pcc president

డిల్లీలో బొత్స బాబు హడావుడి

  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోడ్డు మ్యాపులు పట్టుకొని డిల్లీలో హడావుడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పనబాక, పురందేశ్వరి, శీలం, కావూరి, పల్లం, కోట్ల తదితర కేంద్ర మంత్రులందరూ కూడా సమైక్యవాదులే అయినప్పటికీ, రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి వారందరూ ఎప్పుడో కట్టుబడిపోయారు గనుక ఇక వారితో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయాల వద్దా? అని చర్చించే పనిలేదు. అందువల్ల, బొత్స బాబు వారినందరినీ కలుస్తూ వారి సలహా సంప్రదింపులు తీసుకొని తన రోడ్డు మ్యాపుకు ఫైనల్ టచ్ అప్స్ ఇస్తున్నట్లు భావించవచ్చును.     సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన ప్రక్రియలో రోడ్డు మ్యాప్ గీసిచ్చే భాగ్యం ఆయనకి దక్కడం గొప్ప విషయమే అయినప్పటికీ, వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీని వైజాగ్ కి రప్పించే ప్రయత్నంలో ఎవరినీ సంప్రదించకుండా తమ్ముడ్ని వెంటేసుకొని విమానం ఎక్కి జర్మనీ వెళ్లి ముక్కు మొహం తెలియని వాడిచేతిలో రూ.11కోట్ల పెట్టి వచ్చి, ఆనక ‘సొమ్ములు పోనాయి నానేటి సేసేది?’అని అడిగినట్లు, తన మ్యాపులో గీతలు వంకరపోయి దానివల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఏదయినా నష్టం జరిగితే ఆనక జనాలకి జవాబు చెప్పుకోవడం అంత వీజీ కాదని అర్ధమయినందువల్లనేమో, ఎందుకయినా మంచిదని ఆయన డిల్లీలో కనబడిన ప్రతీ తెలుగు మంత్రిని కలిసి తన మ్యాపుని చూపించి వారిచేత ఒకే చేయించుకొంటున్నారు. అందువల్ల రేపు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా ఎవరూ తనను తప్పు పట్టకుండా ఉండాలని కొంచెం ముందు చూపుతో ఆయన వ్యవహరిస్తున్నట్లుంది. అది కూడా ఒకందుకు మంచిదేనని చెప్పవచ్చును. ఆయనొక్కడూ ఏదో తనకు తోచిన గీతలు గీసుకొని వెళ్లి అధిష్టానం చేతిలో పెట్టి చక్కారావడం కంటే అన్ని ప్రాంతాల నేతలను కలిసి రాష్ట్ర విభజన సమయంలో వారివారి ప్రాంతాలలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించగలిగితే విభజన జరిపే ముందుగానే వాటికి సరయిన పరిష్కార మార్గాలు కనుకొనే అవకాశం ఉంటుంది. మరి బొత్స బాబు ప్రస్తుతం అదే పని మీద ఉండి ఉంటే ఆయనని మెచ్చుకోక తప్పదు.

kcr

కేసీఆర్ ఇంట్లో ఈ లొల్లేంది

  ఇప్పటికీ అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసీఆర్ కి ఇప్పుడు స్వయాన్నతన అన్న కూతురే తనపై మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేయడం ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలయిన వేగులపాటి రమ్య కొద్ది వారాల క్రితం తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఆధ్వర్యంలో, కేసీఆర్ ఇంటి ముందు 'వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు' అనే ఒక నిరసన కార్యక్రమం చెప్పట్టాలనుకొన్నారు. దానికోసం ఒక పోస్టర్‌ కూడా సిద్దం చేసి దానిని విడుదలకు జరిపిన ఒక సభలో, ఆమె తన పెదనాన్న కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. దానికి ఆగ్రహించిన తెరాస మహిళా నేతలు కరీంనగర్ లో రమ్యకు చెందిన ఒక ఫంక్షన్ హాలుపై దాడి చేసి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.   రమ్య మొన్ననే ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పిర్యాదు కూడా చేశారు. ఈ రోజు ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి, తనకు తన కుటుంబానికి కెసిఆర్ మరియు తెరాస కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని, అందువల్ల తమకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఆమె పిర్యాదుని స్వీకరించిన మానవ హక్కుల సంఘం ఈ అంశంపై వచ్చే నెల 8వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ పోలీసు సుపరెండేంట్ కు ఆదేశాలు జారీ చేసింది.   ఇది టీకప్పులో తుపానులా త్వరలోనే సమసిపోవచ్చును, కానీ ఈ సంఘటన కేసీఆర్ కుటుంబకలహాలను బయట పెట్టింది.

telangana chandrababu

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: బాబు

      తెలంగాణపై మహానాడులో తీర్మానం చేశామని, తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అమరులైనవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో మరింత స్పష్టత ఇస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. తాము అధికారంలోకి రాగానే రూ10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కేటీఆర్ వసూళ్లపై టీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతామని బాబు తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలుస్తాయని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని బాబు వెల్లడించారు. టీడీపీ హాయంలో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని తెలిపారు.

