రాయల తెలంగాణను వ్యతిరేకించిన ఆజాద్

      పది జిల్లాల తెలంగాణకే కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం ఆయన జీఓఎం సభ్యులకు కూడా సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చ జరిగి అందరూ అంగీకరిస్తేనే రాయల తెలంగాణ ప్రతిపాదనకు మొగ్గు చూపవచ్చునని, లేకుంటే కొత్త సమస్యలకు దారి తీసినట్లవుతుందని వివరించారట. సిడబ్ల్యుసి నిర్ణయానికి కట్టుబడాలని సూచించినట్లుగా సమాచారం. రాయల తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం వల్లనే  ఆజాద్ వెనక్కి తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నారు. బిజెపి కూడా తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆజాద్ వెనక్కి తగ్గడానికి కారణమైందని అంటున్నారు. బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం కష్టమవుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల లోగా ఏర్పాటు చేయాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసికొట్టే పరిస్థితి వచ్చింది. దీంతో ఆజాద్ వెనక్కి తగ్గక తప్పలేదని అంటున్నారు.

కాంగ్రెస్ ఎత్తులకి కాంగ్రెస్ చిత్తు

  కొందరు రాయలసీమ కాంగ్రెస్ నేతలు రాయల తెలంగాణా ప్రతిపాదన చేసిన మాట వాస్తవమే. అదేవిధంగా మజ్లిస్ పార్టీ కూడా తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొదటి నుండి ఈ ప్రతిపాదన చేస్తున్నపటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గింది. అయితే ఈ ప్రతిపాదనతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒకేసారి ఎసరు పెట్టేయవచ్చని కాంగ్రెస్ పార్టీ గ్రహించడంతో తెలంగాణా ప్రజల కోరకపోయినప్పటికీ వారికి అదనంగా ఈ ‘రాయల్టీ’ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.   రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో మజ్లిస్ ఉనికి నామమాత్రంగా మారిపోతుంది. పైగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బీజేపీ బలపడుతుందని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ కూడా భయపడుతున్నాయి. అదే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెచ్చి తెలంగాణాతో అంటు కట్టగలిగితే, అక్కడ అధికంగా ఉండే ముస్లిం ఓటర్లవలన మజ్లిస్, రెడ్డి ఓటర్ల వలన కాంగ్రెస్ పార్టీ బలపడవచ్చనే ఆలోచన కూడా ఇందులో ఇమిడి ఉంది.   అయితే, తెలంగాణా ఏర్పడిన తరువాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే సామాజిక న్యాయం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముఖ్యమంత్రి మరియు ఇతర కీలక పదవులు ఆశిస్తున్నటీ-కాంగ్రెస్ నేతల అవకాశాలను ఈ ప్రతిపాదన దెబ్బ తీస్తుంది. గనుక వారు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జరుగబోయే కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ అంశంపై తమ అధిష్టానం తీసుకొనే నిర్ణయం చూసిన తరువాతనే వారు స్పందించాలని వేచి చూస్తున్నారు.   ఒకవేళ రాయల తెలంగాణాకే మొగ్గు చూపితే వారు కూడా అధిష్టానానికి ఎదురు తిరగవచ్చును. అదే జరిగితే, ఈ ప్రతిపాదనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కళ్ళెం వేద్దామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి అసలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల బహుశః ముందు ప్రకటించినట్లు 10జిల్లాలతో కూడిన తెలంగాణానే ఆమోదించక తప్పకపోవచ్చును.   రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంత కీలక దశకు చేరుకొన్నపటికీ, రాష్ట్రాన్ని ఏవిధంగా విడదీయదలచుకొందో చెప్పలేని దీనస్థితిలో కాంగ్రెస్ ఉంది పాపం. మొదటి నుండి కూడా రాష్ట్ర ప్రజలను కానీ, పార్టీలను గానీ పరిగణనలోకి తీసుకోకుండా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న ఎత్తులకి చివరికి తానే బలయిపోయే పరిస్థితి ఏర్పడింది.   కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. అది అప్పుడప్పుడు తనను తానే ఓడించుకొంటుంది అని కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకొనే మాట ఎంత నిజమో ఇప్పుడు అర్ధం అవుతోంది.నిన్న వెలువడిన సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక కవుంట్ డవున్ మొదలయిందని సూచిస్తునాయి.

