మంత్రివర్గ మంతనాల్లో నరేంద్రమోడీ

  త్వరలో ప్రధాన మంత్రి పీఠాన్ని అలంకరించబోతున్న నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో సహచరులుగా ఎవరుండాలనే అంశం మీద ప్రస్తుతం దృష్టిని కేంద్రకరించారు. దీనికోసం భారీ స్థాయిలో కసరత్తు చేస్తు్న్నారు. దీనిలో భాగంగా తన సన్నిహితుడు, భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ, పలువురు బీజేపీ, ఆర్ఎఎస్ నాయకులతో ఢిల్లీలోని సంఘ్ పరివార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు పార్లమెంట్‌కి ఎన్నికకావడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది. దీనితోపాటు బీజేపీకి పూర్తి మెజారిటీ వున్నప్పటికీ ఎన్నికల ముందే పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు కూడా ప్రభుత్వంలో అవకాశం కల్పించాలన్న ఆలోచనలో మోడీ వున్నట్టు తెలుస్తోంది. అలా ఎన్డీయే భాగస్వా్మ్య పార్టీలలో వున్న మంత్రి పదవి ఆశావహుల సంఖ్య కూడా బాగానే వుంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలూ సంతృప్తిపడేలా మంత్రివర్గాన్ని కూర్చడం కోసం మోడీ శ్రమిస్తున్నట్టు సమాచారం.

జగన్.. నీ మద్దతుకో నమస్కారం: బీజేపీ స్పష్టీకరణ

  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తానని పిలవని పేరంటానికి వెళ్ళినట్టు ఢిల్లీకి వెళ్ళి మరీ చెప్పిన వైఎస్సార్సీపీ నాయకుడు జగన్‌కి బీజేపీ ఒక పెద్ద నమస్కారం పెట్టేసింది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తమ కూటమిలో ఉన్నంత వరకు తమకు ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ అవసరం లేదని బిజెపి సోమవారం స్పష్టం చేసింది. బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ పార్టీకి, ప్రభుత్వానికి జగన్ మద్దతు అవసరం లేదని మొహమ్మీద కొట్టినట్టు మరీ చెప్పారు. తమ కూటమిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పారు. ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తమకు మరో పార్టీ అవసరం లేదని తేల్చి చెప్పడంతో జగన్ డల్లయిపోయినట్టు సమాచారం.

టీఆర్ఎస్, ఎంఐఎం భాయీ భాయీ...

  టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ కట్టాయి. తెలంగాణలో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నిర్ణయించుకున్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నందున భవిష్యత్తులో పెట్టుకోబోయే పొత్తులపై త్వరలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య చర్చలు జరగనున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఎంఐఎం తమకు మిత్రపక్షంగానే ఉంటుందని, తమకు పూర్తి సహకారం అందించేందుకు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ రెండు పార్టీలు కలిసి నెరవేరుస్తామని అన్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. టీఆర్ఎస్ లౌకికవాద పార్టీ అని, త్వరలో తాము కేసీఆర్ను కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేసేందుకు రెండు పార్టీలు యోచిస్తున్నాయి. ఈ కలయిక తెలంగాణను ఎటు తీసుకువెళ్తుందో కాలమే నిర్ణయించాలి.

ఇరగదీసిన క్రికెటర్లు.. గేల్, డివిలయర్స్, కోహ్లీ...

వీరబాదుడు బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్, డివిలియర్స్, కోహ్లీ తమ సహజ శైలిలో వీరబాదుడు బాదడంతో ఐపీఎల్-7లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు సాధించింది. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్‌లకు తలో వికెట్టు లభించింది. ఆ తర్వాత 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఒక బంతి మిగిలి వుండగానే విజయం సాధించింది. బెంగళూరు ఓపెనర్లు ఓపెనర్ పార్ధీవ్ పటేల్ (10) పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికీ, క్రిస్ గేల్ (46) పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లి(27) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ చివర్లో ఏబీ డివిలియర్స్(28) పరుగులను దూకుడుగా చేయడంతో బెంగళూర్ గెలుపొందింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ ,డేవిడ్ హస్సీలకు తలో రెండు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్టు దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డివిలియర్స్ తప్ప మరొకరు ఎందుకవుతారు?

