మూడు విడతల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే నెల 11, 14, 17 తేదీలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైనందున ఎన్నికల నియమావళి  తక్షణమే అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట  జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్‌  సెప్టెంబర్ 29న ప్రకటించామని,   అక్టోబర్ 9న ఆ షెడ్యూల్ పై కోర్టు స్టే విధించిందని అన్నారు.   తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరుగుతుందన్న రాణి కుముదిని,  రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు, . మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా పదమూడు వేల ఐదు వందల ముఫ్పై నాలుగు   వార్డు స్థానాలకు మూడు దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లను నవంబర్ 27 నుంచి,  రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి   స్వీకరించనున్నట్లు  వెల్లడించారు.

ఈవీఎంలతో పాటు అదృశ్య శక్తులు కూడా.. బీహార్ ఓటమిపై ప్రశాంత్ కిశోర్

ఇటీవ‌ల‌కాలంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఈవీఎంలను నిందించడం అలవాటుగా మారింది. తాజాగా బీహార్ ఎన్నికల ఓటమిపై స్పందించిన జన సురాజ్ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా ఈవీఎంల కారణంగానే తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆరోపించారు. ఒక్క ఈవీఎంలే కాకుండా అదృశ్య శ‌క్తుల ప్ర‌మేయంవల్ల కూడా తాము  ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చారు. అయితే అదృశ్య శక్తుల ప్రమేయాన్ని తాము చాలా ఆలస్యంగా గుర్తించామని నొచ్చుకున్నారు. తాను చెబుతున్న విషయాలన్నీ అక్షర సత్యాలన్న ఆయన అయితే ఈ సత్యాలను రుజువు చేయడానికి తగిన ఆధారాలు మాత్రం లేవనిచేతులెత్తేశారు.  ఈ అదృశ్య శక్తులు ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అన్న విషయం మాత్రం అంతుబట్టడం లేదని చెప్పారు. బీహార్ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తొలి సారిగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ ఇంతటి ఘోర ఓటమి పొందడం ఒక మిస్టరీగా ఉందన్నారు.  ఇటీవ‌ల జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న్‌సురాజ్ పార్టీ 230 స్థానాల్లో పోటీ చేసింది. జీరో స్ట్రైక్ రేట్ సాధించింది. అంటే పోటీ చేసిన మొత్తం స్థానాలలో పరాజయం పాలైంది. అంతే కాదు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయంది. దీనిపై ఆయన మాట్లాడుతూ తమ జన సురాజ్ పార్టీకి పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ డిపాజిట్లు గల్లంతైనా..3.5 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. అయితే ఈ ఘోర పరాజయంతో పీకే గ్రాఫ్ దేశ వ్యాప్తంగా పతనమైంది.  ఇంత కాలం ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ ఆయా పార్టీల విజయంలో తనదే సింహభాగమంటూ జబ్బలు చరుచుకున్న పీకే.. సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేకపోవడంతో ఆయనపై నెటిజెన్లు సెటైర్లు రువ్వుతున్నారు.  ఈ నేప‌థ్యంలోనే పీకే తాజాగా జాతీయ వార్తా సంస్థకు  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓటమికి కారణం ఈవీఎంలు, అదృశ్య శక్తులు అంటూ చెప్పుకొచ్చారు.  “జనసురాజ్ పార్టీగా తాము బాగానే పని చేశాం అని కితాబిచ్చుకున్న పీకే..   ప్ర‌జ‌ల నుంచి కూడా తమకు మంచి మ‌ద్ద‌తు ల‌భించిందన్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తాలు ప‌లికారు. మేం సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లోనూ.. క‌నీసం 50 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని భావించాం.  కానీ, ఏం జ‌రిగిందో ఏమో.. ఇలా అయిందంటూ పీకే నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే తాను ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను  త‌ప్పుప‌ట్ట‌డం లేద‌న్నారు. అయితే ఎక్కడో ఏదో తేడా కొడుతోందని, ఇప్పుడు అదేమిటో గుర్తించడమే తన ముందున్న పెద్ద టాస్క్ అన్నారు పీకే. 

నాయకత్రయం.. ప్రజలతో మమేకం!

రాజకీయ కక్ష సాధింపు, బటన్ నొక్కి సంక్షేమం పందేరం చేయడమే పాలన అనుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, అదే సమయంలో జనసామానికి కూడా దూరంగా ఉన్నారు. ఆయన ప్రజలతో మమేకం కావడం అటుంచి ముఖ్యమంత్రిగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా ఇష్టపడలేదు.  అరాచకపాలనకు తోడు జనానికి దూరంగా ఉండటం కూడా వైసీపీ గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణంగా మారింది.  అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు పొందుతోంది. పీపుల్ ఫస్ట్ అన్నట్లుగా పరాజకీయాలు నడుపుతోంది. కూటమి నేతలు ప్రజలతో మమేకం అవుతున్నారు. మరీ ముఖ్యంగా కూటమిలో, కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన, ప్రధానమైన ముగ్గురు నేతలూ ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగుతున్నారు.  ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా మొదటి తారీకున పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రజలలోకి వస్తున్నారు. అంతే కాకుండా శ్రేణులతో ప్రతి రెండు వారాలకు ఒక సారి సంభాషిస్తున్నారు.  అదే విధంగా జనసేనాని, ఉమముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.    ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రజాదర్బార్ తో తరచుగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు. అంతే కాకుండా లోకేష్ దృష్టికి సమస్య తీసుకువెడితే అది పరిష్కారం అయిపో యినట్లేనన్న గుర్తింపు సాధించారు.  అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కూడా లోకేష్ అనితర సాధ్యమనదగ్గ చొరవ చూపుతున్నారు.  విద్యాశాఖ మంత్రిగా విద్యాసంస్కరణలను అమలు చేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.   మొత్తంగా తెలుగుదేశం కూటమి పాలన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ పొలిటికల్ ఎట్మాస్ఫియర్ ను తీసుకువచ్చింది.  

