క్లైమాక్స్ కు చేరిన వైఎస్ కుటుంబ రాజకీయం.. జగన్ కు అవినాష్ దెబ్బ గట్టిగానే తగులుతుందా?!

 ఏపీలో ఎన్నికల తేదీ రోజుల్లోకి వచ్చేసింది. కచ్చితంగా చెప్పాలంటే మరో 14 రోజుల్లో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల హీట్ రోహిణీకార్తె ఎండలను మించిపోయింది. పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలైపోయి ఉన్నాయి. పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వేరే లెవెల్ లో కనిపిస్తోంది. దీంతో అధికార వైసీపీలో ఓటమి భయం కూడా స్పష్టంగా కానవస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే.. కడప జిల్లా ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుగా ఇక్కడ అధికార వైసీపీ ఆధిపత్యం కానవచ్చేది. అయితే ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడప లోక్ సభ బరిలో అవినాష్ కు పోటీగా కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోనే కడపలో సీన్ మారిపోయింది. షర్మిల ప్రజెన్స్ ఒక్క కడప లోక్ సభ నియోజకవర్గాన్నే కాకుండా ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ, మొత్తం జిల్లాపైనా ప్రభావం చూపుతోంది. అన్నిటికీ మించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఈ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ప్రధాన అజెండాగా మారిపోయింది.  ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే   ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న  వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే.  హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉంది. హత్య  తెలుగుదేశం హయంలో జరగడం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్య వెనుక ఉన్నది తెలుగుదేశంఅన్నట్లుగా ఫోకస్ చేసి లబ్ధి పొందారు ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి నాడు లబ్ధి చేకూర్చిన కేసే ఇప్పుడు వారికి రివర్స్ లో నష్టం చేకూర్చేలా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ చేరింది. ఈ హత్య కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కోర్టుల్లో తీర్పులూ ఇంకా రాలేదు. కానీ ఈ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న విషయంలో ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో కడప ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్నికలలో ఓటు ద్వారా తమ తీర్పు ఏమిటో చెప్పనున్నారు. అందుకే  వివేకా హత్య కేసు  క్లైమాక్స్ కి చేరిందని అంటున్నారు.  కోర్టుల్లో వివేకా హత్య కేసు సాగదీత కోసం   ఓ వర్గం సర్వశక్తులు ఒడ్డింది. అది  తెలుగు రాష్ట్రాల  ప్రజలు   చూస్తూనే ఉన్నారు. కడప జిల్లా వాసులు అయితే చూడటం తో  పాటు హత్య కు కారకులు, కారణాలు కూడా అర్ధం చేసుకున్నారు.  నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతుందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది. విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు కూడా మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రులను దగ్గరకు చేర్చుకుంది. అలాగే ఏపీలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది.  ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే వైసీపీకి ఎడారిలో నీటి ఊటను వెతుక్కోవడమే అవుతుంది. దీంతో ఇప్పుడు వివేకా హత్య కేసు కడప జిల్లాలో ప్రధాన ఎన్నికల అజెండాగా మారిపోయింది.  సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన  వివేకా హత్యకేసు ఇప్పుడు  వైసీపీకి ఊపిరాడకుండా చేస్తోంది.  రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంలో వైఎస్ జగన్ అప్పుడు సక్సెస్ అయ్యారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ వెన్నులో వణుకుపుట్టిస్తోంది.   నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ, రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా  తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా  ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్  కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎంకు ఎన్నికలలో కచ్చితంగా ప్రతికూలాంశంగా మారిందనడంలో సందేహం లేదు. దానికి తోడు వివేకా కుమార్తె సునీత, సీఎం జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. వివేకా హంతకుల పక్కన నిలబడిన సీఎంకు ఓటు వేయవద్దు, వైసీపీని ఓడించండి అంటూ చేస్తున్న ప్రచారం కడప వాసులను కదిలిస్తోంది.  ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు జగన్ పడుతున్న తాపత్రయం, ఎన్నికల ప్రచారంలో కోర్టుల తీర్పులతో పని లేకుండా జగన్ అవినాష్ కు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజలలో జగన్ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగమే పులివెందులలో జగన్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి భారతికి ఎదురౌతున్న చేదు అనుభవాలు. ప్రజల నుంచి ఎదురౌతున్న ప్రశ్నలు. వీటన్నిటినీ బట్టి చూస్తే  ఎన్నికలలో వైసీపీకి  కడపలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ వ్యతిరేక పవనాలకు జగన్ అవినాష్ ను వెనకేసుకురావడమే కారణమంటున్నారు. అంటే కడప కహానీ క్లైమాక్స్ చేరిందనీ, జగన్ కు అవినాష్ నుంచే గట్టి దెబ్బతగిలినట్లు కనిపిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీకి గల్ఫ్ కార్మికుల బహిరంగ లేఖ !

గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.  ◉ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏం చర్యలు తీసుకుంది?   ◉ గత ఐదేళ్లలో గల్ఫ్ సమస్యల గురించి పార్లమెంటులో మీరు ఎందుకు మాట్లాడలేదు? ◉ గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ  సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లను జారీ చేసింది. ఇందులో కేంద్రం జేబులోంచి ఇచ్చేది ఏముండదు. గల్ఫ్ దేశాల కంపెనీలు జీతాలు ఇస్తాయి... కార్మికులు తీసుకుంటారు. అరవింద్ గారు... గల్ఫ్ దేశాలలో పనిచేసే 88 లక్షల మంది భారతీయ కార్మికుల జీవితాలకు సంబంధించిన ఈ అంశంపై మీరు ఎందుకు స్పందించలేదు. ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదు. మేము చేసిన ఉద్యమ ఒత్తిడికి తలొగ్గిన  కేంద్ర ప్రభుత్వం 10 నెలల తర్వాత పాత వేతనాలను కొనసాగిస్తామని ప్రకటించింది.  ◉ ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు.  ◉ హైదరాబాద్ లో సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాల కాన్సులేట్లు (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు. ◉ ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో చాలా సార్లు పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి ఎందుకు  పట్టించుకోలేదు.  ◉ కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్ కు వాపస్ వచ్చిన ప్రయాణీకుల నుంచి వందే భారత్ ప్లయిట్స్ లలో రెండింతలు, చార్టర్డ్ ఫ్లయిట్స్ లలో మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసి కార్మికులను ఎందుకు దోచుకున్నది.  ◉ 34 సంవత్సరాల క్రితం...1990 లో కువైట్ పై ఇరాక్ దురాక్రమణ 'గల్ఫ్ యుద్ధం' జరిగిన సందర్బంగా అప్పటి భారత ప్రధాని వి.పి. సింగ్, విదేశాంగ మంత్రి ఐ.కె. గుజ్రాల్ నాయకత్వంలో ఒక లక్షా 70 వేల మంది భారతీయులను ఉచితంగా స్వదేశానికి తరలించారు. వి.పి. సింగ్ లాగా ఇప్పటి ప్రధాని మోదీ ఎందుకు ఉచితంగా విమానాలను ఏర్పాటు చేయలేకపోయారు.  ◉ గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం స్వయంగా ఇండియాకు రావడం వీలుకాదు. ప్లయిట్ చార్జీలు భరించడం, లీవ్ దొరకడం కష్టం. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం... ఎన్నారైలకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం -  ఆన్ లైన్ ఓటింగ్ ఓటింగ్ సౌకర్యం కల్పించలేకపోయింది. 'ఆబ్సెంటీ ఓటర్స్' గా మిగిలిపోతున్న గల్ఫ్ కార్మికులకు మీరు ఇచ్చే జవాబు ఏమిటి? ◉ బీజేపీ మోదీ ప్రభుత్వం ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది. మోదీకి ఎన్నారైలు అంటే... ఏదో తెలియని భయం పట్టుకున్నదా? ◉ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్లు (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారత్ కు పంపారు. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తోందని అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీనికి మీ జవాబు ఏమిటి? ◉ బంగ్లాదేశ్ పౌరులు విదేశాల నుంచి పంపిన విదేశీ మారక ద్రవ్యంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున శాతం ప్రోత్సాహకం  ఇస్తున్నది. భారత్ ఎందుకు ఇవ్వడం లేదో ఏనాడైనా ఆలోచించారా.  ◉ "ఇవాళ దుబాయిలో మనవాళ్ళు చేతికి కంకణం కట్టుకొని, నొదుట బొట్టు పెట్టుకొని, తిలకం దిద్దుకొని తిరుగుతున్నరు అంటే... దానికి నరేంద్ర మోదీ గారే కారణం" అని ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్  వ్యాఖ్యానించడం ఘోర తప్పిదం.. సర్వ స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దుబాయి (యూఏఈ దేశం) పై భారత్ ఆధిపత్యం చలాయిస్తున్నది అనే అర్థం వచ్చేలా మాట్లాడటం దౌత్య నిబంధనలకు విరుద్ధం. దీనిపై మీ జవాబు ఏమిటి.  ◉ దుబాయిలో, మస్కట్, బహరేన్ లలో వంద సంవత్సరాలకు పూర్వమే హిందూ మందిరాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.  ◉ ఇలాంటి వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చిచ్చు పెట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందాలని చూడటం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి మాటల వలన దుబాయి, యూఏఈ దేశంలో మన ప్రవాస భారతీయుల ఉద్యోగ అవకాశాలపై దెబ్బ పడితే ఎవరు బాధ్యత వహిస్తారు.  ◉ ఎమిగ్రేషన్ యాక్టు1983 అనే విదేశీ వలసల నియంత్రణ చట్టం స్థానంలో... కొత్త చట్టం తేవాలనే ప్రతిపాదనలను గత ఐదేళ్లుగా బీజేపీ ఎందుకు పెండింగ్ లో పెట్టిందని గ‌ల్ఫ్ జేఏసి నిల‌దీస్తోంది.  రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ నియోజకవర్గం ఓట‌ర్లు, ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తుంటారు. గ‌ల్ప్ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి కుటుంబ స‌భ్యులు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో అర‌వింద్  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో గ‌ల్ప్ కార్మికుల కుటుంబాలు బీజేపీపై కోపంతో ఉన్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దుః పెమ్మ‌సాని

దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని  సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.  కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నన్ను, జగన్‌తో పోల్చొద్దంటారు. తాను 2001లో బిజినెస్ ప్రారంభించి.. 24 ఏళ్లలో ఈ స్థాయికి ఎదిగానని పెమ్మసాని స్పష్టం చేశారు. 30 ఏళ్లు కష్టపడి, అమెరికాలో 40 శాతం పన్ను కడితే ఈ స్థాయికి వచ్చానని ఆయ‌న చెప్పారు. క్విడ్ ప్రోకో ద్వారా రాత్రికి రాత్రే ఎదిగిన జ‌గ‌న్‌కు, త‌న‌కు పోలికే లేదంటారు. జ‌గ‌న్‌ తండ్రి నీడ‌లో కష్టపడకుండా ఎదిగిన జ‌గ‌న్‌కు త‌న‌కు పోలికే లేదని తేల్చి ప‌డేశారు. 2004లో ఆయన ఆస్తి కోటి రూపాయిలు ఉంది.  క్విడ్ ప్రోకో చేసి దాని మీద వైయస్ జగన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు, వైయస్ జగన్‌కు కంప్లీట్ డిఫరెంట్ ఉందంటారు పెమ్మ‌సాని.  ఎన్నిక‌ల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పెమ్మ‌సాని తన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ప్రకటించారు. దీంతో  ఆయన గురించి చ‌ర్చ మొద‌లైంది. ఆయన ఎవరు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ఏమి చేసి ఈ స్థాయికి ఎదిగారు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.   పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఇంటర్మిడియట్‌లో రోజుకు 15 నుంచి 16 గంటలపాటు కష్టపడి చదివి, ఆ క్రమంలో 27 ర్యాంక్ సాధించారు. హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సంపాదించారు. ఇలా ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్... పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. అక్కడ... పీజీ పూర్తి చేసిన అనంతరం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా ఐదేళ్లపాటు కొనసాగారు. ఇదే సమయంలో... మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు.  ఇందులో భాగంగా... తాను సొంతంగా తయారు చేసిన నోట్స్‌ ను తక్కువ ధరకు ఆన్ లైన్‌ లో అందించేవారు.  ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో... విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌ లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించి.. ఫార్మసీ, నర్సింగ్‌, లా, ఫైనాన్స్, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించారు!  అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్ పెనియర్‌గా  ఎదిగారు. అమెరికాలో ఉన్న తన కంపెనీలలో ఎంతో మంది తెలుగు వారికి జబ్స్ ఇచ్చారు. 30 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నప్ప‌టికీ.. అక్క‌డ గ్రీన్ కార్డు కోసం అప్ల‌య్ చేయలేదు.  త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుంద‌ని ఎన్నిక‌ల పోటీ చేస్తున్నాన‌ని చెప్ప‌డం క‌రెక్ట్ కాదు. అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి త‌న జ‌న్మ‌భూమికి  ఏమైనా చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చంద్ర‌శేఖ‌ర్ చెబుతున్నారు.   వైఎస్ వార‌సుడిగా వ‌చ్చిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయ‌న‌ ఆస్తులు రూ.750 కోట్లు. ఆయ‌న‌పై  26 కేసులు ఉన్నాయి.  11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. మ‌రో 6 ఇత‌ర కేసులు ఉన్నాయి. అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  జ‌గ‌న్ అన్ అఫీషియ‌ల్‌గా మోదీతో అండ‌ర్‌స్టాండింగ్‌, అవ‌గాహ‌న‌తో వున్నారు. అందుకే ఆయ‌న కేసుల విష‌యంలో క‌నీసం అఫిడ‌విట్ వేయ‌కుండా సిబిఐ సాగ‌దీస్తోంది. జ‌గ‌న్‌, ఎన్‌డిఏలో లేక‌పోయినా, త‌న‌ ప్ర‌త్యర్థి టీడీపీతో బీజేపీ క‌లిసిన జ‌గ‌న్ స‌పోర్ట్ బిజెపికే.  జ‌గ‌న్ ప‌రోక్ష స్నేహ‌సంబంధాలే గ‌త 10 ఏళ్ళ గా కేసుల్ని ప‌ట్టించుకోవ‌పోవ‌డానికి కారణం.  రాజశేఖర్‌రెడ్డి చనిపోయినపుడు రిలయన్స్‌ వారే చంపించారంటూ వాళ్ల పెట్రోల్‌ బంకులను దహనం చేసి.. ఎంతోమంది అమాయకులు బలైపోవడానికి కారణమయిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక అంబానీ అనుచరుడికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తన నాన్నను కాంగ్రెస్‌ వాళ్లే సీబీఐ కేసులో ఇరికించారని చెప్పిన జగన్‌, తన లాయర్‌ ద్వారా జ‌గ‌నే, వైఎస్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేలా చేశారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు 

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్‌కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేశారు.ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

జగన్, కేటీఆర్ నోట ఉమ్మడి రాజధాని మాట.. వ్యూహత్మకమా.. కాకతాళీయమా?