అక్బరుద్దీన్‌ కు తెలంగాణ సెగ..హరీష్ ఫైర్

      తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. తెలంగాణ కోసమే తమ పోరాటం కానీ...రాయల తెలంగాణ కోసం కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ తెరపైకి తెస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ గద్దెలను కూల్చేస్తామని హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా హరీష్‌రావు సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను ఒప్పుకోమన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నాయకులు ఎన్నో కుట్రలు చేశారని, వారితో తాము కలిసేది లేదని హరీష్‌రావు తేల్చిచెప్పారు.

జగన్ కి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత

  ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇరుకునపడిన జగన్మోహన్ రెడ్డి, ధర్నాలు చేసే బాధ్యతను తల్లికి అప్పగించి చెన్నైవెళ్ళి ముఖ్యమంత్రి జయలలితను, ప్రతిపక్ష నేత కరుణానిధిని కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కరుణానిధి కుమార్తె మరియు 2జీ కేసులో నిందితురాలయిన కనిమోలి ఆయనకు స్వాగతం పలకడం విశేషం.   ఆయన వస్తున్నట్లు తెలిసి చెన్నైలో వైకాపా అభిమానులు బాగానే దారి పొడుగునా వైకాపా జెండాలు అలంకరించి బాగానే స్వాగతం పలికారు. అయితే చెన్నైనుండి హైదరాబాదులో కాలుపెట్టేసరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి హైదరబాదులో విమానం దిగి ఇంటికి వెళుతుంటే ఆయన కాన్వాయ్ పై కొందరు తెలంగాణా యువకులు కోడి గుడ్లు, టొమేటోలు, చెప్పులు విసిరి తమ నిరసన తెలిపారు. ఇది చూస్తే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.

తెలంగాణ బంద్...పలుచోట్ల ఉద్రిక్తత

      రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ తెలంగాణ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఐదు గంటల నుంచి తెలంగాణవాదులు ఆందోళనలకు దిగారు. జిల్లాలోని బస్సు డిపోల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.   #. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ నేపథ్యంలో నగరంలోని జూబ్లీబస్టాండ్‌వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఆందోళనకు దిగారు. రాయల తెలంగాణ ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఈటెల హెచ్చరించారు. #. తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. #. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఓయూలో విద్యార్థుల బైక్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్క్ వరకు విద్యార్థులు బైక్ ర్యాలీకి యత్నిచడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. #. రాయల తెలంగాణకు ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ బంద్ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. అసెంబ్లీ వద్ద భారీగా బలగాలను మోహరించారు.  

నేడే కేబినెట్‌కు బిల్లు

  తెలంగాణ ఏర్పాటు విషయంలో జీవోయం తుది నివేదిక సిద్దం చేసింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఆంటోని ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే తుది నివేదిక సిద్దమయ్యింది అన్న ఆయన ఈోజు నివేదికను ప్రదానికి అందజేస్తామన్నారు. అది కేభినెట్‌ ముదుకు ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని ప్రదానే నిర్ణయిస్తారన్నారు. అయితే ఆయన తరువాత మాట్లాడిన షిండే మాత్రం బిల్లు గురువారం కేభినెట్‌ ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే జీవోయం నిర్ణయం ఏమిటి అన్న విషయం మాత్రం ఆయన ప్రకటించలేదు. పది జిల్లాల తెలంగాణనా, లేక 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణనా అన్నవిషయం కేభినెట్‌ ముందుకు బిల్లు వచ్చిన తరువాత తెలుస్తుంది అన్నారు.

సెమీఫైనల్స్‌లో కాంగ్రెస్‌ అవుట్‌

  రాబోయే ఎలక్షన్స్‌కు సెమీఫైనల్‌గా భావిస్తున్న మూడు రాష్ట్రల ఎన్నికలు కాంగ్రెస్‌కు భారీ షాక్‌ ఇచ్చే అవకాశం ఉందంటున్నాయి సర్వేలు. ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన మూడు రాష్ట్రల్లో బిజెపికే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని టుడేస్‌చాణక్య సర్వే పేర్కొంటుంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌లలో బిజిపి అధికారాన్ని నిలబెట్టుకుంటారని, రాజస్థాన్‌లో కూడా బిజెపికే విజయావకాశాలు ఎక్కువని సర్వే తేల్చింది. టైమ్స్‌ ఆప్ ఇండియా సర్వే ప్రకారం ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుంది. అయితే ఢిల్లీ ఫీఠం ఎక్కడానికి ఏ పార్టీకైన ఆమ్‌ ఆద్మీ పార్టీ సపోర్ట్‌ తప్పని సరి అయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చింది.

పాపం జగన్!

