రాజీనామా చేయనుగాక చేయనంతే...

      దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మటాష్ అయిపోగానే బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు కొంతమంది రాజీనామా బాట పట్టారు. బీహార్‌లో నితిష్ కుమార్ రాజీనామా చేసేశాడు. అస్సాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేస్తానని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా, రాహుల్ కూడా రాజీనామా చేసేస్తామని చెబితే కాంగ్రెస్ నాయకులంతా కాళ్ళావేళ్ళాపడి ఆపారు. వీళ్ళ వరస ఇలా వుంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మాత్రం తన పదవికి రాజీనామా చేయనుగాక చేయనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఓటమి తర్వాత పార్టీ నాయకురాలు సోనియాగాంధీని కలసి వచ్చిన వీరభద్రసింగ్ బయటకి వచ్చాక. తనను ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని, ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ఓడిపోయినంత మాత్రాన పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌‌లోని నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.

సీమాంధ్రకు న్యాయం చేయండి: మోడీ

      రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు చాలా అన్యాయం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో బలపడాలన్న కాంగ్రెస్ అత్యుత్యాహం వల్ల సీమాంధ్ర ఎంతగానో నష్టపోయింది. విడిపోతామన్నది తెలంగాణ వాదులే అయినప్పటికీ, సీమాంధ్ర అన్యాయానికి గురైంది. చెట్ల కింద కూర్చుని పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితిలో సీమాంధ్ర వుంది. సీమాంధ్రకి విభజనలో అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రధాని కాబోతున్న నరేంద్రమోడీకి స్పష్టంగా తెలుసు. ఎన్నికల ముందు కూడా ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఆయన ఈనెల 26న ప్రధాని పీఠం మీద కూర్చోబోతున్నారు.   ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి రెండు రోజుల క్రితం మోడీని కలిసినట్టు తెలిసింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన వివరాలతో అనిల్ గోస్వామి మోడీని కలిసినట్టు సమాచారం. ఈ సందర్భంగా అనిల్ గోస్వామితో చర్చించిన మోడీ, రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రకు న్యాయం చేయడానికి ఏయే చర్యలను తీసుకున్నారని ఆయనను ప్రశ్నించారని తెలిసింది. అలాగే విభజన ప్రక్రియలో ఏవైనా లోపాలు వుంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించినట్టు సమాచారం. మోడీతో జరిగిన చర్చ వివరాలను హోంశాఖ కార్యదర్శి కేబినెట్ కార్యదర్శికి తెలియజేయగా, రాష్ట్ర విభజనపై త్వరలో మోడీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి విభజనపై మోడీకి పూర్తి అవగాహన వచ్చేలా చేయాలని కేబినెట్ కార్యదర్శి నిర్ణయించినట్టు తెలుస్తోంది.  ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూశాక మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలంగాణ సెక్రటేరియట్‌లో కల్తీ వుండకూడదు: కేసీఆర్

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మళ్ళీ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. గురువారం ఉద్యోగసంఘాల భేటీలో మాట్లాడిన ఆయన ఉద్యోగుల సమస్యల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయంలో కల్తీ ఉండటానికి వీలే లేదు. రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవాళ్లు అధికారులైనా, నాయకులైనా, ఉద్యోగసంఘాల నాయకులైనా.. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. లక్షల ఉద్యోగాలు పోతున్నా ఊరుకున్నారు. సహనంతో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా మా స్వేచ్ఛ మాకు ఉండనీయమంటే ఎవ్వరూ సహించరు, భరించరు. రాష్ట్రాలు వేరైనా దేశం ఒకటే, మీరూ బాగుండండి, మేమూ బాగుంటాం. ఎవరి సెక్రటేరియట్లో వాళ్లే ఉందాం. అనవసరంగా కొట్లాడుకుంటామంటే ఇద్దరికీ టైం వేస్టు. అందులో రాజీపడేది లేదు అని కేసీఆర్ అంటున్నారు. ‘‘కచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో, ఆంధ్ర వాళ్లు ఆంధ్రాలోనే ఉండాలి. మేం మా పరిపాలనలో ఉంటాం.. మీరు మీ పరిపాలనలో ఉండాలి’’ అని స్పష్టంగా చెప్పారు.

