విజయమ్మ దీక్ష సమైక్యం కోసమేనా

  వైకాపా అధ్యక్షురాలు విజయమ్మరాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ గుంటూరులో చేప్పటిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో ఐదవరోజు పూర్తయింది. షరా మామూలుగానే ఆమె షుగర్, బీపీ, లెవెల్స్ పడిపోవడం, నీరసించిపోవడం, వెంటనే దీక్ష విరమించమంటూ డాక్టర్ల హెచ్చరికలు అన్నీ మొదలయిపోయాయి. ఇక నేడో రేపో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమె దీక్షను భగ్నం చేయడం ఆసుపత్రికి తరలించడం కూడా షరా మామూలుగా జరిగేవే.   ఆమె రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ దీక్ష మొదలుపెట్టినప్పటికీ, అక్కడ జరుగుతున్న రాజకీయ ప్రసంగాలు మాత్రం తెదేపాను దాని అధ్యక్షుడు చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని సాగుతుండటం విశేషం. ఈ రోజు దీక్షా వేదిక వద్ద ప్రసంగించిన ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ రాష్ట్ర విభజన వల్ల కలిగే కష్టనష్టాల గురించి, రాష్ట్రం విడిపోకుండా ఉంచేందుకు చేయవలసిన ప్రయత్నాల గురించి మాట్లాడే బదులు, ఆమె చంద్రబాబుపై నిప్పులు చెరగడానికే ప్రాధాన్యమిచ్చారు.   రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని, ఇప్పటికయినా ఆయన తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని రాష్ట్ర విభజను వ్యతిరేఖిస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని ఆమె అన్నారు. తెలంగాణకు అనుకూలమని చెపుతూ, మరో వైపు సీమాంధ్ర నేతల చేత సమైక్య ఉద్యమాలు చేయించడం ప్రజలను మోసగించడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం ఇప్పటికయినా ఆయన ద్వంద నీతిని పక్కనబెట్టి ఆయన తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆమె డిమాండ్ చేసారు.   తెలంగాణాలో పాగా వేసేందుకే ‘తెలంగాణా ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని’ చెప్పుకొన్న వైకాపా అక్కడ, పార్టీకి ఆశించినంతగా ప్రజాదరణ దక్కకపోవడంతో ఇక అక్కడ కొనసాగి లాభంలేదని గ్రహించగానే అకస్మాత్తుగా సమైక్యరాగం అందుకొని, అక్కడి తన పార్టీ నేతలని, ప్రజలని మోసం చేయడం నిజం కాదా? విశ్వసనీయతకు సర్వహక్కులు తమవేనన్నట్లు మాట్లాడే ఆ పార్టీ అధిష్టానం తెలంగాణా ప్రజలను వంచించడం నిజం కాదా? తెలంగాణా విషయంలో ఆ పార్టీ అవలంభించినది ద్వంద వైఖరి కాదా?   తెలంగాణాలో పూర్తిగా పరువు పోగొట్టుకొని, ఏమీ జరగనట్లుగా ఆంధ్రప్రాంతంలో ఈవిధంగా ఉత్తర ప్రగల్భాలు పలకడం ఆ పార్టీకే చెల్లు. నిజానికి ఆ పార్టీకి ఇప్పుడు ముఖ్యంగా కావలసింది నిబద్దత, విశ్వసనీయతే. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడుతున్నామని చెపుతూ ఆ పేరుతో సీమాంధ్ర ప్రాంతంలో తమ పార్టీ రేటింగ్ పెంచుకోవాలని తహతహలాడుతున్న వైకాపా మళ్ళీ ద్వందనీతినే అవలంభిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని బలపరుచుకొంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నవైకాపా సమైక్య ఉద్యమాల పేరుతో ప్రజలని వంచించడం చాలా హేయమయిన చర్య.   సీమాంధ్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించేందుకే రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమాలు మొదలుపెట్టిన వైకాపా, ఆ తరువాత చంద్రబాబుని ముగ్గులోకి లాగేందుకే జగన్, విజయమ్మల రాజీనామాలు చేసి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించడం గమనిస్తే ఆ పార్టీ ఎంత దురాలోచనతో ఈ సమైక్యపోరాటం ఆరంభించిందో అర్ధం అవుతోంది. ఇటువంటి దుర్నీతితో పార్టీ ప్రజల మెప్పు పొందడం, కలకాలం మనుగడ సాగించడం అసంభవమని ఆ పార్టీ అధిష్టానం ఎంత త్వరగా గ్రహిస్తే ఆపార్టీకి అంత మేలు.

