తొలి సైనిక ఉపగ్రహ ప్రయోగం సక్సెస్‌

  భారతీయ తొలి సైనిక ఉపగ్రహం GSAT-7 శుక్రవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించారు. యూరొపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన భారీ రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్నినిర్ణీత కక్షలో ప్రవేశ పెట్టారు. ఫసిఫిక్‌ కోస్ట్‌లోని ఫ్రెంచ్‌గయానాలోని కౌరవ్‌ అంతరిక్ష కేంద్రం నుండి ఈ ప్రయోగం జరిగింది. ఎరియన్‌ 5 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఈ ఉపగ్రహం భూమికి 3600 కిలీమీటరల్ దూరం నుంచి తన తన పనిని చేయనుంది. ఈ ప్రయోగానికి దాదాపు 470 కోట్లు ఖర్చయినట్టుగా ప్రకటించారు. యుధ్ద నౌకల సమాచారం కమ్యూనికేషన్‌తో పాటు, రక్షణ చర్యలకు కావాల్సిన ఎన్నో వివరాలను తెలుసుకోవడానికి ఈ ఉపగ్రహం సహాయపడనుంది. ఇప్పటికే ఈ ఉపగ్రహానికి సంభందించిన అన్ని టెస్ట్‌లు నిర్వహించిన శాస్త్ర వేత్తలు శనివారం నుంచి ఉపగ్రహం తన పని మొదలుపెడుతుందన్నారు. గ్రహణ సమయంలో కూడా పని చేయటం ఈ ఉపగ్రహం ప్రత్యేకత.

జగన్ దీక్షతో వైకాపాకు మీడియా కవరేజ్

  వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా చంచల్ గూడా జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఆసుపత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారని అతని తల్లి విజయమ్మ మీడియాకు తెలిపారు. అతని బీపీ, షుగర్ స్థాయి పడిపోవడం, కీటోన్స్ కూడా తగ్గడంతో ఇంకా దీక్ష కొనసాగించడం ప్రమాదమని చెప్పినప్పటికీ ఆయన దీక్ష విరమించేందుకు అంగీకరించట్లేదని ఆమె తెలిపారు.   అందువల్ల బలవంతంగానయినా వైద్యులు అతనికి గ్లూకోజ్ ఎక్కేంచే అవకాశముంది. జగన్ మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించబోతున్నారనే వార్తలు వినగానే షరా మామూలుగానే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణుల, నేతల హడావుడి మొదలయిపోయింది. నిన్నటి నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు చంచల్ గూడా జైలు, ఉస్మానియా ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున చేరుకొంటున్నారు. తమ నేత దీక్ష భగ్నం చేసినందుకు తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తమ నేతను చూసేందుకు పోలీసులు అనుమతించనందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసారని మండిపడుతున్న సదరు నేతలు, కార్యకర్తలు మళ్ళీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందడం విడ్డూరం. అతని ఆరోగ్యపరిస్థితి రోజురోజుకి దిగజారుతున్నందున, అతని ఆరోగ్యం మరింత దెబ్బతినకూదడనే ఆలోచనతోనే పోలీసులు అతని దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అటువంటప్పుడు వైకాపా పోలీసులను నిందించడం అనుచితం. ఒకవేళ పోలీసులు అతనిని దీక్ష కొనసాగించనిచ్చినా రేపు అతని ఆరోగ్యం మరింత దెబ్బ తింటే, అప్పుడు కూడా వారు పోలీసులనే నిందిస్తారు.   నేడు  రాజకీయ నేతలుఏదో ఒక కారణంతో నిరాహార దీక్షలకు కూర్చోవడం, వారి దీక్షలను పోలీసులు భగ్నం చేస్తే, చేసారని నిందించడం, ఒకవేళ చేయకపోతే సదరు నేతల ఆరోగ్యం విషమిస్తున్నాకూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించడం పరిపాటయిపోయింది. దీక్షకు కూర్చొన్నప్రతీ ఒక్కరి డిమాండు ఏ ప్రభుత్వమయినా తీర్చగలదా? అనే ఆలోచన లేకుండా మీడియా కవరేజ్ కోసం, పార్టీకి ప్రజలలో గుర్తింపు తీసుకు రావడం కోసం ఈవిధంగా నిరాహార దీక్షల పేరుతో ప్రభుత్వాన్నిబ్లాక్ మెయిల్ చేయడం రాజకీయ నేతలకు పరిపాటయిపోయింది.   ఇంతకాలంగా జగన్ మోహన్ రెడ్డిని అతని పార్టీని వెలివేసిన మీడియా, అతను దీక్షకు దిగడంతో నేడు మళ్ళీ మంచి కవరేజ్ ఇస్తోంది. బహుశః జగన్ మోహన్ రెడ్డి అదే కోరుకొని దీక్షకు దిగి ఉండవచ్చును.   మొన్న విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షకు దిగినప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి ఆమెకు ఫోన్ చేసి ఆమెను దీక్ష విరమించుకోమని కోరడం, మళ్ళీ నేడు అతని ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే విజయమ్మ అతనిని దీక్ష విరమించుకోమని కోరడం, అందుకు అతను నిరాకరించాడని ఆమె బయటకి వచ్చి మీడియాకు చెప్పడం అంతా నాటకీయంగా ఉంది.   అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజల దృష్టిలో పెద్ద హీరోగా నిలబెట్టేందుకే వైకాపా ఈ డ్రామా నడిపిస్తోంది. సమైక్యాంధ్ర నినాదంతో సీమంధ్రలో పట్టు సాధించాలని తిప్పలు పడుతున్న వైకాపా, ప్రజలను ఆకట్టుకొనేందుకు వరుసపెట్టి ఇటువంటి తాత్కాలిక ఉపాయాలతో కధ నడిపిస్తోంది. పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ఆ పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోంది తప్ప పార్టీని బలపరచుకొని ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.

