Read more!

విజయమ్మ తీరుఫై క్రిస్టియన్ల ఆగ్రహం

 

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత్రి వై ఎస్ విజయమ్మ క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని ఈ మతానికి చెందిన వివిధ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సాధారణంగా క్రిస్టియన్ లు విగ్రహారాధన, హారతులు వంటి వాటికి దూరంగా ఉంటారని, విజయమ్మ మాత్రం బైబిల్ చేతులో పట్టుకుని ఇలాంటి పనులు చేస్తోందని ఈ మత నాయకులు బిషప్ ఆర్ హర్రీ సెబాస్టియన్, జెరుసలెం ముత్తయ్య, సి ఎ డానిఎల్ లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ ఆసలైన క్రిస్టియన్ అయితే నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారని వారు ప్రశ్నించారు.



వై ఎస్ కుటుంబం తమకు ఇబ్బందిగా మారిందని వారు అన్నారు. దివంగత వై ఎస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా క్రిస్టియన్ లకు ఒరిగిందేమీ లేదని ఈ నాయకులు అన్నారు. తమ మతస్తులు ఇబ్బంది పడే ఉత్తర్వులను వై ఎస్ జారీ చేసారని వారన్నారు. వై ఎస్ జారీ చేసిన కొన్ని జీవోల వల్ల సుమారు 600 మంది క్రిస్టియన్లు జైలు పాలయ్యారని వారు వెల్లడించారు.



జగన్ కూడా క్రిస్టియన్ లకు చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో చేసే అవకాశం కూడా లేదని వారన్నారు. రాజకీయనాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఇతర మతస్తుల మనోభావాలు గాయపడేలా ప్రకటనలు చేయడం మానుకోవాలని వారు సూచించారు. లేని పక్షంలో తీవ్రంగా ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.