వైసీపీ నుంచి విడదల రజనీ ఔట్?

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు విడదల రజనీ జగన్ కు ఝలక్ ఇవ్వనున్నారా? వైసీపీని వీడుతానంటూ పార్టీ అధినేతకు లీకులు పంపిస్తున్నారా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజినీ.. అప్పట్లో తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కను అంటూ చెప్పుకునే వారు. అయితే తరువాత ఆమె వైసీపీ గూటికి చేరి పలుకు మార్చారు. అసలింతకీ ఆమె పొలిటికల్ జర్నీ ఎలా సాగింది.. ఇప్పుడు వైసీపీ పట్ల ఆమెకు ఎందుకు అంత విరక్తి కలిగిందన్నది చూస్తే...  2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విడదల రజినీ తెలుగు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడానికి తోడు మంచి వాక్చాతుర్యం  ఉండటంతో అనతి కాలంలోనే తెలుగుదేశం సీనియర్ల గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే  అప్పట్లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడే చాన్స్ పొందారు.  ఆ అవకాశం రజనికి పార్టీలో మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. అంతే కాకుండా..   హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్కను అంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ బాగా హత్తుకున్నాయి. అదే మహానాడు వేదికపై నుంచి అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిలను నరకాసురులుగా అభివర్ణించిన విడదల   రజినీ మాటలకు తెలుగు తమ్ముళ్లే కాదు, వేదికపైన ఉన్న పెద్దలు సైతం ఫిదా అయిపోయారు.   ఈ నేపథ్యంలో  చిలకలూరి పేట సీటు కోసం విశ్వప్రయత్నం చేసిన విడదల రజినికి తెలుగుదేశం హైకమాండ్ నిష్కర్షగా నో చెప్పేసింది. దీంతో ఆమె  తెలుగుదేశం వీడి జగన్ పార్టీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఏకంగా మంత్రిపదవి సైతం చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చిలకలూరిపేట కేంద్రంగా రజనీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై పలు కేసులు సైతం ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికలలో తన ఘోర పరాజయానికి తనను చిలకలూరి పేట నుంచి గుంటూరుకు మార్చడమేనని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఓటమి తరువాత ఆమె మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. జగన్ ఆమె రిటర్న్ బ్యాక్ కు అనుమతించారో లేదో తెలియదు కానీ, 2029లో చిలకలూరి పేట నుంచే పోటీ చేయాలన్న ధృఢ నిశ్చయంతో ఆమె ఉన్నారంటారు ఆమె అనుచరులు. అయితే ఇప్పుడు తాజాగా ఆమెను రేపల్లె వైసీపీ ఇన్ చార్జ్ గా వెళ్లమని జగన్ ఆదేశించారనీ, అది ఇష్టం లేని రజినీ ఇక వైసీపీకి గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి కర్త, క్రియ, కర్మ అన్నీ రజినీ వర్గీయులేనని కూడా అంటున్నారు.రేపల్లె ప్రపోజల్ వచ్చినప్పటి నుంచీ రజినీ సైలంట్ అయిపోయారంటున్నారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమె వాయిస్ వినిపించడం లేదు. ఏ కార్యక్రమంలోనూ ఆమె కనిపించడం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇక పోతే వైసీపీకి గుడ్ బై చెప్పి విడదల రజిని చేరే పార్టీ ఏదన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  జనసేన, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతున్నా.. అదేం జరిగే పని కాదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు.. అలా వెలగడానికి కారణం ప్రత్యర్థులపై ఇష్టారీతిన ఆరోపణలు, విమర్శలూ గుప్పించడమే. అటువంటి వారిని ఇతర పార్టీలు చేర్చుకోవడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారని అంటున్నారు. ఆ రకంగా చూస్తే విడదల రజినికి కూటమి పార్టీల తలుపులు మూసుకుపోయినట్లేనని కూడా అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆమె వర్గీయులు చేస్తున్న పార్టీ మార్పు ప్రచారం.. జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి చిలకలూరిపేటలో కొనసాగడానికే అయి ఉంటుందన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 

చంద్రబాబు కాదు.. చిన్నబాబే!