ఎన్నికల వేళ  ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏపీలో అయితే ఐదేళ్ల అస్తవ్యస్థ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అర్ధం కాక మల్లగుల్లాలు పడుతోంది.  ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాజధాని విషయంపై అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ గళమెత్తుతున్నాయి. ఇది కాకతాళీయమా లేక ఉమ్మడి వ్యూహమా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఎన్నికల అంశంగా తెరమీదకు తేవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిల్చి ప్రజల మనస్సులను గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మరో వైపు ఇదే ఉమ్మడి రాజధాని అంశాన్ని వైసీపీ లేవనెత్తడం ద్వారా రాజధాని లేని  రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడానికి జగన్ సర్కార్ కారణమన్న విమర్శ నుంచి బయటపడవచ్చన్నది వైసీపీ భావనగా కనిపిస్తోంది. రెండూ పార్టీల నుంచీ ఒకే వాదన ఒకే సారి తెరమీదకు రావడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది. ఎందుకంటే వైసీపీ, బీఆర్ఎస్ లు రెండూ ఫ్రెండ్లీ పార్టీలు. పరస్పరం సహకారం అందిం చుకుం టుంటాయి. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  ఏపీ సీఎం జగన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ కోసం సరిగ్గా పోలింగ్ తేదీకి ముందు రోజు అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యాం వద్దకు ఏపీ పోలీసులను పంపించారు. అది కేసీఆర్ కు పెద్దగా ఉపయోగపడలేదు అది వేరే విషయం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ లబ్ధి కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఏపీలో మళ్లీ జగన్ సర్కారే కొలువుదీరనున్నదని జోస్యాలు చెబుతున్నారు. ఇది జగన్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందన్నది వేరే సంగతి. పరస్పర సహకారం కోసం రెండు పార్టీలూ, రెండు పార్టీల అధినేతల తహతహలాడుతున్నాయన్నది మాత్రం వాస్తవం. కారణమేమిటంటే రెండు రాష్ట్రాలలోనూ ఏకకాలంలో ఇాద్దరు శత్రువులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు) ముఖ్యమంత్రులుగా ఉండటం ఇరువురికీ ఇబ్బంది కరమైన విషయమే అనడంలో సందేహం లేదు. ఆ కారణంగానే  వేములవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆదివారం (ఏప్రిల్ 28) మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండటం తెలంగాణకు అవసరం అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే నిలువరించగలదని అన్నారు.  మరో వైపు సోమవారం (ఏప్రిల్ 29)చోడవరంలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను చంద్రబాబు కారణంగా దూరం చేసుకున్నామని పేర్కొన్నారు. అసలు ఉమ్మడి రాజధాని ముగిసిన అంశం. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్, వైసీపీలు ఈ అంశాన్ని లేవనెత్తడం కాకతాళీయమేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2, 2024తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో  బీఆర్ఎస్, వైసీపీలు కూడబలుక్కునే ఉమ్మడి రాజధాని అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చాయని అటున్నారు.  ఏకకాలంలో అటు బీఆర్ఎస్ కూ, ఇటు వైసీపీకీ ఉమ్మడి రాజధాని అంశం గుర్తుకురావడంపై అటూ ఇటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాజధానిని ఆపగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అం టూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో  తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలేమిటన్న విమర్శలు వస్తుంటే.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా కట్టలేకపోయిన జగన్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడడమేమిటని నిలదీస్తున్నారు. మొత్తం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, వైసీపీలు  వ్యూహాత్మకంగానే ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు ...ఇసుక మాఫియాపై కన్నెర్ర

ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.   ఇసుక తవ్వకాల అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక తవ్వకాలు జరుపుతున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.  నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని, అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అనుమతులు ఉన్నచోట మాన్యువల్ గా ఇసుక తవ్వకాలు జరుపుకోవచ్చని సూచించింది.  అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంతోపాటు, ఎన్జీటీని కూడా ఆదేశించింది. ఈ వ్యవహారంలో మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖలను సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా మే 9వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తవ్వకాలు జరపడం లేదన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని జేపీ వెంచర్స్ ను ఆదేశించింది.  ఎన్జీటీ తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషనర్ ఫిర్యాదుల మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.

ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏం రోగం!?

ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు. మరి వృద్ధులకు బయటకి వచ్చే పరిస్థితి వుందా? ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులకు పెన్షన్ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే ఎన్నికల కోడ్ వున్నప్పటికీ జగన్ కనుసన్నల్లో పనిచేసే అధికారులు మాత్రం వృద్ధులకు పెన్షన్ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వం, బ్యాంకుల్లో జమచేస్తాం.. వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిందే అని కరాఖండీగా చెబుతున్నారు. వాలంటీర్లు లేనప్పటికీ వృద్ధులకు ఇళ్ళ దగ్గర పెన్షన్ పంపిణీ చేయడానికి అసవరమైన ప్రభుత్వ సిబ్బంది వున్నారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. పెన్షన్ తీసుకోవడం కోసం ఇంత ఎండలో బయటకి వస్తే వృద్ధుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవేళ అలా ఎవరైనా చనిపోతే ఆ చావులను తెలుగుదేశం పార్టీ అకౌంట్లో వేసి శవరాజకీయం చేయాలన్నది వైసీపీ వ్యూహంలా అనిపిస్తోంది. పాపం అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బందిపడే వృద్ధులకు ఇళ్ళకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏం రోగం నాయనా? కొంతమంది కుర్రకారు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా... ఇళ్ళకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న అధికారులు నిజమైన వృద్ధులు. 

దేశంలో ట్రెండ్ మారుతోందా? కాషాయ దళంలో కలవరం!

గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే,  జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.  మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్‌సభ స్థానాలలో 61 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.   తగ్గిన పోలింగ్ పై రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. పోలింగ్ శాతం తగ్గింది అంటే,  అది అధికార పక్షానికి పెద్ద మైనస్ పాయింట్ అని అంటున్నారు.  ఉత్తర భారత దేశంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. అనేక హిందీ రాష్ట్రాలు బీజేపీ అంటే ఊగిపోతాయి.  కానీ ఈసారి సీన్ రివర్స్ అవుతోంది. పోలింగ్ శాతం ఢమాల్ అంటూ ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న చోట్లనే ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో బీజేపీకి, మోడీకి టెన్షన్ పట్టుకుంది.  పోలింగ్ శాతం తగ్గడం అంటే కచ్చితంగా ఓటర్లు నిరాశలో ఉన్న‌ట్లే. ఎండలు ఎక్కువ‌గా ఉన్నాయి కాబ‌ట్టి పోలింగ్ త‌గ్గింద‌ని బీజేపీ అంటోంది.  రెండు విడ‌త‌లైయ్యాయి. ఇంకా  అయిదు దశల ఎన్నికలు వున్నాయి. అప్పుడే పూర్తి పిక్చర్ వస్తుంది. దక్షిణభారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో మొత్తం పార్లమెంటు సీట్లు 139 + కేంద్రపాలిత పాండిచ్చేరిలో 1 సీటు = మొత్తం 140.  ఇందులో బీజేపీ నేరుగా గెలవగలిగే /పొందగలిగే సీట్లు 25 లోపు. 1. కేరళ ..0, 2. ⁠తమిళనాడు …0-01, 3. ⁠కర్ణాటక …. 5-8 లేదా మరీ బాగా వస్తే 10 లోపు, 4. ⁠ఆంధ్రప్రదేశ్ … 5-6 5. ⁠ తెలంగాణ … 5-8, ఉత్తరభారతదేశంలోనూ ఈశాన్య భారతదేశంలోనూ, ఇతర కేంద్రపాలిత ప్రాంతాలలోనూ అన్ని రాష్ట్రాలలో మొత్తం పార్లమెంటు సీట్ల సంఖ్య 413. నేడు ఉత్తరభారతంలో ఈశాన్యభారతంలో  అన్ని రాష్ట్రాలలో బలమైన అన్ని ప్రధాన వర్గాలూ మోడీకి అమిత్ షాకు బీజేపీకి వ్యతిరేకంగా అట్టుడుకుతున్నాయి. ఇందులో బీజేపీకి వచ్చే సీట్లు 180 నుండి 200 సీట్లు, లేదా మరీ మహా బాగా వస్తే 225 సీట్లు.  ఈలెక్కన మొత్తమ్మీద బీజేపీకి వచ్చే సీట్లు 200 నుండి 225, లేదా మహా బాగా వస్తే అతికష్టం మీద 250.  ఈ పరిస్థితుల్లో, ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్ డి ఏ పార్టీల సహాయము మద్దత్తు లేకుండా బీజేపీ ఒంటరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదు.  రైతులపై కాల్పులు జరిపిన తీరు, నల్లచట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడ‌టం, రెజ్లర్ కూతుళ్లను రోడ్డున పడేసిన తీరుపై హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న జాట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పలు వర్గాల ఆగ్రహావేశాలకు లోనుకావాల్సి వచ్చింది.  ఈ కారణంగానే ఓటర్లు ఓటు వేసేందుకు బయటకు రాలేదనే టాక్ న‌డుస్తోంది. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

ఎక్కడకి పోతావు చిన్నవాడా! కేసులో చిక్కుకున్న కుర్రవాడా!

చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు.. ఆ పప్పులేవీ ఉడకకపోవడంతో పారిపోయే ప్రయత్నాలు. పారిపోవడానికి భారీ స్కెచ్.. 1800 కిలోమీటర్ల దూరం పారిపోయినా పోలీసులకు చిక్కడం.. ఇదీ బాలీవుడ్ నటుడు సాహిల్  ఖాన్ విషయంలో జరిగిన డ్రామా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్ ప్రధాన నిందితుడు. ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రూపొందించిన ప్రకటనలో నటించాను తప్ప బెట్టింగ్ యాప్‌తో తనకేమీ సంబంధం లేదని సాహిల్ ఖాన్ ఈ కేసు బయటపడిన మొదట్లో సాహిల్ ఖాన్ బుకాయించాడు. పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. సాహిల్ ఖాన్ కేవలం యాడ్‌లో నటించిన నటుడు మాత్రమే కాదని, ఈ బెట్టింగ్ యాప్‌లో భాగస్వామి అని కూడా తేలింది. దాంతో సాహిల్ ఖాన్‌ని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే సాహిల్ ఖాన్ జంప్ జిలానీ అయిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని వేటాడ్డం ప్రారంభించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాహిల్ ఖాన్ మొట్టమొదటగా తన గెటప్ మార్చేశాడు. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు వెళ్ళాడు.. ఆ తర్వాత తెలంగాణకు వెళ్ళాడు. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కి పారిపోవడానికి ప్లాన్ చేశాడు. బస్సు, కారు, ఆటో, టూ వీలర్ మీద లిఫ్ట్... ఇలా రకరకాలుగా నాలుగు రోజులపాటు  1800 కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీస్‌గఢ్‌కి చేరుకున్నాడు. అతను అలా చేరుకున్నాడో లేదో పోలీసులు ఇలా అరెస్ట్ చేశారు. అడ్వాన్స్ టెక్నికల్ సదుపాయాల ద్వారా ట్రాక్ చేసి సాహిల్ ఖాన్‌ను పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా జరిగిన కుంభకోణం విలువ ఎంతో తెలుసా.. 15 వందల కోట్లు.. బాప్ రే!

వామ్మో.. మొసలి మటాష్ చేసేదే!

వనపర్తి జిల్లా భూత్పూరు గ్రామానికి చెందిన రైతు శేఖర్ ఆదివారం నాడు తన పొలానికి వెళ్లాడు. పొలంలో వున్న పొదల పక్క నుంచి నడుస్తుండగా, ఆ పొదల్లో పొంచి వున్న ఒక భారీ మొసలి ఒక్కసారిగా శేఖర్ మీదకి దూకింది. వెంటనే అప్రమత్తమైన శేఖర్ మొసలి బారి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే అతను ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన పొలంలోకి మొసలి వచ్చిన విషయాన్ని స్థానికులకు చెప్పారు. ఆ తర్వాత స్నేక్ సొసైటీ నిర్వాహకుడు వచ్చి ఆరు గంటలపాటు శ్రమించి మొసలిని బంధించాడు. ఇది చాలా భారీ మొసలి. ఆరడుగుల పొడవు, 185 కిలోల బరువు వుంది. ఈ మొసలి సమీపంలో వున్న చెరువు నుంచి వచ్చి వుండొచ్చని అనుకుంటున్నారు. ఈ మొసలి ఇప్పటికే చాలా మేకలను చంపి తిన్నట్టు సమాచారం. రైతు శేఖర్ టైమ్ బాగుండి బతికిపోయాడు. ఈ మొసలిని జూరాల జలాశయంలో విడిచిపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జగన్ సంతాప సందేశం!

