నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు

      ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ లబించింది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈమేరకు ఇవాళ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకాలం సిబిఐ వీరి బెయిల్ పిటిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇప్పుడు దర్యాప్తు పూర్తి అయినందున కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జగన్ కు సన్నిహితుడిగా పేరుపడి జగన్ కోసమే 20 నెలలుగా జైలులో ఉన్నట్లు పేరుపడ్డ నిందితుడు సునీల్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్ మీద ఈ రోజు చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు. రూ.2 లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిలు మంజూరయింది.

జీవితా రాజశేఖర్‌పై అరెస్ట్‌ వారెంట్‌

  సినిమాలతో పాటు రాజకీయభవిష్యత్తు కూడా సరిగా లేని జీవితా రాజశేఖర్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తన సినిమా కోసం ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌ దగ్గర అప్పు తీసుకొని అతని చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి జీవితా రాజశేఖర్‌ పై అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ అయింది.   చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ పరంధామ రెడ్డి వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రెండు సార్లుగా జీవితా రాజశేఖర్‌ విచారణకు హాజరు కాకపోవటంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. అక్టోబర్ 29 తేదిలోగా జీవితా రాజశేఖర్ ను కోర్టులో హాజరుపర్చాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిది : జేసి

  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరిని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు జెసి దివాకర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌ అధిష్టానం మూగ, చెవిటి, గుడ్డిదానిలా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అందువల్లే అధిష్టానం మొండిగా వ్యవహరిస్తుందని, ఇప్పటికే సీమాంద్ర ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు పార్టీ వీడాలంటే చాలా బాధగా ఉందని కానీ అధిష్టానం మాత్రం పార్టీలో కొనసాగే పరిస్థితి కల్పించటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తప్పని సరి పరిస్థితిల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడినా మరే ఇతర పార్టీలో చేరనని తేల్చి చెప్పారు.

దీక్ష నుంచి జగన్ మాయం..!

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్ దీక్ష శిబిరంలో మొదటి రోజు ఓ ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. మొదటి రోజు శనివారం రాత్రి 11 గంటలకు దీక్షా శిబిరం వద్ద లైట్లు ఆర్పేశారు. ఆ తరువాత దీక్షా శిబిరం నుండి జగన్ లేచి వెళ్లిపోయాడు. రెండు గంటల పదిహేను నిమిషాల తరువాత ఆయన తిరిగి శిబిరంలోకి వచ్చాడు. దీనికి సంబంధించిన విజువల్స్ పలు ఛానళ్లలో వార్తలుగా రావడంతో ఆయన దీక్ష వ్యవహారం చర్చకు తెరలేపింది. ఆయన ఇంటికి వెళ్లలేదని, పక్కనే ఉన్న బస్సులోకి వెళ్లి స్నానం చేసి వచ్చాడని పార్టీ నేతలు చెబుతున్నా ఏకంగా రెండు గంటలకు పైగా దీక్షా శిబిరం విడిచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

జగన్, బాబులపై ట్విట్టర్ లో డిగ్గీ

      సీమాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ ఇస్తామని, సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్‌లో విద్యా, వైద్య అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని కోరారు. హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ పూర్తి భద్రత కల్పిస్తామని దిగ్విజయ్ సింగ్ భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలకు కూడా పరిష్కారం కనుగొంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లో ఉన్నా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో... ఎక్కడ ఓటర్లుగా నమోదైతే అక్కడి పౌరులే అవుతారని, వారి హక్కులను ఎవ్వరూ కాలరాయలేరని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజన అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట మార్చారని అన్నారు. తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ లేఖలు ఇచ్చిన టీడీపీ, వైసీపీ ఇప్పుడు తీరు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని దిగ్విజయ్ పేర్కొన్నారు. గతంలో చేసిన హామీల నుంచి వెనక్కి పోవద్దని చంద్రబాబు, జగన్‌లకు విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీకి తెలంగాణ నోట్ తీర్మానం..!!

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండబోవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. విభజనపై చట్టాలు, రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. విభజనపై ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వెళుతుంది. శాసనసభలో దీనిపై చర్చ జరుగుతుందని వివరించారు.   ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తిరిగి రాగానే ముసాయిదా బిల్లును ఆయనే అసెంబ్లీకి పంపిస్తారని చెప్పారు.విభజనపై ఏర్పాటు చేయబోయే మంత్రివర్గ బృందం సహజంగా రాష్ట్రానికి వెళ్లదని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రతినిధుల నుంచి సలహాలు మాత్రం స్వీకరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో నగరంపై అధికారం గవర్నర్ లేదా కేంద్రం చేతిలో వు౦టుదని వ్యాఖ్యానించారు.   