      అయితే ఆంధ్రప్రదేశ్ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న జగన్ లక్ష్యం అంతకంతకూ దూరమైపోతూ వుండటంతో ఆయన నిరాశలో కూరుకుపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జైలులో వున్న పదహారు నెలల కాలంలో జగన్‌ని అన్యాయంగా జైల్లోకి పంపారంటూ ప్రచారం చేయడంలో వైఎస్సార్సీపీ కొంత విజయం సాధించింది.   జగన్ జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఊహించిన స్పందన లేకపోవడం వైసీపీ వర్గాలను, జగన్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతకంతకూ అడుగంటిపోతున్న తన రాజకీయ ఛరిష్మాని పైకి తీసుకురావడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు సరైన స్పందన లభించడం లేదని తెలుస్తోంది.  సమైక్య రాష్ట్రం కోసమో, తన రాజకీయ ప్రయోజనాల కోసమో జగన్ పలువురు జాతీయ నాయకులను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటి ద్వారా జగన్‌కి పొలిటికల్ మైలేజీ పెరగడం లేదని విశ్లేషకులు అంటున్నారు. జగన్ కలసిన నాయకులందరూ ఏదో జగన్ వచ్చాడు కాబట్టి కలుస్తున్నారే తప్ప ఆయన మీద ప్రత్యేక అభిమానమేమీ కనబర్చడం లేదని విశ్లేషిస్తున్నారు. ఒక దశలో జగన్ తమని కలవకపోవడమే ఉత్తమమని కొందరు జాతీయ నాయకులు భావించినట్టు తెలుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వుందని అంటున్నారు. అఖిలేష్ యాదవ్ ఇప్పటికి రెండుసార్లు జగన్ అపాయింట్‌మెంట్‌ని రద్దు చేశాడు. ఒకసారి జగన్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశాడు. మళ్ళీ అపాయింట్‌మెంట్ తీసుకున్న జగన్ లక్నో వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ దగ్గరకి వెళ్ళగానే అపాయింట్‌మెంట్ రద్దు చేస్తున్నట్టు సందేశం పంపించాడు.  ఇది జగన్‌ని కలవడం ఇష్టం లేక అఖిలేష్ అనుసరిస్తున్న వ్యూహమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ వ్యూహాన్ని జగన్ అర్థం చేసుకోలేకపోతున్నాడో లేక అర్థం చేసుకుని మరీ అవమానాలకు గురవుతున్నాడో అర్థంకావడం లేదని అంటున్నారు. మొత్తమ్మీద జగన్ రాజకీయంగా దయనీయమైన పరిస్థితిలో వున్నాడని విశ్లేషకులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.    

తెలంగాణ బిల్లు వస్తుందో లేదో: ఆజాద్

      పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు కృషిచేస్తున్నామని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. జీఓఎం రాష్ట్ర విభజన ప్రక్రియ పైన వేగవంతంగా పనిచేస్తుందని తెలిపారు. కాని తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెట్టేది తనకు తెలియదని వ్యాఖ్యానించడం విశేషం. ఆజాద్ చేసిన వ్యాఖ్యలు బట్టి శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం కష్టంగానె కనిపిస్తోంది. డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల ఎజెండాలో కూడా తెలంగాణ బిల్లు లేదు. అయితే లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా ప్రకటించారు.