కాంగ్రెస్ ఉచ్చులో ప్రతిపక్షాలు

  కొద్ది రోజులుగా సీమాంధ్రకు చెందిన తెదేపా కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్ర కోరుతూ ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరో అడుగు ముందుకువేసి తన రాజీనామాను కూడా ఆమోదింపజేసుకొన్నారు. నిన్న లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తెదేపా కాంగ్రెస్ పార్టీలకు చెందిన మొత్తం 12మంది యంపీలను లోక్ సభ నుండి సస్పెండ్ చేయబోగా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. కానీ, ఈ రోజు స్పీకర్ వారందరినీ సభ నుండి ఐదు రోజులపాటు సస్పెండ్ చేసారు.   యంపీలు సభలో గొడవ చేయడం వారిని సస్పెండ్ చేయడం షరా మామూలు విషయమే అయినప్పటికీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు సస్పెండ్ అయిన కాంగ్రెస్ యంపీలు అందరూ కూడా సోనియా గాంధీకి వీర విధేయులే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సోనియా గాంధీకి వీర విధేయులయిన ఉండవల్లి, కనుమూరి, హర్ష కుమార్, లగడపాటి వంటి కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్రపై సభను స్తంభింపజేయడం ఆశ్చర్యమనుకొంటే, సభలోనే ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వారిని వారించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.   అసలు కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్ర కోరుతూ నిజంగానే తమ అధిష్టానానికి డ్డీ కొంటున్నారా? లేక ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం తన ప్రత్యర్ధులను ఏమార్చడానికే ఆడుతున్న మహానాటకంలో భాగమా? అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఆహారభద్రతా బిల్లుని తమ యంపీలే స్వయంగా అడ్డుకొంటున్నపటికీ సోనియా గాంధీ వారిని వారించే ప్రయత్నం చేయకపోవడం, అదేవిధంగా కీలకమయిన బిల్లుపై సభలో చర్చ జరుగుతోందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ యంపీలు సభలో రభస చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.   రాష్ట్ర విభజన ప్రకటన తరువాత వైకాపా రాజీనామాలతో మొదలయిన సమైక్య ఉద్యమం చూసి కాంగ్రెస్ పార్టీ కంగుతింది. రాష్ట్ర విభజన చేసి ఒకే దెబ్బకు మూడు పిట్టలు-తెరాస, తెదేపా మరియు జగన్ పార్టీలను కొడదామని అడియాసకు పోయిన కాంగ్రెస్ అధిష్టానం ఊహించని స్థాయిలో నడుస్తున్న సమైక్య ఉద్యమాలు చూసి నివ్వెరపోయింది. అయితే కధ ఇంతవరకు వచ్చిన తరువాత వెనక్కి వెళితే మొదటికే మోసం రావడం ఖాయం. అందువల్ల తన పార్టీ యంపీలతోనే తిరుగుబాటు బావుటా ఎగురవేయించి, తెదేపా, వైకాపాలు కూడా ఆ ఉచ్చులో చిక్కుకొన్న తరువాత ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్లయితే క్షేమంగా బయటపడవచ్చునని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును.

12 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

      లోక్‌సభలో 12 మంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అరంగట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ మీరాకుమార్ సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధన 374ఏ ప్రకారం స్పీకర్ మీరాకుమార్ ఎనిమిది మంది కాంగ్రెస్, నలుగురు టీడీపీ సీమాంధ్ర ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సప్పెన్షన్ గురైన టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సస్పెన్షన్ జాబితాలో సాయిప్రతాప్, అనంత, లగడపాటి, మాగుంట, హర్షకుమార్, మోదుగుల, ఉండవల్లి, కొనకళ్ల, శివప్రసాద్, నిమ్మల కిష్టప్పతో పాటు సబ్బంహరి, కనుమూరి బాపిరాజు పేర్లను చేర్చారు. నిన్న లిస్టులో ఉన్న రాయపాటి పేరును తొలగించారు. సమైక్యాంధ్ర కోసం గత కొద్దిరోజులుగా సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో నిరసనకు దిగిన విషయం తెలిసిందే.