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అనుచిత వైఖరి ఎందు కోసం

  రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలలో ఎటు వైపు ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటే అటువైపు వారిని సముదాయించే విధంగా మాట్లాడుతున్నకాంగ్రెస్ అధిష్టానం, తనకి ఒక నిర్దిష్టమయిన ఆలోచన కానీ, స్పష్టమయిన వైఖరి గానీ లేదని నిన్న దిగ్విజయ్ సింగ్ చేసిన తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది.   హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగంగానే ఉంటుందని దానిపై సర్వ హక్కులు తెలంగాణాకే ఉంటాయని ఖరాఖండిగా చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, టీ-నోట్ పై క్యాబినెట్ ప్రకటన వెలువడిన తరువాత సీమంద్రాలో సమైక్యఉద్యమం హింసాత్మకంగా మారడం చూసి, ఇప్పుడు మాటా మార్చి హైదరాబాద్ పై అధికారాలు కేంద్రం లేదా గవర్నర్ చేతిలో ఉంటాయని ప్రకటించారు. తద్వారా సీమంద్రాలో ఉద్యమాలను చల్లార్చే ప్రయత్నంలో ఇప్పుడు తెలంగాణాలో అగ్గి రాజేశారు.   ఈవిధంగా ఒకసారి సీమంద్రాలో మరొకసారి తెలంగాణాలో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నకాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పరిష్కరించలేక, ఆ తప్పును ప్రతిపక్షాలపైకి నెట్టివేసి తన భాద్యత నుండి తప్పించుకోవాలని చూస్తోంది. ఇది చూస్తే ఒక అనుభవరహితుడయిన వైద్యుడు క్లిష్టమయిన ఆపరేషన్ చేస్తున్నట్లుంది. ఆ వైద్యుని చేతిలో రోగి ప్రాణాలు కోల్పోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా విషమించింది. అయినప్పటికీ దిగ్విజయ్ సింగ్ వంటి వారు రోజుకొక మాట మాట్లాడుతూ సమస్యను మరింత జటిలం చేస్తూనే ఉన్నారు.   సీమంద్రాలో విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో రాష్ట్రంలో రైళ్ళు కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. అనేక జిల్లాలలో పట్టణాలు, గ్రామాలు కరెంటు లేక అంధకారంలో మునిగిపోయాయి. అదేవిధంగా ఇంతవరకు ఎంతో ప్రశాంతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం, కేవలం రెండు రోజుల్లో చాలా హింసాత్మకంగా మారింది. ఇంత జరుగుతున్నా తాము చేయగలిగిందేమీ లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, ఉద్యోగులకు నచ్చజెప్పే బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదేనని దిగ్విజయ్ సింగ్ ప్రకటించి చేతులు దులుపుకోవడం రాష్ట్ర ప్రజల పట్ల, నేతల పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి ఎంత చులకన భావం ఉందో తెలియజేస్తోంది.   అదే కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితి తలెత్తితే కాంగ్రెస్ అధిష్టానం ఆఘమేఘాల మీద కదిలి అక్కడి ప్రభుత్వాన్నికూల్చే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు చెలరేగినప్పుడు, ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హుటాహుటిన అక్కడికి తరలి వెళ్లి, భాదితులను పరామర్శించి సమాజ్ వాదీ ప్రభుత్వం వారికి సాయపడకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీలు గుప్పించి వచ్చారు.   కానీ గత రెండు నెలలుగా రాష్ట్రం అతలకుతలమవుతున్నా కనీసం కంటి తుడుపు చర్యగా వేసిన అంటోనీ కమిటీ సభ్యులు కూడా రాష్ట్రంలో పర్యటించాలని ఎన్నడూ అనుకోలేదు. రాష్ట్రంలో పరిస్థితులను కిరణ్ కుమార్ రెడ్డి (ఉద్దేశ్యపూర్వకంగానే) అదుపుచేయలేకపోతున్నట్లు భావిస్తున్నప్పుడు, మరి కేంద్రం ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? ఇప్పటికీ అతనిదే భాద్యత అని చెప్పడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశ్యం ఏమిటి?   కాంగ్రెస్ అధిష్టానం ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తే తన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం అది ఉద్దేశ్యపూర్వకంగానే ఈవిధంగా ప్రవర్తిస్తోందని అర్ధం అవుతోంది.

