India

కాల్పుల విరమణపై భారత్-పాక్ మరో కీలక నిర్ణయం

  భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని  డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ల సమావేశంలో నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. మే 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక బెల్లెట్ కూడా పేల్చకూడదని బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించాలని తీర్మానం చేసినట్లు పేర్కొంది. అయితే సింధూ జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగబోవని తేల్చి చెప్పింది. పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ, తదుపరి సమాచారం మీకు తెలియజేస్తాం అని అధికారులు పేర్కొన్నారు.  

CM Revanth Reddy

కాళేశ్వరం ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

  కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ సమగ్రాభివృద్ధికి అవసరమైతే రూ.200 కోట్ల వరకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సరస్వతీ పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మొట్టమొదటిసారిగా టెంట్ సిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు రానున్నాయని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించే అదృష్టం తనకు కలగనుందని అన్నారు. కాళేశ్వరం క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.  

President

రాష్ట్రపతి గవర్నర్‌కు గడువు ఎలా విధిస్తారు.. సర్వోన్నత న్యాయస్థానంకు ద్రౌపది ముర్ము ప్రశ్న

  దేశంలో ఏదైనా బిల్లును రాష్ట్రపతి  ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని 415 పేజీలతో కూడిన తీర్పును అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. రాజ్యాంగం లో అలాంటి నిబంధనలేవీ లేనప్పుడు కోర్టు అలా ఎలా తీర్పు ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు గా సమాచారం. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు తీర్పుపై 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలపై సలహా కోరారు. ఈ ప్రశ్నల్లో రాజ్యాంగ అధికారాలు, పరిమితులు, శాసన ప్రక్రియలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టు  నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మహాదేవన్‌ ధర్మాసనం తేల్చి చెప్పింది. భారత రాష్ట్రపతి ముర్ము అత్యున్నత ధర్మాసనంకు రాసిన లేఖపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె  స్టాలిన్ స్పందించారు. రాష్ట్రపతి ముర్ము కు మరో మూడు కీలక ప్రశ్నలు స్టాలిన్ సంధించారు.  

Metro fares increase

ఎల్లుండి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు

    హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎల్లుండి నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. సవరించిన నూతన ఛార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉండగా, దానిని రూ.12కి పెంచారు. అదేవిధంగా, గరిష్ఠ ప్రయాణ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరగనుంది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పెరిగిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి.  పెరిగిన ఛార్జీల వివరాలు     మొదటి రెండు స్టాప్‌లకు రూ.12     రెండు నుంచి 4 స్టాప్‌ల వరకు రూ.18     4 నుంచి 6 స్టాప్‌ల వరకు రూ.30     6 నుంచి 9 స్టాప్‌ల వరకు రూ.40     9 నుంచి 12 స్టాప్‌ల వరకు రూ.50     12 నుంచి 15 స్టాప్‌ల వరకు రూ.55     15 నుంచి 18 స్టాప్‌ల వరకు రూ.60     18 నుంచి 21 స్టాప్‌ల వరకు రూ.66     21 నుంచి 24 స్టాప్‌ల వరకు రూ.70     24 స్టాప్‌లు.. ఆపైన రూ.75  

tdp cadre demand pramotion to lokesh in government also

పార్టీలోనే కాదు.. ప్రభుత్వంలోనూ లోకేష్ కు ప్రమోషన్?

