యూపిఏ దేశాన్ని భ్రష్టు పట్టించింది: బాబు

      యూపిఏ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక వృద్ధి రేటు తగ్గటం వల్ల నిరుద్యోగం క్రమంగా పెరుగుతోందని చెప్పారు. కాంగ్రెసు పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. అవినీతి విచ్చవిడిగా పెరిగిందని, ధరలు పెరుగుతున్నాయని, యూపిఏ ప్రభుత్వం కుంభకోణాలమయమని దుయ్యబట్టారు.   దేశ ప్రజల అన్ని రకాల కష్టాలకు బరితెగించిన కాంగ్రెసు పాలననే కారణమన్నారు. ప్రధానమంత్రి సంతకం చేసిన పైళ్లు మాయమవుతున్నాయని విమర్శించారు. అన్నింటిలోకి ఎఫ్‌డిఐలను అనుమతించినా పెట్టుబడులు రావడం లేదని, మరోవైపు రూపాయి విలువ పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ఎవరికి తోచినట్టు వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. బొగ్గు శాఖలో దస్త్రాల గల్లంతుకు కారకులెవరని ప్రశ్నించారు. ఫైల్ మిస్సింగ్ పైన ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలని అన్నారు.

కాంగ్రెస్ లోకి రఘునందన్ రావు

      మెదక్ ఎంపీ విజయశాంతి, టిఆర్ఎస్ మెదక్ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునందనరావులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. ఈ పరిణామమే ఇప్పుడు ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎంపీ విజయశాంతి ఇంట్లో పద్మాలయ స్టూడియో భూముల సెటిల్మెంట్ జరిగిందని, విజయశాంతి భర్త చేతుల మీదుగా రూ.80 లక్షల రూపాయలు చేతులు మారాయని రఘునందనరావులు కొన్ని రోజుల క్రితం ఆరోపించారు. అయితే ఆరోపణలన్నీ తేలిపోవడంతో రఘునందన్ రావు వెనక్కి తగ్గాక మెల్లగా విజయశాంతి బయటపడ్డారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారన్నమాట.

హైద‌రాబాద్ మా అబ్బ సొత్తే : MP అంజ‌న్‌కుమార్‌

సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమం పై ఎంపి అంజ‌న్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యల‌తో విరుచుకుప‌డ్డారు. హైదారాబాద్‌ను అభివృద్ది చేశామ‌ని చెప్పుకుంటున్న సీమాంద్రులు ఏం అభివృద్ది చేశారో చూపించాల‌న‌న్నారు. అంతేకాదు సీమాంద్రులే ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల‌ను నాశ‌నం చేశార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. అస‌లు గొడ‌వ అంతా హైద‌రాబాద్ పైనే జ‌రుగుతుండ‌టంతో ఈ విష‌యం పై కూడా ఆయ‌న తీవ్రంగా స్పందించారు. హైద‌రాబాద్ మా అబ్బ సోత్తే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. హైద‌రాబాద్‌ను సీమాంద్రులు కొంచెం కూడా అభివృద్ది చేయ‌లేద‌న్నారు.    సీమాంధ్రులే  ఇక్కడి సంస్కతిని నాశనం చేశార‌ని విమ‌ర్శించారు,తెలంగాణలో బాంబుల సంస్కతి రావ‌డానికి కార‌ణం కూడా వారే అన్నారు. వారు ఇక్కడ అభివృద్ది చేసింది ఏమి లేద‌న్న ఆయ‌న సీమాంద్రలే ఇక్కడి వ‌చ్చి చాలా అభివృద్ది చెందార‌ని చౌక‌ధ‌ర‌ల‌కే త‌మ భూముల‌ను కాజేశార‌ని విమ‌ర్శించారు.

కిర‌ణ్‌కు అధిష్టానం పిలుపు

  రోజు రోజుకు రాష్ట్రంలో ప‌రిస్థితి చేయిదాటుతుండ‌టంతో అధిష్టానం రాష్ట్ర వ్యవ‌హారాల‌పై దృష్టి పెట్టింది. ఈ మేర‌కు ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డిని డిల్లీ రావాల్సిందిగా ఆదేశించింది అధిష్టానం. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు కిర‌ణ్ డిల్లీ బ‌య‌లుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రవిభ‌జ‌న అంశం పై కాంగ్రెస్ పార్టీ నియ‌మించిన ఆంటోని క‌మిటీతో ఆయ‌న స‌మావేశం కానున్నారు. దీంతో పాటు ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కుల‌ను కూడా క‌ల‌వ‌నున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నెల‌కొన్న పరిస్థితులతో ఆందోళ‌న‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీ న‌ష్టనివార‌ణ చ‌ర్యల‌కు దిగింది. తెలంగాణ అంశంపై యుపిఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు, కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలు ఆమోదం తెలిపిన త‌రువాత సియం ఢిల్లీ వెల్లటం ఇదే మొద‌టి సారి దీంతో ఈ ప‌ర్యట‌న ప్రాదాన్యత సంత‌రించుకుంది. అయితే ఆంటోని క‌మిటీతో జ‌రిగే స‌మావేశంలో కిర‌ణ్ ఎలాంటి వాద‌న వినిపిస్తార‌నే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. స‌మైఖ్యగానం బ‌లంగా వినిపించిన కిర‌ణ్ అధిష్టానం ముందు కూడా అలాగే ఉంటారా లేక, సోనియ‌మ్మ మాట‌ల‌కు జీహుజూర్ అంటారా అనేది తేలాల్సి ఉంది.