నరేంద్రమోడీకి మద్దతిస్తా... జగన్ అత్యుత్సాహం

కేంద్రంలో ఎవరి మద్దతూ అవసరం లేని స్థాయిలో భారతీయ జనతాపార్టీ వుంది. అయితే ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుల విషయంలో ఆ పార్టీకి గౌరవం వుంది. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం పిలవని పేరంటంలాగా బీజేపీకీ, ఎన్డీయేకి మద్దతు ఇస్తానని కొత్త పాట అందుకున్నారు. బీజేపీకి చేరువైపోవాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తాను ఎప్పుడూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెబుతున్నారు. మోడీని కలవటానికి ఎంపీల బృందంతో ఢిల్లీకి వెళ్ళిన జగన్ మీడియాతో మాట్లాడుతూ, మోడీ విషయంలో తన పవిత్రతను చాటుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ సహాయం అవసరమని, అందుకు ఎన్డీయెకు అంశాలవారీగా మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు దారుణంగా విభజించిందని, అలా జరిగిన విభజన విషయంలో కొన్ని మార్పులు అవసరమని, బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో ఆ మార్పులను నరేంద్ర మోడీ చేస్తారని ఉద్దేశంతో వినతిపత్రం సమర్పించడానికి వచ్చామని ఆయన చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని మోడీని కోరుతామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఈ దేశ ప్రధాని సాయం అవసరమని, అందుకు అంశాలవారీగా ఎన్డీయేకిమద్దతు ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారు.

జర్నలిస్టులని చావగొట్టిన డీఎంకే కార్యకర్తలు

  ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన డీఎంకే పార్టీ కార్యకర్తలు డిప్రెషన్‌లో, ఫస్ట్రేషన్‌లో వున్నట్టున్నారు. వాళ్ళ కళ్ళకి జర్నలిస్టులు తేరగా కనిపించినట్టున్నారు. అందుకే వాళ్ళని చావగొట్టారు. ఆదివారం డీఎంకే నాయకుడు స్టాలిన్ ఇంట్లో జరిగిన ఒక సమావేశానికిహాజరైన జర్నలిస్టులపై డీఎంకే కార్యకర్తలు దాడికి దిగారు. అందినోళ్ళని అందినట్టు చావబాదారు. ఈ ఘటనలో దాడికి దిగిన డీఎంకే కార్యకర్తలను అరెస్టు చేసిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ఓటమిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు డీఎంకే ఈ చావబాదుడు కార్యక్రమం జరిపి వుండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

సోనియా అమాయకురాలు: రేణుక సర్టిఫికెట్!

  సోనియాగాంధీ చాలా అమాయకురాలు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వెనకేసుకొస్తున్నారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన రేణుక తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద విరుచుకుపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులుఅవాస్తవాలు చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని, సీమాంధ్రలో ఏమీ కాదని సోనియాను నమ్మించారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే కానీ పని చేసే వారు మాత్రం ఉండరని ఎద్దేవా చేశారు. సోనియాకు బాధాకరమైన పరిస్థితులు కల్పించింది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలే అని రేణుక తిట్టిపోశారు.

జగ్గారెడ్డి @ జనసేన?

  మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఆ నియోజవర్గంలో బలమైన కాంగ్రెస్ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా వుండాలని నినదించిన నిజమైన తెలుగుబిడ్డ. అయితే టైం బాగాలేక ఆయన ఈసారి ఎన్నికలలో ఓడిపోయారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద రోత పుట్టినట్టు కనిపిస్తోంది. అయిదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలల కోసం ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలలో డెడ్‌బాడీ లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆయన వున్నట్టు తెలుస్తోంది. సోమవారం నాడు పవన్ కళ్యాణ్‌ని కలవటం ఈ అనుమానాలకు బలం ఇస్తోంది. జగ్గారెడ్డి పవన్‌ని కలిసినప్పుడు వారు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు ఎంతో నచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి తాను పని చేస్తానని తెలిపారు. అయితే ఏవిధంగా ఆయనతో కలిసి పని చేసేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. పవన్ మాట్లాడుతూ... తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అవసరమని చెప్పారు. తెలంగాణ విషయంలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు తనకు నచ్చిందని చెప్పారు. తాను జగ్గారెడ్డితో కలిసి పని చేస్తానని తెలిపారు.