ఏపీ ఊడిపోయే సీఎం జగన్ మొన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టే విడుదల కార్యక్రమాన్ని సౌండ్ మ్యూట్ చేసి చూస్తే, అదేదో జగన్ ఎవరికో సంతాప సందేశాన్ని తెలియజేస్తున్న కార్యక్రమంలా అనిపించడం ఖాయం. ఎందుకంటే, మేనిఫెస్టో విడుదల కార్యక్రమం అంటే, ఆ పార్టీ నాయకుడిలో ఎంత ఉత్సాహం వుండాలి? ఎంత ఆత్మవిశ్వాసం ప్రతిఫలించాలి? ఈ నాయకుడు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా వుండాలి. కానీ, జగన్‌లో అవేవీ కనిపించలేదు. ఏదో మేనిఫెస్టో విడుదల చేశామంటే చేశాం.. జనం నమ్మితే నమ్మారు లేకపోతే లేదు.. ఓట్లు వేస్తే వేశారు లేకపోతే లేదు అన్నట్టుగా ముఖ కవళికలు వున్నాయి తప్ప ఎంతమాత్రం జోష్ కనిపించలేదు. జగన్ ఇలా తద్దినం పెట్టినట్టుగా మేనిఫెస్టో చదవడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఏపీలో వార్ వన్ సైడ్.. అది కూడా టీడీపీ సైడ్ అయిపోయిందని జగన్‌కి ఇప్పటికే అర్థమైంది. ఇప్పుడు తాను, తన పార్టీ వాళ్ళు పడుతున్న తంటా అంతా ఎందుకూ పనికిరాదని ఆయనకి అర్థమైపోయింది. అందుకే ఆగిపోయే పెళ్ళికి మంత్రాలెందుకన్నట్టుగా మేనిఫెస్టో కార్యక్రమాన్ని ముగించారు.

వంశీ తెలుగుదేశం తలుపుతడుతున్నారా?

వల్లభనేని వంశి నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ కు ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. అంతుకు ముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే పోలింగ్ వరకూ ఆగనవసరం లేకుండానే ఆయన తన మాటలతో చేతలతో ఓటమి ఖాయమైపోయిందన్న సంకేతాలిస్తున్నారు. ఇటీవల గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం నుంచి  పోటీ చేయడం ఇదే ఆఖరుసారి అని చెప్పారు. వచ్చే ఎన్నికలలో అంటే 2029లో దుట్టారామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారనీ, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. వైసీపీలో వంశీకి వర్గ పోరు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికలలో వంశీ విజయానికి దోహదం చేసిన తెలుగుదేశం బలం ఇప్పుడు వంశీకి లేదు. ఇక వంశీకి వైసీపీ నుంచి కూడా తీవ్ర వర్గ పోరు ఎదురైంది. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా, తనకు ప్రత్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం గూటికి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి దేశం గూటికి వచ్చేశారు. అయితే అందుకు భిన్నంగా వంశీ కోసం తెలుగుదేశం వీడేందుకు ఆయన వర్గీయులు సిద్ధపడలేదు. ఇదలా ఉంటే వైసీపీలో మరో బలమైన నేత  దుట్టా రామచంద్రరావు. ఆయన వంశీకి ఇసుమంతైనా సహకారం అందించడం లేదు. వంశీ విజయం కోసం పని చేసే ప్రశక్తే లేదని పలు సందర్భాలలో బాహాటంగా చెప్పారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో వంశీ కోసం పని చేసే వారే కరవయ్యారు. అందుకే ఆయన నామినేషన్ ర్యాలీ అంతంత మాత్రంగా సాగింది. డబ్బులిచ్చి తెచ్చుకున్నవారు కూడా చివరి వరకూ ర్యాలీలో నిలవలేదు.  ఈ నేపథ్యంలోనే ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడిన వంశీ దుట్టాను మంచి చేసుకోవడానికి ప్రయత్నించారు. వచ్చే ఎన్నికలలో అంటే 2019లో ఆమె కుమార్తె పోటీ చేస్తారనీ, ఆమెకు తన సంపూర్ణ సహకారం అందిస్తాననీ చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే తనను  ఈసారి గెలిపించమని దుట్టాను వంశీ బతిమలాడుకున్నారు. అదీ మీడియా ముఖంగా. అయితే అదేమంతా ఫలించినట్లు కనిపించలేదు. సరే అదలా ఉంచితే... తాజాగా వంశీ ఒక ప్రముఖ చానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన పూర్తిగా చేతులెత్తేశారు.   ఇంత కాలం తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసిన వంశీ ఆ టీవీతో మాట్లాడుతూ చంద్రబాబుతో తనకు విభేదాలే లేవని చెప్పుకొచ్చారు. కేవలం జనరేషన్ గ్యాప్ మాత్రమేననీ, అదేమంత పెద్ద విషయం కాదనీ చెప్పుకున్నారు.  తానూ, కొడాలి నాని తెలుగుదేశం జిల్లా నాయకత్వంతోనూ, పార్టీ రెండో తరం నాయకత్వంతోనూ కలిసి ముందుకు సాగలేకపోయాం అటే పరోక్షంగా లోకేష్ తో  చిన్న చిన్న విభేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకున్నారు.  వంశీ మాటలను బట్టి ఆయన ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారనీ, ఎన్నికల తరువాత మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కడపలో దూసుకుపోతున్న మాధవీ రెడ్డి.. డిప్యూటీ సీఎంకు షాక్ తప్పదా?

కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది.  ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గమే అయినా.. గత ఐదేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంజాద్ పాష పని తీరు పట్ల అసంతృప్తి ఎన్నికల సమయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటున్నారు.  దానికి తోడు అంజాద్ పాషాకు ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాకుండా పార్టీలో వర్గపోరు కూడా ఇబ్బంది పెడుతోంది.  ముఖ్యంగా కడప కార్పొరేటర్లు ఈ సారి వైసీపీకి దూరం జరిగిన పరిస్థితులు ఉన్నాయి.  వైఎస్ఆర్ పై అభిమానంతో వైసీపీకి గత ఎన్నికలలో మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లలో చాలా మంది ఇతర పార్టీలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశంకు వలస వెళ్లిపోయిన పరిస్థితి.  తొలి నుంచీ కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ మరణం తరువాత వైసీపీకి కంచుకోటగా మారింది.    అయితే ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంం అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డప్పగారి మాధవీరెడ్డి నాయకత్వ పటిమ, ప్రచార వ్యూహాలతో కడపలో రాజకీయ ముఖచిత్రం దాదాపుగా మారిపోయిందంటున్నారు. ఆమె ప్రచార శైలి, మాట తీరుతో నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారనీ, మరీ ముఖ్యంగా మైనారిటీలు, మహిళల్లో ఆమె పట్ల ఆదరణ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.    మాధవీరెడ్డి ప్రచారశైలి, వ్యక్తం చేస్తున్న ఆత్మవిశ్వాసం పట్ల తెలుగుదేశం హైకమాండ్ కూడా సంతోషంగా ఉంది. మాధవీలత ధైర్యాన్నీ, కడపలో వైసీపీ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న తీరునూ ప్రశంసిస్తోంది.  

శంపాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత సంచారం 

అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువుల్లో జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళన చెందుతారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ విమానశ్రయంలో చిరుత పులి సంచరిస్తూ కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు.  విమానశ్రయం ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. అనంతరం భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. ట్రాప్‌ కెమెరా, బోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులు చిరుత సంచార విషయాన్ని తెలుసుకుని భయభ్రాంతులు చెందుతున్నారు.  దాదాపు మూడేళ్ల క్రితం శంషాబాద్‌ ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన జరిగింది. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాల్లో సంచరిస్తున్నట్లు రికార్డయింది. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. దానిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ప్రయత్నించారు.రెండు గంటల పాటు అధికారులు చిరుత కోసం గాలించారు. అనంతరం అది చిరుత కాదని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చివరికి సీసీ కెమెరాల్లో చిక్కింది చిరుత పులి కాదు అడవి పిల్లి అని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. మొద‌ట దానిని అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన అనంత‌రం దాన్ని చిరుత‌గా నిర్ధారించారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆర్‌జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు.  మూడేళ్లక్రితం హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేసింది.  జీహెచ్ఎంసీ, పోలీసులతో సమన్వయం చేసుకొని అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి పట్టుకున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత సంచారం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయినప్పటికీ బోనులో చిక్కకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

కడప వీధుల్లో షర్మిల వర్సెస్ భారతి

వైసీపీకి కంచుకోట అయిన కడపలో ఆ పార్టీ ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఆ జిల్లాలో ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి ఎదురన్నదే లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ కుటుంబానికి జిల్లాపై అలాంటి సాధికారత లేకుండా పోయింది. అందుకు ప్రధాన కారణం ఇప్పుడా కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పరస్పరం పోటీ పడటమే. ఔను కడప జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పోరాడుతోంది.  గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి రావడం కోసం, జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం కుటుంబం మొత్తం ఐక్యంగా నిలబడింది. జిల్లాలో ఫలితాలు అందుకు తగ్గట్టుగానే వచ్చాయి. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ల కిందట జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు వైఎస్ కుటుంబీకులే కావడం, ఆ అంశంపైనే కుటుంబం రెండుగా చీలిపోవడంతో జిల్లాలో పరిస్థితి తారుమారైంది.  జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత చెల్లెలు షర్మిల అన్నతో విభేదించింది. న్యాయంగా తనకు రావలసిన కుటుంబ ఆస్తులను ఇవ్వకపోవడమే కాకుండా పార్టీలో తన ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించి, చవరకు పార్టీ నుంచే సాగనంపిన జగన్ కు వ్యతిరేకంగా ఆమె గళమెత్తారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను జగన్ వెనకేసుకు వస్తున్నారని ఆరోపిస్తూ, వివేకా కుమార్తె డాక్టర్ సునీత చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించి, ఆమెకు బాసటగా నిలిచారు.  ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉంటే.. వైఎస్ షర్మిల అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఇక ఇదే లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ పోటీ చేస్తున్నారు.   తన భర్తకు మద్దతుగా  వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. కడప లోక్ సభ అభ్యర్థిగా రంగంలో ఉన్న షర్మిల ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో కడప వీధుల్లో వైఎస్ భారతి, వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లోనే హైలైట్ గా నిలవనుంది.  ఇప్పటి  వరకూ అయితే వైఎస్ భారతి వ్యూహాత్మకంగా  షర్మిలపై నేరుగా ఎటువంటి విమర్శలూ చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం  భారతిపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైఎస్ భారతి కూడా షర్మిలపై డైరెక్టుగా విమర్శలు సంధించడానికి ఎక్కవ రోజులు తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. దీంతో తొలిసారిగా వైఎస్ కుటుంబ కోటకు బీటలువారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కడప ఫలితమే నిజమైన వైఎస్ రాజకీయవారసులెవరన్నది తేలుస్తుందని చెబుతున్నారు. 