cbi

మోడీ కోసం తవ్విన గోతిలో కాంగ్రెస్

  గుజరాత్ లో 2004లో జరిగిన ఒక ఎంకౌంటర్ లో ముంబై కి చెందిన ఇష్రాద్ అనే 19 ఏళ్ల యువతి కూడా మృతి చెందింది. అది భూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు వెల్లువెత్తడంతో, కేంద్రం సీబీఐని దర్యాప్తుకి ఆదేశించింది. సీబీఐ కూడా చాలా చురుకుగా దర్యాప్తు చేసి, ఇది ఖచ్చితంగా భూటకపు ఎన్కౌంటరేనని తేల్చి చెప్పడమే కాకుండా దీనితో సంబంధం ఉందని భావించిన అనేక మంది గుజరాత్ పోలీసు అధికారులను కూడా అదుపులోకి తీసుకొంది. దాదాపు 1200 పేజీల చార్జ్ షీట్ కూడా తయారు చేసింది.   అయితే, ఇష్రాద్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత మార్చేందుకు మానవబాంబుగా శిక్షణ తీసుకొన్నయువతి అని ఇంటలిజన్స్ బ్యురో 2009 లోనే నాటి హోంమంత్రి చిదంబరానికి ఒక లేఖ వ్రాసింది. అదే విధంగా అమెరికాలో పట్టుబడ్డ డేవిడ్ హెడ్లీ కూడా ఇష్రాద్ పేరుని ప్రస్తావించాడు. అయితే ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) హోంమంత్రికి వ్రాసిన లేఖ గురించి, హెడ్లీ చెప్పిన అంశాల గురించి కేంద్రానికి పూర్తి సమాచారం ఉన్నపటికీ, సీబీఐ ను విచారణకు ఆదేశించడం, సీబీఐ అది భూటకపు ఎన్కౌంటర్ అని తేల్చి చెప్పడం జరిగిపోయింది.   కానీ, సీబీఐ అధికారులు తమను కూడా వేదిస్తున్నారంటూ ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) డైరక్టర్ హోంశాఖకు వ్రాసిన లేఖ బయటపడటంతో, ఒక్కసారిగా ఈ తెర వెనుక భాగోతం కూడా బయటపడింది.   మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తీసుకు వచ్చి రాహుల్ గాంధీకి సవాలు విసురుతున్న తమను కట్టడి చేయడానికే, కేంద్రం, సీబీఐ రెండూ కలిసి ఈ నాటకమంతా ఆడాయని గ్రహించిన బీజేపీ కాంగ్రెస్ కు, సీబీఐకి ఈ విషయంలో అనేక ప్రశ్నలు సందించింది. కానీ వాటికీ జవాబు ఇవ్వకుండా, త్వరలోనే మోడీ అసలు రూపం బయటపడుతుందని కాంగ్రెస్ బీజేపీని ఇంత కాలంగా ఎద్దేవా చేస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు అకస్మాతుగా ఐ.బీ. వ్రాసిన లేఖ బయటపడటంతో కాంగ్రెస్ పని కుడితిలో పడిన ఎలుకలా తయారయింది.   సుప్రీంకోర్టు ఇటీవలే సీబీఐని ‘అనేక యజమానుల చేత ఆడించ బడుతున్న పంజరంలో చిలుక’గా అభివర్ణించిన కొద్ది రోజులకే, సీబీఐ మళ్ళీ అత్యుత్సాహానికి పోయి మరో మారు కోర్టు తనకిచ్చిన పేరుని సార్ధకం చేసుకొంది.   ఐబీ అధికారులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూ సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తాము హైకోర్టు ఆదేశాల మేరకే వారిని విచారణ చేస్తున్నామని, ఇష్రాత్ కేసులో ఐబి ప్రమేయం కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పడం విశేషం. అంటే, ఐబీని కూడా ఈ కేసులో దోషిగా భావిస్తున్నదా? అనే సంగతి ఇంకా సీబీఐ స్పష్టం చేయవలసి ఉంది.   ఈవిధంగా రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంత తీవ్రమయిన కేసులో ఇంత తీవ్రమయిన ఆరోపణలు ఒకరిపై మరొకరు గుప్పించుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. మోడీ కోసం తవ్వుతున్న గోతిలోనే తాను కూడా నిలబడి ఉన్నట్లు కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. ఇప్పుడు ఆ గోతి లోంచి ఎవరు బయటపడుతారో కాలమే చెపుతుంది.

Andhra Pradesh congress

ఒకటి లేదంటే మూడు రాష్ట్రాలు

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. లేకుంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా విభజించాలి. అంతేకాని రాయలసీమను రెండుగా విభజిస్తే ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. రెండు వైపుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది అని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వివరించారు. తెలంగాణ మీద త్వరలో ఓ నిర్ణయం వస్తుందన్న ప్రచారం, రాయల తెలంగాణ ఏర్పాటు అన్న ఊహాగానాల నేపథ్యంలో వారు తమ వాదనను వినిపించారు. ఇక హైదరాబాద్ విషయం తేల్చిన తరువాతనే తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడాలని, లేకుంటే రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విభజిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ అన్నారు.  

congress telangana

కోర్ కమిటీలో తెలంగాణ పై నిర్ణయం?

      రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పార్టీ అదినేత్రి సోనియాగాంధీతో బేటీ ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రూపొందించిన నివేదికను ఈ సంధర్బంగా ఆయన సోనియాగాంధీ కి అందజేశారని సమాచారం. ఈ నివేదిక ఆధారంగా కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణాపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయానికి వచ్చే అవకాశంమున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్న దిగ్విజయ్ కేంద్ర హోం మంత్రి షిండేతో కూడా సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. కోర్ కమిటీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా రాష్ట్ర నేతల నుంచి కూడా రోడ్ మ్యాప్ లు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. సోనియాతో భేటీకి ముందు దిగ్విజయ్ సింగ్ రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తికరంగా ఉంది.

vijayamma

సానుభూతే ఆయుధంగా బరిలోకి దిగుతున్న వైకాపా

  జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక ముందు అతను, ప్రమాదంలో మరణించిన తండ్రి రాజశేఖర్ రెడ్డి నామస్మరణ చేస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేసారు. కొత్తగా పెట్టిన తన రాజకీయ పార్టీని పటిష్టపరుచుకొనేందుకు అతను దాదాపు ఏడాదిపాటు ఓదార్పుయాత్ర సాగించిన తరువాత అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. నాటి నుండి పార్టీ భాద్యతలను తమ భుజస్కంధాల మీద వేసుకొన్న అతని తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు అతని అరెస్టుతో మరో కొత్త అస్త్రం దొరికింది. అదే సానుభూతి అస్త్రం. (రాజశేఖర్ రెడ్డి) సెంటిమెంట్ తో బాటు, నాటినుండి జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారంటూ ప్రజలకి చెప్పుకొంటూ వారి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబుని అసమర్ధులు, అవినీతిపరులు అని దుయ్యబట్టడం, వైయస్సార్- సెంటిమెంట్ మరియు జగన్-సానుభూతి అనే పాయింట్ల మీదనే వారిరువురూ గత ఏడాది కాలంగా మాట్లాడుతున్నారు తప్ప వేరే కొత్తగా మాట్లడేందుకు ఏమీ లేదు.   మళ్ళీ ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున, విజయమ్మ మరో మారు ఈ ‘సెంటిమెంట్-సానుభూతి’ అస్త్రాలను ప్రజల మీదకి ప్రయోగిస్తున్నారు. ఈ సారి విజయమ్మ ముఖ్యమంత్రి మీద తాజాగా మరో కొత్త ఆరోపణ కూడా చేసారు. ఆయన డిల్లీ వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ జైలు నుండి విడుదల చేయవద్దని, ఈ లోగా తానూ పార్టీని బలపరుచుకొని ఎన్నికలలో గెలవగలనని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తనకు డిల్లీ నుండి ఖచ్చితమయిన సమాచారం ఉందని ఆమె చెప్పడం మరో విశేషం. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరిని అడిగారో, దానిని ఎవరు విని ఆమెకు చేరవేసారో మాత్రం తెలియదు.   రెండు నెలల క్రితం సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి పెట్టుకొన్న బెయిలు పిటిషను తిరస్కరిస్తూ, సీబీఐకి నాలుగు నెలల గడువు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. నాలుగు నెలలలోగా సీబీఐ గనుక తన దర్యాప్తు పూర్తి చేయలేకపోతే, అప్పుడు ఆయన క్రింద కోర్టులో మళ్ళీ బెయిలు పిటిషను దరఖాస్తూ చేసుకోవచ్చునని ఆనాడే సుప్రీంకోర్టు స్పష్టమయిన తీర్పు చెప్పింది. అంటే జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ నెలాఖరు వరకు బెయిలు కోరేందుకు అవకాశం లేదన్న మాట.   మరి ఈ విషయాన్నీదాచిపెట్టి, విజయమ్మ ముఖ్యమంత్రి తన కొడుకుని ఎన్నికలు ముగిసే వరకు జైలులో నిర్బంధించి ఉంచమని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు చెప్పడం చూస్తే, చివరికి తన కొడుకు జైలులో నిర్బందించబడటాన్ని కూడా ఎన్నికల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతుంది.   సైన్యాధ్యక్షుడు లేకుండా యుద్ద రంగంలో అడుగుపెట్టబోతున్నసైన్యంలా ఉన్న తమ పార్టీని, ఎన్నికల కురుక్షేత్రంలోగెలిపించు కోవడానికి ఆమె సానుభూతినే ఆయుధంగా వాడుకోక తప్పడం లేదు. పాదయాత్రలతో విలువయిన తన సమయం వృధా చేసుకొంటున్న షర్మిల, తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నిచి ఉంటే పార్టీకి ఇటువంటి దుస్థితి వచ్చేది కాదేమో.

food security bill

కిరణ్ సర్కారుని గట్టున పడేసిన ఆహార భద్రత

  ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్వంత ఇమేజ్ పెంచుకొనేందుకు గత కొంత కాలంగా అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వేల కోట్ల వ్యయం అయ్యే ఈ పధకాలను రాష్ట్ర ఖజానాకి మోయలేని భారంగా మారినప్పటికీ, తన రాజకీయ ప్రయోజనాలకోసం, ముఖ్యమంత్రి ఇంకా కొత్త కొత్త పధకాలు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే వీటికి అవసరమయిన నిధులు ఎక్కడి నుండి రాలుతాయని ప్రశ్నించుకొంటే, అవి వివిధ రకాల పన్నుల రూపేణా మళ్ళీ ప్రజల జేబులోంచే రాబట్టక తప్పదని అర్ధం అవుతుంది.   ముఖ్యమంత్రి మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ‘మన బియ్యం’ అనే పధకం మొదలుపెట్టారు. ఇందులో కిలో బియ్యం రూపాయి చొప్పున దాదాపు రాష్ట్రంలో 2.26 కోట్ల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఇస్తున్నారు. ఈ బియ్యం సబ్సీడీ కొరకు రాష్ట్ర ఖజానాపై దాదాపు ఏడాదికి రూ. 9,600 కోట్ల భారం పడుతోంది. దానిని సమకూర్చుకోవడానికే తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ ఉగాది పండుగ సందర్భంగా ‘అమ్మ హస్తం’ అనే మరో కొత్త పధకం ప్రారంబించింది. ఇందులో 9 రకాల సరుకులు కేవలం రూ. 185లకే ఇస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఏడాదికి రూ. 660 కోట్ల పైమాటే. మళ్ళీ మొన్న వేల కోట్ల వ్యయం అయ్యే ‘బంగారుతల్లి’ పధకాన్ని కూడా ముఖ్యమంత్రి మొదలుపెట్టారు.   రాష్ట్ర ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న ఈ పధకాల భారం అంతిమంగా ప్రజలే మోయవలసి ఉంటుందనేది చేదు నిజం. అయితే, కేంద్రం మొన్న ఆహార భద్రత బిల్లుని ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఊరట లభించింది.   మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్రం ఆమోదించిన ఈ బిల్లువల్ల, ప్రస్తుతం ఈ సంక్షేమ పధకాలపై రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న ఆర్ధిక భారం సగానికి సగం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రజలకి ఆహార భద్రత కల్పించడం మాటెలా ఉన్నపటికీ, ఈ బిల్లుతో ఒడ్డుననపడిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ త్వరలో మరికొన్నికొత్త పధకాలను ప్రకటించుతారేమో.

Ramya Kcr

కేసీఆర్ ను చికాకు పెడుతున్న కూతురు రమ్య

      తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు ను ఆయన అన్న కుమార్తె రమ్య చికాకు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఈ నెల ఏడును కెసిఆర్ కు వ్యతిరేకంగా నిర్వహించబోతున్న కార్యక్రమానికి మద్దతు ఇచ్చి పోస్టర్ విడుదల కార్యక్రమంలో రమ్య పాల్గొని కెసిఆర్ ను విమర్శించారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇప్పుడు ఈ విషయం కెసిఆర్ కు తలనొప్పిగా మారింది. కెసిఆర్ నుంచి తమకు ప్రాణహాని వుందని, టీఆర్‌ఎస్ తో విభేదించినందుకే తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆమె తెలిపింది. టీఆర్‌ఎస్ మాజీ నేత చింతాస్వామితో కలిసి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లిన రామ్య తమకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం విశేషం. త్వరలో డీజీపీ దినేష్‌రెడ్డిని కలిసి రక్షణ కల్పించాల్సిందిగా కోరతామన్నారు.

vijayamma mopidevi jail

మోపిదేవిని బలిపశువు చేశారు: విజయమ్మ

      జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. జగన్ ని జైలు కు పంపేందుకు మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని విమర్శించారు. మోపిదేవి కుటు౦బం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన సందర్భంగా కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ... మోపిదేవి వారం రోజుల్లో బయటకు తీసుకువస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. 26 జివోల కేసుల్లో ఒక్కొక్కరికీ ఒక్క న్యాయమా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన కష్టంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొని వస్తే..దాని ప్రతిఫలంగా ఆయన పేరును అప్రతిష్ట చేసేందుకు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారని అవేద్ధాన్ వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.  ప్రతి పంచాయతీలో పార్టీ విజయం సాధించాలని, పార్టీ జెండా రెపరెపలాడాలని ఆమె తెలిపారు.

trs party

టీఆర్ఎస్ పార్టీ మాయం

      రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి హాజరయ్యారు. సకల జనుల సమ్మె కొనసాగి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. అనుకూల ప్రకటన వచ్చే సమయానికి కేసీఆర్ ఢిల్లీలో రూ.500 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారు. అటు సమ్మెను, ఇటు ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆరోపించారు. కేసీఆర్ ఏ మీటింగ్‌లోనూ సోనియాను విమర్శించలేదని , దానికి కారణమేంటో అందరికీ తెలుసన్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకువచ్చి మంత్రి పదవి వచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేసింది నేనేనన్నారు. అలాంటి శ్రీహరి విశ్వాసం లేకుండా నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

