జగన్ 'దేశముదురు'

      జగన్ బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత చాలా సందర్భాలలో ఆయన ప్రదర్శిస్తున్న తెలివితేటలు చూస్తుంటే రాజకీయ పరిశీలకులకే నోటమాట రావడం లేదు. తెలివితేటల్లో ఆయనే దేశముదురని అంటున్నారు. తాజాగా కృష్ణానది మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్రమంతా ఈ బాధలో వుంటే, జగన్ మాత్రం ఈ ఇష్యూలో కొత్తకోణం ఆలోచించాడు. ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని తేల్చిపారేశాడు.   ‘‘మిగులు జలాల మీద మేము హక్కు కోరం’’ అని దివంగత రాజశేఖరరెడ్డి ట్రిబ్యునల్‌కి లేఖ రాసిన పాపమే ఇప్పుడు తెలుగు ప్రజల పాలిట శాపంగా మారిందని అందరూ దివంగతుడైన పెద్దమనిషిని విమర్శిస్తున్నారు.  ఈ సమయంలో నేరం తన తండ్రి మీదకు రాకుండా వుండటానికి జగన్ భలే పథకం వేశాడు. ఈ ఇష్యూలో చంద్రబాబునే దోషిగా నిలబెట్టే ప్లాన్ వేశాడు. దాంతో చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని వెరైటీ పాట పాడటం మొదలుపెట్టాడు. లేఖ రాసి తప్పు చేసిన తన ‘బాబు’ మీద వున్న ఫోకస్‌ని తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్ర‘బాబు’ మీదకు మళ్ళేలా స్కీమ్ సెట్ చేశాడు!

టి.బిల్లుకు చెక్ పెడతారా?

      దాదాపు రెండు నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. డిసెంబర్ మూడున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రపతి నుంచి తెలంగాణ బిల్లు వచ్చె వరకూ ఆగకుండా ముందుగానే శాసనసభ సమావేశపరచాలని కిరణ్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.   కొంతమంది ముందుగానే సమైక్యం తీర్మానం చేయాలని అంటున్నారు. సాధారణ సమావేశాలు జరుగుతూ ఉంటే అవి ముందు బిఎసిలో ఖరారు చేసిన ఎజెండా ప్రకారమే నిర్వహించవల్సి ఉంటుంది. అప్పుడు తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి నుంచి గవర్నర్ చేతులు మీదగా వచ్చినా వాయిదా పడుతుంది. అందుకే రాష్ట్రపతి నుంచి బిల్లు రాకముందే శాసనసభ సమావేశాలు నిర్వహించి బిల్లుకు చెక్ పెట్టాలని కిరణ్ వర్గం ఆలోచన.  అయితే ఈ వాదనలు ఆచరణకు సాధ్యమయ్యేవి కాదని సీమాంద్రకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు కొట్టిపారేస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇలాంటి వాటితే పెద్దగా ఉపయోగం ఉండదని, రాష్ట్రపతి బిల్లు పంపాక దానిని వ్యతిరేకించడమే సరైన నిర్ణయ౦ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ తల్లి సోనియా

      ఇప్పుడు తెలంగాణ తల్లికి మరికొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టాలకు కారణం ఎవరో కాదు... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియాగాంధీకి గుడి కట్టి తీరతానని శపథం చేసిన శంకరన్న తాజాగా ఓ సరికొత్త స్టేట్‌మెంట్ పడేశారు. తెలంగాణ తల్లి అంటే వేరే ప్రత్యేకంగా ఎవరో కాదంట.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అట! మితిమీరిపోయిన వ్యక్తిపూజకి ఇంతకంటే పరాకాష్ట మరొకటి వుంటుందా? ఈలెక్కన పొరపాటున తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ తల్లి పరిస్థితి ఏమైపోతుందో! టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీధివీధిలో ఏర్పడే తెలంగాణ తల్లి విగ్రహాలలో కవితమ్మని చూసుకునే అదృష్టం కలుగుతుంది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రద్దు చేసి తెలంగాణ తల్లి పేరుతో సోనియాగాంధీ విగ్రహాలనే పెట్టేస్తారు. ఏదో కామెడీకోసం రాశారుగానీ నిజంగా అలా జరుగుతుందా అనుకుంటున్నారా.. పొరపాటున కూడా అలా అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చు!