ఇంతై.. ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా రాజకీయంగా, వ్యక్తిగా నారా లోకేష్ రోజు రోజుకూ ఎదుగుతున్నారు. తండ్రి చాటు బిడ్డగా, ఆయన చిటికిన వేలు పట్టుకుని రాజకీయాలలో బుడిబుడి అడుగులు ఆరంభించిన లోకేష్ ఇప్పుడు తండ్రితో సమానంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాధాన్యత, అధికార పరిధి విస్తరణ వేగంగా పెరుగుతోంది. పార్టీలో నవతరం నాయకుడిగా  నారా లోకేష్ తనను తాను నిరూపించుకోవడమే కాకుండా పార్టీ నేతలు, శ్రేణుల నుంచి మద్దతు కూడా పొందుతున్నారు. పార్టీ వ్యవహారాలలో ఆయన పోషిస్తున్న కీలక పాత్ర పరిధి విస్తృతి చంద్రబాబుతో సమానంగా మారుతోందనడానికి ఇటీవలి కాలంలో పలు తార్కానాలు కనిపించాయి. గతంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కు తీసుకురావడంలో కానీ.. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణలో కానీ గతంలో చంద్రబాబు ఏ విధంగా క్రియాశీలంగా వ్యవహరించారో తెలిసిందే. ఇప్పుడు ఆ పనిని అంతే సమర్థతతో.. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అన్నట్లుగా లోకేష్ నిర్వహిస్తున్నారు.  అంతే కాదు జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కు మంచి గుర్తింపు లభిస్తోంది.   కేంద్రంతో సంబంధాల విషయంలో కానీ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అంశంలో కానీ లోకేష్ ను తండ్రిని మించిన తనయుడిగా పార్టీ నేతలూ, శ్రేణులే కాదు, పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు.    ఇహ ఇప్పుడు తాజాగా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ లతో భేటీ అవుతారు. ఈ భేటీలలో ఆయన ఇటీవలి మొంథా తుపాను కారణంగా రాష్ట్రానికి జరిగిన ఆస్తినష్టాన్ని, రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్నీ వారికి వివరిస్తారు. అందుకు సంబంధించిన నివేదికలు సమర్పిస్తారు. కేంద్రం నుంచి సహాయాన్ని కోరతారు. సాధారణంగా ఇలా కేంద్రానికి విజ్ణప్తులు చేయడం, ప్రకృతివిపత్తుల కారణంగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని వివరించి సహాయం కోరడం అన్నది ముఖ్యమంత్రి చేస్తారు. అయితే ఇప్పుడు ఆ బాధ్యత లోకేష్ తీసుకున్నారు.   అంతే కాదు.. పార్లమెంటులో తెలుగుదేశం సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తే విషయంలో లోకేష్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలోనూ, కూటమి ప్రభుత్వంలోనూ లోకేష్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతను కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. అంతగా ఆయన తన సమర్ధతతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

వైసీపీ ఫ్రాడ్ బ్రాండ్స్!

వైసీపీ ఒక క్రిమిన‌ల్ గ్యాంగ్ అని చెప్ప‌డానికి ఇప్ప‌టికే ఆ పార్టీ అధినేత నుంచి ర‌ప్పా  ర‌ప్పా ఫ్లెక్సీలు ప‌ట్టుకు తిరిగే కేడ‌ర్ వ‌ర‌కూ అందరూ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్న రీతిలో రుజువు చేసేశారు. జగన్ ఆస్తుల కేసులలో, ఆ పార్టీ నేతలు ఏపీ మద్యంస్కాం, కల్తీమద్యం కుంభకోణం, భూ కబ్జాలు వంటి ఎన్నో నేరాలలో కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు కటకటాల వెనుక ఉన్నారు. ఇది చాలు  ఆ పార్టీ ఒక క్రిమినల్స్ గ్యాంగ్ అని చెప్పడానికి అంటున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.   ఇప్పుడు తాజాగా వైసీపీలో   లేడీ  డాన్స్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వస్తోందంటున్నారు.  మొన్నటికి మొన్న నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్య‌వ‌హారం. ఇప్పుడు తాజాగా అదే నెల్లూరు జిల్లాకు, చెందిన అర‌వ కామాక్షి కేసు. అరవ కామాక్షి అయితే  ఏకంగా గంజాయి దందా నిర్వ‌హిస్తూన్నట్లు పోలీసులు చెబుతున్నారు.   అర‌వ కామాక్షి చేసే గంజాయి దందాను  అరిక‌ట్టాల‌ని పోరాటం చేస్తున్న    పెంచల‌య్య‌ అనే వ్యక్తిని వెంటాడి, వేటాడి మరీ హత్య చేసింది కామాక్షి గ్యాంగ్ అని పెంచలయ్య హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. త‌న గంజాయి దందాకు  పెంచ‌ల‌య్య‌ ఆడ్డు వ‌స్తున్నాడ‌న్న కారణంగా  అత‌డ్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న కామాక్షి గ్యాంగ్ చివరకు పెంచలయ్య త‌న బిడ్డ‌ను స్కూలు నుంచి తీసుకొస్తుండ‌గా  కాపు కాచి మరీ ఖతం చేశారని చెబుతున్నారు.   ఈ హత్య ఘటనను కూడా వైసీపీయులు రాజకీయ ప్రత్యర్థులపై నెట్టేయడానికి ప్రయత్నించారు. దీనిపై  రియాక్టైన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి. ఒక వేళ నాపై సీపీఏం  నేత‌లు కేసు పెడితే తాను వారు విధించే శిక్ష‌ను ఎదుర్కుంటాన‌న్నారు. వాస్తవానికి   అర‌వ కామాక్షికి ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి వ‌ర్గానికి  ఎంతో సంబంధ‌ముంద‌ని ఆరోపించారాయ‌న‌.  ఇటీవల  జ‌గ‌న్ నెల్లూరు వ‌చ్చిన‌పుడు ఇదే అర‌వ కామాక్షి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు  ఖ‌ర్చుల కోసం ఇచ్చింది నిజం కాదా?  అని ప్రశ్నించారు. ఆమెకూ వైసీపీ నేత‌ల‌కు అంత‌టి సంబంధ బాంధ‌వ్యాలున్నాయి కనుకే..   విజ‌య్ కుమార్ రెడ్డి, పెంచ‌ల‌య్య కుటుంబాన్ని  ప‌ర‌మార్శించ‌డానికి రాలేద‌న్నారు కోటంరెడ్డి. ఇదంతా ఇలా ఉంటే వైసీపీ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడే గ్యాంగ్ ను తయారు చేసిందనీ, అది చాలదన్నట్లు ఇప్పుడు ఒక అరుణ‌, ఒక అర‌వ కామాక్షి వంటి ఫ్రాడ్ బ్రాండ్స్ ని కూడా రంగంలోకి దింపిందనీ విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  