పాలకొల్లులో ఆగష్టు 27న సమైక్యాంధ్ర రచయితల, గాయకుల సదస్సు

      పాలకొల్లులో డా. సబితా జూనియర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 27 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు సమైక్యాంధ్ర రచయితల, గాయకుల సదస్సు APNRI, విశాలాంధ్ర మహాసభ వారిచే సంయుక్తంగా నిర్వహించబడుతుందని గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. సదస్సులో పాల్గొనేవారు ఉదయం 6:30కి పాలకొల్లు చేరుకోవాలని తెలిపారు. ఈ సదస్సులో సమైక్యాంద్ర గీతాల రచన, గానములపై శ్రీ రసరాజు, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, తటపర్తి రాజగోపబాలం, సిరాశ్రీ, డా. M.B.D.శ్యామల, ప్రముఖ సంగీత దర్శకులు పాల్గొంటారని వారి నేతృత్వంలో ఈ శిక్షణ శిభిరాలు నిర్వహించబడతాయని పాలకొల్లు సమైక్యాంధ్ర J.A.C కన్వీనర్లు మేడికొండ. శ్రీనివాస్ చౌదర, గండేటి వెంకటేశ్వరరావు,రావూరి.జవహర్ లాల్ నెహ్రు,K.A.J.N. వర్మ, విన్నకోట. వెంకటేశ్వరరావులు ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో కళాకారులు, గాయకులు, నటులు, వివిధ కళారూపాలకు చెందిన కళాకారులు, గేయ రచయితలు ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు. పాలకొల్లు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ వద్ద సమైకాంద్ర సదస్సు వాహానాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొనదలచిన వారు శ్రీ మేడికొండ శ్రీనివాసచౌదరి గారిని cell:9848177511 నేరుగా సంప్రదింపవచ్చు. ఈ సదస్సులో పాల్గొనేవారికి సదస్సు నిర్వహించే రోజు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు.       

జీఎస్‌ఎల్‌వీ - డీ5 ప్రయోగం వాయిదా

  పూర్తి స్వదేశీ ప‌రిజ్ఞానంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన జీఎస్‌ఎల్‌వీ - డీ5 ప్రయోగం వాయిదా పడింది. రాకేట్ రెండో ద‌శ‌లోని ఇంజ‌న్‌లో లీకేజిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని అర్ధాంతంరంగా నిలిపివేశారు. తిరిగి ఎప్పుడు ప్రయోగిస్తార‌న్న విష‌యాన్ని ఇంకా ప్రక‌టించ‌లేదు. జీఎస్‌ఎల్‌వీ - డీ5 సోమవారం సాయంత్రం సరిగ్గా 4.50 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా, దానిక రెండు గంట‌ల ముందు ఇంజ‌న్‌లొని లోపాన్న గుర్తించారు శాస్త్రవేత్తలు. ముందుగా కాసేపు చ‌ర్చించి ప్రయోగం కొన‌సాగించాల‌ని భావించినా అత్యవ‌స‌రంగా స‌మావేశం అయిన శాస్త్రజ్ఞలు అది అంత మంచిది కాద‌ని తేల్చటంతో ప్రయోగాన్ని పూర్తి నిలిపివేశారు. 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి జీ శాట్-14 సమాచార ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగ‌లిగే జిఎస్ ఎల్వీ డీ 5లోపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్‌ ఉంది. జీఎస్‌ఎల్‌వీ డీ5 పొడవు 49.13 మీటర్లు, బరువు 414.75 టన్నులు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ ఉపగ్రహం వల్ల 12 ఏళ్లపాటు డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి సేవలు అందేవి. అయితే త్వర‌లోనే ప్రయోగానికి రెడీ అవుతామ‌న్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇస్రో సభ్యులు.

బీహార్‌ రైలు ప్రమాదంలో 35 మంది మృతి

  సోమ‌వారం ఉద‌యం బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. స‌హార్సా నుంచి పాట్రా వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున భ‌మారా రైల్వే స్టేష‌న్ల్‌లో ప్రమాదానికి గురైంది. వేగంగా వ‌స్తున్న ట్రైన్ ప్రయాణికుల మీద‌కు దూసుకెళ్లడంతో 12 మంది అక్కడిక్కడే మ‌ర‌ణించారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు డ్రైవ‌ర్‌ను లాగి కొట్టారు. కొన్ని భోగిల‌కు నిప్పు పెట్టారు. అయితే మ‌ర‌ణించిన వారులో ఎక్కువ‌గా మ‌హిళ‌లు చిన్న పిల్లల ఉన్నారు. కొంత మంది శివ భ‌క్తులు ప‌ట్టాల మీద నిల‌బ‌డి ఆందోల‌న చేస్తుండ‌గా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ వ‌చ్చింది. ఆ ట్రైన్‌కు అక్కడ స్టాప్ లేక‌పోవ‌డంతో ట్రైన్ చాలా వేగంగా వ‌చ్చింది దీంతో ఆందోళ‌న‌ను గుర్తించినా ట్రైన్‌ను ఆప‌లేక పోయారు అందువ‌ల్లే ప్రాణ న‌ష్టం అదికంగా సంభంవించింది. ఈ ప్రమాదం తో ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలకు అంత‌రాయం క‌లిగింది. ఇప్పటికే మృతుల సంఖ్య 35 కు చేర‌గా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు.

నీచుల కోసం అమరుడైన పొట్టిశ్రీరాములు

      ప్రస్తుత పరిస్థితి చూస్తే పొట్టిశ్రీరాములు స్వార్థపూరితమైన, నీచ రాజకీయ నాయకులూ, ఓట్ల కోసం అర్రులు చాచే కుష్టు బిచ్చగాళ్ళ కోసం తన విలువైన ప్రాణాలు అర్పించారేమో అనిపిస్తుంది. ఆ అమరజీవి శీలావిగ్రహాలను కూలదోస్తున్నారంటే అంత కంటే నీచమైన విషయం మరొకటి ఉండదు. రౌడీయిజం చేసి, హత్యలు చేసి రాజకీయ నాయకులైన వారి విగ్రహాలు మాత్రం అన్ని ఊళ్ళల్లో, ప్రతి సెంటర్ లో చెక్కు చెదరకుండా ఉంటాయ్. అదే మన దౌర్భాగ్యం.   తన ప్రాణాలను పణ౦గా పెట్టి సాధించిన తెలుగువారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డ్రామాలకు పై నుండి చూస్తే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో! ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించుదాం.