ముంబై లో జర్నలిస్ట్ పై గ్యాంగ్ రేప్

      ముంబై కి చెందిన ఓ మహిళ జర్నలిస్ట్ గురువారం రాత్రి గ్యాంగ్ రేప్ కి గురయింది. ఓ ప్రముఖ పత్రికకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహిళ జర్నలిస్ట్ అసైన్‌మెంట్‌పై ఆమె మిల్ కాంపౌండుకు వెళ్లింది. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. జస్లోక్ అస్పత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని తెలుస్తోంది. ఆమెతో పాటు వచ్చిన మగ సహోద్యోగిని దుండగులు కొట్టి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయికి గాయాలయ్యాయని, రక్తం కూడా కారుతోందని, అయితే చికిత్సకు ప్రతిస్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 10మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సెప్టెంబరు 7 టెన్షన్ టెన్షన్

      సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తూ లక్షమందితో హైదరాబాద్ తో పమైక్య సభను నిర్వహిస్తాం అని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించింది. అదే జరిగితే అదే రోజు తాము కూడా హైదరాబాద్ లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ జేఏసీ నేతలు చెబుతున్నారు. దీంతో సెప్టెంబరు 7న హైదరాబాద్ లో ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరు అడ్డువచ్చినా హైదరాబాద్ లో సమైక్య సభ నిర్వహించి తీరుతామని ఏపీఎన్జీవో నేతలు చెబుతుంటే దానికి పోటీగా ర్యాలీ చేయాలని తెలంగాణ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభజన రేఖ పడిపోయింది. పోటాపోటీగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యమాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యోగులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ కూడా ర్యాలీలు తీయాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే నెల 4 నుండి 7 వరకు శాంతిర్యాలీలు, 7న మిలియన్ మార్చ్ కు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. లాల్ బహదూర్ స్టేడియం, నిజాం కళాశాల ప్రాంతాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

హరికృష్ణ వెనుక జగన్..!!

      తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ హరికృష్ణ రాజీనామా వెనుక జగన్ పార్టీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి గురువారం ఆయన రాజీనామా చేయడం, అంతేవేగంగా అది ఆమోదం పొందడం పార్టీవర్గాలను విస్మయంలో ముంచెత్తింది. హరికృష్ణ భావోద్వేగంతో రాజీనామా చేశారా? లేక పార్టీ అధినేత, బావ చంద్రబాబును ఇరుకునపెట్టేందుకు చేశారా? అనే చర్చ జరుగుతోంది.   హరికృష్ణ రాజీనామా చేస్తున్నట్లు టిడిపి నేతలెవరికీ తెలియదు..కాని ఈ విషయంపై ముందుగానె జగన్ పార్టీ నేతలకు సమాచారం అందడం విశేషం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే..హరికృష్ణ రాజీనామా ను స్వయంగా జగన్ పార్టీ నేతే తాయారు చేశారట. "ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న విజయవాడ నగరానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఏపీఎన్జీవో నేతలకు ఫోన్ చేశారు. హరికృష్ణ రాజీనామా చేయబోతున్నారని... దానిని స్వాగతించాలని కోరారు. రాజీనామా సరే, ఆది ఆమోదం పొందుతుందా? అని ఉద్యోగ నేతలు ప్రశ్నించగా... రాతకోతలన్నీ తానే చేశానని, రాజీనామా కచ్చితంగా ఆమోదం పొందుతుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబును పరోక్షంగా ఇరుకున పెట్టడానికే ఈ వ్యవహారం నడిపినట్లు అనిపిస్తోంది. రాజీనామా చేసి ఆమోదించుకొని చంద్రబాబుకంటే ముందే సీమాంధ్రలో పర్యటనకు వెళ్తే పార్టీ కార్యకర్తలు, నాయకులంతా తననే అనుసరిస్తారని, చంద్రబాబు కంటే తనకే ఇమేజి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు.  