సర్ పై చర్చకు విపక్షాల పట్టు.. సభలో గందరగోళం.. వాయిదా

పార్లమెంట్  ఉభయ సభలూ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమయ్యాయి.  లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే  ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి.  ఈ సమావేశాలలో  14 కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే,    ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సంసిద్ధమయ్యాయి.  ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.  లోక్ సభలో   ఓటర్ల జాబితా సవరణ సర్ పై  చర్చించాలంటూ  కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇక పోతే..  ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన రాధాకృష్ణన్   రాజ్యసభ సమావేశాలకు తొలి సారిగా అధ్యక్షత వహిస్తున్నారు.    ఈ రోజు ఆరంభమైన పార్లమెంటు సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి.   ఇలా ఉండగా పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విపక్షలపై విమర్శలు గుప్పించారు.  సభలో నినాదాలు చేసి, సభా కార్యక్రమాలను అడ్డుకుని విలువైన సభా సమయాన్ని వృధా చేయవద్దంటూ విపక్షాలకు సూచించారు. నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయన్న ఆయన, పార్లమెంటును  విధాన రూపకల్పనకు పరిమితం చేయాలన్నారు. నినాదాలతో సభను అడ్డుకుని విపక్షాలు డ్రామా అడుతున్నాయని విమర్శించారు.  పార్లమెంటు  సమావేశాలు కేవలం సంప్రదాయం కాదనీ, దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపే ప్రయత్నాలకు నవ శక్తిని ఇచ్చే మార్గమని అన్నారు.   కాగా  వయనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రా మోడీ వ్యాఖ్యలకు లోక్ సభలో గట్టి రిటార్డ్ ఇచ్చారు. పార్లమెంటు ప్రజా సమస్యలను చర్చించే వేదిక అని పేర్కొన్న ఆమె..  సభలో  చర్చకు అవకాశం ఇవ్వకుండా  అధికార పక్షమే నాటకాలు ఆడుతోందని విమర్శించారు.  ఇలా ఉండగా లోక్ సభ ఇలా ప్రారంభమై అలా కొద్ది సేపటికే వాయిదా పడింది. మొదటి రోజే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సర్ పై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు నిరసనకు దిగాయి.  సభ్యుల నినాదాలతో సభలో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.   

మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు!

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు వ్యక్తిగత సహాయకులతో తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయి.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పోలీసులకు ఇప్పుడు మంత్రుల వ్యక్తిగత సహాయకుల నేరాల దర్యాప్తు, విచారణ అదనపు భారంగా మారుతోంది.   గ‌తంలో హోం మంత్రి అనిత పిఏ జ‌గ‌దీశ్ ఆగ‌డాలపై ఏకంగా కూట‌మి నేత‌లే ఫిర్యాదు చేశారు  అత‌గా డి సెటిల్మెంట్ల వ్యవహారం చూసి తెలుగు తమ్ముళ్లే విస్తుపోయారు.   ఏకంగా మంత్రి పీఏగా ఉంటూ..   వైసీపీ లీడ‌ర్ల‌ల‌కు ప‌నులు చేసి పెట్ట‌డంపై అతడిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..  హోం మంత్రి అనిత‌ అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.  తాజాగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికార వ్యక్తిగత సహాయకుడు సతీష్ వ్యవహారం తెరపైకి వచ్చింది. మహిళపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య మెసేజీలతో వేధింపులకు గురి చేసిన ఉదంతం కలకలం రేపింది.  అతడి వైధింపులు భరించలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన సీఎంవో.. అతడిని తొలగించి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   అయితే ఈ వ్యవహారంపై గుమ్మడి సంధ్యారాణి లక్ష్యంగా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి అయితే.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖా  మంత్రిగా ఉన్న సంధ్యారాణి ఒక మ‌హిళ ఆవేద‌న అర్ధం చేసుకోక పోగా.. త‌న పీఏకి వంతపాడుతున్నారని విరుచుకుపడ్డారు.   మంత్రి సంధ్యారాణికి త‌న గోడు వెళ్ల‌బోసుకుంటే, ఆమె  రివ‌ర్స్ లో త‌న‌పైనే దుర్భాష లాడార‌ని  బాధితురాలు వాపోయిన సంగతిని పుష్ప శ్రీవాణి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఆమెకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదనీ, రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.  