సీమాంధ్రలో పార్టీల ఎన్నికల పొత్తులు

  ఈ రాష్ట్ర విభజన అంశం ఏదో ఒక కొలిక్కి వస్తే ఎన్నికల పొత్తులపై నిర్ణయం తీసుకొందామని అన్ని రాజకీయ పార్టీలు వేచి చూస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజన జరిగినా, జరుగకపోయినా, సీమాంధ్రలో తెదేపా, బీజేపీలు చేతులు కలిపే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో భారీ విజయం సాధిస్తామని వైకాపా భావిస్తున్నందున ఒంటరిగానే పోటీ చేయవచ్చును.   కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే అది రాష్ట్ర విభజన చేసేందుకు నిర్ణయించుకొన్ననాడే మానసికంగా ఓటమికి సిద్దపడి, ముందుకు సాగుతోంది. అయితే ఈసారి తన స్వశక్తి మీద కంటే జగన్ శక్తి మీదే అది ప్రదానంగా ఆధారపడుతోంది గనుక, ఈవిషయంలో కాంగ్రెస్ పెద్దగా చింతించడం లేదు. తేదేపాకు చంద్రబాబు, వైకాపాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కిరణ్ కుమార్ రెడ్డి గనుక తప్పుకొని వేరే పార్టీ పెట్టుకొంటే ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నేతలొక్కరూ ఉండరు.   పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటునప్పటికీ, ఆయనకి స్వంత జిల్లా ప్రజలలోనే ఎంత వ్యతిరేఖత ఉందో మొన్ననే స్పష్టం అయింది గనుక ఆయనని ముందు పెట్టుకొని ఎన్నికల రణరంగంలో దూకడం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రదానోదేశ్యం ఎన్నికలలో గెలవడం కాక, ఓట్లను చీల్చి తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే గనుక ఆ తెలివితేటలూ పుష్కలంగా ఉన్నబొత్సకో లేక మరొక కన్నయ్యకో ఆ భాద్యతలు అప్పగించవచ్చును.   రాష్ట్రంలో ఏ పార్టీతో బీజేపీ ఎన్నికల పొత్తులు పెట్టుకొంటుందో, వారిని వ్యతిరేఖించే పార్టీతో మజ్లిస్ పొత్తులు పెట్టుకొంటుందని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. ఇక లెఫ్ట్ పార్టీలు ఎన్ని వాదనలు చేస్తునప్పటికీ, చివరికి మళ్ళీ తెదేపాతోనే పొత్తులకి సిద్దం కావచ్చును. తెలంగాణాలో మాత్రం సీపీఐ, తెరాసల మధ్య పొత్తులకి అవకాశం ఉంది.

ట్రిబ్యునల్‌ తీర్పుపై బాబు ఆవేదన

  కృష్ణా జలాల పంపిణ విషయంలో బ్రిజేష్‌కుమార్‌ కమిటీ ఇచ్చిన తీర్పులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని దిలీప్‌కుమార్ సేథ్, డీపీ దాస్‌లతో కూడిన ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.  శుక్రవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన ఆల్మట్టి ఎత్తు పెంపును ట్రిబ్యునల్ అంగీకరించడం దారుణమని అన్నారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచకుండా టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డుకున్నామని తరువాత వైయస్‌ హయంలో మిగులు జలాలు రాష్ట్రానికి అవసరం లేదని లేఖ రాయడం వల్లే ఈ రోజు రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ కధానాయకుడే కేశవ్ రావుకి దిక్కు

