డామిట్ కధ అడ్డం తిరిగిందేమిటి?

    నిన్న అర్థరాత్రి వరకు జరిగిన శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు కూడా ఊహించని విదంగా ఎస్సీ. ఎస్టీ బిల్లుపై ఇర్రుకొని బయట పాడేందుకు నానా తంటాలు పడ్డాయి. రోజంతా వాడిగా వేడిగా సాగిన సమావేశాలతో సభలో సభ్యులు ప్రజలకోసం చలికాలంలో కూడా చెమటలు కక్కుతూ మరీ తమ ఉపన్యాసాలతో సభని హోరేత్తించేసారు. ఇక బిల్లు సభ ఆమోదం పొందడమే తరువాయి అనుకొంటుండగా, తె.దే.ప. బిల్లులో 12వ క్లాజుపై సవరణ ప్రతిపాదించడంతో అసలు డ్రామా మొదలయింది. అంతవరకూ ఆ బిల్లు తెచ్చిన కీర్తి తన ఖాతాలో జమ చేసుకోవాలనుకొని తహతహలాడిన కాంగ్రెస్, తె.దే.పా. ప్రతిపాదనతో ఒక్కసారిగా సభలో కంగుతింది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తె.దే.ప. ప్రతిపాదనని యెంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, సభాద్యక్షుడు నాదెండ్ల మనోహర్ తె.దే.ప. కోరిన విదంగా బిల్లుపై ఓటింగ్ కి అనుమతించడంతో ముఖ్య మంత్రి మరోసారి కంగుతిన్నట్లు కనిపించేరు. తీవ్ర ఉద్రిక్తతకిలోనయిన ఆయన స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు కూడా. కాని సభలో ఓటింగ్ తప్పలేదు. తాము ప్రతిపాదించిన సవరణలకు మద్దతుగా సభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు నిలబడేసరికి తె.దే.పా. కాంగ్రెసును ఓడించడం ఇక చాల తేలిక అని భావించింది. గాని, వై.యస్.ఆర్. కాంగ్రేసుకు చెందిన విజయమ్మ కొంచెం తతపటాయిన్చుతూ తె.దే.పా. ప్రతిపాదనకి మద్దతుగా లేచినిలబడగానే సభలో కొంచెం గందరగోళం ఏర్పడింది. దానితో మొదట తీసిన లెక్కని పక్కని బెట్టి స్పీకర్ మళ్ళీ మరోసారి వోటింగ్ నిర్వహించినప్పుడు తె.దే.ప. ప్రతిపాదనకి అనుగుణంగా 47 ఓట్లు, దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రేసు సభ్యులు వేసిన 69 ఓట్లూ పోలవడంతో సభలో తె.దే.ప. ప్రతిపాదన వీగిపోయింది. దీనితో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ ని ఇరికిన్చామనుకొన్న తే.దే.పా. మరియు విపక్షాలు కాంగ్రేసు చేత యస్సీ ఎస్టీ వ్యతిరేకులుగా ముద్ర వేయించుకొని దొరికిపోయారు.  

అసెంబ్లీలో నానేటి సేసేది?

      “నాకు కంపూటరు రాకనే గదా మా తమ్ముడ్ని యిదేసం తీసుకేల్నాను. అయినా సొమ్ములు పోనాయి మరి నానేటి సేసేది? నానేటి గావాల్న జేసినాన ఇదంతా?” అని మన ప్రస్తుత పి.సి.సి. అద్యక్షుల వారు బొత్స సత్యనారాయణ గారు ఆనాడు వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీల వ్యహరంలో బాధ పడినట్లే, మళ్ళీ నేడు అయన శాసనసభలో తనని మాట్లాడనీయనప్పుడు అంతే ఇదిగా బాధ పడ్డారు పాపం.   శాసన సభలో ఎవరికివారు ఓ! ఒకటే ఇదిగా యస్సీ ఎస్టీ బిల్లు గురించి తమ జ్ఞానాన్ని ఇటు ప్రభుత్వానికి తద్వారా అటు ప్రజలకి తమ ఊకదంపుడు ఉపన్యాసాలతో తెగ పంచి పెట్టేస్తుంటే, చక్రం తిప్పగల నేర్పున్న తనకి ‘ఒక్క ముక్కయిన చెప్పు పాపం!’ అని శాసన సభలో అవకాశం కల్పించనందుకు మన బొత్స సత్యనారాయణగారు అలిగినట్లు టివి ఛానళ్ళు ఒకటే హోరెత్తిం చేయడమేగాక, అప్పుడే ఆయనకి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్య ఉన్న విభేదాల సీరియల్ కధల గురించీ చెప్పుకోస్తూ ఇప్పుడు కూడా కావాలనే అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండక పోవచ్చని కనిపెట్టేసి, ఇప్పుడు బొత్స ఏ విదంగా స్పందిస్తాడు? బ్రేక్ తరువాత చూడండి అంటూ మరో సస్పెన్స్ సీరియల్ మొదలుపెట్టాయి.