చంద్రబాబు యాత్రకి పార్టీ నేతల అభ్యంతరాలు

  దాదాపు ఏడాది క్రితం చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టే ముందు తెదేపా పరిస్థితి ఏవిధంగా ఉందో మళ్ళీ నేడు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆయన పాదయాత్ర ముగిసేసరికి పార్టీ పరిస్థితిలో గణనీయమయిన మార్పు కనబడినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజన ప్రకటనతో తెదేపా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. మరో విశేషం ఏమిటంటే క్రిందటిసారి ఆయన పాదయాత్రని పార్టీ నేతలందరూ స్వాగతించగా ఈ సారి మాత్రం సీమంధ్రలో కొందరు నేతలు వ్యతిరేఖిస్తున్నట్లు సమాచారం.   రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో ప్రజలకు వివరించాలని ఆయన భావిస్తుంటే, అదే కారణంతో ఆయన యాత్రను కొందరు నేతలు వ్యతిరేఖిస్తున్నట్లు తెలుస్తోంది. తెదేపా ఇచ్చిన లేఖవల్ల సీమాంధ్ర ప్రాంతంలో తాము ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితులు కలిగాయని, ఇప్పుడు చంద్రబాబు యాత్రతో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వారు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన న్యాయబద్దంగా జరగాలని కోరుతున్నపటికీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి అనుకూలంగా మాట్లాడుతున్నకారణంగా ఆయన రాకవల్ల తమకు కొత్త ఇబ్బందులు కలుగుతాయని భయపడుతున్నారు.   కానీ చంద్రబాబు ఇప్పటికయినా తెలంగాణాపై తమ పార్టీ వైఖరి స్పష్టం చేయకపోతే, తెలంగాణాలో నష్టపోవడం ఖాయం. అదేసమయంలో తెలంగాణా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తే సీమాంధ్ర ప్రాంతంలో ఆయన ఒంటరి అవడం ఖాయం. రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవడం నిజంగా కత్తిమీద సాము వంటిదే. తన పాదయాత్రతో పార్టీకి బలం చేకూర్చిన చంద్రబాబు ఈ సారి చేపడుతున్నయాత్రతో పార్టీకి ఏవిధంగా మార్గ దర్శనం చేస్తారో చూడాలి.

25 నుంచి తెలుగు వారి ఆత్మ గౌర‌వయాత్ర

  రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అవ‌లంభిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త‌ల‌పెట్టిన తెలుగు వారి ఆత్మ గౌవ‌ర యాత్ర ఈ నెల 25 నుంచి మొద‌లు కానుంది. ఉత్తరాంద్ర టీడిపి నేత‌ల‌తో టెలికాన్ఫరెన్స్‌లో చ‌ర్చించిన చంద్రబాబు ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రోజులు పాటు ఏ ఏ మార్గాల్లో యాత్ర ఉంటుంది అన్న దానిపై త్వర‌లోనే స్పష్టత ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లా, కొత్తవలస నుంచే బస్సు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 25 న ఉద‌యం 8.30కు చంద్రబాబు హైద‌రాబాద్ నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ‌తారు. అక్కడి నుంచి జంగాల ప‌ల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన త‌రువాత విజ‌య‌న‌గ‌రం జిల్లా కొత్త వ‌ల‌స చేరుకొని అక్కడి నుంచి యాత్ర పారంభిస్తారు. తొలి విడ‌తగా విజ‌య‌న‌గ‌రం, శ్రీ కాకులం జిల్లాలో 10 రోజుల పాటు యాత్ర నిర్వహించనున్నారు. గ‌తంలో బాబు పాదయాత్రలో ప‌ర్యటించ‌లేని ప్రాంతాలను ఇప్పుడు ఆత్మ గౌర‌వ యాత్రలో ప‌ర్యటించ‌నున్నారు. త‌రువాత రెండో విడ‌త యాత్ర ప్రకాశం జిల్లా నుంచి మొద‌లు పెట్టి నెల్లూరు, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో నిర్వహించ‌నున్నారు.

