స్వామిగౌడ్ గెలుపు లాంఛనప్రాయమే

  ఈరోజు తెలంగాణా శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్, తెదేపాలకు చెందిన ఏడుగురు శాసనమండలి సభ్యులను, మరో ముగ్గురు ఇతర పార్టీలకు చెందిన వారిని తెరాసలోకి ఫిరాయింపజేసినందున, తెరాస చైర్మన్ అభ్యర్ధిగా నిలబడిన స్వామిగౌడ్ ఎన్నిక లాంచనప్రాయమే అవనుంది. ప్రస్తుతం శాసనమండలిలో ఉన్నమొత్తం 35 మంది సభ్యులలో తెరాసకు కేవలం ఆరుగురు సభ్యులే ఉన్నప్పటకీ పార్టీ ఫిరాయించిన వారితో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య 16కు చేరింది. తెరాస అభ్యర్ధి గెలిచేందుకు కనీసం 18 మంది మద్దతు అవసరం. స్వామిగౌడ్ కు మజ్లిస్ కు చెందిన ఇద్దరు, పీ.డీ.యఫ్. సభ్యులు ఒకరు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కు చెందినా మరో ఇద్దరు సభ్యులు కూడా ఆయనకే మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ కాంగ్రెస్ కూడా తన అభ్యర్ధి ఫారూఖ్ హుస్సేన్ను బరిలో దించినందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ దాదాపు18-20మంది సభ్యుల వరకు స్వామిగౌడ్ కు మద్దతు తెలుపుతున్నారు గనుక ఆయన గెలుపు లాంచన ప్రాయమే.

మోడీ నియోజకవర్గంలో బాలుడి నరబలి!

  ప్రధాని నరేంద్రమోడీ నియోజకవర్గమైన వారణాసి పరిధిలోని తెల్గా గ్రామంలో నెల రోజుల క్రితం ఒక బాలుడిని నరబలి రూపంలో ఒక మంత్రగాడు దారుణంగా హత్య చేశాడు. పదేళ్ళ వయసున్న సుమిత్ అనే బాలుడు మే 12వ తేదీన ఊరి చివర నిర్జన ప్రదేశంలో శవమై కనిపించాడు. ఆ బాలుడి ఒంటినిండా తీవ్ర గాయాలై వుండటంతోపాటు కనుగుడ్లు కూడా పెరికేసి వున్నాయి. ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం నాడు ఒక మంత్రగాడిని అదుపులోకి తీసుకున్నారు. మానవాతీత శక్తులు, ఐశ్వర్యం కోసం తానే బాలుడిని నరబలిగా ఉపయోగించుకున్నానని సదరు మంత్రగాడు పోలీసుల ముందు అంగీకరించాడు.

జవదేకర్ పంక్చువాలిటీ పంచ్!

  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమాచార ప్రసార శాఖ ఉద్యోగులకు పంక్చువాలిటీ పంచ్ ఇచ్చారు. ఢిల్లీలోని ఈ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులలో రెండు వందల మందికి పైగా ఉద్యోగులు ఆఫీసుకు టైమ్‌కి రాకుండా లేటుగా రావడంతో వారందరూ ప్రకాష్ జవదేకర్ ఆదేశాల మేరకు ఒకరోజు లీవ్ తీసుకోవలసి వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రకాష్ జవదేకర్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఆకస్మిక తనిఖీ చేశారు. మామూలుగా ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీసుకు రావలసిన ఉద్యోగులలో రెండు వందల మందికి పైగా తొమ్మిదింబావు దాటినప్పటికీ ఆఫీసులో కనిపించలేదు. దాంతో వారంతా ఆఫీసుకు వచ్చిన తర్వాత తనను కలవాల్సిందిగా జవదేకర్ ఆదేశించారు. వారందరూ వచ్చిన తర్వాత గ్రూపుల వారీగా వారందరికీ ఆయన భారీ క్లాసు తీసుకుని ఆరోజుకు లీవు పెట్టాల్సిందిగా సూచించారు. ఇకపై సమయానికి ఆఫీసుకు రావాలని స్పష్టం చేశారు.

విమానంలో బాంబు.. చివరికేమైంది?