  దాదాపు మూడు దశాబ్దాలు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్నపటికీ, కే.కేశవ్ రావు తమ పార్టీని సరిగ్గా అంచనా వేయలేకపోయారు. తమ పార్టీ ఇంత త్వరగా తెలంగాణా ఇస్తుందని ఊహించని ఆయన ఏవేవో ఊహించుకొంటూ తెరాసలోకి దూకేశారు. కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్చ, గౌరవం తెరాసలో ఉండదని తెలిసినపటికీ ఆయన తెరాసలోకి దూకేసారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అనేక కీలక పదవులలో పనిచేసిన ఆయనకు కేసీఆర్ తమ పార్టీలో సెక్రెటరీ జనరల్ అనే పేరు గొప్ప పదవిని కట్టబెట్టి సముచితంగానే గౌరవించారు. దానివల్ల కేశవ్ రావు విలువ పెరిగిందో తరిగిందో ఆయనకే తెలియాలి.   అయితే తెరాసలో కేసీఆర్ కుటుంభానికి ఉన్న విలువ మరెవరికీ ఉండదని ఈ పాటికి ఆయనకి అర్ధమయ్యే ఉంటుంది. ఇది వరకులా ఆయన స్వేచ్చగా తన అభిప్రాయలను చెప్పడం కష్టమే!   ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏ ఒక్క కధానాయకుడి వల్లో ఏర్పడటం లేదు. అనేక మంది యువకుల బలిదానాలు, ప్రజా పోరాటాల ఫలితంగానే ఏర్పడుతోంది,” అని అన్నారు. మరి ఆయన చెపుతున్న ఆ కధానాయకుడు మరెవరో కాదు. కేసీఆర్ అని అర్ధం అవుతూనే ఉంది.   ఒకవైపు తెరాస నేతలు అందరూ కేసీఆర్ ని తెలంగాణా సాధించిన ఘనుడిగా ప్రజలకు చెప్పుకొంటుంటే, మరి అదే పార్టీకి చెందిన కేశవ్ రావు ఈవిధంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తరువాత ఆయన ఎన్ని సంజాయిషీలయినా చెప్పుకోవచ్చు గాక, కానీ ఆయన తన మనసులో మాటను బయటపెట్టినట్లు అర్ధం అవుతోంది. ఆయన ఈవిధంగా మాట్లాడితే తెరాస నేతలకు ఆగ్రహం కలగడం కూడా సహజమే. అందునా కేసీఆర్ కుటుంభ సభ్యులే పార్టీలో ప్రధానపాత్ర పోషిస్తున్నపుడు వారికి కేశవ్ రావు మాటలు మరి కొంత నొప్పి కలిగించడం కూడా సహజమే.   అందుకే, కేసీఆర్ కుమారుడు కే.తారక రామారావు మాట్లాడుతూ ఎవరు అవునన్నా, కాదన్నాతెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లి, తెలంగాణా సాదించిన ఘనత పార్టీ అధినేత చంద్రశేఖరరావుకే దక్కుతుందని ఆయన ఘాటుగా జవాబిచ్చారు.   ఒకవేళ కేశవరావుకి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకొనే ఉద్దేశ్యం లేనట్లయితే, మరికొంత కాలం తెరసలోనే కొనసాగాలని అనుకొంటే, ఈ విధంగా నోరు జారకుండా ఉంటే మేలేమో! ఆయన తెరాసలో కొంచెం జాగ్రత్తగా మెసులుకొంటే కాంగ్రెస్ పార్టీని వదులుకొని వచ్చినందుకు ప్రతిఫలంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయనకు కేసీఆర్ మంచి పదవి ఏదయినా కట్టబెట్టవచ్చును.

తరుణ్‌ తేజ్‌పాల్ అరెస్ట్...బెయిల్

      లైగింక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్‌తేజ్‌పాల్‌ను గోవా పోలీసులు అరెస్టు చేశారు.  తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ ముగియగానే పోలీసులు రంగంలోకి ఆయనను అరెస్టు చేశారు. వెంటనే తేజ్‌పాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా ఈరోజు అరెస్టు చేయవద్దని, రేపటి వరకు ఆగాలని కోర్టు తెలిపింది. ఎందుకంటే తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు  విచారణ జరగనుంది. అంతవరకు ఆగాలని కోర్టు గోవా పోలీసులకు ఆదేశించింది.   సహోద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూన్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ గురువారం పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసీంది. దీంతో తేజ్‌పాల్ శుక్రవారం ఉదయం కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.  

కెసిఆర్ ని బిజెపి పట్టించుకోవడం లేదు!!