రాష్ట్రప‌తి పాల‌న విధించండి

  ఇరుప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌ల నేప‌ధ్యంలో రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. ఆ వ్యాజ్యాన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను ఈ నె ల‌26 కు వాయిదా వేసింది. దీనికి తోడు సీమాంద్ర జిల్లాల్లో నిర‌స‌న‌ల‌తో అన్నిచోట్ల ఎంసెట్ కౌన్సిలింగ్ నిలిచిపోవ‌డంతో కౌన్సిలింగ్ సజావుగా జ‌రిగేలా చూడాల‌ని కొంద‌రు విద్యార్ధులు కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ రెండు పిటిష‌న్‌ల‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు, దీనిపై వివరంగా ఆయా ప్రాంతాల అధికారుల నుంచి నివేదికలు తెప్పించి సమర్పించాలని డీజీపీతో పాటు ఆయా ప్రాంతాల ఐజీపీలను ఆదేశించింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో పాల‌న స్ధంబించింద‌ని ఇప్పటికే దాదాపుగా అంద‌రూ ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు క‌నుక ప్రభుత్వాన్నికొన‌సాగించేక‌న్నా రాష్టప‌తి పాల‌న విధించిన ప‌రిస్థితిని చ‌క్కదిద్దాల‌ని పిటీష‌న‌ర్ కోరారు. వీటికి తోడు ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన మరో పిటిషన్ను కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వానికి నోటిసులు పంపిన కోర్టు సమ్మెను నిరోధించేందుకు ఎటువంటి ముంద‌స్తు చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించింది.

హైద‌రాబాద్‌ ప్రత్యేక రాష్ట్రం: కావూరి

  తెలంగాణ ప్రక‌ట‌న అంశంపై కేంద్ర మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు ఎట్టకేల‌కు నోరువిప్పారు. రాష్ట్ర విభజన అంశంపై తమ మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రాకే అన్నారు. త‌ప్పని ప‌రిస్థితుల్లో రాష్ట్రాన్ని విభ‌జించాల్సి వ‌స్తే హైద‌రాబాద్‌ను  ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నారు. చాల రోజులుగా మౌనంగా ఉన్న ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. మూడు ప్రాంతాల రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ అభివృద్దిలో అంద‌రి కృషి ఉంద‌ని కాబ‌ట్టి హైద‌రాబాద్ అన్ని ప్రాంతాల వారికే చెందేలా నిర్ణయం ఉండాల‌న్నారు. త‌న మొద‌టి ప్రాదాన్యత మాత్రం స‌మైఖ్య రాష్ట్రానికే అని చెప్పారు. అధిష్టానం త‌ప్పకుండా విభ‌జ‌న నిర్ణయాన్ని పున‌రాలొచిస్తుంద‌న్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్వర‌లోనే అందుకు సంభందించిన ప్రక‌ట‌న కూడా వెల‌వ‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.ఈ అంశానికి సంబంధించి సాయంత్రం తొమ్మిది మంది సీమాంధ్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. అనివార్య మైన ప‌క్షంలో రాజీనామాల‌కు కూడా వెన‌కాడ‌మ‌న్న కావూరి, అధిష్టానం మీద ఇంకా న‌మ్మక‌ముంద‌న్నారు. ఎప్పటికీ స‌మైక్యవాదులుగానే ఉంటామ‌ని రాష్ట్ర౦ ముక్కలు కాకుండా చూడాల‌ని ఆంటోని క‌మిటీకి నివేదిస్తామ‌న్నారు. విభ‌జ‌న వ‌ల్ల శాస్త్రీయంగా ఎలాంటి న‌ష్టాలు వ‌స్తాయో క‌మిటీ ముందుంచుతామ‌న్నారు

కవిత, వి.హనుమంత్ రావుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు

      హైదరాబాద్ లో శనివారం విధ్యుత్ సౌధలో ఉద్యోగుల భోజన విరామ సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా తెలంగాణా ఉద్యోగుల ప్రదర్శన నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చి అక్రమంగా కోట్లు సంపాదించిన పెట్టుబడిదారులు చేస్తున్నదే సమైక్య ఉద్యమం అని విమర్శించారు.   " అలా అప్పుడు చెప్పులు లేని ఆ పాదాల దగ్గర కూర్చుని బాంచన్ కాల్మొక్తా" అని వాళ్ళు అనే వారని కొంతమంది ప్రజల అభిప్రాయం.   అలాగే  " తిరుమలలో సీమాంధ్ర ఉద్యోగులకు కొత్తగా ఏర్పడే తెలంగాణా రాష్ట్రంలో స్థానం లేదని" రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్ లో అందరూ ఉండొచ్చుఅనీ, ఆంధ్రవాళ్ళకి రక్షణ కల్పిస్తామని తెలంగాణా నేతలు అంటున్నారు. ఇది నమ్మదగ్గ విషయంలా లేదని కొంతమంది అనుకుంటున్నారు.  తెలుగు భాష మాట్లాడే అందరిదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి రాజధాని అయిన హైదరాబాద్ లో ఒక తెలుగు వాడికి మరో తెలుగు వాడు రక్షణ కల్పిస్తామని అంటున్నారు ఇది ఏ పాకిస్థాన్ లోనో, దుబాయ్ లోనో నివసించే తెలుగు వారికి రక్షణ కల్పిస్తామని అన్నట్టుగా ప్రజలు ఆశ్యర్య పోతున్నారు. దీనిపై పాఠకులను చర్చించమని కోరుతున్నాం. వారి వారి విలువైన అభిప్రాయాలను ఇక్కడ పోస్ట్ చేయమనికోరుతున్నాం.