state division issue

పాలన గాలికొదిలి రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ రాజకీయాలు

  తెలంగాణా ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న తెలంగాణా అంశాన్నిరాజకీయ పార్టీలన్నీకూడా ఒక రాజకీయ అంశంగానే భావిస్తూ, దానిని ఏవిధంగా తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఎత్తులు వేయడం, తెలంగాణా ప్రజలని అపహాస్యం చేయడమేనని చెప్పవచ్చును. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టవలసి ఉంటుంది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత కాలంగా సాగదీస్తూ వచ్చింది. తన పార్టీ సభ్యులే రెండు వర్గాలుగా వేర్వేరు వాదనలు వినిపిస్తూ ఉద్యమాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతికి మూల కారణమయితే, వారిని అదుపుచేయకపోగా వివిధ కారణాలరీత్యా వారిని వెనుక నుండి ప్రోత్సహించడమో లేక ఉపేక్షిస్తూ పరిస్థితిని మరింత జటిలం చేసింది.   నేటికీ ఆ పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంన్నపటికీ కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని చోద్యం చూస్తున్నాయి. అంటే, నేటికీ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఒక స్పష్టమయిన నిర్ణయానికి రాలేదని అర్ధం అవుతోంది. ఒకవేళ నిజంగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొని ఉండి ఉంటే, నేడు రెండు ప్రాంతాలలోఆందోళనలు చేస్తున్నతన పార్టీ నేతలను తప్పక అదుపుచేసి ఉండేది.   కానీ, కాంగ్రెస్ నాయకత్వం అటువంటి ప్రయత్నాలేవీ చేయకపోవడంతో, మళ్ళీ సీమంధ్ర నేతల సమైక్య డ్రామా మొదలయింది. వీరు ఇక్కడ ఏదో ఒక వాదన చేయడం, దానిని అక్కడి కాంగ్రెస్ నేతలు ఖండిస్తుండటం ఒక నిత్యకృత్యంగా మారిపోయింది.   నిన్న మొన్నటి వరకు సమైక్యవాదం వినిపించిన కావూరి, ఇప్పుడు మంత్రి పదవి పుచ్చుకోవడంతో ఇప్పుడు ఈ సమస్యపై జాతీయ ద్రుక్పధంతో మాట్లాడాలని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం చూస్తే వారి ఉద్యమాలపట్ల నిబద్దత ఏపాటిదో, దేనికోసం చేస్తున్నారో అర్ధం అవుతుంది.   తెరాస తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టినప్పటికీ, దానిని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రమంతా వ్యాపింపజేసింది మాత్రం కాంగ్రెస్ నేతలే. ఈ వ్యవహారంలో ఒకరికి తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవాలనే తాపత్రయమయితే, మరొకరికి పదవుల కోసం, ఇంకొకరికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాటం. అందుకు అమాయకులయిన ప్రజలను, ఉడుకు రక్తంగల విద్యార్ధులను వాడుకొని ఇదంతా వారి ప్రయోజనాలు కాపాడేందుకేనని నమ్మ బలుకుతున్నారు. ఈవిధంగా రాజకీయ పార్టీలు, వాటి నేతలు ఉద్యమాలతో రాజకీయాలు చేస్తూ తమ భవిష్యత్తుని నిర్మించుకొంటుంటే, వారి మాటలు నమ్మి వారి వెనుక తిరుగుతున్న ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు వారి భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు.   రాష్ట్రంలో ఇంత అశాంతి నెలకొని ఉన్నపటికీ, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తూ ఒకసారి రాయల తెలంగాణా అని మరోసారి మరొకటి అంటూ ఆ పరిస్థితులను మరింత జటిలం చేస్తోంది. వీటివల్ల రాజకీయ పార్టీలకి, వాటి నేతలకి వచ్చే నష్టం ఏమిలేకపోయినా, ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టబోతున్నారు.   పరిపాలనా వ్యవహారాలూ చూసుకోవడానికి ఎన్నుకోబడిన శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఉద్యమాల పేరిట పరిపాలనను గాలికొదిలేసి తిరుగడం కేవలం జవాబు దారీ లేకపోవడమే. అయితే దీనిని ప్రశ్నించే వారు కాని, వ్యవస్థ గానీ లేకపోవడంతో ఇది కొనసాగుతోంది. దీనినే ‘కాంగ్రెస్ మార్క్ పరిపాలన’ అంటారేమో మరి తెలియదు.

Congress gears up for elections with Food Bill

భద్రత ఆహారానికా అధికారానికా ?