గుడివాడ ఎవడబ్బ సొత్తు కాదు: బాలకృష్ణ

    హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశం మొదలు ఆయన ఇక్కడి నుంచి పోటి చేస్తారని, అటు ఆయన అభిమానుల్లో కాకుండా సినీ,రాజకీయవర్గాల్లోనూ పెద్దగా చర్చ ఉండేది. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఈ జిల్లా నుంచే పోటి చేస్తానంటూ తెలిపారు. ప్రత్యేకించి ఎ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేదీ త్వరలోనే ప్రకటిస్తానాని బాలయ్య తెలిపారు. పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించే వారిని తాను హెచ్చరిస్తున్నానని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదన్నారు. అధిష్టానంపై ఎవరో కారుకూతలు కూస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని రంగాలకు, వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. పార్టీ ద్వారా ఎదిగి అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తారా అని నిప్పులు చెరిగారు. గుడివాడ టిడిపి కంచుకోట అని, ఒకరు వెళ్లిపోయినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలు తిరిగి వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించుకునేందుకు పాటుపడాలని కోరారు. పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. టిడిపి గుర్తుతో పదవి పొంది ఇప్పుడు విమర్శిస్తారా అని ఘాటుగా, ఒకింత ఆవేశంతో ప్రశ్నించారు. కొందరు బూటకపు ప్రకటనలతో రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీని వీడాలనుకున్న వారు సైలెంట్‌గా వెళ్లి పోవచ్చునని చెప్పారు.

చిరంజీవి వర్సెస్ సీఎం కిరణ్

    కాంగ్రెసు పార్టీలో ఇప్పుడు బిల్లు పోరు సాగుతోంది! తమ పార్టీకి దూరమవుతున్న ఎస్సీ, ఎస్టీలను దగ్గర చేసుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఘనత 'తమ'దిగా కాకుండా 'తన'దిగా చెప్పుకునే ప్రయత్నాలు రాష్ట్ర కాంగ్రెసు నేతలు చేస్తున్నారు. ఈ క్రెడిట్ నాదంటే నాదే అంటూ సీఎం కిరణ్, కేంద్ర మంత్రి చిరంజీవి, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. అసలు క్రెడిట్ సోనియాదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయ ణ ముక్తాయిస్తున్నారు.  సీఎం కిరణ్.. మాత్రం ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ అట్టడుగు వర్గాల కష్టనష్టాలను కళ్లారా చూశానని, ఆ అనుభవం నుంచే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయిస్తున్న నిధులు దారి మళ్లకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని భావించానని చెప్పారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధతని వివరించారు. కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. పీఆర్పీని విలీనం చేసేప్పుడే ఎస్సీ, ఎస్టీ నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని.. సోనియాకి సూచించానని దానికి అక్షర రూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత అని స్పష్టం చేశారు. ఇలా ఎవరికి వారు చట్టబద్ధత ప్లాన్ తమదంటే తమదని చెబుతుంటే.. బొత్స సత్యనారాయణ మాత్రం ఇదంతా సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్‌గా పేర్కొంటున్నారు.  