టిడిపి హరికృష్ణ ఆత్మావిష్కరణ లేఖ

      తెలుగుదేశం ఎమ్.పి నందమూరి హరికృష్ణ మళ్లీ ఒక లేఖ రాశారు. తెలుగు జాతి కోసం అప్పట్లో నా తండ్రి ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు ఇప్పటికీ నా చెవుల్లో రింగురింగుమని మార్మోగుతూనే ఉన్నాయి. పార్టీ కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని శీరసావహించినా..ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటాను. ఆ దిశగానే ముందడుగు వేస్తున్నానని” ఆత్మావిష్కరణ పేరుతో నేడొక లేఖ విడుదల చేశారు. అయితే తన లేఖతో పార్టీకి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు.   ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని, విభజన కోసం కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది సీమాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని, తెలుగువారి మధ్య రాజుకున్న నిప్పు చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టిందని అన్నారు.

బీహార్‌లో ప్రయాణికులపై దూసుకెళ్ళిన రైలు

      బీహార్‌లో ఈరోజు తెల్లవారు జామున ఘోర రైలు ప్రమాదం సంభవించిది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 35కు పెరిగింది. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజ్యరాణి ఎక్స్ప్రెస్ భమారా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి దూసుకొని వెళ్ళింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్ను కొట్టడమే కాక, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు. దీంతో ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

రాజకీయ పార్టీలకి ఇది దీక్షా సమయం

  మరో ఏడెనిమిది నెలలలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్నందున, రాజకీయ పార్టీలు, నేతలు ఈ సమైక్యరేసులోతమ రాజకీయ శత్రువుల కంటే ముందుండాలనే ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతూ, పైకి మాత్రం ప్రజాభీష్టం మేరకే రాజీనామాలు చేసి ఉద్యమాలలో పాల్గొంటున్నామని, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే దీక్షలు చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. ఒకప్పుడు ఒక గొప్ప లక్ష్యం సాధించేందుకు బ్రహ్మాస్త్రంలా వాడబడిన ఆమరణ నిరాహారదీక్షలు, నేడు మన రాజకీయపార్టీల పుణ్యామాని వాటి విలువ కోల్పోయాయి. షుగర్, బీపీ వంటి అనారోగ్య సమస్యలున్న నేతలు సైతం ఏదో ఒక డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్షలకి కూర్చోవడం వారిని చూసి వారి రాజకీయ శత్రువులు కూడా దీక్షలకి కూర్చోవడం నేడు సర్వసాధారణ విషయమయిపోయింది. నాలుగయిదు రోజుల తరువాత, ఎటూ పోలీసులు తమ దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలిస్తారనే ధీమా ఉన్నందున నేతలు ధైర్యంగా ఈ ‘ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్షలకు’ కూర్చోనగలుగుతున్నారు.   నిన్న మొన్నటి వరకు ఒక మంత్రి గారి భార్యామణి చేసిన ఈ ఐదురోజుల ఆమరణ నిరాహార దీక్ష షరా మామూలుగానే ముగిసిపోయింది. కొద్ది నెలల క్రితం కరెంటు చార్జీలు తగ్గించాలంటూ ఐదురోజులు నిరాహార దీక్ష చేసిన వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మళ్ళీ సమైక్యాంధ్ర కోరుతూ నేటి నుండి గుంటూరులోఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు.   ఇక, ఆమెకు పోటీగా తెదేపా  శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ తదితరులు కూడా సోమవారం నుండి గుంటూరులో నిరవధిక దీక్ష చేపట్టనున్నారు.తెదేపా నేత దేవినేని ఉమ కూడా త్వరలో విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షల పోటీలో పాల్గొనున్నట్లు సమాచారం. అయితే, ఇటువంటి ఎత్తుగడలతో రాజకీయ చైతన్యవంతులయిన ప్రజలను ఆకట్టుకోవచ్చునని, వారిని భ్రమింప జేయవచ్చునని రాజకీయపార్టీలు భావించడం అవివేకమే.

'విభజన' వ్యతిరేక మహోద్యమ లక్ష్యం !