  సోమవారం రాత్రి.. కేరళలోని కోచి నుంచి ఢిల్లీకి వెళ్ళే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎయిర్‌బస్ 320 ప్రశాంతంగా టేకాఫ్ తీసుకుంది. వెన్నెల్లో మెరుస్తున్న వెండి మబ్బుల మధ్య నుంచి విమానం స్మూత్‌గా ప్రయాణిస్తోంది. ఆ విమానంలో వున్న 156 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది ఫ్లయిట్ సిబ్బంది ఇంకో రెండు గంటల్లో హాయిగా ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం అనుకున్నారు. కానీ అంతలోనే కథ ఒక మలుపు తిరిగింది. ప్రస్తుతం గాల్లో వున్న విమానంలో బాంబులు వున్నాయని, కాసేపట్లో అవి పేలబోతున్నాయని, గాల్లో ఎగిరిన విమానం గాల్లోనే పేలిపోతుందని కోచి ఎయిర్ పోర్టుకి ఒక అపరిచిత ఫోన్ కాల్ వచ్చింది. అంతే, వెంటనే గాల్లో వున్న విమానాన్ని ఎమర్జె్న్సీ లాండింగ్‌కి ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆదేశించారు. దాంతో అప్పటికప్పుడు ఆ విమానాన్ని దగ్గర్లో వున్న బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి విమానంలోని ప్రయాణికులందర్నీ కిందకి దించేసి విమానం మొత్తం అంగుళం కూడా వదలకుండా వెతికింది. విమానంలో బాంబుల తాలూకు జాడలేవీ కనిపించలేదు. దాంతో వచ్చిన ఫోన్ కాల్ ఫేక్ కాల్ అని నిర్ధారించుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అమ్జాద్ అలీఖాన్ సరోద్ దొరికింది

  ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు, పద్మవిభూషణ్ ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్ తన సరోద్ వాయిద్యాన్ని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సరోద్ మళ్ళీ దొరికింది. గత 45 సంవత్సరాలుగా ఆ సరోద్ వాయిద్యం మీద ఆయన రాగాలు పలికిస్తున్నారు. ఆయనకు చాలా బాగా ఇష్టమైన సరోద్ అది. లండన్‌లో సరోద్ కచేరీ ఇచ్చిన ఆయన లండన్ ఎయిర్‌లైన్స్.కి చెందిన విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తుండగా సరోద్ పోయింది. అయితే మంగళవారం ఉదయం తన సరోద్ తనకి దొరికిందని ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ తన ట్విట్టర్‌లో కామెంట్ పోస్టు చేశారు. బ్రిటీష్ ఎయిర్ లైన్స్ వారు తన సరోద్‌ని తనకు తెచ్చి ఇచ్చారని, తన సరోద్ తనకు తిరిగి దొరకడం తనకు తన ఆత్మ తిరిగి తనలోకి వచ్చినట్టుగా అనిపిస్తోందని అంజాద్ ట్విట్ పోస్ట్ చేశారు.

ఇసుక విజేతగా నిలిపింది!

  ఒడిషా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్, ఆయన అమెరికన్ సహచరుడు మాథ్యూ రాయ్ డైబెర్తాస్ ఇసుక శిల్పాల ప్రపంచ కప్ 2014 పోటీలలో డబుల్స్ విభాగంలో సంయుక్తంగా విజేతలుగా నిలిచారు. అట్లాంటిక్ నగరంలో మొట్టమొదటిసారిగా జరిగిన ఇసుక శిల్పాల పోటీలో వీరిద్దరూ కలిసి తాజ్ మహల్.. పిక్చర్ ఆఫ్ లవ్ అనే ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఈ శిల్పంలో తాజ్మహల్తో పాటు షా జహాన్, ముంతాజ్ల చిత్రాలు కూడా ఇసుకతో తయారుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇరవై మంది సైకత శిల్ప కళాకారులు ఈ అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నారు. సుదర్శన్ పట్నాయక్కు వ్యక్తిగత విభాగంలో కూడా సేవ్ ట్రీ, సేవ్ ఫ్యూచర్ అనే సైకత శిల్పానికి ప్రజల ఎంపిక విభాగంలో బహుమతి వచ్చింది.

అమ్మాయిలు స్కర్టులు వేసుకుంటారా.. నేనొప్పుకోను!