జాక్‌పాట్ కొట్టిన టీడీపీ గజపతి: మోడీ కేబినెట్‌లో స్థానం

  విజయనగరం టీడీపీ ఎంపీగా గెలిచిన అశోకగజపతిరాజుకు కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించే అవకాశాలు వుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన్ని అదిరిందయ్యా అశోక్ గజపతీ.. మోడీ కేబినెట్‌లో అవకాశం సంపాదించావని అభినందిస్తున్నారు. ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోడీ కేబినెట్‌లో అశోక్ గజపతి రాజు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలిసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చేరుతామని టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయో అన్న అంశంపై రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చ సాగింది. టీడీపీకి మొత్తం 13 మంది ఎంపీలు ఉండగా, వీరిలో ఒకరికి కేబినెట్ ర్యాంకు ఇవ్వనున్నారు. మరో రెండు సహాయ మంత్రులను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మోడీ మంత్రివర్గంలో కేబినెట్ హోదా దక్కించుకోనున్న వారిలో ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు ముందు వరుసలో ఉన్నారు.

గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ ప్రమాణం

      గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు గుజరాత్ గవర్నర్ కమలా బేనీవాలా ఆనందీబెన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్, మోడీ, గడ్కరీతో పాటు పలువురు హాజరయ్యారు. కేశుభాయ్, మోడీ ప్రభుత్వాల్లో ఆనందీబెన్ కీలక పాత్ర పోషించారు. ప్రభావశీల మహిళల్లో ఒకరుగా ఆనందీబెన్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గుర్తించింది. ఆనందీ బెన్ పటేల్ 1941 నవంబర్ 21న జన్మించారు. ఆమె వయస్సు 72. బిజెపిలో ఆమె వివిధ హోదాల్లో, ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆనందీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కోటీశ్వరురాలు కూడా కాదు. రైతు కుటుంబానికి చెందిన మహిళ. అయితే పట్టుదల, ధైర్యం, యోగ్యత.. తదితరాలు ఆమెను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఆమెది రాజీపడే తత్వం కాదని పరిశీలకులు అంటున్నారు.

జాతీయ పార్టీగా టిడిపి

      తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారడానికి సిద్దమవుతోంది. ఈ మేరకు ఈ నెలలో జరిగే మహానాడు సమావేశాల్లో తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా నమోదైన టీడీపీ ఇప్పటిదాకా అదే ప్రతిపత్తితో ఉంది. రాష్ట్రం రెండుగా విభజితమైన తర్వాత రెండు రాష్ట్రాల్లో పాత గుర్తుతో పోటీచేయడానికి ఆ పార్టీ జాతీయ పార్టీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మూడు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు వస్తే ఆ పార్టీకి జాతీయ హోదా వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ఓట్ల శాతం సాధించడంలో ఆ పార్టీకి ఇబ్బంది లేదు. మరో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. దీనికోసం తెలుగువారి సంఖ్యాబలం అధికంగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి చోట్ల కూడా పార్టీ శాఖలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపాదన ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది.