కొత్త పార్టీ ఆలోచనలో కిరణ్ ?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యల వల్ల రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. లోకవిరుద్ధంగా వెళ్తే ప్రజలు ఇంటికి పంపిస్తారని, సరైన సమనయం వచ్చినప్పుడు ముందుకు వస్తామని కిరణ్ చెప్పడంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో రకరకాల ఊహాగానాలకు రేకెత్తుతున్నాయి. అసలు ఎందుకు ఆయన అలా మాట్లాడారు, ఏం చేయబోతున్నారు అనే ప్రశ్న అందరికి కలుగుతుంది.   గురువారం రవీంద్ర భారతిలో జరిగిన 'తెలుగు భాషా దినోత్సవం'లో సందర్భంగా ప్రసంగించిన కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రసంగం చివరలో సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనపై సరైన నిర్ణయాలు తీసుకోకుంటే ప్రజలు సెలవు ప్రకటిస్తారని.... సమయం, సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా ముందుకు వస్తామని, తెలుగు ప్రజల పురోగతికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకుంటామని, ఎంత కష్టమైన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఇవ్వాలని తెలుగు తల్లిని వేడుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, సొంత పార్టీ పెడతారని రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

రూపాయి పాపం ప్రభుత్వానిదే

  మరో 15 రోజుల్లో పదవి విరమణ చేయనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనంతో పాటు ప్రస్థుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోబానికి ప్రభుత్వం ఆర్ధిక మంత్రి చిదంబరమే కారణం అన్నారు. దేశం ప్రగతిని తాకట్టు పెట్టినమరి తమ స్వలాభాల కోసం కేంద్రం పాకులాడుతుందని ఘూటుగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక కష్టాలకు ప్రభుత్వం అసంబద్ధ ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు.   అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటన వల్ల రూపాయి కుప్పకూలిందనడం సరికాదన్నారు. దేశీయంగా సరైన చర్యలు లేఖపోవటం, ప్రణాలికా బద్దంగా ఆర్ధిక శాక వ్యవహరించకపోవటం అందుకు కారణం అన్నారు.

జగన్ దీక్ష భగ్నం

  సమైఖ్యాంద్ర కోసం గత ఐదురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్ష వల్ల బీపీ, షుగర్ లెవల్స్ స్థాయి పడిపోవడం, కీటోన్స్ కూడా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి, కట్టుదిట్టమైన భద్రత మధ్య చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగన్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా లేనప్పటికీ... దీక్షను కొనసాగిస్తే మాత్రం కష్టమని ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పోలీసులకు వివరించారు. దీక్ష విరమించాలని అధికారులు కోరినప్పటికీ జగన్ తిరస్కరించడంతో...ఉన్నతాధికారుల సూచన మేరకు జగన్‌ను అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ తల్లి విజయలక్ష్మి, భార్య భారతి కూడా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు.