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో గాంధీలకు బిగుస్తున్న ఉచ్చు

  నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై పాటు మరో ఆరుగురిపై కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఢిల్లీ ఎకనమిక్ అఫెస్సెస్ వింగ్ వారితో పాటు మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడాలతో పాటు యంగ్‌ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. కుట్రపూరితంగా కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులపై హక్కు పొందారని ఈడీ ఆరోపించింది.  కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతీలాల్‌ వోరా 2020లో మృతిచెందగా.. ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ 2021లో మృతిచెందారు. కాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు నిన్న డిసెంబర్ 16కి వాయిదా వేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపికచేస్తామని, బిజినెస్‌కు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్‌ నేతల ద్వారా భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపింది. 2025 అక్టోబర్ 3 నాటి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ రూపొందించబడింది. ఈడీ తమ దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులతో పంచుకోవడంతో ఈడీ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఏజేఎల్‌ ప్రచురించేది. అయితే ఆర్థిక  ఇబ్బందుల కారణంగా 2008లో ముద్రణను నిలిపివేసింది. ఆ సమయంలో, మాతృ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల మేరకు బకాయి ఉంది.కాంగ్రెస్ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం ఏజేఎల్‌ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, ఆ అప్పును ఈక్విటీ షేర్లుగా మార్చారు. పార్టీ ఈక్విటీ షేర్లను నిర్వహించలేని కారణంగా, వాటిని 2010లోయంగ్ ఇండియన్ (వైఐ)కి కేటాయించారు.  

15 నెలలు.. 5000 కిలోమీటర్లు.. జగన్ పాదయాత్ర 2.0.. నిజమేనా?

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం అనదగ్గ పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఆ తరువాత ఈ 16 నెలల కాలంలోనూ ఇసుమంతైనా కోలుకోలేకపోయింది. పార్టీ క్యాడర్ జారిపోయింది. నేతలు పార్టీ కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు. గతంలో అంటే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అయిన దానికీ కానిదానికీ నోరెట్టుకు పడిపోయి ఫైర్ బ్రాండ్ నేతల్లా గుర్తింపు పొంది జగన్ మన్ననలు పొందిన నేతలు ఇప్పుడు కలికానిక్కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఇప్పుడు మాజీ మంత్రులుఅంబటి రాంబాబు, పేర్ని నాని వంటి ఇద్దరు అతి కొద్ది మంది  మాత్రమే పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. అప్పుడప్పుడు సజ్జల మీడియా ముందుకు వచ్చి అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి మళ్లీ  మౌనం వహిస్తున్నారు. అధికారంలో ఉండగా అడ్డగోలుగా వ్యవహరించి అవినీతికి పాల్పడిన పలువురు నేతలు కేసుల భయంతో బిక్కుబిక్కుమంటుండగా, ఇంకొందరు అవినీతి కేసులలో అరెస్టై రిమాండ్ ఖైదీలుగా కటకటాల వెనుక కాలక్షేపం చేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీ పుంజుకోవాలంటే.. 2019 ఎన్నికలలో తన పార్టీ విజయానికి ప్రధాన కారణంగా ఉన్న పాదయాత్రనే మళ్లీ చేపట్టక తప్పదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. అప్పట్లో జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర కారణంగానే ఆయన నాయకత్వంలో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. జగన్ ముఖ్యమంత్రి కాగలిగారనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం అప్పట్లో పాదయాత్రతో ఆయన జనం మధ్యలో ఉండటమే. అయితే అధికారం చేజిక్కిన తరువాత జగన్ జనం ముఖం చూడటమే అరుదైపోయింది. అధవా ఎప్పుడైనా బయటకు వచ్చినా రోడ్డు కిరువైపులా పరదాలు కట్టించుకుని జనం తనకు కనబడకుండా, జనానికి తాను కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  దీంతో ఆయన జనానికి దూరం అయ్యారు. దీనికి తోడు ఐదేళ్ల పాలనా కాలంలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే కాకుండా.. అంతకు ముందు ఐదేళ్లూ చంద్రబాబు పాలనలో  జరిగిన అభివృద్ధి ఆనవాలును కూడా చెరిపేయాలని ప్రయత్నించడంతో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. అందుకే 2029 ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి తాను జనంలోకి వెళ్లడమొక్కటే మార్గమని జగన్ భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ సారి గతం కంటే ఎక్కువ దూరం నడిచి ఎక్కువ మంది జనాలకు చేరువ కావాలని జగన్ భావిస్తున్నారు.  ఇదే విషయాన్ని జగన్ కు సన్నిహితుడూ, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ అధికార ప్రతినిథిగా చెలామణి అవుతున్న  వెంకటరెడ్డి మీడియాకు చెప్పారు. ఈ సారి జగన్ పాదయాత్ర 15 నెలల పాటు సాగుతుందనీ, అలాగే గత రికార్డును బద్దలు కొడుతూ ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 5వేల కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేస్తారనీ వెల్లడించారు.  అయితే ఇక్కడే పరిశీలకులు గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్ నేలవిడిచి సాము చేసిన చందంగా హామీలు గుప్పించారనీ, అయితే అధికారపగ్గాలు చేపట్టిన తరువాత తన అహంకారపూరిత వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలనూ దూరం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు మరోసారి పాదయాత్ర అంటూ ఆయన జనం ముందుకు వచ్చినంత మాత్రాన జగన్ ను జనం నమ్మే పరిస్థితి ఉండదంటున్నారు. చూడాలి మరి జగన్ ఒక వేళ నిజంగా పాదయాత్రతో జనం ముందుకు వస్తే వారెలా రిసీవ్ చేసుకుంటారో?