ఇక ఇప్పుడు బీజేపీ దృష్టి బెంగాల్ పై!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ లో మహాఘట్ బంధన్ ను మట్టికరిపించిన బీజేపీ ఇప్పుడు తన దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ పై కేంద్రీకృతం చేసింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బెంగాల్ లో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. పావులు కదుపుతోంది. పశ్చిమ బెంగాల్ లో గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడు సార్ల విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నాలుగో సారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ఈ సారి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తోంది.  దీంతో ఈ సారి గెలుపు అంత వీజీ కాదన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు  తొలి రెండు విజయాలూ సునాయాసంగానే లభించాయి. అప్పట్లో పోటీ తృణమూల్ వర్సెస్ కమ్యూనిస్టులు అన్నట్లు ఉండేది. అప్పటికే పాతికేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారం చెలాయించిన కమ్యూనిస్టులపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో తృణమూల్ విజయం నల్లేరుమీద బండి నడకే అయ్యింది. అయితే మూడో సారి తృణమూల్ విజయం అంత సునాయాసంగా అయితే లభించలేదు. తనకు పోటీ లేకుండా చేయడానికి  మమతా బెనర్జీ రాష్ట్రంలో బీజేపీని పెంచి కమ్యూనిస్టులను నిర్వీర్యం చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది.  సరే సంపూర్ణ మెజారిటీతోనే తృణమూల్ విజయం సాధించి ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఈ స్థాయిలో బలపడిందంటే అందుకు ప్రధాన కారణం మమతా బెనర్జీయే అని చెప్పాలి.  కమ్యూనిస్టులకు పెట్టని గోడలుగా ఉన్న ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం వారి ప్రాబల్యాన్ని మమతా బెనర్జీ నిర్వీర్యం చేశారు. అయితే ఆ స్థానంలో ఆమె పార్టీని బలోపేతం చేయడంతో పాటు బీజేపీకి ఎదగడానికి అవకాశాలు కల్పించినట్లైంది. ఇక ప్రభుత్వ వేధింపుల కారణంగా కమ్యూనిస్టులు చెల్లా చెదురైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదు సమయంలో స్వీయరక్షణ కోసం చాలా వరకూ కమ్యూనిస్టులు కమలం పార్టీ పంచన చేరినట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా తెలంగాణలో ఈటల వంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న నేతలు కూడా బీఆర్ఎస్ ను ఎదిరించేందుకు కమలం పార్టీ పంచన చేరిన చందంగానే తృణమూల్ ధాటి నుంచి తమను తాము కాపాడుకుని ఎదిరించేందుకు పశ్చిమ బెంగాల్ లో కూడా కమ్యూనిస్టులు బీజేపీకి చేరువయ్యారని విశ్లేషిస్తున్నారు.    2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో   కేవలం 10 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు  2021 అసెంబ్లీలో  38 శాతానికి పెరిగింది.  దీంతో ఈ సారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. కాగా బీజేపీ ఇప్పుడు కలిసివచ్చే అంశమేంటంటే.. తృణమూల్ అధినేత్రితో విభేదించి కమలం గూటికి చేరిన నేతలే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారు. వీరంతా మోడీ, అమిత్ షా మార్గదర్శకత్వంలో తృణమూల్ పరాజయం, మమతా బెనర్జీని గద్దెదింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.  ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని గ్రహించినా మమతా బెనర్జీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లపైనే మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు.  చూడాలి మరి వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్, బీజేపీ మధ్య పోటీ  ఎంత తీవ్రంగా ఉంటుందో.. ఎవరు గెలిచి అధికారపగ్గాలు చేపడతారో?

విజ‌య‌సాయిరెడ్డి నిజంగా పార్టీ పెడితే?