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     "విడివడితే గుఱ్ఱం గాడిదతో సమానమవుతుంద''ని తెలుగువాడు ఏనాడో అల్లుకున్న సామెతను, ఏకభాషా సంస్కృతుల బలమైన పునాదులు ప్రాతిపదికగా భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తెలుగువాళ్ళు 57 సంవత్సరాల తరువాత "విడిపోయి కలుసుందామనుకునే'' పరస్పర విరుద్ధమైన సూత్రీకరణపై ఆధారపడి పరస్పర ద్వేషాలు పెంచుకోవడం విచారకరం, ఖండనార్హం. 'విభజన' వితండవాదానికి ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికలేదో, రాజకీయ నిరుద్యోగులు పదవీకాంక్షతో ప్రారంభించిన ఉద్యమానికి కూడా సమర్థనీయమైన శాస్త్రీయ వివేచన లేదు. అందుకే "మాకు లెక్కలు వద్దు, మాది ఆత్మగౌరవ నినాదంపై ఆధారపడిన ఉద్యమం'' అని ఒక భాగంలోని తెలుగువాడే అందులోనూ సీమాంధ్రుడైన 'బొబ్బిలిదొర' "ఉద్యమం'' పేరిట ప్రారంభించిన తగాదా చిలికిచిలికి గాలివానై, "విభజించి-పాలించ''మన్న బ్రిటిష్ వలసపాలనావశేషమైన ''తురుపు''ముక్క నుంచి ఉత్తేజితురాలైన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం తెలుగుజాతినీ, సమైక్య రాష్ట్రాన్నీ "ఎన్నికల వ్యూహం''లో ఒక పావుగా చేసి విభజించడానికి నిర్ణయించిన తరుణంలో - కోస్తాంధ్ర, తెలంగాణా రాయలసీమ ప్రాంతాల ప్రజలమధ్య చిచ్చుపెట్టింది.   దేశంలోని ప్రతిరాష్ట్రంలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ప్రాంతాలమధ్య ఆర్థిక, సామాజిక అసమానతలు ఏదో ఒక మూల తలెత్తడం సహజం. పెట్టుబడి వ్యవస్థాపాలకులు ఈ పరిస్థితిని పరిష్కరించలేని దశలోనే, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడంద్వారా పదికాలాలపాటు అధికారస్థానాలకు అంటకాగి ప్రజావ్యతిరేక సంస్కృతికి అలవాటు పడతుంటారు; చివరికి ప్రజలపేరిట రూపొందించామని, ప్రజల సంక్షేమం కోసమే రూపొందించామని ప్రగల్భించే 'పథకాల'ను ప్రజారంజకంగా అమలుచేయడంలో విఫలమవుతూ ఉండటం వల్లనే 'వేర్పాటు' ఉద్యమాలకు కూడా పాలకపక్షాలే కారణమవుతూంటాయి. ఈ క్రమంలో లోపం ఎక్కడుందో దానిని కనిపెట్టి దాన్ని సకాలంలో సరిచేసే రాచబాటలు వదిలి, అందుకు తేలికైన పరిష్కారంగా ప్రజలమధ్యనే పాలకపక్షాలు తంపులు పెడతాయి. ఫలితంగా, ఈ పరిణామాలకు బాధ్యులయిన పాలకపక్షాలను తెంపరితనంతో అధికారం నుంచి ఊడబెరికే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించకుండా ప్రజలు 'విభజన'వలలో చిక్కకుండా తమ 'వోటు'హక్కును సద్వినియోగం చేసుకోవాలి. కాని ఆ ప్రజల హక్కునూ 'అవినీతి'కి ఆలవాలమైన అధికారపక్షాలు భ్రష్టుపట్టిస్తూ వచ్చాయి; నాయకులనే కాదు, అభ్యర్థులను సహితం ఎన్నికల సంతలో 'క్రయ-విక్రయ' సరుకులుగా మార్చుతున్నాయి.   నేడు తెలుగుజాతిని చీల్చాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ స్థాయిలో చేసిన తప్పుడు నిర్ణయం. ఆ నిర్ణయానికి లోబడిపోయిన ఒక ప్రాంతపు విద్వేషవాదులయిన రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నవారు "సీమాంధ్రుల దోపిడీ వల్లనే తెలంగాణా నష్టపోయింద''న్న అబద్ధపు ప్రచారం ద్వారా జాతి విచ్చిత్తికి పాల్పడ్డారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ద్వారానే వారివారి భాషా సంస్కృతులను పెంపొందించుకుంటూనే దేశసమైక్యతకు శ్రీరామరక్ష కాగలరన్న పలు తీర్మానాలకు రూపకర్త అయిన కాంగ్రెస్ నాయకత్వం ఈనాతితరం 66సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం సమైక్యరాష్ట్రాల విచ్చిత్తికి, భాషా రాష్ట్రాల పునాదులను స్వార్థబుద్ధితో, ఎన్నికల వ్యూహంలో భాగం చేసుకుంది. ఇది కాంగ్రెస్ లో కుక్కమూతి పిందెలుగా 1970లలో పుట్టుకొచ్చిన ఈనాటితరం! ఇందువల్లనే "విడిపోతేనే వికాసం'' అనీ, "విడిపోయి కలిసిఉందామ''న్న జాతి వ్యతిరేక నినాదాలకు అంకురార్పణ జరిగింది. కనుకనే తెలుగుజాతిలో భాగమైన తెలంగాణా ప్రాంతపు కృత్రిమ విభజనకు వ్యతిరేకంగా ఇతర రెండు ప్రాంతాలలోని [కోస్తా, రాయలసీమలు] ప్రజాబాహుళ్యం, ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, విద్యా, సాంస్కృతిక విభాగాలకు చెందిన అధికార, అనధికార శక్తులన్నీ తెలుగుజాతి సమైక్యతా స్ఫూర్తితో ఉద్యమించాల్సి వచ్చింది.   ఒకేజాతిగా ఉన్న భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ [విశాలాంధ్ర]ను విభజించరాదన్నరాష్ట్ర విశాల ప్రయోజనాలను కోరుకుంటున్న ఉద్యమకారులు దేశభక్తి, జాతిభక్తికన్నా విభజనను ప్రచారం చేస్తున్న కొలదిమంది రాజేకీయ నిరుద్యోగుల పాక్షిక 'ఉద్యమం' శ్రేష్ఠమైనదిగా ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలు పెంచుకొనేతప్పుడు వ్యూహంలో 'ఉత్తమం'గా భావించుకుంది. ప్రపచంలో ఎక్కడైనా సరే [ఇండియాసహా] విడిపోయేహక్కు లేదా 'స్వయంనిర్ణయ హక్కు' ఆ జాతి మొత్తానికి ఉంటుంది గాని, ఏక జాతిలో అంతర్భాగమైన ఒక భాగానికి ఉండదుగాక, ఉండదు.   