      టీఆర్ఎస్‌ని తమ పార్టీలో కలిపేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్లాన్లు వేసినా టీఆర్ఎస్ కొరకరాని కొయ్యలా తయారైంది. దాంతో టీఆర్‌ఎస్ తనలో విలీనం కాదని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్‌తో విలీనం మాటని అటకెక్కించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని తెలంగాణలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నిటిలో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని టీఆర్ఎస్ పథకరచన చేస్తోంది. దీనిలో భాగంగా తెరాస నాయకత్వం సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్‌ల దగ్గరకి రాయబారాన్ని పంపినట్టు తెలుస్తోంది.   అయితే ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య అని ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే టైపు అయిన టీఆర్ఎస్‌ని నమ్మడానికి, పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపించనట్టు తెలుస్తోంది. పొత్తు సందర్భంగా భారీ స్థాయిలో సీట్లు కేటాయిస్తామని టీఆర్ఎస్ ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నా బీజేపీ అగ్ర నాయకత్వం పట్టించుకోవడం లేదన్నట్టు సమాచారం.

పక్షపాత వైఖరి ప్రదర్శించిన బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్

  ఈ రోజు కృస్ణా జలాల వివాదంపై ఏర్పాటయిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. రాష్ట్రానికి మొత్తం 1001 నుంచి 1005 టీఎంసీలను కేటాయించగా, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా పెంచిన ఆల్మట్టి డ్యాం ఎత్తుకి ట్రిబ్యునల్ ఆమోదముద్ర కూడా వేసింది. నీటి లభ్యత ప్రమాణికతను 75 శాతం నుండి 60శాతానికి కుదించడం ద్వారా ఆల్మట్టి డ్యాంలో 548 టీ.యంసి.లు నీళ్ళు కర్నాటకకు అదనంగా దక్కేలా చేసింది. ప్రభుత్వం అసమర్ధత, అశ్రద్ద వెరసి రాష్ట్రానికి కృష్ణా నది మిగుల జలాలో న్యాయబద్దంగా దక్కవలసిన వాటా కోల్పోయేలా చేసింది.   సాధారణంగా దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకానికి 75 శాతం నీటి లభ్యతని ప్రామాణికంగా తీసుకొని వాటాలు పంచుతారు. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దానిని మరో 15 శాతం తగ్గించి 60శాతంగా నిర్ణయించడంతో గతంలో 2030 టీ.యంసి.గా ఉండే ఈ పరిమితి ఇప్పుడు 2578 టీ.యంసి.గా మార్చబడింది. ఇంతవరకు 2030 టీ.యంసి.గా అదనంగా ఉన్న నీటిని మనం రాష్ట్రం వాడుకొనేవీలు ఉండేది. కానీ కర్ణాటక ప్రభుత్వం గతంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వలన దానిని నీటి నిలువ సామర్ధ్యం కూడా పెరిగింది. ఇప్పుడు ట్రిబ్యునల్ కనీస నీటి లభ్యతని 60శాతంగా మార్చడంతో ఇప్పుడు కర్నాటకకు మరో 548 టీ.యంసి.లు నీళ్ళు ఆయాచితంగా దక్కాయి.   అందువల్ల ఇప్పుడు 2578 టీ.యంసి.లకు అదనంగా డ్యాం లో నీళ్ళు ఉన్నపుడే అవి మిగులు జలాలుగా పరిగణింపబడుతాయన్నమాట. ఆ పైన ఉండే నీటిని మాత్రమే మన రాష్ట్రం వాడుకొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగులు జలాలపై హక్కుల కోసం మన ప్రభుత్వాలు గట్టిగా కోరకపోవడంతో, వాటిపై కూడా కర్నాటక హక్కులు కోరే అవకాశం చేజేతులా కల్పించారు.   ఇక మరో చేదు నిజం ఏమిటంటే ఈ మిగుల జలాల లెక్కల మీదనే ఆధారపడి జలయజ్ఞం కింద కృష్ణా బేసిన్‌లో రూ.32 వేల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టుల భవితవ్యం నేటి ట్రిబ్యునల్ తీర్పుతో ప్రశ్నార్థకంగా మారబోతోంది. అటు నీళ్ళు పోగొట్టుకొన్నాము, ఇటు వేల కోట్ల ప్రజాధనం వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టులు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.   గతంలో ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకి వ్యతిరేఖంగా సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తే, ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన తరువాత మళ్ళీ రమ్మని పంపించేసింది. గనుక మళ్ళీ ఇప్పుడు న్యాయం కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించ వలసి ఉంటుంది. అయితే రాష్ట్రం విడిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం ఆ పనిచేస్తుందని ఆశించలేము. ఇప్పుడు మన రాష్ట్రం కూడా రెండుగా విడిపోతున్నందున మున్ముందు తెలంగాణాలో మరి కొన్ని ప్రాజెక్టులు లేస్తే ఇక దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు వస్తాయో ఊహించుకోవచ్చును.