విభ‌జ‌న రాజ్యాంగ విరుద్దం

  రాష్ట్ర విభ‌జ‌న‌కు నిర‌స‌న‌గా సీమాంద్రలో నిర‌స‌న‌లు వెళ్లువెత్తుండ‌గా ఇప్పుడు ఈ విష‌యంపై న్యాయ‌పోరాటానికి కూడా సిద్దమ‌వుతున్నారు స‌మైక్య వాదులు. ఆంద్రప్రదేశ్‌ను విభ‌జించాల‌న్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటూ న్యాయ‌వాది పీవీ ర‌మ‌ణ సుప్రిమ్ కోర్టులో పిల్ వేశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగంలోని 321-డి అధికరణ ఉల్లంఘనే అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలొని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ తీసుకున్న రాష్ట్రవిభ‌జ‌న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేఖ‌మ‌ని ఆయ‌న పిల్‌లో పేర్కొన్నారు. కేవ‌లం టిఆర్ఎస్ పార్టీ కోరిక మేర‌కు రాష్ట్రాన్ని విభ‌జించాల‌నుకోవ‌టం అన్యాయం అన్నారు. కేంద్ర అస‌లు ఏ ఆధారంగా రాష్ట్రాన్ని విభ‌జించాల‌నుకుంటుందొ స్పష్టంగా తెలియ‌జేయ‌లేద‌ని పేర్కొన్నారు. రాష్ట్రవిభ‌జ‌న నిర్ణయం పూర్తిగా ఏక‌ప‌క్షం అని పేర్కొన్నారు ర‌మ‌ణ‌. ప్రజ‌ల‌ను సంప్రదించ‌కుండా కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌తో కేంద్ర రాష్ట్ర విభ‌జ‌న నిర్ణయం తీసుకుంద‌న్నారు. పివి ర‌మ‌ణ వేసిన పిల్‌ను సుప్రిం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి స‌దాశివం విచార‌ణ‌కు స్వీక‌రించారు.

భార‌త్‌లో అమ్మాయిల‌కు ప్రత్యక్ష న‌ర‌క‌మే..

  ప్రపంచ ప‌టం మీద స‌గ‌ర్వంగా నిల‌బ‌డాల్సిన భార‌త్ ఇప్పుడు అనేక విమ‌ర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా దేశంలో జ‌రుగుతున్న లైంగిక దాడులు అంత‌ర్జాతీయ స్ధాయిలో మ‌న దేశం ప‌రువు తీస్తున్నాయి. ముఖ్యంగా మ‌న‌దేశ యువ‌తుల‌తో పాటు ఇత‌ర దేశాల‌నుంచి వ‌చ్చే అమ్మాయిల‌పై కూడా ఇక్కడ ఆగ‌డాలు శృతి మించుతున్నాయి. ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి ఇప్పుడు భార‌త్ ప‌రువు తీసింది.. మూడు నెల‌ల పాటు టూరిస్ట్‌గా ఇండియాకు వ‌చ్చిన ఓ అమెరిక‌న్‌ అమ్మాయిలో భార‌త్‌లో అమ్మాయిల ప‌రిస్థితిని క‌ళ్లకు క‌ట్టిన‌ట్టుగా వివ‌రించింది. అంతేకాదు భార‌త్ యాత్రికుల‌కు స్వర్గదామ‌మేగాని అమ్మాయిల‌కు మాత్రం ప్రత్యక్షన‌ర‌కం అని వ్యాఖ్యానించింది. చికాగో యూనివర్సిటీకి చెందిన మైఖేలా క్రాస్ అనే అమ్మాయి రోజ్ చాస్మ్ అనే పేరుతో సీఎన్ఎన్ ఐ రిపోర్ట్లో మ‌న‌దేశంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప‌రిస్ధితుల‌పై ఓ వ్యాసం రాసింది. భారత పర్యటనలో తాను ఎదుర్కొన్న వేదింపుల‌ను, వాటివల్ల త‌ను ఎంత మ‌నోవేద‌న‌కు గురైందో స‌వివ‌రంగా ఆ వ్యాసంలో వివ‌రించింది.''ఇండియాః ద స్టోరీ యు నెవర్ వాంటెడ్ టు హియర్'' అనే పేరుతో ఆమె ఈ వ్యాసాన్నిరాసింది. ప్రస్థుతం ఈ వ్యాసం ప్రపంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టింస్తుంది. ఎంత‌టి ప్రకృతి అందాలు, ప‌ర్యాట‌క ప్రదేశాలు చ‌రిత్ర ఉన్న భార‌త్ అమ్మాయిల‌కు ఏమాత్రం శ్రేయ‌స్కరం కాద‌ని అందుకు తాను ఎదుర్కొన్న అనుభావాల‌నే సాక్షాలుగా చూపించింది.