....సాయి లక్ష్మీ మద్దాల       మొత్తం మీద ఆహార భద్రత చట్టాన్ని ఆర్డినెన్సు ద్వారా పట్టాలెక్కించేసింది సోనియా గాంధి ఆధ్వర్యం లోని మన్మోహన్ ప్రభుత్వం. ఎన్నికల ఘంటికలు మ్రోగటానికి సిద్ధంగా ఉన్న తరుణాన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్. ఈ ఆహారభద్రత పధకానికి వీరు ఖర్చు పెట్టబోయేది 1,25,000 కోట్లు. దీని ద్వారా లబ్ధి పొందబోయే ప్రజలు దాదాపు 85 కోట్ల మంది. అంటే దేశ జనాభాలో సగానికి పైగా పేదవారే ఉన్నారా?మరి ఈ 60సం॥ ల కాలంలో భారతదేశం ప్రజల అభివృద్ధిని దోచుకున్నది ఎవరు?తగినంత పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహారం భద్రత కల్పించటంతో పాటు వారి గౌరవ ప్రదమైన జీవనానికి దోహదపడటం ఈ కీలక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే ఏటా 5కోట్ల 50లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని చౌక ధరలకు పంపిణి చేస్తూ,లక్షల కోట్ల రూపాయల భారాన్ని నెత్తిన మోస్తున్నామన్నది కేంద్రపాలకుల వివరణ. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే ఏటా మరో 70లక్షల టన్నుల ధాన్యం అవసర మన్నది తద్వారా ప్రభుత్వంపై మరో 25,000కోట్ల భారం పడుతున్నదని ఇప్పటి వివరణ.    ఈ చట్టం ద్వారా ఎంతమంది పేదలకు కడుపునిండా ఆహారం దొరుకుతుందో అనుమానమే. ఎందుకంటే ప్రజా పంపిణి వ్యవస్థ నిండా ఉన్నది అవినీతి పందికొక్కులే కనుక. అయితే ఆహారభద్రత కల్పించటమంటే ఒక చట్టాన్ని చేసి,ప్రజలను అందునా పేదవారిని ఊరించటమా!పేదల ఓట్లే రేపటి తమ అధికారానికి ఆశల మెట్లు  అని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాని నానాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినంత ఆహార ఉత్పత్తి ఎలా అనే విషయం మీద ఎందుకు దృష్టి పెట్టటం లేదు?వ్యవసాయానికి నిధులకేటాయింపు తీరు దేశ ఆహారభద్రతకు భరోసా ఇవ్వలేక పోతోంది. ఎరువులు,విత్తనాలు,సాగునీటి సౌకర్యాల కల్పనపై బడ్జెట్ లో ఎలాంటి ప్రతిపాదనలు,కేటాయింపులు ఉండవు. ఆహార భద్రత చట్టం ఉద్దేశాలు,లక్ష్యాలు నెరవేరాలంటే వ్యవసాయం దాని అనుబంధ రంగ మైన పాడి పరిశ్రమకు నిధులు మరింత పెరగాలి. పాడి పశువుల నిర్వహణకు,అవుతున్న ఖర్చుకు,పాలధరకు మధ్య పొంతన లేక పాడి రైతులు పాడికి దూరమవుతున్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం ?ఉపాధి హామీ పధకానికి 33,000కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పటమే తప్ప దానిని వ్యవసాయానికి ఊతంగా మారుస్తామన్న దిశగా మాటలే లేకపోవటం శోచనీయం. కూలీలు దొరకక,వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేక పంటలు పండిచటం ఎలా సాధ్యం?            అధిక దిగుబడుల సాధనకు నిధుల కేటాయింపులు చాల కీలకం. దేశంలో 58%ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమేనని తాజా ఆర్ధిక సర్వే వెల్లడి చేసింది. దేశంలో పేదల ఆహార అవసరాలు తీర్చడానికి వచ్చే ఏడాదికి 90,000కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో కనీసం మూడోవంతైన వ్యవసాయానికి కేటాయించకపోవటం ఎంత దారుణం. ఆరుగాలం కష్టపడిన రైతుకు శ్రమ ఫలితంగా తగిన గిట్టుబాటు ధర ఇవ్వటం న్యాయమా లేక ఓట్ల రాజకీయాల కోసం ఉచితబియ్యం లాంటి పధకాలు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు కుమ్మరించటం న్యాయమా అన్నది పాలకులకే తెలియాలి. రెండు దశాబ్దాలుగా పండించేవాడిని చెండుకుతినేలా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకాల కారణంగా రోజుకు రెండు వేలమంది  రైతులు  సేద్యాన్ని   వదిలేస్తున్నారు. ఈ కఠోర వాస్తవ గణాంకాలు దేశ ఆహార భద్రతకే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.             నిస్సార మవుతున్న నేలలు,అడుగంటుతున్న భూగర్భ జలాలు,సాగునీటి కొరత,వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు అన్నిటికి మించి నేడు మార్కెట్లో నడుస్తున్న రైస్ మిల్లర్స్ అసోసిఎషన్ దంద ! బియ్యం ధరలను ఆయా మిల్లుల యాజమాన్యాల అసోసియేషన్ లు  నిర్ణయిస్తు మార్కెట్ ను వారి గుప్పెట్లో పెట్టుకుంటే సదరు రాజకీయ నేతలు అందులో భాగస్వాములై ఏమి పట్టనట్లు ఉన్న పాపం ఎవరికి?ఇన్ని రకాలుగా రైతును నలుచుకు తింటూ అన్న దాతను పస్తుపెట్టి ఆహారభద్రత అంటూ తమ అధికారానికి భద్రత పెంచుకుంటున్న చేతకాని పాలకులను ఏమనాలి?ఈదేశానికి పట్టిన చీడ అనా లేక దౌర్భాగ్యమన?    