పాములు @ అసెంబ్లీ!

      అసెంబ్లీ ఆవరణలో తిరుగుతున్న పాము దంపతుల మధ్య సంభాషణ ఎలా వుంటుందో ఊహిద్దాం. ‘‘ఏవండీ.. ఏవండీ.. నిద్ర లేవండీ..’’ ‘‘అబ్బా.. ఏవైందే?’’ ‘‘మన చిన్నోడిని పాములు పట్టుకునేవాళ్ళు తీసుకెళ్ళిపోయారండీ’’ ‘‘అదేంటే.. వాడసలు బయటికెందుకు వచ్చాడు? వాణ్ణి సీఎల్పీ ఆఫీసులో సెటిలవ్వమని చెప్పాగా?’’ ‘‘సీఎల్పీ ఆఫీసులో కంపు అతి దారుణంగా పెరిగిపోయిందంటండీ. ఆ కంపుని భరించలేక బయటికొచ్చాడండీ. ఆ తెలుగుదేశం లెజస్లేచర్ ఆఫీసు నీట్‌గా వుందంటే అటువైపు వెళ్ళబోయాడు. ఇంతలోనే వాణ్ణి పట్టేసుకున్నారు. ఇప్పుడు వాణ్ణి ఏం చేస్తారో ఏంటో’’ ‘‘వాడికేం కాదు ఏడవ్వాకే!  ఆ పట్టుకున్నోళ్ళెవరో మనోణ్ణి తీసుకెళ్ళి ఏ అడవిలోనో వదిలేస్తార్లే. ఇక్కడికంటే ఆడు అడవిలోనే సేఫ్‌గా వుంటాడు’’ ‘‘అవునాండీ? పోనీలే.. వాడు ఎక్కడున్నా సంతోషంగా వుంటే అదే చాలు’’ ‘‘అవునుగానీ ఒసే.. ఆ టీఆర్ఎస్ లెజిస్లేచర్ ఆఫీసులో మన పిల్లలు ఇద్దరు సెటిలయ్యారు కదా.. వాళ్ళింకా అక్కడే వున్నారా?’’ ‘‘ఆ.. అక్కడే వున్నారండీ. కానీ ఆ ఆఫీసులోకి చాలా పెద్దపెద్ద పాములు వచ్చిపోతున్నాయంట. వాటిని చూసి మన పిల్లలు బెదిరిపోతున్నారంట. అక్కడి నుంచి కూడా బయటకి వచ్చేస్తాం మమ్మీ అని ఒకటే బతిమలాడుతున్నారు’’ ‘‘ఆ వైఎస్సార్సీపీ ఆఫీసులో వున్న ఇద్దరు పిల్లల పరిస్థితేంటి?’’ ‘‘ఆ ఆఫీసులో పెద్దపెద్ద కప్పలు వున్నాయంటండీ. అవెక్కడ తమమీద దాడిచేస్తాయోనని పిల్లలు భయపడిపోతున్నారంటండీ’’ ‘‘సర్లే, త్వరలో అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయ్. తెలంగాణ బిల్లు చర్చకి వచ్చే అవకాశం కూడా వుంది. అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా వుంటుందో ఏంటో.. అంచేత ఓ పన్జేద్దాం. ఈరోజు రాత్రికి మన ఫ్యామిలీ మొత్తం పక్కనే వున్న పబ్లిక్ గార్డెన్స్ లోకి షిష్టయిపోదాం’’ ‘‘అలాగేనండీ’’