కడపలో వైసీపీ కాడెపట్టే నాయకులేరీ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ పరిస్థితి కలవరం కలిగిస్తున్నది. పార్టీ అధినేతగా పార్టీ నేతలను, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడంలో ఆయన విఫలమౌతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉందని అంటున్నారు. ఎప్పుడైనా ఏదో ఓదార్పు యాత్ర అనో, తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటన అనో ఆయన బయటకు వచ్చినప్పుడు వినా.. మరే సందర్భంలోనూ పార్టీ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి ఆయన సొంత జిల్లా కడపలోనూ కనిపిస్తోంది.  ఇటీవల జగన్ కడప జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా  జిల్లాలో కీలకంగా వ్యవహరించే పార్టీ నేతలు చాలా వరకూ జగన్ కు చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. అధినేత పర్యటనకే వారు డుమ్మా కొట్టారు. అరటి రైతుల పరామర్శ, వారితో ముఖాముఖీ ఇవన్నీ పక్కన పెడితే.. పార్టీ పరంగా ఆయన కడప పర్యటన అట్టర్ ప్లాప్ అన్న మాట సొంత పార్టీ నేతలు, శ్రేణుల నుంచే వస్తున్నది.  వాస్తవంగా జిల్లాలో  పార్టీ నాయకులు, కార్యక‌ర్త‌లను మోటివేట్ చేసి జిల్లాలో పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగేలా పరిస్థితిని చక్కదిద్దాలన్నదే ఆయన పర్యటన ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెప్పాయి. అయితే పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు జగన్ పెద్దగా సమయం కేటాయించకపోవడం వారంతా నిరాశపడ్డారని అంటున్నారు.   జిల్లా వైసీపీలో క్యాడర్ పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్నది వాస్తవం. అలాగే నేతలు కూడా చాలా వరకూ ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ విషయాన్ని జగనే స్వయంగా పలు సందర్భాలలో  చెప్పడమే కాకుండా వారిని  యాక్టివ్ కావాలని ఆదేశించినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. అయినా కూడా పార్టీ అధినేతగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయలేని పరిస్థితులలో జగన్ ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్వయంగా జగనే పార్ట్ టైమ్ పొలిటీషియన్ లెక్కన నెలలో ఎక్కువ రోజులు బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడమే ఇందుకు కారణమని అంటున్నారు.   

దీక్షా దివస్ పేరిట కేసీఆర్ కొత్త నాటకం.. టీపీసీసీ చీఫ్

దీక్షా దివస్ అంటూ  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో కొత్త నాటకానికి తెరతీస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ రోజిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న కేసీఆర్.. ఇప్పుడు మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వాస్తవానికి ఉద్యమ కాలంలో కేసీఆర్ దీక్ష ఒక నాటకమన్న ఆయన దీక్ష ప్రారంభించిన మూడు రోజులకే ఆయన దీక్షను విరమించారనీ, అయితే విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తీవ్ర ఆగ్రహానికి భయపడి మళ్లీ మొదలెట్టారని గుర్తు చేశారు. అయినా తెలంగాణ రాష్ట్రం తన వల్లే సాధ్యమైందని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్, కృషి, విద్యార్థుల పోరాటమే కారణమన్నారు.  

వాయు కాలుష్యంపై పార్లమెంటులో చర్చకు రాహుల్ డిమాండ్

దేశంలోని ప్రధాన నగరాలలో వాయుకాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరడంపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నగరాలలో వాయుకాలుష్యంపై పార్లమెంటులో చర్చజరగాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల మొదటి తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదిరగా  రాహుల్ గాంధీ  ఈ డిమాండ్ చేశారు.   వాయుకాలుష్య సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదని దుయ్యబట్టారు.  దేశంలో  పిల్లలు వాయుకాలుష్యంతో  ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ప్రధాని మోడీ మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని నిలదీశారు. పిల్లల భవిష్యత్, ఆరోగ్యం విషయంలో జవాబు దారీతనం ఉండాలన్న రాహుల్ గాంధీ  వాయుకాలుష్యంపై పార్లమెంటులో  చర్చించి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కఠినమైన, ఆచరణసాధ్యమైన ప్రణాళిక అవసరమని నొక్కి చెప్పారు.    

ఏపీ కేబినెట్ భేటీ.. ఏఏ అంశాలపై చర్చంటే?

ఆంధ్రప్రదేశ్ మంతివర్గ సమావేశం శుక్రవారం (నవంబర్ 28) మధ్యాహ్నం మూడు గంటలను జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ బేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా  విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నరిలయన్స్ డేటా సెంటర్, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం పొందిన కీలక ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా  ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలుపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలకు కూడా మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి.  అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్న బిల్లులపై కూడా చర్చ జరిపి ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది.  సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.  ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గతేడాది వరద ముంపు మరమ్మతులకు గానూ దాదాపు రూ.57.14 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపనుంది.  అదే విధంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది.   

రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం ఎంపీలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అత్యధిక యువ పార్లమెంటేరియన్లు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారన్న ఆయన ఆ  యువశక్తిని ఉపయోగించి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను బలంగా వినిపించాలని   పిలుపునిచ్చారు.  తన క్యాంపు కార్యాలయంలో  గురువారం (నవంబర్ 27) జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో  పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన మార్గదర్శనం చేశారు.   మొంథా తుఫాన్ నష్టపరిహారం, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం వంటి అంశాలపై కేంద్రాన్ని ఒప్పించేలా సభలో ఎంపీలు కృషి చేయాలన్నారు. 2027 జూన్‌లో పోలవరాన్ని జాతికి అంకితం చేయడమే లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అత్యవసరమన్నారు.  వంశధార-గోదావరి-నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. అలాగే పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ-విజయవాడ మెట్రో రైలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను సభలో లేవనెత్తాలన్నారు.    ఈ సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి  నారా లోకేశ్‌  పార్లమెంటులో  తెలుగుదేశం ఎంపీలు   ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించాలని సూచించారు.  

కర్నాటక సీఎం మార్పు.. అందరితోనూ చర్చించే నిర్ణయం.. ఖర్గే

కర్ణాటక కాంగ్రెస్‌లో  సీఎం మార్పు పంచయతీ ఢిల్లీకి చేరింది. కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాల సెగ హైకమాండ్ కు తగిలింది. దీంతో హైకమాండ్ కర్నాటక పార్టీలో విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టింది. కర్నాటక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీఎం మార్పు తదితర అంశాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ఈ విషయంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.  కర్నాటక పార్టీలో  అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు.  ఇందు కోసం రాష్ట్ర నేతలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు గురువారం (నవంబర్ 27) తెలిపారు. అందరితో చర్చించి, అందరి అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న తరువాత మాత్రమే సీఎం మార్పుపై ఒక నిర్ణయం తీసుకుంటామని మల్లికార్జున్ ఖర్గే  స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు  త్వరలో ఏర్పాటు చేయనున్న సమావేశంలో తాను, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సహా కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా పాల్గొంటారని స్పష్టత ఇచ్చారు.  

పాలనా వ్యవస్థ లోపాలపై శర సంధానం.. వాస్తవ వేదిక

ఇల్లు అలకగానే పండగ కాదు. రాష్ట్రాలు విభజించగానే సమస్యలు తీరిపోవు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు కోటి సమస్యలు. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని విడగొట్టిన నాటి పరిస్థితులకూ, నేటికీ పెద్ద తేడా లేదు. ఆనాడు కర్నూలు రాజధానిగా పాలించడానికి నానా కష్టాలూ పడ్డారు పాలకులు. నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితీ అదే.  ప్రణాళికలు బ్రహ్మాండంగా ఉన్నా, ఆచరణలో వాటి అమలుకు అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఒక వైపు నిధుల కొరత, మరో వైపు రుణాలపై వడ్డీల భారం, ఇంకో వైపు అడుగడుగునా అవినీతి సర్పాలు బుసలు కొడుతున్నాయి. అమరావతి రాజధానిగా త్వరగా ఎదగాలనుకునే వారి కన్నా, ఎందులో సొమ్ములు దొరుకుతాయోనని వెతుక్కునే నేతలు, దళారులూ ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధి  ‘‘మూరెడు ముందుకి, బారెడు వెనక్కి’’ అన్నట్లు సాగుతోంది.  రాష్ట్ర విభజన జరిగాక, తొలి ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కార్యాలయ విభాగాల తరలింపు జరిగినా, తదుపరి ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం దీని నిర్మాణం జోలికి పోలేదు. పైగా విధ్వంసకర నిర్ణయాలు, రాజకీయ విద్వేషాలతోనే అభివృద్ధిని సర్వనాశనం చేసింది. కూటమి ప్రభుత్వం పేరుతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు తిరిగి దానిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ 15 నెలలు గడిచినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఎలా జరగాలి అనే అంశాలతో పాటు, తెలుగువారి రాష్ట్ర చరిత్రను టచ్ చేస్తూ, 95 ఏళ్ల చరిత్ర కలిగిన స్వాతంత్ర కాలం నాటి వార పత్రిక జమీన్ రైతు, అమరావతి రైతుల గుండె ఘోషతో పాటు 25 ఏళ్లుగా అనేక సమస్యలతో రాజీలేని పోరాటం చేస్తున్న ‘‘తెలుగువన్’’ డిజిటల్ ఛానల్ తో కలిసి పోరాటం ప్రారంభిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఎలుగెత్తి, పరిష్కారమే లక్ష్యంగా, నిర్మొహమాటంగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు నేటి నుంచి తెలుగువన్ డిజిటల్ లో  ‘‘వాస్తవ వేదిక’’పై చర్చా కార్యక్రమం ప్రారంభమౌతోంది. జమీన్ రరైతు ఎడిటర్,  నెల్లూరు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ లు ఈ వేదిక ద్వారా ప్రభుత్వం, పాలకుల అవినీతి, అక్రమాలు, అసమర్థ విధానాలపై శర సంధానం చేయనున్నారు.  ప్లీజ్ వాచ్ ఇట్ నవంబర్ 27వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి..

మూడు రంగుల చీర కట్టి.. కవిత అడుగులెటు?