అందుకే "సోవియట్ సోషలిస్టు సమాఖ్య'' "విడిపోయే హక్కు''ను జాతులకు ఖరారు చేస్తూ రాజ్యాంగ చట్టంలో హామీపడినప్పటికే ఏళ్ళపాటు ఏ ప్రత్యేక జాతీ సోవియెట్ పతనానికి దేశీయ పాలనా వ్యవస్థలోని స్వార్థపర శక్తులు సామ్రాజ్యవాద శక్తులతో 'లాలూచీపడి' దారితీసేంతవరకూ రిపబ్లిక్ నుంచి విడిపోలేదు! సోవియెట్ పతనం తరువాత, రష్యాగా పూర్వనామంతోనే పెట్టుబడి వ్యవస్థ పునరుద్దరణకు దారులు తీసిన తరువాత పాత సమాఖ్య నుంచి విడిపోయిన ప్రత్యేక రిపబ్లికలన్నీ అమెరికా సామ్రాజ్యవాద పాలనా వ్యవస్థ కుట్రలకు బలి అవుతూన్నాయని తెలుగువారు మరచిపోరాదు! సోవియెట్ సోషలిస్టు రిపబ్లిక్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్, అజర్ బైజాన్, కిర్గిజిస్థాన్ వగైరా కొన్ని రిపబ్లిక్ లలో అమెరికా సైనిక నివాసాలకు, అమెరికా క్షిపణులు కొన్నిటికి స్థావరాలుగా మారడమూ, ఇప్పుడు ఆ బెడద నుంచి బయటపడడానికి, పాత రిపబ్లిక్ లలోని ప్రభుత్వాలను స్థానిక ఎన్నికల్లో జోక్యానికి పాల్పడిన అమెరికా కుట్రలనుంచి తప్పించుకోడానికి నానాతంటాలు పడవలసి వచ్చిందని తెలుగుజాతిలోని వేర్పాటువాదులూ, స్వార్థపరులూ మరవరాదు, మరవరాదు!   1962 నాటికే చైనాకు వ్యతిరేకంగా అమెరికా శత్రు విమానాలకు భారతదేశాన్ని ఇంధనం నింపుకునే స్థావరంగా నాటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ రహస్యంగా అనుమతించడాన్ని అమెరికా గూఢచారి సంస్థ కొత్తగా వెల్లడించి సంచలనం సృష్టించింది. రహస్యంగా ఈ పనికి నాటి కాంగ్రెస్ ప్రభత్వం పూనుకోడాన్ని మరవరాదు! ఇరుగుపోరుగుతో సమస్యలు తలెత్తడం కొన్ని సందర్భాల్లో సహజం కావొచ్చు. కాని వాటిని శాంతియుతంగా పరిష్కరించుకునే తీరువేరు! అలాంటి సమస్యలు పాలకవ్యవస్థల మూలంగా తలెత్తేవిగాని ప్రజాబాహుళ్యం మాత్రం అందుకు కారణం కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల మధ్య పాలకపక్షాల వల్లనే ఉత్పన్నమవుతూ వచ్చేవేగాని, సామాన్య ప్రజాకోటికి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఈ వాస్తవాన్ని 1953కు ముందు తెలంగాణా ప్రజాబాహుళ్యంలో పెక్కు అట్టడుగు వర్గాలు [ఎస్.సి., ఎస్టీ, బడుగుబలహీన వర్గాలు] నిజాం నిరంకుశ పాలకులు, ఆ పాలనా శక్తికి చేదోడు వాదోడైన దొరలు, జాగిర్దారీ, దేశ్ ముఖ్, పటేల్, పట్వారీల దాష్టికాలకూ, చిత్రహింసలకూ గురవుతూ వచ్చారు; 'నీబాన్చను దొరా' అన్న సంస్కృతికి వీళ్ళంతా కష్టజీవులందరినీ గురిచేశారు. ఆనాటి పరిస్థితుల్ని తారుమారు చేసిన ఏకైక మహోద్యమం, రైతాంగ, కార్మిక, మధ్యతరగతి వర్గాల గ్రామీణ ప్రజలు పాల్గొన్న తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం మాత్రమేనని, ఆ పోరాటమే తెలుగుజాతిని భాషాప్రయుక్త రాష్ట్రంగా, ఒక్క తాటిపైకి తెచ్చి 'విశాలాంధ్ర' అవతరణకు సుసాధ్యం చేసిందని కలలో కూడా తెలుగువాడు మరవకూడదు. హైదరాబాద్ సంస్థాన విమోచన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సమీకరించిన సైన్యనిరహాల వల్ల జరిగిన పని - అంతకుముందు సాయుధ పోరాటం ధాటికి తట్టుకోలేక వివిధ నగరాలకెక్కిన దొరలు, జాగిర్దార్లు తిరిగి తెలంగాణా గ్రామసీమలకు మళ్ళి, అంతకుముందు సాయుధ పోరాట ఫలితంగా బడుగు బలహీనవర్గాలు అనుభవిస్తున్న పదిలక్షల ఎకరాలను పోలీసుల అండతో తిరిగి స్వాధీనం చేసుకున్న వైనాన్ని మరిచిన స్వార్థపర వర్గాలే, తిరిగి తెలంగాణా ప్రజలపైన తమ అధికారాన్ని స్థాపించుకోడానికి ఆ వర్గాలే ప్రజల పేరిట ప్రజావ్యతిరేక 'వేర్పాటు' ఉద్యమాన్ని ప్రారంభించారు!   ఉభయ ప్రాంతాలలోనూ ప్రజల అనేక త్యాగాల ఫలితం - ఆంధ్రప్రదేశ్ అవతరణ. 1953కు ముందు "హైదరాబాద్ స్టేట్'' [తెలంగాణా రాష్ట్రం అంటూ ప్రత్యేకంగా ఎన్నడూ లేదు. హైదరాబాద్ స్టేట్ లో మన తెలంగాణా ప్రాంతం ఒక భాగం మాత్రమే] కనుకనే తెలంగాణా వైతాళికులలో ఒకరైన పండిత సురవరం ప్రతాపరెడ్డి, చివరికి "హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్'' పుట్టుపూర్వాలను ప్రస్తావిస్తూ 1946లో తెలంగాణాలోని "ఆంధ్రమహాసభ'' 13వ సభ ముగిసిన తర్వాత ఏర్పడిన "హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్''లో ఉన్న సభ్యులు తెలంగాణా వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సభ్యులూ ఉన్నార''ని  తెలపాల్సివచ్చింది. కాగా, తెలంగాణలో "ఆంధ్రప్రాంతీయ సంఘం'' ప్రత్యేకించి "ఆంధ్రప్రాంతీయ సంఘం''గా మాత్రమే వ్యవహరించబడుతూ వచ్చిందని చెప్పారు! నాడు తెలుగువారికి తెలుగు స్కూళ్ళను పెట్టనివ్వక, తెలుగుబాషను "తెలంగీ-భేడంగీ'' అని తెలుగువారిని నిజాములు అవమాన పరిచారు. ఇందుకు మినహాయింపు, తెలుగు సాహితీపరులను, వారి రచనలను గౌరవించినవారు ఒక్క కుతుబ్ షాహీలు మాత్రమే, వారిలోనూ ఒక్క కులీ కుతుబ్ షాయే చివరిదాకా మన్ననలు పొందిన వాడు! ఈ పరిస్థితుల్ని వర్ణిస్తూ సురవరంవారు "బహు దీర్ఘకాలం నుండి మనం (తెలంగాణా ఆంధ్రులు) ఇతర రాష్ట్రీయ సోదరులకన్న వెనుకబడుటకు కారణము లేవో, అట్టి లోపములను రూపుమాపుకుని అగ్రస్థానం వహించడానికి కావలసిన సామాగ్రి గురించి విచారించాలి ... మనలో ఐకమత్యం లేదు. మనము జాతి, మత భేదములచే శాఖోపశాఖలుగా విభజింపబడి ఉన్నాం. లక్షకొలది bold సోదరులను మనము మనుష్యవర్గంలో లెక్కపెట్టక వారిని అంటరానివారిగా భావించి పశువులకన్నను, వృక్షములకన్నను, తుదకు ప్రాణంలేని (జడ) పదార్థములకన్నను హీనముగా భావించు చున్నాము'' bold end అని 1930 మార్చిలోనే నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించుతూ స్పష్టం చేశారు!   