కడపలో తెలుగుదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పసుపు పండుగ మహానాడులో కీలక నిర్ణయాలు వెలువడుతాయన్న సంకేతాలు వినవస్తున్నాయి. వాటిలో ప్రధానంగా పార్టీలో లోకేష్ కు అత్యంత కీలక పదవిని కట్టబెట్టనున్నారని గట్టిగా వినవస్తున్నది. లోకేష్ కు ప్రమోషన్ కోసం పార్టీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవిని సృష్టించి ఆ పదవిని లోకేష్ కు కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. పార్టీలో అత్యంత నిర్మాణాత్మకమైన, నిర్ణయాత్మకమైన బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   ఇక లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై కడప మహానాడు వేదికగా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అంత వరకూ బానే ఉంది. పార్టీలో లోకేష్ ప్రమోషన్ సరే.. అయితే అటువంటి ప్రమోషనే లోకేష్ కు ప్రభుత్వంలో కూడా దక్కాల్సి ఉందని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే లోకేష్ ను ఉపముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపించింది. అయితే సంకీర్ణ ధర్మాన్ని, కూటమి పరిమితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు అటువంటి డిమాండ్ లు చేయవద్దంటూ చంద్రబాబు గట్టిగా మందలించడంతో ఆ డిమాండ్ సద్దుమణిగింది. అయితే ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ ఖాయమైన నేపథ్యంలో పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకంగా, క్రియాశీలంగా వ్యవహరిస్తున్న లోకేష్ కు ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో జోరందుకుంటోంది.   మిత్రధర్మం పేరిట లోకేష్ కు ప్రభుత్వంలో  మూడో స్థానంలో ఉంచడం సరికాదన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా కనిపిస్తున్నది. వాస్తవానికి లోకేష్ కు ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ ఇవ్వకున్నా ఆయన స్థాయికి కానీ, హోదాకు కానీ వచ్చిన నష్టమేదీ లేదు. వాస్తవానికి పార్టీ మొత్తం చంద్రబాబుకు సక్ససర్ లోకేషే అని మక్తకంఠంతో చెబుతోంది. అదే పరిస్థితి ప్రభుత్వంలోనూ ఉండాలనీ, దానిని అధికారికంగా ప్రకటించాలనీ క్యాడర్ కోరుతోంది.  

Apple company

భారత్‌కు ట్రంప్ యాపిల్ స్ట్రోక్

  భారత్‌కు ట్రంప్ యాపిల్‌తో స్ట్రోక్‌లు ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాపిల్‌ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకొన్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడి.. భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దని కోరారట. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు. టిమ్‌ కుక్‌ భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని,  అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానని,  ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్‌ అంగీకరించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఖతార్‌లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ భేటీ అయ్యారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనాపై భారీగా టారిఫ్‌లు విధించడం.. అమెరికాతో దానికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉండటంతో యాపిల్‌ అప్రమత్తమైంది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్‌లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మన దేశంలో ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఐఫోన్ అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.  అమెరికా మార్కెట్లో జూన్‌ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని.. అదే ఐపాడ్స్‌, మ్యాక్‌బుక్‌, యాపిల్‌ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ వంటివి మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకొంటామన్నారు. తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా రకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు.  అమెరికాకు భారత్‌ ఓ డీల్‌ను ఆఫర్‌ చేసింది. ఇది ప్రాథమికంగా జీరో టారిఫ్‌లదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌-అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై  జోరుగా చర్చలు జరుపుతున్నాయి. వీటి పురోగతి గొప్పగా ఉందని ఏప్రిల్‌ 30వ తేదీ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే ఒప్పందానికి వస్తామని నాడు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటిదిప్పుడు యాపిల్‌ మన దేశం నోటి దగ్గర నుంచి లాగేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Union Minister Rammohan Naidu

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్‌‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులలో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణీకుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని, వారిలో భయం లేకుండా నిరంతరంగా సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. భద్రతా దళాలు, జమ్మూ & కాశ్మీర్ పోలీసులు, అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణీకులను సురక్షితంగా తరలించగలిగామని ఆయన పేర్కొన్నారు.  విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లు మరియు మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా నిలిపివేయబడిన విమాన సర్వీసులను నేడు శ్రీనగర్ నుండి మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అలాగే, శ్రీనగర్‌లోని ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్‌ను కూడా సందర్శించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్లి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి మరియు పర్యాటకాన్ని మరల ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ గురించి వారికి హామీ ఇచ్చారు.శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

where is kodali nani

కొడాలి నాని ఏరీ? ఎక్కడ? ఆరోగ్యం ఏలా ఉంది?