ఉద్యమ నేప‌ధ్యంలో టెట్ వాయిదా

  సీమాంద్రలో వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌ల హోరు ఉద్యోగావ‌కాశాల మీద కూడా ప్రభావం చూపుతుంది. సీమాంద్ర ప్రాంత‌లో వెళ్లువెత్తుతున్న నిర‌స‌న‌ల నేప‌ధ్యంలో సెప్టెంబ‌ర్ 1 జ‌ర‌గాల్సిన టెట్ ప‌రీక్ష వాయిదా ప‌డింది. ఈ మేరుకు రాష్ట్ర ఉన్నత విధ్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప‌రీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వర‌లోనే ప్రక‌టిస్తామ‌న్నారు. ఈ మేర‌కు టెట్ క‌న్వీన‌ర్ జ‌గ‌న్నాధ్ రెడ్డి ఓ ప్రక‌ట‌న చేశారు. ముఖ్యమంత్రి కార్యాల‌యం నుంచి ఆదేశాలు అందిన తరువాత అధికారికంగా ప్రక‌టిస్తామ‌ని చెప్పారు. ఇప్పటికే సీమాంద్రలోని పాఠ‌శాల‌ల‌పై ఉద్యమ ప్రభావం బాగా ఉండ‌గా ఉపాధ్యాయుల స‌మ్మెతో అది మ‌రింత ఎక్కువైంది దీంతో ప్రభుత్వానికి టెట్ వాయిదా వేయ‌క త‌ప్పలేదు. ఈ ప‌రీక్ష రాసేందుకు 4 ల‌క్షల 47 వేల‌మంది అభ్యర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణాలో గెలిచి ఓడిన కాంగ్రెస్ పార్టీ

  కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ప్రకటనతో తెరాస, తెదేపాలపై పైచేయి సాధించినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలు ఆ సదవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణా ప్రకటన చేసి కేసీఆర్ ను, తెరాసను పూర్తిగా దెబ్బతీయలనుకొన్న కాంగ్రెస్ అధిష్టాన వ్యూహం కాస్తా టీ-కాంగ్రెస్ నేతల ఉదాసీనతతో బెడిసికొట్టింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవిభజన ప్రకటన చేసిన తరువాత వారెవరూ ఆ ఖ్యాతిని దక్కించుకొనే ప్రయత్నాలేవీ చేయకపోగా, ఇంకా ఏర్పడని తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి పదవికోసం అంతర్యుద్దంలో మునిగిపోయారు. వారి నిర్లిప్తతకు తోడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర ప్రాంతాన్ని దాదాపు స్తంభింపజేసారు.   అయినప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలలోఎటువంటి ప్రతిస్పందన కనబడకపోవడంతో, అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొంటూ కేసీఆర్ చకచకా పావులు కదుపుతూ తెలంగాణాలో తానే అసలయిన హీరోనని నిరూపించుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ చురుకుగా కదిలి తెలంగాణా అంశాన్నిమళ్ళీ తన చేతిలోకి తెచ్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులను తనకనుకూలంగా మలచుకొని ముందుకు సాగుతున్నాడు.   రాజధాని హైదరాబాద్ ను పంచుకొనే విషయంలో, ఆంద్ర ఉద్యోగుల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆతనిని తెలంగాణా ప్రజల హీరోగా నిలబెడితే, హైదరాబాదులో స్థిరపడిన ఉద్యోగుల భద్రతకు హామీ ఇస్తూ మాట్లాడిన టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణా విలన్లుగా మిగిలిపోయారు. నిజానికి టీ-కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంలో సరిగ్గానే ప్రతిస్పందించినపటికీ, అది తెలంగాణావాదానికి వ్యతిరేఖంగా ఉండటంతో కేసీఆర్ దే పైచేయి అయ్యింది.   ఇంతకాలం తెలంగాణా ఈయకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని అధిష్టానాన్ని పదేపదే హెచ్చరించిన టీ-కాంగ్రెస్ నేతలు, తెలంగాణా ప్రకటన తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో పూర్తి ఆధిక్యత సాధించగలదని నిబ్బరంగా చెప్పలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం వారిలో ఏ ఒక్కరికి తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తి పట్టు లేకపోవడం, ఏ ఒక్కరికి అందరినీ కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు లేకపోవడమే. అయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలందరూ ఎవరికివారు తామే ప్రధాన నేతగా భావించుకొంటూ, మిగిలినవారిని తమకు పోటీదారులుగా భావించడం విశేషం.   తాజా సర్వేల ప్రకారం ఈరోజు ఎన్నికలు జరిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ కంటే తెరాసకే ఆధిక్యత ఉంటుందని తేలింది. ఈ సర్వేలు అంచనాలు ఎలా ఉన్నపటికీ తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎంతో సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొని తెలంగాణా ఏర్పాటు చేస్తున్నపటికీ అది ఆ పార్టీకి లాభం చేకూర్చకపోగా రెండు ప్రాంతాలలో కూడా నష్టం కలిగిస్తోంది. అందుకు ఆ పార్టీ నేతలనే నిందించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మేల్కొనకపోతే తెరాసను విలీనం చేసుకోవడం సంగతి దేవుడెరుగు, ఆ పార్టీ రెండు ప్రాంతాలలో కనబడకుండా పోయే ప్రమాదం ఉంది.