రాజీనామాలు చేసి జనంలోకి రండి

  విభజన ప్రకటనతో సీమాంద్రలో భారీ ఎత్తున నిరసనలు వెళ్లువెత్తుతున్న నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఎంపీలతో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం అయ్యారు. వాడివేడిగా జరిగిన చర్యల్లో నేతలను ఇంకా ఎందుకు రాజీనామ చేయలేదని జేఎసి నాయకులు నిలదీశారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకునేలా రాజకీయా నాయకులు కూడా కార్యచరణ చేపట్టాలని నాయకులు పై ఒత్తిడి తెచ్చారు. ఇంకా ఏం సాదించటానికి మీరు పదవులలో కొనసాగుతున్నారు. సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను కేంద్రానికి తెలియజేయటంలో మీరు పూర్తిగా విఫలమయ్యారంటూ నాయకుల పై మండిపడ్డారు. రాజీనామాలు చేయకుండా జనంలో ఎలా తిరగాలనుకుంటున్నారు, మీరు రాజీనామ చేస్తే తిరిగి మిమ్మలన్ని గెలిపించుకునే పూచీ మాది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో  ఎంపీలు కేవీపీ రామచంద్రారావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, కావూరు సాంబశివరావు, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జెడీ శీలం, కిల్లి కృపారాణి ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

సమైక్యవాదమంటే ప్రేమోన్మాది చేసే యాసిడ్ దాడి వంటిదే

  టీ.జేయేసీ చైర్మన్ ప్రొఫెస్సర్ కోదండరామ్ తెలంగాణావాదులను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు సీమంధ్రలో జరుగుతున్న సమైక్యఉద్యమం ప్రేమోన్మాది చేతిలో యాసిడ్ వంటిదని అన్నారు. సమైక్యవాదులు ఇతరుల హక్కులను, స్వేచ్చను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణకు అడ్డుపడితే ఊరుకొబోమని, తెలంగాణా సత్తా ఏమిటో చాటి చెపుతామని ఆయన అన్నారు. సెప్టెంబర్ 7న సిటీ కాలేజ్ నుంచి ఇందిరాపార్కు వరకు జరిగే తెలంగాణ సాధన ర్యాలీలో తెలంగాణా ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలను అడ్డుకొనేందుకు మళ్ళీ ప్రజలందరూ ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉందని అన్నారు. అందుకే సెప్టెంబర్ 1నుండి 6వరకు వరుసగా గ్రేటర్ హైదరాబాద్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్ లలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు నిర్విహించబోతున్నామని వాటిలో ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.   విద్యార్ధుల జీవితాలు తీర్చిదిద్దవలసిన ప్రొఫెసర్ కోదండరామ్ ఆపని చేయక చాల కాలమే అయ్యింది. మంచి వక్తగా పేరున్నఆయన ప్రతిభను కేసీఆర్ గుర్తించి తెలంగాణా ఉద్యమంలోకి ఆహ్వానించడంతో ఆయన దశ తిరిగింది. ఆయన తన జీవితమంతా ఆచార్యుడిగా పనిచేసినా రాని పేరు ప్రతిష్టలు, గుర్తింపు, రాజకీయంగా ఎదిగే అవకాశం అన్నీకూడా కేసీఆర్ మరియు తెలంగాణా ఉద్యమాల పుణ్యామని సంపాదించుకొన్నారు. టీ.జేయేసీ చైర్మన్ గా ఆయన కేసీఆర్ తో సమాన హోదా, పేరు ప్రతిష్టలు, సంపాదించుకొన్నతరువాత, ఆయన ఇప్పుడు కేసీఆర్ కే సవాలుగా మారారు. కేసీఆర్ చేపడుతున్న ఉద్యమాలకి సమాంతరంగా తాను ఉద్యమాలు నడుపుతూ ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారు.   వచ్చేనెల 7వ తేదీన ఆంధ్ర యన్.జీ.ఓ.లు హైదరాబాదులో లక్షమంది ఉద్యోగులతో తలపెట్టిన బహిరంగసభను అడ్డుకొనేందుకు కేసీఆర్ 6వ తేదీన రెండు లక్షల మందితో హైదరాబాదులో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిస్తే, ప్రొఫెసర్ కోదండరామ్ సెప్టెంబర్ 7న శాంతి ర్యాలీ జరపాలని పిలుపునీయడం, కేవలం తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.   తెలంగాణా కోసం పోరాడుతున్న కేసీఆర్ తో, తెరాసతో ఆయన కలిసి పనిచేయలేన్నపుడు, తెలంగాణావాదులందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునీయడం హాస్యాస్పదం. లక్షలాది ప్రజలను రోడ్లపైకి రప్పించి సాటి తెలుగు ప్రజలతోనే యుద్దానికి పురిగొల్పడం వలన ఎటువంటి దారుణ పరిణామాలు ఎదురవుతాయో తెలిసి కూడా ఈవిధంగా రెచ్చగొట్టడం ఆయన వంటి ఉన్నత విద్యావంతుడు చేయవలసిన పని కాదు.   రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న ఆంధ్ర యన్.జీ.ఓ.లు కూడా ఇటువంటి ప్రమాదకరమయిన ఆలోచనలు మానుకోవాలి. ఉన్నత విద్యావంతులయిన ఇరుపక్షాల నేతలు కూడా ఇప్పుడు తమ ఆశయసాధనకు విజ్ఞతకు బదులు మంద బలం ఉపయోగించాలనుకోవడం చాలా అవివేకం. తమ ఆశయ సాధన కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం చాల హేయమయిన ఆలోచన. ఇటువంటి ఆలోచనలను ఎవరు చేసినా ఖండించాల్సిందే.

