంది. ఈ విషయాన్ని ఆలోచించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. ఆ అన్వేషణలో ఆయనకి సరైన వ్యక్తి కనిపించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు... తులసీ సీడ్స్ అధినేత రామచంద్రప్రభు. సౌమ్యుడిగా, సమర్థుడిగా, ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం మీద పూర్తి అవగాహన వున్న వ్యక్తిగా, వివాద రహితుడిగా, సేవాభావం వున్న వ్యక్తిగా  మంచి పేరు వున్న రామచంద్ర ప్రభును గుంటూరు-2 నియోజవర్గం నుంచి కన్నా మీద పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావించారు. ఈ మేరకు రామచంద్రప్రభును పిలిపించి మాట్లాడారు. కన్నా మీద పోటీ చేయాలని చంద్రబాబు కోరినప్పుడు రామచంద్రప్రభు తన అంగీకారాన్ని తెలిజేశారు. రామచంద్రప్రభు గుంటూరు-2 నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని ఫిక్సయిపోయారు. అయితే ఇక్కడే స్థానిక తెలుగుదేశంలో వున్న కొంతమంది సైంధవులు రామచంద్రప్రభు మీద తమ చాణక్య నీతి ప్రయోగించడం ప్రారంభించారు. నర్సరావుపేట ఎంపీ సీటు దక్కని మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి అక్కడి తెలుగుదేశంలో ఒక వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా మోదుగులను రెచ్చగొడుతోంది. మోదుగుల గుంటూరు-2లో పోటీ చేస్తే కాపు సామాజికవర్గం ఓట్లు రాలవని, ఓడిపోవడం ఖాయమని తెలిసి కూడా గుంటూరు-2 నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యుడైన ‘ఒక పెద్దమనిషి’ ఆ దిశగానే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సదరు పెద్దమనిషికి రామచంద్రప్రభు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించనట్టుగా, పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇస్తానని చెప్పినా, స్థానిక తెలుగుదేశం కీలక నాయకుడు దానికి మోకాలు అడ్డే ప్రయత్నం చేయడం, చివరకు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం రామచంద్రప్రభుకు మనస్తాపం కలిగించినట్టు సమాచారం. ఇలాంటి అవమానకర వాతావరణంలో ఆయన గుంటూరు-2 నుంచి పోటీ చేయకుండా వుండటమే ఉత్తమమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు-2 గంజాయి వనంలో తులసిమొక్కకు గౌరవాన్ని ఆశించడం అత్యాశే అయింది. అయితే సరైన అభ్యర్థి అయిన రామచంద్రప్రభు విషయంలో ఇలా వ్యవహరించడం మంచిది కాదని, ఆయన్ని వదులుకుంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోవడం ఖాయమని స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో వున్న కన్నా ఇప్పటికే 20 కోట్లు ఖర్చుపెట్టారట. తనమీద తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని నిలపకుండా ఓడిపోయే అభ్యర్థిని నిలిపేలా చేయడం కోసం కన్నా జిల్లా తెలుగుదేశం ‘పెద్దలతో’ టచ్‌లో వున్నట్టు వినికిడి. ఈ విషయంలో డబ్బు భారీగా చేతులు మారినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు-2 నియోజకవర్గం విషయంలో జరుగుతున్న ఈ అంతర్గత రాజకీయం గురించి, తెలుగుదేశం పార్టీకి ‘కన్నా’లు పొడుస్తున్న నాయకుల గురించి పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.  

సోనియా, రాహుల్ తల్లీకొడుకులు కాదా?

      కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తల్లీకొడుకులు కాదా? ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తోంది ఎవరో కాదు.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు! కొడుకును ప్రధానమంత్రి చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా సిద్ధమైన సోనియాగాంధీ రాహుల్ గాంధీకి తల్లి అవునా కాదా అనే సందేహం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే కొంత డెప్త్ లోకి వెళ్ళాల్సిన అవసరం వుంది.   సోమవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 111 స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితా చూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలామంది  షాకైపోయారు. ఎందుకంటే, లిస్టులో వాళ్ళ పేర్లయితే వున్నాయిగానీ, వివిధ స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న వాళ్ళ పుత్రరత్నాలకు మాత్రం టిక్కెట్లు దక్కలేదు. ఇక టిక్కెట్లు వచ్చేస్తాయ్.. పోటీ చేసి గెలిచేద్దాం అని ఎదురుచూసిన సీనియర్ నాయకులు, పుత్రరత్నాలు జాయింట్‌గా బిత్తరపోయారు. ఎందుకిలా? అని అధిష్ఠానాన్ని అడిగితే ‘ఇంటికి ఒక్కటే టిక్కెట్’ అని బ్లంట్‌గా చెప్పేసింది. దాంతో వాళ్ళకి భోరున ఏడవటం ఒక్కటే తక్కువైంది. మా పుత్రరత్నాలకు టిక్కట్లు ఇవ్వలేదు. వారసులకు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వమని చెబుతున్నారు. మరి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తల్లీ కొడుకులే కదా.. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో వుండే ఒకే కుటుంబానికి చెందినవాళ్ళే కదా.. మరి వాళ్ళిద్దరికీ పార్టీ టిక్కెట్లు ఎందుకు ఇచ్చిందో అని అమాయకంగా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు తల్లీకొడుకులు కాదేమోనని ఆగ్రహంగా అంటున్నారు. వాళ్ళకి వర్తించని రూల్స్ మాకెందుకు వర్తించాయో అనుకుంటున్నారు!

అన్ని పార్టీలలో ఎన్నికళలు!

  రాష్ట్రంలో ఈనేలో 30న జరిగే మొదటిదశ ఎన్నికలకి నామినేషన్లు వేయడానికి ఈరోజే ఆఖరి రోజు. అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధులను దాదాపుగా ప్రకటించినప్పటికీ, ముఖ్యమయిన కొన్ని స్థానాలపై ఇంకా పట్లుపడుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలలో కూడా టికెట్ దొరకని నేతలు, వారి అనుచరులు వీరంగం వేస్తున్నారు. కొందరు చురుకయిన నేతలు చకచకా కండువాలు, టోపీలు, పార్టీలు మార్చేసి టికెట్స్ దక్కించుకొంటే, మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. అయితే ‘నామినేషన్ల ఉపసంహరణ’ అనే వెసులుబాటు అటువంటివారిని బుజ్జగించి బరిలోనుండి తప్పించేందుకే ఉంది కనుక అప్పటికి అన్ని పార్టీలలో చెలరేగిన అశాంతి కొంతవరకు సర్దుమణగవచ్చును. కానీ పొత్తుల్లో భాగంగా టికెట్ దొరకని తమ పార్టీ నేతలని సదరు పార్టీలే స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించి, వారిపై బహిష్కరణ వేటు కూడా వేసి, ఎన్నికలలో గెలిచిన తరువాత ఆ బహిష్కరణ ఎత్తివేసి తిరిగి పార్టీలోకి రప్పించుకోవడం గతంలోనే చాలాసార్లు జరిగింది. గనుక రాజకీయ పార్టీలు, వాటిని వదిలి వెళ్ళిన లేదా పార్టీల గోడలు దూకి టికెట్ సాధించుకొన్న అభ్యర్ధులు అందరూ ఒక తానులో ముక్కలేనని స్పష్టమవుతోంది. అన్ని పార్టీల, నేతల ఏకైక లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకోవడమే తప్ప వేరేమి కాదని వారి ఈ చేష్టలే నిరూపిస్తున్నాయి. ఇంతకాలం ప్రజలను చైతన్యపరిచేందుకు యాత్రలు చేసిన సదరు నేతల ఆలోచనలు, పద్దతులలో ఎన్నడూ మార్పు రాబోదని, ప్రజలు అటువంటివి ఆశించడం అత్యాశే అవుతుందని నిరూపిస్తున్నారు. అందువల్ల ప్రజలు కూడా ఇవ్వన్నీ ప్రతీ ఎన్నికల ముందు కనబడే సర్వ సాదారణ దృశ్యాలే అని సరిబెట్టుకొని వారిలోనే ఎవరికో ఒకరికి ఓటేసి వస్తుంటారు.

రెండు చోట్ల కేసీఆర్ పోటీ : అపనమ్మక ప్రభావం!