ప్రాజెక్టులు కట్టి ఏమి బావుకొన్నామని

  స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కృష్ణానది మిగులు జలలాపై తమకు హక్కులు ఎటువంటి అవసరంలేదంటూ లేఖ ఇచ్చి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారని తెలుగుదేశం చేస్తున్నఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డి, చనిపోయిన తన తండ్రిని నిందించడం తప్పని చెపుతూ, ఆయనని వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో చంద్రబాబు తన హయంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, అందువల్లే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంత ఘాతుకానికి ఒడి గట్టిందని ఒక వితండ వాదం చేస్తున్నారు. తన తండ్రి అధికారంలోకి రాగానే జలయజ్ఞం పేరిట మిగులు జలాల ఆధారంగా అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారని అని కూడా గొప్పగా చెప్పుకొంటున్నారు.   ప్రాజెక్టులు కట్టకపోవడం వలననే ఈ సమస్య వచ్చిందని వితండవాదం చేస్తున్నజగన్మోహన్ రెడ్డి, మిగులు జలాలపై హక్కులు కోరబోమని రాజశేఖర్ రెడ్డి లేఖ ఇచ్చిన తరువాత, రాష్ట్రానికి నీళ్ళు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో రూ.39,000 కోట్లు ఖర్చు చేసి కృష్ణ బేసిన్ లో ఎందుకు ప్రాజెక్టులు మొదలుపెట్టారో కూడా జగన్ వివరించి ఉంటే బాగుండేది.   జల యజ్ఞం ధన యజ్ఞంగా మారిందని పత్రికలూ, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకొంటున్నా నిర్భీతిగా కోట్ల రూపాయల వ్యయంతో చెప్పటిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో ప్రజలకీ తెలుసు. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలయినట్లయితే ఆ ప్రాజెక్టులు అన్నీ నిరూపయోగంగా మారడం ఖాయం.   చంద్రబాబు ప్రాజెక్టులు కట్టకపోవడం వలన రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ జరుగలేదు. కానీ ప్రజల నుండి వసూలు చేసిన పన్నులతో రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టుల వలన వారి కష్టార్జితమంతా బూడిదలో పోసిన పన్నీరుగా వృధా అవడమే కాక, ఇప్పుడు ఆ ప్రాజెక్టులకి కనీసం నీళ్ళు కూడా రాని పరిస్థితి. వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అనాలోచితంగా కట్టిన ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు?   ఈ ప్రాజెక్టుల వలన ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా,కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులు మాత్రం బాగుపడ్డారు. ఈ భాగోతం గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి తిరిగి తెదేపాపై ఎదురు దాడి చేయడం, తాను, తన కుటుంబము, తన పార్టీయే ఈ భూప్రపంచంలో నీతి నిజాయితీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు మాట్లాడటం హాస్యస్పదం.

రాయల తెలంగాణాతో రాష్ట్ర కాంగ్రెస్ ఫినిష్

  ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరొక కొత్త సమస్య సృష్టించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నిరూపిస్తోంది. ఆ పార్టీ కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదనతో, గత నాలుగయిదు నెలలుగా ప్రశాంతంగా ఉన్నతెలంగాణాలో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. తెరాస అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణా అంతటా ర్యాలీలు, ధర్నాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రేపు తెలంగాణా బంద్ జరుగబోతోంది. ఈ పరిణామాలకు కాంగ్రెస్ అధిష్టానాన్నేనిందించవలసి ఉంటుంది.   రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను, ఆందోళనలను ఎంత మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసిన కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ ఇప్పుడు కొందరు రాయలసీమ కాంగ్రెస్ నేతల సలహాల మేరకు ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన చేసి తెలంగాణా ప్రజల మనోభావాలను కూడా కించపరిచింది.   ఈవిధంగా రాష్ట్రాన్ని విభజిస్తే తను రాజకీయంగా లాభపడవచ్చునని ఆలోచిస్తోందే తప్ప రాయలసీమ, తెలంగాణా ప్రజల మనోభావాలకు వీసమెత్తు విలువ ఈయడం లేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే తను సీమాంధ్రలో ఓటమి చవి చూడటం ఖాయమని అర్ధం చేసుకొన్నకాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తూ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటోంది.   ఇంతవరకు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నకారణంగా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీపట్ల ప్రజలకు, నేతలకు ఉన్నమంచి అభిప్రాయం కాస్తా ఈ రాయల దెబ్బతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందువల్ల, ఇప్పుడు 10జిల్లాలతో కూడిన తెలంగాణా ఇచ్చినా కూడా తెలంగాణా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే అవకాశం లేదు.   ఇంతకుముందు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమను కాంగ్రెస్ అధిష్టానం నిలువునా ముంచేసిందని ఆవేదన చెందేవారు. ఇప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు కూడా వారికి వంత పాడబోతున్నారు. అయితే టీ-కాంగ్రెస్ నేతలకి తెలంగాణాలో తమ కాంగ్రెస్ నావ మునిగిపోతోందని తెలిసి ఉన్నపటికీ, దానిలోనే ఉండవలసిన దుస్థితి. లేకుంటే తెరాసయే దిక్కు. ఈవిషయంలో సీమంధ్రలో కాంగ్రెస్ నేతలకు తెదేపా, వైకాపా లేదా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కాంగ్రెస్ పార్టీలు ఉండటం వారి అదృష్టమనే చెప్పాలి. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు ఆ అవకాశం కూడా లేదు పాపం.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా, ఈ రాయల తెలంగాణా ప్రతిపాదన వలన పార్టీకి జరిగిన నష్టాన్ని వారు పూడ్చలేరు. కాంగ్రెస్ హస్తం దెబ్బకి ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోవడం సంగతి దేవుడెరుగు. ముందుగా కాంగ్రెస్ పార్టీయే తుడిచిపెట్టుకుపోయేలా ఉంది.