జేసీ బ్రదర్స్ చేరిక వార్తలతో పరిటాల వర్గంలో ఆందోళన

  జేసీ బ్రదర్స్ గా పేరుగాంచిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులకి సిద్దం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఇద్దరూ తోడు దొంగలని జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. బొత్స కూడా వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసారు. అయితే సహజంగా కొంచెం ఆవేశపరులయిన వారిరువురు వైకాపాలో చేరి జగన్మోహన్ రెడ్డితో తాము సర్దుకు పోలేమని భావించడంతో, తెదేపావైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తెదేపాలోకి ఎంట్రీ దొరకకపోయినట్లయితే వారిరువురు స్వతంత్ర అభ్యర్దులుగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.   తేదేపాకు అనంతపురం జిల్లాలో మొదటి నుండి పరిటాల కుటుంబము కొండంత అండగా ఉంటూ వచ్చింది. పరిటాల రవి హత్యకు గురయిన తరువాత కూడా ఆయన అర్ధాంగి పరిటాల సునీత, వారి కుమారుడు పరిటాల శ్రీరామ్ మరియు అనుచరులు అందరూ కూడా తేదేపాను జిల్లాలో బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా తెదేపా కూడా వారికి అన్నివిధాల అండదండగా నిలుస్తోంది.   అయితే ఇప్పుడు తమ రాజకీయ ప్రత్యర్దులయిన జేసీ బ్రదర్స్ తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వస్తున్న వార్తలతో సహజంగానే పరిటాల వర్గంలో ఆందోళన మొదలయింది. వారిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలోకి అనుమతించే ప్రసక్తే లేదని పరిటాల సునీత ఇటీవల మీడియాతో అన్నట్లు తెలుస్తోంది. తెదేపా అధిష్టానం మాత్రం ఇంకా ఈ వార్తలపై స్పందించలేదు.

పోలీసులకు తరుణ్ తేజ్‌పాల్ టోకరా!

      మహిళా జర్నలిస్టుపై వేధింపులకు పాల్పడిన తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీసులను బురిడి కొట్టించారు. ఈ రోజు ఉదయం పోలీసులు తేజ్‌పాల్ ఇంటికి వెళ్ళారు. అయితే అప్పటికే తేజ్‌పాల్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా అతడి ఆచూకి తెలిపేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నేడు పోలీసులు ఎదుట తేజ్‌పాల్ హాజరయ్యే అవకాశం ఉంది. తన నివాసంలో తేజ్‌పాల్ లేకపోవడంతో అతడి బంధువల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయనున్నారు.   గురువారం సాయంత్రం 3 గంటల్లోగా అతను పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. దాంతో పోలీసులు మెజిస్ట్రేట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను పొందారు. తాను మర్నాడు గోవా వస్తానని, తాను విచారణకు సహకరిస్తానని తరుణ్ తేజ్‌పాల్ గురువారంనాడు సమాచారం అందించాడు. తనకు శనివారం వరకు గడువు ఇవ్వాలని తరుణ్ తేజ్‌పాల్ అంతకు ముందు గోవా పోలీసులను కోరాడు. అయితే, వారు అందుకు నిరాకరించారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కృష్ణా జలాలపై రాష్ట్రానికి షాక్

      కృష్ణా జలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణా జలాలపై కర్నాటక ప్రభుత్వానికి అనుకూలంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ శుక్రవారం ఉదయం తీర్పును వెలువడించింది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతారలను ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. ఆల్మట్టి ఎత్తు పెంపును బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థించింది. ఆంధ్రప్రదేశ్‌కు 1001 నుంచి 1005 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. జస్టిస్ బ్రిజేస్ కుమార్ నేతృత్వంలోని దిలీప్‌కుమార్ సేథ్, డీపీ దాస్‌లతో కూడిన ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై తీర్పును వెలువడించింది. గెజిట్‌లో నమోదైనప్పటి నుంచి 2050 మే 31వ తేదీ వరకు ఈ తీర్పు అమలులో ఉంటుంది. ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక రాష్ట్రం హర్షం వ్యక్తం చేస్తోంది.

