గుంటూరులో మహేష్‌బాబు ప్రచారం?

      గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ‘ప్రిన్స్’ మహేష్‌బాబు బావ, గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో మహేష్ తన బావకి ఎన్నికల ప్రచారం చేస్తాడా,లేదా అనే సందేహం రాజకీయ వర్గాల్లో నెలకొని వుంది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మహేష్‌బాబుకి ఇష్టం వుండదని ఆయన మనసు తెలిసిన వారు చెబుతున్నారు.   అయితే మహేష్ మనసు మార్చుకుని ప్రచారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మళ్ళీ వారే అంటున్నారు.  అయితే మహేష్‌బాబును ప్రచారం కోసం గుంటూరుకు తీసుకురావడానికి గల్లా కుటుంబం శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు మాత్రం రాకుండా వుండటానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఒక్కసారి రాజకీయ ప్రచారానికి వస్తే ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు అవకాశం దొరికితే తనమీద కూడా విమర్శలు కురిపించే అవకాశం వుందని, అలా ఇతరులకు అవకాశం ఇవ్వడం ఎందుకని మహేష్ బాబు అంటున్నట్టు తెలుస్తోంది. అయితే వివాదాస్పద అంశాల జోలికి పోకుండా, రాజకీయాల గురించి మాట్లాడకుండా జయదేవ్‌కి ఓటు వేయండని చెప్తే సరిపోతుందని మహేష్‌కి సర్ది చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఇప్పటికే ట్విట్టర్‌లో తన బావకి ప్రచారం చేస్తున్నాడు. మంచి వ్యక్తి అయిన జయదేవ్ రాజకీయాల్లో కొనసాగడానికి అన్నివిధాల అర్హుడని మహేష్ ట్వీట్ చేశాడు. అలాగే గుంటూరు పార్లమెంట్  నియోజకవర్గంలో తన బావకు సహరించాలని ఇప్పటికే తన ఫ్యాన్స్ కి మహేష్ సందేశాన్ని పంపినట్టు తెలుస్తోంది.  

సోనియా కరీంనగర్ సభ ఫెయిలయిందా?

      కరీంనగర్‌లో సోనియాగాంధీ చేత సభను నిర్వహించాలని టీ కాంగ్రెస్ నేతలు ఎన్నో తంటాలు పడి ఆమెను కరీంనగర్‌కి పిలిపించారు. ఈ సభ నిర్వహణకు, జనం తరలింపుకి అయిన ఖర్చంతా తమ జేబుల్లోంచే వేసుకుని సోనియమ్మని పిలిపించారు. ఎప్పుడో ఐదేళ్ళ క్రితం కరీంనగర్ సభలోనే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది.   ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది కాబట్టి మళ్ళీ కరీంగనగర్‌లోనే సోనియా సభ పెడితే తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌తో తడిచిపోయి కాంగ్రెస్‌కి ఓటేస్తారన్నది టీ కాంగ్రెస్ నేతల  ప్లాన్. ఈ ప్లాన్‌లో భాగంగా సోనియా రావడం, కరీంనగర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించడం, తెలంగాణ ఇచ్చిన ఘనత తమదేనని మిగతా ఏ పార్టీకి సంబంధం లేదని ప్రకటించేసింది. అయితే సోనియా సభ సూపర్‌గా జరిగిందని టీ కాంగ్రెస్ నాయకులు మీడియా మైకుల ముందు సంతోషంతో మెలికలు తిరిగిపోతూ చెబుతున్నప్పటికీ, వారి మనసులలో సభ జరిగిన తీరు సంతోషాన్ని కలిగించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. సోనియా వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిందే తప్ప సభలో వున్న జనాన్ని ఆమె ప్రసంగం అంతగా ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ చెప్పే అరిగిపోయే రికార్డు డైలాగులే తప్ప కొత్త డైలాగులు సోనియా చెప్పలేదు. అది కూడా అర్థం కాని హిందీలో చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమె ఏం మాట్లాడిందో ఏమీ అర్థం కాలేదని సభలో పాల్గొన్న మహిళలు అనుకున్నట్టు సమాచారం. అలాగే సోనియా మాట్లాడుతున్నంతసేపూ సభలో వున్న జనం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఏదో మాట్లాడుతోంది కాబట్టి వింటున్నాం అన్నట్టుగా సభ సాగింది. మరి ఇలా చప్పగా జరిగిన సభ తమకు ఎంతమాత్రం ఓట్లు రాలుస్తుందన్న అనుమానం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వుంది.  

కరీంనగర్ సభలో టీఆర్ఎస్ రసాభస?

      బుధవారం కరీంనగర్‌లో జరిగే సోనియాగాంధీ సభని సూపర్ సక్సెస్ చేసి మేడమ్ అనుగ్రహాన్ని పొందాలని టీ కాంగ్రెస్ నేతలు నానా తంటాలూ పడుతూ వుంటే, ఆ సభలో రసాభస సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ కాకుండా వేరే ఏ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే, ఆ సభల్లో దూరిపోయి కీలక సమయంలో నినాదాలు చేసి సభలో రసాభస సృష్టించడం టీఆర్ఎస్‌ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్నోసార్లు ఈ విద్యని ప్రదర్శించి టీఆర్ఎస్ పొలిటికల్ మైలేజ్ పెంచుకోగలిగింది. ఇప్పుడు సోనియా మీటింగ్ విషయంలో కూడా ఈ ట్రిక్‌ ప్రదర్శించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సోనియాగాంధీ కరీంనగర్ సభలో పాల్గొనడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం వుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈ సభలో కలకలం సృష్టించడం ద్వారా ఏదో సాధించాలని టీఆర్ఎస్ ఆశించవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు.

అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి మారనున్నారా?

      కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి జంప్ అయిన మండలి బుద్ధ ప్రసాద్ పేరును ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొరపాటు చేశానన్న అతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ క్షణాన మండలి బుద్ధ ప్రసాద్‌ని అవనిగడ్డ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారోగానీ, ఆ క్షణం నుంచే నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.   ఇంతకాలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన తెలుగుదేశం నాయకులని కాదని, పదవి కోసం పార్టీ మారిన బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ప్రకటించడాన్ని స్థానిక టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ పరిస్థితులను పరిశీలించిన చంద్రబాబు అక్కడ బుద్ధ ప్రసాద్‌కి గెలిచే సీన్ లేదని అర్థం కావడంతో నాలుక్కరుచుకుని, ఇప్పుడేం చేయాలా అన్న అంతర్మథనంలో పడినట్టు తెలుస్తోంది. నియోజవర్గం సమస్యల పరిష్కారలో ఎప్పుడూ చొరవ చూపని మండలికి నియోజకవర్గం ప్రజల్లో వ్యతిరేకత వుంది. అలాగే స్థానిక తెలుగుదేశం నాయకులు మండలికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మండలి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో అవనిగడ్డ నుంచి మండలిని తప్పించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టిక్కెట్‌ని పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న స్థానిక తెలుగుదేశం నాయకుడికే ఇవ్వాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం.

ముఖ్యమంత్రి పదవిని వద్దనను: నందమూరి బాలకృష్ణ

      హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ చూపు ముఖ్యమంత్రి పదవి మీద పడింది. నామినేషన్ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలకృష్ణ తన మనసులోని మాట బయటపెట్టారు. తనను గెలిపిస్తే హిందూపురం నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని హామీలు గుప్పించిన ఆయన, ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం మీకు వుందా అని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కాదనని స్పష్టంగా సమాధానం చెప్పారు. సీమాంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేది చంద్రబాబునాయుడే అనే విషయం నోట్లో వేలేసుకునే అమాయకులకి కూడా తెలుసు. ఆ పదవి వైపు చూడటానికి కూడా తెలుగుదేశంలో ఎవరికీ సాహసం లేదు. అలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి మీద తన అభిప్రాయన్ని బాలకృష్ణ స్పష్టంగా చెప్పడం తెలుగుదేశంలో కొత్త చర్చలకు దారి తీసింది.

జనసేన పార్టీకి దారేది?

  మనుషులు తాము అభిమానించేవారిలో ఎన్ని లోపాలు ఉన్నా వాటిని పట్టించుకోరు. అదే నచ్చని వ్యక్తి తుమ్మినా, దగ్గినా పెద్ద తప్పుగానే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తాను కూడా దీనికి అతీతుడను కానని పొట్లూరి వరప్రసాద్ ని వెనకేసుకొని రావడం ద్వారా నిరూపించారు. కొన్ని కేసులు నడుస్తున్న పొట్లూరిని తాను సమర్దించడాన్ని, కేశినేని నాని తదితరులు తప్పుపట్టినట్లు తెలుసుకొన్న పవన్ కళ్యాణ్, పొట్లూరిని సమర్దించుకొనేందుకు జగన్ని ఉదాహరణగా పేర్కొనడం హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ తన తొలి ప్రసంగంలో “ఒకరు తప్పు చేసారు కదాని, దానిని సాకుగా చూపించి మరొకరు కూడా తప్పు చేయడం తప్పని, దానిని అందరూ ఖండించాలని” అన్నారు. కానీ ఇప్పుడు తనే స్వయంగా అటువంటి తప్పు చేస్తున్నారు. జైల్లో ఉండి వచ్చిన జగన్ ఎన్నికలలో పోటీ చేయగా తప్పులేనప్పుడు పొట్లూరి పోటీ చేస్తే తప్పేమిటి అని నిలదీశారు. అంటే తప్పు చేసిన జగన్ పోటీ చేస్తున్నాడు గనుక, పొట్లూరి కూడా చేయవచ్చని వాదించడం తన మాటలని తానే స్వయంగా ఖండించుకొన్నట్లయింది.   దేశంలో అవినీతి పెరిగిపోయింది, దానికి వ్యతిరేఖంగా పోరాటం చేసేందుకే జనసేన పార్టీని స్థాపించానని చెప్పుకొంటున్న పవన్ కళ్యాణ్ దానికి పొట్లూరి చేతనే పునాది వేయించుకొన్నారు. పొట్లూరికి విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు ఏ పార్టీలో టికెట్ దొరకనందున తన ద్వారా టికెట్ సంపాదించు కోవాలనే ఉద్దేశ్యంతోనే తనను ఆశ్రయించి, పార్టీ లాంచింగ్ కి పెట్టుబడి పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి తప్పు కనబడలేదు. పైగా పొట్లూరికి తనే స్వయంగా టికెట్ కోరడం, ఆయనని సమర్దించడాన్నిమళ్ళీ సమర్దించుకోవడం అన్నీకూడా పవన్ చెపుతున్న నీతి సూత్రాలకు విర్ద్దమయిన చర్యలే.   అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ప్రకటించారు. కానీ, మల్కాజ్ గిరీలో మాత్రం తెదేపా అభ్యర్ధితో పోటీ పడుతున్న లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. అంటే తేదేపాకు మద్దతు ఇస్తూనే దాని అభ్యర్ధికి వ్యతిరేఖంగా పనిచేస్తారన్న మాట!   ఇక ‘వన్ మ్యాన్ ఆర్మీ’లా నడిపిస్తున్నతన జనసేన పార్టీ, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటుందని ఆయన చెప్పిన మాట వాస్తవమయితే అంతకంటే పెద్ద జోక్ మరొకటి ఉండబోదు. ఆయన పార్టీ నయితే స్థాపించినట్లు ప్రకటించారు కానీ, దానిని కనీసం ఎన్నికల కమీషన్ దగ్గర నమోదు చేయించారో లేదో కూడా తెలియదు. పార్టీలో తను తప్ప పాలకవర్గం కూడా ఏర్పాటు చేసుకోలేదు. అటువంటి ఏకోనాయక పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటుందని చెప్పడం హాస్యాస్పదం.   అందువల్ల పవన్ కళ్యాణ్ ఇక ముందు రాజకీయాలలో తను ఎటువంటి పాత్ర పోషించాలనుకొంటున్నాడో ముందుగా నిర్ణయించుకొన్నాక, అందుకు తగ్గటుగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని, వారితో సవివరంగా చర్చిన తరువాత నిర్ణయాలు తీసుకొంటే అభాసుపాలవరు. లేకుంటే తనకు తోచినదే రాజకీయమని భావిస్తూ, మాట్లాడుతుంటే అందువల్ల నలుగురిలో ఆయనే నవ్వులపాలవుతారు. అందుకు చక్కటి ఉదాహరణ ఆయన అన్నగారే. ఐదేళ్ళుగా రాజకీయాలలో నలుగుతున్నపటికీ నేటికీ ఆయన అప్రస్తుత ప్రసంగమే చేస్తుంటారు.