హరికృష్ణ రాజీనామా ఆమోదం: ఎంపీలకు షాక్

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టిడిపి పార్టీ ఎంపీ హరికృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పిజే కురియన్ ఆమోదించారు. తన రాజీనామాను ఆమోదించినందుకు హరికృష్ణ డిప్యూటీ ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు. అన్నగారి ఆశయ సాధన కోసమే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వల్లే తనకీ పదవి దక్కిందని ఆయన చెప్పారు. తనను రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.   అయితే ఇది సమైక్య రాష్ట్రం కోసం చేసిన తొలి రాజీనామా అవుతుంది. దీంతో ఇప్పుడు మిగిలిన సీమాంద్ర ఎమ్.పిలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. రాజ్యసభలోను, లోక్ సభలోను ఆందోళన చేస్తున్న ఎమ్.పిలు రాజీనామా చేయాలని ఇప్పటికే ప్రజలలో డిమాండ్ ఉంది. ఎపి ఎన్.జి.ఓల సంఘం అయితే ఎమ్.పిలు రాజీనామా చేస్తే తమ ఆందోళన విరమించుకుంటామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఇది కొత్త టర్న్ తీసుకున్నట్లవుతుంది. మిగిలిన ఎమ్.పిలు కూడా రాజీనామా చేస్తారా? లేదా అన్నది చర్చనీయాంశం అవుతుంది.

'బాద్ షా' పదవి పై జూనియర్ కసి

      గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కి టిడిపి లో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత తానే అధినేత అవుతానని భావిస్తున్న సమయంలో...నారా లోకేష్ సడన్ ఎంట్రీ తో జూనియర్ ఎన్టీఆర్ కి షాక్ తగిలింది.   నారా లోకేష్..టిడిపి అధ్యక్షుడి కుమారుడు, నందమూరి బాలకృష్ణ అల్లుడు కావడంతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ను మనోవేదనకు గురి చేసింది. ఇంకా బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహానికి కూడా జూనియర్ ఆహ్వానం పై లోకేష్ అభ్య౦తరం వ్యక్తం చేయడంతో ఆహ్వానించ లేదు. దీంతో స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య పోటీ ప్రజ్వరిల్లినట్లేనని కూడా ప్రచారం జరుగుతోంది.                కసితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాత స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని కోసం గత కాలంగా తండ్రి హరికృష్ణ కు కూడా దూరంగా ఉంటూ...ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే కేంద్రీకరించాడు. నందమూరి అభిమానుల్లో తన ఫాలోయింగ్ ఎక్కువగా పెంచుకోవడానికి కష్టపడుతున్నాడు. ఎలాగైనా వరుస సూపర్ హిట్లు కొట్టి ఎన్టీఆర్ వారసుడ్ని తానే అనిపించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.   ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తన రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ అని ప్రకటించినా...తన సమర్ధతతో టిడిపి అధ్యక్ష పదవిని చేపట్టిన చంద్రబాబునే ఆదర్శంగా తీసుకొని... తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాననె కసితో జూనియర్ ఉన్నాడని సన్నిహిత వర్గాలు అనుకుంటున్నారు. 

హరికృష్ణ కొత్త పార్టీ..!!