  గోవా అంటేనే ఫుల్ ఎంజాయ్.. ఆ ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే గోవాని పట్టించుకునేవారే వుండరు. అయితే గోవాలోని నైట్క్లబ్బులకు వచ్చే అమ్మాయిలు స్కర్టులు వేసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని గోవా మంత్రి మంత్రి సుదీన్ దావలికర్ అంటున్నారు. అమ్మాయిలు పొట్టి స్క్రర్టులు వేసుకుని పబ్బులకు, క్లబ్బులకు రావడం గోవా సంస్కృతికి ప్రమాదకరంగా మారిందని ఆయన వాపోయారు. ఎక్కడపడితే అక్కడ ఇలా పొట్టి స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఎంతమాత్రం కాదని, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే మన గోవా ఏమైపోవాలని.. తమ ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మంత్రి అన్నారు. అలాగే శ్రీరామసేన (ఎస్ఆర్ఎస్) అధినేత ప్రమోద్ ముతాలిక్ కూడా ఆమధ్య ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. గోవాలో డ్రగ్స్, సెక్స్, నగ్న నృత్యాలను నిరోధించి.. భారతీయ సంస్కృతిని కాపాడాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ముతాలిక్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని దావాలికర్ చెప్పారు.

అడ్వకేట్ జనరల్‌ని సాగనంపండి: షబ్బీర్ డిమాండ్

  అడ్వకేట్ జనరల్‌ని సాగనంపండి: షబ్బీర్ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఎ.జి. (అడ్వకేట్ జనరల్)గా నియమించిన రామకృష్ణారెడ్డిని తక్షణం రీ-కాల్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించిన న్యాయవాది రామకృష్ణారెడ్డిని అడ్వకేట్ జనరల్‌గా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తే రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారని షబ్బీర్ ఆ లేఖలో గుర్తు చేశారు. ముస్లింలకు అసలు రిజర్వేషన్లు అవసరం లేదని, 4 శాతం రిజర్వేషన్లు కూడా అవసరం లేదని రామకృష్ణా రెడ్డి వాదించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముస్లిం వ్యతిరేకి అయిన వ్యక్తిని తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు.

ఎంపీ వాగితే, వాళ్ళావిడ సారీ చెప్పింది!

  బెంగాల్ సినీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తపస్ పాల్ సీపీఎం కార్యకర్తలు, వారికి సంబంధించిన మహిళల విషయంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క కార్యకర్తపై అయినా సీపీఎం కార్యకర్తలు దాడి చేస్తే తాము సీపీఎం కార్యకర్తలను చంపుతామని, వారి ఇళ్లకు వెళ్ళి వారి ఇళ్ళలోని మహిళలపై అత్యాచారాలు చేయాలని తమ కార్యకర్తలకు పురికొల్పుతానని తపస్ పాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘ఒక్క తృణమూల్ కార్యకర్తపై దాడి జరిగినా మిమ్మల్ని కాల్చిచంపుతా. మీరు తృణమూల్ కార్యకర్తల తల్లి, కూతుర్లను అవమానిస్తే.. నేను ఊరుకోను. అవసరమైతే మా మనుషులను మీ ఇంటికి పంపి.. మీ మహిళలపై అత్యాచారం చేయాలని చెపుతా’’ అని సీపీఎం నాయకులు, కార్యకర్తలను హెచ్చరిస్తూ ఎంపీ తపస్ పాల్ చేసిన ప్రసంగం వీడియోను ఓ స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. తపస్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. మహిళా సంఘాలు కూడా తపస్‌ని కఠినంగా శిక్షించాలని, ఆయన్ని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది. తపస్ 48 గంటలలోపు తన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా వుంటే, తన భర్త వ్యాఖ్యల విషయంలో తపస్ పాల్ భార్య నందినీ పాల్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఆయన అలా మాట్లాడకుండా వుంటే బాగుండేది. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను’’ అన్నారు.

వైభవంగా జగన్నాథ రథయాత్ర

  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర భక్తుల కోలాహలం మధ్య ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు జగన్నాథుని రథాన్ని తాకి పులకరించిపోయారు. ఆదివారం ఉదయాన్నే ఒరిస్సా తీరప్రాంత నగరం పూరీకి భక్తులు లక్షలాదిగా చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అత్యంత ఆకర్షణీయంగా అలంకరించబడిన రథంపై జగన్నాథునితోపాటు సోదరుడు బాలభద్రుడు, సోదరి సుభద్రల విగ్రహాలను ఉంచి పూరీ పురవీధుల్లో ఊరేగించారు. రథం ఊరేగుతున్న మార్గం పొడవునా భక్తులు హారతులతో తమ ఇష్టదైవాలకు స్వాగతం పలికారు. రథయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఏర్పాట్లలో వైమానిక, నావికా దళానికి చెందిన 6,520 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర తీరం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా, ఆకాశంలో ఏవియేషన్ అధికారులు నిఘా వేసి వుంచారు. వీరితోపాటు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, షార్ప్ షూటర్లు కూడా రంగంలోకి దిగారు.

పదేళ్ళ పిల్లనీ... వాడు పశువు!

  కామాతురాణం నభయం నలజ్జ అన్నట్టుగానే కామాంధులు తమ పశు వాంఛని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో అలాంటి పశువు ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. అన్నెం పున్నెం ఎరుగని పదేళ్ల బాలికపై పశ్చిమ బెంగాల్లోని మాల్డాలో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కూలీ కుమార్తె అయిన బాధితురాలు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లి, తిరిగి ఒంటరిగా వస్తుండగా ఒక దుర్మార్గుడు అత్యాచారం చేశారు. తర్వాత ఆమెని పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు. స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను గ్రామస్థులు గమనించి, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం చేసిన పశువు కంటే హీనుడైన ఆ మనిషిని పోలీసులు అరెస్టు చేశారు.

బీహార్ రైల్లో బాబోయ్ బాంబులు!

  బీహార్‌లో ఒక ప్రయాణికుల రైలులో భారీ బాంబులు దొరికాయి. వెస్ట్ బెంగాల్‌ వైపు వెళ్తున్న ఒక ట్రైన్‌ బీహార్‌లోని కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు జరిపిన సోదాల్లో ఎనిమిది శక్తివంతమైన బాంబులు రైల్లో దొరికాయి. కొంతమంది క్రిమినల్స్ ఈ రైలులో బాంబులతో ప్రయాణిస్తున్నారన్న సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ ఫోర్స్ తనిఖీలు జరిపడంతో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ బాంబులు దొరికాయి. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఒక సీటు కింద ఒక పాలథిన్ సంచిలో ఈ బాంబులు పెట్టి వున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. తీవ్రవాద కార్యకలాపాల కోసమే ఈ బాంబులను తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వెస్ట్ బెంగాల్ గవర్నర్.. నారాయణ..నారాయణ!

  ఎన్.డి.ఎ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘ఆపరేషన్ గవర్నర్’ స్కీమ్‌ని మొదలుపెట్టింది. యుపిఎ హయాంలో నియమితులైన గవర్నర్లని తొలగించే పనిలోపడింది. ఈ స్కీమ్‌లో భాగంగా వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. నారాయణన్ శనివారం రాత్రి తన కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్ ఇచ్చిన తీరు చూసి అయ్యగారి పదవి వదిలేయబోతున్నారన్న అనుమానం కార్యాలయ సిబ్బందికి వచ్చింది. వారి అనుమానాలను నిజం చేస్తూ నారాయణన్ ఆదివారం తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపించారు. అగస్టా హెలికాఫ్టర్ స్కామ్‌లో నారాయణన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులను తిరగదోడుతామని ఎన్డీయే ప్రభుత్వం హెచ్చరించడంతో నారాయణన్ తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.

విజయవాడలో ఎయిమ్స్!

  అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ విజయవాడ నగరమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి నడిబొడ్డున వున్న విజయవాడ నగరమే రాష్ట్ర రాజధానికి అన్నివిధాలా అనుకూలమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా వుండగా విజయవాడలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలో వున్న ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రిని విజయవాడలో నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎయిమ్స్ ఆస్పత్రి కోసం కేంద్ర బృందం రెండు, మూడు రోజుల్లో విజయవాడలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ కోసం కేంద్రం రూ.12 కోట్లు నిధులు కేటాయిస్తోందని, మెడికల్ హబ్ సిటీగా విజయవాడను తీర్చిదిద్దనున్నామని ఆయన తెలిపారు.

మెట్రో: చుక్ చుక్ రైలు ఆగింది!

  హైదరాబాద్ నగరంలో శరవేగంగా జరుగుతున్న మెట్రో రైలు నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని ఆశిస్తున్న మెట్రో రైలుకు అడుగడుగునా రెడ్ సిగ్నల్ పడుతోంది. మెట్రో రైలు ప్రయాణించే సుల్తాన్ బజార్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో భూగర్భ మెట్రోరైలు నిర్మాణం చేపట్టాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన షరతు ఇప్పటికే చాలా అయోమయాన్ని సృష్టించింది. ఇలా మెలికలు పెడితే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ఎల్ అండ్ టి సంస్థ చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఎల్అండ్టీ మెట్రో రైల్ సంస్థకు, కాంట్రాక్టర్లకు మధ్య వివాదం చెలరేగడంతో మెట్రో పనులు ఆగిపోయాయి. ఎల్ అండ్ టి అధికారులు తమకు డబ్బులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఇక మెట్రో రైలు పనులు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో దేవుడా!