జగన్ పార్టీ : ఆత్మహత్యకు సిద్ధమైన నాయకుడు

      జగన్ పార్టీకి సేవలు అందించి, బోలెడంత ఖర్చుపెట్టి నిండా మునిగిపోయిన ఒక నాయకుడు భోరున ఏడుస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా వున్నానని చెబుతున్నాడు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన అశోక్ గౌడ్ అనే అమాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో వున్నాడు. దెందులూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో అప్పటి నుంచి పార్టీ కోసం గాడిద చాకిరీ చేశాడు.   పార్టీ కార్యక్రమాలకని, మీటింగ్‌లకని, పాదయాత్రలకని, దానికని, దీనికని మొత్తం నాలుగు కోట్లు ఖర్చుపెట్టాడు. ఈ నాలుగు కోట్ల కోసం ఆస్తులు అమ్మేసుకుని, భారీ స్థాయిలో అప్పులు చేసి పూర్తిగా మునిగిపోయాడు. తీరా ఎన్నికలు వచ్చాక దెందులూరు టిక్కెట్‌ని జగన్ వేరెవరికో ఇచ్చేసరికి అశోక్‌గౌడ్ ఏడుస్తూ రోడ్డున పడ్డాడు. జగన్‌ని నమ్ముకుని తాను సర్వనాశనం అయిపోయానని, ఇక తనకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదని అంటున్నాడు.  ఇదిలా వుంటే జగన్ పార్టీకే చెందిన మరో నాయకుడు పేర్ని నాని కూడా జగన్ పార్టీ కోసం డబ్బులు ఖర్చుపెట్టీ, ఖర్చుపెట్టీ అప్పులపాలైపోయాడు. ఆస్తులు అమ్ముకుని బికారి అయిపోయాడు. జగన్ ఈయన మీద జాలిపడి మచిలీపట్నం ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాడు. కానీ, నిండా మునిగిపోయిన తనకి ఎన్నికలలో పోటీ చేసే సత్తా లేదని పేర్ని నాని చేతులెత్తేశాడు. తాను సెలెక్ట్ చేసిన అభ్చర్థి చేతులెత్తేయడంతో కంగుతిన్న జగన్, నీ ఖర్చంతా నేను భరిస్తానని పేర్ని నానీకి హామీ ఇవ్వడంతో ఆయన ఎన్నికలలో నిలబడటానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అశోక్ గౌడ్, పేర్ని నాని... బయటకి తెలిసిన స్టోరీలివి. తెలియని స్టోరీలు ఎన్ని వున్నాయో.

పవన్ పోస్టర్ వివాదం: జూనియర్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్!

      నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి స్వామిగౌడ్ తన పోస్టర్లలో పవన్ కళ్యాణ్ ఫొటో వేసినందుకు నిరసనగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోస్టర్లు చించేయడం, తమ హీరో ఫొటోలు ఎందుకు వేయలేదని గొడవ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని తెలుగుదేశం వర్గాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి.   జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. అమ్మ పెట్టదు అడుక్కు తిననీయదన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాడు. బొట్టుపెట్టి పిలిస్తేనే వచ్చే విషయం ఆలోచిస్తానని అంటాడు. ఒకవేళ పిలిచినా వస్తాడో రాడో, ఎన్ని కండీషన్లు పెడతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి చేరువైన పవన్ కళ్యాణ్ ఫొటోని పోస్టర్లలో వేస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇంత కోపమెందుకు వస్తోందో అర్థం కావడం లేదని అంటున్నారు. పోస్టర్లలో పవన్ ఫొటో చూసి జూనియర్ అభిమానులు తట్టుకోలేకపోతే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకి వెళ్ళి ప్రచారానికి ఒప్పించండి అప్పుడు ఎవరూ అడగకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పోస్టర్లలో వేస్తామని ఆఫర్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వుండి కూడా ప్రచారానికి ముందుకు రాని జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశంలో ఉన్నట్టు ఎందుకు భావించాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌ని కలుపుకుని పోవాలని అనుకున్నప్పటికీ అటు నుంచి సరైన స్పందన రాలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అంచేత ఇకనైనా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

విపరీతంగా నటించేస్తున్న చిరంజీవి!