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని  వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే  దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు.   కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయవంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ  గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు   తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి విషయాలేవీ బయటకు తెలియడం లేదు. కొడాలి నాని సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన ఇంకా ముంబైలోనే ఉన్నారని అంటున్నారు. కానీ ఆపరేషన్ విజయవంతమైన తరువాత నెలల తరబడి ఆయన ముంబైలో  ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం బదులు లేదు. ఆయన మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే సమాధానం దొరకదు.  అయితే కొడాలి నాని మాత్రం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తెలుగుదేశం తనను టార్గెట్ చేయదని భావిస్తున్నట్లుగా ఉందని, రెడ్ బుక్ నుంచి తన పేరు తొలగించేస్తారని ఆశిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లు తనకు సేఫ్ కాదనీ, అందుకే ముంబైలోనే ఉండిపోయారనీ కూడా అంటున్నారు.  ఎందుకంటే కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి బెజవాడకు తరలించుకుపోయారు. దాదాపు వంద రోజులుగా వంశీ కటకటాలు లెక్కిస్తూనే ఉన్నారు. తనకూ ఆ గతే పడుతుందన్న భయంతోనే కొడాలి నాని తెలుగు రాష్ట్రాలవైపు కన్నెత్తి చూడకుండా ముంబైని షెల్టర్ జోన్ గా భావించి అక్కడే ఉండిపోయారని అంటున్నారు. వైసీపీ అధినేత బెంగళూరు  షెల్టర్ జోన్ గా భావించి చుట్టపు  చూపుగా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ నే ఆదర్శంగా తీసుకున్న కొడాలి నాని.. కనీసం చుట్టపు చూపుగానైనా ఏపీవైపు రావడం లేదని అంటున్నారు.   

Hyderabad

హైదరాబాద్‌‌లో రౌడీ షీటర్‌ దారుణ హత్య

  హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఒక రౌడీ షీటర్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ అనే వ్యక్తిపై రౌడీ షీట్ ఉంది. ఇతను ఒక కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళుతున్నాడు.ఈ క్రమంలో, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి వద్దకు రాగానే, అప్పటికే మాటు వేసి ఉన్న ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. మొదట దుండగులు ఖురేషీని క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టారు.  అనంతరం కత్తులతో గొంతు కోసి, పొట్టలో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. నిందితులు హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను సంఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

new post to be created in tdp

టీడీపీలో కొత్త పదవి.. నారా లోకేష్‌కి ప్రమోషన్?

కడప మహానాడులో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అందులో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న  ప్రచారం జోరందుకుంది. లోకేష్‌కు ప్రమోషన్‌పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. టీడీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ను నియమించే ఛాన్స్‌ ఉందంటున్నారు. నారా లోకేష్‌ కోసం పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ క్రియేట్ చేయబోతున్నారంట.  ఇకపై ఒక నేతకు ఒకే పదవి రెండు సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారంట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని లోకేష్‌ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు.  నారా లోకేశ్  యూత్‌కు కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలో పార్టీ సీనియర్లు ఉన్నారంట. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్‌ను మరింత ఎలివేట్ చేయడానికే ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకూ లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించారు. అటు పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేశ్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారంట. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా ఆయ‌న అడుగులు వేస్తున్నట్టు ప‌నితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతుల్ని ఆక‌ర్షించ‌డం ద్వారా, వాళ్ల కుటుంబాల్ని రాజ‌కీయంగా త‌మ‌వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.  లోకేష్ నేతృత్వంలో ఇప్పటి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 91వేల 839 కోట్ల పెట్టుబ‌డులు, ఒక లక్షా 41వేల 407 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్దమయ్యాయి. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో 5 ల‌క్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. సో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండిట్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న లోకేష్‌ను పార్టీపరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ దోహద పడుతుందనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారంట. మరి చూడాలి కడప మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారో?

Vijayawada

విజయవాడలో రేపు తిరంగా ర్యాలీ.. చంద్రబాబు, పవన్‌కు బీజేపీ ఆహ్వానం

  ఆపరేషన్ సిందూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని ఈనెల మే 16న విజయవాడలో నిర్వ‌హించాల‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి నిర్ణ‌యించారు. శుక్రవారం సాయంత్రం ఈ ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిస‌ర్కిల్ వ‌ర‌కు ర్యాలీ జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పురందేశ్వ‌రి ఆహ్వానించారు. కూటమి నేతలంతా యాత్రలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడం, భారత్‌తో కాల్పుల విరమణకు పాక్ దిగిరావడంతో భారతీయ జనతా పార్టీ  దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించింది. పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ బీజేపీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించనున్నారు.