రాష్ట్ర విభజనపై మోడీ వ్యాఖ్యలు

  బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ఇటీవల ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిలో మార్పును సూచిస్తున్నట్లున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చాలా బాధ కలిగించే విధంగా రాష్ట్ర విభజన చేస్తోందని, అది చూస్తే ప్రజాభీష్టం మేరకు రాష్ట్ర విభజన చేస్తున్నట్లు కాక, కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ‘విభజించు,పాలించు’ విధానాన్ని అమలు చేస్తునట్లు ఉందని మోడీ అన్నారు. ఇదివరకు తమ ఎన్డీయే హయంలో కూడా మూడు రాష్ట్రాల విభజన జరిగిందని, కానీ అప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలకు పూర్తి ఆమోదయోగ్యంగా విభజన జరిగిందని అందుకు రెండు ప్రాంతాల ప్రజలు కూడా చాలా సంతోషించారని ఆయన అన్నారు.   ఆ మధ్య ఒకసారి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పిన మాటలకీ ఇప్పడు మాట్లాడుతున్న మాటలకీ చాలా తేడా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పాటు జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్దిలో ఒకదానితో మరొకటి పోటీ పడగలవని ఆనాడు అంటే, ఇప్పుడు విభజన ప్రజలకు బాధ కలిగించే రీతిలో జరుగుతోందని అన్నారు.   ఆయన పర్యటన తరువాత మెహబూబ్ నగర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన సీనియర్ బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ‘తమ పార్టీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తుందని’ ప్రకటించారు. కానీ, ఇప్పుడు మోడీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ ఏవిధంగా వ్యవహరించబోతోందో చూచాయగా తెలుపుతోంది.   కాంగ్రెస్ పార్టీ కూడ బహుశః ఇది పసిగట్టే ఉండవచ్చును. అయినా ఏమి తెలియనట్లుగా వ్యవహరిస్తూ పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతోంది. అంటే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టి, దానికి బీజేపీ మద్దతు ఈయకపోతే ఆపార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు అర్ధం అవుతోంది. కానీ తను ప్రవేశపెట్టిన బిల్లుని గెలిపించుకోవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ మీదే ఉంది. గనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనే ఉందనుకోవాల్సి ఉంటుంది.

కృష్ణా జలాల పంపిణీపై తుది తీర్పు

  కృష్ణా జలాల పంపిణీకి సంభందించిన కేసుపై నేడు తీర్పు వెలువడనుంది. పదేళ్లుగా మూడు రాష్ట్రాల వాదనలు వింటున్న బ్రజేశ్‌కుమార్‌ కమిటీ ఈ రోజు తుది తీర్పును వెలువడించనుంది. మన రాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువడితే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక అంశాలు ఉన్నాయి.శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ట్రిబ్యునల్ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పును వెల్లడించనుంది. ఇప్పటికే రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ రవూఫ్ తదితర అధికారులు డిల్లీ చేరుకున్నారు.

సచిన్‌ను పొగడటం ఆపండి ; తాలీబన్‌

  ఇండియన్‌ లెజండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌పై ప్రశంసలను ఇక ఆపేయాలని పాకిస్థాన్‌ నిషేదిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్‌ ఇ తాలీబన్‌ పాక్‌ మీడియాను హెచ్చరించింది. ఏకె 47 ఆయుధాలతో ముఖానికి ముసుగువేసుకున్న కొందరు వ్యక్తులతో కలిసి తాలిబన్ అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్ మాట్లాడిన ఓ వీడియోను తాలిబన్లు మీడియాకు విడుదల చేశారు. ఒక భారతీయున్ని గురించి పాక్‌ మీడియా ఇంత గొప్పగా పొగడటం దురదృష్టకరం అని షాహిద్‌ వీడియోలో పేర్కొన్నాడు. సచిన్‌ ఎంత గొప్ప ఆటగాడు అయినా అతను భారతీయుడే అని, పాక్‌ ఆటగాళ్లు ఎలా ఆడారన్నది ముఖ్యంగా కాదు వాళ్లు పాకీస్థానీయులు కాబట్టి వాళ్లను పొగడండి అంటూ పాక్‌ మీడియాను హెచ్చరించారు.