మోడీని కలవనున్న జగన్మోహన్ రెడ్డి

  కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని బెయిలుపై జైలు నుండి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఊహించని విధంగా ఎన్నికలలో ఓడిపోవడంతో వెంటనే అప్రమత్తమయినట్లున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి మరీ నిధులు తీసుకు వస్తానని భింకాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, పరిస్థితులు తారుమారవడంతో ఈరోజు తన యంపీలను వెంటేసుకొని, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న నరేంద్ర మోడీని అభినందించి, సీమాంధ్రకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరేందుకే చేందుకు డిల్లీ బయలుదేరుతున్నట్లు వైకాపా నేతలు చెప్పుకొంటున్నారు. అయితే అసలు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే.   నేడు కాకపోతే రేపయినా జగన్ సీబీఐ కేసులలో దోషిగా జైలుకు వెళ్ళాక తప్పని పరిస్థితి ఉంది గనుక, అంత ప్రమాదం ముంచుకు రాకముందే, నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకొనేందుకే డిల్లీ బయలుదేరుతున్నారనుకోవచ్చును. లేకుంటే, బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని నరేంద్ర మోడీతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు కంటే ముందే, మోడీని వ్యతిరేఖించిన జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా డిల్లీ బయలుదేరవలసిన అవసరమేమీ లేదు. అయితే చంద్రబాబు మాటను కాదని మోడీ జగన్మోహన్ రెడ్డిని కనికరిస్తారని అనుకోవడం అత్యాసే అవుతుంది.   ఇప్పుడు బీజేపీకి జగన్ మద్దతు అవసరము లేదు, గనుక అతని మాట వినవలసిన అవసరము లేదు. అందువల్ల జగన్ తన కేసులను పూర్తిగా మాఫీ చేయించుకోలేకపోయినా, కనీసం వీలయినంత ఎక్కువ కాలం తన బెయిలు పొడిగించుకొనే ప్రయత్నం చేస్తారేమో. ఏమయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ముందున్నది అంతా గడ్డు కాలమేనని చెప్పవచ్చును.

ఎందుకు ఓడించారంటూ ఏడుపు మొహం పెట్టిన పొన్నం

  తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. అయ్యగారు ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు. తాను ఎంపీనన్న విషయాన్నే మరచిపోయి నోటికొచ్చినట్టుగా సీమాంధ్రులను తిట్టేవారు. తెలంగాణలోకి వస్తే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ని పేల్చేస్తానని వార్నింగిచ్చిన ఘనుడాయ. సీమాంధ్రలను అంతగా తిడితే తనకు తెలంగాణలో ఓట్లు బాగా పడతాయని ఆయన మురిసిపోయారు. చివరికేమైంది. పార్లమెంట్ ఎన్నికలలో తుక్కుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏడుపు మొహం పెట్టి మాట్లాడారు. ‘‘ఏం పాపం చేశామని ఎన్నికల్లో మమల్ని ఓడించారు’’ అని పొన్నం ప్రభాకర్ ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణను గట్టిగా వ్యతిరేకించిన టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేసి, తెలంగాణ కోసం ఢిల్లీలో పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేసిన తమను ఎందుకు ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ తెలంగాణలో అనుకున్నమేరకు సీట్లు సాధించలేకపోయామని ఆయన లబలబలాడారు. రాష్ట్ర విభజనతో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ నష్టపోయామనే విషయం పొన్నంకి అర్థమై జ్ఞానోదయం కలిగిందట.

సీమాంధ్రకు ఉందిలే మంచికాలం ముందుముందునా: మురళీమోహన్

  రాష్ట్ర విభజన కారణంగా సీమంధ్ర దారుణంగా నష్టపోయింది. ఈ నష్టం ఎప్పటికి తీరుతుందోనన్న ఆందోళన సీమాంధ్రులలో మొన్నటి వరకు వుంది. అయితే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ వుండటంతో ఇప్పుడు సీమాంధ్రులలో వున్న భయాందోళనలను తొలగిపోతున్నాయి. ఉందిలే మంచి కాలం ముందుముందునా అనే నమ్మకం వారిలో కలిగింది. ఈ విషయాన్నే నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చెబుతున్నారు. సీమాంధ్రకు మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు రావడానికి ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సీమాంధ్రను అభివృద్ధి చేసుకోడానికి అందరం కలిసి కృషి చేద్దామన్నారు.సీమాంధ్ర అభివృద్దికి నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి వుంటానని ఆయన అన్నారు. తన విజయం టీడీపీ పార్టీ స్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు అంకితమిస్తున్నట్లు మురళీమోహన్ ప్రకటించారు.

కేసీఆర్‌కి మోడీ ఫోన్: అందరితో భాయీభాయీ!