సియం కూర్చీపై నాలుగో కృష్ణుడు..?

  తెలంగాణ ఏర్పాటు ప్రకటన కొరివితో తలగొక్కున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో పడినట్టుగా సమాచారం.. ఇన్నాళ్లు ఎట్టి పరిస్థితుల్లో సియం ను మార్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన కేంద్ర ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డిని సాగనంపడానికి సిద్దమవుతుందట.   అందులో భాగంగానే సియం పీఠం మీద కన్నేసిన ఓ కాంగ్రెస్‌ నాయకుడు, ప్రస్థుతం జరుగుతున్న సీమాంద్ర ఉద్యమాన్ని తెగవాడేసుకుంటున్నాడని కాంగ్రెస్‌ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇన్నాళ్లు రాష్ట్ర కాంగ్రెస్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏళిన ఏ సామాజిక వర్గం సొంత కుంపటి పెట్టేసుకోవటంతో ఇక రాష్ట్ర కాంగ్రెస్‌కు తామే పెద్ద దిక్కు కావాలని భావిస్తున్నాడట సదరు నేత.   అందులో భాగంగానే తన ఆస్తులను తానే పగలగొట్టేసుకొని, తగలబెట్టేసుకొని అధిష్టానం మెప్పుపొందటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడట. అంతే కదా మరి చీమ కూడా చొరబడలేని దొరవారి కోటలో ఆయన ఆస్తుల మీద చేయి వేసే ధైర్యం సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది, రాళ్లేది ఆయనే, వేయించుకునేది ఆయనే, నవ్వేది ఆయనే, ఏడ్చేదీ ఆయనే అనుకుంటున్నారు అంతా.   తెలంగాణ సమస్య తొలినుంచే అధిష్టానం మాటకు జీహుజూర్‌ అంటూ వచ్చిన సదరు నేత రాష్ట్ర విభజన తరువాత కాస్త అటు ఇటుగా మాట్లాడినా అధిష్టానానికి మాత్రం ఎదురు మాట్లాడలేదు. అందుకే అమ్మ ముందు చూపించిన విధేయతతో పాటు ఆస్తులు నష్టపోయాడనే సింపతీతో సియం సీటుకు టెండర్‌ వేశాడా నాయకుడు.. మరి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ సియంను మారుస్తుందా.. ఏమో అది కాంగ్రెస్‌ పార్టీ అందులో ఏం జరిగే అవకాశమైనా ఉంది.

రాజీనామాలపై పళ్లం రాజు, కోట్ల యూటర్న్!

        కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సీమాంధ్ర నేత పల్లంరాజు తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకే విభజన నిర్ణయం తీసుకున్నామని, రాజీనామాను పక్కనబెట్టి సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు మంత్రి వర్గ ఉపసంఘంలో ఉండాల్సిందిగా సోనియాగాంధీ సూచించడం తో ఆయన మెత్త బడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇతనితో పాటు మరో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ని సోనియా సముదాయిండంతో ఆయన కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.     సీమాంధ్రలో ఉద్యమం గురించి పల్లం రాజు చెప్పింది విన్న సోనియా ముందు మద్దతు ఇచ్చిన పార్టీలు వెనక్కి తగ్గితే ఏం చేస్తామని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మంత్రుల కమిటీలో పని చేసి సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియపరచాలని సూచించినట్టు చెబుతున్నారు. సోనియాతో చర్చల నేపథ్యంలో పల్లం రాజు రాజీనామా ఆగిపోయినట్లే. ఇక మరో మంత్రి పనబాక లక్ష్మి రాజీనామా చేసే ముచ్చటే లేదని తెగేసి చెప్పారు. తాను విభజనకు అనుకూలం అని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.