యూటి అంటే ఊరుకోం

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో హైదరాబాద్‌ను యూటి చేయాలన్న ప్రతిపాదనపై ఇక్కడి నాయకులు గుర్రుగా ఉన్నారు. అలా భాగ్యనగరాన్ని యూటి గనక చేస్తే వారి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకం అవుతుందని వారు భయపడుతున్నారు. ఈ విషయం పై మంత్రి దానం నాగేందర్‌ కూడా తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే చూస్తూ ఉరుకోమని ఆయన హెచ్చరించారు.గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హైదరాబాద్‌ను యూటి చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తున్న నాయకులపై మండి పడ్డారు.తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళితే ఏం చేయాలో తమకు బాగా తెలుసన్నారు. హైదరాబాద్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. యూటీ అయితే అధాకారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయని, అప్పుడు ప్రజా ప్రతినిధులుగా తాము ఏం చేయాలని నిలదీశారు. అధికారాలు కేంద్రం చేతిలో ఉండటం తమకు సమ్మతం కాదని దానం నాగేందర్ తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల చిత్రం

  కాంగ్రెస్ అధిష్టానం పట్టుదల చూస్తే ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరగడం ఖాయంలా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు తమను దండించబోతున్నారని ఇప్పటికే గ్రహించిన కాంగ్రెస్ నేతలు వైకాపా, తెదేపాల వైపు చూస్తున్నారు. ఇక కిరణ్ కాంగ్రెస్ కూడా ఆవిర్భవిస్తే కొందరు అందులోకి దూకి తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. స్వశక్తి మీద గెలవగలమని బాగా నమ్మకం ఉన్న బొత్స, పురందేశ్వరి, పనబాక, సుబ్బిరామి రెడ్డి వంటి కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్స్ పైనే పోటీ చేయవచ్చును.   అందువల్ల ఈసారి పోటీ తెదేపా మరియు వేర్వేరు జెండాలతో వస్తున్న ఈ మూడు కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహంలో గెలిచేందుకు తెదేపా తన సర్వ శక్తులూ ఒడ్డి పోరాడవలసి ఉంటుంది. అందుకు తెదేపా తన పటిష్టమయినపార్టీ శ్రేణులని, బలమయిన నాయకులని నూటికి నూరు శాతం వినియోగించుకోవలసి ఉంటుంది. అంటే పార్టీ అధిష్టానం మరియు పార్టీ శ్రేణుల మధ్య సరయిన అవగాహన చాలా అవసరమన్నమాట!   ఇక ఈ మూడు కాంగ్రెస్ పార్టీలు ఓట్లు చీల్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాయి గనుక, ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్నవ్యతిరేఖతనే కవచంగా చేసుకొని ఈ మూడు పార్టీలతో తెదేపా ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నంలో లెఫ్ట్ మరియు బీజేపీతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొనగలిగితే మరి కొంత బలం చేకూరుతుంది. సమర్ధపాలన అందించిన చంద్రబాబు, నరేంద్ర మోడీలు చేతులు కలిపితే వారి కాంబినేషన్ కి గలగలా ఓట్లు రాలవచ్చును.   ఇక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్ని సర్వే రిపోర్టులు వచ్చినప్పటికీ, అతని సీబీఐ రికార్డులు, కాంగ్రెస్ పార్టీతో ఉన్నరహస్య సంబంధాలు, అతని అనుభవరాహిత్యం, దుందుడుకు శైలి, అతను చెప్పుకొనే విశ్వసనీయతే కరువవడం, పార్టీలో నేతలమధ్య అంతర్గత పోరు, పార్టీపై పూర్తి పట్టు లేకపోవడం వంటి అనేక లోపాలు ఆపార్టీకి శాపంగా మారవచ్చును. ముఖ్యంగా చంద్రబాబుతో పోలిస్తే జగన్ అనుభవ రాహిత్యం, ఎన్నికల తరువాత కాంగ్రెస్ తో చేతులు కలపాలనే అతని ఆలోచనలు ఆ పార్టీ ఓటమికి కారణం కావచ్చును. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో అరాచక, అస్తవ్యస్త కాంగ్రెస్ పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్ళీ ఎటువంటి పరిపాలనానుభవం లేని జగన్ కు అధికారం కట్టబెట్టే సాహసం చేయకపోవచ్చును. అందువల్ల తెదేపా నేర్పుగా ఈ మూడు కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోగలిగితే విజయం సాధించవచ్చును.