YS Jagan

సొంత జిల్లాలో జగన్‌కు భారీ షాక్.. మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి గుడ్ బై

  వైసీపీ అధినేత జగన్‌కు సొంత జిల్లాలో  భారీ షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గతకొద్ది కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. అధినేత జగన్‌తో మాట్లాడించాల‌ని గ‌త మూడు నెల‌లుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా ప‌ట్టించుకోలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచ‌రుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చంద్ర తెలిపారు. ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తప్పుకున్నారు. జగన్ సొంత ఇలాఖలో ఆ పార్టీకి నాయకుల ఆదరణ కరువు అవుతోంది.  గత ఎన్నికల్లో జగన్ కు సైతం మెజార్టీ తగ్గింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కడప జిల్లాలో పార్టీ బలహీనం అయినట్లు జగన్‌కు ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అయినా సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగలడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇక‌, నిన్న వైసీపీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన‌ జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరారు.  ఆమె రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య‌ ఆరుకు చేరింది.

telugudesham mahanadu in kadapa

జగన్ ఇలాకాలో చరిత్రలో నిలిచిపోయేలా పసుపు పండుగ

జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కడపలో టీడీపీ మహానాడు మూడు రోజుల  పాటు నిర్వహించడానికి నిర్ణయించింది.  2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవ్వడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లకు రంగం సిద్దమవుతోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఈసారి మహానాడు విశేషం ఏంటంటే  టీడీపీ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహానాడుకు కడప జిల్లాను ఎంచుకుంది టీడీపీ.  ఇప్పుటికే ఏర్పాట్లను మొదలుపెట్టేసింది.  వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకాలో పసుపు పండగను ఘనంగా నిర్వహించేందుకు యాక్షన్‌లోకి దిగింది. గతంలో ఎన్నడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ...మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో మహానాడుని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మహానాడు నిర్వహిస్తారనే ప్రచారం కూడా నడించింది. కానీ జిల్లా నాయకుల సూచనలతో కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో  బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. గెలిచిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు ఇదే కావడంతో అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఒక వైపు అమరావతి పున:నిర్మాణ పనులు మొదలుపెట్టి, అభివృద్ధి పనులకు వరసగా శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఎటు చూసినా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా టీడీపీకి అంతా కలసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహనాడు నిర్వహించాలని భావిస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు వసతి, రవాణాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ సిద్దాంతాలు, నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలు, నేడు ప్రభుత్వ విజయాలు మహానాడులో విస్తృతంగా చర్చించనున్నారు.  మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై, రెండోరోజు  ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. మూడో రోజు లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమవో ఈ నెల 18, 19, 20వ తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహిస్తారు. 22, 23 వ తేదీల్లో పార్లమెంటు వారీగా మినీ మహానాడు జరుగుతుందంటున్నారు.   నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా మహానాడు వేడుక నిర్వహించడానికి యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. ఇక జగన్ జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయంగా గట్టి సంకేతాలు ఇవ్వాలనే ప్లాన్‌లో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ జిల్లాలో పట్టభద్రల ఎమ్మెల్సీ స్ధానాన్ని గెలుచుకోవడం,తర్వాత జరిగి సార్వత్రిక ఎన్నికల్లో  కూటమి జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు స్థానాలు గెలుచుకుని జగన్ సొంత జిల్లాలో సత్తాను చాటింది. ఇలాంటి తరుణంలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. సీమకు సాగు నీళ్లిచ్చింది, ఫ్యాక్షన్ ను అంతం చేసింది టీడీపీనే. పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, హార్టికల్చర్ సాగుతో సీమ సీను మారిపోయింది.  ఈ నేపథ్యంలోనే చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి కడపలో నిర్వహిస్తున్న మహానాడుతో రాయలసీమ పార్టీ శ్రేణులో నూతనోత్సాహం నెలకొంది.  పులివెందులలో మహానాడు ఎందుకు నిర్వహించడంలేదు అంటే అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదు  అంటున్నారు. కడప నుంచి సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు ఏపీ అంతటా రీసౌండ్ ఇచ్చేలా చేయాలనే కడపను ఎంచుకున్నారని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి

Hero Bellamkonda Srinivas

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు..ఎందుకంటే?

    టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ట్రాఫిక్‌లో రాంగ్ రూట్‌లో వెళ్ల‌డ‌మే కాకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆయ‌న‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కాగా, జూబ్లీహిల్స్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ వ‌ద్ద బెల్లంకొండ త‌న కారులో రాంగ్ రూట్‌లో వచ్చాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విష‌యం తెలిసిందే. కాగా, సదరు హీరోను ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని హెచ్చ‌రించారు. రాంగ్ రూట్‌లో ఎలా వ‌స్తారంటూ కానిస్టేబుల్ ప్ర‌శ్నించ‌డంతో శ్రీనివాస్ అక్క‌డి నుంచి వెన‌క్కి వెళ్లిపోయారు. ఇక‌, ప్ర‌స్తుతం ఈ యువ హీరో నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. భైర‌వం, టైస‌న్ నాయుడు, హైంద‌వ‌, కిష్కింధ‌పురి చిత్రాల్లో న‌టిస్తున్నారు. 

adimulapu suresy eyes yerragondla palem

యర్రగొండపాలెం వైపు ఆదిమూలపు చూపు

సిట్టింగ్ స్థానంలో వైసీపీ పాలిట్రిక్స్  ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన యర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారంట. అందులో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు పొగ పెట్టే పనిలో పడ్డారంట. పార్టీ అధికారం కోల్పోయినా తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ మాజీ మంత్రి పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూస్తున్నారంట.  ఆ క్రమంలో ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం తిరిగి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీలో ఉన్న తన అనుచరుల్ని టీడీపీలో చేర్చడమే లక్ష్యంగా ఆదిమూలపు సురేష్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జిల్లా  రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  2024 ఎన్నికల సమయంలో తనకు కాకుండా పోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా ఫ్యాన్ పార్టీని వీక్ చేసి తిరిగి అక్కడ పాగా వేయాలని సురేష్ ప్రయత్నిస్తున్నారంట. ఆ క్రమంలో ఆదిమూలపు సురేష్ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చినీయంశంగా మారింది. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గానికి మారి వైసీపీ నుండి గెలుపొందారు. 2019లో తిరిగి తన నియోజక వర్గమైన ఎర్రగొండపాలెం వెళ్లిన సురేష్ ఆ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలోనూ ఆదిమూలపు సురేష్‌కి రెండో సారి మంత్రిగా అవకాశం లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో సురేష్‌తో పాట మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని మూడేళ్ళకే పక్కన పెట్టినా.. సురేష్‌ని ఐదేళ్ళ పాటూ కొనసాగించారు. దానిపై అప్పట్లో బాలినేని అలకపాన్పు ఎక్కడంతో వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది.  మంత్రిగా ఆదిమూలపు సురేష్‌పై అంత నమ్మకం ఉంచిన జగన్ టికెట్ దగ్గరకు వచ్చే సరికి మరోసారి ఆయనకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్‌ని కొండపి నియోజక వర్గానికి మార్చారు. తప్పనిసరి పరిస్థితులలో ఆయన కొండేపి నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే సురేష్ సిట్టింగ్ స్థానమైన ఎర్రగొండపాలెంలో పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి హవాలోను వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెగ ఫీల్ అవుతున్నారంట.  కొండపి నియోజకవర్గంలో ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఆదిమూలపు సురేశ్  తిరిగి ఎర్రగొండపాలానికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే  తాటిపర్తి చంద్రశేఖర్ పరపతిని తగ్గించడమే మార్గమని భావిస్తున్న ఆదిమూలపు సురేష్ ఆ పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా  ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంలో తన ముఖ్య అనుచరులుగా ఉన్న వారిని తెరచాటు రాజకీయం నడిపి సైకిల్ ఎక్కిస్తున్నారన్న టాక్ నడుస్తోందట. ఇటీవల  త్రిపురాంతకం ఎంపిపి  స్థానానికి, పుల్లలచెరువు మండల పరిషత్ వైఎస్ ప్రెసిడెంట్ స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా తన అనుచరులతో కలిసి తెరచాటు రాజకీయం నడిపారని ప్రచారం జరుగుతోంది.  ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ స్కెచ్ తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయన్ని పిలిచి మందలించారంటున్నారు. ఒక వైపు టీడీపీలోకి తన అనుచరులను పంపుతూ యర్రగొండపాలెంలో వైసీపీని వీక్ చెయ్యాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే ఆదిమూలపు సురేష్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం యర్రగొండపాలెంలో గుప్పుమంటోందట. ఈనేపథ్యంలో ముందస్తుగా తన అనుచరుల్ని సురేష్ వైసీపీ నుండి టీడీపీలో చేరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.  అయితే నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలతో తనకు సంబంధం లేదని ఆదిమూలపు సురేష్ పార్టీ పెద్దలకు వివరణ ఇస్తున్నా...సురేష్ పై మాత్రం రోజురోజుకీ ప్రచారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. చంద్రశేఖర్‌ని వీక్ చేసి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చేపట్టాలనే వ్యూహంలో ఆదిమూలపు సురేష్ ఉన్నారంటున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.  