అధికారం కోసం ఆమాద్మీ మళ్ళీ వీధి నాటకాలు

  ఒక ఏడాది క్రితం ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తన అనుచరులతో కలిసి డిల్లీ రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు పోలీసులు ఆయనను, ఆయన అనుచరులను అరెస్ట్ చేస్తుండేవారు. కానీ ఆ తరువాత ఆయన డిల్లీ ముఖ్యమంత్రి పీటం అధిష్టించినప్పుడు అదే డిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేవారు. మళ్ళీ అదే డిల్లీ పోలీసులు ఇప్పుడు ఆయనను తీహార్ జైలుకి తరలించారు. కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం విడుదలచేసిన అవినీతిపరుల జాబితాలో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి పేరు కూడా ఉండటంతో ఆయన కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసులో కోర్టుకి హాజరయిన కేజ్రీవాల్ బెయిలు కోసం రూ.10,000 కట్టేందుకు నిరాకరించడంతో ఆయనకు డిల్లీ కోర్టు శుక్రవారం వరకు జ్యుడీసరీ రిమాండ్ విదించడంతో పోలీసులు ఆయనను తీహార్ జైలుకి తరలించారు. ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు ఆయన అరెస్టును నిరసిస్తూ జైలు ముందు వీరంగం వేయడంతో పోలీసులు వారిపై కూడా లాటీలు ప్రయోగించవలసి వచ్చింది. ఓడలు బళ్ళవడమంటే బహుశః ఇదేనేమో.   ఒకప్పుడు పదవులు అధికారంపై తమకు ఎటువంటి ఆశలేదని నీతి కబుర్లు పలికిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఇతర రాజకీయనేతల లాగే, అధికారం కోసం వెంపర్లాడుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మళ్ళీ డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటూ గవర్నర్ నజీబ్ జంగ్ ని కలిసారు. కానీ అది సాధ్యపడక పోవడంతో, మళ్ళీ తనను ఆదరించిన డిల్లీ ప్రజల మనసులు గెలుచుకొనేందుకు తాము అధికారం నుండి అర్ధాంతరంగా తప్పుకోవడం తప్పేనని, అందుకు డిల్లీ ప్రజలను క్షమించి మళ్ళీ ఎన్నికలలో తమ పార్టీకే పూర్తి మెజార్టీ కట్టబెడితే పూర్తి ఐదేళ్ళు సమర్ధంగా పాలిస్తానని హామీ ఇచ్చారు.   ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇతర రాజకీయ నేతలలాగే ఈ కేసుల వ్యవహారం ద్వారా ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుండటం గమనార్హం. అందుకే కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు అంగీకరించినప్పటికీ, ఆయన పూచీకత్తు కట్టేందుకు నిరాకరించి జైలుకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. అప్పుడు ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఇతర రాజకీయ పార్టీలలాగే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు జైలు బయట ధర్నాలు చేసి పోలీసుల చేతిలో లాటీ దెబ్బలు తిని పోలీసు వ్యానులు ఎక్కారు.   అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఆమాద్మీ పార్టీ నేతలు కూడా ఇప్పుడు సరిగ్గా కాంగ్రెస్ పార్టీలాగే వ్యవహరిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. అధికారం కోసం తాము ఆడుతున్న ఈ నాటకాలు ప్రజలకు అర్ధం కావని, వారిని ఇటువంటి నాటకాలతో మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికలలో గెలవవచ్చని ఆమాద్మీ పార్టీ నేతలు భావిస్తున్నారు. అటువంటి నాటకాలు ఆడినందుకే కాంగ్రెస్ పార్టీకి, తమకు కూడా దేశప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో కళ్ళార చూసిన తరువాత కూడా ఆమాద్మీ నేతలు ఇంకా ఇటువంటి వీధి నాటకాలు ఆడటం చూస్తుంటే వారికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని అర్ధమవుతోంది.

గుంటూరు-విజయవాడ మధ్య కొత్త రాజధాని?

  త్వరలో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించా బోతున్న చద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇరువురూ కూడా హైదరాబాదులో తమకు కేటాయించిన క్యాంపు కార్యాలయాలకు బదులు వేరే చోట కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. చంద్రబాబు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒక భవనంలో తన క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసుకొంటుంటే, కేసీఆర్ కుందన్ భాగ్ లో రెండు మంత్రుల క్వార్టర్లను కలిపి తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముగ్గురూ కూడా బేగంపేటలోని అత్యాధునిక క్యాంప్ కార్యాలయం ఉపయోగించుకొన్నారు. కానీ కేసీఆర్ వాస్తు దృష్ట్యా కుందన్ భాగ్ లో మంత్రుల క్వార్టర్లను తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకొంటున్నారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చంద్రబాబు గుంటూరులో తన కార్యాలయం ఏర్పాటు చేసుకొంటున్నారు. ఆయన గుంటూరు నుండే పరిపాలన చేయాలనుకొంటున్నందున, ఉన్నతాధికారులు కూడా ఆయనతో బాటే గుంటూరు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. వారందరికీ గుంటూరుకు సమీపంలో ఉన్న మంగళగిరిలో గల ఏపీఎస్పీ బెటాలియన్‌లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక సచివాలయంగా మారనుందన్నమాట. గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న సువిశాలమయిన ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పరిపాలనా, భద్రతా విభాగాలలో ముఖ్యమయిన శాఖలను, అధికారులను, ఉద్యోగుల కోసం తాత్కాలిక కార్యాలయాలు, వసతి గృహాలు వగైరాలు ఏర్పాటు చేసుకొని వారిని తరలించిన తరువాత, కొత్త రాజధాని నిర్మాణం గురించి ఆలోచించ వచ్చని చంద్రబాబు యోచిస్తున్నారు. ఆయన గుంటూరులో తాత్కాలిక క్యాంపు కార్యాలయం, సచివాలయం ఏర్పాటు చేసుకొంటున్నారు గనుక కొత్త రాజధాని కూడా గుంటూరు-విజయవాడ మధ్య నిర్మించెందుకే మొగ్గు చూపవచ్చును.

పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి పదవి వద్దన్నాడా?

      ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. తన అన్న చిరంజీవి కూడా అందుకోనంత గౌరవాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అందుకుంటున్నాడు. ఎన్నికలలో పోటీ చేయకుండా, ఒక్క ఎంపీ స్థానం కూడా తన పార్టీ అకౌంట్‌లో లేకుండా వున్నప్పటికీ ఎన్డీయే పార్టీల సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించారంటే భారతీయ జనతాపార్టీ పవన్ కళ్యాణ్‌ని ఎంత గౌరవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా వుంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక వార్త షికారు చేస్తోంది. మోడీ కేబినెట్‌లో పవన్ కళ్యాణ్‌కి మంత్రి పదవి ఆఫర్ చేశారని, అయితే పవన్ కళ్యాణ్ తనకు మంత్రి పదవి వద్దని సున్నితంగా తిరస్కరించారనే వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం వుందీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కేంద్రమంత్రి పదవి వస్తుందంటే ఎంత పని చేయడానికైనా సిద్ధంగా వున్న రాజకీయ నాయకులన్న ఇలాంటి రోజుల్లో పిలిచి మంత్రి పదవి ఇస్తానంటే వద్దనేవారు ఎవరైనా వుంటారా? పవన్ కళ్యాణ్ పదవులకు మరీ అంత దూరంగా వుంటారా.. ఈ ప్రచారాన్ని నమ్మొచ్చా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

జ్యుడీషియల్ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్.. ఛలో తీహార్ జైల్

      ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌ని దరిద్రం పట్టుకున్నట్టుంది. బంగారం లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని వదిలేశాడు. మొన్న జరిగిన ఎన్నికలలో ఢిల్లీలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. తాజాగా ముఖ్యమంత్రి పదవిని వదిలేసి చాలా తప్పు చేశానని కేజ్రీవాల్ చెంపలు వేసుకున్నాడు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయకండని, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని ప్రకటించాడు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి కేజ్రీవాల్‌కి మద్దతు ఇచ్చే ఛాన్సే లేదని ప్రకటించేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కేజ్రీవాల్ వున్నాడు.   అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌కి మరో తలనొప్పి వచ్చిపడింది. బీజేపీ నాయకుడు గడ్కరి దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కి మే 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు జ్యుడీషియల్ కస్టడీ రాకుండా చేసుకోవాలని కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. రెండు రోజుల పాటు ఆయన తీహార్ జైల్లో వుండక తప్పదు.

మోడీ స్థానంలో గుజరాత్ సీఎంగా ఆనందీ బెన్?

      నరేంద్రమోడీ భారతదేశ ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? ఈ బాధ్యతలు ఒక మహిళకు దక్కనున్నట్టు తెలుస్తోంది. మోడీ స్థానంలో సీఎం కావాలని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలామంది కలలు కంటున్నారు. వీరిలో సౌరభ్ పటేల్, నితిన్ పటేల్ ప్రధానంగా వున్నారు. అయితే గుజరాత్ తదుపరి సీఎం రాష్ట్ర రెవిన్యూ మంత్రి ఆనందిబెన్ పటేల్ అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మోడీ మద్దతు కూడా ఈమెకే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఆనందీ బెన్ పటేల్ 1941 నవంబర్ 21న జన్మించారు. ఆమె వయస్సు 72. బిజెపిలో ఆమె వివిధ హోదాల్లో, ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆనందీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కోటీశ్వరురాలు కూడా కాదు. రైతు కుటుంబానికి చెందిన మహిళ. అయితే పట్టుదల, ధైర్యం, యోగ్యత.. తదితరాలు ఆమెను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఆమెది రాజీపడే తత్వం కాదని పరిశీలకులు అంటున్నారు.

గవర్నర్ నరసింహన్ త్వరలో ఇంటికేనా...?

      రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ త్వరలో తన గవర్నర్ గిరీని కోల్పోబోతున్నారా? దేశంలో మారిన రాజకీయ పరిస్థితులు, పరిణామాలు చూస్తే ఈ అనుమానం వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నర్లను మోడీ బీజేపీ ప్రభుత్వం మార్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వెల్లడవుతున్నాయి. పైగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పదవీకాలం ఏనాడో ముగిసింది.   రాష్ట్ర విభజన పుణ్యమా అని ఆయనకి  ఎక్స్ టెన్షన్ దొరికింది. అంతేకాకుండా ఆయనను  జూన్ 2 నుంచి పుట్టబోయే రెండు రాష్ట్రాలకీ ఉమ్మడి గవర్నర్ని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పదవిలో నుంచి దిగిపోయే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఫైల్ మీద కూడ సంతకం చేసి మరీ దిగిపోయాడు. అయితే ఆ ఫైలు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే నరసింహన్ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతారు. అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియమించిన నరసింహన్ గవర్నర్‌గా కొనసాగే అవకాశాలు తక్కువన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను డీల్ చేయాలంటే తమకు అనుకూలంగా వుండే, తమ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తి ఈ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా వుండే మంచిదని కొత్త ప్రభుత్వం ఆలోచించే అవకాశం వున్నందున నరసింహన్ ఇంకా ఎక్కువకాలం గవర్నర్‌గా కొనసాగే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మోడీ ప్రమాణ వేడుకకు కేసిఆర్

      భారతదేశ ప్రధాన మంత్రిగా బిజెపి నేత నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ, తన ప్రమాణ స్వీకర కార్యక్రమానికి కూడా హాజరు కావాలని ఆయనను కోరారు. మోడీతో పాటు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కెసిఆర్‌కు ఫోన్ చేసి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందించి, ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. దీంతో కెసిఆర్ ఈ నెల 26న మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపైన బిజెపి అగ్రనేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

వికటించిన జగన్ ఓదార్పు మంత్రం

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఇద్దరూ కూడా ఉద్యమాలు చేసారు. ఇద్దరూ కూడా పార్టీ నిర్మాణం చేసుకోకుండా కేవలం సెంటిమెంటునే నమ్ముకొని ఎన్నికలకి వెళ్ళారు. వారిరువురూ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తారని సర్వే నివేదికలన్నీ ఖరారు చేసాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇద్దరూ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వలనుకొన్నారు. ఇరు పార్టీలు కూడా స్థానిక ఎన్నికలలో తెదేపా, కాంగ్రెస్ పార్టీల కంటే వెనుకడిపోయాయి. కానీ సార్వత్రిక ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధిస్తే, వైకాపా మాత్రం ఘోర పరాజయం చవి చూసింది.   కేసీఆర్ ప్రజల కోసం తెలంగాణా ఉద్యమాలు చేసి అందులో ప్రజలను కూడా భాగస్తులను చేయడం ద్వారా వారికి అది తమ కోసం తాము చేసుకొంటున్న ఉద్యమమేననే భావన కలిగించి, వారిలో ఆయన పట్ల నమ్మకం కలిగించగలిగారు. అందుకే ప్రజలు తెరాసకు ఓటువేసి ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ, షర్మిల చేసిన పాదయాత్రలు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రలు, ఉద్యమాలు, దీక్షలు అన్నీ కూడా కేవలం తను ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతోనే చేసారు గనుకనే ఆయనను ప్రజలు తిరస్కరించారు.   కేసీఆర్ (తెలంగాణా) సెంటిమెంటుతో ప్రజలనందరినీ తనవైపు తిప్పుకోగాలిగారు. ఎందువలన అంటే అది వారందరి జీవితాలతో ముడిపడి ఉన్నసమస్య. కానీ జగన్ ప్రయోగించిన తండ్రి మరణం తాలూకు సానుభూతి సెంటిమెంటుతో ప్రజలు ప్రభావితులవలేదు. కారణం ఒక వ్యక్తి మరణం సమాజాన్ని కలకాలం ప్రభావితం చేయలేదు.   మహాకవి శ్రీశ్రీ లోకంలో బాధలను తన బాధలుగా భావించి రచనలు చేస్తే, కృష్ణశాస్త్రిగారు తన మనసులో వేదననే అద్భుతంగా వర్ణిస్తూ గొప్ప రచనలు చేసి ప్రజలను ఆకట్టుకొన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన సమస్యలే లోక సమస్యలన్నట్లు, లోకమంతా తనకోసం బాధపడాలని అనుకోవడం హాస్యాస్పదమే.   కేసీఆర్ తెలంగాణా కోసం పదేళ్ళు అలుపెరుగని పోరాటాలు చేసి చివరికి విజయం సాధించారు గనుక ఆయన ముఖ్యమంత్రి ఆశించడాన్ని అర్ధం చేసుకోవచ్చును. కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అటువంటివేవీ చేయకపోయినా వారు తనపై సానుభూతి చూపి, తనకు అప్పనంగా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఆశించి భంగపడ్డారు.