cbi

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలికేను

  సుప్రీంకోర్టు సీబీఐని పంజరంలో చిలకలుగా వర్ణించినప్పటి నుండి దానికి అదే పేరు స్థిరపడిపోయింది. దానిని సార్ధకనామధేయంగా చేసుకోవడానికి సీబీఐ కూడా శక్తి వంచనా లేకుండా ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి డీ.యం.కే. మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన గంటలోగానే, చెన్నైలో కరుణానిధి కొడుకు ఇంటి మీద సీబీఐ చిలుకలు వాలిపోయి ఒకటే హడావుడి చేసేసరికి, వాటి విశ్వసనీయత చూసి కేంద్రమే ముక్కున వేలు వేసుకొంది.   మళ్ళీ మొన్నామధ్య రైల్వేమంత్రిగారు బన్సాల్ గారి మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వే శాఖలో ఒక కీలకమయిన పోస్టుమీద అశోక్ కుమార్ అనే పెద్దాయన మనసు పారేసుకొంటే, దానిని ఆయనకు ఇప్పించేందుకు పది కోట్లు బేరం చేసుకొని, అందులో కేవలం రూ.89.68 లక్షలు మాత్రమే అడ్వాన్సుగా స్వీకరిస్తుంటే, సైంధవుడిలా అడ్డుపడిన సీబీఐ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు మంత్రిగారి మేనల్లుడిని, ఆయనకు లంచం మేపుతున్న పెద్దమనుసులని పట్టేసుకొంటే, పాపం అన్నెం పున్నెం తెలియని మంత్రిగారి పదవి పుటుక్కున ఊడిపోయింది.   ఆయన మంత్రి పదవి ఊడగొట్టిన తరువాత ఇప్పుడు తాపీగా “ఆయన నిజంగానే అన్నెం పున్నెం తెలియని వ్యక్తి. ఆయన ఇంట్లో బేరసారాలు అయినంత మాత్రాన్న ఆయనకేమి ముట్టినట్లు కాదు. అయినా ఆ సమయంలో ఆయన ఇంట్లో లేడు వాకింగ్ కో షాపింగు కో బయటకి వెళ్ళేడు కూడా. అందువల్ల, మేనల్లుడు తన ఇంట్లో సాగించిన వ్యవహారం గురించి అసలతనికి తెలిసే అవకాశమే లేదు. అసలు ఆయన మేనల్లుడితో ఈ వ్యవహారం గురించి ఫోన్లో మాట్లాడిన దాఖలాలు లేనే లేవు. మేనల్లుడికి లంచం మేపిన వ్యక్తితో బన్సాల్ మంత్రిగారు అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు గాక, ఆ పది కోట్ల డీల్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఒట్టు!” అంటూ మాజీని చేసిన మంత్రిగారికి సీబీఐ చిలుకలు క్లీన్ చిట్ ఇస్తూ కిలకిలమన్నాయి.   అయితే, అసూయపరులయిన ప్రతిపక్షనేతలు కొందరు ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏమయినప్పటికీ మంత్రిగారు చాలా పెద్దమనిషని మనకి అర్ధమయిపోయింది.

chandrababu

పంచాయతీ నిధులు దోచుకున్న కాంగ్రెస్ దొంగలు

      పంచాయతీ నిధులను కాంగ్రెస్ దొంగలు దోచుకున్నారని, నాటి వైఎస్ నుంచి నేటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు వీరికి డబ్బుమీద ద్యాస తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోరని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా రైతుల రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్‌ను అడ్డం పెట్టుకుని ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్లు దోచుకున్నారని, ఆంకా దోచుకోడానికి పార్టీ పెట్టారని, అలాంటి పార్టీలకు ఓట్లు వేయకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. మొదట నుంచి ప్రజలకోసం పనిచేస్తుంది, సమస్యలపై పోరాటం చేస్తోంది ఒక్క టీడీపీయేనని చంద్రబాబు పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికలలో టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.   అంతకుముందు ఉత్తరాఖండ్ సహాయక చర్యల్లో పాల్గొని విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్ వినాయకం కుటుంబాన్ని చంద్రబాబునాయుడు పరామర్శించారు. పూతలపట్టు మండలం చిన్నబండపల్లి వినాయకం కుటుంబాన్ని పరామర్శించి రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి ఆకుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే చూస్తామని చంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్ వేలితో కాంగ్రెస్ కన్ను పొడుస్తున్నతెరాస