బీఆర్ఎస్ బహిష్కృత నేత, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులు ఎటుపడుతున్నాయన్న విషయంలో రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తన గులాబి రంగును కాషాయంగా మార్చుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన కల్వకుంట్ల కవిత.. తాను స్వయంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ కూడా ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు టార్గెట్ గా ఉంటున్నాయి. అదే సమయంలో  తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అని ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చేవిగానే ఆమె వ్యాఖ్యలు విమర్శలు ఉంటున్నాయి. అదే సమయంలో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారా అన్న అనుమానాలూ కలిగించేలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆమె ధరించిన చీర ఆమె కాంగ్రెస్ బాట పట్టారా అన్న అనుమానాలకు బలం చేకూర్చాయి.  డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక‌ బుధవారం (నవంబర్ 26)  జరిగింది. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత తన భర్తతో కలిసి హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి హాజరైన కవిత  కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్న చీరను కవిత కట్టుకట్టుకోవడమే తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చకు తావిచ్చింది. కవిత సాధారణంగా పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యే సందర్భాలలో సింపుల్ రంగులు ఉండే చీరలనే ధరిస్తారు. అయితే  మల్లు భట్టివిక్రమార్క కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు మాత్రం కవిత  ఎరుపు, ఆకుపచ్చ అంచులున్న తెల్లటి చీర ధరించి రావడం అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా పెద్ద రాజకీయ చర్చకు తెరలేపింది. ఆమె అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయన్న అభిప్రాయం కలిగేందుకు తావిచ్చింది.  బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి, ఆ పార్టీ గద్దెలు కూల్చండి అంటూ పిలుపునిచ్చిన కవిత గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉపముఖ్యమంత్రి అయిన భట్టి ఇంట్లో ఓ వేడుకకు కాంగ్రెస్ రంగులున్న చీర ధరించి మరీ హాజరు కావడంపై నెటిజనులు ఓ లెవల్ లో కామెంట్లు చేస్తున్నారు.  

జగన్‌పై టీడీపీ అభిమానుల ఏఐ వీడియో.. ఇలాంటివి వద్దంటూ లోకేష్ హితవు

ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తున్న జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో  ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఇవ్వని, అర్హత లేని ప్రతిపక్ష హోదా కోసం జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంపై విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇందులో భాగంగానే జగన్ విపక్ష హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ లను బతిమలాడుకుంటున్నట్లుగా ఓ ఏఐ జనరేటెడ్ వీడియో ప్రస్తుతం సామిజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది. ఆ వీడియోలో చంద్రబాబు, పవన్, లోకేష్ నడుచుకుంటూ వెడుతుంటే .. ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అంటూ రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని జగన్  వారిని వేడుకుంటున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో తెగ వైరల్ అయ్యింది.  అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..  ఆ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్  వ్యక్తిగత దాడులు సముచితం కాదు, ఆ వీడియోను తీసేయండంటూ హితవు పలికారు.  ఇదే లోకేష్ ను గతంలో వైసీపీయులు నానా రకాలుగా ట్రోల్ చేశారు. లోకేష్ ఆహారం, ఆహార్యం ఇలా ప్రతి విషయంలోనూ ఆయనను ట్రోల్ చేసి,  రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన ఒక తిరుగులేని నేత. ఆయన ఇప్పుడు జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడదంటూ తెలుగుదేశం శ్రేణులకు హితవు చెబుతూ  మర్యాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.   రాజకీయ ప్రత్యర్థులైనా, ప్రజా జీవితంలో గౌరవం, మర్యాదలు తప్పనిసరి అని పేర్కొంటూ.. జగన్ పై ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియా నుంచి తీసేయమంటూ పార్టీ శ్రేణులను ఆదేశించారు.  తెలుగుదేశం  పార్టీ కార్యకర్తలు, అభిమానులు సహా ఎవరూ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. ఆంధ్రప్రదేశ్ బలోపేతానికి తోడ్పడే నిర్మాణాత్మక రాజకీయాలపైనే మనం దృష్టి పెట్టాలని హితవు పలికారు.  దటీజ్ లోకేష్ అనిపించుకున్నారు. 

మాక్ అసెంబ్లీ.. ఒరిజినల్ అసెంబ్లీకి మించి!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో బుధవారం విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అచ్చంగా అసెంబ్లీని తలపించేలా వేసిన సెట్ లో జరిగిన ఈ మాక్ అసెంబ్లీ నిజంగానే అసెంబ్లీ సమావేశం జరుగుతోందా? అనిపించేంత అద్భుతంగా జరిగింది. ఈ మాక్ అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలుగా పిల్లలు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ కారణంగానే జరుగుతున్నది నిజంగా అసెంబ్లీ సెషనేనా అనిపించింది. ఈ మాక్ అసెంబ్లీకి రాష్ట్రంలోని  175 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి ఒక విద్యార్థి చొప్పున పరీక్షలు నిర్వహించి ఎంపిక చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీని స్పీకర్ అయ్యన్న పాత్రులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తిలకించారు.   అచ్చంగా అసెంబ్లీలాగే ప్రొటెం స్పీకర్ స్పీకర్ కు బాధ్యతలు అప్పగించడం, ఆ తరువాత ప్రశ్నోత్తరాల సమయం, అలాగే బిల్లులు ప్రవేశపెట్టడం, చివరిగా మాక్ అసెంబ్లీలో విపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టడం, మార్షల్స్ రంగ ప్రవేశం అన్నీ ఆకట్టుకున్నాయి. పిల్లలు అసెంబ్లీలో తమతమ పాత్ర లను సమర్ధంగా పోషించడం నిజంగా అబ్బురం. ఒక్క క్షణం నిజమైన ఎమ్మెల్యేల కంటే వీరే మెరుగ్గా చేశారా అనిపించిందని స్వయంగా ముఖ్యమంత్రే అన్నారంటే..మాక్ అసెంబ్లీ ఎంత చక్కగా జరిగిందో అవగతమౌతుంది. ఈ మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా   45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.   