మోదీ భారత్ ను అమెరికాల మారుస్తారట!

      మోదీ విజయంతో దేశంలో ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం కోసం మోదీ ఎంత కృషి చేశారో చెప్పడానికి తన వద్ద అక్షరాలు లేవన్నారు. "నేను ఎంతోమంది నేతలను చూశానుగానీ.. మోదీలో ఉన్న పట్టుదల, ఉత్సాహం మాత్రం అసాధారణం'' అని కితాబునిచ్చారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, దేశానికి మంచి భవిష్యత్తు ఉన్నదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో దేశం అమెరికా, చైనా దేశాల మాదిరి అగ్రదేశంగా మారుతుందన్నారు. ఈ ప్రమాణ స్వీకారంతో అంతా ముగిసినట్లు కాదని, ఆయన నాయకత్వంలో ఇలాంటి ప్రమాణ స్వీకారాలెన్నో జరగాలని, 2019లో కూడా మోదీయే ప్రధానమంత్రి కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఎన్నికలకు ఆప్ సిద్దం

      ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడం వల్ల మరోసారి ప్రజల ముందుకు వెల్లుతున్నామని ఆమ్ఆద్మీపార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజల్లో ఆప్‌పై ఆదరణ తగ్గలేదని అన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నామని అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం కోరాలని భావించామన్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టగానే. ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీయే విజయం సాధించే అవకాశాలు ఎక్కువుంటాయి గనుక బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని నిన్న కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా తనకే మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిడంతో ఏమిచేయాలో పాలుపోక మళ్ళీ ఎన్నికలకు సిద్దమవుతున్నారు.

వైకాపా ఓటమికి జగనే కారణమా?

  ఈరోజు ఇడుపులపాయలో సమావేశమయిన వైకాపా యం.యల్యే.లు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డినే శాసనసభ పక్షం అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఆ తరువాత ఆయన జిల్లాల వారిగా పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించబోతున్నారు. అయితే ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దమేల?అన్నట్లు కంటికెదురుగా కనబడుతున్నకారణాల కోసం లోతుగా అధ్యయనం చేయవలసిన పనేమీ లేదు. ఈ ఎన్నికలలో వైకాపా పరాజయానికి ప్రధాన కారణాలు ఏమిటంటే:   1. ప్రజలు వద్దనుకొంటున్న కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి ఉండటం. ఆయనకు ఓటేస్తే వారు వద్దనుకొంటున్న కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కనుకనే వైకాపా కూడా తిరస్కరణకు గురయింది. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు రహస్య అవగాహన ఉందని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెపుతున్నప్పటికీ ఆయన దానిని ఖండించకపోగా, ఎన్నికల తరువాత సీమాంధ్రకు సహకరించే పార్టీకే మద్దతు ఇస్తానని ప్రగల్భాలు పలకడంతో, ప్రజలలో ఆయనపట్ల ఉన్న అనుమానాలు మరింత పెరిగాయి.   2. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసులు, అవినీతి ఆరోపణలు. అనుభవరాహిత్యం. దుందుడుకు స్వభావం.   3. గత ఐదేళ్ళ కాలంలో గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకొనే అవకాశం ఉన్నపటికీ, దానిని విస్మరించి, తండ్రి మరణం తాలూకు సానుభూతినే నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళడం. గత ఐదేళ్ళుగా ప్రజలలో ఆ సానుభూతిని నిలిపి ఉంచుకోనేందుకు ఓదార్పు యాత్రలు చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో ఆ సానుభూతిని ఓట్లుగా మారకపోవడం.   4. అన్ని విషయాలలో ఎప్పుడు చాలా చురుకుగా కదిలే జగన్మోహన్ రెడ్డి, విజయావకాశాలున్న బీజేపీని మతతత్వ పార్టీ అని, నరేంద్ర మోడీతో చేతులు కలిపితే మైనార్టీ ఓట్లు పోగొట్టుకోవలసి వస్తుందని వెనుకంజ వేయడం.   5. రాష్ట్ర విభజన జరుగుతున్నపుడు, సీమాంద్రాలో తన పార్టీని బలోపేతం చేసుకొంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు భూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం.   6. నీతి, నిజాయితీ, విశ్వసనీయతలకు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే జగన్ మోహన్ రెడ్డిలో సరిగ్గా అవే లోపించడం కూడా ప్రజలు ఆయన మాటలను విశ్వసించనీయకుండా చేసాయి.   7. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ప్రభావం, చంద్రబాబు, మోడీల సమర్ధత వంటవనేకం వైకాపా ఓటమికి కారణమయ్యాయి.   అయితే వాటన్నిటికంటే జగన్ స్వయంకృతాపరాధాలే ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చును. అందువల్ల పార్టీని సంస్కరించే ముందు, జగన్మోహన్ రెడ్డి ముందు తనలో లోపాలను సవరించుకోగలిగితే పార్టీకి చాలా మేలు చేకూరే అవకాశం ఉంది. గత ఐదేళ్ళలో కేవలం ఓదార్పు యాత్రలు చేసుకొంటూ కాలక్షేపం చేసారు. ఈ ఎన్నికలలోనే ఆయన ఓదార్పు ఓట్లు రాల్చలేక పోయింది, అటువంటప్పుడు వచ్చే ఎన్నికలనాటికి ప్రజలలో ఈపాటి సానుభూతి కూడా మిగిలే అవకాశం ఉండదు కనుక ఇప్పుడయినా మేల్కొని పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేయడం మంచిది.