  సినిమా కెమెరాముందు నటించి చాలాకాలమైన చిరంజీవి పాపం నటించకుండా ఎలా వుండగలుగుతున్నాడో అని ఆయనకి మిగిలి వున్న కొంతమంది అభిమానులు బాధపడుతూ వుండొచ్చు. బట్.. డోన్ట్ వర్రీ. చిరంజీవి సినిమాల్లో నటించకపోయినా రాజకీయాల్లో మాత్రం విపరీతంగా నటించేస్తున్నారు. ఆ మాటకొస్తే సినిమాల్లో కంటే ఎక్కువగా రాజకీయాల్లో నటిస్తున్నారు. సినిమాల్లో ఆయన నటనకు జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఎలాగూ లేదుగానీ, రాజకీయాల్లో చిరు నటనకు జాతీయ అవార్డేం ఖర్మ.. వీలుంటే ఆస్కార్ అవార్డు కూడా వచ్చేయడం ఖాయం. చిరంజీవిలోని రాజకీయ నటన ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అదేంటంటే, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి చాలాకాలమైంది. అయినప్పటికీ చిరంజీవి సహిత సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ డెడ్ బాడీని బతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సరైన అభ్యర్థులే లేక ఎండిపోయిన సీమాంధ్ర కాంగ్రెస్ పొరపాటున కూడా గెలవని అభ్యర్థులతో ఒక లిస్టు ప్రకటించింది. పోటీచేస్తే ఓడిపోతాం బాబోయ్ అని పారిపోబోయిన కొంతమందిని బతిమాలి మరీ పోటీ చేయించారని తెలుస్తోంది. రియల్ పరిస్థితి ఇలా వుంటే, మాజీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన నటన ప్రదర్శిస్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన స్పందన లభిస్తోందట. కాంగ్రెస్ నాయకులు మేం పోటీ చేస్తాం అంటే, మేం పోటీ చేస్తామంటూ తమ వెంట పడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తామంటూ వచ్చిన అప్లిక్లేషన్లు చూసి చిరంజీవి ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. బాబూ చిరంజీవీ.. అసలు పరిస్థితేంటో మాకు పూర్తిగా తెలుసు. నీ యాక్టింగ్ కట్టిపెడితే మంచిదని సీమాంధ్ర ప్రజలు అంటున్నారు. పంచ్ లైన్ చిరు నటన

అవనిగడ్డలో సైకిల్‌కి పంచరే!

  నిన్న మొన్నటి వరకు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి గ్రిప్ వుండేది. అనేకమంది తెలుగుదేశం నాయకులు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది ఏర్పరిచారు. ఈసారి ఎన్నికలలో ఇక్కడ నుంచి తెలుగుదేశం విజయం ఖాయమయ్యేలా నియోజకవర్గంలో టీడీపీని తీర్చిదిద్దారు. ఈ ఎన్నికల సందర్భంగా అనేక తప్పటడుగులు వేసిన చంద్రబాబు నాయుడు అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా భారీ తప్పటడుగు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్నగాక మొన్న టీడీపీలోకి దూకిన మండలి బుద్ధప్రసాద్‌కి అవనిగడ్డ టిక్కెట్‌ని ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి తెలుగుదేశం కార్యకర్తల్లో, స్థానిక ప్రజల్లో తీవ్ర నిరసనను ఎదుర్కొంటోంది. గత ఎన్నికలలో ఓడిపోయిన బుద్ధ ప్రసాద్ నామినేషన్ పదవులు వెలగబెడుతూ టైమ్‌పాస్ చేశారే తప్ప నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ఎంతమాత్రం ప్రయత్నించలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. స్థానికంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బుద్ధప్రసాద్‌కి టిక్కెట్ కేటాయించడం తెలుగుదేశం ఓటమిని కొని తెచ్చుకున్నట్టుగా వుందని అంటున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ, ఇక్కడి ప్రజల కన్నీరు తుడవటానికి కృషి చేసిన వారిని విస్మరించి పదవికోసం కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడం సరైనపని కాదని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేసి, ఇప్పుడు టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. స్థానిక తెలుగుదేశం నాయకులు ముత్తంశెట్టి కృష్ణారావు, అంబటి శ్రీహరి ప్రసాద్ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని అంటున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం అభివృద్ధికి కృషి చేసిన ఏ తెలుగుదేశ నాయకుడికి టిక్కెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం ఉండేది కాదని, సడెన్‌గా కాంగ్రెస్ నుంచి ఊడిపడిన మండలి బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడాన్ని మాత్రం భరించలేకపోతున్నామని అంటున్నారు. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయే మండలి బుద్ధ ప్రసాద్‌కి తాము ఎంతమాత్రం సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఈసారి అవనిగడ్డ స్థానంలో తెలుగుదేశం ఓటమి తప్పదని అనిపిస్తోంది.

ప్రజాసేవ చేసేందుకు పోటీలా?

  ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు జీవన్మరణ పోరాటంగా భావిస్తుండటంతో పార్టీల మధ్య, పార్టీలలోనే అభ్యర్ధుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దానికి తోడూ ఎన్నికల పొత్తులు కారణంగా కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మూడూ కూడా టికెట్ ఆశిస్తున్నతమ స్వంత పార్టీ నేతల నుండే తీవ్ర ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా తెరాసతో సహా వివిధ పార్టీలలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు రోజుల వ్యవధిలోనే చకచకా పార్టీలు మారడం, లేకుంటే స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో నిలబడటం కూడా చూస్తున్నాము. ఇక ఇంతకు ముందు కనీ వినీ ఎరుగని విధంగా సదరు ఆశావాహులకు టికెట్స్ ఇమ్మని కోరుతూ వారి తరపున వందలాది మందితో వీధుల్లో బైకు ర్యాలీలు నిర్వహించడం, స్వంత పార్టీ కార్యాలయాల మీద, నేతల మీద దాడులు చేసే ఒక సరికొత్త వికృత సంస్కృతికి కూడా ఈ ఎన్నికలు పురుడు పోశాయి.   ఇక ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన నాటి నుండి వరుసపెట్టి ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నందున, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాష్ట్రమంతటా సిద్దం చేసిన డబ్భు, మద్యం, బహుమతులు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రతీ ఎన్నికలలో ఇటువంటి దృశ్యాలు సర్వసాధారణమే అయినప్పటికీ ఈసారి మాత్రం అన్నీ కూడా చాలా అతిగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం రాజకీయ పార్టీల, నేతల అధికార కాంక్షేనని చెప్పక తప్పదు.   ప్రతీ పార్టీకి కొన్ని ప్రత్యేకమయిన సమస్యలు, రాజకీయ అవసరాలు ఉన్నందున, ఏదో విధంగా ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేజికించుకొంటే తప్ప వాటి నుండి బయటపడలేమనే ఆందోళన, భయంతోనే ఎంత ఖర్చుకయినా వెనుకాడటం లేదు. ఎంతకయినా తెగించేందుకు సిద్దపడుతున్నాయి. ఇక టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులలో చాల మంది వ్యాపారస్తులు, కాంట్రాక్టులు చేసుకొంటున్నవారే కనిపిస్తున్నారు తప్ప కేవలం రాజకీయాలకే పరిమితమయిన వారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును.   అటువంటి వారందరూ తమ వ్యాపారాలను కాపాడుకొనేందుకు, వాటిని మరింత వృద్ధి చేసుకోనేందుకే రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. అయినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు, వారి అభ్యర్ధులు కూడా ఇదంతా కేవలం ప్రజా సేవ చేసేందుకేనని చెపుతూ దైర్యంగా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుండటం, ఆ సంగతి తెలిసి ఉన్నపటికీ ప్రజలు కూడా స్వచ్చందంగా, సంతోషంగా పువ్వులు పెట్టించుకోవడం విశేషమే.   తమవంటి కాదని నిజాయితీపరులు, సమర్దులయిన చిన్న పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వేస్తే అవి మురిగిపోతాయని పెద్ద పార్టీల నేతలే పనిగట్టుకొని ప్రచారం చేయడం వలన ప్రజలలో కూడా క్రమంగా అటువంటి అభిప్రాయమే స్థిరపడుతుండటం అవాంచనీయమయిన పరిణామంగా చెప్పవచ్చును. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకొనే ఈ రాజకీయ నాయకులు ఏనాడు సమాజంలో పేద ప్రజలకు, బలహీన వర్గాలకు చిల్లి గవ్వ విదిలించకపోయినా, నేడు ప్రజాసేవ చేసేందుకు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఎందుకుఖర్చు చేస్తున్నారు? అని అందరూ ఆలోచించి, తగిన అభ్యర్ధికే ఓటు వేయవలసి ఉంది. లేకుంటే ఈరోజు వారు ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలకు చక్రవడ్డీతో సహా వసూలు చేసుకోవడం ఖాయం.