విజ‌య‌సాయిరెడ్డి పార్టీ- పార్టీ- పార్టీ.. అంటూ మూడు ర‌కాల పార్టీ రిలేటెడ్ కామెంట్స్ చేశారు. మొద‌ట పార్టీ కామెంట్ విష‌యానికి వ‌స్తే తాను ప్ర‌స్తుతం ఏ  పార్టీలో లేనన్న క్లారిటీ ఇచ్చిన ఆయన తాను ఇప్పుడు కేవ‌లం వ్య‌వ‌సాయం  చేసుకుంటోన్న రైతును మాత్ర‌మేన‌ని స్పష్టం చేశారు.  అక్కడితో ఆగకుండా తాను ఏ  పార్టీలోనూ చేర‌డం  లేద‌నీ చెప్పారు. ఇక ముచ్చ‌ట‌గా మూడోది తాను అవ‌స‌ర‌మైతే సొంతంగా ఒక పార్టీ పెడ‌తాన‌న్నారు  ఆయన ఇవే విషయాలు గతంలోనూ చెప్పారు. అయితే ఇప్పుడు.. అవును ఇప్పుడే ఆయన మళ్లీ ఈ కామెంట్లు ఎందుకు చేశారన్న చర్చ మొదలైంది.  ఇంతకీ ఆయన ఇప్పుడు ఈ కామెంట్లు చేయడానికి ఆయన  బీజేపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో సోషల్ మీడియాలో ఆయన లక్ష్యంగా పెద్ద ఎత్తున నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. అందుకే తాను ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.  త‌న‌పై  ఒత్తిళ్లు చాలానే ఉన్నాయనీ,  అయినా స‌రే త‌న‌కు ఏ రాజ‌కీయ పార్టీలో నూ చేరాల‌న్న త‌లంపు కూడా లేదనీ మరో సారి కుండబద్దలు కొట్టేశారు విజయసాయి.   గ‌త 20 ఏళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప్ర‌త్యేక సంబంధ బాంధ‌వ్యాలున్నాయ‌ని అంటూనే, జనసేన నుంచి పార్టీలో చేరాల్సిందిగా  ఒత్తిడి ఉందన్న అర్ధం వచ్చేలా మాట్లాడుతూనే, అదే సమయంలో తాను ఆ పార్టీలో చేరబోవడం లేదన్న క్లారిటీ ఇచ్చారు. నిజానికి విజ‌య‌సాయిరెడ్డికి బాల‌కృష్ణ‌తో కావ‌చ్చు, టీడీపీకి సంబంధించిన కుటుంబాల‌తో కావ‌చ్చు బంధుత్వాలున్నాయి. అనుబంధం ఉంది, కానీ, ఆ రిలేష‌న్స్ ని క్రాస్ చేసి ఆయ‌న ఎప్పుడూ ఇంత వ‌ర‌కూ రాజ‌కీయాలు చేయ‌లేదు. కాబ‌ట్టి జ‌న‌సేన విష‌యంలోనూ ఇదే  జ‌రుగుతుంద‌నుకోవ‌చ్చ‌. ఇక అవ‌స‌ర‌మైతే పార్టీ పెడ‌తానంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.   విజ‌య‌సాయిరెడ్డి   వైసీపీకి రిజైన్ చేసేట‌పుడు కూడా  మీడియా చానెల్ పెడ‌తాన‌న్నారు.  ఇంత వరకూ ఆ ఊసే లేదు.  ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా సొంతంగా రాజకీయపార్టీ పెట్టడం కూడా జరిగే పని కాదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే   గత ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు, అప్పుడు గెలిచి ఉంటే విజయసాయి రెడ్డి సొంత పార్టీ మాటను కొందరైనా నమ్మేందుకు అవకాశం ఉండేది. కానీ నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయిన విజయసాయి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టినా, అది బీహార్ లో సొంత పార్టీ పెట్టి పీకే చూపినంత ప్రభావం కూడా ఏపీ రాజకీయాలలో చేపే అవకాశం ఉండదని అంటున్నారు.  

తెలంగాణ డీసీసీ అధ్యక్షులు వీరే

తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తైంది. రాష్ట్రంలో   మొత్తం 36 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.  డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.  కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జిల్లాల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ – డాక్టర్ నరేష్ జాదవ్ ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న భువనగిరి – బీర్ల ఐలయ్య గద్వాల – రాజీవ్ రెడ్డి హన్మకొండ – ఇనిగాల వెంకట్రామి రెడ్డి హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల జగిత్యాల – నందయ్య జనగాం – ధన్వంతి జయశంకర్ – భూపాలపల్లి కరుణాకర్ కామారెడ్డి – మల్లికార్జున ఆలె కరీంనగర్ – మేడిపల్లి సత్యం కరీంనగర్ కార్పొరేషన్ – అంజన్ కుమార్ ఖైరతాబాద్ – మోహిత్ ఖమ్మం – నూతి సత్యనారాయణ ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి మహబూబాబాద్ – భూక్య ఉమ మహబూబ్ నగర్ – సంజీవ్ ముదిరాజ్ మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి మెదక్ – అంజనేయులు గౌడ్ మేడ్చల్ – వజ్రేష్ యాదవ్ ములుగు – పైడకుల అశోక్ నారాయణపేట – ప్రశాంత్ రెడ్డి నాగర్ కర్నూల్ – చిక్కుడు వంశీ కృష్ణ నిర్మల్ – బొజ్జు నిజామాబాద్ – నాగేష్ రెడ్డి నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ పెద్దపల్లి – రాజ్ ఠాకూర్ రాజన్న సిరిసిల్లా – సంగీతం శ్రీనివాస్ సికింద్రాబాద్ – దీపక్ జాన్ సిద్దిపేట – తుంకుంట ఆకాంక్ష రెడ్డి సూర్యాపేట – గుడిపాటి నర్సయ్య వికారాబాద్ – దారా సింగ్ జాదవ్ వనపర్తి – శివసేన రెడ్డి వరంగల్ – అయూబ్