ప్రజా సేవ చేయాలనుకునే వారికి వైసీపీ వేదిక కాదు.. కుండబద్దలు కొట్టిన అంబటి రాయుడు

వైసీపీకి భవిష్యత్ లేదా?  ఈ విషయం పార్టీలో దగాకు గురైన వారే కాదు.. నిన్న మొన్న వచ్చి చేరిన వారికి కూడా అర్ధమైపోతోందా?  అంటే ఎలాంటి సందేహం లేకుండా ఔనని చెప్పడానికి బోలెడు ఉదాహరణలు ఉంటాయి. వాటిలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో ఇలా చేరి అలా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన  ఉదంతం ఒకటి.   వైసీపీ కండువా కప్పుకుని జగన్ పై ప్రశంలస వర్షం కురిపించిన అంబటి రాయుడు రోజుల వ్యవధిలోనే  ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.  అలా వస్తూ రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో క్లుప్తంగా ఓ పోస్టు పెట్టి ఊరుకున్నారు.  వైసీపీలో చేరిన పది రోజుల్లోనే అంబటి రాయుడు రాజకీయవిరామం అంటూ రాజీనామే చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  అలా రాజకీయ విరామం అన్న అంబటి రాయుడు ఆ వెంటనే జనసేన గూటికి చేరిపోయారు. దీనిని బట్టి ఆయన రాజకీయ విరామం అన్నది ఒట్టి సాకు మాత్రమేననీ, వైసీపీకి గుడ్ బై చెప్పేశారనీ అప్పట్లోనే అందరికీ అర్ధమైంది.  అయితే వైసీపీ తీర్ధం పుచ్చుకున్న పది రోజులకే అంబటిరాయుడికి ఆ పార్టీపై ఎందుకంత విరక్తి కలిగింది అన్నది మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియలేదు. అప్పట్లో  వారు గుంటూరు లోక్ సభ టికెట్ విషయంలో జగన్ మాట తప్పడవం వల్లే వైసీపీకి గుడ్ బై చెప్పేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన జనసేనలో చేరినా ఆ పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో గుంటూరు టికెట్ విషయంలో వైసీపీ మోసం చేయడం ఒక్కటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి కారణం కాదని పరిశీలకులు విశ్లేషించారు. అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి కారణమేమిటన్నది ఇప్పటి వరకూ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ ఏం లేదు. ఎందుకంటే తాను బయటకు రావడానికి కారణమేమిటన్నది స్వయంగా అంబటి రాయుడే వెల్లడిం చారు.   ప్రజా సేవ చేయాలనుకుని రాజకీయాలలోకి వచ్చే వారికి వైసీపీ సరైన వేదిక కాదని గ్రహించడం వల్లనే తాను ఆ పార్టీకి గుడ్ బై చెప్పానని కుండబద్దలు కొట్టేశారు.  ఆ పార్టీ పూర్తిగా వ్యక్తి నియంతృత్వంలో ఉందని అంబటి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా జగన్ మోహన్ రెడ్డిని కలవలేని వాతావరణాన్ని చూసి తాను షాక్ కు గురయ్యానని అన్నారు. అందుకే  వైసీపీ గూటికి చేరిన క్షణం నుంచి ఎప్పుడు బయటకు వద్దామా అని తహతహలాడానని అంబటి వివరించారు.  పవన్ ల్యాణ్ నాయకత్వ లక్షణాలు, ఆయన ఆశయాలకు ఆకర్షితుడనై జనసేనలో చేరానన్నారు.  రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం  తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

భారతికి జగన్ విడాకులు ఇస్తారా?

గతంలో కంటే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ఎన్నికల ప్రచారం స్పీచ్‌ల్లో పంచ్‌లు పేలుతున్నాయి. గతంలో ఆయన క్లాస్ భాష మాట్లాడేవారు. ఆయన మాటలు మరీ మాస్ జనాలకు ఆలస్యంగా అర్థమయ్యేది. ఈమధ్యకాలంలో ఆయన మాస్ పల్స్ బాగా పట్టుకున్నారు. 75 సంవత్సరాల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్న ఆయన, తన ప్రసంగాల్లో కూడా భారీ స్థాయిలో పంచ్‌లు పేల్చుతున్నారు. ఏ ఇష్యూ మీద అయినా  జగన్ మీద పక్కా మాస్ పంచ్‌లు వేస్తున్నారు. ఒక్కొక్కసారి ఈయన ఆయనేనా అనుకునే విధంగా పంచ్‌లు ప్రవహిస్తున్నాయి.  వైఎస్ షర్మిల పసుపుపచ్చ చీర కట్టుకోవడం మీద జగన్ కామెంట్ చేయడం భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. తన చెల్లెలు పచ్చ చీర కట్టుకుందని విమర్శించిన జగన్ మీద చంద్రబాబు పంచ్‌లతో విరుచుకుపడ్డారు. షర్మిల పచ్చ చీర కట్టుకుంటే తప్పు, మరి జగన్ భార్య భారతి పసుపు పచ్చ డ్రస్ వేసుకుని, జగన్‌తో కలసి ఫొటోలకు పోజులిచ్చింది.. మరి జగన్ ఇప్పుడేం చేస్తారు.. ఆమెకు విడాకులు ఇస్తారా అని చంద్రబాబు పంచ్ వేశారు.