  త్వరలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబోతున్న నరేంద్రమోడీ ఇతర రాజకీయ నాయకులు అందరితో భాయీ భాయీ.. లేడీస్‌తో అయితే భాయీ.. బెహన్ సంబంధ బాంధవ్యాలను కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు తనను దారుణంగా విమర్శించిన వారితో కూడా స్నేహపూరిత సంబంధాలను కొనసాగించాలని నరేంద్రమోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో బీజేపీకి పూర్తి మెజారిటీ వున్నప్పటికీ, ఎన్టీయే కూటమికి బోలెడంత మెజారిటీ వున్నప్పటికీ ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలతో కూడా స్నేహపూర్వకంగా వుండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మిత్రుడికి శత్రువు మనకి కూడా శత్రువు అనుకుంటాం. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఈ సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు కనిపిచండం లేదు. చంద్రబాబు నాయుడికి జగన్, కేసీఆర్ రాజకీయంగా శత్రువులు. వీళ్ళిద్దరూ గడచిన ఎన్నికలలో నరేంద్రమోడీ మీద కూడా మాటల తూటాలు విసిరారు. అయినప్పటికీ మోడీ వీళ్ళిద్దరితో స్నేహపూర్వకంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మెజారిటీ సాధించిన కేసీఆర్‌కి నరేంద్రమోడీ ఫోన్ చేశారు. ఎన్నికలలో గెలిచినందుకు అభినందనలు తెలిపారు. త్వరలో తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ఆహ్వానించారు. కేసీఆర్ కూడా మురిసిపోయి అలాగేనని చెప్పారు. అదేవిధంగా మరోవైపు జగన్ మోడీని కలవటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తానొక్కడే కాకుండా తన ఎంపీలందరితో కలసి మోడీనికి కలిసి అభినందనలు చెప్పడానికి అపాయింట్‌మెంట్ కూడా దొరికింది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మొన్నటి వరకూ మోడీని నానామాటలూ అన్నారు. మోడీ ఆమెతో కూడా స్నేహపూరితంగా వ్యవహరించబోతున్నారు. అలాగే బెంగాలీ దీదీ మమతా బెనర్జీతో కూడా మంచిగా వుండాలని మోడీ తమ్ముడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాయనా మోడీ.. నువ్వు ఎవరితో అయినా మంచిగా వుండుగానీ, సీమాంధ్రని సర్వనాశనం చేసినవాళ్ళతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా వుండు.

జూన్ రెండు తరువాతే కేసీఆర్ పదవీ ప్రమాణం

  తెలంగాణాలో ఘనవిజయం సాధించిన తెరాస, తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకొని, అదేవిషయాన్ని గవర్నర్ నరసింహన్ కు నిన్న లికిత పూర్వకంగా తెలియజేసారు. పనిలోపనిగా తెలంగాణా అప్పాయింటడ్ డేట్ జూన్ రెండును ముందుకు జరపవలసిందిగా మరో మారు అభ్యర్ధించారు. అయితే ఆ విషయంలో తానేమీ చేయలేనని గవర్నర్ చెప్పినట్లు సమాచారం. అందువల్ల కేసీఆర్ కూడా జూన్ రెండు లేదా ఆ మరునాడే తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చును. కేసీఆర్ క్యాబినెట్లో ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులకే కీలకమయిన మంత్రి పదవులు దక్కుతాయని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కేసీఆర్ కుమార్తె కవిత లోక్ సభకు పోటీ చేసినందున ఆమె కేసీఆర్ మంత్రివర్గంలో చేరకపోవచ్చును. కానీ ఆమెను కేసీఆర్ తన మంత్రి వర్గంలో చేర్చుకొన్నా ఆశ్చర్యం లేదు.

విజయవాడలో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం

  చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవాడ స్వరాజ్ మైదానంలో జూన్ రెండు లేదా మూడు తేదీలలో ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నట్లు తాజా సమాచారం. మొదట ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, విజయవాడకే ఆయన మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయంలో తన తాత్కాలిక క్యాంపు ఏర్పాటు చేసుకొబోతున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ అంటే డీజీపీ కార్యాలయం వగైరాలు ఏర్పాటుచేయబోతున్నట్లు తాజా సమాచారం. గుంటూరు, విజయవాడ, తెనాలి మూడు ప్రాంతాలను కలుపుతూ మెట్రో నగరాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కనుక కొత్త రాజధాని కూడా ఈ ప్రాంతాల మధ్యనే ఉంటుందని చెప్పవచ్చును. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ, కొత్త రాజధాని నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా గుంటూరులో తన క్యాంపు కార్యాలయం నుండే చంద్రబాబు ప్రభుత్వ నిర్వహణ చేయవచ్చును. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, సెక్రటరియేట్ ఉద్యోగులు హైదరాబాదులోనే ఉన్నందున అవసరాన్ని బట్టి కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు గుంటూరు నుండి పరిపాలన సాగించ వచ్చును.