వాహ్.. క్యా సీన్ హై.. కేటీఆర్, జగన్ పక్కపక్కనే

బీఆర్ఎస్, వైసీపీల బంధం తెలిసిందే.  తెలుగుదేశం పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పట్ల వ్యతిరేకతే వారి మైత్రీ బందానికి అసలు, సిసలు కారణంగా  పరిశీలకులు చెబుతారు. ఆ వ్యతిరేకత కారణంగానే.. ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టడం కోసం అప్పటికి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేయగలిగినంత సాయం చేసింది. అందించగలిగినంత సహకారం అందించింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి అవసరమైతే జగన్ విజయం కోసం తాను ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తానని కూడా అన్నారు. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అయిన తరువాత జగన్ కేసీఆర్ తో సఖ్యంగా మెలిగారు. ఆ సఖ్యత ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు సహాయం చేయడానికి నాగార్జున సాగర్ జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చి ఆయనకు అనుకూలంగా ఆ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు జగన్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అదేమీ ఫలించ లేదనుకోండి అది వేరే సంగతి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేస్తే.. ఆయన అరెస్టు ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలను కేసీఆర్ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు చేయాలనుకుంటే అక్కడ చేయండి కానీ ఇక్కడ కాదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ పరాజయం పట్ల కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏపీలో జగన్ పార్టీ పరాజయం పాలు కావడం ఆశ్చర్యం కలిగించిందని ఆ ఫలితాల తరువాత కేటీఆర్ అన్నారు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రాబాబుకు వ్యతిరేకంగా కుమ్మక్కు రాజకీయాలు నెరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో రెండూ పార్టీలూ అధికారం కోల్పోయిన తరువాత కూడా కేటీఆర్, జగన్ ల మధ్య అనుబందం అలాగే సాగుతోందనడానికి పలు ఆధారాలు ఉన్నాయి. ఇటీవల జగన్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని కితాబిచ్చారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ జగన్ పట్ల తమ అభిమానాన్ని ఎన్నడూ దాచుకోలేదు. తాజాగా జగన్, కేటీఆర్ లు ఇరువురూ బెంగళూరులో జరిగిన  ఒక కార్యక్రమంలో పక్కపక్కన కూర్చుని ముచ్చటించుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బెంగళూరులో శనివారం నవంబర్ 22) జరిగిన ఓ  కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   కలుసుకున్నారు.  పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు  వారిద్దరు కలిసి  ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

పంచాయతీ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

సుప్రీం మార్గదర్శకాల మేరకు  స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఎట్టకేలకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది.   బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్  అంశాన్నిపక్కన పెట్టేసింది.  ఇటీవలి జూబ్లీ ఉపఎన్నికలో ఘన విజయంతో కాంగ్రెస్ లో, కాంగ్రెస్ క్యాడర్ లో పెరిగిన జోష్ అలా ఉండగానే ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఇక జాప్యం లేకుండా స్థానిక ఎన్నికలకు రెడీ అయిపోయారు. దీంతో ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజాపాలన విజయోత్సవాలు వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్రప్రభుత్వం ఘనంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది. అవి కాగానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధి విధానాలను ఖరారు చేసింది. ఆ మేరకు శనివారం (నవంబర్ 22) జీవో జారీ చేసింది.   సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా   జీవో జారీ చేసింది.   ఈ జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్థతిలో అమలు చేస్తారు.   అన్నివర్గాలకూ సమాన న్యాయం జరిగేలా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొంది. గిరిజన గ్రామాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనను   ఈ జీవోలో చేర్చింది. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో  సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలన్నీ ఎస్టీలకే రిజర్వ్ అవుతాయి. ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక  ఘట్టం పూర్తైనట్లైంది. దీంతో త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేష్ త్వరలో అంటే డిసెంబర్ రెండో వారంలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ ముందస్తు ప్రచారం.. దేనికి సంకేతం?

ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతలా ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు రాజీనామా మార్గాన్ని ఎన్నుకుంటార్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో సందేహం లేదు. ఈ మేరకు ఇటీవల ఆయన తన అనుచరులతో, ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహించి చర్చలు జరిపారు. అంత వరకూ నిజమే. కానీ తన రాజీనామా విషయాన్ని ఆయన ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేయే. ఆయన రాజీనామా చేసిన తరువాత మాత్రమే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది.  కానీ బీఆర్ఎస్ మాత్రం అప్పుడే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక  ప్రచారానికి తెరలేపేసింది. పోస్టర్లతో హడావుడి చేసేస్తోంది.  సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచార సందడి ప్రారంభించేసింది.  ఇక ఏపీలో వైసీపీ తరహాలో రప్పా రప్పా  అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటుతామంటూ నానా హంగామా చేస్తోంది.  ఇది చూసిన నెటిజనులు నిన్నటి జూబ్లీ ఉప ఎన్నిక, అంతకు ముందటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఇలాగే ముందస్తు హడావుడితో హోరెత్తించి ఫలితాల్లో చతికిల బడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

నేనలా చేస్తే.. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏక కాలంలో రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై విమర్శలు గుప్పిస్తూనే.. మరో వైపు ఫార్ములా ఈకార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి పై మండి పడుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్ కు మద్దతు ఇస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.     ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమర్శించారు.  చెరువుల‌ను ఆక్ర‌మించి పెద్ద ఎత్తున భ‌వ‌నాలు నిర్మించుకుంటున్నార‌న్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.  ఇలా భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారన్న కవిత.. వీరి విషయంలో హైడ్రా నిద్రపోతోందా అంటు నిలదీశారు.  పేద‌ల‌  ఇళ్లను కూల్చేవేతలో ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్న హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.తన వద్ద ఉన్న ఆధారాలను హైడ్రాకు అందించడానికి తాను సిద్ధమే కానీ, తానా పని చేస్తే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపైపోతారని అన్నారు. అలా జంపైపోతే కాంగ్రెస్ వారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తుందన్నారు.  

ఆదిని విమర్శించే స్థాయా మీది.. బీటెక్ రవి

వైసీపీ నాయకులకు ఆదినారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ పులివెందుల ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. శుక్రవారం (నవంబర్ 21) విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇంటికి వెళ్లాలంటూ ముందు తన ఇల్లు దాటి వెళ్లాలని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడితే సహించేంది లేదన్న బీటెక్ రవి.. నాడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని మీరే  హత్య చేసి  మా మీద కేసు మోపాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అనవసర వాగాడంబరం మాని సత్తా ఉంటే పులివెంొదుల మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించండి సవాల్ విసిరారు.   సతీష్ రెడ్డి 5 సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయారని, ఆదినారా యణ రెడ్డి నాలుగు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లూ గెలిచారని చెప్పిన ఆయన రానున్న పులివెందుల మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు.  ఈ సందర్భంగా బీటెక్ రవి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తడిగుడ్డతో  గొంతులు కోసే రకమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  

రూ.5లక్షల కోట్ల భారీ స్కామ్.. రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపారంటే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం (నవంబర్ 21) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన  కేటీఆర్ హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక భూముల రెగ్యులరైజేషన్ పేర రేవంత్  దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్కార్ కు రూపకల్పన చేశారని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం కనీసం 100 శాతం నుంచి అత్యధికంగా 200 శాతం ఎస్ఆర్‌ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశించగా, కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందంటూ కొత్త పాలసీని తీసుకువచ్చిందన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో భారీ స్కామ్‌కు ప్రణాళిక రూపొందించారన్నారు. ఈ విధానం ద్వారా   9,292 ఎకరాల భూమిని కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చనీ, తద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడుతుందని కేటీఆర్ అన్నారు.  ఇప్పటికే ఆ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు, అనచరులు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఈఘమేఘాలమీద వారం రోజుల్లో దరఖాస్తులు, మరో వారంలో ఆమోదాలు, కేవలం 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ తొందరపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.  ఈ పాలసీ కాంగ్రెస్ కు, ముఖ్యమంత్రి రేవంత్ కు ఏటీఎంగా మారిందన్నారు.  ఆ భూములు కొనుగోలు చేసినా.. క్రమబద్ధీకరణ చేసుకున్నా ఇండస్ట్రియలిస్టులకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.   ప్రజల ఆస్తిని కాపాడేందుకు బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు.  తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు   నగరంలోని పారిశ్రామిక భూముల లావాదేవీలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.  రేవంత్ రెడ్డి అవినీతికి అండగా నిలబడి  ఈ పాలసీలో భాగస్వాములై భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావద్దంటూ  పారిశ్రామికవేత్తలకు  సూచించారు.  ఇంకా ఫార్ములా ఈ కార్ కేసుపై మాట్లాడుతూ.. తనను అరెస్టు చేసే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, అందుకే లైడిటెక్టర్ కు సైతం రెడీ అని సవాల్ విసిరాననీ చెప్పారు. ఇక పరువు కాపాడుకునేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ పై మండి పడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారన్నారు. ఒక వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా స్థానిక ఎన్నికల తరువాతే ఉప ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ జోస్యం చెప్పారు.  ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కుప్పిగంతులు వేస్తోందని విమర్శించారు. 

బండి వర్సెస్ ఈటల.. తెలంగాణ బీజేపీలో చీలిక స్పష్టం!

తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం నేతల మధ్య సయోధ్య లేకపోవడమే.. సయోధ్య లేకపోవడం ఒక్కటే కాదు.. రాష్ట్ర పార్టీ నేతలలో విభేదాలు తరచూ బహిర్గతమౌతున్నాయి. అంతే కాదు.. ఈ  నేరుగా పేరు పెట్టి మరీ ఒకరినొకరు బహిరంగంగా విమర్శలకు దిగేంతగా ఈ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.  ఇంత కాలం తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ము లాటలు,నాయకుల మధ్య విభేదాలు, వివాదాలు  సాగుతూనే ఉన్నాయి. అయితే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం తరువాత అవి రచ్చెక్కాయి.    రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్న పరిస్థితి నుంచి జూబ్లీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితికి బీజేపీ దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రాష్ట్రనాయకుల మధ్య సయోధ్య లేమే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? నాయకుల మధ్య విభేదాల వెనుక ఉన్న అసలు సిసలు రీజనేంటి? అని పరిశీలిస్తే..   సాధారణంగా బీజేపీలోకి బయట నుంచి వచ్చి చేరిన వారు ఇమడ లేరు. హిందుత్వ భావజాలం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజపరిణామం.   అయితే బీజేపీ నాయకత్వం మోడీ, షా చేతులలోకి వచ్చిన తరువాత పార్టీలో ఆ పరిస్థితి మారిపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో తొలి నుంచి ఉన్నవారూ, తరువాత వచ్చి చేరిన వారి మధ్య అగాధం ఏర్పడింది. అది పెరుగుతూ వస్తోంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  జూబ్లీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తరువాత ఈ విభేదాలు నివురు తొలగించుకుని నిప్పులా బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ల మధ్య సైద్ధాంతిక అంతరం ఈ విభేదాలు రాజీకి ఆస్కారం లేనంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణమయ్యాయి.  బండి సంజయ్ నూటికి పదహారణాల హిందుత్వ వాది. ఈటల రాజేందర్ రాజకీయ నేపథ్యం ఇందుకు పూర్తి భిన్నం.  ప్రాణం ఉన్నంతవరకు హిందూత్వమే తన మార్గమని బండి సంజయ్ అంటే.. మతతవ్వం ఇక్కడ నడవదని ఈటల కుండబద్దలు కొడతారు.  బరాబర్ హిందుత్వ అజెండాతో  ఎన్నికలో పోటీ చేయడం కరెక్టు కాదంటారు. అలా పోటీ చేస్తే ఇదిగో ఇలా డిపాజిట్లు గల్లంతౌతాయని ఈటల ఎలాంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టేశారు. జూబ్లీలో బీజేపీకి డిపాజిట్ గల్లంతు కావడానికి హిందుత్వ అజెండాయే కారణమని విస్ఫష్టంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావిస్తూ ఆయన మతతత్వ అతివాద ధోరణితో చేసిన ప్రచారమే జూబ్లీలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు కావడానికి కారణమని చెప్పడమే కాకుండా, ప్రచార అజెండాలో మతం ప్రస్తావన లేకుండా ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బండి వర్సెస్ ఈటల వ్యవహారం రాష్ట్ర పార్టీలో స్పష్టమైన చీలకను స్ఫురింప చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.  

ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ క్విడ్ ప్రోకో!.. అరెస్టేనా?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలోకే ఫార్ములా ఈ కార్ కేసును లొట్టపీసు కేసుగా గతంలో కేటీఆర్ అభివర్ణించడంతో.. అసలీ కేసేంటి? ఇందులో కేటీఆర్ పై ఉన్న అభియోగాలేంటి.. పది వారాల పాటు నాన్చి నాన్చి గవర్నర్ ఇప్పుడే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడమేంటి? జూబ్లీ బైపోల్ ఫలితానికీ.. గవర్నర్ అనుమతి ఇవ్వడానికి సంబంధం ఏంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.   బీఆర్ ఎస్ హయాంలో  గత అసెంబ్లీ ఎన్నికల  ముందు 2023లో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఇది సాఫీగానే సాగిపోయింది. అయితే ఆ  తర్వాత దీనిపై తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. ఈ రేస్‌ను కండక్ట్ చేసిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఖాతా నుంచి 54.88 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.  అయితే  ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు ఈ సొమ్ము బదిలీ చేసేందుకు   హెచ్ ఎండీఏ ఎటువంటి తీర్మానం చేయలేదు. కనీసం ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందలేదు.  దీంతో కేవలం అప్పటి మంత్రి  కేటీఆర్  నోటి మాటే వేదంగా, శాశనంగా భావించి హెచ్ఎండీఏ దాదాపు 54.88 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు బదిలీ చేసింది.   అయితే  ఆ వెంటనే 45 కోట్ల రూపాయలను కేటీఆర్  ఖాతాకు ఫార్ములా ఈ కార్  ఈవెంట్ స్పాన్సర్ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థకు  బదిలీ చేసింది. దీనిపైనే  కేసు నమోదైంది.  సుమారు 55 కోట్ల రూపాయలను ఇచ్చి దానిలో 45 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల పేరుతో కేటీఆర్ ఖాతాకు బదిలీ చేశారన్నది ఏసీబీ  ఆరోపణ. సో ఈ ఫార్ములా రేస్ వెనుక భారీ అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది. దీంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీయాలంటే మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను విచారించాలని కోరుతూ ఏసీబీ  గవర్నర్‌  అనుమతి కోరారు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేసినా గవర్నర్ చివరకు అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ చిక్కుల్లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ క్విడ్ ప్రోకో ప్రస్ఫుటంగా బయటపడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటి వరకూ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వకుండా మౌనంగా ఉన్న గవర్నర్ ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక తరువాత ఓకే చెప్పడం వెనుక బీజేపీ ఉందంటున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత అయితే ఏకంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ బాంబ్ పేల్చారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడానికి బీఆర్ఎస్ తో  రహస్య ఒప్పదం అన్న ఆరోపణలను ప్రజలు విశ్వసించడమే కారణమని కమలనాథులు భావిస్తున్నారు. దాంతో  అటువంటిదేమీ లేదని చాటుకోవడానికే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిందని అంటున్నారు. 

తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు?.. రాజీనామా దిశగా దానం, కడియం అడుగులు

తెలంగాణలో మరో  రెండు ఉప ఎన్నికలు జరగడం ఖాయమా అంటే ఔననే చెప్పాల్సి వస్తున్నది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. పిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయం తీసుకునే విషయంలో తెలంగాణ స్పీకర్ విచారణ జోరందుకుంది. సుప్రీం కోర్టు స్పీకర్ నిర్ణయం వెలువరించడానికి నిర్దుష్ట గడువు విధించడంతో ఆయన విచారణ ప్రక్రియను స్పీడప్ చేశారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పక్కన పెడితే... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపి మరీ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సారి నోటీసులు అందుకుని కూడా స్పీకర్ విచారణకు గైర్హాజరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెడ్యే కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి  నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామా యోచన చేస్తున్నట్లు వారి వారి సన్నిహితుల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికే వారిరువురూ కూడా వారి వారి అనుచరులతో భేటీ అయ్యారు.  గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలలో దానం, కడియం కూడా ఉన్న సంగతి తెలిసిందే.  కాగా పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎనిమిది మందీ ఇప్పటికే స్పీకర్ విచరణకు హాజరౌతుండగా కడియం, దానంలు మాత్రమే గైర్హాజరయ్యారు.  కాగా మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలూ తాము పార్టీ ఫిరాయించలేదని, టెక్నికల్ గా ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్నారు. అయితే అలా చెప్పే అవకాశం కడియం, దానంలకు లేకుండా పోయింది. ఎందుకంటే వీరిరువురూ కాంగ్రెస్ గూటికి చేరారనడాని బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆ కారణంగానే వీరు స్పీకర్ విచారణకు గైర్హాజరయ్యారంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్.. 2024 సార్వత్రిక ఎన్నికలలో   కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.  అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన కడియం శ్రీహరి  2024 లోక్ సభ ఎన్నికలలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కావ్య తరఫున బహిరంగంగా ప్రచారం నిర్వహించారు.  దీంతో వీరిరువురూ పార్టీ ఫిరాయించలేదని చెప్పడానికి చాన్స్ లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు ఎదుర్కొనే కంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం మేలని ఈ ఇరువురూ భావిస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు తథ్యమన్న చర్చ జోరందుకుంది. 

పేర్ని నానికి పరాభవం.. అయినా నోరెత్తితే ఒట్టు!

ప్రస్తుతం వైసీపీలో నోరున్న ఒకే ఒక నాయకుడిగా గుర్తింపు పొందుతున్న పేర్ని నానికి ఘోర పరాభవం ఎదురైంది. మామూలుగా అయితే నోరేసుకుపడిపోయే పేర్ని నాని ఈ సారి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. నోరెత్తి ప్రశ్నించలేదు. ఇంతకీ పేర్ని నానికి పరాభవం ఎక్కడ ఎదురైందంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. వైసీపీ అధినేత జగన్ దాదాపు ఆరేళ్ల తరువాత తొలి సారిగా అక్రమాస్తుల కేసు విచారణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు గురువారం (నవంబర్ 19) హాజరయ్యారు. తాడేపల్లి నుంచి ఉదయం గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుని అక్కడ నుంచి గంటకు ఎనిమిది లక్షలు చెల్లించి మరీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్ద కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ జమ అయ్యింది. అయితే కోర్టు ఆవరణలోకి జగన్ ను మాత్రమే అనుమతించారు. ఇక ఎవరినీ ఎంటర్ కానీయలేదు. అలా పోలీసులు ఆపేసిన వారిలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. మామూలుగా అయితే తనను నిలువరించిన పోలీసులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగాలి. కానీ ఎందుకో.. నోరెత్తలేదు. కోర్టు పరిసరాల్లో మాట్లాడితే అక్కడికక్కడే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించేస్తారని భయపడినట్లున్నారని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది పక్కన పెడితే.. తనను పోలీసులు నిలిపివేసినా పేర్ని నాని మాత్రం దాదాపు అరగంటకు పైన కోర్టు బయట అలాగే నిలబడి ఉన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తై జగన్ బయటకు వచ్చే వరకూ నోరెత్తకుండా నిలుచున్నారు. అయితే బయట పెద్ద ఎత్తున గుమిగూడిన వైసీపీయేలు మాత్రం రప్పరప్ప ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారనుకోండి అది వేరే సంగతి.