ఏదో చేద్దామనుకున్నాను... ఏమీ చేయలేకపోతున్నా

    ‘‘ఏదో చేద్దామనుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. కానీ అసంతృప్తితోనే ఉన్నాను. నా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఎంత ప్రయత్నించినా పనులు చేపట్టలేకపోయా. కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా వేయించలేక పోయాను’’ అని ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్యే జయసుధ ఆవేదన చెందుతున్నారు. నేతల్లో వ్యక్తిగత లాభం గురించే తప్ప వ్యవస్థను బాగుచేయాలన్న ఆలోచన కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.   మొదట జగన్ పార్టీకి మద్దతు పలికి ఆయన దీక్షలకు హాజరయిన జయసుధ ఆ తరువాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సేవ చేయలేనిది ఏ పార్టీలో ఉంటే ఏం..కనీసం సేవ చేసే అవకాశం అయినా లభిస్తే ఏదో పార్టీలోకి మారినా ప్రయోజనం ఉంటుంది అని అన్నారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఉన్న క్రైస్తవుల ఓట్లను చూసి జయసుధను వైఎస్ రాజకీయాల్లోకి దింపారు. అక్కడ ఆ మతం అభ్యర్థి అయితే సులభంగా గెలవగలరని వైఎస్ ఊహించారు. మతానికి తోడు జయసుధ గ్లామర్ కూడా విజయానికి బాటలు వేసింది. సీనియర్ నటి అయిన జయసుధ మాటలు వింటుంటే రాజకీయాలలో అంత తృప్తిగా లేరని తెలుస్తూనే ఉంది.

కెవిపి కి మళ్ళీ పూర్వ వైభవం ?

      దివంగత వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవిపి రామచంద్రరావు కు మళ్ళీ పాత రోజులు రానున్నాయా ? దీనికి సమాధానం అవుననే అనిపిస్తోంది. పార్టీలో రాహుల్ గాంధీ బాధ్యతలు మరింతగా పెరగడంతో, కెవిపి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి పూర్వ వైభవం పొందనున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దిగ్విజయ్ సింగ్ తిరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో కెవిపి పార్టీలో ముఖ్య పాత్ర పోషించడానికి ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా కెవిపి ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయన పునరాగమనానికి అనువుగా ఉన్నాయి. ఒక వేళ రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సి ఎం పదవి రేసులో ఉన్న మర్రి శశిధర్రెడ్డి, డి శ్రీనివాస్ లు ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కెవిపి సన్నిహితుడుగా ముద్ర పడ్డ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఇటీవల సోనియా గాంధీ ని కలిసిన అనంతరం తిరిగి కెవిపి తో చర్చలు జరిపారు. వీరితోపాటు, లగడపాటి రాజ గోపాల్, కోమటిరెడ్డి, తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా కెవిపి తో చర్చలు జరుపుతుండటం చూస్తుంటే, ఆయనకు పూర్వ వైభవం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తన పునరాగమనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కెవిపి ఇప్పటికే చేసుకున్నారని, ఇక చక్రం తిప్పడమే తరువాయి అని వార్తలు వస్తున్నాయి. కెవిపి లాంటి సీనియర్ లు పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే, పార్టీని వదలి వెళ్లాలనుకునే వాళ్ళకు ఆత్మ విశ్వాసం కలుగుతుందని కొంత మంది నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వై ఎస్ అనుయాయులు పార్టీని వదలి వెళ్ళకుండా చూసి, గోడ దూకుడు కార్యక్రమాలు ఆగాలనుకొంటే కెవిపి రామచంద్ర రావు కు పార్టీలో ముఖ్య పాత్ర ఇవ్వడం అవసరమని కోమటిరెడ్డి వంటి నేతలు దిగ్విజయ్ సింగ్ కు సూచించినట్లు తెలుస్తోంది.