యన్.డీ.టీ.వీ. తాజా సర్వే: సీమాంధ్రలో తేదేపాకు 15యంపీ సీట్లు

  కొద్ది వారాల క్రితం యన్.డీ.టీ.వీ. వెలువరించిన ఓ సర్వే నివేదికలో సీమాంధ్రలో వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు అదే సంస్థ తాజాగా వెలువరించిన సర్వే నివేదికలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత కనబడుతోందని ప్రకటించింది. తాజా సర్వే నివేదిక ప్రకారం సీమాంద్రాలో తేదేపాకు-15, వైకాపాకు-9, కాంగ్రెస్-1 యంపీ సీట్లు రావచ్చని అంచనా వేసింది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకొన్న కారణంగానే వారి కూటమికి ప్రజలలో ఆదరణ పెరిగిందని పేర్కొంది. అయితే ఈ తాజా సర్వేలో తెదేపాతో పోలిస్తే వైకాపా వెనకబడిపోయినప్పటికీ, మొట్ట మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఏకంగా 9 యంపీ సీట్లు సాధించడం మాటలు కాదు.   ఇక తెలంగాణాలో ఇదే సంస్థ ఫిబ్రవరి నెలలో నిర్వహించిన సర్వేలో తెరాసకు-11, కాంగ్రెస్-5, బీజేపీ-0 యంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. మార్చి సర్వేలో కాంగ్రెస్ కొంత పుంజుకొని 7 సీట్లు సాధించే స్థితికి చేరుకోగా, తెరాస-11 స్థానాల నుండి ఒకేసారి 7 స్థానాలకు పడిపోయింది. ఇక ‘0’ అంచనాలతో మొదలయిన బీజేపీ ప్రస్థానం మార్చిలో-2, ఏప్రిల్-3 యంపీ స్థానాలకి పెరిగింది. అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సంస్థ వెలువరించిన సర్వే ప్రకారం తెరాస-8కి పెరగగా, కాంగ్రెస్ మళ్ళీ 5 సీట్లకు పడిపోయింది. కానీ, తెలంగాణాలో తెరాస ఆధిక్యత కనబరుస్తున్నపటికీ దానికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా తెదేపా-బీజేపీ కూటమి స్థిరంగా బలం పుంజుకొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో నరేంద్ర మోడీ ప్రచారం తరువాత బహుశః తెదేపా-బీజేపీ కూటమి మరింత పుంజుకోవచ్చునేమో!   ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల ప్రస్తుత పరిస్థితిపై ఈ సర్వే నివేదిక అంచనాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి కేవలం 111 యంపీ స్థానాలు (వాటిలో కాంగ్రెస్ స్వయంగా సాధించుకొన్నవి-92) వస్తాయని అంచనా వేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 275 యంపీ స్థానాలు (వాటిలో బీజేపీ స్వయంగా సాధించుకొన్నవి-226 సీట్లు) సాధించుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి స్పష్టమయిన ఆధిక్యత సాధిస్తుందని అంచనా వేసింది.

ప్రియాంక నోరు తెరిస్తే...?!