పెద్దిరెడ్డికి బిగుస్తున్న భూముల ఉచ్చు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో తన హవా చాటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి,  సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలను శాసించేవారు. ఆయనకు కావాల్సిన వారికి పదవులు.. కన్నెర్ర చేసిన వారికి కష్టాలు తప్పదని సొంత కొటరీ నాయకులు చెబుతుంటారు. ఇలా సాగిన ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్ల పై భూములు కనిపిస్తే కబ్జా చేస్తూ పోయారు. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై సామగ్ర విచారణలో లోతైన విషయాలు బయటపడ్డాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు సమీపంలోని అటవీ భూముల పై విచారణ ఇప్పటికే జరు గుతోంది.. మరో వైపు తిరుపతిలోని బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకుని కంచెను వేసుకుని ఆనుభువిస్తున్న దానిపై ఇటీవల దేవాదాయశాఖ, మఠం అధికారులు నోటీసులు పంపి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి అటవీ భూములు ఆనుకుని ఉన్న భూమికి మరింత స్వాధీనం చేసుకుని కూలీల కోసం విలాసవంతమైన భవనం చిత్తూరు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగంపేట లో నిర్మించారు. వీటితోపాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి పై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నది. మంగళంపేటలోని 27.98 ఎకరాల అటవీశాఖ భూమిని ఆక్రమించడంతో పాటు జీవవైవిధ్యంకు నష్టం కలిగించారని ప్రాథమిక నివేదికలో     అధికారులు పేర్కొన్నారు. దీనిలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ,   మరో ఇద్దరు సహా  మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయ్యింది త్వరలో పాకాల కోర్టు లో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు అనే దాని పై విచారణ జరుగుతోంది.

ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. డిస్టలరీల నుంచి ముడుపులు వసూలు చేసే   నెట్ వర్క్ లో గోవిందప్ప కీలకంగా వ్యవరించారని రిమాండ్ రిపోర్ట్ లో  సిట్ స్పష్టం చేసింది. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను రెడీ చేశారని.. ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.  లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A 33గా ఉన్నారు. ఈయన అరెస్ట్‌తో లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ల సంఖ్య ఐదుకు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లూ సిట్ విచారణకు దూరంగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. చాణక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్దిదారుకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం.  గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడని, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారని చెబుతున్నారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేసి పట్టుకున్నాయి. ట్రాన్సిట్‌ వారంట్‌ కోసం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి, విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.  అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్‌ కెసిరెడ్డి బృందం ప్రతి నెలా 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్‌ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీల యజమానులూ సిట్‌కు వాంగ్మూలా లిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిల్లో తరచూ సమావేశమయ్యేవారని సిట్‌ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.  గైర్హాజరవడంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. గోవిందప్ప చార్టర్డ్‌ అకౌంటెంట్‌. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి.  సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి, భారత్‌కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్‌ 30 నుంచి భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కాంలో అంతిమ లబ్దిదారు ఎవరు అనే అంశాలపై సిట్‌ ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్సులతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది.