1953కు ముందు, అంటే 1948లో హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన రైతాంగసాయుధ పోరాటం వల్ల ప్రధానంగా విమోచన పొంది ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం ఏర్పడేదాకా, స్వాతంత్ర్య సమరయోధుడు బూర్గుల రామకృష్ణారావు "హైదరాబాద్ స్టేట్'' ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరితో సమైక్యాంధ్ర రాష్ట్ర అవతరణకు హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ, ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ అనుకూలంగా తీర్మానాలు దోహదం చేశాయి. అత్యధిక సంఖ్యాకుల ఆమోదంతోనే హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ [120 మందిలో వందమందికి పైగా] ''విశాలాంధ్ర''కు అనుకూలత వ్యక్తం చేసింది! అదిగో, ఈ పూర్వరంగంలోనే, తెలంగాణా "ఆంధ్రమహాసభ''లోని మితవాదవర్గానికి నాయకులుగా ఉన్న కె.వి.రంగారెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి మైనారిటీ వర్గం ఆరోజునుంచి మొన్నమొన్నటిదాకా [ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో పదవులు అనుభవిస్తూనే]లోపాయిగారీగా తెలుగుజాతి ఐక్యతకు తూట్లు పొడుస్తూనే వచ్చారు!   వీరూ, కొత్తతరంలోని రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న 'దొర'లు, తిరిగి పాత జాగిర్దారీ, పటేల్, పట్వారీ వర్గాలు మాత్రమే "ప్రత్యేక తెలంగాణా'' రాష్ట్ర ఏర్పాటు ద్వారా మరొకసారి తెలంగాణా ప్రాంతంలోని బడుగు, బలహీన, బహుజన వర్గాలపై పెత్తనం చెలాయించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు; అందుకోసమే తోటి తెలుగుప్రజలపైన అబద్ధాలాతో, బూతులతో స్వార్థపూరిత ఉద్యమాన్ని నిర్మించి, భ్రమలతో ప్రాంతీయ యువతను ఆత్మహత్యల వైపు నెట్టారు, నెడుతున్నారు. బెదిరింపులద్వారా తోటి తెలుగుప్రజలను ఉద్యోగులనూ భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చారు. అటు వైపున విడిపోకూడదనే వారూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగుజాతి విడిపోకూడదన్న వారిని శత్రువులుగా భావించి, ఉద్రిక్త వాతావరణాన్ని విభజనవాదులు సృష్టించారు; ఈ పరిణామం బెడిసిపోయి మరింత విషమ పరిణామాలకు దారితీయక ముందే సమైక్యతా ఉద్యమం బలంగా ముందుకు సాగుతూండడంతో అననుకూల పరిస్థితుల్లో "శాంతి'' మంత్రాన్ని ఉచ్చరించడంతో పాటు "హెచ్చరికల''కూ దిగుతున్నారు; ఇంతకుముందు తోటి ఆంధ్రులందరినీ మూకుమ్మడిగా "సీమాంధ్రులు తెలంగాణా నుంచి వెళ్ళిపోకపొతే చేతులు విరగ్గొడతాం, కాళ్ళు నరుకుతాం'' అనీ, "పులిమీద మనం ప్రయాణిస్తున్నాం దానిమీదనుంచి దిగినా, దిగకపోయినా సీమాంధ్రులు మనల్ని బతకనివ్వరు'' అన్న 'దొర' కెసిఆర్ అందించిన ఉన్మాదపూరిత నినాదాన్ని దారి తప్పిన కొందరు 'ప్రగతి'వాదులు కూడా అందిపుచ్చుకున్నారు! కాగా, వారి తాజా 'నినాదం' ఇప్పుడు "మాకు సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే శత్రువులుగాని, సీమాంధ్రప్రజలు మాత్రంకాద''ని బాణీ మార్చారు! ఆలస్యంగానైనా ఈ గుర్తింపు మంచిదే, నిస్పృహ నుంచి స్పృహలోకి వచ్చే ప్రయత్నం మెచ్చదగిందే. కాని "ప్రత్యేక తెలంగాణా''కు పచ్చజెండా వూపినట్టు కన్పించిన కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు చేసిన 'తీర్మానం' మాత్రం కేవలం ఆ పార్టీ ఆవరణకే పరిమితమైంది! రెండు ప్రాంతాలలోనూ అభాసుపాలైన కాంగ్రెస్ హైదరాబాద్ కేంద్రంగా ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో రెండు ప్రాంతాల ప్రభుత్వాలను 'నిర్వహించడం'ద్వారా 2014 నాటి ఎన్నికలలోకి దూకి సరైన విజయావకాశాలను పెంచుకోవాలని "గుంట కాడ నక్క''లా వ్యవహరిస్తోంది! ఈలోగా వెలువడుతున్న "సర్వేలు'' మాత్రం "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పడినా ఏర్పడకపోయినా కాంగ్రెస్ ఉభయ ప్రాంతాల్లోనూ ఉసురు నిల్పుకోలేదని జోస్యం పలకడం ఒక విశేషం! కనుకనే పనికిమాలిన "కమిటీల''తో, కెసిఆర్ తో మంతనాల ద్వారా కాలక్షేపం చేస్తోంది కాంగ్రెస్! ఈ రెండు శక్తులలో ఎవరు ఎవరిని ముంచబోతున్నారో ఇక ఎన్నికల "వెండితెర పైన'' చూసేలోపే రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియ కాస్తా కాంగ్రెస్ చేతులు దాటిపోయి, సమైక్యాంధ్రే నిలబడగల అవకాశాలు పెరుగుతున్నాయి! చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకున్న పరిణామ దశలోకి కాంగ్రెస్ ప్రయాణిస్తోంది!