ఉస్మానియాకు వైయస్‌ జగన్‌

  సమన్యాయం చేయాలంటూ లేదంటే రాష్ట్రన్ని సమైక్యంగా ఉంచాలంటూ జైలులోనే దీక్ష చేపట్టిన వైయస్‌ జగన్‌ దీక్షను గురువారం అర్ధరాత్రి పోలీసులు భగ్రం చేశారు. ఆగస్టు 24 నుంచి దీక్షకు దిగిన జగన్‌ను గురువారం రాత్రి 11.58 గంటలకు బలవంతంగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జగన్‌ తన దీక్షను ఆసుపత్రిలో కూడా కొనసాగిస్తున్నారు. జగన్‌ బిపితో పాటు షుగర్‌ లెవల్‌, పల్స్‌ రేట్‌ పడిపోయినట్టుగా డాక్టర్లు చెపుతున్నారు. ప్రస్థుతం జగన్‌ ను ఉస్మానియా ఓపి బిల్డింగ్‌లోని ఏఎంసీయూ 116 నెంబర్‌ గదిలో ఉంచారు. అయితే జగన్‌ ఎటువంటి వైద్యాని సహకరించటం లేదని, పోలీసులు డాక్టర్‌లు ఎంత చెప్పిన వినటం లేదని ఉస్మానియా హాస్పిటల్‌ ఆర్‌ఎంఒ చెప్పారు.

గోడ మీద పిల్లిలా పార్టీలు

      తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ఉద్యోగులకు గానీ, హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు గానీ వ్యతిరేకం కాదు. ప్రపంచంలోనే అత్యంత శాంతియుతంగా ఒక్క రక్తం చుక్క చిందకుండా గత 13 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తరవాత, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇప్పుడు సీమాంధ్ర నేతలు, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ విమర్శించింది. సీమాంధ్రలో ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.   తెలంగాణ మీద నిర్ణయం వచ్చాక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం అంటోంది. మరి ఇంతకుముందు తెలంగాణలో తిరిగినప్పుడు, దీక్షలు చేసినప్పుడు విజయమ్మ, జగన్, షర్మిలలు ఇలా ఎందుకు అనలేదు ? తెలంగాణ రాకముందు అనుకూలమని చెప్పి, ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండుకళ్ల సిద్దాంతంతో మాట్లాడుతున్నారు. మీకు తెలంగాణ అంటే ఇష్టం లేకుంటే సమైక్యానికి అనుకూలం అని ధైర్యంగా చెప్పండి కానీ గోడ మీద పిల్లిలా వ్యవహరించడం మానుకోవాలని టీఆర్ఎస్ నేతలు మందా జగన్నాధం, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు అన్నారు.