విజయమ్మ తీరుఫై క్రిస్టియన్ల ఆగ్రహం

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత్రి వై ఎస్ విజయమ్మ క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని ఈ మతానికి చెందిన వివిధ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   సాధారణంగా క్రిస్టియన్ లు విగ్రహారాధన, హారతులు వంటి వాటికి దూరంగా ఉంటారని, విజయమ్మ మాత్రం బైబిల్ చేతులో పట్టుకుని ఇలాంటి పనులు చేస్తోందని ఈ మత నాయకులు బిషప్ ఆర్ హర్రీ సెబాస్టియన్, జెరుసలెం ముత్తయ్య, సి ఎ డానిఎల్ లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ ఆసలైన క్రిస్టియన్ అయితే నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారని వారు ప్రశ్నించారు. వై ఎస్ కుటుంబం తమకు ఇబ్బందిగా మారిందని వారు అన్నారు. దివంగత వై ఎస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా క్రిస్టియన్ లకు ఒరిగిందేమీ లేదని ఈ నాయకులు అన్నారు. తమ మతస్తులు ఇబ్బంది పడే ఉత్తర్వులను వై ఎస్ జారీ చేసారని వారన్నారు. వై ఎస్ జారీ చేసిన కొన్ని జీవోల వల్ల సుమారు 600 మంది క్రిస్టియన్లు జైలు పాలయ్యారని వారు వెల్లడించారు. జగన్ కూడా క్రిస్టియన్ లకు చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో చేసే అవకాశం కూడా లేదని వారన్నారు. రాజకీయనాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఇతర మతస్తుల మనోభావాలు గాయపడేలా ప్రకటనలు చేయడం మానుకోవాలని వారు సూచించారు. లేని పక్షంలో తీవ్రంగా ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.

వీళ్లకు విషయం నిల్లా..?

  యువజన కాంగ్రెస్ కేంద్ర విభాగం రాష్ట్రానికి చెందిన ఇద్దరు నేతలను పనితీరు సరిగా లేని కారణంగా పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే వీరు సాదాసీదా నాయకులు కాకపోవడం విశేషం.   మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి శంకర్, వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీమాన్ లను పార్టీ సస్పెండ్ చేసింది. వీరిలో, సాయి శంకర్ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కుమారుడు కాగా, శ్రీ మాన్ రాష్ట్ర బి సి సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు. ఈ ఇద్దరు నాయకులు గత జూలై నెలలోనే ఈ పదవులకు ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ లిజు ఈ ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక కార్యక్రమాలను సరిగా నిర్వహించక పోవడం వల్లే వీరిఫై ఈ చర్య తీసుకున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ కిరణ్ జాగిరా...?

    రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫై పెద్దపల్లి ఎంపి వివేక్ విమర్శలు గుప్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీని తన సొంత పార్టీలాగా భావిస్తున్నారని ఎంపి వివేక్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటే ఉండండి లేక పొతే లేదు అని ముఖ్యమంత్రి అనడం సరి కాదని వివేక్ అన్నారు. సోనియా గాంధీ కూడా ఎప్పుడూ ఇలా అనలేదని ఎంపి అన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, తమ నాయకురాలు సోనియా గాంధీ అని, ఆమె చెప్పినట్లే తాము వ్యవహరిస్తాం తప్ప కిరణ్ చెప్పినట్లు కాదని ఆయన అన్నారు. కిరణ్ వల్ల రాష్ట్రంలో పార్టీ నష్టపోతోందని వివేక్ అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సమయంలో 52 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 50 చోట్ల పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. ముఖ్య మంత్రి పార్టీలో గ్రూపులను నడుపుతున్నారని, గతంలో ఈ పదవిలో ఉన్న ఏ నాయకుడు ఇన్ని గ్రూపులను నడపలేదని వివేక్ ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసే పనులు ముఖ్యమంత్రి చేయడం లేదని, జిల్లా స్థాయి సమావేశాలు అయన ఏనాడు నిర్వహించలేదని ఎం పి అన్నారు. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపే పనులు కిరణ్ చేస్తే అంతా సంతోషిస్తారని వివేక్ హితవు పలికారు.