ప్రజల విజ్ఞతను తప్పుబడుతున్న కాంగ్రెస్, వైకాపాలు

  చంద్రబాబు, కేసీఆర్ ఇరువురూ ఇచ్చిన భూటకపు హామీలు, చెప్పిన మాయమాటలను నమ్మి ప్రజలు ఓటేయడంతో వారు విజయం సాధించగలిగారని ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు, జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అంటే, వారి దృష్టిలో ప్రజలు ఆలోచనా జ్ఞానం లేని అవివేకులు, బుద్ధిహీనులన్నమాట. ఆ లెక్కన వారి దృష్టిలో దేశ ప్రజలందరూ కూడా బుద్ధిహీనులేననుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మోడీ చెప్పిన మాయ మాటలు విని బీజేపీకి అఖండ మెజార్టీ కట్టబెట్టారు. అయితే ఈ విజేతలకు ఓటేసినవారిలో కేవలం గ్రామీణులు, నిరక్షరాశ్యులే కాదు కోట్లాది మంది ఉన్నత విద్యావంతులు, మేధావులు కూడా ఉన్నారు. అటువంటి వారిచ్చిన తీర్పుని తప్పుబట్టడం కాంగ్రెస్, వైకాపాల అవివేకం, అహంకారానికి నిదర్శనమని చెప్పవచ్చును. అయితే వారు కూడా తెరాస, తెదేపాలకు తీసిపోకుండా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను గుప్పించిన సంగతి విస్మరించారు. ఒకవేళ ప్రజలు వారి హామీలను నమ్మి వారికే ఓటేసి గెలిపిస్తే, అప్పుడు వారికి విజ్ఞత ఉన్నట్లు భావిస్తారేమో.   కాంగ్రెస్ పార్టీ తన అసమర్ధ, అవినీతి పాలనకు మూల్యం చెల్లిస్తే, వైకాపా గత ఐదేళ్ళ కాలంలో గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకోకుండా, కేవలం సానుభూతి అంశం పట్టుకొని వ్రేలాడుతూ ఓటమిపాలయింది. వారి ఓటమికి ఇటువంటి అనేక కారణాలున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ప్రజల విశ్వసనీయత కోల్పోయినందునే ఓడిపోయాయి. అది పూర్తిగా స్వయంకృతాపరాధమే. అయితే అందుకు తమ ప్రత్యర్ధులను, వారికి ఓటేసి గెలిపించిన ప్రజలను, వారి విజ్ఞతను తప్పుబట్టడం అవివేకమే.

మధు యాష్కి సరికొత్త ఏడుపు

      సీమాంధ్రులను తిట్టిపోయడంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి అందరికంటే ముందుండేవాడు. రాహుల్ గాంధీకి ఫ్రెండ్ అయిన మధు యాష్కి రాహుల్‌కి తప్పుడు నివేదికలు, లేనిపోని ఆశలు కల్పించి, తెలంగాణ ఇస్తే ఎంపీ సీట్లన్నీ మనవేనని సీన్ క్రియేట్ చేసి మొత్తానికి తెలంగాణ వచ్చేలా చేశాడు. చివరికి ఏమయింది.   తెలంగాణ కోసం ఎంతో పాటు పడ్డానని బిల్డప్ ఇచ్చుకునే మధు యాష్కి కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత చేతిలో దారుణంగా ఓడిపోయాడు. ఊహించని విధంగా ఓడిపోవడంతో మధు యాష్కికి మైండు ఖరాబైందేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినా, దానిలో సీమాంధ్రులకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన సీమాంధ్రుల మీద విషం కక్కడం మానలేదు. ఇలా ఓడిపోయాడో లేదో అలా బయటకి వచ్చిన మధు యాష్కి తాను వున్న కాంగ్రెస్ పార్టీని కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని పొగడ్డం మొదలెట్టాడు. టీఆర్ఎస్ సూపర్‌గా గెలిచిందని సర్టిఫికెట్ ఇచ్చాడు. అక్కడితే ఆగితే బాగుండేది, తాను ఓడిపోవడం బాధ కలిగించడం లేదుగానీ, తెలంగాణలో టీడీపీ, వైకాపా గెలవటం తనకి బాధ కలిగిస్తోందని అన్నాడు. ఓడిపోయిన పెద్దమనిషి ఇంట్లో కూర్చోడంట. సామాజిక తెలంగాణ కోసం పాటుపడుతూనే వుంటాడట.