ఇకపై తోక ఝాడిస్తే పాక్ పని దబిడిదిబిడే!

ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది.  తమ యుద్ధం ఉగ్రవాదంపైనే తప్ప.. పాక్ పౌరులపై కాదని విస్పష్టంగా ప్రకటించిన ప్రధాని, కాల్పుల విమరణ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ భారత్ పై పంజా విసరనంత వరకేననీ,  అటువైపు నుంచి ఒక్క ఉగ్రదాడి జరిగినా యుద్ధమేననీ విస్పష్ట హెచ్చరిక చేశారు.   అదే సమయంలో కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించామనీ, పాక్ తో దౌత్య సంబంధాల ప్రశ్నే లేదనీ తేల్చేసిన  ఆయన ఇండస్ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న తేల్చేశారు.  ఆపరేషన్ సిందూర్ ఆగలేదని పాకిస్తాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధ చర్యగానే భావించి ప్రతి దాడులు చేస్తామనీ హెచ్చరించారు.  ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిని ఉన్న పాకిస్థాన్ కు ఈ హెచ్చరిక చాలదా? మరోసారి భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించాలంటే వణుకుపుట్టడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇక పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే.. అవి  ఉగ్రవాద  నిర్మూలన,పీవోకే అంశాలపైనేననీ క్లియర్ కట్ గా చెప్పేశారు.   అలాగే పాక్,భారత్ మధ్య   ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రకటించడం ద్వారా పరోక్షంగా అమెరికాకు మీ మర్యాద మీరు కాపాడుకోండన్న హెచ్చరికా చేశారు.  పాక్  యుద్ధం ఆపమని కాళ్ల బేరానికి రావడం,అమాయక పౌరులు సంక్షోభంలో పడటం ఇష్టం లేక మాత్రమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని కుండబద్దలు కొట్టినట్లు మోడీ చెప్పారు. ఇక్కడ కొసమెరుపేంటంటే.. కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్థాన్ భారత్ కాళ్లా వేళ్లా పడుతోంది. సింధు జలాల ఒప్పందం రద్దు పునస్సమీక్షించండి ప్లీజ్ అంటూ బతిమలాడుకుంటోంది. ఈ ఒప్పందం రద్దు కారణంగా నీటి సమస్యతో  నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నామంటూ లేఖ రాసింది. దీనిని బట్టే మోడీ తన వ్యూహాలతో పాకిస్థాన్ ను చక్రబంధంలో బిగించేశారనీ, ఆ దేశం ఇక తోక జాడించే అవకాశాలు ఇంచుమించు లేవనీ అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  

టార్గెట్ 60 డేస్.. రూ.41 కోట్ల విలువైన పనులు పూర్తి

కోటం రెడ్డి స్పీడే వేరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. అభివృద్ధి పనుల విషయంలో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ముందుకు కదులుతారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ లో దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఓకే రోజు ప్రారంభిస్తున్నారు. అందుకు మే 15 (గురువారం) ముహూర్తం పెట్టారు. ఈ పనులన్నిటీనీ రెండంటే రెండు నెలల్లో పూర్తి చేశారు. ముందుగానే 60 రోజుల టార్గెట్ ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగారు. రికార్డు సమయంలో పూర్తి చేసినా పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రానీయలేదు. ఇక వీటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా వినూత్నంగానే చేస్తున్నారు. మే 15న నెల్లూరు రూరల్ లో ఈ  పనులను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రారంభించనున్నారు. మంత్రి పొగూరు నారాయణ, కూటమి నేతలూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పెట్టుకున్న టార్గెట్ మేరకు కేవలం 60 రోజుల వ్యవధిలోనే మొత్తం 339 అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి లోకేష్ అభినందించారు.