రేవంత్ వ్యాఖ్యలకు గవర్నర్ మనస్తాపం

రాజ్ భవన్ ను గాంధీ భవన్ గా మార్చారని తెలుగు దేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గవర్నర్ మనస్తాపం చెందారు. నరసింహన్ కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ ప్రతినిధిగా మారారని కూడా అయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇంతకు ముందెన్నడూ నరసింహన్ పై ఎవరూ చేయలేదు. వివిధ పార్టీల రాజకీయ ప్రాధాన్యతలు ఎలా ఉన్నా, గవర్నర్ ఫై చేసిన ఈ వ్యాఖ్యలు సరైనవి కావు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పరిస్తితులను చక్కదిద్దేందుకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో రేవంత్ వ్యాఖ్యలు ఆహ్వానించ దగినవి కావు. రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొని ఉన్నా , తన వంతు పాత్రను నరసింహన్ సమర్ధవంతంగా నిర్వహిస్తున్నరనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్రమ మార్గంలో పయనించడానికి గవర్నర్ కు సొంత వ్యాపారలేమీ లేవు. అలాంటి వ్యక్తి ఫై వ్యాఖ్యలు చేసే ముందు ప్రజా ప్రతినిధులు ఓ సారి ఆలోచిస్తారని ఆశిద్దాం.  

పూరీ జగన్నాథ్ భార్యకి వైకాపా టిక్కెట్టు

  వైఎస్సాఆర్ సీపీ పార్టీ గెలుపు గుర్రాల వేటలో పడింది. ముందస్తుగా అభ్యర్ధుల్ని నిర్ణయించుకోవడంవల్ల ఆఖరి నిముషంలో అనవసరమైన హడావుడిని నివారించొచ్చన్నది జగన్ వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. ముందుగా అనుకున్నట్టుగానే కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమా ద్వారా వైకాపా అధ్యక్షుడికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కి ఆశించిన లాభం చాలా దగ్గర్లో ఉన్నట్టే కనిపిస్తోంది.   రాబోయే ఎన్నికల్లో వైకాపా తరఫున పూరీ భార్య అనకాపల్లి నుంచి గానీ లేదా నర్సీపట్నం నుంచి గానీ పార్లమెంటరీ స్థానానికి పోటీచేయబోతున్నారన్న వార్తలు నిజమయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయ్. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకదాన్నుంచి పూరీ భార్య బరిలోకి దిగడం ఖాయమన్న ప్రచారం వైకాపాలోకూడా బాగా జరుగుతోంది.   టిడిపిలో కొన్నేళ్లపాటు పనిచేసిన పూరీ సోదరుడు ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం వైఎస్సాఆర్ సీపీ నేత అవతారమెత్తాడు. కాపు ఓట్లని మొత్తంగా గంపగుత్తగా చేజిక్కించుకునేందుకే పూరీ భార్యని బరిలోకి దించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. కొణతాలకు అనకాపల్లి ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చేస్తే పార్లమెంట్ కి పార్లమెంట్ టిక్కెట్టివ్వొచ్చని జగన్ వర్గం భావిస్తున్నట్టు సమాచారం.

నడిరోడ్డుమీద కాంగ్రెస్ నేత హత్య

  గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ కాంగ్రెస్ నేతని రాజకీయ ప్రత్యర్ధులు నడిరోడ్డుమీద నరికి చంపారు. చాలాకాలంపాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన నరేంద్రని హెల్మెట్లు ధరించిన కొందరు దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.   చనిపోయిన నరేంద్ర స్వగ్రామం జానపాడు. జానపాడు రోడ్డులో నుంచున్నప్పుడే దాడి జరిగింది. ప్రాణభయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఓ హోటల్లోకి పారిపోయే ప్రయత్నం చేశాడు. చుట్టూ కమ్మిన దుండగులు అతి దారుణంగా వేటకొడవళ్లతో మెడ నరికి చంపేశారు.   తీవ్రగాయాలపాలైన నరేంద్రని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఎమ్మెల్సీ జి.వి.కృష్ణారెడ్డి అనుచరుడిగా నరేంద్రకి మంచి గుర్తింపుంది. ఆయన సహకారంతోనే గ్రామంలో అభివృద్ధి పనులుకూడా చేస్తున్నారు. ఎదుగుదలని చూసి ఓర్వలేని కొందరు నరేంద్రని మట్టుపెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు.

ఎమర్జెన్సీ అలారం ఎందుకు మోగినట్టు..?