  కొంతమంది చాలా గ్లామర్‌గా వుంటారు.. చాలా ఆకర్షణ శక్తి కలిగి వుంటారు. వాళ్ళ పెద్దలు సాధించిన విజయాలు, వారి ఇమేజ్ వాళ్ళని కాపాడుతూ వుంటుంది. వాళ్ళు రోడ్డుమీదకి వస్తే చూడటానికి లక్షలమంది ఎదురుచూస్తూ వుంటారు. బట్.. అలాంటివారిలో చాలామంది నోరు తెరిస్తే చాలు.. ఏం మాట్లాడతారో వారికే తెలియదు. అలాంటి వారిలో మొన్నటి వరకూ రాహుల్ గాంధీ మాత్రమే వుండేవాడు. ఇప్పుడు ఆ జాబితాలో రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక కూడా చేరిపోయింది. ఇంతకాలం అమ్మాయిగారు నోరు విప్పి మాట్లాడిన దాఖలాలు లేవు కాబట్టి ఈమె మీద అందరిలో ఏవేవో అంచనాలున్నాయికానీ, ప్రియాంక నోరువిప్పి మాట్లాడిన తర్వాత గానీ, ఈమెలో గ్లామర్ తప్ప రాజకీయాలకు పనికొచ్చే మెటీరియల్ లేదని అర్థమవుతోంది. మొన్న ఢిల్లీలో భర్త రాబర్ట్ వధేరాతో కలసి ఓటేయడానికి వచ్చిన ప్రియాంకతో మీడియా మోడీ గాలి గురించి ప్రస్తావించినప్పుడు ‘‘మోడీ గాలా? నాకు ఏ గాలీ కనిపించడం లేదు’’ అని వెటకారంగా మాట్లాడి మీడియా మొత్తం బిత్తరపోయేలా చేసింది. అలాగే ఈరోజు ఆమె ఇచ్చిన రెండు స్టేట్‌మెంట్లు ప్రియాంకలో వున్న అనుభవ రాహిత్యం, మాట తీరు సరిగా లేకపోవడం బయటపడింది. తన సోదరుడి వరస అయిన వరుణ్ గాంధీ గురించి మాట్లాడుతూ, వరుణ్ గాంధీ మంచోడేగానీ అతను ప్రస్తుతం తప్పుదారిలో నడుస్తున్నాడు. అతన్ని మంచి దారిలోకి నడిపించాల్సిన అవసరం వుందని కామెంట్ చేసింది. దీనికి వరుణ్ గాంధీ తల్లి మేనకాగాంధీ ఘాటుగా స్పందించి, ప్రియాంకని నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించింది. ఇదిలా వుంటే, తాను తలుచుకుంటే మోడీ మీద పోటీ చేయగలనని, కాకపోతే తానే వద్దనుకున్నానని చెప్పింది. తాను పోటీ చేయాలని అనుకుంటే తననెవరూ ఆపలేరని తన మొండితనం గురించి ప్రస్తావించింది. చిన్న అమ్మగారు ప్రియాంక ఇస్తున్న వెరైటీ స్టేట్‌మెంట్లు చూసి కాంగ్రెస్ వర్గాలు కంగారు పడుతున్నాయి. ఇప్పటికే రాహుల్ బాబుకి సరిగా మాట్లాడ్డం రాదన్న పేరు వచ్చేసింది. ఇప్పుడు ప్రియాంకకి కూడా జనం ఆ సర్టిఫికెట్ ఇస్తే పరిస్థితేంటని భయపడిపోతున్నారు.

ఐదు సంతకాలు-పది చార్జ్ షీట్లు

  వైకాపా తన అభ్యర్దులను కూడా ఇంకా ప్రకటించక ముందే, జగన్మోహన్ రెడ్డి తను చేయబోయే మొదటి ఐదు సంతకాల గురించి జనాలను ఒకటే ఊదరగొడుతూ, తను ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. అంతే గాక సీమాంధ్రకు కొత్త రాజధాని ఏవిధంగా నిర్మించాలి, ఎవరిని కన్సల్టెంటుగా నియమించాలి వంటి విషయాల గురించి మాట్లాడుతూ, దానిపై ప్రజలలో కూడా ఆసక్తి, కొంత చర్చ జరిగేలా చేస్తూ ప్రజలందరూ వైకాపాకే ఓటేయబోతున్నరనే భావనను చాలా తెలివిగా వ్యాపింపజేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆకర్షణీయమయిన మ్యానిఫెస్టోలు ముద్రించి పంచిపెట్టడం సహజమే. అయితే జగన్ మ్యానిఫెస్టోలో గ్రామ స్థాయి నుండి రైల్వే జోన్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైళ్ళు వంటి జాతీయ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలకు సైతం హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   విశాఖకు రైల్వేజోన్, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వంటి డిమాండ్లు ఈనాటివి కావు. కానీ వాటికి ఇంతకాలంగా కేంద్రం నుండి అనుమతులు లేకనే ఏర్పడలేదు. అదేవిధంగా పోలవరం, చేవెళ్ళ, ప్రాణహిత వంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా వ్యవహారం కూడా చిరకాలంగా కేంద్రం వద్ద నాన్చబడిన తరువాత, రాష్ట్ర విభజన కారణంగా ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రులను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రం పోలవరం ప్రాజెక్టుకి జాతీయహోదా కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణాలో ఓట్లు రాబట్టుకోవడానికి తెరాస, టీ-కాంగ్రెస్ నేతలు చేవెళ్ళ-ప్రాణహితల అంశం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు.   రాష్ట్ర విడిపోయిన తరువాత ఉద్యోగుల జీతాలకే కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే, ఊరికో విమానాశ్రయం, వీధికో మెట్రో రైలు అని శనగకాయలు పంచినట్లు జగన్ పంచిపెట్టేస్తుండటం చాలా హాస్యాస్పదం. అలాగని తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఇటువంటి హామీలు ఇవ్వడం లేదని కాదు. కానీ, జగన్ వారిరువురినీ మించిపోయారు. రాష్ట్రమంతటా ఎనిమిది లైన్ల రోడ్లు నిర్మించకపోయినా ప్రజలేమీ అనుకోరు కానీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముందు గుంతలు పడిన రోడ్లను తప్పకుండా బాగు చేయిస్తామని జగన్ హామీ ఇస్తే జనం తప్పకుండా నమ్ముతారు.   ఇక జగన్ ప్రస్తావించిన అంశాలలో మరో ఆసక్తికరమయిన అంశం ఏమిటంటే తమ పాలనలో హైకోర్టు, కాగ్‌లను కూడా భాగస్వాములను చేస్తామని చెప్పడం. జగన్ తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎన్నడూ కూడా కాగ్ సంస్థను పట్టించుకొన్న దాఖలాలు లేవు. అటువంటిది జగన్ తను అమలుచేయబోయే ప్రతీ అంశాన్ని ముందే కాగ్, హైకోర్టులకు నివేదించి వాటి అభిప్రాయలు తీసుకొన్న తరువాతనే ముందుకు వెళతామని, తద్వారా విమర్శలకు తావు లేని పారదర్శకమయిన పరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నారు. హైకోర్టు మరియు కాగ్ రెంటికీ కూడా అవి నిర్దిష్టంగా నిర్వర్తించవలసిన బాధ్యతలు చాలానే ఉన్నాయి. వాటితోనే వాటికి తీరికలేనంతగా ఉన్నాయి. జిల్లా నుండి సుప్రీం కోర్టు వరకు ప్రతీ కోర్టులో వేలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగులో పడి ఉన్నసంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా కాగ్ దేశంలో ఉన్న వేలాది ప్రభుత్వ సంస్థల, అవి అమలు చేస్తున్న పధకాల పనితీరుని నిరంతరంగా పరిశీలిస్తుంటుంది. అటువంటి ఈ రెండు సంస్థల చేత తమ ప్రభుత్వం యొక్క రోజువారి కార్యక్రమాలను పర్యవేక్షింపజేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆయన అపరికత్వతకు అద్దం పడుతోంది.   నిజానికి వైకాపా గనుక తిరుగులేని మెజార్టీ సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లయితే, ఆయన ఐదు సంతకాల మాటెలా ఉన్నపటికీ, ముందు తనపై ఉన్న పది చార్జ్ షీట్లను ఏవిధంగా ఉపసంహరింపజేసుకొనేందుకు, సీబీఐ, ఈడీల వద్ద పెండింగులో ఉన్న తన కేసులను తక్షణమే మూత పెట్టించేందుకు గట్టిగా ప్రయత్నించడం మాత్రం ఖాయం. అందుకే రాష్ట్ర విభజన జరుగుతున్న తరుణంలో కూడా ఆయన 30 యంపీ సీట్లు గురించే పదేపదే ప్రజలను కోరుతున్నారు. జగన్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నపటికీ, తానే మిగిలిన అందరికంటే పరిశుద్దుడునన్నట్లు మాట్లాడటం, ఎటువంటి పరిపాలనానుభావము లేని తాను మాత్రమే రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడిపించగలనని బల్లగుద్ది చెప్పడం విశేషమే.