చాగంటినీ వ‌ద‌ల‌రా?

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది వైసీపీయుల తీరు. పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పినందుకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రముఖ ప్రవచన కారుడు చాగంటిపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నది. చాగంటికి రాజకీయాలు అంటగడుతోంది.   ఇప్ప‌టి వ‌ర‌కూ చాగంటి ప్ర‌వ‌చ‌నాలు కులాలకే కాదు, మ‌తాల‌కు అతీతంగా కూడా ఒక గొప్ప స‌మాన‌త్వాన్ని తీసుకొచ్చి పెట్టాయి. కార‌ణం ఆయ‌న చెబుతోన్న‌ది హైంద‌వ క‌థ‌లా లేక మ‌రొక‌టా అన్నది ప‌క్క‌న పెట్టి.. విన‌డానికి ఇంపుగా ఉండ‌టం, మానవీయ విలువల ఔన్నత్యాన్ని చాటడం  వ‌ల్లనే ఆయన ప్రవచనాలంటే ఎవ‌రైనా స‌రే చెవులు కోసుకునే ప‌రిస్థితి ఉంది. అది ట్రావెలింగ్ బ‌స్సు కావ‌చ్చు, లేదేంటే యూట్యూబ్ చానెల్ కావ‌చ్చు, ఆపై ఆయ‌న నేరుగా ప్ర‌వ‌చ‌నాలు చెప్పే వేదిక‌లూ కావ‌చ్చు.. మాటల ప్రవాహం అలా దొర్లిపోతూనే ఉంటుంది. అయితే కూట‌మి  ప్ర‌భుత్వం వ‌చ్చాక చాగంటి  ఒక ప‌ద‌వి ఇచ్చి.. ఆయ‌న ద్వారా యువ‌త‌కు మంచి నేర్పే చక్కటి కార్యక్రమం చేపట్టింది.  ఇక్కడే వైసీపీయులు తమ వికృత మనస్తత్వాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను గౌరవించి, గుర్తించి పదవి ఇచ్చి ఓ గొప్ప బాధ్యత అప్పగించడంతో  వైసీపీ  క‌క్ష క‌ట్టింది. ఇటీవ‌ల ఆయ‌న చేసిన ఒక ప్ర‌వ‌చ‌నం కార‌ణంగా వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ఇన్నాళ్ల పాటు మీ మీద పెంచుకున్న గౌర‌వం మొత్తం మంట‌గ‌ల‌సి పోయింద‌న్న కోణంలో వారు సోష‌ల్ మీడియాలో  విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.   ఇంత‌కీ చాగంటి ఏమ‌న్నారో చూస్తే.. ఆయ‌న కుటుంబ విలువ‌ల గురించి చెప్ప‌డంలో భాగంగా తోబుట్టువుల అనుబంధం  గురించి చెప్పారు. అంతే ఇదంతా జ‌గ‌న్, ష‌ర్మిళ గురించి ఆయన చెప్పిన‌ట్టు ఊహించుకుని ఆయ‌న్ను తెగ ఆడిపోసుకుంటోంది వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్. ఒక వేళ చాగంటి  హ‌త్య చేయ‌డం త‌ప్పు.. అని చెబితే దాన్ని కూడా జ‌గ‌న్ త‌న బాబాయి వివేకాను హ‌త్య చేయించిన దానికి అన్వ‌యించుకుని.. గోలగోల చేస్తూ విమర్శలకు దిగుతారేమో, అలాగే అవినీతికి పాల్పడకూడదని చాగంటి చెబితే.. అది కూడా జగన్ కొల్లగొట్టిన కోట్ల ఆక్రమాస్తుల గురించే అని దాడికి దిగుతారేమో అన్నట్లుగా వైసీపీయుల కామెంట్లు ఉంటున్నాయి.  

మంత్రి కొమటిరెడ్డి వర్సెస్ పున్నా కైలాష్ నేత.. నల్గొండ కాంగ్రెస్ లో రచ్చ!

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం రచ్చ రేపింది. నల్గొండ డిసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. తనపైనా, తన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో దూషిస్తూ మీడియాకు ఎక్కిన పున్నా కైలాష్ నేతను డిసీసీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్నా కైలాష్ నేతపై పోలీసు కేసు పెడతానంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డకి లేఖ రాశారు కోమటిరెడ్డి. పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అర్హులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఇలా ఉండగా మంత్రి కోమటిరెడ్డి వ్యవహారశైలిపై జిల్లా కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేసిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ అందరిపైనా నోరు పారేసుకుంటుంటారనీ,  ఇతరులెవరికీ పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదరింపులకు దిగడం వారికి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నాయి కాంగ్రెస్ లోని బీసీ వర్గాలు.  ఈ నేపథ్యంలో నల్గోండ జిల్లా కాంగ్రెస్ రేగిన చిచ్చును పార్టీ అధిష్ఠానం ఎలా చల్లారుస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.