  జగన్ ఉంటున్న చంచల్ గూడ జైలుకి విజిటర్ల తాకిడి పెరుగుతోంది. చాలామంది విజిటర్లు అనఫిషియల్ గా జైలుకెళ్లి జగన్ ని కలుస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. జైలు అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నారని, జైల్లో జగన్ దగ్గర ఓ సెల్ ఫోన్ కూడా ఉందని టిడిపి నేత యనమల తారా స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. చంచల్ గూడా జైల్లో జగన్ ని ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు అనే అధికారికి సమాచారాన్ని యనమల సంపాదించారు.   ఉన్నట్టుండి చంచల్ గూడ ఎమర్జెన్సీ సైరన్ ఎందుకు మోగిందో తెలుసుకునేందుకు అధికారులు హడావుడిగా పరిగెత్తారు. జైల్లో అంగుళం అంగుళం గాలించి కారణాన్ని వెతికి పట్టుకున్నారు. కానీ.. అది బైటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ .. ఎమర్జెన్సీ అలారం ఎందుకు మోగినట్టు అన్న అనుమానం మాత్రం ఇప్పటికీ జనానికి అలాగే ఉంది.   ఈ మధ్యకాలంలో చంచల్ గూడ జైలుకి విఐపిల రాక బాగా పెరిగింది. సెక్యూరిటీని టైట్ చేశారు. అన్ని వైపులా సీసీ కెమెరాలతో కవర్ చేశారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లోకూడా భద్రతని కట్టుదిట్టం చేశారు. సెంట్రీలు కళ్లలో ఒత్తులేసుకుని కాపలా కాస్తున్నారు.. అయినా ఎమర్జెన్సీ అలారం మోగింది..   చంచల్ గూడ జైలు జగన్ పార్టీ కార్యాలయంగా మారిందని టిడిపి నేతలు గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు. వైకాపాలో చేరదామనుకున్నవాళ్లంతా నేరుగా జైలుకెళ్లి జగన్ ని కలిసి మాట్లాడొస్తున్నారంటున్నారు. వైఎస్సాఆర్ సీపీ నేతలు మాత్రం జైల్లో జగన్ కి భద్రత లేదని ఆరోపిస్తున్నారు. వేళకాని వేళలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎమర్జెన్సీ అలారం మోగడం దీనికి తార్కాణాలని ఆరోపిస్తున్నారు.  

రాజీనామాలో మెలిక పెట్టిన కావూరి

    మంత్రి వర్గంలో చోటు దక్కలేదని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. పార్టీలో సీనియర్ లకు అన్యాయం జరుగుతుందని, పార్టీని నమ్ముకుని పనిచేసినా ప్రయోజనం లేదని, అందుకే తాను సీనియర్ల కోసం రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. చివరకు ప్రధాని పిలిచి మాట్లాడిన తాను బెట్టు వీడేది లేదని బీరాలు పోయారు. అమ్మ పిలిచి మాట్లాడితే గాని ఆలోచించను పొమ్మన్నారు. రాజీనామాపై వెనక్కు తగ్గనన్నారు. అయితే రాజీనామా లేఖలోనే కావూరి లాజిక్కు ఉందని తెలిస్తే మాత్రం మన ఆశ్చర్యపోక తప్పదు. ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎవరూ రాజీనామా లేఖ ఇవ్వని విధంగా కావూరి రాజీనామా లేఖ ఇచ్చారు. అవును లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన జనవరి ఒకటవ తేదీ నుండి రాజీనామా ను ఆమోదించాలని పేర్కొనడం విడ్డూరం. అధిష్టానానికి అంతర్గతంగా చెప్పిన కావూరి ఆ మేరకు జనవరి ఒకటి తుదిగడువు ఇచ్చారేమో. అసలు ఎలాంటి షరతులు లేకుండా రాజీనామా చేస్తేనే అప్పుడు స్పీకర్ సంబంధిత సభ్యుడిని పిలిచి ఓ సారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి రాజీనామాలు చెల్లవు. గతంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఇలాగే వరసకట్టి రాజీనామాలు చేశారు. ఇప్పుడు రాజీనామా ఆమోదించాలంటే కావూరి మరో సారి రాజీనామా చేయక తప్పదు.