      టిడిపి పార్టీ ఎంపీ హరికృష్ణ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి అందజేశారు. అయితే హరికృష్ణ రాజీనామా పైన వివిధ రకాల ప్రచారం జరుగుతోంది.  సిడబ్ల్యూసి విభజన నిర్ణయం వెలువడిన హరికృష్ణ మొదట రాజీనామా చేస్తూ... ప్రజల సెంటిమెంటుకు తలవంచి తాను విభజనను అంగీకరిస్తున్నానన అయితే, విభజన తీరు బాగాలేదని ఆయన ఆక్షేపించారు. ఈసారి సమైక్యాంద్రకు మద్దతుగా ఆయన రాజీనామా చేశారు.   హరికృష్ణ రాజీనామాలో మరో కోణాలు కూడా ఉండి ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది. చంద్రబాబుపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేసే హరికృష్ణ...సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టే ఉద్దేశ్యంతో ఉన్నారని అందుకే, రాజీనామా చేశారని అంటున్నారు. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసిన హరికృష్ణ ..త్వరలో కృష్ణా జిల్లా చైతన్య యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సమైఖ్య నినాదంతో యాత్ర చేయబోతున్న హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.      అయితే జూనియర్ ఎన్టీఆర్ కారణంగా పార్టీ వైపు ఆలోచించే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద ఆయన టిడిపి కి రాజీనామా చేసి..బస్సు యాత్ర మొదలు పెడితే అప్పుడు కాస్త క్లారిటీ రావొచ్చు.   

సీతయ్య ఎవరి మాట వినడు

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు కట్టుబడి ఉన్నానని చెపుతుంటే ఆ పార్టీకి చెందిన సీమంధ్ర నేతలు మాత్రం సమైక్యాంధ్ర కోరుతూ పోటాపోటీగా నిరాహారదీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు హరికృష్ణ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా చంద్రబాబుకి పోటీగా బస్సుయాత్ర కూడా చెప్పట్టబోతున్నారు. చంద్రబాబు పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకోవాలనే ఆలోచనతో బస్సుయాత్ర చెప్పట్టబోతుంటే, హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం చేయబోతున్న బస్సుయాత్రతో చంద్రబాబుకి, తెదేపాకి ఇబ్బందులు సృష్టించబోతున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నపటికీ, నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ బస్సుయాత్ర చేపడితే అది తెలంగాణా ప్రజలకి, నేతలకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. అదేవిధంగా కాంగ్రెస్, వైకాపా, తెరాసలకు ఒక తెదేపాపై దాడి చేసేందుకు ఒక చక్కటి ఆయుధం అందజేసినట్లవుతుంది. పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా ఆయన ఈ విధంగా బస్సు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించడం పార్టీని డ్డీకొనడంగానే భావించవచ్చును.   కొద్ది నెలల క్రితం వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లతో చిచ్చుపెట్టినప్పుడు, తన కుమారుడు జూ.యన్టీఆర్ తో చంద్రబాబు, బాలకృష్ణలు వ్యవహరించిన తీరుపట్ల చాలా ఆగ్రహంగా ఉన్నహరికృష్ణ, ఇప్పుడు సరయిన సమయం చూసి చంద్రబాబుపై పగ తీర్చుకొనేందుకే ఈ సమైక్యాంధ్ర బాట పట్టి ఉండవచ్చును. ఒకవేళ చంద్రబాబు ఆయన బస్సు యాత్రకి అడ్డుపడితే తెదేపా సమైక్యాంధ్రని వ్యతిరేఖిస్తున్నట్లవుతుంది. చూసీచూడనట్లు ఊరుకొంటే, తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నట్లు ప్రచారం అవుతుంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నహరికృష్ణ హటాత్తుగా తన పదవికి రాజీనామాచేసి బస్సు యాత్రలు చేపట్టినంత మాత్రాన్న ప్రజలు ఆయన మాటలను నమ్మకపోవచ్చును, కానీ స్వయంగా నందమూరి కుటుంబ సభ్యుడే తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నందున అది పార్టీ అభిప్రాయమేనని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకొనే అవకాశాన్ని చేజేతులా అందజేసినట్లవుతుంది. మరి హరికృష్ణ వ్యవహార శైలితో మొదటినుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు, బాలకృష్ణలు మరిప్పుడు ఆయనని ఏవిధంగా నిలువరిస్తారో చూడాలి.

జగన్ కేసు: సబితాను ప్రశ్నించిన సిబిఐ

      పెన్నా సిమెంట్ కంపెనీకి గనుల కేటాయింపు వ్యవహారంలో హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. దిల్‌కుషాలో ధర్మానను ప్రశ్నించిన సమయంలోనే సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. వైఎస్ హయాంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత.. పలు గనుల లీజులను పెన్నాకు కేటాయించారు. వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడైన పెన్నా ప్రతాపరెడ్డి.. ఇందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని కోర్టుకు సీబీఐ తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సబితను ప్రశ్నించి.. సీబీఐ అధికారులు తమ అనుమానాలను నివృత్తి చేసుకొన్నారు.