  కాంగ్రెస్ పార్టీ తన చేతి వాటం ప్రదర్శించి తెలంగాణాని ఎత్తుకు పోవడంతో కంగుతిన్న తెరాస నేతలిప్పుడిపుడే మెల్లగా కోలుకొంటున్నారు. ముందుగా కోలుకొన్న కేసీఆర్, కాంగ్రెస్ తో విలీనం ప్రసక్తి లేదని ప్రకటించి, దానిని కొంత దారిలోకి తెచ్చుకోన్నాక, ఆ మరునాడే ఆయన కుమారుడు ఈ నెల 23లోగా తెలంగాణా ఇస్తే, తాము మాటకు కట్టుబడి తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మరో ఆఫర్ ఇచ్చారు. “కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే, దిగ్విజయ్ సింగ్ ప్రకటించినట్లే పదిరోజుల్లో కాకపోయినా, కనీసం పంచాయితీ ఎన్నికలు మొదలయ్యేలోగానైనా తెలంగాణా ప్రకటించాలి. అప్పుడు ప్రజలే కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపిస్తారు. కానీ, ఆలోగా ఇవ్వకపోతే వారిచేతిలో కాంగ్రెస్ భూస్థాపితం కాక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి ఇదే ఆఖరి అవకాశం” అని ఆయన అన్నారు.   కేటీఆర్ ఈవిధంగా డిమాండ్ చేయడం పైకి చాల సహజంగానే కనిపిస్తున్నపటికీ, దానివెనుక కాంగ్రెస్ తాజా వాగ్దానంతోనే కాంగ్రెస్ పార్టీని ఇరికించి, రానున్న పంచాయితీ ఎన్నికలలో ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీయాలనే ఆలోచన దాగి ఉంది. ఒక్క తెరాసకే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకి కూడా కాంగ్రెస్ పదిరోజుల్లో తెలంగాణా ఇవ్వలేదని నమ్ముతున్నారు. గనుకనే, కేటీఆర్ కూడా కాంగ్రెస్ కు తన వాగ్దానం గురించి మరో మారు గుర్తు చేసి, అది ఇవ్వకపోతే ఏమిచేయాలో తెలంగాణా ప్రజలకు హిత బోధ చేస్తున్నారు.   ఈవిధంగా తెరాస నేతలందరూ కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తూ, అది ఎలాగూ పదకొండో రోజున గతంలో లాగే ‘పది రోజులంటే పది రోజులు కాదంటూ’ చెప్పక తప్పదు గనుక, అప్పుడు కాంగ్రెస్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, పంచాయితీ ఎన్నికలలో పూర్తి ఆధిపత్యం సంపాదించవచ్చుననే ఆలోచనతోనే ఈవిధమయిన డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా మళ్ళీ మరో మారు తనకు తానే పదిరోజుల డెడ్ లైన్ విధించుకొని మరో పెద్ద పొరపాటు చేసింది. ఆ పొరపాటుకి పంచాయితీ ఎన్నికలలో అది మూల్యం చెల్లించేలా చేయడమే తెరాస లక్ష్యం.   ఈ వంకతో తెరాస ఎన్నికలలో ఆదిపత్యం సంపాదించగలిగితే, ఇంత వరకు తనపై వచ్చిన ఆరోపణలన్నీ గాలికి కొట్టుకొనిపోతాయని తెరాస అభిప్రాయం. అందువల్ల ఎన్నికలు దగ్గిరపడుతున్న కొద్దీ తెరాస తన డిమాండును మరింత గట్టిగా వినిపిస్తూ, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తమని మరోసారి మోసం చేసిందనే భావన కల్పించే ప్రయత్నాలు తప్పక చేస్తుంది.

సోనియాని కోదండరామ్ ఎలా కలుస్తారు!

        తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్, ఇతర నేతలు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరపడాన్ని టిడిపి మండిపడింది. కుట్రలు, కుతంత్రాలు చేసే కాంగ్రెస్ బాటలోనే ఐకాస నడుస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. సమైక్యాంద్ర సభలు పెట్టాలని దిగ్విజయ్ సింగ్ సీమాంద్ర కాంగ్రెస్ నేతలని ప్రోత్సహించారని టిడిపి నేత రేవంత్ రెడ్డి తెలిపారు. సీమాంద్ర లో సభలు పెట్టాలన్న దిగ్విజయ్ సింగ్ ను కొదండరామ్ ఏ మేరకు సబబని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చేపాల్సిన బాధ్యత కోదండరామ్ కు ఉందని ఆయన అన్నారు.   రాజకీయ పార్టీలు మోసం చేశాయని చెబుతున్న జెఎసి నేతలు తెలంగాణ ప్రజల బలిదానాలను కాంగ్రెస్ కాళ్లమీద పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సాధనే లక్ష్యమంటున్న కోదండరామ్ తదితరులు సోనియాగాందీ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ ను వెలివేయాలని అనుకుంటుంటే, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఫోటోలు దిగుతుంటే ఎలాంటి సందేశం ఇస్తున్నారని రేవంత్ విమర్శించారు.

జగన్ పార్టీలో చేరిన మోపిదేవి కుటుంబం

      జగన్ అక్రమాస్తుల కేసులో నిందుతుడిగా చంచల్ గూడ జైలులో వున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ విజయమ్మ సమక్షంలో మోపిదేవి సోదరుడు హరనాథ్ బాబు, కుమారుడు రాజు, మాజీ మండలాధ్యక్షుడు వాసుదేవలతో సహా రేపల్లె నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరిని విజయమ్మ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అద్యక్షుడు మర్రి రాజశేఖర్, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందన్న భావంతో ఇంతకాలం ఎదురుచూసిన వారికీ నిరాశ ఎదురుకావడంతో జగన్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి రేపల్లె నుంచి మోపిదేవి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి హాజరుకావడం విశేషం.

రోడ్ మ్యాప్ తర్వాతే తెలంగాణ పై నిర్ణయం

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ ను తెలంగాణ రోడ్ మ్యాప్ ను తయారుచేయమని చెప్పినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రోడ్ మ్యాప్ ను పరిశీలించిన తరువాత సోనియా గాంధీ, ఇతర నేతలతో మాట్లాడి తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ అన్నారు. అంతకుముందు దిగ్విజయ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటి అయ్యారు. షిండే తో భేటి పై వివరాలను మీడియాకు వెల్లడించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా ఈ రోజు దిగ్విజయ్ సింగ్ తో భేటి అయ్యారు. ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దిగ్విజయ్ ని కలిసి తెలంగాణ ఇస్తే పదిహేను ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. వెంటనే తెలంగాణ పై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రెండు వారాల్లో తెలంగాణ పై నిర్ణయం జరుగుతుందని ఈ సంధర్బంగా దిగ్విజయ్ చెప్పారని అన్నారు. విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కూడా దిగ్విజయ్ ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.