వెనకడుగే లేదు : అశోక్‌బాబు

  సీమాంద్రలో నిరసనలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. ఈ నెల 20 తేది వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ మేరకు ఏపిఎన్జీవొ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ఆదివారం మీడియాకు వివరించారు.   సోమవారం ప్రభుత్వంతో జరగనున్న చర్చలకు తాము వెళ్లటం లేదని ప్రకటించారు. ఇక కింది స్థాయి వారితో చర్చలతో ఉపయోగం లేదన్న ఆయన ముఖ్యమంత్రి స్థాయి వారితో మాత్రమే చర్చలు వెలతామని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రా కోసం విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా దసరా పండుగను జరుపుకోమని అశోక్‌బాబు తెలిపారు.   20వ తారీఖు వరకు ప్రకటించిన కార్యచరణలో భాగంగా 8,9 తేదీల్లో బ్యాంకులు మూసివేత, 10 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశాలు. 15న 13 జిల్లాల్లోని మండల స్థాయిలో అన్ని మండలాల్లో రైతుల కోసం ప్రత్యేక సదస్సులు. 17 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం చేస్తామని చెప్పారు. అయితే 13, 14తేదిలతో పాటు, 16 తేదిన పండుగల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఉండవని ప్రకటించారు.

విజయనగరంలో కర్ప్యూ కొనసాగింపు

      విజయనగరం జిల్లాలో కర్ప్యూ కొనసాగుతోంది. పట్టణంలో కనిపిస్తే కాల్చివేత వుత్తర్వులు ఇచ్చినట్లు పోలీస్ జిల్లా అదికారి కార్తికేయన్ చెప్పారు. జిల్లాలో ఆందోళనల నేపథ్యంలో కర్ప్యూ విధించిన ఆదివారం మధాహ్నం మళ్లీ ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కొందరు ఆందోళనకారులు నిప్పు బంతులతో పోలీసుల పైకి దాడి చేసి తరిమేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, బిఐఎస్ఎఫ్ పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఆందోళనలు అదుపులోకి రావడం లేదు.     విజయనగరం జిల్లాకే పది కంపెనీల పారామిలటరీ దళాలను పంపించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బొత్స విభజనకు అనుకూలంగా ఉన్నారనే ఆగ్రహంతో ఉన్న సమైక్యవాదులు ఆయన ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా వెళ్తున్నారు. గాజులరేగలో పోలీసులు నిరసనకారుల పైకి రబ్బర్ బుల్లెట్లు  ప్రయోగించారు.

జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్: ఆనం

      వైకాపా కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల కావడం.. కాంగ్రెస్ తో అవగాహన మేరకే జరిగిందని విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ ఎమ్మెల్యే ఈ రకమైన ఆరోపణలు చేసి సంచలనం రేపారు. ఆ నాయకుడు మరెవరో కాదు.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. కాంగ్రెస్ కు, జగన్ కు మధ్య ఒప్పందం జరిగినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయని ఆనం అన్నారు. వీరి మ్యాచ్ ఫిక్సింగ్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన కూడా ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డిగ్గీ రాజా కాదని బ్లడీ రాజా అని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో లాగే ఆంధ్రప్రదేశ్‌లోను కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని దిగ్విజయ్ కుట్ర పన్నుతున్నారని ఆనం ఆరోపించారు.

జంతర్‌ మంతర్‌లో బాబు దీక్ష

  విభజనపై కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపెట్టిన దీక్షకు వేదిక ఖరారయింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో యన దీక్షకు దిగుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం ప్రారంభం కానున్న ఈ దీక్షకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.   అయితే బాబుతో పాటు దీక్షలో పాల్గొనటానికి పెద్దయెత్తున కార్యకర్తలు అభిమానులు సిద్దమవుతున్నారు. బాబు చేపట్టిన ఈ దీక్షకు తెలంగాణ తో పాటు సీమాంద్ర ప్రాంతం నుంచి కూడా పలువురు అగ్రశ్రేణి నాయకులు హాజరు అవుతున్నారు.   అయితే ఈ దీక్ష తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకం కాదంటున్నాయి పార్టీ వర్గాలు, విభజన విషయంలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరితో పాటు, సీమాంద్ర ప్రజల్లో నెలకొన్న భయాలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో చంద్రబాబు దీక్షకు దిగుతున్నారు.

విజయన’గరం’

  విభజన నిర్ణయంతో భగ్గుమన్న విజయనగరంలో ఇంకా శాంతి భద్రతలు నెలకొనలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. మంత్రి బోత్సా సత్యనారాయణ ఆస్తులే లక్ష్యంగా సమైక్యవాదుల దాడులు చేస్తుండటంతో ఆయన ఆస్తులకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.   ఆంధోళనలు చేస్తున్న వారిపై సీఆర్‌పిఎఫ్‌ బలగాలు వ్యవహరిస్తున్న తీరుపై మహిళలు, వ్రుద్దులు ఆందోళనకు దిగారు. బోత్సా సత్యనారాయణకు చెందిన కాలేజి భవనంపై దాడికి దిగిన ఆందోళన కారులు భవనంతో  పాటు ఫర్నిచర్‌ను కూడా ద్వంసం చేశారు. కర్ఫ్యూ ఉన్నందున ప్రజలు భయటికి రావద్దని పోలీసులు చెపుతున్న ఆందోళన కారులు మాత్రం పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నారు.