జగన్‌కు తెలంగాణలో 50 సీట్లు వస్తాయా..?

    ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా, ఎప్పటికొచ్చినా అన్ని విధాలా లాభం మా పార్టీకే తప్ప మరోపార్టీకి ఏమీ కలిసిరాదంటూ జగన్ పార్టీ వర్గాలు తెగ డబ్బా కొట్టుకుంటున్నాయ్. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆఖరికి తెలంగాణలోకూడా అరవై సీట్లు రావడం ఖాయమని కొండా సురేఖ అనడం దీనికి సరైన ఉదాహరణ.   షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సురేఖ చేసిన వ్యాఖ్యలు కాస్తంత గట్టిగానే జనం గుండెల్లోకి నాటుకుపోవచ్చన్న భయం ప్రత్యర్దుల్లో కనపడుతూనే ఉందికూడా.. పనిలోపనిగా చంద్రబాబు పాదయాత్రమీద విరుచుకుపడ్డ సురేఖ,, వీలైనంతగా బాబు యాత్రని ఏకే ప్రయత్నం కూడా చేశారు. నిజానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తెలంగాణ లో అరవై సీట్లు వస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి అదికారం వచ్చినట్లే లెక్క. రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ కు తెలంగాణలో ఏబై సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు దక్కాయి. టీఆర్ ఎస్ ఖాతాలో పడ్డవి మాత్రం కేవలం పది స్థానాలే.. రెండువేల నాలుగులో కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు కలిపి సుమారు ఎనబై వరకు వచ్చాయి. అందులో టిఆర్ఎస్ కే ఇరవై ఆరొచ్చాయి. టిడిపికి అప్పట్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయ్. 1999 లో కాంగ్రెస్,తెలుగుదేశం లు పోటాపోటీగా సీట్లు సంపాదించుకున్నట్టే లెక్క. అప్పట్లో.. కోస్తా, రాయలసీమలలో టిడిపి అత్యదికంగా సీట్లు సంపాదించుకుని అదికారంలోకొచ్చింది. 1994లో కాంగ్రెస్ కు తెలంగాణలో కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ లో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ జిల్లాలో మరొకటి. ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీకి చెందిన అరడజను మంది  అభ్యర్ధులు మినహా టిడిపి, వామపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. తెలంగాణలో టిడిపికి 1983లో నలభైమూడు స్థానాలు మాత్రమే రాగా, 1985 లో మాత్రం ఏబై కి పైగా వచ్చాయి. 1989లో టిడిపికి కూడా గణనీయంగానే తెలంగాణ లో సీట్లు వచ్చినా, మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పరమయ్యాయి.  ఈ లెక్కల్నిబట్ట చూస్తే తెలంగాణలో యాభై సీట్లు తెచ్చుకుంటే మిగతా రెండు ప్రాంతాల్లో కచ్చితంగా వంద సీట్లొచ్చినట్టే లెక్క. కొండా సురేఖ చెప్పిన జోస్యం నిజమైతే.. వైకాపా పూర్తి మెజారిటీతో అధికార పీఠమెక్కినట్టే లెక్క.. సురేఖ చెబుతున్నవి కాకి లెక్కలో లేక, నిజమైన లెక్కలో తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉందని అటు అధికార పక్ష నేతలూ, ఇటు ప్రతిపక్షనేతలూ విమర్శిస్తున్నారు. జగన్ పార్టీ నేతలు పెద్దఎత్తున అంచనాలు పెంచుకుంటూ తమని తాము ఎక్కువగా ఊహించుకోవడం పరిపాటైపోయిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనం విలక్షణమైన తీర్పు చెబుతారన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నామా పై మండిపడ్డ కెటిఆర్

    తెరాస, టిడిపి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దమ్ముంటే ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలని టీడీపీ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సవాల్ కు కెసిఆర్ కుమారుడు తారక రామారావు స్పదించారు. నామా నాగేశ్వరరావు ముసుగులో ఉన్న సమైక్యవాది అని ఆరోపించారు. ఖమ్మం నుంచి తాము పోటిచేస్తామని చెప్పకుండా, తెలంగాణ వాదం ఖమ్మంలో బలంగా ఉందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ నామా నాగేశ్వరరావు కేసీఆర్ మీద అనవసర విమర్శలకు దిగుతున్నారని అన్నారు. రెండువేల తొమ్మిదిలో కెసిఆర్ ను జైల్లో పెడితే ఆ జిల్లాకు చెందిన యువత సత్తా చూపారని కూడా ఆయన అన్నారు.