సోనియాకు టెన్షన్..ప్రణబ్ కు మొర

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనసహా సరిహద్దులలో ఉద్రిక్తత, పార్లమెంటులో బిల్లుల ఆమోదం, రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం తదితర సమస్యలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె, ఒకనాటి తమ పార్టీ 'గడ్డు సమస్యల పరిష్కర్త', నేటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శరణుజొచ్చారని సమాచారం. రెండు రోజుల కిందట మధ్యాహ్న భోజన సమయంలో ఆయనతో భేటీ అయిన సోనియా, గంటన్నరపాటు అనేక అంశాలపై మాట్లాడారు. కానీ, వారి సంభాషణ సారాంశం ఏమిటో చెప్పలేమని పార్టీ వర్గాలు అంటున్నాయి.   అయితే, నియంత్రణ రేఖవద్ద పాక్ సైనిక మూకలు ఐదుగురు జవాన్లను బలిగొనడం, దాంతోపాటు దాదాపు 15 రోజులుగా కాల్పులు కొనసాగించడం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇక "సహనానికీ హద్దులుంటాయ''ని స్వాతంత్య్ర దినం ముందురోజున తన ప్రసంగంలో ప్రణబ్ పాక్‌ను గట్టిగానే హెచ్చరించారు. కానీ, మరునాడు ప్రధాని మన్మోహన్ ఎర్రకోట ప్రసంగం చప్పగా చల్లారిపోవడం సోనియాను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని భోగట్టా. అంతకుముందు కూడా పాక్‌పై మెతకదనం పనికిరాదని, మరింత కఠినవైఖరి అవసరమని పార్టీ ఒత్తిడి తెచ్చింది. ఫలితంగానే భారత్ వ్యతిరేక పాక్ జాతీయ చట్టసభ తీర్మానాన్ని ఖండిస్తూ మన పార్లమెంటులో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చేనెల ఆ దేశ ప్రధానితో మన్మోహన్ భేటీపైనా కచ్చితమైన సమాచారం పంపలేదనీ తెలిసింది. ఇవన్నీ అటుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై తన కలవరాన్ని అధినేత్రి ఆయనవద్ద వెళ్లబోసుకున్నారని సమాచారం. దీంతోపాటు తెలంగాణ, సీమాంధ్ర చిక్కుముడిపైనా వారు చర్చించినట్లు తెలియవచ్చింది.

సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం

      సీమాంద్ర లో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ మీద సీమాంధ్ర నేతలు నానా రభస చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని అభిప్రాయపడ్డారు. పదేళ్ల ఉమ్మడి రాజధానికి సుముఖం అని ఆంటోని కమిటీకి తెలిపారని, హైదరాబాద్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి హక్కులు ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిలో సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారని, తెలంగాణలో జనాలను రోడ్డు మీదకు ఎక్కకుండా అడ్డుకున్న వీరంతా సీమాంధ్రలో సోనియా చిత్రపటాలు తగలబెడుతున్నా, ఇందిరా, రాజీవ్ విగ్రహాలు కూల్చుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సీమాంధ్రలో జరుగుతున్నది రాజకీయ అధికారం కోసం జరుగుతున్న పోరాటం అని విమర్శించారు.   తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్నారు. కరీంనగర్ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రలు తెలంగాణ అంతటా నిర్వహిస్తారు.

విహెచ్ పై దాడిని ఖండించిన సోమిరెడ్డి

      కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుపై తిరుమలలోని అలిపిరి వద్ద సమైక్యవాదులు దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడారు. దాడులు తమ సంస్కృతి కాదని హరీష్‌రావు అంటున్నారని, అయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేసిందెవరని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో దళిత ఉద్యోగిపై హరీష్‌రావు దాడి చేయలేదా అని అడిగారు. తెరెస, బిజెపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. సమైక్య ఉద్యమం కుట్రపూరితమైనదని విహెచ్ రెచ్చగొట్టడం సబబుకాదని సోమిరెడ్డి అన్నారు.

తిరుమలలో విహెచ్ కి సమైక్య సెగ

      ఎట్టకేలకు భారీ భద్రత మధ్య తిరుమల కొండపైకి దిగిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకు సమైక్య సెగ తగిలింది. విహెచ్ వాహనాన్ని సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నెట్టేసేందుకు ప్రయత్నించారు. స్వల్పంగా లాఠీచార్జీ కూడా చేశారు. సమైక్యవాదుల్లో ఒకరి నుంచి విహెచ్ గులాబీ పూవు తీసుకున్నారు. తాము ఆందోళన చేయబోమని గులాబీ పూలు అందిస్తామని చెప్పడంతో పోలీసులు ఐదుగురికి అనుమతించారు. అయితే, అలిపిరి వద్ద విహెచ్ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు వి.హనుమంతరావును అక్కడి నుంచి సురక్షితంగా ముందుకు తీసుకుని వెళ్లారు.