రైల్వేశాఖకు కరెంట్‌ కష్టాలు

  విభజన సెగలతో రాష్ట్రంలోని అన్ని రంగాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే విద్యుత్‌ జెఎసి సమ్మెతో సీమాంద్రలోని చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకోగా. రైల్వేశాఖ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది.   రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రైళ్లరాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆది, సోమ వారాల్లో పలు రైళ్లను రద్దు చేశారు. ఈ రెండు రోజుల్లో తొమ్మిది రైళ్లను పూర్తిగా, మరో నాలుగు రైళ్లను పాక్షికంగా నిలిపిస్తేన్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.   చెన్నై విజయవాడల మధ్య నడిచే పినాకిని , జనశతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌లను పూర్తిగా రద్దు చేశారు. వీటితో పాటు తిరుపతి వెళ్లాల్సిన పద్మావతి, నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్‌ లను రేణిగుంట, గుత్తి, డోన్‌, కాచీగూడల మీదుగా మళ్లించారు.

వెంకన్నకు సమైక్య సెగ

  సీమాంద్రలో వెల్లువెత్తున్న సమైక్య సెగలు తిరుమలేషునికి కూడా తాకాయి. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో భారీగా విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయింది. దీంతో తిరుమలకు కూడా కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. తిరుమల చరిత్రలో కరెంట్‌ సరఫరా నిలిచిపోవటం ఇదే తొలి సారి అంటున్నారు అక్కడి ప్రజలు.   తిరుమల కొండపై జనరేటర్‌లతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నా అది స్వామి వారి ఆలయానికి, సేవలకు మాత్రమే సరిపోతుంది. దీంతో ఇతర వసతి గ్రుహాలకు, హాటల్లకు ఇతర అవసరాలకు కరెంట్‌ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి కొన్ని గంటలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

సమైక్య షాక్‌

  తెలంగాణ నోట్‌కు కేభినెట్‌ ఆమోదం లభించిన నేపధ్యంలో వెల్లువెత్తున్న నిరసనలు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. సీమాంద్ర జిల్లాల్లోని విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగటంతో ఉత్పత్తితో పాటు, సరఫరా వ్యవస్థలు కూడా అస్థవ్యస్థంగా మారుతున్నాయి.   దీనికి తోడు సీమాంధ్ర విద్యుత్‌ జేఏసీ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఇప్పటికే జల విద్యుత్‌, బొగ్గు ఉత్పత్తి కేంద్రాల్లో అవాంతరాలు విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నా యి. ఈ ప్రభావం ఆంద్ర ప్రదేశ్‌తో పాటు దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నింటి మీద కనిపించనుంది.   ఎన్‌టీపీసీలోని ఆరు యూనిట్లలో 1250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్‌టీ పీసీలో మొత్తం 1510 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలి చింది.  ఆర్‌టీపీపీలోనూ 2560 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచింది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో 240 మెగావాట్ల వద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు.   పరిస్థితి మరి కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే సీమాంద్ర ప్రాంతంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దక్షిణాది మొత్తం అంధకారంగా మారనుంది. ఏ  పరిస్ధిత్తుల్లో అయినా దక్షిణాది పవర్‌ గ్రిడ్‌ ఫెయిల్‌ అయిన పక్షంలో దాని మరమ్మత్తులకు దాదాపు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందంటున్నారు విధ్యుత్‌ రంగ నిపుణులు.

నేను విభజన వాదినే ; పనబాక లక్ష్మీ

  సీమాంద్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం పదవులు కాపాడుకోవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీమాంద్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ విభజన వాదం అందుకున్నారు.   ఇన్ని రోజులుగా ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నా ఏ రోజూ నోరు విప్పని పనబాక లక్ష్మీ ఇప్పుడు మాత్రం అధిష్టానం నిర్ణయానికే తన ఓటు అని ప్రకటించారు. తాను మొదటి నుంచి విభజన వాదినే అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టే తాను నడుచుకుంటానని తెలిపారు. సీమాంధ్రకు కావాలంటే ప్యాకేజీ ఇస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.