షర్మిలా బస్సు యాత్ర

        ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బస్ యాత్ర సెప్టెంబర్ ఒకటిన ఆరంభం కాబోతుండగా, మరోవైపు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన షర్మిల కూడా బస్ యాత్ర సెప్టెంబరు రెండు నుంచి ఆరంభిస్తున్నారు. సెప్టెంబరు 2 వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సుయాత్ర మొదలు పెడతారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయకూడదని, ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తూ బస్సుయాత్ర చేయనున్నారు. ఇటీవలనే పాదయాత్ర ముగించుకుని షర్మిల తిరిగి బస్సుయాత్ర చేపట్టనుండడం గమనార్హం. సెప్టెంబరు రెండునే హరికృష్ణ కూడా ఆయన తండ్రి స్వస్థలమైన నిమ్మకూరు నుంచి యాత్ర చేయవచ్చని అంటున్నారు. అది కూడా జరిగితే సీమాంద్రలో ముగ్గురు నేతలు యాత్రలు చేస్తున్నట్లవుతుంది.

జగన్ కేసులపై విభజన ప్రభావం

    రాష్ట్ర విభజన ప్రభావం కేవలం ప్రజల మీదనే కాక జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై కూడా పడవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులలో ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, కార్యాలయాలు, ఆస్తులు, వ్యవహారాలు ఉన్నందున సీబీఐ పని మరింత కష్టమవుతుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి విషయ సేకరణ, అనుమతులు, చట్టపరమయిన నిబంధనలు వగైరా అన్నీ సీబీఐకి ప్రతిబంధకంగా మరే అవకాశం ఉంది.   అదేవిధంగా రెండు రాష్ట్రాలలో ఏర్పడే ప్రభుత్వాలను బట్టి కూడా కేసు తీరు తెన్నులు మరే అవకాశం ఉంది. ఒకవేళ సీమాంధ్ర, తెలంగాణా రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడినట్లయితే కేసు   యధావిధిగా సాగవచ్చును. ఒకవేళ తెలంగాణాలో తెరాస లేదా కాంగ్రెస్-తెరాస సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి, సీమంధ్రలో జగన్ పార్టీ ప్రభుత్వం ఏర్పరచగలిగితే కేసులు నత్తనడకన సాగవచ్చును. ఒకవేళ తెలంగాణాలో తెరాస, సీమంధ్రలో తెదేపా ప్రభుత్వాలు ఏర్పరచగలిగితే కేసులు రేసుగుర్రంలా పరుగులు తీయవచ్చును. ఎందుకంటే సీమాంధ్రకు చెందిన జగన్ మోహన్ రెడ్డి ఆఖరి నిమిషంలో తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డాడడనే అక్కసుతో తెరాస ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహకరిస్తే, వైకాపాను దాని అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ప్రధమ విరోధిగా భావిస్తున్న తెదేపా కూడా సీబీఐకి పూర్తి సహకరించవచ్చును. ఇవిగాక అనేక ఇతర అంశాలు కూడా జగన్ కేసును తీవ్ర ప్రభావితం చేయవచ్చును.

ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్

      ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు,కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ నేపాల్ సరిహద్దులో అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ దిల్‌సుఖనగర్‌లో జరిగిన రెండు జంట పేలుళ్ల కేసులో భత్కల్ సూత్రధారి. ఇటీవల అరెస్టైన అబ్దుల్ కరీం అలియాస్ తుండ ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు భత్కల్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూరు, పుణే, ఢిల్లీ, నాగపూర్ తదితర నగరాల్లో పేలుళ్లలో ఇతని పాత్ర ఉంది. ఇతని పైన రూ.20 లక్షల రివార్డ్ ఉంది. భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌లోని లష్కరే తయ్యాబాతో భత్కల్‌కు సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్‌ను కేంద్ర హోంశాఖ ధృవీకరించింది.

మెగాస్టార్ బాటలో కెసిఆర్..!!

      తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్ళిన కె.చంద్రశేఖరరావు..కాంగ్రెస్ అదిష్టానంతో విలీన౦ పై చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ సాధారణంగా ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతుంటారు. కాని ఈ సారి ఆయన మీడియాతో మాట్లాడకుండానే విమానం ఎక్కేసారు. దీంతో టీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడిందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.   కెసిఆర్ ప్రస్తుతం ఢిల్లీలో విలీనం గురించి కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ డిమాండ్ ను ప్రస్తావించినట్లు ఢిల్లీ వర్గాల బోగట్టా. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే...తన కూతురు..కొడుక్కి పదవులను అడిగిన కెసిఆర్ హరీష్ రావు గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. తనకు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ పదవి, తన కొడుకు కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి, కూతురు కవితకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముందు వుంచినట్లు తెలుస్తోంది.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక...కాంగ్రెస్ ఎదిరించి పార్టీని నడపడం కష్టమని అనుకున్న కెసిఆర్...ఈ విషయంలో జగన్ రూట్ కన్నా చిరంజీవిని రూటే బెటరని భావిస్తున్నాడు.

సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదు : గీతారెడ్డి

  సెప్టెంబర్‌ 7న ఎపి ఎన్జీవోలు తలపెట్టిన సభ వివాదాస్పదమవుతుండటంతో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ విషయం పై స్పందించిన రాష్ట్ర మంత్రి గీతారెడ్డి. ఎపి ఎన్జీవోలు సభ పెట్టుకోవచ్చన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగానే అంగీకరించాం. సభ పెట్టుకోవడానికి అభ్యంతరాలు ఎందుకు చెపుతామన్నారు. శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకొవచ్చని చెప్పారు. అయితే శాంతి భద్రతల పరిస్థితిని బట్టి సభకు లభించటం లభించకపోవటం ఉంటుందన్నారు. గీతారెడ్డి నివాసంలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సంధర్బంగా రాష్ట్రంలో తాజా పరిణామాలమై చర్చించిన నేతలు తరువాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎంతో సమ్యనం పాటిస్తున్నారన్న ఆమె సీమాంద్ర నాయకులు, ప్రజలు విభజనకు సహకరించాలని కోరారు. సీడబ్ల్యూసిలో తీసుకున్న హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప వేరే దేనికి అంగీకరించబోమని ప్రకటించారు.

రోగానికి పన్నేసిన రాష్ట్ర సర్కార్‌

  రాష్ట్ర పభుత్వం నిర్ణయాలు తుగ్లక్‌ పాలనను తలపిస్తున్నాయి. అప్పట్లో జుట్టుకు చదువుకు ఇలా రకరకాల పన్నులు ఉండేవట అని పుస్తకాల్లో మాత్రమే చదివాం. ఇప్పుడు అంతకన్నా విచిత్రమైన పన్నులను వేస్తుంది మన ప్రభుత్వం. కర్మ కాలి రోగం వచ్చినా దవాఖానాలో ఉన్నందుకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఆదాయం కోసం ఇప్పటికే బాండ్లను కూడా అమ్ముకుంటున్న మన రాష్ట్ర సర్కారు ఇప్పుడు సామాన్యుడి ఆరోగ్యానికి కూడా వెలకడుతుంది. ఇతర రాష్ట్రల్లో ఎక్కడా లేని విధంగా ఐసియూ ఉన్న హాస్పిటల్స్‌ లగ్జరీ ట్యాక్స్‌ కట్టాలంటూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు నోటీసుల జారీ చేసింది. ఐసియూలో ఉన్న పడకల సంఖ్యను బట్టి ఈ పన్నును నిర్ణయించారు. దీంతో ఇక ఆ పన్నును రోగినుంచే వసూలు చేయడానికి సిద్దమవుతున్నాయి ఆసుపత్రి యాజమాన్యాలు. అసలై ప్రైవేట్‌ దవాఖానాల దోపిడితో విలవిలలాడుతున్న రోగులు ఇప్పుడు పన్ను పోటుతో మరింత కుదేలవుతున్నారు. తీవ్రమైన జబ్బులు, అరుదైన సమస్యలతో బాధపడే వారిని రోజుల తరబడి ఐసీయూలోనే ఉంచుతారు. ఇక అలాంటి వారికి వైధ్యం మరింత భారం కానుంది.