కేశినేని నానిపై జగన్ కన్ను!

      తెలంగాణలో వైసీపీ ఆల్రెడీ దుకాణం మూసేసింది. ఇప్పుడు సీమాంధ్రలో తన ఉనికిని కాపాడుకునే తంటాలు పడుతోంది. సీమాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద కన్నేసింది. ఆ పార్టీలో టిక్కెట్లు దొరకని, కోరుకున్న టిక్కెట్లు దొరకక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నాయకులను ఆకర్షించి వైసీపీ తరఫున పోటీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తోంది.   ఇప్పటికే ఆ తరహా నాయకులను కొంతమందిని ఆహ్వానించి సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ మీద విజయం సాధించేసినట్టు సంతోషిస్తోంది. ఇప్పుడు వైసీపీ దృష్టి విజయవాడ పార్లమెంటు స్థానం మీద పడింది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని పట్టుబడుతున్న కేశినేని నాని మీద వైసీపీ దృష్టిని కేంద్రీకరించింది. వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ పార్లమెంటు టిక్కెట్ ఇవ్వాలని  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించుకోవడంతో, ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న కేశినేని నాని నిరసన గళం వినిపిస్తున్నారు. దీనిని తనకు అనుకూలంగా మలచుకోవాలని వైసీపీ భావిస్తోంది. కేశినేని నానిని వైసీపీ నుంచి పోటీ చేయించేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో కేశినేని పార్టీని ఒప్పించడానికి ఒక రాయబార బృందం రంగంలోకి దిగినట్టు సమాచారం.

పొట్లూరి కోసం బాబుపై పవన్‌ ఒత్తిడి?

      విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు ఫిక్సయ్యారు. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడో డిసైడ్ చేసిన కేశినేని నానికి జెల్లకొట్టి మరీ పొట్లూరి ప్రసాద్‌వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీట్ తనకి కావాల్సిందేనని మొత్తుకుంటున్నా, నిరసన గళం  వినిపిస్తున్నా అవి చంద్రబాబు చెవికి చేరడం లేదు. చంద్రబాబు ఈ సీటు విషయంలో ఇంత  మొండి పట్టుదలతో ఎందుకున్నాడా అని పరిశీలించిన రాజకీయ పరిశీలకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మోడీకి మద్దతు ఇవ్వాలనే కోణంలోనే ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రచారం మొత్తం బీజేపీకి డైరెక్ట్ గా  మద్దతు ఇచ్చేలా వుండొచ్చని తెలుస్తోంది. అయితే ఇలా బీజేపీ వైపే ప్రచారం మొత్తం వుండటం వల్ల బీజేపీకే లాభం జరుగుతుంది తప్ప తెలుగుదేశానికి ఒరిగేదేమీ వుండదని భావించిన చంద్రబాబు తెలుగుదేశానికి కూడా ప్రచారం చేయాలని చంద్రబాబుని కోరినట్టు, అలా చేయాలంటే తన మనుషులకు తెలుగుదేశం కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో  వినిపిస్తోంది. ముఖ్యంగా పొట్లూరి ప్రసాద్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ పట్టుపట్టినట్టు సమాచారం. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రతోపాటు, ఇటు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇవ్వడంతో చంద్రబాబుకు టిక్కెట్ ఇవ్వక తప్పలేదని తెలుస్తోంది.

కేసీఆర్‌కి తిట్లు... సోనియాకి దీవెనలు!