  తెలంగాణలో తెరాస అధికారంలోకి రాగలిగినంత మెజారిటీ సాధించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు ఎప్పుడూ చెబుతూనే వున్నారు. ఆ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఉత్తర తెలంగాణలో తప్ప దక్షిణ తెలంగాణలో పట్టులేని తెరాస తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది కలలో మాట. ఈ విషయం కేసీఆర్‌కి కూడా తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత తన పార్టీకి మెజారిటీ రావడం సంగతి దేవుడెరుగు, అసలు ఎన్నిసీట్లు గెలుస్తామో కూడా ఊహించలేని పరిస్థికి కేసీఆర్ చేరుకున్నారు. ఇంతకాలం తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కేసీఆర్ పెంచుకున్న ఆశల మంచు చాలా వేగంగా కరిగిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కళ్ళ ముందు వాస్తవ పరిస్థితి కనిపిస్తోంది. తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్న వాస్తవ అపనమ్మకి కేసీఆర్‌లో నిండిపోయింది. అందుకే అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయాలన్న ఆలోచనకి కార్యరూపం తీసుకొచ్చారు. గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నారు. పొరపాటున, ఊహించని విధంగా, అనుకోకుండా తెరాసకి మెజారిటీ వస్తే అసెంబ్లీ సీటు ఆధారంగా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. మెజారిటీ రాకపోతే ఢిల్లీలో హడావిడి చేయడానికి ఎంపీ సీటు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సరికొత్త రోగం : కేజ్రీవాల్ ఫోబియా

  ప్రపంచ వైద్య చరిత్రలో ఒక సరికొత్త రోగం తెరమీదకి వచ్చింది. ఆ రోగం పేరు ‘కేజ్రీవాల్ ఫోబియా’. ఇది ఒక మానసిక రోగం. మానడానికి ఎంతమాత్రం అవకాశం లేని రోగం. జనం నమ్మకాన్ని వమ్ము చేసిన రాజకీయ నాయకులకు మాత్రమే ఈ రోగం వచ్చే అవకాశం వుంది. ఈ రోగ లక్షణాలు ఎలా వుంటాయంటే, తాను జనం మధ్యలో వుండగా ఎవరో ఒక సామాన్యుడు తన ముందుకు వచ్చి చెంప చెళ్ళుమనిపిస్తాడని సదరు రాజకీయ నాయకుడు ఎప్పుడూ భయపడుతూ వుంటాడు. పైకి మాత్రం ‘నేను ప్రజాసేవకుడిని, సమస్యల పరిష్కరామే నాకు ముఖ్యం. నన్ను ఎవరు, ఎక్కడకి రమ్మన్నా వస్తా. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి’ అని కేజ్రీవాల్ తరహాలో స్టేట్‌మెంట్లు ఇస్తూ వుంటారు. ఈ రోగం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి మొట్టమొదటిసారి వచ్చంది కాబట్టి దీనికి ‘కేజ్రీవాల్ ఫోబియా’ అని పేరు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ రోగం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులకు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఈ మూడు పార్టీల నాయకులు సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రాష్ట్రం అన్యాయంగా ముక్కలయ్యేందుకు సహకరించారు. ప్రజల మనసులను గాయపరిచారు. ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో అర్థంకాకుండా వున్నారు. నమ్మకద్రోహం చేసిన తమకు ప్రజల నుంచి ‘చెంపదెబ్బ’ లాంటి సత్కారాలు జరుగుతాయేమోనని భయపడుతూ వున్నారు. ఇలా భయపడీ భయపడీ వీళ్ళకు ‘కేజ్రీవాల్ ఫోబియా’ వచ్చే అవకాశం వుంది.

కేసీఆర్‌కి కోదండరామ్ పెంపుడుకుక్కా?

      పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మొదటి నుంచీ టీఆర్ఎస్‌కి, కేసీఆర్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో వాస్తవాలు అందరికీ తెలుసు. దీనిమీద తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే వుంది. కోదండరామ్ కేవలం టీఆర్ఎస్‌కి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వుంటారని, టీఆర్ఎస్ ఆదేశాలను పాటిస్తూ వుంటారని, తెలంగాణ కోసం కృషి చేస్తున్న మిగతా పార్టీలను ఎంతమాత్రం పట్టించుకోరని అంటూ వుంటారు. ఇవన్నీ ఇలా వుంటే, కోదండరామ్ గురించి తెలుగుదేశం శాసనసభ్యుడు, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాపలా కుక్కలా వుంటానని చెప్పుకునే కోదండరామ్ కేసీఆర్ పెంపుడుకుక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోదండరామ్ ఒక ప్రొఫెసర్‌లా కాకుండా పోరంబోకు లాగా మాట్లాడుతూ వుంటారని నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. కోదండరామ్ వ్యవహారశైలి టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నట్టు వుంటుందే తప్ప, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్‌ స్థాయిలో వుండదని నర్సిరెడ్డి దుయ్యబట్టారు. తమకు నచ్చని పార్టీలు తెలంగాణలో వుండకూడదనే ప్రజాస్వామ్య విరుద్ధమైన ధోరణి కేసీఆర్‌లో, కోదండరామ్‌లో కనిపిస్తున్నాయని నర్సిరెడ్డి విమర్శించారు.