టీఆర్ఎస్ రాములు హత్య: నయీం ముఠా అరెస్ట్

      ఈనెల 11న నల్లగొండ పట్టణంలోని ఎంఏ బేగ్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోనపురి రాములు హత్య కేసులో నిందుతులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేరళ లాడ్జిలో తలదాచుకున్న నయీం ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 1.5 లక్షల నగదును, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో జనశక్తి మాజీ సభ్యుడు, వరంగల్ జిల్లా దేవరుప్పల మండలానికి చెందిన సోమయ్య, నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం వాసి సురేష్, కుమారస్వామి, రవి, రమేష్, ఎల్లేష్‌లు ఉన్నారు. వీరిలో సురేష్.. మాజీ మావోయిస్టు సాంబశివుడి హత్య కేసులో నిందితుడు కాగా, సోమయ్య గతంలో రాములుపై దాడి చేయడానికి వచ్చినవారిలో ఒకడు. వీరి అరెస్టు తర్వాత కేరళ పోలీసులకు మరిన్ని వివరాలు అందజేసేందుకు నిందితులతో పాటు నయీం ఫొటోలను రాష్ట్ర పోలీసులు అక్కడికి పంపారు.

డిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ

  విశేష ప్రజాధారణతో డిల్లీ ముఖ్యమంత్రి పీటం అధిరోహించిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేవలం 49 రోజులలోనే కుంటి సాకులతో పదవి నుండి దిగిపోయారు. కానీ సార్వత్రిక ఎన్నికలలో డిల్లీలో కూడా ఘోర పరాజయం పాలవడంతో, ఇప్పుడు తీరికగా పశ్చాతాపపడుతూ, ప్రజలను తన తొందరపాటుకి క్షమించమని కోరారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టగానే. డిల్లీ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీయే విజయం సాధించే అవకాశాలు ఎక్కువుంటాయి గనుక బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో కేజ్రీవాల్ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని నిన్న కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా తనకే మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిడంతో ఏమిచేయాలో పాలుపోక మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్దపడుతూ ముందుగా వారిని క్షమాపణలు కోరారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని వదులుకొని తప్పు చేసానని ఆయనే స్వయంగా చెప్పుకోవడం వలన ప్రజలలో మరింత చులకన అవుతారు. ఇక ఆమాద్మీ పార్టీ పదవులు, అధికారం కోసం ప్రాకులాడే పార్టీ కాదని పదేపదే చెప్పుకొన్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఇతర రాజకీయ నేతలలాగే అధికారం కోసం ప్రాకులాడుతూ, ఉన్న పరువు కూడా పూర్తిగా పోగొట్టుకొంటున్నారు. ఒక అపూర్వమయిన అవకాశాన్ని కాలదన్నుకొని, ఇప్పుడు ప్రజలను ఎంత బ్రతిమాలుకొన్నా ప్రయోజనం ఉండదని ఆయన గ్రహిస్తే మంచిది.