వీళ్లు వాళ్లేనా?

అక్రమాస్తుల కేసులో  ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత  హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఇందు కోసం ఆయన బేంగళూరు నుంచి బుధవారం (నవంబర్ 18) తాడేపల్లిలోని తన ప్యాలెస్ కు చేరుకున్నారు. గురువారం (నవంబర్ 19)న ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సరే అదలా ఉంచితే..  బుధవారం నవంబర్ 18) తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఉండి.. గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తరువాత సైలెంటైపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిశారు. వీరితో పాటు ఇప్పుడు పార్టీలో వాయిస్ వినిపిస్తున్న ఏకైక నాయకుడు పేర్ని నాని కూడా ఉన్నారు. ఈ నలుగురూ ఒకే ఫ్రేములో కనిపించడం చాలా కాలం తరువాత ఇదే తొలిసారి.  కాగా జగన్ ను కలిసిన ముగ్గురు నాయకులు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలలో పేర్ని నానిలో భౌతికంగా పెద్ద మార్పేమీ కనిపించలేదు కానీ, వల్లభనేని వంశీ, కొడాలి నానిల అపియరెన్స్ లో మాత్రం చాలా చాలా మార్పు కనిపించింది. కొడాలి నాని బరువు తగ్గిపోయి.. మనిషి దాదాపుగా సగానికి సగం తగ్గిపోయినట్లు కనిపించారు. వల్లభనేని పరిస్థితి కూడా అలాగే ఉంది. వైసీపీ అందగాడు అంటు జగన్ గతంలో అభివర్ణించిన వల్లభనేని వంశీలో ఇప్పుడు ఆ చార్మ్ కానీ, ఉత్సాహం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు.  నెరిసిపోయిన జుట్టు, గుబురుగడ్డంతో వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ ముగ్గురూ అంటే కొడాలి, పేర్ని నాని ద్వయం, వల్లభనేని వంశీ అధికార గర్వంతో విర్రవీగుతో.. ప్రత్యర్థులపై ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిగా నోరు పారేసుకునే వారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలైతే అనుచిత భాషా ప్రావీణ్య ప్రదర్శనలో డాక్టరేట్ పొందారా అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత వారిలో ఆ దూకుడు, దురుసుతనం పూర్తిగా కనమరుగైపోయి మన్నుతిన్న పాములా అన్నట్లుగా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.  

1 నుంచి రేవంత్ జిల్లాల పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టనున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తిరుగులేని విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆ ఉత్సాహం అలా ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లి మరో విజయాన్ని పార్టీ ఖాతాలో జమ చేయాలని రేవంత్ తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలోనూ తొలుత పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ఆయన భావిస్తున్నారు. ఆ పంచాయతీ ఎన్నికల ముహూర్తం కూడా దాదాపుగా ఖారారైనట్లే కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన అంశం న్యాయస్థానాలలో వచ్చిన తీర్పుల కారణంగా వీలు కాలేకపోయినప్పటికీ, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ కు క్రెడిట్ అయితే దక్కిందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 1 నుంచి 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించి, అవి పూర్తి అవ్వగానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అదే విధంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా చేపట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ నెల 1 నుంచి 9 వరకూ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. అయితే అంతకు ముందే.. రాష్ట్రంలో వివిధ శాఖల వారీగా జరిగిన ప్రగతిపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

రాష్ట్రపతి, గవర్నర్ లకు గడువు విధించలేం.. సుప్రీం

చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు కాలప పరిమితి  నిర్ణయించలేమని దేశ సర్వోన్నత  న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం గురువారం (నవంంబర్ 20)తీర్పు వెలువరించింది.  దీంతో ఈ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠకు తెరపడింది. అసలు విషయం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో  తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం..  బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేననీ, అలా తీసుకోకుంటే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని తీర్పు ఇచ్చింది.  దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది. దీంతో..  రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ సుప్రీం కోర్టులో  పలు పిటిషన్లు దాఖలయ్యాయి.  ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహా  కోరారు.  బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంను కోరారు.   రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే   పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ..  గవర్నర్లు తమ నిర్ణయాన్ని నిర్దుష్ట కాలవ్యవధిలో తీసుకోవాలని వాదించాయి.   ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ససెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న  సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ  ఆదివారం(నవంబర్ 23) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా గురువారం (నవంబర్ 20) సుప్రీం తీర్పు వెలువరించింది.  చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు  ఎటువంటి గడువూ విధించలేమని సుప్రీం తీర్పు రాజ్యాంగ ధర్మాసనం విస్పష్ట తీర్పు వెలువరించింది.  అయితే బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్  సుదీర్ఘ సమయం తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం కోర్టులకు ఉందని పేర్కొంది.  బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల ముందు వాటిని ఆమోదించడం లేదా రాష్ట్రపతికి పంపడం, అదీ కాకుంటే.. వాటిని తిరిగి అసెంబ్లీకి తిరిగి పంపడం వినా మరో మార్గం లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.