రాం జెత్మలానీకి బిజెపి రామ్ రామ్

    మొదట్నుంచీ రామ్ జెత్మలానీకి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాపులారిటీ అంటే కాస్త మక్కువ ఎక్కువే. పదునైన పదాలతో చురకత్తుల్ని విసిరేయడం, అవి దీపావళి టపాసుల్లా మారి తెగపేలుతుంటే సంబరపడిపోవడం జెత్మలానీకి ఆనందం కలిగించే విషయం. తనని మాట అనగలిగినవాళ్లు ఇంటాబైటా లేరన్న ధీమా కూడా జెత్మలానీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్నుంచీ దుందుడుక మాటలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సీనియర్ లాయర్ గారు బిజెపి నేతగా మారిన దగ్గర్నుంచీ నోటికొచ్చినట్టల్లా మాట్లాడి పార్టీని తెగ ఇరుకున పెడుతున్నారు. జెత్మలానీ వ్యాఖ్యలతో తలబొప్పికట్టించుకున్న బిజెపి పార్టీ ఇకపై ఆయన్ని ఉపేక్షించే ప్రశ్నే లేదని నిర్ణయించుకుని అవకాశంకోసం కాచుక్కూర్చున్న తరుణంలో రామ్ మరోసారి వాడివాడి మాటలనే తూటాల్ని ప్రయోగించారు. సిబిఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా నియామకంపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాక, దమ్ముంటే నాపై చర్య తీసుకోండంటూ బిజెపి అధిష్ఠానానికి సవాల్ కూడా విసిరారు. అడ్డగోలుగా మాట్లాడ్డం ఒక ఎత్తైతే, నాకంటే మొనగాడెవరూ పార్టీలో లేరన్నట్టుగా అర్ధం వచ్చేలా దమ్ముంటే నా మీద చర్య తీసుకోండి ఛాలెంజ్ అంటూ జెత్మలానీ విసిరిన సవాల్ నేరుగా గడ్కరీ గుండెల్లో గుచ్చుకుంది. చాలా రోజులుగా తనని ఏకి పారేస్తున్న జెత్మలానీమీద గుర్రుగా ఉన్న బిజెపి అధ్యక్షుడు గడ్కరీ.. ఘనత వహించిన లాయర్ గారిపై వేటు వేశారు. మొదట్నుంచీ జెత్మలానీని వెనకేసుకొస్తున్న శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా వంటి నేతలకుకూడా ఇండైరెక్ట్ గా వార్నింగిచ్చేందుకే బిజెపి అధిష్ఠానం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయ్.. కానీ.. తనపై పార్టీ వేటువేసిన తర్వాత ఇంతవరకూ జెత్మలానీ నోరు విప్పనే లేదు. ఆయన సైలెన్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి మాటాలు దూసుకొస్తాయోనన్న ఉత్కంఠ జనంలో విపరీతంగా పెరిగిపోతోంది.

కేసిఆర్ తో విభేధాలు లేవు : రాములమ్మ

    సూర్యపేటలో జరిగిన తెరాస సమరభేరికి విజయశాంతి హాజరుకాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ సభకు తెరాస ఎంపిగా ఉన్న విజయశాంతి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేసిఆర్ కు విజయశాంతికి విభేదాలు వచ్చాయని ప్రచారం ఆరంభమైంది. దీనిపై విజయశాంతి వివరణ ఇచ్చారు. కేసిఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తీవ్ర అస్వస్థతతో బాధ పడుతుండటంతో సమరభేరి సభకు హాజరుకలేకపోయానని చెప్పారు. అంతేకాని తనకు కేసిఆర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రి ఉన్నపుడు విజయశాంతి తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. కాని రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ ప్రచారానికి తెరపడింది.