      ఇంతకాలం టీఆర్ఎస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకున్న దాసోజు శ్రవణ్ ఇకముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్రుల మీద నోరు పారేసుకోబోతున్నాడు. ఇప్పుడాయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. టీఆర్ఎస్ తనకు ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో ఇస్తుందని ఆశగా ఎదురుచూసిన శ్రవణ్ తనకు అంత సీన్ లేకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు.   ఢిల్లీ నుంచి వచ్చిన జైరాం రమేష్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అడ్డంగా వాదించడంలో స్పెషలిస్టు కాబట్టి శ్రవణ్‌కి అధికార ప్రతినిధి హోదా కూడా ఇచ్చింది. టీవీలో, పేపర్లో కనిపించీ కనిపించీ బాగా అలవాటైపోయిన మనిషి కాబట్టి ఆ హోదా లేకపోతే బతకలేడని ఇచ్చినట్టున్నారు. సరే, సదరు శ్రవణ్ అలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో ఇలా మనిషి మారిపోయాడు. ఇంతకాలం తాను ఏ నోటితో అయితే కేసీఆర్‌ని తెగ పొగిడాడో అదే నోటితో కేసీఆర్ని తిట్టడం ప్రారంభించాడు. సినిమాల్లో  ముఖం మీద వున్న మాస్క్ ఎలా ఈజీగా తీసేస్తారో అంత ఈజీగా కేరెక్టర్ని మార్చేసుకుని కేసీఆర్ మీద తిట్ల వర్షం కురిపించాడు. టీఆర్ఎస్‌లో కుటుంబ పాలన కొనసాగుతోందట. తెలంగాణ ప్రజలకు తెరాస బారి నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం చాలా వుందట. అలాగే పనిగా సోనియా భజన చేశాడు. సోనియా ఎన్ని ఇబ్బందులొచ్చినా తెలంగాణ ఇచ్చిన యోధురాలంట. తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేసి ఆమె రుణం తీర్చుకోవాలంట. ఈ శ్రవణ్‌ని కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బయటకి తరిమేయాలి. ఇది సీమాంధ్రుల శాపం.  

తెలుగుదేశం తప్పటడుగు!

      ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు ఆచి, తూచి చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇది గతం. ఇప్పుడు పరిస్థితి మారినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు గతంలో మాదిరిగా పకడ్బందీగా వుండటం లేదనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలో వేసిన భారీ తప్పటడుగు గురించి చెబుతున్నారు. రెండు పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా వైజాగ్, తిరుపతి లోక్‌సభ స్థానాలకు బీజేపీకి అప్పగించారు. ఈ సీట్ల సర్దుబాటు జరిగిన సమయంలో చంద్రబాబును చుట్టూ వున్నవారు భలే నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. అయితే అదెంత పెద్ద తప్పటడుగో ఆ తర్వాత తెలిసొచ్చింది. ఆ తెలిసి రావడం కూడా చంద్రబాబుకి సొంతగా తెలిసిరావడం కాదు.   సీనియర్ నాయకుడొకరు చంద్రబాబు వేసిన తప్పటడుగును ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. సీమాంధ్రలో వున్న మూడు ప్రధాన నగరాలలో రెండు ప్రధాన నగరాలను బీజేపీకి ఇచ్చేశారు. ఈ రెండు సీట్లలో బీజేపీ గెలిచినా, మరో పార్టీ గెలిచినా ఈ రెండు నగరాలలో తెలుగుదేశానికి ఎలాంటి పట్టూ వుండదు.  ఒకవేళ విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి గెలవకపోతే సీమాంధ్రలోని మూడు ప్రధాన నగరాలలో తెలుగుదేశం పార్టీకి అడ్రసే వుండదు. ఆ సీనియర్ నాయకుడు ఈ పాయింట్‌ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగానే తాను వేసి తప్పటడుగును గ్రహించిన చంద్రబాబు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వైజాగ్ సీటును తెలుగుదేశానికి ఇచ్చేస్తే కాకినాడ సీటు ఇస్తామని బీజేపీతో రాయబారాలు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఒకవేళ బీజేపీ గనుక తెలుగుదేశం సవరణ ప్రతిపాదనకు అంగీకరించకపోతే ఆ తప్పటడుగు తెలుగుదేశం అధినేతను సుదీర్ఘకాలం బాధపెట్టే అవకాశం వుంది.  

అధిష్టాన దేవతలు తెలంగాణాలో పార్టీని గట్టెక్కించగలరా

  రాష్ట్ర విభజన వ్యవహారం సాగుతున్నంత కాలం రాష్ట్రం వైపు మొహం చూపించని కాంగ్రెస్ పెద్దలు అందరూ, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరొకరుగా రాష్ట్రంపై వాలిపోతున్నారు. ఈనెల 30న తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నందున ముందుగా అందరూ అక్కడే వాలిపోతున్నారు.   ప్రస్తుతం తెలంగాణాలో పార్టీకి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నపటికీ టీ-కాంగ్రెస్ నేతల మధ్య సరయిన సయోధ్య లేకపోవడం, తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తిపట్టు, ప్రజాదారణ ఉన్ననేత ఒక్కరూ లేకపోవడం, వారిలో ఏ ఒక్కరు కూడా కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలాంశాలుగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కూడా టీ-కాంగ్రెస్ నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పార్టీ తరపున ప్రచారం చేయలేకపోవడం గమనిస్తే వారి సిగపట్లు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధమవుతుంది. ఇదే అదునుగా కేసీఆర్ తెలంగాణా జిల్లాలన్నిటిలో ప్రచారం చేసి మరింత పట్టు సాధించుకొనేందుకు సిద్దం అవుతున్నారు.   ఈ పరిస్థితిని చూసిన కాంగ్రెస్ అధిష్టానం ముందుగా చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను పంపింది. ఆయన తిరుగుబాటు అభ్యర్ధులను ఒక్కోకరితో మాట్లాడుతూ వారి చేత నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారు. ఆయన పార్టీలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చి టీ-కాంగ్రెస్ నేతలందరినీ దారిలో పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.   ఆ పని పూర్తవగానే ఈనెల 16న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆ తరువాత యువరాజవారు కూడా ప్రచారానికి వేంచేస్తారు. అయితే కాంగ్రెస్ నేతలు తమను తాము తప్ప మరే ఇతర పార్టీలు ఓడించలేవని గర్వంగా చెప్పుకొనే మాటలను నిజమని నిరూపిస్తారో లేక అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి మరో మారు తమ సత్తా చూపించి తెరాస, తెదేపా-బీజేపీలను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకొంటారో మరి కొద్ది రోజులలోనే తేలిపోనుంది.