ఆశారాం బాపు తనయుడు అరెస్ట్

      అత్యాచారం కేసులో ఆశారాం బాపు తనయుడు నారాయణ్ సాయిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణ్ సాయిని ఢిల్లీ హర్యానా సరిహద్దులో అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.గత 58 రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. సూరత్‌లో లైంగిక దాడి కేసులో నారాయణ సాయి నిందితుడు. నారాయణ సాయిని పట్టిచ్చినవారికి ఐదు లక్షల రివార్డు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో నారాయణ సాయి జైపూర్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆగ్రా వెళ్లాడు. మర్నాడు ఢిల్లీ వచ్చాడు. ఆ సమయంలో అతను సీతాపూర్‌లోని నైమిషారణంలో ఉన్నాడు. అతను తన వేషాన్ని మార్చుకుంటూ వివిధ ప్రాంతాల్లో దాక్కుంటూ పోలీసులకు దొరక్కకుండా తప్పించుకుని తిరిగాడు.  

బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో వైకాపా, తెదేపా బిజీ బిజీ

  కాదేది రాజకీయలకనర్హం అన్నట్లు, కృష్ణా మిగులు జలాల వినియోగంపై ఇటీవల వెలువడిన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కూడా రాజకీయ పార్టీలకు ఒక కొత్త అస్త్రంగా అందివచ్చింది. ప్రస్తుతం తెలంగాణావాదుల దృష్టి అంతా రాయల తెలంగాణా వ్యతిరేఖ పోరాటాల మీదనే ఉంది గనుక అక్కడి పార్టీలేవీ ఈ అంశాన్ని పట్టించుకొనే పరిస్థితుల్లో లేవు. కానీ, సీమాంధ్రపై పట్టుకోసం పోరాటాలు చేస్తున్న తెదేపా, వైకాపాలు మాత్రం ఈ అంశం ఆయుధంగా చేసుకొని ధర్నాలకు శ్రీకారం చుట్టాయి.   తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో ఈరోజు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వేలాది రైతులు పాల్గొంటున్నభారీ ధర్నాచేస్తుండగా, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన కారణంగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులిచింతల ప్రాజెక్టు వద్ద ధర్నా చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన లేఖ వలనే ఈ అనర్ధం జరిగిందని తెదేపా వాదిస్తుంటే, చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వలననే ఈ పరిస్థితి ఏర్పడిందని వైకాపా వాదిస్తూ బోడి గుండుకి మోకాలుకీ ముడి పెట్టే ప్రయత్నం చేస్తోంది.   ఏమయినప్పటికీ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెదేపా, వైకాపాలకు ఆయాచితంగా అస్త్రాలు అందించిందని చెప్పవచ్చును. అయితే అందరికంటే మొదట స్పందించవలసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. త్వరలో రాష్ట్ర శాసనసభకు రానున్న తెలంగాణా బిల్లుని ఏవిధంగా ఎదుర్కోవాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రికి, ఆయన అనుచరులకు తీరిక లేకపోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది.

ఢిల్లీలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

      త్రిముఖ పోటీ నడుమ ఉత్కంఠను రేపుతున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 810 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.20 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం అధికారులు 11,992 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 70 వేల మంది పోలీసులతో భారీ భద్రత ను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్, పలువురు ముఖ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాయల`టి`కి నిరసనగా బంద్‌

  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిన కేంద్రం కొరివితో తలగొక్కుంది. ఇన్నాళ్లు సీమాంద్ర ప్రాంతంలోని నిరసనలతోనే రాష్ట్రం అట్టుడికి పోతుంటే ఇప్పుడు తాజా రాయల తెలంగాణ ప్రతిపాదనతో మరోసారి తెలంగాణ ప్రాంతం కూడా భగ్గుమంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను పలువురు తెలంగాణ వాదులు వ్యతిరేకించాగా తాజాగా కెసిఆర్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు కెసిఆర్‌. తెలంగాణ ప్రజలు కేవలం పది జిల్లాల తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నారని.. అది తప్ప వేరే ఏది అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కెసిఆర్‌ ప్రాణాలు పోయినా రాయల తెలంగాణ అంగీకరించబోమన్నారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టుగా ఆయన ప్రకటించారు. బుధవారం నిరసనలతో పాటు గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు కెసిఆర్‌. ఈ నెల 6 నుంచి జరిగే టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు.