బలవంతంగా సర్వే చేయొద్దు.. ప్రజలకు ఇష్టముంటేనే సర్వే: హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనే విషయం ప్రజల ఇష్టమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దాంతో హైకోర్టు స్పందిస్తూ వ్యక్తిగత వివరాలను అడిగి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సర్వేలో పాల్గొనాలా వద్దా అనేది ప్రజల ఇష్టమని పేర్కొంది. ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే న్యాయ సమ్మతం కాదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. న్యాయస్థానం ఈరోజు రెండు పక్షాల వాదననూ వింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే తప్పనిసరి కాదని, స్వచ్ఛందంగానే ఈ సర్వేని నిర్వహిస్తున్నామని, సంక్షేమ పథకాల కోసమే సర్వేని నిర్వహిస్తున్నామని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడమని ఆయన తెలిపారు. పౌరుల బ్యాంకు, తపాలా ఖాతాలు, మొబైల్ నంబర్ లాంటివి ప్రజల వ్యక్తిగత వివరాలనని, వాటిని ప్రభుత్వం అడగరాదని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. గణాంకాల చట్టం ప్రకారం సర్వేకు ముందుగా ప్రకటన ఇవ్వాలని అన్నారు.